ఎంజీఎం ఆస్పత్రి స్టోర్స్ విభాగంలో తనిఖీలు చేస్తున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు
వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో మరో నాసిరకం ఇంజక్షన్ వెలుగుచూసింది. క్రిమి సంహారక మందు సేవించి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడే రోగులకు యాంటీడోస్గా అందించే హిమాలయ మేడిటేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ ఇంజక్షన్ నాసిరకంగా ఉందని ఔషధ నియంత్రణాధికారులు గుర్తించారు.
-
నిర్ధారించిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు
-
స్థానికంగా కొనుగోలు చేసిన యాంపిల్స్లోనే ఫంగస్
-
రాష్ట్ర వ్యాప్తంగా హిమాలయ కంపెనీ యాంపిల్స్ నిలిపివేయాలని ఆదేశం
ఎంజీఎం (వరంగల్) :వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో మరో నాసిరకం ఇంజక్షన్ వెలుగుచూసింది. క్రిమి సంహారక మందు సేవించి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడే రోగులకు యాంటీడోస్గా అందించే హిమాలయ మేడిటేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ ఇంజక్షన్ నాసిరకంగా ఉందని ఔషధ నియంత్రణాధికారులు గుర్తించారు. హెచ్ఎల్ఐ 540ఎల్ బ్యాచ్కు చెందిన ప్రాలీడాక్సైన్ ఐడెడ్ యాంపిల్స్ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో వాడకూడదని డ్రగ్ కంట్రోల్ డిప్యూటీ డైరెక్టర్ సురేంద్రనాథ్ సాయి అదేశాలు జారీ చేశారు.
వెలుగు చూసింది ఇలా....
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో నాసిరకం ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ యాంపిల్ నాసిరకంగా ఉందని వైద్య సిబ్బంది ఆదివారం గుర్తించి రోగులకు అందించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఈ నాసిరకం ఇంజక్షన్ను పరిపాలనాధికారుల ఆదేశాలతో బయటరానియకుండా జాగ్రత్త పడ్డారు. స్థానికంగా కొనుగోలు చేసిన యాంపిల్ నాసిరకమైందని తెలియడంతో ఆస్పత్రిలో ఉన్న నిల్వలను బయటకు కానరాకుండా సిబ్బంది చాకచాక్యంగా వ్యవహరించారు. అయితే ఈ నాసిరకమైన యాంపిల్ను ఆస్పత్రి సిబ్బంది ఒకరు గుర్తించారు. అందులో ఫంగస్ ఉండడాన్ని చూసి రోగులకు ఇవ్వకుండా బయటపడేశారు
. ఈ విషయం రోగుల ద్వారా బయటకు పొక్కింది. దీంతో డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ఆదివారం రాత్రి ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని శాంపిల్స్ కోసం ప్రయత్నించగా నాసిరకం ఇంజక్షన్లు కనిపించకుండా సిబ్బంది జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఎంజీఎం ఆస్పత్రి పరిపాలనాధికారులు సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నుంచి సరఫరా కాబడిన యాంపిల్స్ను మాత్రమే చూపించి స్థానికంగా కొనుగోలు చేసిన యాంపిల్స్ను మాత్రం బయటకు రానీయలేదు. వాస్తవానికి స్థానికంగా కొనుగోలు చేసిన యాంపిల్స్లోనే ఫంగస్ వచ్చింది. సోమవారం ఆస్పత్రి సిబ్బందిలోని కొందరు ఫంగస్ వచ్చిన యాంపిల్స్ ఫొటోలను డ్రగ్ అధికారులకు పంపించడంతో అసలు విషయం తెలిసింది. డ్రగ్ అధికారులు ఆరాతీయగా ఆస్పత్రి పరిపాలనాధికారులు ఏప్రిల్ మాసంలో కొనుగోలు చేసి నిల్వ ఉన్న ప్రాలీ డాక్సైమ్ ఐడెడ్ 45 యాంపిల్స్ను చూపించారు. ఈ ఆంపిల్స్ నాసిరకంగా ఉన్నట్టు గుర్తించి వాటిని డ్రగ్ కంట్రోల్ అధికారులు పరీక్షల నిమిత్తం పంపించారు. దీంతో పాటు హియాలయ కంపెనీకి చెందిన ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ యాంపిల్స్ను రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
స్థానికంగా కొనుగోలు చేసిన ఆంపిల్స్లోనే..
ఎంజీఎం ఆస్పత్రికి సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి సరఫరా కాబడిన ప్రాలీడాక్సైమ్ క్లోరైడ్ అనే యాంపిల్స్ సరిగానే ఉన్నాయని డ్రగ్ కంట్రోల్ అధికారులు స్పష్టం చేశారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్లో ఈ యాంపిల్స్ అందుబాటులో లేని సమయంలో ఎంజీఎం ఆస్పత్రి పరిపాలనాధికారులు ఏప్రిల్లో నగరంలోని బాలాజీ సర్జికల్స్ అండ్మెడికల్ స్టోర్స్ నుంచి రెండు వేల ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ అనే ఇంజక్షన్లను కొనుగోలు చేశారు. ఈ యాంపిల్స్నే పార్టిక్యూలెట్ మాటర్(నులిపోగుల వలే,నాసిరకం) ఉన్నట్లు స్పష్టమైంది. దీంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆస్పత్రిలో వివిధ వార్డుల్లో ఉన్న 45 యాంపిల్స్ను వాడకూడదని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆస్పత్రిలో స్థానికంగా కొనుగోలు చేస్తున్న మందుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు నిర్వహించారు.
ఎంజీఎంలో వెలుగుచూస్తున్న నాసిరకం ఔషధాలు
వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో వరుసగా నాసిరకం ఔషధాలు వెలుగుచూస్తుండడంతో వైద్యసిబ్బందితో పాటు రోగులు సైతం ఆందోళనకు గురవుతున్నారు. ఆస్పత్రిలోని ఆనస్తీషియ విభాగంలో థయోపెంటోన్ సోడియం నాసిరకం ఇంజక్షన్ వెలుగుచూసి వారం రోజుల గడువక ముందే ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ అనే మరో యాంపిల్ను నాసిరకంగా డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించి వాటి శాంపిల్స్ను పరీక్షలు నిమిత్తం రాష్ట్ర ఔషధ నియంత్రణ కేంద్రానికి పంపించారు.