కుటీర పరిశ్రమలకు ఎన్సీడీసీ చేయూత
ఐసీడీపీ డైరెక్టర్ డాక్టర్ ఇళంగోవెల్ వెల్లడి
ఆత్రేయపురం : గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలను ఆధారంగా చేసుకుని జీవించే వారికి ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు ఐసీడీపీ (ఇండస్ట్రియల్ కోఅపరేటివ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు) కృషి చేస్తుందని డైరెక్టర్ ఇళంగోవెల్ అన్నారు. మంగళవారం ఆత్రేయపురం సొసైటీ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం పూతరేకులు, మామిడితాండ్ర, తాడితాండ్ర, పచ్చళ్ల తయారీ పరిశ్రమలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో సొసైటీల ద్వారా కుటీర పరిశ్రమలకు, రైతుల యాంత్రీకరణ పనిముట్లకు రెండో విడత రుణాలు అందిస్తున్నట్టు వివరించారు. సహకార సొసైటీలకు గొడౌన్లు నిర్మించేందుకు రూ.15 లక్షలు ఐసీడీపీ ప్రాజెక్టు ద్వారా రుణంగా ఇస్తామని వివరించారు. కుటీర పరిశ్రమలు నిర్వహించే వారికి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు రుణం అందిస్తామని, ఒక్కొక్క మండలం నుంచి 1000 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ పథకం ఐదేళ్ల పాటు ఉంటుందన్నారు. తొలుత ఆయన వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. డీసీసీబీ ఏజీఎం కృష్ణమూర్తిరాజు, డీసీసీబీ డైరెక్టర్ చిలువూరి రామకృష్ణంరాజు ఆయన వెంట ఉన్నారు.