
సాక్షి, హైదరాబాద్: బీటెక్ పూర్తి చేసిన ఆ యువకుడికి అమెరికాలో ఉద్యోగం చేయాలన్నది ఆశ. దీని కోసం ఓ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నాడు. ‘001’కోడ్తో కూడిన నంబర్ నుంచి కాల్ రావడంతో బుట్టలో పడ్డాడు. నెలకు రూ.4 లక్షల జీతం వచ్చే ఉద్యోగమంటూ ఎరవేసిన సైబర్ నేరగాళ్లు మొత్తం రూ.86 లక్షలు గుంజారు. మరో రూ.4.5 లక్షలు డిమాండ్ చేయడంతో అనుమానించిన బాధితుడు సీసీఎస్ అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మొత్తం చెల్లించడం కోసం అప్పులు చేయడంతో పాటు ఇల్లు కూడా అమ్మేసినట్లు పోలీసుల వద్ద వాపోయారు.
మార్క్ ఆరన్ గ్రూప్లో ఉద్యోగమంటూ...
బోయగూడకి చెందిన శంకర్నాథ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలని భావించి తన ప్రొఫైల్ను షైన్.కామ్ అనే వెబ్సైట్లో రిజిస్టర్ చేశాడు. గత ఆగస్టులో ‘001’ కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. తాము యూఎస్లోని ఓక్లహామాకు చెందిన మార్క్ ఆరన్ గ్రూప్ సంస్థ నుంచి మాట్లాడుతున్నామన్న నేరగాళ్లు మీ ప్రొఫైల్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేసినట్లు చెప్పారు. నెలకు రూ.4 లక్షలు (భారత కరెన్సీలో) జీతం ఇవ్వనున్నామని, వీసా ప్రాసెసింగ్ వ్యవహారాల కోసం ఇండియన్ ఆఫీసర్ మీనంద్ ఆడమ్స్ మాట్లాడతారంటూ చెప్పారు.
బోగస్ వెబ్సైట్ సైతం ఏర్పాటు...
కొన్ని రోజులకు మీనంద్ ఫోన్ చేసి, ఓ బోగస్ వెబ్సైట్ చిరుమానా చెప్పి అందులో వీసా కోసం దరఖాస్తు చేసుకోమని కోరగా శంకర్ అలానే చేశాడు. యూఎస్ఇమిగ్రేషన్ఢిల్లీ.ఇన్ పేరుతో ఓ ఈ–మెయిల్ ఐడీని క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు దాని ద్వారానే శంకర్ వీసా దరఖాస్తు స్వీకరించామని, అది ప్రాసెసింగ్లో ఉందంటూ మెయిల్స్ పంపారు. ట్రావెలింగ్ అలవెన్స్, యూఎస్ క్రాస్ బోర్డర్ పర్మిట్, యాంటీ వర్క్ పర్మిట్ వైలేషన్ తదితర పేర్లు చెప్పి నగదును కొన్ని బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయమన్నారు. ఇవన్నీ రిఫం డబుల్ డిపాజిట్స్ అని, ఉద్యోగంలో చేరాక మొత్తం తిరిగి వచ్చేస్తుందంటూ చెప్పడంతో శంకర్ అలానే చేశాడు.
అంగీకరించిన కుటుంబీకులు...
శంకర్ కుటుంబీకులు సైతం ఫీజులు చెల్లించడానికి అంగీకరించడంతో 2016 సెప్టెంబర్ నుంచి ఈ ఆగస్టు వరకు రూ.86 లక్షలు సైబర్ నేరగాళ్లు చెప్పిన ఖాతాల్లోకి డిపాజిట్ చేశారు. దీన్ని చెల్లించడం కోసం అప్పులు తీసుకోవడంతోపాటు ఇంటిని సైతం అమ్మేశారు. 30 ఖాతాల్లో 101 సార్లు నగదు డిపాజిట్ చేసినట్లు లెక్కతేలింది. గత నెల్లో మరో రూ.4.5 లక్షలు చెల్లించమని చెప్పడంతో అనుమానించిన శంకర్ ఆరా తీయగా మోసపోయినట్లు తేలింది.
ఈశాన్య యువతుల ఖాతాలే...
కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ పి.రవికిరణ్ నేతృత్వంలోని బృందం బాధితుడు డబ్బు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతాల వివరాలు ఆరా తీయగా, సగం ఢిల్లీ, సగం బెంగళూరుకు చెందినవిగా తేలింది. బెంగళూరుకు వెళ్లిన టీమ్ ఖాతాదారుల వివరాలు సేకరించింది. 2014– 15లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొందరు యువతులు బెంగళూరులో నర్సు కోర్సులో శిక్షణ తీసుకునే సమయంలో సైబర్ నేరగాళ్లు వారి నుంచి ఖాతాల వివరాలు సేకరించి, డబ్బు డిపాజిట్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆ ఖాతాలన్నింటిలోనూ కలిపి రూ.5 వేలు కూడా లేవని తేలింది. ఈ నేరానికి పాల్పడింది నైజీరియన్లుగా అనుమానిస్తున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. అమెరికాలో ఉన్న తమ అనుచరుల ద్వారానో లేక వీఓఐపీ విధానంలోనో ‘001’ నంబర్ డిస్ప్లే అయ్యేలా కాల్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment