-12,395 మందికి రూ.61.97 లక్షలు
-322 స్కూల్ కాంప్లెక్స్ల నిర్వహణకు రూ.35.42లక్షలు
రాయవరం : పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు బోధనాభ్యసన సామగ్రి(టీఎల్ఎం) తయారీ నిమిత్తం సర్వశిక్షాభియాన్ ఎట్టకేలకు టీచర్ గ్రాంట్ విడుదల చేసింది. జిల్లాలో ఉన్న 12,395 మంది టీచర్లకు రూ.61,97,500 విడుదల చేస్తూ ఎస్ఎస్ఏ పీవో ఎం.శేషగిరి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీచర్కు రూ.500 వంతున 20016–17 విద్యా సంవత్సరంగానికి విడుదల చేశారు. గత రెండేళ్లుగా టీచర్ గ్రాంట్ విడుదల కాకపోగా ఈ విద్యా సంవత్సరం చివర్లో విడుదల చేయడం గమనార్హం. ప్రాథమిక పాఠశాలల్లోని 7,960 మంది ఉపాధ్యాయులకు రూ.39.80 లక్షలు, 2,013 మంది ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు రూ.10,06,500, ఉన్నత పాఠశాలల్లో ఆరు, ఏడు, ఎనిమిది తరగతులు బోధించే 2,422 మందికి రూ.12.11 లక్షలను విడుదల చేశారు. జిల్లాలో ఉన్న 322 స్కూల్ కాంప్లెక్స్లకు తొలి విడతగా రూ.11 వేల వంతున రూ.35.42లక్షల విడుదలకు చర్యలు తీసుకుంటున్నారు. టీచర్, స్కూల్ కాంప్లెక్స్ గ్రాంట్ల వినియోగానికి మార్గదర్శకాలను కూడా ఉత్తర్వుల్లో పొందపర్చారు.
టీచర్ గ్రాంట్ మార్గదర్శకాలు
టీచర్ గ్రాంట్కు సంబంధించి ప్రధానోపాధ్యాయులే బాధ్యత వహించాలి. ప్లాస్టిక్ క్లే కొనవచ్చు. అదే సందర్భంలో ప్రింటెడ్ మెటీరియల్, రెడీమేడ్ వస్తువులు కొనరాదు. వర్కింగ్ మోడల్స్, లైవ్ లెసన్ సీడీ/డీవీలు, టీఎల్ఎం ప్రిపరేషన్ సీడీలు కొనవచ్చు. లెసన్ వీడీయోలు, పీపీటీలు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
స్కూల్ కాంప్లెక్స్ గ్రాంట్ వినియోగం ఇలా..
ప్రతి స్కూల్ కాంప్లెక్స్కు రూ.22 వేలను విడుదల చేశారు. ఈ నిధుల్లో రూ.10వేలను కంటింజెన్సీ నిమిత్తం. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం టీఏ నిమిత్తం రూ.5 వేలు, టీఎల్ఎం గ్రాంట్ నిమిత్తం రూ.7వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కంటింజెంట్ గ్రాంట్ను.. ఆర్వోటీల మెయింటెనెన్స్, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రిజిస్టర్స్, రికార్డ్స్, స్టేషనరీ, ఉపాధ్యాయుల బోధనకు సంబంధించిన రిఫరెన్స్ పుస్తకాలు, విద్యా సంబంధమైన సీడీల కొనుగోలుకు వినియోగించాలి. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం తన పరిధిలోని పాఠశాలలను సందర్శించాలి. టీఏ బిల్లుగా నెలకు రూ.500 వంతున ఏడాదికి రూ.5 వేలు కేటాయించారు. పాఠశాల మానిటరింగ్, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల హెచ్ఎంలతో సమావేశానికి ఈ నిధులను వినియోగించాలి.
మంచి టీఎల్ఎం కొనుగోలు చేయాలి..
బోధనాభ్యసన సామగ్రి కొనుగోలుకు సంబంధించిన గైడ్లైన్స్ను పాఠశాలలకు పంపించాం. టీచర్ గ్రాంట్తో పాఠశాలల్లో ఆకర్షణీయమైన బోధనా సామగ్రిని సమకూర్చుకోవాలి.
– మేకా శేషగిరి, పీవో, ఎస్ఎస్ఏ
సద్వినియోగం చేసుకోవాలి..
ఉపాధ్యాయులకు టీఎల్ఎం గ్రాంట్ను పాఠశాల ఖాతాలకు విడుదల చేశాం. ఈ నిధులతో బోధనాభ్యసన సామగ్రిని కొనుగోలు చేసుకుని సమర్ధవంతమైన బోధన చేపట్టాలి.
– చామంతి నాగేశ్వరరావు, ఏఎంవో, ఎస్ఎస్ఏ