మహాత్మాగాంధీ యూనివర్సిటీకి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వచ్చిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నేతలు చిల్లర రాజకీయాలు చేశారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీకి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వచ్చిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నేతలు చిల్లర రాజకీయాలు చేశారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డికి ఎంజీయూలో సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి మాత్రమే ఆహ్వానించి మిగతా అభివృద్ధి కార్యక్రమాలపై సమాచారం ఇవ్వకపోవడం అన్యాయమన్నారు.
2005లో అప్పటి సీఎం వైఎస్. రాజశేఖర్రెడ్డిని ఒప్పించి నల్లగొండకు యూనివర్సిటీని తెచ్చి 100 ఎకరాల్లో నిర్మించారని తెలిపారు. టీఆర్ఎస్లో కొంత మంది చిల్లర రాజకీయాలు చేస్తూ అహర్నిశలు అభివృద్ధి కోసం పరితపించే ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. ఎంజీ యూలో స్థానిక ఎమ్మెల్యే లేకుండా ప్రారంభోత్సవాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. టీఆర్ఎస్ నాయకులు బజార్ రౌడీలను తీసుకువచ్చి అల్లరి చేయించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.
జిల్లాలో ఏ గ్రామం ఎక్కడ ఉందో తెలియని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి కోమటిరెడ్డిపై అవాకులు, చెవాకులుగా మాట్లాడడం హస్యాస్పదం అన్నారు. జిల్లాకు శ్రీశైల సొరంగ మార్గానికి రూ.700 కోట్లు విడుదల చేయించిన ఘనత కోమటిరెడ్డిదన్నారు. టీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే జిల్లాకు మెడికల్ కాలేజీ తేవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్రెడ్డి, మండల అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య, తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి, కత్తుల కోటి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.