Published
Mon, Sep 19 2016 11:32 PM
| Last Updated on Tue, Mar 19 2019 7:00 PM
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
రాంనగర్ : వివిధ శాఖల్లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజలు ఇచ్చే వినతులకు అధికారులు అధిక ప్రాధాన్యతమిచ్చి సత్వరమే పరిష్కరించాలని, పరిష్కరించలేని, ఆస్కారం లేని ఫిర్యాదులు బాధితులకు తెలియజేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న అర్జీలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. జిల్లాలో 15 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. వివిధ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నందున నూరు శాతం జియో ట్యాగింగ్ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. జిల్లా పునర్వి విభజన ఉన్నందు వల్ల తెలంగాణకు హరితాహారం జిల్లాల వారీగా విభజిస్తామన్నారు. సమావేశంలో ఏజేసీ వెంకట్రావు, పులిచింతల స్పెషల్ కలెక్టర్ నిరంజన్, డీఆర్వో రవి, వివిధ అధికారులు తదితరులు పాల్గొన్నారు.