
జలతరంగాలు
వర్ణం నీటిలో పడితే గొప్పతనమేమీ లేదు...
వర్ణం నీటిలో పడితే గొప్పతనమేమీ లేదు... అదే వర్ణం నీటి చుక్కతో కలసి ఓ తెల్లకాగితంపై విస్తరిస్తే అద్భుతమైన చిత్రం ఆవిష్కృతమవుతుంది. ఇండో-చైనా చిత్రకళలో ఈ జలవర్ణాలే (వాటర్ కలర్స్) ప్రధానమైనవి. క్రీస్తుపూర్వం నాలుగు వేల ఏళ్ల కిందటే ప్రారంభమైన ఈ సంప్రదాయ చిత్రకళ.. కాగితం వినియోగంలోకి వచ్చిన తర్వాత మార్పులకు లోనైంది. ఈ జలవర్ణాల వారసత్వం మనకూ ఉంది. చైనాలో ముందుగా ప్రారంభమైనా, మన దేశపు చిత్రకళపైనా గాఢమైన ప్రభావం చూపింది. వస్తువును వస్తువుగా చూపడం కంటే దాని తత్వాన్ని చూపడంలో ఇరుదేశాలకూ వైవిధ్యం ఉంది.
ఈ వైవిధ్య కళ ద్వారా ఇరు దేశాల సంస్కృతి ఆవిష్కృతమైంది. అలాంటి జలవర్ణ (వాటర్ కలర్స్) పెయింటింగ్ నిష్ణాతులైన ఇండో-చైనా కళాకారుల చిత్రాలతో మౌన సంభాషణ చేసే అపూర్వ అవకాశాన్ని కల్పించింది కళాకృతి ఆర్ట్గ్యాలరీ. ఇండియాలో తొలిసారిగా ‘ట్రెడిషన్ అండ్ ట్రాన్సిషన్’ పేరుతో ఏర్పాటైన ఈ ప్రదర్శన ఈనెల 24 వరకూ సందర్శకులను ఆహ్వానిస్తోంది. ఇండో-చైనా సంప్రదాయాలు, సాంస్కృతిక చరిత్రను తెలుసుకోవాలనుకుంటే కొంచెం సమయం తీసుకుని ఈ ఎగ్జిబిషన్ను సందర్శిస్తే చాలు.
- సాక్షి, కల్చరల్ కరస్పాండెంట్