
ప్రేమ, శాంతి, సహనం, సత్యం, సేవాతత్పరత వంటి అనేక మేలు గుణాలు కలగలసిన మహానుభావుడు భగవాన్ శ్రీసత్యసాయిబాబా. ఈ నెల 23, శుక్రవారం బాబా జయంతి సందర్భంగా ఆయన బోధామృతంలోని కొన్ని చినుకులు...
♦ పిల్లలు తమలోని దైవిక ప్రజ్ఞలను పెంపొందించుకోవడానికి తల్లిదండ్రులు అన్ని అవకాశాలూ కల్గించాలి. యజమాని తోటలో తోటమాలి మొలకల్ని పెంచిన రీతిగా తల్లిదండ్రులు తమ ఇంట్లో పుట్టిన చిన్నారులను పెంచడానికి భగవంతుడు తమను నియమించాడని భావించాలి. పురాణ పురుషులు, రుషులు, మునుల కథలను చెబుతూ చిన్నారులలో దాగి ఉన్న మంచితనాన్ని ప్రేరేపించాలి.
♦ కొందరు కార్తీక పౌర్ణమి, శివరాత్రి, ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాలలో ఉపవాసం పేరిట అన్నపానాలు మాని చిరుతిండ్లు అధికంగా తింటూ ఉంటారు. ఇది ఉపవాసం కాదు. భగవంతునికి సమీప నివాసమే ఉపవాసం.
♦ భగవంతుని నామ సంకీర్తనంతో అఖండ భజనలతో హృదయాకాశాన్ని ప్రకాశింప చేయాలి. అప్పుడే అంతులేని ఆత్మానందం కలుగుతుంది. కనుక జీవితం ఉన్నంత వరకు నామ సంకీర్తనం చేయాలి.
♦ సాధన ద్వారా మనోచాంచల్యాన్ని నిరోధించి దైవోన్ముఖం చేయగలిగిన వానికి ఏ విధమైన వర్ణాశ్రమధర్మాలూ అవరోధం కాజాలవు.
♦ ముక్తికోసం మానవుడు అడవులకు, ఆలయాలకు, యాత్రలకు వెళ్లనవసరం లేదు. ముక్తిపొందటానికి కులగోత్రాలతోనూ, ఏకాంత దీక్షతోనూ, వనవాసంతోనూ ప్రమేయం లేదు. మానవునికి కర్మద్వారానే ముక్తి లభిస్తుంది. అదెలాగంటే, కర్మ చేసేటప్పుడు ఇంద్రియ ప్రభావాన్ని బుద్ధి నిలకడతో అణచివెయ్యాలి. అలా ఇంద్రియాల శక్తిని అరికట్టిన అంధుడైనా మోక్షం పొందుతాడు. భవబంధాలను దూరం చేసుకుని భగవంతుని యెడల ప్రగాఢ భక్తివిశ్వాసాలు పెంచుకొనటమొక్కటే మానవుని ముక్తికి కావలసిన అర్హతను ప్రసాదిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment