
లిక్విడిటీ పెంచేందుకు చర్యలు చేపడతామన్న ఆర్బీఐ గవర్నర్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యత క్షీణిస్తే లిక్విడిటీ పెంపునకు చర్యలు చేపడతామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. రుణాల పునర్వ్యవస్థీకరణ కోరుతూ తనను కలిసిన చిన్న, మధ్యతరహా వ్యాపారుల ప్రతినిధులతో ఆర్బీఐ గవర్నర్ సంప్రదింపులు జరిపారు. చిన్న మధ్యతరహా వాణిజ్య సంస్థల రుణాల పునర్వ్యస్ధీకరణపై ప్రతిపాదనలను బ్యాంకులు బేరీజు వేయాలని సూచించారు.
నగదు లభ్యతపై మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నగదు లభ్యత అవసరాలను కేంద్ర బ్యాంక్ పూర్తిస్ధాయిలో పరిష్కరించిందని చెప్పుకొచ్చారు. అవసరమైతే మరింత లిక్విడిటీని మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐ చర్యలు చేపడుతుందని చెప్పారు. ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య పలు అంశాలపై సంప్రదింపులు జరుగుతున్నా కేంద్ర బ్యాంక్ పరిధిలోని అంశాలపై తుది నిర్ణయం ఆర్బీఐదేనని తెలిపారు.