
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు ఓ క్రిమినల్ను ఛేజ్ చేసి పట్టుకున్న సంఘటన సినిమాను తలపించింది. 26 కేసుల్లో నిందితుడిగా ఉన్న సన్నీ దబాస్ అనే క్రిమినల్ను పట్టుకునేందుకు పోలీసులు పథకం రచించారు. అతను స్నేహితుల వద్దకు వచ్చాడన్న సమాచారంతో బర్వాలా రోడ్డు ప్రాంతంలో ఉచ్చు బిగించారు. అయితే, పోలీసుల కదలికలను గమనించిన దబాస్ వారిపై తుపాకీతో కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు యత్నించాడు. దీంతో దినేష్ అనే కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి అతన్ని వెంబడించాడు. చేతిలో ఆయుధం లేకున్నా కిలోమీటర్ మేర దబాస్ను తరుముతూ వెళ్లి అతన్ని పట్టుకున్నాడు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో నమోదైన ఈ ఛేజింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీస్ ధైర్యసాహసాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. క్రిమినల్ దబాస్ నుంచి ఒక నాటు తుపాకీ, కొన్ని బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.(చదవండి: తొలి రౌండ్లోనే విరుచుకుపడుతూ కాల్చారు)