ఆత్మహత్య చేసుకున్న కడప విద్యార్థినుల మృతదేహాలకు మరికొద్దిసేపట్లో రిమ్స్ అస్పత్రిలో పోస్టుమార్టం చేయనున్నారు.
వైఎస్ఆర్ జిల్లా: ఆత్మహత్య చేసుకున్న కడప విద్యార్థినుల మృతదేహాలకు మరికొద్దిసేపట్లో రిమ్స్ అస్పత్రిలో పోస్టుమార్టం చేయనున్నారు. ఆస్పత్రి బయట విద్యార్థినుల తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. దీంతో ఆస్పత్రి బయట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప రిమ్స్కు బయలు దేరారు. కాలేజీలో విద్యార్థినుల ఆత్మహత్యలకు నారాయణకాలేజీ యాజమాన్యం, అధ్యాపకుల వేధింపులే కారణమని మృతుల బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు కళాశాలలో ఫర్నీచర్, ద్వారం, కిటీకీల అద్దాలు ధ్వంసం చేశారు.
వివరాలు...వైఎస్సార్ జిల్లా కడప నగర శివార్లలోని చింతకొమ్మదిన్నె మండల పరిధిలో ఉన్న నారాయణకాలేజీలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదవుతున్న ఇద్దరు విద్యార్థినిలు సోమవారం సాయంత్రం ఒకే గదిలో వేర్వేరు ఫ్యాన్లకు తమ చున్నీలతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కడప నగరం ఓం శాంతినగర్కు చెందిన మాలేపాడు సుబ్బారావు కుమార్తె నందిని(16), సిద్దవటం మండలం భాకరాపేట లెవెన్త్ బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న చవ్వా బాలకృష్ణారెడ్డి కుమార్తె మనీషా(16) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణులైన వీరు నారాయణకాలేజీలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో చేరారు.
ఇదే క్యాంపస్లో హాస్టల్లో ఉంటూ 103వ గదిలో కలసి ఉంటున్నారు. సాయంత్రం 4 గంటలకు టీ బ్రేక్ తరువాత హాస్టల్ గదిలోకి వెళ్లారు. కొంత సేపటి తర్వాత ఇతర విద్యార్థినులు వెళ్లి చూసే సరికి ఉరి వేసుకుని కనిపించారు. కళాశాల సిబ్బంది వచ్చి చూసే సరికే మృతి చెందారు. మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలని అధ్యాపకుల వేధించడంవల్లే మనీషా, నందిని ఆత్మహత్యకు పాల్పడ్డారిని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.