ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో నేల కుంగిన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో నేల కుంగిన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ... రాజధానిలో మొన్న ఇళ్ళు కుంగాయి. నేడు తాత్కాలిక సచివాలయం ప్లోరింగ్ కుంగింది. నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రతిపక్షాలు ఈ భూమి రాజధానికి పనికిరాదు అని చెప్పినా స్వార్ధం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరి మాటలను పెడ చెవిన పెట్టారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కనీసం బాబు చదివి ఉన్నా ఈ దుస్థితి వచ్చేది కాదు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి పంతాలకు పోకుండా శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను అమలు చేయాలి.' అని డిమాండ్ చేశారు.
కాగా సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో గురువారంనాడు మూడు అడుగులు వరకు నేల కుంగడంతో రెండు బ్లాకుల్లో ఫ్లోరింగ్ దెబ్బతింది. దీంతో అక్కడి పనిచేస్తున్న వారు ఆందోళనకు గురయ్యారు. లూజ్ సాయిల్ వల్లే నేల కుంగివుండొచ్చని అనుమానిస్తున్నారు. నిర్మాణ ప్రాంతంలో నేల కుంగిపోవడంతో పనులు ఏవిధంగా సాగించాలనే దానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.