
పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్
24న ఇడుపులపాయలో కుటుంబసభ్యులు, బంధువులతో ప్రత్యేక ప్రార్థనలు
► 25న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న వైఎస్ జగన్
► మండల ఉపాధ్యక్షుడి కుటుంబసభ్యులకు పరామర్శ
► కడప, ప్రొద్దుటూరులలో పలు కార్యక్రమాలకు హాజరు
► 26న పీబీసీ నీటి విషయమై ధర్నా
పులివెందుల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పులివెందుల చేరుకున్నారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లాలో ఆయన పర్యటిస్తారు. వైఎస్ జగన్ పర్యటన వివరాలను ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి 24వ తేదీన ఉదయం 9గంటలకు పులివెందులలోని వెంకటప్ప మెమోరియల్ స్కూల్ పదో వార్షికోత్సవ వేడుకలలో పాల్గొంటారు. 9.30కు పులివెందులలోని వీజే ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ నాయకుడు రామట్లపల్లె భాస్కర్రెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా 10 గంటలకు ఇడుపులపాయకు చేరుకొని అక్కడ కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కాసేపు మాట్లాడతారు. క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు. అక్కడ నుంచి 2 గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకుని అక్కడ పార్టీ నాయకులు ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అనంతరం కడపకు చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 25వ తేదీ ఉదయం 8.30కు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు వేంపల్లె మండలం అలవలపాడు గ్రామానికి చేరుకుని ఇటీవల ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురైన మండల ఉపాధ్యక్షుడు గజ్జెల రామిరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. 5.30కు కడపలో కార్పొరేటర్ మక్బుల్ నివాసానికి చేరుకొని ఆయన కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి పులివెందులకు చేరుకుంటారు. 26వ తేదీ ఉదయం 9.30కు పీబీసీ నీటి విషయమై పులివెందుల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాలో పాల్గొంటారని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తెలిపారు.