
తన ఇద్దరి బిడ్డలతో నిర్మల ,వెంకటేశన్
అందమైన కుటుంబం. ప్రేమ,ఆప్యాయతకు నిలువుటద్దం. ఇద్దరు బిడ్డల బాగోగులు చూసుకునేపెద్దరికం. మనసులు పెనవేసుకున్న బంధం. భవిష్యత్కు బాటలు వేసే ధైర్యం. కానీ ఏమైందో ఏమో.. భార్యఆత్మహత్యకు పాల్పడింది. ఆవిషాదాన్ని తట్టుకోలేక భర్త తన ఇద్దరు ఆడబిడ్డలతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన షోళింగర్లో తీరని శోకాన్ని మిగిల్చింది.
తమిళనాడు,షోళింగర్: భార్య ఆత్మహత్యను తట్టుకోలేని భర్త అభం శుభం తెలియని ఇద్దరు బిడ్డలతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన షోళింగర్ సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. తమిళనాడులోని షోళింగర్ సమీపం కొడైక్కల్ గ్రామానికి చెందిన వెంకటేశన్(34)కు అదే ప్రాంతంలోని గంగాపురం గ్రామానికి చెందిన నిర్మల(26)తో ఐదేళ్ల కిందట వివాహమైంది. దంపతులకు శ్రీచ్చిత(2), సంజన(1) ఆడ పిల్లలు ఉన్నారు. మదురైలోని ప్రయివేటు ఆసుపత్రిలో నర్సుగా వెంకటేశన్ విధులు నిర్వహిస్తున్నాడు. వారంలో ఒకసారి ఇంటికి వచ్చి భార్యాబిడ్డలు, తల్లిదండ్రులను చూసి వెళ్లేవాడు. గ్రామంలోని ఇంట్లో అత్తామామలతో నిర్మల బిడ్డలతో ఆనందంగా ఉండేది.
సోమవారం నిర్మల తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. షోళింగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షోళింగర్ ఆసుపత్రికి తరలించారు. భార్య మృతిపై మదురైలోని భర్త వెంకటేశన్కు బంధువులు సమాచారం ఇచ్చారు. అతను సాయంత్రం ఆరు గంటల సమయంలో గ్రామానికి చేరుకున్నాడు. తీవ్రవేదనతో కనిపించిన వెంకటేశన్ ఇంట్లో తన ఇద్దరు బిడ్డలతను వెంట తీసుకుని ఆసుపత్రికి వెళ్లుతున్నట్లు చెప్పాడు. వాలాజ సమీపంలోని అమ్మూరు రైల్వే స్టేషన్కు వెళ్లి రాత్రి ఎనిమిది గంటల సమయంలో అటు వైపు వెళ్తున్న శతాబ్ది ఎక్స్ప్రెస్ కిందపడి తన ఇద్దరు బిడ్డలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రైల్వే స్టేషన్లో కలకలం రేపింది. కాట్పాడి రైల్వే పోలీసులు ముగ్గురి మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం వాలాజ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే రోజు దంపతులు, వారి ఇద్దరి బిడ్డలు ఆత్మహత్య చేసుకు కోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. కొడైక్కల్, గంగాపురం గ్రామాల్లో తీవ్ర ఆవేదన రగిల్చింది.
నిర్మల మృతిపై పోలీసులకు ఫిర్యాదు
నిర్మిల అత్తారింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అనుమానం ఉన్నట్టు ఆమె తల్లిదండ్రులు షోళింగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మగ బిడ్డలు లేరని అత్త, మామలు అప్పుడప్పుడూ వేధించేవారని, దీంతో తమ బిడ్డ మృతి చెందిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment