వైఎస్సార్‌సీపీ నేత హత్య కేసులో 9 మంది అరెస్ట్‌ | West Godavari Police Arrested Nine People In Murder Case | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేత హత్య కేసులో 9 మంది అరెస్ట్‌

Nov 19 2019 11:02 AM | Updated on Nov 19 2019 11:02 AM

West Godavari Police Arrested Nine People In Murder Case - Sakshi

భీమడోలు పోలీ‹స్‌స్టేషన్‌లో హత్య కేసు వివరాలను వెల్లడిస్తున్న సీఐ ఎం.సుబ్బారావు, వెనుక భాగంలో 9 మంది నిందితులు

భీమడోలు: వైఎస్సార్‌ సీపీ నాయకుడు, కౌలు రైతు పసుమర్తి వెంకట కిషోర్‌ దారుణ హత్యకు కారకులైన 9మంది నిందితులను సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో ప్రధాన  కుట్రదారుడు టీడీపీ నేత, భీమడోలు మాజీ సొసైటీ అధ్యక్షుడు గన్ని గోపాలరావు ఉన్నారు. వీరి నుంచి ఆరు మోటార్‌సైకిళ్లు, సెల్‌ఫోన్లు, మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. హత్య చేసిన 10 మందిలో ఒక మహిళతో సహా 9 మందిని అరెస్ట్‌ చేయగా మరో మహిళ జువ్వా లక్ష్మిని అరెస్ట్‌ చేయాల్సి ఉంది.  మాజీ ఎంపీటీసీ సభ్యులు జువ్వా స్వామి, జువ్వా ఏసుపాదం, జువ్వా సులోస్‌రాజు వారి కుమార్లు జువ్వా బుచ్చిబాబు, జువ్వా శశికుమార్, అల్లుళ్లు దాసరి వెంకటేశ్వరరావు, దాసరి శేషారావు, రాచామంతి సుధ, టీడీపీ నాయకుడు గన్ని గోపాలరావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో సోమవారం భీమడోలు ఎస్సై కె.శ్రీహరిరావు, దెందులూరు ఎస్సై ఎం.సూర్యభవాన్‌తో కలిసి సీఐ ఎం.సుబ్బారావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సీఐ ఎం.సుబ్బారావు కేసు వివరాలను వెల్లడించారు.

 కిషోర్‌పై పగపట్టి..
అంబర్‌పేట పంచాయతీ పరిధిలోని కొత్త అంబర్‌పేటకు చెందిన పసుమర్తి వెంకట కిషోర్‌ చాలా ఏళ్లుగా దాసరి బుల్లెమ్మకు చెందిన భూమి 11.5 ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఆమె 1996లో తాడేపల్లిగూడెం రైతులకు ఆ భూమిని అమ్మేసినా.. వారు కూడా కిషోర్‌కే  కౌలుకు ఇచ్చారు. కిషోర్‌ను హత్య చేసిన నిందితులకు  దాసరి బుల్లెమ్మ మేనత్త. ఆమెకు పిల్లలు లేకపోవడంతో ఆ భూమికి తాము హక్కుదారులమంటూ నిందితులు జువ్వా స్వామి, జువ్వా ఏసుపాదం, జువ్వా సులోస్‌రాజు కోర్టులో కేసులు వేశారు. ఈ నేపథ్యంలో వారి మేనత్తకు, భూమి కొన్నవారికి, నిందితులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. పోలీ‹స్‌స్టేషన్‌ వరకూ కేసులు వెళ్లాయి.  అయితే కోర్టు కూడా బుల్లెమ్మ, ఆ భూమిని కొన్న రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నిందితులు తిరిగి హైకోర్టులో కేసు వేశారు. ఈ నేపథ్యంలో కౌలు రైతు కిషోర్‌ వల్లే ఆ భూమి తమకు దక్కడం లేదని నిందితులు భావించారు. కిషోర్‌పై పగబట్టారు. పలుమార్లు అతనిపై దాడి కూడా చేశారు.

ఈనేపథ్యంలో  ఈనెల 8న కిషోర్‌ సాగు చేస్తున్న  పొలంలోని ఖరీఫ్‌ ధాన్యాన్ని నిందితులు దోచుకెళ్లారు. దీంతో కిషోర్‌ భీమడోలు పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేశారు.  కిషోర్‌ బతికుంటే ఆ పొలం తమకు దక్కదని భావించి నిందితులు మరింత కక్షపెంచుకున్నారు.  టీడీపీ నాయకుడు మాజీ సొసైటీ అధ్యక్షుడు గన్ని గోపాలరావు ప్రోత్సాహంతో  నిందితులంతా కిషోర్‌ హత్యకు కుట్రపన్నారు. ఈనెల 15న మధ్యాహ్న సమయంలో కిషోర్‌  పొలంలో కోత కోస్తుండగా 9 మంది వచ్చి విచక్షణారహితంగా తలపై ఇనుపరాడ్‌తో కొట్టి చంపేశారు. çసమీపంలోని బంధువులు గూడపాటి సుబ్బారావు, సత్యనారాయణ తదితరులు రాడ్‌లను పట్టుకుని వస్తున్న వారిని ప్రాధేయపడినా వినకుండా అతికిరాతంగా రాడ్‌తో కొట్టి కిషోర్‌ను చంపారు. కొన ఊపిరితో ఉన్న కిషోర్‌ను ఓ ట్రాక్టర్‌పై ఆస్పత్రికి తరలించేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. కిషోర్‌ మృతిచెందాడు.

 మోటార్‌సైకిళ్లు, సెల్‌ఫోన్లు, మారణాయుధాలు స్వాధీనం
నిందితులను ఈనెల 17వ తేదీ ఆదివారం మధ్యా హ్నం జాతీయ రహదారి భీమడోలు అయ్యప్ప స్వామి ఆలయం వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 6 మోటార్‌సైకిళ్లు, సెల్‌ఫోన్లు, మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 9 మందిని అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement