ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణం   | The Accident Cause Of The Negligence | Sakshi
Sakshi News home page

ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణం  

Jun 28 2018 1:23 PM | Updated on Apr 3 2019 8:03 PM

The Accident Cause Of The Negligence - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న ఇన్‌చార్జి డీసీపీ 

వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ వద్ద ఆదివారం జరిగిన ట్రాక్టర్‌ ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ ఆలూరి వెంకటనారాయణను బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలను ఇంచార్జ్‌ డీసీపీ నాగరాజు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలానికి చెందిన ఆలూరి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకటనారాయణ పదేళ్లుగా వలిగొండ మండలంలో భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే క్రమంలో  వేములకొండ శివారులోని అక్కెనపల్లి నర్సయ్య భూమిని నాలుగేళ్ల కౌలుకు తీసుకున్నాడు. వర్షం కరువడంతో పత్తి విత్తనాలు నాటడానికి ఈ నెల 24వ తేదీన 33 మంది వ్యవసాయ కూలీలను తీసుకుని దూదిపాల్ల నాగేశ్వర్‌రావుకు చెందిన ట్రాక్టర్‌పై ఎక్కించుకుని తీసుకెళ్తున్నాడు.

నిర్లక్ష్యంగా నడుపుతుండడంతో కొద్ది దూరం వెళ్లగానే ట్రాక్టర్‌ అదుపు తప్పింది. కంట్రోల్‌ చేయలేకపోవడంతో పక్కనే ఉన్న మూసీ కాల్వలోకి పల్టీ కొట్టింది. దీంతో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న 15 మంది మృతి చెందగా మరో 16 మంది క్షతగాత్రులయ్యారు. ఇద్దరు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌తోపాటు ట్రాక్టర్‌ యజమాని దూదిపాల నాగేశ్వర్‌పై 304(పార్ట్‌–2), ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. వెంకట్‌నారాయణను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌చార్జ్‌ డీసీసీ నాగరాజు తెలిపారు. విలేకరుల సమావేశంలో చౌటుప్పల్‌ ఏసీపీ రామోజు రమేష్, వలిగొండ ఎస్‌ఐ ఇద్రిస్‌అలీ ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement