Cityplus
-
ఎడారి పండు.. పోషకాలు మెండు
సాక్షి, సిటీబ్యూరో: అలసిన దేహమనే యంత్రానికి ‘ఖర్జూరం’ ఓ శక్తి వనరు.. తక్షణ శక్తి ప్రదాయని. ఎన్నో పోషకాలతో నిగనిగలాడే ఈ పండు ఆరోగ్యాన్ని పరిపుష్టం చేస్తోంది. నిగనిగలాడే రంగు, మంచి రుచితో ప్రతి ఒక్కరినీ తనవైపు తిప్పుకుంటుంది. రంజాన్ మాసంలో దీనికో ప్రత్యేకత ఉంది. ‘రోజా’ దీక్షలను పాటించేవారు ఈ పండునే బాగా ఇష్టపడతారు. ఉపవాసం పూర్తయిన తర్వాత దేహానికి కావాల్సిన తక్షణ శక్తి కోసం దీన్ని తీసుకోవడం అనవాయితీ. ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం కావడంతో ఈ పండుకు మరింత డిమాండ్ పెరిగింది. ఎడారి దేశాల్లో పండే ఈ ఫలం వివిధ అరబ్ దేశాల నుంచి 15 నుంచి 20 రకాల ఖర్జూరాలు నగర మార్కెట్లను ముంచెత్తాయి. ఇరానీ (నలుపు, ఎరుపు), కిమియా ఖజూర్, కల్మీ ఖజూర్, తైబా ఖజూర్, మగ్ధీ ఖజూర్, ఆల్ మదీనా.. తదితర రకాలు లభిస్తున్నాయి. వీటి విక్రయాలకు నిలయమైన బేగంబజార్, గుల్జార్ హౌస్ తదితర ప్రాంతాల్లో హోల్సేల్ దుకాణాలు కొనుగోలు దారులతో కళకళలాడుతున్నాయి. ఇరాక్, ఇరాన్, సౌదీ, ఒమన్ దేశాల నుంచి ఈ పండ్లను దిగుమతి చేసుకుంటున్నట్లు బేగం బజార్లోని కాశ్మీర్ హౌస్ అధినేత ధీరజ్ కుమార్ తెలిపారు. కిలో ఇరాకీ ఖజూర్ రూ.50 నుంచి రూ.60, నలుపు రకం ఇరానీవి రూ.80 నుంచి రూ.100, ఎరుపు రూ.60, కీమియా ఖజూర్కు రూ.120-130 (బాక్స్), తైబా మగ్ధీ రకాలు రూ.130-140, ఆల్ మదీనా ఖజూర్ రూ.160-180 ధర పలుకుతోంది. క్యాలరీస్ అధికం - ఖర్జూరాల్లో క్యాలరీస్ అధికమని, మన దగ్గర డ్రై డేట్స్ వినియోగం ఎక్కువని గాంధీ ప్రకృతి వైద్యశాల వైద్యులు డా. శ్యామల తెలిపారు. ఈ పండులో పోషకాలు అధికమని వివరించారు. - 100 గ్రాముల ఖర్జూరంతో 400-600 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఫ్రెష్ డేట్స్లో క్యాలరీలు కాస్త తక్కువ. - ఖర్జూరాల్లో ఐరన్, ఫైబర్ ఎక్కువ. క్యాల్షియం, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్స్, కాపర్ పాళ్లు కూడా పుష్కలంగా ఉంటాయి. - 100 గ్రాముల డేట్స్లో 8-10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. - డేట్స్ను పాలతో కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే పిల్లల్లో, వృద్ధుల్లో, ఏదైనా జబ్బు నుంచి కోలుకునే వారికి ఇది మంచి ఆహారం. ఖర్జూరం తినడం వల్ల ఎల్డీఎల్ కొలస్ట్రాల్ బాగా తగ్గి గుండె పనితీరు బాగుంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. -
వీరి నినాదం.. ప్రకృతి దేవోభవ
పండ్లతోట.. పూలబాట రాయదుర్గం: మన సిటీలో ఇంటి వెనుక కాస్త స్థలం ఉంటే అందులో రెండు గదుల ఇల్లు కట్టి అద్దెకిస్తే బాగుంటుందని ఆలోచిస్తారు. కానీ పచ్చని చెట్లు ఉంటే అదే పెద్ద ఆస్తి అని భావించారాయన. అందుకే పెరట్లోనే పండ్లు, పూల మొక్కలను పెంచుతూ పన్నెండేళ్ల క్రితమే హరితహారానికి శ్రీకారం చుట్టారు జీహెచ్ఎంసీ ఉద్యోగి అనంతయ్య. గచ్చిబౌలి డివిజన్ గోపన్పల్లి తండాలో నివసించే ఈయన తన ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో పూలు, పండ్ల మొక్కలను నాటారు. ప్రస్తుతం అవి పెద్దవై ఇంటి మొత్తాన్ని కప్పేసి.. చల్లని నీడను, స్వచ్ఛమైన గాలిని, పూలు, పండ్లను ఇస్తున్నాయి. ఇంటి పెరట్లో మామిడి, సపోటా, ఆల్ బుకార్, బొప్పాయి, సీతాఫలం, పనస, జామ చెట్లున్నాయి. వీటితో పాటు పూల మొక్కలు కూడా పెంచుతున్నారు. అనంతయ్య కుమారులు శివకుమార్, చంద్రశేఖర్ కూడా వీటి సంరక్షణలో పాలుపంచుకుంటూ.. సీజన్ల వారీగా ఆయా మొక్కలను నుంచి వచ్చే పండ్లను ఆస్వాదిస్తారు. ఉపాధి వేటలో పెరుగుతున్న వలసలు.. ఖాళీ అవుతున్న గ్రామాలు.. ఊపిరి సలపనంతగా కిక్కిరిసిపోతున్న పట్టణాలు.. ఉన్న అడవులను నరికేసి మౌలిక సదుపాయాల కల్పన. జనం పెరుగుతున్నారని భూమి విస్తీర్ణం పెరగదు కదా..! పచ్చని వనాలు కనుమరుగైపోయి.. కాంక్రీట్ భవంతులు భూతాల్లా భయపెడుతున్నాయి. కాలుష్యపు కోరలు చాస్తూ కర్మాగారాలు జీవన ప్రమాణాలను కాలరాస్తున్నాయి. కరెన్సీ కట్టల లెక్క సరిపోక.. పెరట్లో మొక్కలు పీకేసి.. ఇరుకు గదుల్లో ఆదాయం బ్యాలెన్స్ షీట్ చూసుకుంటూ మురిసిపోతున్నారు. ఇప్పుడు ప్రాణవాయువును సైతం కొనుక్కునే పరిస్థితి. దేహం రోగాల పుట్టగా మారిపోయింది. ‘చెట్టు’ తోడు లేకే కదా ఇన్ని అనర్థాలు..!! అందుకే పచ్చని హారం నిర్మాణ ం కోసం కొందరు పరితపిస్తున్నారు. భాగ్యనగరి సౌభాగ్యం వనాలతోనే ఉందని తమ చుట్టూ నందనవనాలు సృష్టిస్తున్నారు. ప్రకృతి రక్షణే పరమావధిగా.. జూబ్లిహిల్స్: ఇప్పటికైనా చెట్లను నరకడం ఆపేయాలి. లక్షల సంఖ్యలో మొక్కలు నాటి చెట్లుగా చూడాలి. పర్యావరణాన్ని ప్రాణంలా కాపాడాలి.. ఇదీ సాప్ట్వేర్ ఇంజినీర్ జయప్రకాశ్ నంబూరు స్వప్నం. ఈ స్వప్నాన్ని ఆచరణలో పెట్టేందుకు ఆరేళ్ల కిందట ఆయన నడుంబిగించారు. ఐదంకెల జీతాన్ని, అందమైన జీవితాన్ని వదిలేసి పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని ప్రారంభించారు. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన జయప్రకాశ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి విదేశాల్లో పలు ఉద్యోగాలు చేశారు. ఆ దేశాల్లో పర్యావరణ పరిరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యతను, ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని గమనించిన ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్కు వచ్చేసి పర్యావరణ పరిరక్షణకే అంకితమయ్యారు. ఇందుకోసం ‘ఐ గోగ్రీన్ ఫౌండేషన్’ను స్థాపించారు. ఠీఠీఠీ.జీజౌజట్ఛ్ఛజౌఠఛ్చ్టీజీౌ.ౌటజ పేరుతో వెబ్సైట్ను ప్రారంభించారు. విసృ్తత స్థాయిలో పర్యావరణంపై ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు, కార్పొరేట్ సంస్థలను ఎంపిక చేసుకొని నీరు, విద్యుత్ ఆదా, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ వాడకం నిషేధం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ అంశాలను పాఠశాల, ఇళ్లల్లో అమలు చేసేలా వారిని ఒప్పిస్తున్నారు. రోటరీక్లబ్ సహకారంతో పలు జిల్లాల్లోని 200కు పైగా రోటరీ భవనాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయించారు. విస్తృతంగా మొక్కలు నాటించారు. ‘పర్యావరణ చైతన్య రథం’ పేరుతో ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. నగరంలో ఎక్కడైనా చెట్లను నరికేస్తున్నట్టు గుర్తిస్తే 1800 4255364 (టోల్ ఫ్రీ) నంబర్కు సమాచార ఇవ్వాలని కోరుతున్నారు. ఎక్కడన్నా చెట్లు తొలగిస్తుంటే వాటిని మరోచోట నాటుతున్నారు. కాలనీలు, డంపింగ్ యార్డ్ల్లో చెత్తను తగలబెడుతుంటే అడ్డుకునేందుకు ఓ ప్రత్యేక కార్యకర్తల బృందాన్ని నియమించారు. అంతేగాకుండా 040- 21111111 నెంబర్కు ఎవరన్నా ఫోన్ చేసినా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ‘దేశంలోని వంద కోట్ల మందిలో ప్రతి ఒక్కరు చిన్న పర్యావరణ అనుకూల పనిచేసినా దాని ప్రభావం విస్తృతంగా ఉంటుంది. ఒక్క మొక్కను నాటినా అది మహా వృక్షమై మనకు ఎంతో మేలు చేస్తుంది’ అని చెబుతున్నారు జయప్రకాష్. ‘చిగురించిన’ ఆదర్శం బంజారాహిల్స్: ఇంటి నిర్మాణానికి అడ్డు వస్తుందని చెట్లు నరికేస్తారు. ఇంటి ప్రహరీకి పగుళ్లు వస్తాయని గోడ పక్కన చెట్లను సైతం తొలగించే వారూ ఉన్నారు. చెట్టు నరికేస్తుంటే మనకెందుకులే.. అని పట్టించుకోనివారికీ నగరంలో కొదవలేదు. అయితే, బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఫార్చూన్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ నివాసితులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఇక్కడివారు పచ్చదనం అంటే ప్రాణం పెడతారు. ఎక్కడో చెట్లను కొట్టేస్తున్నారని తెలుసుకుని ఆ చెట్లను తలా కొంత డబ్బు పోగు చేసి కొనుగోలు చేశారు. తమ అపార్ట్మెంట్ ఆవరణలో అప్పటికే ఉన్న వందలాది చెట్లతో స్థలం లేకపోతే ఎదురుగా ఉన్న రోడ్డులో వాటిని తెచ్చి నాటుకున్నారు. మెట్రోరైలు పనుల్లో భాగంగా అడ్డుగా ఉన్న భారీ చెట్లను జీహెచ్ఎంసీ, మెట్రో అధికారులు తొలగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫార్చూన్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో ఉన్న 43 కుటుంబాలు చెట్టు ప్రాముఖ్యం తెలుసు కాబట్టి వాటి రక్షణకు నడుం బిగించారు. నివాసితులంతా తలా కొంత డబ్బు పోగుచేసి తొలగించే చెట్లను ట్రీ రీలొకేట్ పద్ధతిలో తీసుకొచ్చి నాటుతున్నారు. ఒక్కో చెట్టుకు రూ. 10 వేలకు పైగా ఖర్చు చేశారు. ఈ చెట్లను అపార్ట్మెంట్ ఎదురు మార్గంలో నాటి వదిలేయలేదు.. అవి చక్కగా ఎదిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. నిత్యం నీళ్లు పోయడం, ఎరువు వేయడం వంటివి చేశారు. తలా ఒక రోజు చొప్పున చెట్టు రక్షణకు నిఘా ఉంచారు. ప్రస్తుతం అవి పచ్చగా ఎదిగి నీడనిస్తున్నాయి. పచ్చందాల కాలనీ.. శేరిలింగంపల్లి: పచ్చదనంతో ఆ కాలనీ కళకళలాడుతోంది. దీని సంరక్షణ కోసం స్థానికులు నిత్యం కొంత సమయం వెచ్చిస్తారు. కాలనీ చిన్నదే అయినా ఎటుచూసినా పచ్చదనమే. పక్షుల కిలకిల రావాలతో ఉదయం, సాయంత్రం సమయాల్లో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది.. శేరిలింగంపల్లి నల్లగండ్లలోని లక్ష్మీ విహార్ ఫేజ్-2 కాలనీ. ఇక్కడ నివసించే వారంతా విద్యాధికులు కావడంతో పచ్చదనానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా ఇక్కడ 30 వేలకు పైగా మొక్కలు, చెట్లు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. కాలనీ ప్రధాన గేటు లోపల భాగంలో వేప, మామిడి, జామ, సపోటా, మల్లె, ఉసిరి, టేకు, అశోక, పనస చెట్లు ఉన్నాయి. రోడ్లకు ఇరువైపులా ఎగ్జోరా, అలమండ, జాత్రోపా సింగపూర్ ఎగ్జోరా, ఎల్కోనియా, స్వాతి పైలం, నైట్క్వీన్, ముసుండ తదితర మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఏటా వీరు ‘ప్రకృతి దేవోభవ’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ‘మా కాలనీలో పచ్చదనానికి ప్రతిఒక్కరూ ప్రాధాన్యం ఇస్తారు. వేసవిలో మిగతా కాలనీలతో పోలిస్తే ఇక్కడ రెండు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంద’ని కాలనీ అధ్యక్షుడు రవీంద్ర ప్రసాద్ దూబే తెలిపారు. తమ కాలనీలో పచ్చదనంతో పాటు ఇంకుడు గుంతలను తవ్వించడం వల్ల నీటి సమస్య కూడా లేదని, సీవరేజ్ నీటిని శుద్ధి చేసి గ్రీనరీకి వినియోగిస్తున్నామని కాలనీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాంమూర్తి తెలిపారు. అతిథులకు మొక్కలు.. ఉప్పల్ : పచ్చదనమన్నా.. పక్షులన్నా ఆయనకు పంచ ప్రాణాలు. దీంతో తన ఇంటిని రకరకాల మొక్కలతో నింపి నందనవనంగా తీర్చిదిద్దారు. దీనిలో 40 రకాల పక్షులు గూళ్లు కట్టుకుని ఆవాసం ఏర్పరచుకున్నాయి. కర్ణాటకలోని కార్వార్ ప్రాంతానికి చెందిన ఎన్ఎఫ్సీ రిటైర్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ సావంత్.. హబ్సిగూడ స్నేహనగర్ వీధి నెంబర్-8లో నివాసం ఉంటున్నారు. 1980లో ఇల్లు నిర్మించుకుని ఇక్కడే స్థిరపడ్డారు. తన ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో అనేక రకాల మొక్కలను పెంచుతున్నారు. ఉదయం 6 అయ్యిందంటే చాలు వేలాది పావురాలు సావంత్ అందించే ఆహారం కోసం నిరీక్షిస్తుంటాయి. మొక్కలను పెంచడమే కాదు.. ఇంటికి వచ్చిన అతిథులకు వాటి ప్రాముఖ్యతను వివరించి మొక్కలను పంచడం ఇతని హాబీ. -
పెట్స్తో జాగ్రత్త సుమా..!
కుక్క, పిల్లి, ఎలుక, పావురం, పిచ్చుక, గుర్రం, కుందేలు.. ఇలా ఏ ప్రాణినైనా పెంచుకునేందుకు నగరవాసులు మక్కువ చూపుతున్నారు. తమ ఆసక్తిని బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి ఆయా జంతువులను సంరక్షిస్తున్నారు. కొందరికి ఇవి స్టేటస్ సింబల్గా కూడా మారిపోయాయంటే నగరవాసి జంతు ప్రేమ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఎక్కువ మంది శునకాలను పెంచుకునేందుకే ఆసక్తి చూపుతున్నారు. వీటిని విదేశాల నుంచి కూడా తెప్పించుకుంటున్నారు. ఎంత ఖరీదైన జంతువైనా సరే పెంపకంలో జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు వెటర్నరీ వైద్యులు. పెట్స్ ఆహారం, ఆరోగ్యం విషయంలో కనీస అవగాహన అవసరమంటున్నారు. - రాజేంద్రనగర్ / సాక్షి, సిటీబ్యూరో జునోసిస్ అంటే.. జంతువులకు వాటి నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జునోసిస్ అంటారు. ఈ వ్యాధుల్లో రేబీస్ ప్రధానమైంది. లూయి పాశ్చర్ 1885 జులై 6న యాంటీ రేబిస్ను తొలిసారిగా ఉపయోగించారు. ఈ రోజునే యాంటీ రేబీస్ డేగా కూడా వ్యవహరిస్తుంటారు. అవగాహన అవసరం.. పెంపుడు జంతువులకు వేసే వాక్సినేషన్పై చాలా మందికి అవగాహన లేదు. కొంతమంది ఖర్చుతో కూడిందని పట్టించుకోరు. పెట్స్కు మాములుగా కరిచే గుణం ఉంటుంది కాబట్టి దాదాపు అన్ని రకాల పెట్స్కి వ్యాక్సినేషన్ తప్పనిసరి. మనిషికి, జంతువుకు ఉండే కాంటాక్ట్లో అది కరవడం, గీరటం లాంటివి సాధారణంగా జరుగుతుంటాయి. దాని వల్ల ఏదైనా ఆరోగ్య సమస్య రావచ్చు. క్యాట్స్, ర్యాబిట్స్ లాంటివి పెంచుతున్నవారు కూడా వ్యాక్సినేషన్ అవసరాన్ని గుర్తించాలి. మా సంస్థ తరపునవ్యాక్సినేషన్ అవసరంపై అవగాహన చెపడుతున్నాం. వ్యాక్సిన్ వేయించడం పెట్కి మాత్రమే కాదు.. పెట్ ఓనర్స్, వారి చుట్టూ ఉన్నవారి రక్షణకు సంబంధించిన విషయం. - నిహార్, ఏఆర్పీఎఫ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వైద్య సలహాలు తప్పనిసరి జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే రోగాలను ‘జునాటిక్ డిసీజెస్’ అంటారు. ఎబోలా, బర్డ్ఫ్లూ, రేబిస్, ఆంత్రాక్స్.. వంటివి జునాటిక్ వ్యాధులే. ఈ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే రెగ్యులర్గా వెటర్నరీ వైద్యుల సలహాలు తీసుకోవాలి. పెంపుడు జంతువుల ఆరోగ్యం, స్కిన్ కేర్ ఎంత ముఖ్యమో, వాటి యజమానులు వారి హెల్త్ కూడా ముఖ్యమని గుర్తించాలి. ముఖ్యంగా ఇంట్లో డాగ్స్ ఉన్నవారు చర్మ సమస్యలు వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సిటీలో కుక్కలు, పిల్లులు తర్వాత పక్షులను పెంచుతున్నారు. వీటి వల్ల లంగ్స్కి సంబంధించిన వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. వాటిని నివారించేందుకు పక్షులకు సంబంధించిన వాటర్ వ్యాక్సిన్స్ ఇప్పించాలి. వైల్డ్ లైఫ్ యానిమల్స్, పెట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరి. - డాక్టర్ మురళీధర్, డాక్టర్ డాగ్ హాస్పిటల్స్ పెట్స్ను పిల్లల్లా చూడాలి.. నాకు మూడేళ్ల బాబు. హ్యాపీ, డాలర్, డ్యూక్ పెట్స్ (డాగ్స్) ఉన్నాయి. డాగ్స్తో పిల్లలకు ఇన్ఫెక్షన్ అనేది నేను ఫేస్ చేయలేదు. సాధారణంగా ఆరు నెలలకు ఓసారి డాగ్స్కి పొట్ట క్లీన్ కావడానికి డీవార్మింగ్ చేస్తారు. అయితే, వీధి కుక్కలకు ఇలాంటిది లేకుండా బాగానే ఉంటాయి. నేను డీవార్మింగ్కి నాచురల్ రెమిడీస్, హోమియోపతి మందులు ఇస్తుంటా. నెలకోసారి పంప్కిన్, సన్ఫ్లవర్, తర్బూజా వంటి డ్రై గింజలు మిక్స్ చేసి ఇస్తుంటా. నా పెట్స్ హెల్దీగా ఉన్నాయి. పెట్స్కి మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి. సోయా, చికెన్, వెజిటేబుల్స్, ఎగ్, రైస్, యాపిల్ ఇలా అన్నీ వేసి వండుతాను. కొద్దిగా సాల్ట్, ఆయిల్ ఉండేలా చూస్తా. వాటికి రెగ్యులర్గా బ్రష్, కోంబింగ్, మంత్లీ బాత్ తప్పనిసరి. బాత్ చేసిన తర్వాత బాగా తుడవాలి. తడిగా ఉంచితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. - సౌమ్య, పెట్లవర్ ఒత్తిడి మాయం.. చదువుకునేటప్పుడు నా దగ్గర డాగీస్ ఉండేవి. జాబ్లోకి వచ్చాక ప్రస్తుతం హాస్టల్లో ఉంటున్నా. ఆరు నెలల క్రితం బర్త్డే గిఫ్ట్గా బెర్రీ(డాగ్) నా దగ్గరకు వచ్చాడు. మొదటి మూడు నెలలు వరుసగా వ్యాక్సిన్ వేయించాను. తర్వాత వన్ ఇయర్కి ఒకటి. డాగ్స్కి జనరల్గా వామ్స్ వస్తుంటాయి. సిరప్, పౌడర్ వంటి మందులతో ట్రీట్మెంట్ ఉంటుంది. ఆఫీస్ నుంచి వచ్చాక బెర్రీతో కాసేపు ఆడుకుంటే ఒత్తిడి మొత్తం పోతుంది. వ్యాక్సిన్కి వెళ్లినప్పుడు డాక్టర్.. ఫుడ్, మెడికల్, బాతింగ్ ఎలా ఉండాలో చెప్పారు. పెట్స్కు కిడ్స్లా కేర్తో పాటు వ్యాక్సిన్ కూడా తప్పనిసరి. - స్వాతి, పెట్ లవర్ పెంపుడు శునకాలకు ఉచిత వ్యాక్సిన్ నేడు ‘ప్రపంచ జునోసిస్ డే’ను పురస్కరించుకుని సోమవారం నారాయణగూడలోని ‘వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి’లో పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాధి నిరోధక టీకా వేయనున్నారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాక్సిన్ వేయనున్నట్టు ఆసుపత్రి డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ భగవాన్ రెడ్డి తెలిపారు. పంపుడు శునకాల యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కూకట్పల్లిలో.. కూకట్పల్లిలో బీజేపీ కార్యాలయం సమీపంలోని వెటర్నరీ ఆసుపత్రిలో నేడు కుక్కలకు, ఇతర పెంపుడు జంతువులకు ఉచిత రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్టు డాక్టర్ కృష్ణకుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాలు వేస్తామని, ఈ అవకాశాన్ని పెట్ లవర్స్ వినియోగించుకోవాలన్నారు. కుత్బుల్లాపూర్లో.. కుత్బుల్లాపూర్ పశు వైద్యశాలలో నేడు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేయనున్నట్టు డాక్టర్ అనిల్ మురారి తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టీకాలు వేస్తామన్నారు. వివరాలకు 99127 89456 నెంబర్లో సంప్రదించవచ్చు. మలక్పేటలో.. మలక్పేట పశు వైద్యశాలలో నేడు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేయనున్నట్టు డాక్టర్ ఎం.సబిత తెలిపారు. మలక్పేట గంజ్ ఆవరణలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కన ఉన్న పశు వైద్యశాలలో తిరుమల మెడికల్ హాల్ నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. వివరాలకు 89789 01658 నెంబర్లో సంప్రదించవచ్చు. చాంద్రాయణగుట్టలో చాంద్రాయణగుట్ట పూల్బాగ్లోని నల్లవాగు హిందూ శ్మశానవాటిక ఎదురుగా గల పశు వైద్యశాలలో కుక్కలు, మేకలకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇక్కడ సోమవారం నుంచి శనివారం వరకు వైద్యం అందిస్తారు. జంతువుల యజమానులు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. -
ముందే సినిమా చూపిస్త మామా..
బొమ్మను చేసి.. ప్రాణం పోసి ఎందరికో ప్రాణప్రదంగా మార్చిన రోజుల నుంచి ప్రాణమున్న మనిషి నుంచే బొమ్మను పుట్టించే రోజులొచ్చాయి. వ్యక్తి కదలికల నుంచి యానిమేషన్ క్యారెక్టర్ని క్రియేట్ చేయడమనే ప్రక్రియ కొత్త పుంతలు తొక్కుతూ.. సినిమాకి ముందు ‘నమూనా’ సినిమాని పుట్టించడానికి సిద్ధమైంది. మరోవైపు మార్కర్లెస్ మోషన్ క్యాప్చరింగ్తో సిటీ కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టింది. - తీయబోయే చిత్రాన్ని ముందే చూడొచ్చు - తెరకెక్కబోయే నటులకు ముందే డూప్లు - చిత్ర విచిత్రం.. మార్కర్లెస్ మోషన్ క్యాప్చరింగ్ మార్కర్లెస్లో మనమే ఫస్ట్ సాధారణంగా మోషన్ క్యాప్చరింగ్లో మార్కర్స్ వినియోగిస్తారు. వ్యక్తుల్ని చలింపజేసే కీళ్ల భాగాల్లో, బోన్స్ రొటేషన్ ఉన్న ప్రతి చోటా మార్కర్ పెట్టి వర్చువల్ ఫీల్డ్లో క్యారెక్టర్ని నిలబెట్టి.. కెమెరాతో ఆ సెన్సస్ని క్యాప్చర్ చేస్తారు. దీని కోసం స్పెషల్ సూట్ వేసుకుని శరీరంలో పలు చోట్ల మార్కర్స్ పెట్టుకుంటారు (ఆటల్లో కూడా దీనిని వాడుతున్నారు. ఉదాహరణకి క్రికెట్లో త్రో బౌలింగ్ వస్తుందంటే మోషన్ క్యాప్చర్స్ ద్వారానే పరీక్షిస్తారు) అయితే, ఈ మార్కర్స్, సూట్ ధరించాల్సిన అవసరం లేకుండానే కదలికల్ని క్యాప్చర్ చేసే వినూత్న ప్రక్రియను ఆసియాలోనే ప్రథమంగా నగరంలో అందుబాటులోకి తెచ్చింది క్రియేటివ్ మెంటర్స్. ‘మేం ఉపయోగించే టెక్నాలజీతో మార్కర్స్, సూట్ అవసరం లేకుండానే ఇన్స్టంట్గా మోషన్ క్యాప్చరింగ్ చేస్తాం. ఈ టెక్నాలజీని అమెరికన్ ఆర్మీ కోసం వినియోగిస్తారు. ఆసియాలోనే మార్కర్ లెస్ శైలి ఫస్ట్ టైమ్. దీని వల్ల సమయం ఆదా అవుతుంది. దాదాపు రూ.20 వేల ఖరీదుండే సూట్లు, అలాగే మార్కర్స్, ట్రాకర్స్ ఇవన్నీ కొనాల్సిన అవసరం లేదు’ అంటున్నారు మాదాపూర్లోని కావూరిహిల్స్లో ఉన్న క్రియేటివ్ మెంటర్స్ నిర్వాహకులు. ‘మోషన్ క్యాప్చరింగ్’ అనే సాంకేతిక అద్భుతం.. హాలీవుడ్ ‘అవతార్’, తమిళ సినిమా ‘కొచ్చాడియాన్’ తర్వాత క్రేజీగా మారిపోయింది. ఇప్పుడు సినిమాల్లో నటులకు మాత్రమే కాదు.. సినిమాకి కూడా డూప్ని సైతం సృష్టిస్తోంది. యానిమేషన్ ప్రక్రియ అనేది పేపర్ పెన్సిల్ నుంచి మొదలై.. గేమింగ్, సినిమా ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. దాని మీడియం మార్పు చేర్పులకు గురవుతూ సాఫ్ట్వేర్కి చేరుకుని 2డీ, 3డీ యానిమేషన్ సాఫ్ట్వేర్ సైతం అందుబాటులోకి వచ్చేశాయి. ఆ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం పరిచయమైంది ఈ మోషన్ క్యాప్చరింగ్. బొమ్మని చేసి దానికి నడకలు నేర్పి నటింపజేసే బదులు, నిజమైన నటుడి అభినయాన్ని కెమెరా ద్వారా క్యాప్చరింగ్ చేసి యానిమేటెడ్ క్యారెక్టర్గా యూజ్ చేసే ఈ ప్రక్రియ ఇప్పుడు సినిమాల ప్రీ విజువలైజేషన్కు సరికొత్త మార్గంగా మారింది. ‘నమూనా’ సినిమా.. స్కెచ్లు, బొమ్మల సహితంగా సినిమా స్టోరీ బోర్డ్ తయారు చేయడం రూపకర్తలకు అలవాటే. దీని ద్వారా తీయబోయే సినిమా మీద యూనిట్కు అవగాహన కల్పిస్తారు. ఈ స్టోరీబోర్డ్ పూర్తిగా మాన్యువల్. అయితే మోషన్ క్యాప్చరింగ్ ప్రక్రియ పుణ్యమాని ఇప్పుడు ఏకంగా ‘అడ్వాన్స్డ్ ప్రీ విజువలైజేషన్ మూవీ’ అందుబాటులోకి వచ్చేసింది. ఈ ప్రక్రియ ద్వారా తీసే చిత్రం మొత్తాన్ని ముందే కళ్లకు కట్టినట్టు విజువలైజ్ చేయవచ్చు. కథకు అనుగుణంగా నటులను వినియోగించి వారి కదలికల ద్వారా యానిమేటెడ్ క్యారెక్టర్స్ని సృష్టిస్తూ షూటింగ్ తరహాలోనే ఈ విజువలైజేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. సినిమా మొత్తం ‘ప్రీ విజువలైజ్’ చేయించుకుంటే డెరైక్టర్ సెట్స్కి కూడా వెళ్లక్కర్లేదు. దీని వల్ల ప్రొడ్యూసర్కి సరైన బడ్జెట్ అంచనా వీలవుతుంది. పెద్ద హీరోని, ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయాలన్నా.. కథ మీద నమ్మకం ఉన్న డెరైక్టర్, స్టోరీ రైటర్లు ఈ డూప్ మూవీ తయారు చేయించుకొంటున్నారు. సాంగ్స్ ఉండని ఈ డూప్ మూవీ సుమారు 90 నిమిషాల నిడివి మాత్రమే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ట్రాక్ కూడా కంపోజ్ చేస్తారు. సుమారు 45 రోజులు సమయం పడుతుంది. దీనికి కనీసం రూ.20 లక్షల దాకా ఖర్చవుతుందని యానిమేషన్ ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు. అయితే ఒక పెద్ద హీరో చిత్రం సగటు వ్యయం రూ.25 కోట్లు అనుకుంటే, ఈ ప్రీ విజువలైజేషన్ వల్ల ఆదా అయ్యే వేస్టేజ్తో పోల్చుకుంటే ఈ వ్యయం ఎక్కువేం కాదంటున్నారు నిపుణులు. మొత్తం సినిమా లేదా కొన్ని ప్రధానమైన యాక్షన్ సీన్స్ మాత్రమే తీయవచ్చు. బాహుబలి, రుద్రమదేవి వంటి చిత్రాలకు ఈ తరహాలోనే ప్రీ విజువలైజేషన్ చేసినట్టు సమాచారం. ‘నమూనా’ నటులకు డిమాండ్. పూర్తిస్థాయి మూవీ మేకింగ్, గేమింగ్ ఇండస్ట్రీ, విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీ, ప్రీ విజువలైజేషన్, మెడికల్ -స్పోర్స్ సైన్స్ ఫీల్డ్లో కూడా ఈ మోషన్ క్యాప్చరింగ్ ప్రక్రియ ఊపందుకుంటోంది. దాంతో దీని కోసం నటీనటుల అవసరం ఏర్పడుతోంది. అయితే యానిమేషన్ క్యారెక్టర్కు కొంతయినా వ్యక్తుల బాడీ లాంగ్వేజ్ నప్పాలి. అలాగే నటన కూడా వచ్చి ఉండాలి. ఇలా నటించేవాళ్లకి మంచి రెమ్యునరేషన్ కూడా అందుతోంది. మార్కర్లెస్తో మ్యాజిక్.. నగరంలోని సిట్ అండ్ మల్టీ మీడియాతో అసోసియేట్ అయి యానిమేషన్ రంగంలో గేమింగ్ డిజైన్ చేస్తున్నాం. జేఎన్ఏ ఎఫ్ఎల్ సర్టిఫికేషన్తో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. మోషన్ క్యాప్చరింగ్ ప్రక్రియ ఇప్పటికీ ఇండియాలో కేవలం నాలుగైదు సంస్థలు మాత్రమే అందిస్తున్నాయి. అయితే మేం అందిస్తున్న మార్కర్ లెస్ మోషన్ క్యాప్చరింగ్ మాత్రం ఆసియాలో మరెక్కడా లేదు. మూవీ ప్రీ విజువలైజేషన్కి ఇది బాగా ఉపకరిస్తుంది. అంతేకాదు దీని ద్వారా గేమ్స్, యానిమేషన్ కంటెంట్ను డొమెస్టిక్ మార్కెట్కి సప్లయ్ చేయవచ్చు. - కె. సురేష్రెడ్డి. క్రియేటివ్ మెంటర్స్ -
గుబాళించే కాలం..
అత్తరు పరిమళం మనస్సుకు ఎంతో హాయినిస్తుంది. మల్లెపూలు, గులాబీరేకులు, గంధపు చెక్కలు, మొగలిపువ్వుల ఆవిరే అసలైన అత్తర్. ఎంతకాలం ఎక్కువగా భద్రపరిస్తే అంత సువాసనను వెదజల్లుతుంది. నగరజీవన శైలిలో దీని ప్రాధాన్యం మరింత పెరిగింది. విశాఖ-కల్చరల్ : సెంట్ ఎంత ఎక్కువ కాలం భద్రపరిస్తే అంత సువాసనను వెదజల్లుతుంది. నకిలీలదైతే కొంతకాలంలోనే వాసనలో వ్యత్యాసాన్ని గమనించవచ్చు. వీటిని తోలుతో చేసిన కుప్పిలలో ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి రవాణా చేస్తారు. పురాతన కాలంలో కొంతమంది తమకు నచ్చిన అత్తరులను తయారు చేయించి, పెద్ద డ్రమ్ముల్లో నిల్వ ఉంచుకునేవారు. అవి చాలాకాలం పాటు నిల్వ ఉండేవి. వీడని పరిమళం జన్నతుల్ పిర్దోస్, మజ్మ, షాజహాన్, తమన్నా, నాయట్, హౌప్, బఖూర్, మొఖల్లత్, ఇత్రేఫిల్, షమామతుల్, అంబర్, హీన, జాఫ్రాన్, మిష్క్, దహనుల్ఊద్, రోజ్, కచ్చికలి అత్తరుల్లో ముఖ్యమైనవి. కృత్రిమంగా తయారు చేసేవి ఎన్ని ఉన్నా...పెట్టిన మరుక్షణమే వాసన పోయేవి ఉన్నాయి. అసలుసిసలైన అత్తరు అంటే ఒక్కసారి పూసుకున్నాక రెండు, మూడుసార్లు దుస్తులు ఉతికినా దాని పరిమిళం మాత్రం పోదు. రూ.10 నుంచి...రూ.వేల వరకూ.. సిటీలో డాబాగార్డెన్స్, జగదాంబ కూడలి, వన్ఏరియా, ద్వారకానగర్, పూర్ణామార్కెట్, కురుపాం మార్కెట్, మరికొన్ని కార్పొరేట్ షాపింగ్మాల్స్లోనూ లభిస్తున్నాయి. అత్తరుకే ప్రత్యేకమైన దుకాణాల్లో లభ్యమయ్యేవి మరింత భిన్నం. అరబ్బులు ఇష్టపడే దహనల్ఊద్ పది మి.లి.లకు రూ.2వేల నుంచి రూ.6వేల వరకు ఉన్నాయి. షమామతుర్ అంబర్, హీన వంటి 10మి.లి.ధర రూ.600, కచ్చికలి పదిగ్రాములు రూ.80, జన్నతుల్ ఫిర్దౌస్ పదిగ్రాముల రూ.120 ఉన్నాయి. సీజన్ వారీగా... సిటీలో సీజనల్వారీగా సెంట్స్ను వినియోగిస్తున్నారు. సాధారణంగా అన్ని రకాల అత్తరులను నిత్యం వినియోగించట్లేదు. వాడే పద్ధతి తెలియక సమయం కాని సమయంలో ఒంటికి పూసినా, వాసన పీల్చినా అనర్థాలు కలిగే అవకాశం ఉండడంతో సీజన్ బట్టి సెంట్ వెరైటీని వినియోగించడం పరిపాటి. వేసవిలో ఖస్, ఇత్రేఫిల్ చాలా మంచివి. ఇవి రెండు చల్లదనాన్ని ఇస్తాయి. ఇత్రేఫల్ మట్టివాసనను ఇస్తూ చల్లదనాన్ని కలిగిస్తుంది. వర్షాకాలం, చలిలో షమామతుల్ అంబర్, హీన, జాఫ్రాన్, మిష్క్, దహనుల్ఊద్ వంటివి వాడాలి. ఇవి వెచ్చదనాన్ని ఇస్తాయి. దుబాయ్ నుంచి దిగుమతి... సీజన్ బట్టి రకరకాల సెంట్స్ దుబాయి, ఖత్తర్ వంటి దేశాల నుంచి నగరానికి దిగుమతి అవుతాయి. మనదేశంలో ఉత్తరప్రదేశ్లోని ఖన్నోజ్ ప్రాంతం నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నట్టు హోల్సేల్ వ్యాపారి మహ్మద్ ఇమ్రాన్ తెలిపారు. సాధారణంగా వాడే సెంట్స్ ఇతర దేశాలతోపాటు బెంగళూరు, కోల్కతా, చెన్నై, హైదరాబాద్ నగరాల నుంచి విశాఖకు వస్తున్నాయి.. అల్యూమినియం డాబ్బాలను రవాణాకు వినియోగిస్తున్నారు. గాజుపాత్రలు మంచివే అయినా, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడం కష్టంతో కూడుకున్న పని. అందుకే అల్యూమినియం పాత్రల్లో తీసుకు వచ్చి ఇక్కడ గాజుపాత్రల్లో, సీసాల్లో నింపి బోటలింగ్ చేస్తున్నారు. 40 ఏళ్ల నుంచి ఇదే వ్యాపారం మాది షాదీనగర్. మా బాబా సమయంలో ఇక్కడకు వచ్చేశా. 40 ఏళ్ల నుంచి ఇత్తరు వ్యాపారం చేస్తున్నాం. ముఖ్యంగా సూఫిబ్రాండ్ అత్తరులను ఎక్కువగా విక్రయిస్తున్నాం. దుబాయ్, ఖత్తరు, మలేసియా, సింగపూర్, విదేశాల నుంచి హోల్సేల్గా తీసుకు వస్తుంటాం. రంజన్ మాసంలో ముస్లింలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ నుంచి ఐదు జిల్లాలకు హోల్సేల్గా విక్రయిస్తుంటాం. - మహ్మద్ తుగ్లాక్ ఇమ్రాన్ఖాన్, జగదాంబ జంక్షన్ -
సత్కారం
బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో అధ్యాపకులుగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నవారిని గురువారం ఘనంగా కళాశాలలో సన్మానించారు. లెక్చరర్లు ఉమా జోసెఫ్, అలైనా జ్యోతి, శర్మిలా కన్ను, కార్తికేయ ఇందులో ఉన్నారు. అధ్యాపకుల అంకితభావం, అత్యున్నత ప్రమాణాలతో తమ కాలేజీ దేశంలో అత్యుత్తమంగా నిలిచిందని ప్రిన్సిపాల్ డాక్టర్ క్రిస్టినా ఫెర్నాండెజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. - సోమాజిగూడ -
‘సిల్క్’ షోయగం
నగర ఫ్యాషన్ ప్రియుల కోసం విభిన్న వస్త్రాలతో ‘సిల్క్ ఆఫ్ ఇండియా’ వస్త్ర ప్రదర్శన గురువారం ప్రారంభమైంది. పట్టు, డిజైనరీ చీరలు, ఒక్క గ్రాము బంగారు ఆభరణాలతో శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను వర్ధమాన నటి శ్వేత జాదవ్ ప్రారంభించారు. ఇక్కడి డిజైనరీ చీరలు ఆకట్టుకున్నాయని ఆమె పేర్కొన్నారు. హస్త, చేనేత కళాకారుల ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ఆశిష్ గుప్తా తెలిపారు. ప్రదర్శన ఈనెల 6 వరకు కొనసాగుతుందన్నారు. - శ్రీనగర్కాలనీ -
ఫ్యాషన్ ‘ఉష’స్సు
ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్, ప్రథమ మహిళా పైలట్ ఉషా రఘునాథన్.. మరోమారు నగరానికి వచ్చారు. ఆమె తాజాగా డిజైన్ చేసిన దుస్తుల కలెక్షన్స్ను బంజారాహిల్స్ రోడ్నెం.1లోని సింఘానియాస్ బొటిక్లో గురువారం లాంచ్ చేశారు. ఇదే తన చివరి కలెక్షన్ అని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. అయితే, జీవితానికి ఏదీ చివరిదంటూ ఉండదని, తాను తొలుత పైలట్గా కెరీర్ ప్రారంభించి డిజైనర్ దాకా ఎన్నో రకాల ప్రొఫెషన్స్ను ఎంజాయ్ చేశానని చెప్పారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా పర్యటించడమే తన లక్ష్యమన్నారు. రేఖ, హేమమాలిని, జయాబచ్చన్, షబానా అజ్మీ... వంటి ప్రముఖులు ఇష్టపడే సంప్రదాయ వస్త్రశైలులు అందించిన ఉషా రఘనాథన్ తమ బొటిక్లో కలెక్షన్ లాంచ్ చేయడం ఆనందదాయకమని, బ్లౌజ్లు, పట్టు చీరలు, సిల్క్-కాటన్ మిక్స్ చీరలు.. ఉష కలెక్షన్లో ఉన్నాయని షోరూమ్ నిర్వాహకులు తెలిపారు. - సాక్షి, లైఫ్స్టైల్ప్రతినిధి. -
డాక్టర్ కులశేఖర్ నిరుపేదల దైవం..
- ఉచితంగా వైద్యం.. - సగం ధరకే మందులు - సేవకు సలాం అంటున్న ప్రజలు వైద్యం.. ప్రస్తుత కాలంలో అత్యంత ఖరీదైన అంశం. జలుబుకు కూడా వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు కొందరు వైద్యులు. ఇక స్కానింగ్ వంటి అత్యవసర సేవలకైతే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అలాంటిది రోజువారి కూలీలు, నిరుపేదలు వైద్యం చేయించుకోవాలంటే సాధ్యం కాదు. ఇలాంటివారు స్తోమత లేక నాటువైద్యాన్ని ఆశ్రయిస్తారు, లేదా చిట్కా వైద్యంతో సరిపెట్టుకుంటున్నారు. లేదంటే దేవుడిపై భారం వేస్తారు. ఇలాంటివారికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ జి.ఎస్.కులశేఖర్. మరోవైపు తక్కుత ధరకు మందులు సైతం ఇస్తున్నారు. నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప ప్రాంతం.. బతుకుదెరువు కోసం వలస వచ్చిన కూలీల నివాసం. ఇక్కడివారికి రోగం వస్తే మందుల దుకాణాన్ని నమ్ముకుంటారు. లేదంటే ఏ ఆర్ఎంపీ వద్దకో వెళతారు. మందులు, కమీషన్ కోసం రాసే టెస్ట్లు వారిని బెంబేలెత్తిస్తాయి. అయినా రోగం తగ్గుతుందనే నమ్మకం మాత్రం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు డా. కులశేఖర్. పగలంతా ఈఎస్ఐలో డిప్యూటీ సివిల్ సర్జన్గా పనిచేసే ఈయన ఈ పేద ప్రజలకు ఆపద్భాంధవుడు. ఈయన ‘పీపుల్స్ హెల్త్ ఇనిషియేటివ్’ పేరుతో ఆరోగ్య పథకాన్ని రూపొందించారు. తెల్లకార్డు ఉన్నవారు రూ. 100 చెల్లించి సభ్యత్వం తీసుకుంటే మూడు నెలల పాటు ఉచిత వైద్య సేవలు పొందవచ్చు. ఇలా వచ్చిన డబ్బుతో నిధి ఏర్పాటు చేసి మందులపై 50 శాతం రాయితీ ఇస్తున్నారు. ‘వేరే చోటికి వెళ్లిన ప్రతిసారి 100 రూపాయలు ఇవ్వాల్సిందే. ఇక్కడ మాత్రం ఒక్కసారి ఇస్తే సరిపోతుంది. తక్కువ ధరకు మందులు ఇస్తున్నారు. బాగా చూస్తారు. మా పేదోళ్లకి ఇంతకంటే ఇంకేం కావాలి’ అంటోంది స్థానిక మహిళలు చంద్రావతి, లక్ష్మి. అంబులెన్స్ సేవలు కూడా.. ‘చిన్న పిల్లలకు జ్వరం వస్తే కనీసం ఆరు వందలు ఖర్చు పెట్టాలి. ఇది పేదలకు మోయలేని భారమే. ఆర్ఎంపీలు ఇష్టమొచ్చిన విధంగా ఫీజులు వసూలు చేయడం, సరైన వైద్యం అందించకపోవడం గమనించా. ఇలా కాకుండా ప్రజలందరికి తక్కువ ధరలో క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థ శ్రేయా ఫౌండేషన్తో కలిసి ఈ క్లినిక్ని ఏర్పాటు చేశా. డాక్టర్ వృత్తి నియమాల ప్రకారం పబ్లిసిటీ చేయరాదు. గతంలో ఇక్కడికి వచ్చిన వారు వేరేవారికి చెబుతున్నారు. రెగ్యులర్ విధులు ముగిశాక ఇక్కడ సేవలు అందిస్తున్నా. మాకు ఎలాంటి ఫండింగ్ లేదు. సభ్యత్వం కోసం పేషెంట్లు ఇచ్చిన డబ్బులతోనే తక్కువ ధరకు మందులు అందిస్తున్నాం. మరికొంత డబ్బు జమైతే అంబులెన్స్ సేవలు కూడా ఇస్తా’.. అని చెప్పారు డాక్టర్ కులశేఖర్. ఇలాంటి వారికి మరికొంత మంది వైద్యులు చేయి కలిపితే నిరుపేదల బతుకులు బాగుపడడం ఖాయమే. -
హలీం సలాం
అలా మొదలైంది.. ఆరో నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ తన సంస్థానంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పర్షియా నుంచి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చారు. రంజాన్ ఉపవాసదీక్ష విరమణకు వడ్డించే వంటకాల్లో ఓ ప్రత్యేక డిష్ గురించి పర్షియా ప్రతినిధులు ప్రస్తావించారు. వెంటనే నవాబు షాహీ దస్తర్ ఖానా (వంటగది) సిబ్బందిని పిలిపించి ఆ వంటకాన్ని సిద్ధం చేయించారు. అదే హలీమ్. అలా పర్షియా నుంచి పరిచయమైన హలీం హైదరాబాద్ బిర్యానీలాగే ఇక్కడి వంటకమైంది. ఇరాన్, ఇరాక్, తదితర అరబ్ దేశాల్లో తయారయ్యే హలీంలో గోధుమలు, మాంసం, పప్పు, ఉప్పు, నూనె మాత్రమే వినియోగిస్తారు. కానీ హైదరాబాద్ హలీంకు మొదట నెయ్యి తోడైంది. ఆ తరవాత కారం, షాజీరా, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి జతకట్టాయి. ఆ తరువాత అనేక రకాల మార్పులతో మరింత గొప్ప రుచిని సంతరించుకుంది. ఏడో నిజాం నాటికి హలీంకు అనూహ్యమైన డిమాండ్ వచ్చింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్, సింగపూర్, ఇండోనేషియా, యెమన్, అరబ్ ఎమిరేట్స్, అమెరికా, బ్రిటన్లలో లొట్టలేసుకుంటూ ఆరగించే వంటకం హైదరాబాద్ హలీం.. ఐదు దశాబ్దాల క్రితమే.. నవాబ్ ఉస్మాన్ ఆలీఖాన్ హయాంలో బ్రహ్మాండమైన ఆదరణ పొందినప్పటికీ హలీం అమ్మకాలు మాత్రం ఐదు దశాబ్దాల క్రితమే మొదలయ్యాయి. ఇరాన్ నుంచి నగరానికి వచ్చిన ఓ కుటుంబం పాతబస్తీలోని చార్మినార్ వద్ద మదీనా సర్కిల్లో ‘మదీనా’ పేరుతో హోటల్ పెట్టి హలీం విక్రయాలను ప్రారంభించింది. భిన్న‘రుచుల’ పసందు.. తొలినాళ్లలో నాన్వెజ్తో తయారైన హలీం ఇప్పుడు వెజిటేరియన్గా కూడా లభ్యమవుతోంది. నాన్వెజ్లో మటన్, చికెన్, బీఫ్, ఫిష్, ఈమూ హలీంలు ప్రత్యేకం. ఇందులో సైతం దక్కని, ఇరానీ, అరేబియన్, జఫ్రానీ, యమనీ విధానాల్లో తయారు చేస్తుంటారు. కొవ్వు తక్కువగా ఉండే ఈమూ హలీం తయారీ రెండేళ్ల క్రితం ప్రారంభమైంది. వెజిటేరియన్లో కూడా అనేక రకాలుగా హలీం హోటల్స్లో దొరుకుతోంది. ‘పిస్తా’కు ప్రత్యేక గుర్తింపు హలీం తయారీలో నాణ్యత, ప్రమాణాలు పాటిస్తున్నందుకు హైదరాబాద్ పిస్తా హౌస్కు జాతీయ స్థాయిలో జియోగ్రాఫికల్ ట్యాగ్ లభించింది. పాతబస్తీలోని శాలిబండలో 1997లో ప్రారంభమైన పిస్తా హౌస్ అనతి కాలంలో దేశ విదేశాలకు విస్తరించి ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పటికే ఐఎస్ఐ మార్కుతో పాటు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో 514 అవార్డులు లభించాయి. ప్రతిరోజు సుమారు ఐదు క్వింటాళ్ల వరకు హలీం తయారు చేసి హైదరాబాద్తో పాటు దేశంలోని వివిధ నగరాల్లో 400కు పైగా ఔట్లెట్ల ద్వారా విక్రయిస్తున్నారు. అమెరికాలోని డల్లాస్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, తదితర ప్రాంతాల్లో ‘పిస్తా’కు ఏడు బ్రాంచీలు ఉన్నాయి. తయారీ ప్రత్యేకం.. ఈ ప్రత్యేక వంటకం తయారీ కూడా ప్రత్యేకమే. హలీం తయారీకి కనీసం 9 గంటల సమయం పడుతోంది. తెల్లవారు జామున 4 గంటలకే తయారీ విధానం ప్రారంభమవుతుంది. హలీం వంటకంలో మటన్, గోధుమలు, అన్ని పప్పులు, బాస్మతి బియ్యం, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమర్చి, యాలకులు, దాల్చినచెక్క, మిరియాలు, కొత్తిమీర, నూనె, డ్రైఫూట్స్ తదితర వాటిని వినియోగిస్తారు. ముందుగా గిన్నెలో మాంసం, నీటిని కలిపి బాగా ఉడికిస్తారు. అనంతరం గోధుమలు, బాసుమతి బియ్యం, పప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాల దినుసులు, పచ్చిమిర్చి బాగా ఉడికించి మెత్తగా దంచుతారు. అనంతరం సమపాళ్లలో నెయ్యి కలుపుతారు. ఫిష్ హలీంలో గోధుమలు, మసాలాలు కలిపి ఉడికించి చివరన చేప ముక్కలను కలిపి తయారు చేస్తారు. రుచుల్లో రకాలు.. దక్కనీ హలీం ఇక్కడి ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా తయారు చేస్తారు. ఇందులో గోధుమలు కంటే మాంసం మోతాదు రెండింతలు అధికంగా ఉంటుంది. నెయ్యితో పాటు ఇతర దినుసులను వినియోగిస్తారు. ఇరానీ హలీం ఇరానీ హలీం ఘాటుగా ఉండదు. డ్రై ఫూట్స్తో పాటు గోధుమలు, మినపప్పు, తక్కువ మోతాదులో మసాల దినుసులు వినియోగిస్తారు. వెజిటేరియన్ హలీం శాకాహారుల కోసం ప్రత్యేకంగా వెజిటేరియన్ హలీంలను కూడా కొన్ని హోటల్స్ అందిస్తున్నాయి. గోధుమ రవ్వతో పాటు మసాల దినుసులు కలిపి ఈ వంటకం చేస్తారు. దీనిలో బీన్స, క్యారెట్, కీరా, పచ్చి బటానీ కలిపి ఉడికిస్తారు. ఘాటుగా ఉండకుండా పలు హోటల్స్లో పెరుగు, పాలు కూడా కలుపుతారు. ప్యారడైజ్ స్పెషల్.. హైదరాబాద్ బిర్యానికి ప్యారడైజ్ హోటల్కు ఎంత పేరుందో..స్వచ్ఛమైన హలీంకు సైతం ఇక్కడ గొప్ప ఆదరణ ఉంది. ‘హలీం తయారీకి ఉపయోగించే నాణ్యమైన మాంసం, గోధుమలు, స్వచ్ఛమైన నెయ్యి, దినుసులు అన్నీ హైదరాబాదీవే’అని చెబుతారు హోటల్ మేనేజర్ అహ్మద్. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఇక్కడ హలీం ప్రియుల సందడి మొదలవుతుంది. 60 ఏళ్ల క్రితం ప్రారంభమైన ప్యారడైజ్ హోటల్లో 28 ఏళ్ల నుంచి హలీంను రుచి చూపిస్తున్నారు. ప్రపంచానికి రుచి చూ‘పిస్తా’.. ప్రపంచ వ్యాప్తంగా హలీం విక్రయాలను విస్తరించాలని నిర్ణయించాం. ఇందుకు ‘టార్గెట్- 2020’గా పెట్టుకున్నాం. ఇప్పటికే దేశంలోని మెట్రో నగరాలతోపాటు వివిధ దేశాలకు ‘హైదరాబాద్ పిస్తా హలీమ్’ను ఎగుమతి చేస్తున్నాం. అమెరికాలో ప్రత్యేకంగా హలీం తయారు చేస్తున్నాం. వచ్చే ఏడాది స్విడ్జర్లాండ్, జెనీవా నగరాల్లో కేంద్రాలను ప్రారంభిస్తాం. వెబ్సైట్ ద్వారా కూడా ఆర్డర్ తీసుకొని పంపిస్తున్నాం. - మహ్మద్ అబ్దుల్ మాజీద్, పిస్తాహౌస్ యాజమాని ధరలు ఇలా.. మటన్ హలీం రూ. 90 నుంచి 170 వరకు, చికెన్ రూ. 70 నుంచి 90 వరకు, వెజిటేరియన్ హలీం రూ.70 నుంచి రూ.90 వరకు లభిస్తోంది. వీటిలో సింగిల్, ప్లేట్, స్పెషల్, ఫ్యామిలీ, జంబో ప్యాక్ ధరలు వేర్వేర్వుగా ఉంటాయి. -
వండర్ బుక్ లో సాహస వీరుడు
హిమాయత్నగర్: ఒక కర్ర ముక్క తగిలితేనే ధారగా రక్తం కారుతుండటం మనం చూస్తేనే ఉంటాం. అలాంటిది ఓ యువకుడు పదునైన 5 అంగుళాల మేకును ముక్కులోకి దింపుకొంటే... పైగా దానిపై సుత్తితో కొడితే.. ఆలోచిస్తేనే ఎంత భయంకరంగా ఉంటుంది. అక్కడితో ఆగకుండా గోడలకు రంధ్రాలు చేసే డ్రిల్లింగ్ మిషన్తో అదే ముక్కులో డ్రిలింగ్ చేసుకుంటే... ఇంతకీ ఈ సాహసానికి పూనుకున్నది ఎవరనుకుంటున్నారా ఆ యువకుడు నల్గొండ జిల్లా అడ్డగూడూరుకు చెందిన క్రాంతి కుమార్. ప్రపంచంలోనే ఇలాంటి కఠినమైన సాహసాలు చేసేవారిలో ఇతడు మూడో స్థానంలో ఉన్నాడు. తన సాహసాలతో క్రాంతి కుమార్ వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సులో కూడా చోటు దక్కించుకున్నాడు. శుక్రవారం హిమాయత్నగర్ మీడియా సెంటర్లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ దక్షిణ భారత సమన్వయ కర్త బింగి నరేందర్ గౌడ్, తెలంగాణ, ఏపీ సమన్వయ కర్త గుర్రం స్వర్ణశ్రీ తదితరులు, విలేకరుల ముందు ఈ ప్రదర్శన చేసి అందర్నీ అబ్బుర పరిచాడు. క్రాంతి కుమార్ ప్రతిభను గుర్తించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు మెమొంటో, గోల్డ్ మెడల్ను బహూకరించారు. ఈ కార్యక్రమానికి లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ డెరైక్టర్ డాక్టర్ కోమట్రెడ్డి గోపాల్రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి క్రాంతికుమార్ సాహసాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా బింగి నరేందర్ గౌడ్ మాట్లాడుతూ అరుదుగా కనిపించే ఇలాంటి సాహసవంతులను ప్రభుత్వం ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి. రమణాచారి హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. కాగా సాహస విన్యాసాన్ని ప్రదర్శించిన యువకుడు క్రాంతికుమార్ రోజు వారీ కూలీగా వాల్ పెయింటింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. -
సర్కారు బడుల్లో..ఇంగ్లిష్ విద్య
♦ మంత్రి హరీష్రావు ♦ ప్రభుత్వ స్కూళ్లకు ‘రోటరీ’ బెంచీల పంపిణీ మాదాపూర్: ప్రభుత్వం సర్కారుబడుల్లో ఇంగ్లిషు మాధ్యమం ప్రవేశపెట్టేందుకు యోచిస్తోందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీష్రావు పేర్కొన్నారు. రోటరీ ఫౌండేషన్ఆధ్వర్యంలో గురువారం 145 ప్రభుత్వ పాఠశాలకు 7,593 డ్యూయల్ డెస్క్లు పంపిణీ చేశారు. మాదాపూర్లోని హైటెక్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి హరీష్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యలో నాణ్యత చాలా ముఖ్యమని, బోధనతో పాటు పాఠశాలల్లో అన్ని వసతులను కల్పించాలన్నారు. జూలై 3 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రంలో ‘హరితహారం’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. ఇందులో ప్రతి విద్యార్థి 10 మొక్కలను నాటాలని సూచించారు. పోలియో నిర్మూలనకు రోటరీ ఫౌండేషన్ కృషి అభినందనీయమని పేర్కొన్నారు. రోటరీ ఇంటర్నేషనల్ డెరైక్టర్ మనోజ్ దేశాయ్ మాట్లాడుతూ.. త్వరలో విన్స్ పథకం ప్రవేశపెడుతున్నామని, ఇందులో పదేళ్లలో 10 వేల టాయిలెట్ల నిర్మాణం చేపడతామన్నారు. కాగా, కార్యక్రమం జరుగుతుండగా వీడియో క్రేన్ ప్రమాదవశాత్తు ఊడిపోయి టేబుల్పై పడి పక్కనే ఉన్న విద్యార్థినికి తగిలింది. దీంతో బాలికకు స్వల్ప గాయమైంది. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, రోటరీ ఫౌండేషన్ కౌన్సిలర్ మర్రి రవీంద్రారెడ్డి,సేవ్ అవర్ స్కూల్స్ చైర్మన్ రవి వడ్లమాని, ఎం.వి. ఫౌండేషన్ శాంతాసిన్హా తదితరులు పాల్గొన్నారు. -
చిహ్నాల వనం
ఏదైనా సంస్థ ప్రజలకు చిరకాలం గుర్తుండాలంటే అందమైన ‘లోగో’ అవసరం. ఆ లోగోలోనే ఆ సంస్థ విధివిధానాలు కనిపిస్తాయి. ఇలాంటి లోగోలను తీర్చిదిద్దుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రామంతాపూర్ శారదానగర్కు చెందిన వనం జ్ఞానేశ్వర్. ఎన్నో ప్రతిష్టాత్మకమైన సంస్థలకు చిహ్నాలను రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. - రామంతాపూర్ - లోగోల రూపశిల్పి జ్ఞానేశ్వర్ - జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు చిత్రకళపై జ్ఞానేశ్వర్కు చిన్నతనం నుంచి ఉన్న మక్కువే అతడిని కళాకారుడిగా తీర్చిదిద్దింది. బాల్యం నుంచే వివిధ లోగోలను రూపొందించి మురిసిపోయేవాడు. సైన్ బోర్డు ఆర్టిస్ట్ జీవితం ప్రారంభించిన జ్ఞానేశ్వర్ ఓ ప్రముఖ ప్రకటనల కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నారు. తన ప్రతిభకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అత్యాధునిక పద్ధతుల్లో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు లోగోలను తయారు చేస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లోగోలో స్పష్టత లేదని చెప్పడంతో సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్ భూషణ్తో కలిసి అందులో మార్పులు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆదేశంతో ఆంధ్రప్రదేశ్ స్వర్ణోత్సవ లోగోను రూపొందించారు. - నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైల్, తెలంగాణ ఆర్టీసీ లోగోలను తయారుచేసి ముఖ్యమంత్రి కేసీఆర్, రవాణశాఖ మంత్రి మహేందర్రెడ్డి ప్రశంసలు అందుకున్నారు. - జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక సంస్థలకు ప్రచార సామగ్రి జ్ఞాపికలను, లోగోలను రూపొందించి శభాష్ అనిపించుకున్నారు. - అమెరికాలోని అట్లాంటాలో విజు చిలువేరు ఆధ్వర్యంలో నడుస్తున్న ‘గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ లోగోను తయారు చేశారు. ఇంకా.. - ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో మాధవ్ కటికనేని ఆధ్వర్యంలోని ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరానికి పోస్టర్లు, జ్ఞాపికలు.. - మెల్బోర్న్లో నూకల వెంకటరెడ్డి నిర్వహిస్తున్న మెల్బోర్న్ తెలంగాణ ఫోరం లోగోలు, ప్రచార సామగ్రి.. - బ్రిస్బేన్ తెలంగాణ ఫోరం కోసం లోగోలు ప్రచార సామాగ్రిని రూపొందించారు. - నూతనంగా ఏర్పడిన తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ లోగోను రూపకర్త కూడా జ్ఞానేశ్వరే. ఆశయం తెలంగాణ రాష్ట్రంలో లోగోలను రూపొందించే విధంగా పలువురు యువతీయువకులకు శిక్షణ ఇచ్చి వారిని మంచి ఆర్టిస్ట్లుగా తీర్చిదిద్దడమే తన ఆశయమని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అభినందనలు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) లోగోలో బంగారు వర్ణంతో కాకతీయ ద్వారం, లోగో మధ్యలో తెలంగాణ పల్లెలను కళ్లకు కట్టే విధంగా ఉన్న పచ్చిక, నగర సౌందర్యాన్ని తెలిపే చార్మినార్ను కలిపి లోగోను తయారుచేశారు. ఈ లోగోను చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ జ్ఞానేశ్వర్ను ప్రత్యేకంగా అభినందించారు. -
సిటీలో సెన్సేషనల్ మిసైల్.. లెట్స్ మూవ్
- కిక్ బాక్సింగ్కు మహిళలు ఫిదా - ‘గిమ్మీ ఫైవ్’ అంటూ జిమ్స్కు పయనం - క్రేజీ వర్కవుట్స్తో ఉత్తేజం నగరవాసులకు ఆరోగ్యపరమైన సూత్రాలను ఇప్పుడు బాగా వంటబట్టించుకుంటున్నారు. ‘వినదగు నెవ్వరు చెప్పిన’ అన్నట్టు.. ఇలాంటివి ఎవరు చెప్పినా ఆసక్తిగా పాటిస్తున్నారు. చెప్పేది మిస్ ఇండియా అయినా మిషెల్ ఒబామా అయినా.. ‘ఫిట్నెస్’ అంటే సిటీ మహిళలు సై అంటున్నారు. అలాగే ‘లెట్స్ మూవ్’ అంటూ మిషెల్ సంధించిన మిసైల్ లాంటి పంచ్లకు ఫిదా అయిపోయి కిక్స్తో రఫ్ఫాడించేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రేజీగా మారిన వర్కవుట్ కిక్ బాక్సింగ్ విశేషాలవి.. గత నెలలో అమెరికా దేశపు ప్రధమ మహిళ మిషెల్ ఒబామా ఒక వర్కవుట్ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. స్వల్ప కాలంలోనే కోటి మందికి పైగా వీక్షకుల్ని సంపాదించిన ఆ వీడియోలో తన వర్కవుట్స్ని ఆమె పరిచయం చేశారు. మిషెల్ చేసిన 5 ఎక్సర్సైజ్ల్లో.. జంపింగ్ రోప్, మెడిసిన్ బాల్తో అబ్డామినల్ క్రంచెస్, బెంచ్ స్క్వాట్స్, డంబెల్ ప్రెసెస్, బాక్సింగ్.. ఉన్నాయి. కేవలం రెండు నిమిషాలు మించి లేని ఈ క్లిప్లో మిషెల్తో పాటు ఆమె ఫ్యామిలీ ట్రైనర్ కార్నెల్ మెకెల్లన్ కూడా కనిపిస్తారు. స్క్వాట్స్, క్రంచెస్ అయిపోయాక మిషెల్ బ్లూ బాక్సింగ్ గ్లవ్స్ ధరించి కిక్స్ మొదలుపెట్టారు. ఆమె ఇందులో ఒక టు-పంచ్ కాంబోను చూపించి ఆ తర్వాత గిర్రున తిరుగుతూ బ్యాగ్పై ఓ రౌండ్ హౌజ్ కిక్ ఇచ్చారు. మిగతావి ఎలా ఉన్నా... ఆమె పంచ్ బ్యాగ్పై పంజా విసురుతూ ఇచ్చిన రౌండ్ హౌజ్ కిక్స్..ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మిషెల్ వీడియో నగర మహిళల్లో కిక్ బాక్సింగ్ పట్ల అమాంతం క్రేజ్ పెంచేసింది. మరెందరికో ‘కిక్’.. తను ఏం తిన్నా తనను ఫిట్గా ఉంచే శక్తి కిక్ బాక్సింగ్కి ఉన్నట్టు గ్రహించానని టాలీవుడ్ సినీనటి రకుల్ ప్రీత్సింగ్ అంటోంది. ఫుడ్ డబుల్ అయినప్పుడు శాండ్బాగ్స్కి కిక్స్ ఇస్తూ రెట్టింపు సమయం గడుపుతానని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మిషెల్ ఒబామా అప్లోడ్ చేసిన ‘లెట్స్మూవ్’ వీడియో మహిళల్ని ఎక్సర్సైజ్ల వైపు మళ్లించేలా స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు సిటీ సోషలైట్ సుశీలా బొకాడియా. తాను రోజూ 2 గంటల పాటు వర్కవుట్ చేస్తానని, తన వర్కవుట్లో ఇప్పుడు కిక్ బాక్సింగ్ ప్రధానమైన భాగమని చెప్పారు. యోగా ట్రైనర్గా రోప్ యోగా వంటి వెరైటీ శైలుల్ని పరిచయం చేసిన రినా హిందోచా కూడా తాను ఇటీవలే కిక్ బాక్సింగ్ను సాధన చేస్తున్నానన్నారు. ఇది మహిళల్ని శక్తివంతం చేయడం మాత్రమే కాకుండా ఆత్మరక్షణకు కూడా ఉపకరిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. మిక్స్ చేస్తే మస్తు మస్తే.. చూడ్డానికి కష్టంగా అనిపించినా ఈ కిక్స్, పంచ్లు తేలిగ్గా చేయగలిగినవేనని జరీర్ చెప్పారు. ఇది మోకాలు, లోయర్ బ్యాక్లపై తక్కువ భారాన్ని వేసే వ్యాయామం. ఎప్పటికప్పుడు ఆసక్తిని పెంచుకునేందుకు వీలుగా దీనిని విభిన్న మార్గాల్లో చేయవచ్చు. ఏరోబిక్స్, వెయిట్ ట్రైనింగ్ను కూడా జత కలిపి చేయడం అలాంటి ఒక వైవిధ్యమార్గం. అయితే, కొత్తగా సాధన చేసేవారు తప్పనిసరిగా మంచి కార్డియో కిక్ బాక్సింగ్ ట్రైనర్ను ఎంచుకోవాలి. కొంత కాలం పాటు ట్రైనర్ శిక్షణలో కొనసాగి పరిణితి సాధించాక ఒక పంచ్ బ్యాగ్ను మాత్రం ఏర్పాటు చేసుకుని స్వయంగా సాధన కొనసాగించవచ్చు. ఫటాఫట్.. బెని‘ఫిట్’ ఒక క్రీడగా చాలా మంది అభిమానించే బాక్సింగ్ను ఆరోగ్య సాధనంగా మార్చడం ద్వారా చక్కని ఫిట్- వర్కవుట్గా మార్చవచ్చు. ఇపుడు జిమ్లు, ఫిట్నెస్ సెంటర్లలో దీన్ని ‘కార్డియో కిక్ బాక్సింగ్’గా వ్యవహరిస్తున్నారు. కరాటే కిక్లు, బ్లాక్స్ పంచ్లు వంటివి సంప్రదాయ ఎరోబిక్స్తో మిళితం చేసిన ఫిట్నెస్ ప్రోగ్రామ్.. ఈ కార్డియో కిక్ బాక్సింగ్. కరాటే, బాక్సింగ్ను మేళవించిన ఏరోబిక్ వ్యాయామ శైలి ఇది. బాడీ బ్యాలెన్సింగ్కి ఉపకరిస్తుంది. దీని ద్వారా ప్రారంభంలో గంటకి 400 నుంచి 500 క్యాలరీలు, రెగ్యులర్గా చేసేవారికి 800-900 క్యాలరీల వరకూ ఖర్చవుతాయి. ఇది ఫ్యాట్ని కరిగించే అత్యుత్తమ సాధనగా నగరానికి చెందిన ఫిట్నెస్ గురు జరీర్ పటేల్ చెబుతున్నారు. ఈ వర్కవుట్ కదలికల్లో చురుకుదనాన్ని పెంచుతుంది. పొట్ట భాగాన్ని సున్నితంగా బిగించి కిక్స్, పంచ్లు ఇవ్వడం ద్వారా అబ్డామినల్ మజిల్ బాగా పటిష్టమవుతుంది. అప్పర్ కట్, జాబ్, ఎల్బోహుక్, స్నాచ్, రివర్స్కిక్, రౌండ్ కిక్.. నేర్చుకుంటే స్వీయ రక్షణకూ ఉపకరిస్తుంది. లెట్స్ మూవ్.. చిన్నారులు బయటకు వెళ్లాలి, యాక్టివ్గా మారాలి అనే ఉద్దేశంతో అమెరికా ఫస్ట్ లేడీ ప్రారంభించిన ‘లెట్స్ మూవ్’ క్యాంపెయిన్లో భాగంగా ఓ వీడియోను మిషెల్ అప్లోడ్ చేశారు. దీనిలోనే ఆమె ప్రముఖులను, సాధారణ ప్రజలను ‘గిమ్మీ ఫైవ్’ అంటూ కోరుతున్నారు. అంటే ఫిట్-యాక్టివ్గా ఉండేందుకు 5 సూత్రాల మార్గం ఇవ్వమని అర్ధం. దీనికి స్పందనగా బరాక్ ఒబామా సైతం తన వీడియోను పోస్ట్ చేశారు. అందులో యాక్టివ్గా ఉండడానికి తాను చేసేవి జాగింగ్, కూర్చుని కాకుండా ‘వాక్ అండ్ టాక్’ మీటింగ్స్ వంటివి ఆయన పొందుపరచారు. -
సిటీలో సెన్సేషనల్ మిసైల్.. లెట్స్ మూవ్
♦ కిక్ బాక్సింగ్కు మహిళలు ఫిదా ♦ ‘గిమ్మీ ఫైవ్’ అంటూ జిమ్స్కు పయనం ♦ క్రేజీ వర్కవుట్స్తో ఉత్తేజం నగరవాసులకు ఆరోగ్యపరమైన సూత్రాలను ఇప్పుడు బాగా వంటబట్టించుకుంటున్నారు. ‘వినదగు నెవ్వరు చెప్పిన’ అన్నట్టు.. ఇలాంటివి ఎవరు చెప్పినా ఆసక్తిగా పాటిస్తున్నారు. చెప్పేది మిస్ ఇండియా అయినా మిషెల్ ఒబామా అయినా.. ‘ఫిట్నెస్’ అంటే సిటీ మహిళలు సై అంటున్నారు. అలాగే ‘లెట్స్ మూవ్’ అంటూ మిషెల్ సంధించిన మిసైల్ లాంటి పంచ్లకు ఫిదా అయిపోయి కిక్స్తో రఫ్ఫాడించేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రేజీగా మారిన వర్కవుట్ కిక్ బాక్సింగ్ విశేషాలవి.. గత నెలలో అమెరికా దేశపు ప్రధమ మహిళ మిషెల్ ఒబామా ఒక వర్కవుట్ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. స్వల్ప కాలంలోనే కోటి మందికి పైగా వీక్షకుల్ని సంపాదించిన ఆ వీడియోలో తన వర్కవుట్స్ని ఆమె పరిచయం చేశారు. మిషెల్ చేసిన 5 ఎక్సర్సైజ్ల్లో.. జంపింగ్ రోప్, మెడిసిన్ బాల్తో అబ్డామినల్ క్రంచెస్, బెంచ్ స్క్వాట్స్, డంబెల్ ప్రెసెస్, బాక్సింగ్.. ఉన్నాయి. కేవలం రెండు నిమిషాలు మించి లేని ఈ క్లిప్లో మిషెల్తో పాటు ఆమె ఫ్యామిలీ ట్రైనర్ కార్నెల్ మెకెల్లన్ కూడా కనిపిస్తారు. స్క్వాట్స్, క్రంచెస్ అయిపోయాక మిషెల్ బ్లూ బాక్సింగ్ గ్లవ్స్ ధరించి కిక్స్ మొదలుపెట్టారు. ఆమె ఇందులో ఒక టు-పంచ్ కాంబోను చూపించి ఆ తర్వాత గిర్రున తిరుగుతూ బ్యాగ్పై ఓ రౌండ్ హౌజ్ కిక్ ఇచ్చారు. మిగతావి ఎలా ఉన్నా... ఆమె పంచ్ బ్యాగ్పై పంజా విసురుతూ ఇచ్చిన రౌండ్ హౌజ్ కిక్స్..ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మిషెల్ వీడియో నగర మహిళల్లో కిక్ బాక్సింగ్ పట్ల అమాంతం క్రేజ్ పెంచేసింది. మరెందరికో ‘కిక్’.. తను ఏం తిన్నా తనను ఫిట్గా ఉంచే శక్తి కిక్ బాక్సింగ్కి ఉన్నట్టు గ్రహించానని టాలీవుడ్ సినీనటి రకుల్ ప్రీత్సింగ్ అంటోంది. ఫుడ్ డబుల్ అయినప్పుడు శాండ్బాగ్స్కి కిక్స్ ఇస్తూ రెట్టింపు సమయం గడుపుతానని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మిషెల్ ఒబామా అప్లోడ్ చేసిన ‘లెట్స్మూవ్’ వీడియో మహిళల్ని ఎక్సర్సైజ్ల వైపు మళ్లించేలా స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు సిటీ సోషలైట్ సుశీలా బొకాడియా. తాను రోజూ 2 గంటల పాటు వర్కవుట్ చేస్తానని, తన వర్కవుట్లో ఇప్పుడు కిక్ బాక్సింగ్ ప్రధానమైన భాగమని చెప్పారు. యోగా ట్రైనర్గా రోప్ యోగా వంటి వెరైటీ శైలుల్ని పరిచయం చేసిన రినా హిందోచా కూడా తాను ఇటీవలే కిక్ బాక్సింగ్ను సాధన చేస్తున్నానన్నారు. ఇది మహిళల్ని శక్తివంతం చేయడం మాత్రమే కాకుండా ఆత్మరక్షణకు కూడా ఉపకరిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. మిక్స్ చేస్తే మస్తు మస్తే.. చూడ్డానికి కష్టంగా అనిపించినా ఈ కిక్స్, పంచ్లు తేలిగ్గా చేయగలిగినవేనని జరీర్ చెప్పారు. ఇది మోకాలు, లోయర్ బ్యాక్లపై తక్కువ భారాన్ని వేసే వ్యాయామం. ఎప్పటికప్పుడు ఆసక్తిని పెంచుకునేందుకు వీలుగా దీనిని విభిన్న మార్గాల్లో చేయవచ్చు. ఏరోబిక్స్, వెయిట్ ట్రైనింగ్ను కూడా జత కలిపి చేయడం అలాంటి ఒక వైవిధ్యమార్గం. అయితే, కొత్తగా సాధన చేసేవారు తప్పనిసరిగా మంచి కార్డియో కిక్ బాక్సింగ్ ట్రైనర్ను ఎంచుకోవాలి. కొంత కాలం పాటు ట్రైనర్ శిక్షణలో కొనసాగి పరిణితి సాధించాక ఒక పంచ్ బ్యాగ్ను మాత్రం ఏర్పాటు చేసుకుని స్వయంగా సాధన కొనసాగించవచ్చు. ఫటాఫట్.. బెని‘ఫిట్’ ఒక క్రీడగా చాలా మంది అభిమానించే బాక్సింగ్ను ఆరోగ్య సాధనంగా మార్చడం ద్వారా చక్కని ఫిట్- వర్కవుట్గా మార్చవచ్చు. ఇపుడు జిమ్లు, ఫిట్నెస్ సెంటర్లలో దీన్ని ‘కార్డియో కిక్ బాక్సింగ్’గా వ్యవహరిస్తున్నారు. కరాటే కిక్లు, బ్లాక్స్ పంచ్లు వంటివి సంప్రదాయ ఎరోబిక్స్తో మిళితం చేసిన ఫిట్నెస్ ప్రోగ్రామ్.. ఈ కార్డియో కిక్ బాక్సింగ్. కరాటే, బాక్సింగ్ను మేళవించిన ఏరోబిక్ వ్యాయామ శైలి ఇది. బాడీ బ్యాలెన్సింగ్కి ఉపకరిస్తుంది. దీని ద్వారా ప్రారంభంలో గంటకి 400 నుంచి 500 క్యాలరీలు, రెగ్యులర్గా చేసేవారికి 800-900 క్యాలరీల వరకూ ఖర్చవుతాయి. ఇది ఫ్యాట్ని కరిగించే అత్యుత్తమ సాధనగా నగరానికి చెందిన ఫిట్నెస్ గురు జరీర్ పటేల్ చెబుతున్నారు. ఈ వర్కవుట్ కదలికల్లో చురుకుదనాన్ని పెంచుతుంది. పొట్ట భాగాన్ని సున్నితంగా బిగించి కిక్స్, పంచ్లు ఇవ్వడం ద్వారా అబ్డామినల్ మజిల్ బాగా పటిష్టమవుతుంది. అప్పర్ కట్, జాబ్, ఎల్బోహుక్, స్నాచ్, రివర్స్కిక్, రౌండ్ కిక్.. నేర్చుకుంటే స్వీయ రక్షణకూ ఉపకరిస్తుంది. లెట్స్ మూవ్.. చిన్నారులు బయటకు వెళ్లాలి, యాక్టివ్గా మారాలి అనే ఉద్దేశంతో అమెరికా ఫస్ట్ లేడీ ప్రారంభించిన ‘లెట్స్ మూవ్’ క్యాంపెయిన్లో భాగంగా ఓ వీడియోను మిషెల్ అప్లోడ్ చేశారు. దీనిలోనే ఆమె ప్రముఖులను, సాధారణ ప్రజలను ‘గిమ్మీ ఫైవ్’ అంటూ కోరుతున్నారు. అంటే ఫిట్-యాక్టివ్గా ఉండేందుకు 5 సూత్రాల మార్గం ఇవ్వమని అర్ధం. దీనికి స్పందనగా బరాక్ ఒబామా సైతం తన వీడియోను పోస్ట్ చేశారు. అందులో యాక్టివ్గా ఉండడానికి తాను చేసేవి జాగింగ్, కూర్చుని కాకుండా ‘వాక్ అండ్ టాక్’ మీటింగ్స్ వంటివి ఆయన పొందుపరచారు. -
చదువుల సీజన్లో పుస్తకాల అడ్డా..
కేజీ టు పీజీ.. కేరాఫ్ కోఠి సెకండ్హ్యాండ్ పుస్తకాలకు ప్రత్యేక సెల్లార్ సుల్తాన్బజార్: విద్యాసంవత్సరం ప్రారంభమైందంటే విద్యార్థులకు పుస్తకాల కోసం ఒకటే టెన్షన్. ఏ షాప్కు వెళ్లినా కొన్ని పుస్తకాలు దొరుకుతాయి. మరికొన్ని ఉండవు. ఎక్కడికెళ్లినా ఇదే సమస్య ఎదురవుతుంది. సమయానికి పుస్తకాలు దొరక్క తల్ల్లిదండ్రులు సైతం హైరానా పడతారు. కానీ ఏ పుస్తకం కావాలన్నా.. అందరూ చూపించే దారి కేరాఫ్ ‘కోఠి’. కేజీ నుంచి పీజీ వరకు.. ఏ పుస్తకం కావాలన్నా ఆ ప్రాంతం పేరే చెబుతారు. ఇప్పుడు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు పైతరగతులకు కావాల్సిన పుస్తకాల అన్వేషణ మొదలైంది. కొత్త టెక్ట్స్, నోటు పుస్తకాలు, ఇతర స్టేషనరీ కొనుగోలు చేసేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు కోఠిలోని పుస్తకాల దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. కోఠి, సుల్తాన్బజార్, ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో ఉన్న పుస్తకాల దుకాణాల్లో దొరకని స్టేషనరీ అంటూ ఉండదు. పోటీ పరీక్షల పుస్తకాలు సైతం.. కోఠిలోని పుస్తకాల దుకాణాలలో కేజీ నుంచి పీజీ వరకు టెక్ట్స్ పుస్తకాలు లభ్యమవుతాయి. అంతేగాక ఎంసెట్, లాసెట్, డైట్సెట్, ఎడ్సెట్, ఏఐఈఈఈ.. ఇతర అన్ని పోటీ పరీక్షల పుస్తకాలు సైతం ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వేసవి తర్వాత వర్షకాలంలో ఇక్కడ ‘పుస్తకాల సీజన్’గా పిలుస్తూ ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తూ వ్యాపారులు విద్యార్థులను, వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. కిలోల్లో నోటు పుస్తకాలు.. చిత్తు కాగితాలు కిలోలుగా అమ్మే ఈ రోజుల్లో నోటు పుస్తకాలు సైతం కిలోల్లో కొనవచ్చంటే అశ్చర్యపోతారు. కానీ కోఠిలో ఏ షాప్కు వెళ్లినా నోటు పుస్తకాలను కిలో లెక్కన అమ్ముతారు. చాలామందికి ఇది తెలియకపోయినా ఇక్కడ సీజనల్ వ్యాపారంలో భాగంగా వ్యాపారులు ఈ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఒక్క నోటు పుస్తకం కనీస ధర రూ.30 ఉంటే.. ఈ మొత్తానికి మూడు పుస్తకాలు సొంతం చేసుకోవచ్చు. దీంతో విద్యార్థులు ‘కిలో’ పుస్తకాలంటే ఆస్తకి చూపుతున్నారు. సెకండ్ హ్యాండ్ బుక్స్ కూడా.. అందరూ కొత్త టెక్ట్స్ పుస్తకాలు కొనలేరు.. ఇలాంటి విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలను సగం ధరలో కూడా ఇక్కడ దొరుకుతాయి. పేరుకు సెకండ్ హ్యాండే గాని.. చాలావరకు కొత్త పుస్తకాలే ఉంటాయి. కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా కిందనున్న సెల్లార్లో ఇలాంటి దుకాణాలే ఉన్నాయి. ఒకటో తరగతి నుంచి ఇంజినీరింగ్, మెడిసిన్ ఇతర కోర్సుల పుస్తకాలు సగం ధరలో విక్రయిస్తున్నారు. రూ. 1200 ఉన్న పుస్తకం ఇక్కడ కేవలం రూ.400కు పొందవచ్చు. -
పవిత్ర మాసం ప్రారంభం
సకల శుభాల పవిత్ర మాసం రంజాన్ ప్రారంభమైంది. గురువారం నెలవంక దర్శనంతో ముస్లింలు ఉపవాసాలకు సమాయత్తమయ్యారు. మసీదుల్లో ఇమామ్లు రంజాన్ మాసాన్ని ప్రకటించారు.ముస్లింలు పరస్పరం ఆత్మీయ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రంజాన్ మాసాన్ని ఆహ్వానించారు. నగరంలోని మసీదులన్నీ ఇప్పటికే ముస్తాబయ్యాయి. పవిత్ర ప్రార్థనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రంజాన్ పవిత్రత..ఉపవాసాల ప్రత్యేకతలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... - చార్మినార్ సహర్.. ఉపవాసం(రోజా) ఉండదలచని వారు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో భోజనం చేస్తారు. దీనినే ‘సహర్’ అంటారు. సాయంత్రం వరకు మంచినీటితో సహా ఏ పదార్థాన్ని తినరు కాబట్టి భోజనంలో పోషకాలు ఉండేలా చూసుకుంటారు. ఏదైనా కారణం వల్ల సహర్ తీసుకోకపోయినా వ్రతాన్ని మాత్రం ఆపరు. ఇఫ్తార్.. సూర్యాస్తమయం తరువాత ఏదైనా ఆహారం తీసుకుని ఆ రోజు దీక్షను విరమించడమే ‘ఇఫ్తార్’. ఖర్జూరాలతో ఇఫ్తార్ చేయడం ప్రవక్త సంప్రదాయం. అందుకే ముస్లింలంతా ఖర్జూరాలతోనే ఇఫ్తార్ చేస్తారు. ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిష్టతో ఉంటారు కనుక దీక్షను విరమించేటప్పుడు ఉపవాసి దేనిని అర్థించినా అల్లాహ్ స్వీకరిస్తాడని నమ్మకం. రంజాన్ సందర్భంగా దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ లైటింగ్ను పాతబస్తీలోని శాలిబండలో ఏర్పాటు చేశారు. దీన్ని గురువారం ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రారంభించారు. చిత్రంలో పిస్తాహౌస్ ఎండీ ఎంఏ మజీద్ తదితరులున్నారు. నాలుగు వాక్యాలే ప్రధానం ఈ పవిత్ర మాసంలో మహ్మద్ ప్రవక్త నాలుగు విషయాలను అధికంగా స్మరించమని ఉపదేశించారు. అవేమంటే.. 1. లాయిలాహ ఇల్లల్లాహ్: దేవుని ఏకత్వాన్ని స్తుతించడం 2. అస్తగ్ఫిరుల్లా: అపరాధాల మన్నింపునకు దైవాన్ని వేడుకోవడం 3. అస్అలుకజన్నత్: స్వర్గాన్ని అనుగ్రహించమని అర్థించడం 4. అవుజుబికమిన్నార్: నరకం నుంచి విముక్తి ప్రసాదించమని కోరడం రంజాన్ మాసంలో... ♦ రంజాన్ మాసంలోని తొలి పది రోజులు కారుణ్యదినాలు ♦ 10 నుంచి 20 వరకు క్షమాపణ రోజులు ♦ 20 నుంచి 30 వరకు నరకాగ్ని నుంచి విముక్తి దినాలు ♦ ఉపవాస వ్రతం ప్రారంభించేందుకు ముస్లింలు సంకల్పం చేసుకుంటారు. ప్రారంభమైన తరావీ నమాజ్లు.. రంజాన్ ప్రారంభం కావడంతో గురువారం రాత్రి నుంచి నగరంలో మసీదులు, వివిధ ఫంక్షన్ హాళ్లలో తరావీ నమాజ్లు ప్రారంభమయ్యాయి. పవిత్ర మాసం ముగిసే (మళ్లీ నెలవంక దర్శనం) వరకు ప్రతిరోజూ తరావీ నమాజులు కొనసాగనున్నాయి. ఈ నమాజుల్లో రోజుకు ఖురాన్లోని కొన్ని అధ్యాయాలను చదివి వినిపిస్తారు. రంజాన్ మాసం పూర్తయ్యేలోగా ఖురాన్ పఠనం పూర్తి చేస్తారు. -
విదేశీ భాషలందు వెలుగు లెస్స..
- ఇంగ్లిష్తో పోటీగా విదేశీ భాషలకు ఆదరణ - ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని సిటీజనుల తపన - విదేశీ భాష నేర్చిన వారికి కార్పొరేట్ కంపెనీల ప్రాధాన్యం నడుస్తున్న కార్పొరేట్ ప్రపంచంలో రాణించేందుకు ఇంగ్లిష్ అవసరం.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్ని విదేశీ భాషలొస్తే అన్ని అవకాశాలు.. ప్రపంచవ్యాప్తంగా గణాంకాలు గమనిస్తే.. అత్యధికులు మాట్లాడే భాష చైనీస్ (20.7 శాతం), ఇంగ్లిష్ (6.2శాతం). అంటే 93.8 శాతం మంది జనాభా ఆంగ్లం మాట్లాడడం లేదనే వాస్తవాన్ని ప్రస్తుత తరం పూర్తిగా అర్థం చేసుకుంది. ఈ నేపథ్యంలో మన నగరంలో విదేశీ భాషలపై మక్కువ రెట్టింపవుతోంది. విదేశీ విజృంభణకు కారణాలెన్నో.. ► వేర్వేరు భాషలు నేర్చుకుంటున్న కొద్దీ మెదడు మరింత పదునెక్కుతుందట. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ ఎడింబరో శాస్త్రవేత్తలు పరిశోధనాత్మకంగా స్పష్టం చేశారు. ► భాషలు ఎన్ని ఎక్కువ వస్తే అంత ఆలస్యంగా మతిమరుపు వస్తుందని, బహుభాషా ప్రవీణుల మెదడు అనేక అంశాల్లో చురుకుగా ఉంటుందని వీరు తాజా పరిశోధనతో తేల్చారు. ఇలాంటి పరోక్ష లాభాల సంగతెలా ఉన్నా.. ఐటీ సెక్టార్లో ట్రాన్స్లేషన్, ఇంటర్ప్రిటేషన్లకు ఉన్న భారీ డిమాండ్ను ఉపయోగించుకునేందుకు, ఇతర దేశాలకు సంబంధించిన సంస్కృతీ సంప్రదాయాలపై అవగాహన పెంచుకునేందుకు, కనీసం మూడు అన్యభాషలు నేర్చుకుని ఉండ డం కెరీర్కు దోహదపడుతుండడం, మల్టీ నేషనల్ కంపెనీలు ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్న వారికి ప్రాధాన్యం ఇస్తుండడం, విదేశాలకు రాకపోకలు సాగించే అవసరాలు పెరగడం.. ఇలా పలు రకాల లాభాలు విదేశీ భాష పట్ల మోజు పెంచుతున్నాయి. ► అప్పటికప్పుడు విదేశీ భాషలు నేర్చుకోవాల్సిన అవసరాలు కూడా మీద పడుతున్నాయి. నగరానికి చెందిన ఒక సంస్థ తమ ఉద్యోగుల బృందాన్ని మెక్సికోకు పంపాల్సి వచ్చింది. ఆఘమేఘాల మీద వారికి నెట్ ద్వారా ప్రాథమిక మెక్సికన్ భాషా పరిజ్ఞానంలో శిక్షణ ఇప్పించింది. ► రామకృష్ణమఠంతో పాటు ఇఫ్లూ, ఓయులో డిప్లొమా కోర్సులు, ఫ్రెంచ్ కోసం అలయెన్స్ ఫ్రాంఛైజ్, జర్మన్ కోసం గోతెజంత్రం ఉన్నాయి. ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా వచ్చాయి. ‘త్వరలో సిటీలో జపనీస్ లాంగ్వేజ్ కోర్సును ఆఫర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు జపాన్ సెంటర్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ ప్రెసిడెంట్ రమాకాంత్. బెస్ట్ ఫ్రెండ్.. ఫ్రెంచ్.. గరంలో అత్యధికులు నేర్చుకుంటున్న భాషల్లో ఫ్రెంచ్ తొలి స్థానంలో నిలుస్తోంది. తర్వాత ఆంగ్లం సెకండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా పేరొందిన ఫ్రెంచ్ దేశవ్యాప్తంగా చూస్తే 2014లో స్కూల్ టు యూనివర్సిటీ స్థాయిలో నేర్చుకున్నవారి సంఖ్య 2.50 లక్షల పైచిలుకు ఉందట. దీనిలో కేవలం అలయెన్స్ ఫ్రాంఛైజ్ ద్వారా నేర్చుకున్నవారి సంఖ్య 35,800. కెరీర్ పరంగా కూడా ఇది మంచి అవకాశాలు అందిస్తోంది. నగరంలోని కార్పొరేట్ కంపెనీలు ఈ భాష తెలిసిన వారికి మంచి ఆఫర్స్ ఇస్తున్నాయి. కెరీర్ పరంగానూ ఇది ప్రాఫిటబుల్. ‘మొదటి నుంచి ఏదైనా విదేశీ భాష నేర్చుకోవాలనుకున్నా. ఫ్రెంచ్ కాంప్లెక్స్ లాంగ్వేజ్. దీనిలో అడ్వాన్స్డ్ డిప్లొమా చేశాను. అయితే దీన్ని కెరీర్గా చూడడం లేదు. కేవలం హాబీగా నేర్చుకున్నానంతే’ అంటూ చెప్పారు జ్యోత్స్న. జోష్.. స్పానిష్.. వకాశాలు, ఆదరణ పరంగా స్పానిష్ లాంగ్వేజ్కు రెండో స్థానం దక్కుతోంది. ఈ భాషను నేర్చుకోవడం సులభం అంటారు. దీంతో ఏదైనా ఒక విదేశీ భాష వచ్చి ఉండడాన్ని కనీస అర్హతగా భావిస్తున్న వారు స్పానిష్కి సై అంటున్నారు. సరిగా సాధన చేస్తే ఈ భాషను 18 నెలల స్వల్ప కాలంలోనే నేర్చుకోవచ్చనేది నిపుణుల మాట. కెరీర్ పరంగానూ ఇది మంచి ఆప్షన్. ‘ఆసక్తితో స్పానిష్లో ఎంఏ చేశాను. అయితే, ఇప్పుడది నాకు ప్రొఫెషన్గా ఉపకరిస్తోంది’ అని చెప్పారు సీతాఫల్మండిలో నివసించే సుమతి. ప్రస్తుతం ఆమె స్పానిష్ టీచర్. సౌత్ అమెరికా, మెక్సికోలో బాగా వినియోగించే స్పానిష్ ప్రపంచంలోనే అత్యధికులు ఉపయోగించే భాషల్లో 3వ స్థానంలో ఉంటుందంటున్నారు సుమతి. జర్మన్తో షైన్.. పంచంలో 1.8 శాతం మంది మాత్రమే జర్మన్ మాట్లాడతారు. అయితే మనం జర్మన్ దేశస్తులతో సంభాషించాలంటే తప్పనిసరిగా జర్మన్ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే జర్మన్లు ఇతర దేశ భాషలను నేర్చుకోవడానికి పెద్దగా ఇష్టపడరట. మరోవైపు జర్మనీ.. క్వాలిటీ సైంటిఫిక్ రీసెర్చ్, ఇన్నోవేషన్స్కు హబ్. అందుకనే చాలా మంది మనవాళ్లు అక్కడ చదువుకోవాలని ఆశిస్తారు. జర్మన్ యూనివర్సిటీస్లో చేరాలంటే.. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కనీస స్థాయిలోనైనా జర్మన్ భాష వచ్చి తీరాలి. పెపైచ్చు భారతీయ విద్యార్థులకు జర్మనీ ఉచిత కోర్సులు కూడా ఆఫర్ చేస్తోంది. ‘ఉన్నత విద్య కోసం జర్మనీ వెళ్లేవారు పెరిగారు. ఎందుకంటే అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తున్నారు. అయితే, అలా చదవాలని కోరుకునే విద్యార్థులకు తప్పనిసరిగా జర్మన్ లాంగ్వేజ్ వచ్చి తీరాల్సిందే’ అని చెప్పారు దీప్తి. జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్న ఆమె తెలుగు, ఇంగ్లిష్, కన్నడ, హిందీ భాషలు వచ్చని చెబుతోంది ఈ మలక్పేట నివాసి. జపనీస్కు జేజేలు.. ష్టమైన భాషగా జపనీస్ను పేర్కొంటారు. అయినా ప్రస్తుతం దేశంలో 20వేల మందికిపైగా జపనీస్ భాష నేర్చుకుంటున్నారని అంచనా. జపనీస్ వెంచర్లు భారీగా దేశానికి తరలివస్తున్న నేపధ్యంలో జపాన్ భాష తెలిసిన వారికి డిమాండ్ బాగా పెరుగుతోంది. దీంతో పలు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పార్ట్టైమ్ జపనీస్ లాంగ్వేజ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ‘కెరీర్ ప్లాన్ అని కాకుండా వ్యక్తిగత ఇష్టంతో 1998లోనే సీఫెల్ నుంచి జపనీస్ నేర్చుకున్నాను. ఇది నేర్చుకోవడం నాకు జపాన్కు సంబంధించిన అనేక అంశాలపై అవగాహన పెంచింది’ అన్నారు చక్రపాణి. అప్పట్లో జపాన్ ప్రభుత్వం ఖర్చులు భరించి మరీ టీచర్ ట్రైనింగ్ ఇచ్చిన ముగ్గురు భారతీయుల్లో నగరానికి చెందిన చక్రపాణి కూడా ఒకరు. తదనంతర కాలంలో ఆయన జపాన్ లాంగ్వేజ్ టీచర్, బైలింగ్వల్ కన్సల్టెంట్గా చేశారు. చైనీస్.. చాలా టఫ్.. పంచవ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన దేశం కాబట్టి.. సహజంగానే చైనీస్ మాట్లాడేవారు కూడా ఎక్కువే. ఎవరైనా సరే తమ దగ్గరకే వచ్చేలా ప్రపంచ దేశాలను ప్రొడక్ట్స్ పరంగా ప్రభావితం చేస్తున్న చైనాకు సిటీ నుంచి రాకపోకలు పెర గడం కూడా సహజమే. ఈ నేపధ్యంలో చైనీస్ లాంగ్వేజ్ పట్ల కూడా నగరవాసుల్లో ఆసక్తి పెరిగింది. అయితే, మిగిలిన భాషలతో పోలిస్తే ఇది నేర్చుకోవడం కాస్తంత కష్టమే అంటున్నారు భాషాభిమానులు. ‘నాకు విదేశీ భాషలు నేర్చుకోవడం ఇష్టం. ఆల్రెడీ జర్మన్లో ఎంఏ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇఫ్లూలో 8 నెలలు పాటు ఈవెనింగ్ టైమ్లో చైనీస్ బేసిక్ కోర్సు చేశాను. ఈ లాంగ్వేజ్లో సర్టిఫికెట్ కోర్సు చేస్తే చాలు జనరల్ కన్వర్జేషన్కి సరిపోతుంది. ైచె నా మూవీస్ కూడా చూడవచ్చు. డిప్లొమా ఇన్ చైనీస్ కూడా చేద్దామనుకుంటున్నాను. సిటీలో చైనీస్ ట్రాన్స్లేటర్స్కి డిమాండ్ బాగానే ఉన్నప్పటికీ ఈ లాంగ్వేజ్ గురించి అవేర్నెస్, నేర్చుకునే వాళ్లు, నేర్పేవాళ్లూ తక్కువే’ అంటూ చెప్పారు శరత్. బీఫార్మసీ చేసి ఓయూ హాస్టల్లో ఉంటున్న ఆయన.. పార్ట్టైమ్గా జర్మన్ లాంగ్వేజ్ టీచర్గానూ చేస్తున్నారు. స్కూల్ స్థాయిలోనే.. జూబ్లీహిల్స్లోని రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్లో మాండరిన్ (సరళతరమైన చైనీస్)ను విద్యార్థులకు థర్డ్ లాంగ్వేజ్గా ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటికే 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకూ విద్యార్థులు ఈ లాంగ్వేజ్ను ఎంచుకున్నారు కూడా. పిల్లలకు విదేశీ భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు సిటీలోని కొన్ని స్కూల్స్ ఆఫ్టర్ స్కూల్ అకాడమీ నిర్వహించే యోచనలో ఉన్నాయి. -
బడికి వేళాయె.. తొలిరోజు జ్ఞాపకం
బడికి వేసవి సెలవులు ఇచ్చే చివరి రోజు ప్రతి ఒక్కరికీ ఆనందం.. రేపటి నుంచి సెలవులని. సెలవులు ముగిశాక తొలిరోజు బడికి వెళ్లడం మహానందం.. కొత్త పుస్తకాలు, కొత్త తరగతిలోకి అడుగు పెడుతున్నామని. ఇప్పుడు వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి బడికి వెళ్లాలి. బడి గంట మోగుతున్నా సెలవుల మత్తు వీడని వాళ్లు కొందరైతే.. పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారా.. అని చూసే వారు మరికొందరు. ఇటువంటి అనుభవాలు స్కూలుకు వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఉంటాయి. తొలిరోజు బడికి వెళ్తే సమయం ఎలా గడిచిందో కొందరు ఉన్నతాధికారులు తమ బాల్యపు మధుర జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. - సాక్షి, సిటీబ్యూరో ఎంతో హుషారు వచ్చేది బడి గడప తొక్కే తొలిరోజు పూజ చేయడం, గుడికి వెళ్లడం అలాంటివేవీ చేయకున్నా ఎక్కడా లేని, ఆనందం, హుషారు ఉండేది. ముఖ్యంగా ఆరు, ఏడు తరగతుల్లో ఆ తీరు బాగా కనిపించింది. ఐదు వరకు సొంతూరు నల్లగొండ జిల్లా లక్ష్మీదేవిగూడెంలోనే చదువుకున్నా. ఆరు, ఏడు తరగతుల కోసం మా పక్క ఊరు అమన్గల్కు వెళ్లేవాడిని. ఇది మా ఊరికి రెండు కిలోమీటర్ల దూరం. రోజూ స్నేహితులతో కలిసి నడుస్తుంటే అలసట తెలిసేది కాదు. పదో తరగతి వరకు నడకనే. పై తరగతుల పుస్తకాల కోసం వేసవి సెలవుల్లోనే వేట మొదలయ్యేది. జీవితాంతం సరిపడ ఆనందాన్ని బడికెళ్లే వయసులో పొందాను. - సోమిరెడ్డి, హైదరాబాద్ డీఈఓ కొంచెం బాధగా... సెలవుల్లో మహబూబ్ నగర్ లో ఉండే నాన్నమ్మ, అమ్మమ్మ ఊళ్లలో గడిపేవాళ్లం. పాఠశాలలు తెరుస్తున్నారంటే కొంచెంగా బాధగా అనిపించేది. కొత్త పుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగ్.. ఇవన్నీ కొంటుంటే ఉత్సాహం వచ్చేది. స్కూల్కు అప్పుడే వెళ్లాలన్న కుతూహలం కనిపించేది. అప్పట్లో బుక్స్ స్కూళ్లలో ఇచ్చేవారు కాదు. మా సోదరులు, అక్క చెల్లళ్ల నుంచి పాత పుస్తకాలు తీసుకునే దాన్ని. అప్పట్లో మా నివాసం బడీచౌడి. రాంకోఠిలోని అలెన్ స్కూల్లో, గన్ఫౌండ్రీలోని స్టాన్లీ స్కూల్లో చదువుకున్నా. - నిర్మల, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తొలి రోజే నిర్ణయం.. వేసవి సెలవులు ప్రారంభం కాగానే చిలుకలూరిపేట నుంచి నందిపాడుకు వెళ్లేవాడిని. రెండు నెలల పాటు ఊళ్లోని స్నేహితులతో ఎంజాయ్ చేసి సెలవులు ముగిశాక సంతోషంగా స్కూలుకు వెళ్లే వాళ్లం. కొత్త క్లాసు, కొత్త పుస్తకాలు, కొత్త టీచర్స్ ఇలా అంతా కొత్తగా అనిపించేది. ఎప్పుడు చెప్పిన పాఠం అప్పుడే చదవాలని, హోం వర్క్ పూర్తి చేయాలని పాఠశాలకు వెళ్లిన తొలి రోజే ఓ నిర్ణయం తీసుకునే వాడిని. ఆ మేరకు అమలు చేసే వాడిని. - డాక్టర్ నరేంద్రనాథ్, నిమ్స్ డెరైక్టర్ సెలవులు ముగిసి పాఠశాలలు తెరుస్తున్నారంటే.. ఎప్పుడు తరగతులు ప్రారంభమవుతాయా.. అని ఆబగా ఎదరు చేసేవాడిని. ముఖ్యంగా బడి తెరిచిన రోజు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా సమయం గడిచిపోయేది. చాలా రోజుల తరువాత ఫ్రెండ్స్ని కలుస్తున్నాన్న సంబరం. ప్రతి ఉపాధ్యాయునికి దగ్గరికి వెళ్లి పలకరించేవాడిని. పై తరగతికి వె ళ్తున్నానన్న ఆనందం మాటల్లో చెప్పలే నిది. తరగతి మారుతుండడంతో ముందుగా వెళ్లి బెంచీపై మంచి స్థలాన్ని వెతుక్కోవడం మొదలయ్యేది. పరిసరాలు శుభ్రంగా చేసుకునే వాళ్లం. అలా మొదటి రోజు చూస్తుండగానే ముగిసేది. - రమేష్, రంగారెడ్డి జిల్లా డీఈఓ కొన్ని రోజులే సెలవుల ధ్యాస.. వార్షిక పరీక్షలు రాసేటపుడు సెలవుల్లో చాలా పనులు చేయాలని అనుకునేవాడిని. ముఖ్యంగా పుస్తకాలు చదవడం, స్నేహితులను కలవడం, చుట్టాల ఇంటికి వెళ్లడం వంటివి చేయాలనుకునేవాడిని. అన్నీ జరగవు కదా! మూడు నుంచి పదో తరగతి వరకు రాయదుర్గంలోని ఒయాసిస్ స్కూల్లో చదువుకున్నా. పాఠశాలలు పునఃప్రారంభించే సమయంలో ఇంకొన్ని రోజులు ప్రకటిస్తే బాగుండేదనిపించేది. మరోపక్క స్కూల్కు వెళితే పాత మిత్రులను కలుసుకోవచ్చు.. పై తరగతిలో కొత్త విషయాలు నేర్చుకోవచ్చనే ఆతృత ఉండేది. చదువుపై దృష్టి సారించగానే సెలవుల ధ్యాస పోయేది. - రఘనందన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ -
టార్గెట్కు టాలెంట్.. యాడ్ చేశాడు
సినిమాలో కన్నా అర నిమిషం యాడ్లో కనిపిస్తే వచ్చే గుర్తింపు చాలా ఎక్కువ. అదీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్కు టీవీ ప్రకటనల్లో కనిపిస్తే.. సూపర్ పాపులారిటీ. అలాంటిది పెప్సీ, కోక్, స్ప్రైట్.. ఇలా ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ యాడ్స్లో చేస్తే.. ఆ కిక్కే వేరు. ఇప్పుడు ఇదే కిక్కును.. లక్కును అందుకున్నాడు మన సిటీ కుర్రాడు కృష్ణ సుహాన్ (క్రిష్). చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన ఇతడు ఇప్పుడు ‘స్ప్రైట్’ యాడ్తో అందరినీ ఆకర్షిస్తున్నాడు. ఓ కుర్రాడు బైక్పై కూర్చుంటాడు.. మరో స్నేహితుడు వచ్చి ఆ బైక్ ఇమ్మని అడుగుతాడు.. అలాగేనంటూ.. పెట్రోలు ఇద్దరం కలిసి పోయిద్దామంటాడు. కలిసి శుభ్రం చేద్దామంటాడు.. ఈఎంఐ కూడా కలికి కడదామంటాడు.. ఇక ఆ స్నేహితుడికి ప్లాన్ అర్థమై.. బైక్ ఎవరి వద్ద ఉంటేనేంటి.. అంటూ తాళం తిరిగి ఇచ్చేస్తాడు. లేటెస్ట్ ‘స్ప్రైట్’ యాడ్ ఇది. ఇందులో బైక్ అడిగిన స్నేహితుడే.. క్రిష్. ఇతడి ‘యాడ్’ జర్నీ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. ఆ వివరాలు అతని మాటల్లోనే.. - సాక్షి,హైదరాబాద్ తొలి అడుగు ఇలా పడింది.. ‘పాండవులు’ అనే టెలీఫిలిం నుంచి కెరీర్ మొదలెట్టా. 15 ఏళ్ల వయసులో సినిమాల్లో అవకాశం వచ్చింది. అలా 2004 నుంచి ‘చంటి- ది హీరో, సోగ్గాడు, స్వరాభిషేకం, గోల్కొండ హైస్కూల్, వేట’.. ఇలా చాలా చిత్రాల్లో నటించాను. 2007లో పెప్సీ యాడ్కి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లాను. అది ఒక చిన్న ఇంటర్నెట్ సెంటర్. ఓ చిన్న హ్యాండీకామ్తో పెప్సీ బాటిల్ ఇచ్చి ఏదో చెప్పమన్నారు. అస్సలు నమ్మకంగా అనిపించలేదు. స్టార్ క్రికెటర్స్తో వర్క్.. నెక్ట్స్ డే కాల్ చేసి తాజ్ బంజారాకి రమ్మన్నారు. యాడ్ ఫిలింలో పెద్ద క్రికెటర్స్ ఉంటారు అన్నారు. డూప్స్తో యాక్ట్ చేయిస్తారు అనుకున్నా. సంక్రాంతికి మూడు రోజుల పాటు హైదరాబాద్లో షూటింగ్. ఫస్ట్ డే స్పాట్కి వెళితే 260 మంది పోలీసులు, లెక్కలేనంత జనం, మధ్యలో సచిన్ టెండూల్కర్, ధోనీ, సెహ్వాగ్, ద్రవిడ్, యువరాజ్.. ఐదుగురు రియల్ స్టార్ క్రికెటర్స్. ఫస్ట్టైం వాళ్లని చూసి సూపర్ ఎక్సైట్ అయ్యాను. జనం వాళ్ల ఆటోగ్రాఫ్ దొరికితే చాలు అనుకుంటారు. అలాంటిది వాళ్లతో కలిసి పనిచేశాను. ఫస్ట్ యాడ్ అంత పెద్ద బ్రాండ్. ఇండియాలో ఐదుగురు క్రికెటర్స్ చేసిన ఫస్ట్ యాడ్ కూడా అదే. తర్వాత 2008లో ‘కోక్’ దివాళి యాడ్కి పనిచేశాను. ఆ తర్వాత మళ్లీ 2015లో స్ప్రైట్కి వర్క్ చేశాను. అయితే ఈ యాడ్ కోసం మొదటి సారి ముంబై వెళ్లి అక్కడి వాళ్లతో పనిచేశాను. అక్కడి పనితీరు బాగా నచ్చింది. షాట్ మధ్యలో గ్యాప్ వస్తే ఆర్టిస్ట్ అలసిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. మన బాడీ లాంగ్వేజ్కి అనుగుణంగా యాక్ట్ చేసే ఫ్రీడం ఇస్తారు. స్ప్రైట్ యాడ్ హిందీ, తెలుగు రెండు భాషల్లోనే షూట్ చేశారు. తెలుగు వెర్షన్లో నేను యాక్ట్ చేశాను. వాటిని తర్వాత వేరే భాషల్లో డబ్ చేశారు. తెలుగులో వాయిస్ కూడా నాదే. చూసిన ప్రతివాళ్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. దీని తర్వాత కొన్ని వేరే బ్రాండ్స్ వాళ్లు ఆడిషన్కి పిలిచారు. ఈ క్రెడిట్ పేరెంట్స్దే.. ‘పుట్టింది.. పదో తరగతి వరకు చదువుకున్నది గుంటూరులో. స్కూల్లో చదువుతున్నప్పుడే డాన్స్ బేబీ డాన్స్లో చేశా. ఇది చూసిన ఇంటి చుట్టుపక్కలవారు.. ‘మీ పిల్లాడిలో చాలా టాలెంట్ ఉంది, హైదరాబాద్ షిఫ్ట్ అయితే బాగుంటుంది’ అని పేరెంట్స్కి సలహా ఇచ్చారు. అలా ఇంటర్ టైంకి హైదరాబాద్కు వచ్చేశాం. సిటీలోనే ఇంటర్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ 82 శాతం మార్కులతో పూర్తి చేశా. కేవలం చదువు మాత్రమే కాదు, పిల్లలకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాలి, వాటిని ఎంకరేజ్ చెయ్యాలి అని మా పేరెంట్స్ నమ్మి, సపోర్ట్ చేయడం వల్లనే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా. ఈ గుర్తింపుకి పూర్తిగా మా పేరెంట్స్ ప్రోత్సాహమే కారణం’ అని చెప్పాడు క్రిష్. గొప్ప సినీ స్టార్ అవ్వాలి.. చిన్నప్పటి నుంచి ప్రొఫెషనల్ డాన్సర్ని అలా 700కి పైగా పెర్ఫార్మెన్స్లు ఇచ్చాను. ‘శిఖరం, మనసు మమత, అగ్నిపూలు, శశిరేఖా పరిణయం’ సీరియల్స్లో నటించాను. ఏఐఆర్- రెయింబోలో ఆర్జేగా కూడా చేశాను. కొన్ని చానెల్స్లో యాంకర్గా లైవ్షోలు చేశాను. మంచి పర్ఫార్మెన్స్తో సినిమా హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకోవలన్నదే నా గోల్. -
ఆదరించిన ఊరును ఆదుకున్న నేస్తం
♦ నేపాల్లోని ‘టెచో' గ్రామానికి హెచ్సీయూ విద్యార్థుల అండ ♦ తాత్కాలిక నివాసాల ఏర్పాటుకు సాయం నేపాల్ భూకంపం.. ప్రతి మనిషిని కదిలించిన, కలచివేసిన ఉపద్రవం. ఈ వైపరీత్యం తర్వాత ఆ దేశాన్ని చూసి ‘ఆయ్యో పాపం’ అనుకున్నవారు ఉన్నారు. ఆదుకునేందుకు ముందుకు వచ్చినవారూ ఉన్నారు. రెండేళ్ల క్రితం చదువులో భాగంగా నేపాల్ వెళ్లిన ఓ హైదరాబాద్ కుర్రాడు తనకు ఆశ్రయమిచ్చిన గ్రామానికి సాయం చేయడానికి ఉద్యమించాడు. స్నేహితుల సాయంతో విరాళాలు సేకరించి భూకంపంలో నేలమట్టమైన ఇళ్ల నిర్మాణానికి ఖర్చు చేశాడు. ఇందుకు తానే స్వయంగా అక్కడకు వెళ్లి ప్రతి రూపాయి బాధితులకు అందేలా చూశాడు. ఆ యువకుడి పేరు ‘సిపాయి సర్వేశ్వర్’. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ ఆంత్రోపాలజీ విద్యార్థి. ఇతడికి స్నేహితులు, వారి స్నేహితులు, ప్రొఫెసర్లు బాసటగా నిలిచారు. ఈ మహా యజ్ఞంలో మరో హెచ్సీయూ పీహెచ్డీ విద్యార్థి, బీహార్ వాసి నీలేశ్, ఢిల్లీ జేఎన్యూ పీహెచ్డీ విద్యార్థి హైదరాబాద్ వాసి గరిమెళ్ల సురేశ్ పాలుపంచుకున్నారు. - సాక్షి, సిటీబ్యూరో నివాసాల కోసం.. ‘విరాళాల సేకరణ కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లాష్ మాబ్ నిర్వహించాం. భోజ్పురి, ఫోక్ సాంగ్స్ పాడాం. నేపాల్ బాధితులకు చేయూతనిచ్చేందుకు హైదరాబాదీల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా మేం రూ. 5.50 లక్షలు సేకరించాం. (నేపాల్ కరెన్సీలో 8.80 లక్షలు) ఆ డబ్బుతో మే 23న హైదరాబాద్ బస్సులో నేపాల్లోని టెచో గ్రామానికి చేరుకున్నాం. అక్కడి హపఫుచ ఆర్గనైజేషన్తో కలిసి ఏం చేయాలనేదానిపై చర్చించాం. అక్కడి విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్తో కలిసి సర్వే చేస్తే మొత్తం 2543 ఇళ్లు ఉన్న గ్రామంలో 550 ఇళ్లు ధ్వంసమయ్యాయి. సహాయం అందని 230 కుటుంబాలను గుర్తించాం. అక్కడివారికి తిండి, దుస్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఒక్కో టెంట్ కింద రెండు, మూడు కుటుంబాలు ఉంటున్నాయి. వచ్చేది వానాకాలం.. బాధితులు ఉండేందుకు తాత్కాలిక నివాసాలను ఏర్పాటు అవసరం. ఇతర సంస్థలు వెదురు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. బహిరంగ ప్రాంతాల మరమ్మతు కోసం రూ.90 వేలు మినహా మిగతా డబ్బుతో సీజీఐ షీట్స్ కొని తాత్కాలిక నివాసాల నిర్మాణ ం చేపట్టాం. ఇలా ఒక్కో ఇంటికి రూ. 3,434 ఖర్చు చేశాం’ అవి వివరించారు. మళ్లీ వెళ్తాం.. ‘నేపాల్లో చేయాల్సిన సహాయక కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. మేం రెండో విడత విరాళాలు సేకరించాలనుకుంటున్నాం. నేపాల్ నుంచి ‘సెవెన్ వండర్స్ బ్యాండ్’ను హైదరాబాద్కు రప్పిస్తున్నాం. వీరితో ఇక్కడ షోలు నిర్వహించి వచ్చిన డబ్బుతో అక్కడ సాయం చేస్తాం. నేపాల్ కల్చరల్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు అక్కడి నుంచి చెఫ్లను తీసుకొస్తున్నాం. వాటితో వచ్చిన డబ్బుతో టెచో గ్రామ రూపు రేఖలు మార్చుతాం’ అంటూ వివరించాడు సర్వేశ్. ఫేస్బుక్ సాయం.. ఆంత్రోపాలజీలో పీహెచ్డీ చేస్తున్న సర్వేశ్ ఫీల్డ్వర్క్లో భాగంగా 2013లో నేపాల్లోని లలిత్పూర్ జిల్లా ‘టెచో’ గ్రామానికి వెళ్లాడు. దాదాపు ఏడాదిన్నర పాటు అక్కడి ప్రజలతో మమేకమై వారి వారి జీవన విధానం, సమస్యలపై పరిశోధన చేశాడు. ఈ సమయంలో స్థానిక ‘హపఫుచ వలంటరీ యూత్ ఆర్గనైజేషన్’తో పరిచయం ఏర్పడింది. ఇటీవల నేపాల్లో భూకంపంలో ఈ గ్రామం కూడా దెబ్బతింది. ఇళ్లు, తిండి లేక ఈ గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీంతో ఈగ్రామానికి చెందిన లెక్చరర్ మహేశ్ ‘మా గ్రామస్తులను ఆదుకోండి’ అని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఇది చదివి చలించిన సర్వేశ్ తాను ఫీల్డ్వర్క్ చేసిన ఆ గ్రామానికి చేయూతనివ్వాలనుకున్నాడు. విషయాన్ని ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాడు. విరాళాల సేకరణకు ఫేస్బుక్లో పేజీ క్రియేట్ చేశాడు. దాదాపు 700 మందికి పైగా సభ్యులుగా చేరి విరాళాల సేకరణలోనూ భాగమయ్యారు. ఫ్రెండ్స్, ఫ్రొఫెసర్లు.. ఇలా అందరూ తమకు తోచిన ఆర్థిక సాయం చేశారు. -
సరస్వతీ బిడ్డలం చదువు‘కొనలేం’..
వేలూ లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూళ్లలో ఖరీదుగా చదువు‘కొన’లేదు. మాసిపోయిన బెంచీలూ మసిబారిన గోడల నీడలో తప్ప. అడగకుండానే అన్నీ సమకూర్చే డాడీ, అడుగుకో ఆనందం కొనుక్కొచ్చే మమ్మీ అంటే తెలియదు. కాయకష్టంతో దోస్తీ చేసే అమ్మానాన్నలు తప్ప. అయినా ఈ చిన్నారులు చిన్నబోలేదు. చింత పడలేదు. పేదరికాన్ని మోస్తూనే ఉన్నారు. సరస్వతీ కటాక్షాన్ని సాధిస్తూనే ఉన్నారు. చెమట చిందిస్తూనే ఉన్నారు. చదువులో విజయాలు లిఖిస్తూనే ఉన్నారు. కాసింత ఆసరా దొరికితే... కాసింత ధైర్యం అందితే... ఈ పేదింటి రత్నాలు ఎన్నెన్ని కాంతులు విరజిమ్ముతాయో... మరెన్ని వెలుగులు ప్రసరిస్తాయో... విధి ‘రాత’ను మారుద్దామా? వీరి ‘రాత’కు తోడవుదామా? ఈ విద్యాకుసుమాలకు బాసటగా నిలవాలన్నా.. ఆర్థికంగా ఆదుకోవాలన్నా 9705347881, 9010234568 నెంబర్లలో సంప్రదించండి. స్పందించే హృదయం కోసం ఎదురుచూపులు పేదింట విద్యా కుసుమాలు విరబూశాయి. చదువుల తోటలో మార్కుల పంట పండిస్తున్నాయి. కూలి చేస్తేనే పూట గడిచే కుటుంబాలైనా.. చదువులో రాణిస్తున్నారు. ఆర్థిక సమస్యలు వెనక్కి లాగుతున్నా.. ఏమాత్రం నిరుత్సాహపడలేదు. సర్కారు బడులలో చదివినా... కార్పొరేట్ విద్యార్థులకు దీటుగా మార్కులు సాధించి... ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా విడుదలైన పదో తరగ తి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచారు. ఆర్థికంగా ఎవరైనా చేయూతనిస్తే... ఉన్నత చదువులు అభ్యసించి లక్ష్యాన్ని అందుకుంటామని చెబుతున్నారు. జీవితంలో నిలదొక్కుకున్నాక తమలాంటి పేద బిడ్డలకు బాసటగా నిలుస్తామని హామీ ఇస్తున్నారు. ఇస్త్రీ చేస్తూనే.. ముషీరాబాద్ : ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది రామ్నగర్కు చెందిన శ్రుతి. ఈ బాలిక టెన్త్లో 9.3 పాయింట్స్ సాధించింది. ఆంధ్ర మహిళా సభ బాలికల పాఠశాలలో పదో తరగతి చదివి...9.3 మార్కులతో పాఠశాల టాపర్గా నిలిచింది. రాంనగర్లోని గిరిశిఖర అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పని చేస్తున్న యాదగిరి, లక్ష్మీల రెండో సంతానం శ్రుతి. వీరిది వరంగల్ జిల్లా మద్దూర్ మండలం డెక్కల్. నాలుగేళ్ల క్రితం పిల్లల చదువు, బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి అపార్ట్మెంట్లో వాచ్మెన్గా బతుకు వెళ్లదీస్తున్నారు. శ్రుతి అక్క ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుండగా, తమ్ముడు ఏడో తరగతి. వీరి ముగ్గురు స్కూల్ ఫీజులు, పుస్తకాలు, డ్రెస్లకే యాదగిరి కుటుంబం ఏటా దాదాపు రూ.లక్ష ఖర్చు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ పాఠశాలలో తన విద్యాబ్యాసాన్ని కొనసాగించిందీ బాలిక. తల్లి అదే అపార్ట్మెంట్లో ఇస్త్రీ చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తోంది. సెలవుల్లో, తీరిక సమయంలో శ్రుతి కూడా అమ్మకు సాయపడుతూ ఉంటుంది. బాసర త్రిబుల్ ఐటీలో సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పాలిటెక్నిక్ పరీక్ష కూడా రాస్తోంది. దాతలు సహకరిస్తే ఉన్నత చదువులు చదువుతానని చెబుతోంది. అమ్మకు సహాయంగా... గచ్చిబౌలి: శేరిలింగంపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో మొదటి స్థానంలో నిలిచింది నలందేశ్వరి. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కొత్తపేటకు చెందిన బురిడి శివనాయుడు, దమయంతి దంపతులు తమ ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకును తీసుకొని కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు.శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డినగర్ కాలనీలో ఉంటున్నారు. శివనాయుడు వాచ్మెన్. దమయంతి రోడ్డు పక్కన డబ్బాలో కిరాణా సామాను అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వీరి రెండోకూతురు నలందేశ్వరి 7 నుంచి పదోతరగతి వరకు స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో చదివింది. పదో తరగతిలో 9.8 శాతం మార్కులు సాధించింది. పాఠశాల ముగిసిన తరువాత నిత్యం మియాపూర్లోని పోతుకూచి సోమసుందర సోషల్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్టుకు వెళ్లి చదువుకునేది. ఇంజినీరింగ్ చేసి... కలెక్టర్ కావాలన్నదే తన లక్ష్యమని నలందేశ్వరి చెబుతోంది. సెలవుల్లో ఇంటి వద్ద ఉన్నప్పుడు కిరాణా డబ్బాలో ఉండి అమ్మకు సాయం చేసేదాన్నని చెప్పింది. ఉపాధ్యాయులు..పోతుకూచి సోమసుందర సోషల్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్టు సహకారం మరిచిపోలేనిదని తెలిపింది. సాయం చేస్తే...రాణిస్తా.. సికింద్రాబాద్: నిరుపేద కుటుంబంలో పుట్టి... ప్రభుత్వ పాఠశాలలో చదివి... పదో తరగతిలో 9.3 మార్కులు సాధించి కళాశాల విద్యను అభ్యసించడానికి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది శాంతినగర్లోని శేషాపహడ్ మురికివాడకు చెందిన ఆర్.సుప్రజ. వరంగల్ జిల్లా నుంచి ఉపాధి కోసం నగరానికి వచ్చిన ఆర్.యేషోబు ఆటోడ్రైవర్. ఆయన భార్య రజిత ఇళ్లలో పనులు చేసుకుంటూ బతుకు బండిని లాగిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. వీరి పెద్దకుమార్తె ఆర్.సుప్రజ సమీపంలోని లాలాపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుకుంది. ఇటీవల వెల్లడించిన ఫలితాల్లో 9.3 మార్కులు సాధించింది. తల్లికి తోడుగా ఇళ్లలో పనులకు వెళుతూనే అత్యధిక మార్కులు సాధించింది సుప్రజ. తన తల్లిదండ్రుల ఆదాయం అంతంత మాత్రమేనని. తాను బాగా చదువుకుని మంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్న సంకల్పంతోనే 9.3 మార్కులు తెచ్చుకున్నానని తెలిపింది. తనను ఆదుకుని మంచి కళాశాలలో చదివించేవారు ఉంటే ఇంటర్లో సైతం మంచి మార్కులు సాధించి రికార్డు నెలకొల్పాలని ఉందని తెలిపింది. బాగా చదువుకుని టీచర్ ఉద్యోగం చేయాలన్నది తన ఆకాంక్ష గా సుప్రజ పేర్కొంది. నాన్న కల నెరవేరుస్తా... మూసాపేట: మూసాపేటకు చెందిన ఎమ్డీ వాజిద్ సనత్ నగర్లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. భార్య షాహిన్ గృహిణి. నెలకు రూ.8 వేల జీతంతో ఐదుగురు పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. అద్దె గదిలో నివాసం ఉంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. పంచశీల స్కూల్లో చదివిన చిన్న కుమార్తె ముస్కాన్ ఫాతిమా 9.8 మార్కులతో పాఠశాలటాపర్గా నిలిచింది. ‘నాన్న పదో తరగతి వరకే చదువుకున్నారు. ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలన్న నాన్న కలను నిజం చేయడమే నా లక్ష్యం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మంచి మార్కులు సాధించా’నని సంతోషం వ్యక్తం చేస్తోందీ బాలిక. అమ్మ కష్టమే ఆసరాగా... మెహిదీపట్నం: అటు తల్లి.. ఇటు గురువుల అంచనాలను అందుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో చదివి... ఇంగ్లీషు మీడియంలో పదో తరగతిలో 9.8 జీపీఏ తెచ్చుకున్నాడు తాళ్లగడ్డకు చెందిన సాయి ఫణీంద్ర కుమార్. ఆది నుంచీ ప్రణాళికాబద్ధంగా చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధించాడు. ఫణీంద్ర 11 ఏళ్ల వయసులోనే తండ్రి శంకర్ మరణించాడు.తల్లి దుర్గ సంరక్షణలో క్రమశిక్షణతో పెరిగాడు. మూడో తరగతి నుంచి కార్వాన్ కుల్సుంపూర ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ వచ్చాడు. ‘అమ్మ ఇళ్లలో పనులు చేస్తూ... ఏ లోటూ రాకుండా చూసుకొని చదివించింది. పాఠశాలలో ఉపాధ్యాయులు ‘నీకు మంచి ర్యాంక్ వస్తుందని... చదవాలని’ ప్రోత్సహించారు. నేను 9 జీపీఏ అంచనా వేశా. నాకు 9.8 రావడం పట్ల అమ్మతో పాటు గురువులంతా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సివిల్ ఇంజినీర్ కావడమే నా కల’ అంటున్నాడీ బాలుడు. ఐఏఎస్ లక్ష్యం... కాటేదాన్: నిజామాబాద్ ప్రాంతానికి చెందిన దిలీప్ కుటుంబంతో కలసి నగరానికి వ లస వచ్చాడు. స్థానికంగా ఓ బ్యాటరీ ఫ్యాక్టరీలో డ్రైవర్గా పని చేస్తూ... అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆయనకు ఓ కూతురు, కుమారుడు సంతానం. కుమార్తె ప్రియాంక మైలార్దేవ్పల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి.. 9 జీపీఏ సాధించింది. రాజేంద్రనగర్ మండలంలోనే టాపర్గా నిలిచింది. మంచి ఫలితాలు సాధించిన తమ కుమార్తెను ఉన్నత చదువులు చదివించేందుకు ప్రోత్సహిస్తానని తండ్రి దిలీప్ పేర్కొన్నాడు. కలెక్టర్ కావాలనేది తన లక్ష్యమని ప్రియాంక వివరించింది. చెరుకు బండే.. బతుకు బండీ రాయదుర్గం: చెరుకుబండి నడిస్తేనే వారి బతుకుబండి సాగుతుంది. వచ్చిన కొద్దిపాటి మొత్తంతో తన కూతురును చదివించి ఉత్తమ ఫలితాల సాధనకు ఆ తల్లిదండ్రులు కృషి చేశారు చిలుకూరు సమీపంలోని మేడిపల్లికి చెందిన నర్సింగరావు, విజయలక్ష్మి దంపతులు. తమ ముగ్గురు ఆడపిల్లలతో 13 ఏళ్ల క్రితం రాయదుర్గానికి వలస వచ్చారు. స్థానికంగా సీజన్లో చెరుకుబండి నడపడం, ఆ తర్వాత కూలీ పనులు చేస్తూ ఆ తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివిస్తున్నారు. వీరి రెండో కూతురు సాయి ప్రసన్న పదో తరగతిలో 9.3 జీపీఏ సాధించింది. పేదింటి నుంచి వచ్చినా కష్టపడి చదివి ఆమె మంచి మార్కులు సాధించిందని స్థానిక నాగార్జున ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ భరత్ కుమార్ తెలిపారు. ముగ్గురు పిల్లలు నాగార్జున ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారని, కరస్పాండెంట్ భరత్ కుమార్ పిల్లల ీఫీజుల విషయంలో అండగా నిలిచారని ఆ తల్లిదండ్రులు తెలిపారు. ఇంజినీర్ను కావాలన్నదే తన లక్ష్యమని సాయిప్రసన్న తెలిపింది. పాలు అమ్ముతూనే... కుత్బుల్లాపూర్ మండలం ప్రగతి నగర్లో వాచ్మెన్గా పనిచేసే శ్రీనివాస్, ఉదయ్లక్షి్ష్మల కుమారుడు నాగసతీష్. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివి... 9 జీపీఏ సాధించాడు. ఉదయం 5 గంటల నుంచి ఇంటింటికి తిరిగి పాల ప్యాకెట్లు వేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూనే చదువు కొనసాగించాడా కుర్రాడు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి...శ్రద్ధగా చదివి మంచి మార్కులు సాధించాడు. ఇదిలా ఉండగా...తన ఉన్నత చదువులకు ఆర్థిక సాయం చేసేందుకు సినీ నటి రజిత ముందుకువచ్చారని నాగసతీష్ తెలిపాడు. ఇంటర్లో మంచి మార్కులు సాధించి...ఇంజినీర్ కావాలన్నదే తన లక్ష్యమని చెప్పాడు. ఇంజినీర్నవుతా.. మూసాపేట: మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన శ్రీనివాస్గౌడ్, అంజమ్మ దంపతులు పదేళ్ల క్రితం హైదరాబాద్కు వలస వచ్చారు. కూకట్పల్లి ఆర్టీసి డిపో ఎదురుగా ఇండ్లీ బండి నడిపిస్తుంటారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. మూసాపేట డివిజన్ ప్రగతినగర్లోని శ్రీసాయి విద్యానికేతన్ స్కూల్లో చదివిన స్వప్న పదో తరగతిలో 9.5 పాయింట్స్ సాధించింది. ఈ దంపతుల ఇద్దరు కుమార్తెలు బీటెక్, డిప్లమో చదివిస్తున్నాడు. స్కూల్ టాపర్గా నిలిచిన చిన్న కుమార్తె స్వప్న ఇంజినీర్ను అవుతానని...తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకుంటానని చెబుతోందీ బాలిక. ఎంత కష్టం వచ్చినా ముగ్గురు కుమార్తెలను మంచిగా చదివిస్తానని, తను పడుతున్న కష్టం కూతుళ్లు పడకూడదని శ్రీనివాస్గౌడ్ అంటున్నారు. డాక్టర్ కావాలనుంది.. మలక్పేట: మలక్పేట్ సలీం నగర్లోని గురుకుల పాఠశాల విద్యార్థిని దావల యామిని పదో తరగతిలో 9 జీపీఏ సాధించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దావల దుర్గారావు, సీతామహాలక్ష్మి దంపతులు జీవనోపాధి కోసం పదేళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. మన్సూరాబాద్లోని సాయినగర్ గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. దుర్గారావు ప్లంబర్గా... సీతామహాలక్ష్మి గురుకుల పాఠశాలలో క్యాజువల్ లేబర్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇంటి పనుల్లో తల్లికి తోడుగా ఉంటూనే చదువులో మంచి ప్రతిభ కనబరిచిందీ విద్యార్థిని. ఈ సందర్భంగా యామిని మాట్లాడుతూ.. మెడిసిన్ చదువుకుని... పేదలకు సేవచేసి ఉత్తమ డాక్టర్గా పేరు తెచ్చుకుంటానని తెలిపింది. మంచి మార్కులు సాధించేలా ప్రోత్సహించినతల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు రుణపడి ఉంటానని తెలిపింది. అమ్మ కష్టం వృథా కానివ్వను జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్ట శ్రీనివాస్నగర్లో ఉండే రజిత కుమార్తె ఉమ జగద్గిరిగుట్టలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివింది. పబ్లిక్ పరీక్షల్లో 9 జీపీఏ సాధించింది. ఉమ తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తల్లి రజిత బిడ్డను కష్టపడి చదివించింది. వ చ్చిన అరకొర జీతంలో కుటుంబాన్ని పోషిస్తూ.. కొడుకు, కూతురును చదివిస్తోంది. తమ కూతురు చదువుకు ఎవరైనా దాతలు సహ కరించాలని రజిత కోరుతోంది. ఇంజినీర్ను కావడమే తన ధ్యేయమని.. తన తల్లి పడిన కష్టానికి ప్రతిఫలంగా... బాగా చదివి... సమాజానికి సేవ చేయాలని ఉందని ఉమ చెబుతోంది. -
ప్రకృతి దేవోభవ
- పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల కృషి - సెయింట్ జోసెఫ్స్ స్కూల్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు - పాఠశాల వేదికగా పనిచేస్తున్న ఎకోక్లబ్ పర్యావరణం దెబ్బతింటే బాధితులుగా మారేది భావితరాలే. అందుకే.. ప్రకృతిని కాపాడుకోవాల్సిన అంశంలో అత్యవసరంగా అవగాహన పెంచాల్సింది విద్యార్థుల్లోనే. ఈ విషయంలో ఆశాభావాన్ని రేకెత్తిస్తున్నాయి నగరంలోని పాఠశాలల్లో ఏర్పాటవుతున్న ‘ఎకో క్లబ్స్’. వీటిలో కొన్ని స్పష్టమైన విధానాలతో ముందడుగేస్తున్నాయి. ఇతర పాఠశాల విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. - సాక్షి, లైఫ్స్టైల్ ప్రతినిధి ‘మా స్కూల్లో 30 మంది విద్యార్థులు ఎకో క్లబ్లో వలంటీర్లుగా ఉన్నార’ని చెప్పారు కింగ్కోఠిలోని సెయింట్ జోసెఫ్స్ పబ్లిక్స్కూల్ టీచర్ రమ. ప్రస్తుతం తమ స్కూల్లోని ఎకోక్లబ్కు కో ఆర్డినేటర్గా ఉన్నారామె. పర్యావరణంపై విద్యార్థుల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను నిర్వహించే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘వెల్త్ అవుటాఫ్ వేస్ట్’ (వావ్) ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ కాంపిటీషన్లో 2014-15కు గాను పాఠశాలలోని ఎకో క్లబ్ విజేతగా నిలిచింది. ఈ పాఠశాల విద్యార్థులు 9,545 కిలోల పేపర్ వేస్ట్ను సేకరించి ‘వావ్’కి అందించడం ద్వారా గెలుపు దక్కించుకున్నారు. ఇదే ఏడాది మరో ఎన్జీఓ ‘టెరి’ నిర్వహించిన టెట్రాప్యాక్ల కలెక్షన్ పోటీలోనూ వీరు గెలుపొందారు. ఇంతే కాకుండా కొంతకాలంగా విభిన్న రకాల యాక్టివిటీస్ ద్వారా తమ ఎకో క్లబ్ విద్యార్థుల్లో చైతన్యం పెంచుతోందని వివరించారు రమ. పర్యావరణ స్పృహే ధ్యేయంగా.. స్కూల్లో 2005లో ఎకోక్లబ్ ఏర్పాటైంది. అదే ఏడాది నుంచి స్కూల్లో మొక్కలు నాటడం మొదలుపెట్టారు. ఫలితంగా అప్పటి వరకూ పచ్చని ఆకుకు సైతం నోచుకోని పాఠశాల ప్రాంగణంలో ఇప్పుడు వందలాది చెట్లు పెరిగాయి. ‘నాటిన 500 మొక్కల్లో ఎన్నో ఏపుగా పెరిగాయి. క్రోటన్స్ నుంచి పూల మొక్కల వరకూ మా స్కూల్ మొత్తం గ్రీనరీయే. త్వరలో ఆర్గానిక్ గార్డెనింగ్ను స్కూల్ టైపై ఏర్పాటు చేయనున్నాం’ అంటూ ఉత్సాహంగా చెప్పారు రమ. ఈ స్కూల్లోని ఎకోక్లబ్ ప్రసిద్ధ ఎన్జీఓ ‘టెరి’ నుంచి గత ఐదేళ్లుగా టెట్రాప్యాక్ల కలెక్షన్ పోటీలో గెలుపొందుతూ ఎన్విరాన్మెంట్ అంశాల్లో బెస్ట్ స్కూల్గా నిలుస్తోంది. పర్యావరణం అంశంలో అందుకున్న నగదు బహుమతులను సైతం వీరి క్లబ్ పాఠశాలలో ట్రీ ప్లాంటేషన్కు అవసరమైన ఖర్చులుగా వినియోగించడం విశేషం. ‘ఎనర్జీ సేవింగ్’ అంశంపై పీయూష్ గోయల్తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ వర్క్షాప్కు మన రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక స్కూల్ మాదే’నని వివరించారు ఆమె. హోలీ, దీపావళి, సంక్రాంతి పండుగల సమయంలో ఆర్గానిక్ రంగులు, టపాసులు.. వినియోగంపై తమ విద్యార్థులు రకరకాల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారని, ప్లాస్టిక్ వినియోగాన్ని వద్దనే సందేశంతో పెయింటింగ్, వ్యాసరచన పోటీలతో పాటు తరచుగా ర్యాలీలు నిర్వహిస్తారని చెప్పారు. మనిషిని ప్రకృతి పుట్టిస్తే.. అభివృద్ధి పేరిట ఆ ప్రకృతినే నాశనం చేస్తున్నాడు మనిషి. ఆ ఫలితం ఇప్పటికే రకరకాల వైపరీత్యాల రూపంలో మనకు అనుభవంలోకి వస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో యుక్త వయసులోనే ప్రకృతి, పర్యావరణ ప్రాధాన్యతను తెలియజెప్పే ఎకోక్లబ్స్ అన్ని స్కూల్స్లో ఇంతే యాక్టివ్గా మారితే.. పచ్చని భవితకు ఆసరాగా మారితే.. అంతకన్నా కావాల్సిందేముంది? -
సైన్స్ విజన్
జపాన్ టూర్పై విద్యార్థుల ఆనందం సాక్షి, సిటీబ్యూరో: మానవాళి మనుగడ, అభివృధ్ధిలో సైన్స్ ప్రాధాన్యత... అది విద్యార్థులకు కెరీర్ పరంగా అందించే విజయాలు... జపాన్ పర్యటన తె లియజెప్పిందని నగరానికి చెందిన పాఠశాల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. జపాన్ సైన్స్ టెక్నాలజీ ఏజెన్సీ ‘సకురా సైన్స్ ప్రోగ్రామ్’లో భాగంగా లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు 25 మంది జపాన్లో పర్యటించారు. నగరానికి తిరిగి వచ్చిన సందర్భంగా వారు అక్కడి విశేషాలను పంచుకున్నారు. ఉన్నత పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రయోగశాలలు, క్యోటో యూనివర్సిటీ సందర్శన, టోక్యోకు బుల్లెట్ రైలు ప్రయాణం, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టె క్నాలజీ, టోక్యో ఎమెర్జింగ్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ మ్యూజియం... వంటివి సందర్శించడం మరిచిపోలేని అనుభూతిని అందించిందని వివరించారు. ఇదొక విజ్ఞాన, వినోదాల మేలు కలయికగా సాగిన పర్యటన అని పేర్కొన్నారు. ఈ పర్యటనలో పాల్గొన్న స్కూల్ ప్రిన్సిపల్ బ్రదర్ ఆంటోనిరెడ్డి, టీచర్ మేరియాన్లు కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. -
బుక్ ఆర్ట
రబ్బర్ స్టాంప్, ప్రింట్, టెక్ట్స్ బుక్స్ వంటివి ఆమె చేతిలో పడితే కళా రూపాలుగా మారిపోతాయి. ఇండియాలో అంతగా ప్రాచుర్యంలో లేని ఈ సరికొత్త కళల్లో ఆమె అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ఆమె పేరు మాలిని గుప్తా. పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే అయినా.. ఉండేది మాత్రం అమెరికాలో. తన కళారూపాలను ‘ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ఆర్ట్’ పేరుతో కళాకృతి గ్యాలరీలో ప్రదర్శన ఏర్పాటు చేశారామె. ఈ సందర్భంగా మాలిని గుప్తాతో ‘సాక్షి’ చిట్చాట... ఇక్కడి ఏర్పాట్లు.. మన దేశంలో కళలంటే ఆదరణ చాలా తక్కువ. టైం, డబ్బు వృథా అనే ఆలోచన ఉంది. ఇందుకు భిన్నంగా గ్యాలరీలు ప్రదర్శనలు ఏర్పాటు చేసుకునే వీలు, మీడియాలో కథనాలు రావటం చూస్తుంటే కళాకారులకు సంబంధించినంత వరకు చాలా మార్పులు వచ్చాయని అనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ ఇప్పుడు చాలా మారింది. అప్పట్లో కళాకారుల కోసం గ్యాలరీలు లేవు. మై హోమ్టౌన్.. నేను పుట్టి, పెరిగింది హైదరాబాద్లోనే. 2002లో యూఎస్కి వెళ్లాను. ఎలక్ట్రానిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేశాను. అక్కడికి వెళ్లాక బీఎఫ్ఏ చేశాను. నా సొంత సిటీ అంటే ఎప్పుడు ప్రత్యేకమే. యూఎస్, యూకే దేశాల్లోని ఎన్ని సిటీల్లో ప్రదర్శనలు ఇచ్చినా హోమ్టౌన్లో ప్రదర్శన ఇవ్వటం చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. సిటీలో మళ్లీ ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాను. అమెరికా నుంచి సిటీకి.. అమెరికాలోని నార్త్ పసిఫిక్ ఆర్ట్ కాలేజ్లో నేర్చుకున్నా. నా థీసిస్ సబ్జెక్ట్ ఆర్టిస్ట్ పుస్తకం. బైండ్ చేయడం, ప్రింట్ చేయడం అందులో భాగం. ఇక అప్పటి నుంచి పుస్తకం, అక్షరాలతో నా చెలిమి మరింత ఎక్కువైంది. నా థీసిస్కి అక్కడ అవార్డు కూడా లభించింది. ఆ తర్వాత నేను ఒరెగన్ ఆర్ట్ కాలేజ్లో బుక్ ఆర్ట్ నేర్చుకున్నాను. నాకు స్టోరీ టెల్లింగ్ అంటే చాలా ఇష్టం. నేనొక కళాకారిణిని. గ్రాఫిక్ డిజైనర్ని. నాకు సంబంధించి ఇవన్నీ కలిసింది బుక్ ఆర్ట్. దీంట్లో గ్రాఫిక్ డిజైన్, క్రాఫ్ట్, ఆర్ట్ అన్నీ ఉంటాయి. న్యూయార్క్, జర్మనీలో నిర్వహించిన పోటీల్లో నేను చేసిన పోస్టర్కి అంతర్జాతీయ అవార్డ్ వచ్చింది. ఆ తర్వాత కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి. కానీ నా థీసిస్కి వచ్చిన అవార్డ్ నాకు చాలా స్పెషల్. -
సేవకు సలామ్
మనిషికి ఎలాంటి శారీరక, మానసిక సమస్య ఎదురైనా తలచుకునేది దైవాన్ని.. కలుసుకునేది వైద్యుడిని. అలాంటి వైద్య వృత్తికే వన్నె తెచ్చారు సిటీకి చెందిన యువ డాక్టర్లు. నేపాల్ భూకంపంలో క్షతగాత్రులైనవారికి సేవలు అందించేందుకు ముందుకు రావాలని ‘క్యూరోఫి’ యాప్లో పోస్ట్ వచ్చింది. ఇది చూసిన సిటీకి చెందిన ‘ఆకృతి, విశిష్ట, యశ్వంత్’ స్పందించారు. కామినేని ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తున్న ఆకృతి, నిమ్స్లో ఫిజియోథెరపిస్ట్గా సేవలందిస్తున్న విశిష్ట, శ్రీకాకుళం జీఎంఎస్ ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తున్న యశ్వంత్ ఇక్కడి నుంచి పయనమయ్యారు. వీరికి భోపాల్ నుంచి ముగ్గురు డాక్టర్లు, ముంబై, ఢిల్లీ నుంచి ఒక్కో వైద్యుడు చేయందించారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న నేపాల్ ప్రజలకు వైద్య సేవలు అందించారు. అక్కడ తాము ఎదుర్కొన్న అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు ఆకృతి, విశిష్ట, యశ్వంత్. ఆ వివరాలు వారి మాటల్లోనే.. - సాక్షి, సిటీబ్యూరో - నేపాల్ భూకంప ప్రాంతంలో వైద్యశిబిరాలు - ప్రాణాలను పణంగా పెట్టి సిటీ వైద్యుల సేవలు ఇలా మొదలైంది.. ‘మే 6న కాట్మాండ్కు బయలుదేరాం. ఏడున అక్కడ మెడికల్ క్యాంప్ పూర్తయింది. మరుసటి రోజు మధ్యాహ్నానికి సింధుపాల్ చౌక్ ప్రాంతానికి చేరుకున్నాం. నేపాల్లో ఎక్కడ భూకంపం వచ్చినా ఆది సింధుపాల్ చౌక్ నుంచి మొదలువుతుందని విన్నాం. అక్కడ పరిస్థితి భయానకంగా ఉంది. సమీప ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. రక్తపు మడుగుల్లో ఉన్నవారిని చూస్తే బాధేసింది. పోలీసులు, నేపాల్ ఆర్మీతో కలిసి క్షతగాత్రులకు వైద్యం అందించాం. అప్పటికే కొండచరియలు విరిగిపడటంతో మెడిసిన్ బ్యాగులను మోసుకుంటూ కొండలపైకి వెళ్లాం. 10,11 తేదీల్లో గ్రామాల్లో మెడికల్ క్యాంప్ చేశాం. ఆ తర్వాత లమసాంగ్ నుంచి 11.5 కిలోమీటర్ల దూరంలో ఉండే నేపాల్, చైనా బార్డర్కు బయలుదేరాం. ఈ సమయంలోనే మా కళ్ల ముందే మరోసారి భూకంపం వచ్చి కొండచరియలు విరిగిపడ్డాయి’ సమయం: మే 13 ఉదయం.. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య మరోసారి భూకంపం వస్తుందని ప్రకటించారు. ఆర్మీ అధికారులు వెంటనే కాట్మాండ్ బయలుదేరమన్నారు. లమ్సాంగ్ నుంచి కాట్మాండ్కు 2.30 గంటలు పడుతుంది. మధ్యలో అన్నీ కొండలే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎలాగైతేనేం సాయంత్రానికి కాట్మాండ్ చేరుకున్నాం. మరుసటి రోజు అక్కడి పోలీసు అకాడమీలో వైద్య శిబిరం నిర్వహించాం. ఆ రోజు రాత్రికే మమ్మల్ని ఢిల్లీకి పంపించారు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నాం. సేవ ముందు మా ప్రాణ భయం మోకరిల్లింది’ అంటూ ముగించారు. క్షణక్షణం భయం భయం.. ‘జంబూ విలేజ్కు చేరుకోగానే కొండచరియ విరిగిపడటంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఆ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం భూకంపం వచ్చింది. కొండలు పడిపోయాయి. చాలా మంది చనిపోయారు. జంబూ కొండ దిగువనున్న గంగా నది వద్ద రెండు గంటలు పాటు ఉన్నాం. అప్పటికే సాయంత్రమైంది. మేం వైద్యులమని తెలియగానే జంబూ గ్రామస్తులు సమూహంగా మా వద్దకు వచ్చారు. వారందరికి వైద్యం చేశాం. అప్పటికి ఆర్మీ రోడ్డును క్లియర్ చేసింది. జంబూలోని విరిగిపడిన పెద్ద కొండను పెకలించాలంటే బాంబు పెట్టాలి. అప్పటికే సమయం దాటిపోయింది. దీంతో రోడ్డుపై పడిన కొండ ఎక్కి, దూకాం. రోడ్డు ఇరువైపులా ఉన్న కొండలు ఏ సమయంలోనైనా పడిపోవచ్చనే సమాచారంతో సుమారు ఎనిమిది కిలోమీటర్లు పరుగుపెట్టాం. రాత్రి ఎనిమిది గంటల సమయంలో అటువైపుగా వచ్చిన ఆర్మీ జీపు ఎక్కి లమసాంగ్కు వెళ్లాం. అప్పటికే మాకు కేటాయించిన గెస్ట్హౌస్ కకావికలమైంది. ఆ రోజు రాత్రంతా కొండ ఊగింది.. ఎవరికీ నిద్ర లేదు. ఇంత భయంలోనూ మా వైద్య సేవలు ఆపలేదు. మేం ఎక్కడ ఉంటే అక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించాం. -
ఓల్డ్ ఈజ్ బ్యూటీఫుల్
టెక్నాలజీ ఎంత మారినా పాత వస్తువులు ఎప్పటికీ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఒకప్పుడు రాగాలు పలికిన గ్రామ్ఫోన్, పూర్తిగా చెక్క, ఇత్తడితో చేసిన టెలిఫోన్ ఇప్పటి వారికి కొత్తగానే ఉంటాయి.బీదర్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇలాంటి పాత వస్తువులను సోమవారం బంజారాహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద అమ్మకానికి పెట్టాడు. ఆ దారంట వెళ్లేవారు వాటిని ఆసక్తిగా తిలకించారు. - ఫొటో: మహ్మద్ రఫీ -
థింక్ బ్రదర్స్.. మిల్క్షేక్ కింగ్స్
- స్టార్టప్ సక్సెస్ మంత్ర.. - సిటీవాసులకు యూరప్ రుచులు అవార్డులు వరించాయి.. ‘సాధారణంగా మన నగరంలో మిల్క్షేక్లు రూ.20లకు లభిస్తాయి. కానీ అది మిల్క్షేక్ కాదు. డిఫరెంట్ ఐటమ్స్తో వినూత్న ఆలోచనతో మేం రియల్ మిల్క్షేక్ను సిటీవాసులకు మేం అందిస్తున్నాం.. మంచి సక్సెస్ సాధించాం. ఇందుకు ‘న్యూ కామర్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ మిల్క్ షేక్, బెస్ట్ డిసార్ట్స్ ఇన్ హైదరాబాద్’ అవార్డులు కూడా అందుకున్నాం’ అని గర్వంగా చెబుతున్నారు ఈ ఇద్దరు సోదరులు. అప్పటికప్పుడు రెడీ.. కస్టమర్లు తమకు నచ్చిన ఐటమ్ ఆర్డర్ ఇవ్వగానే వీరు రెడీ చేస్తారు. లైవ్గా చూడవచ్చు. డిఫరెంట్ ఐటెమ్స్కు మిల్క్, ఐస్క్రీమ్లను మిక్స్ చేసి సిటీవాసులకు యూరప్ తరహా టేస్ట్లను చూపెడుతున్నారు వీరు. ‘నెలలో ఒకటి, రెండుసార్లు హైదరాబాద్ ఫుడ్డీస్ లవర్స్ కూడా గ్రూప్గా వచ్చి థిక్ షేక్ రుచులను ఆస్వాదిస్తుంటారు. సెలబ్రిటీలు కూడా ఈ రుచులకు ఫిదా అవుతున్నారు’ అని చెప్పుకొచ్చారు యశ్వంత్. మిల్క్ షేక్ రుచులను సిటీవాసులకు పరిచయం చేసిన ఈ సోదరులు సామాజిక బాధ్యతగా చిన్నారుల సంక్షేమానికి కృషి చేసే ఓ స్వచ్ఛంద సంస్థకి థిక్ షేక్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు కూడా. ఇవీ మిల్స్షేక్ స్పెషల్స్.. అల్ఫాన్సో మ్యాంగ్ మెలడి షేక్, చాక్లెట్ బ్రౌనీ క్రంబుల్ షేక్, సూపర్మెన్ సీక్రెట్ షేక్, పీనట్ బట్టర్ ఇండెల్జెన్స్ షేక్, వెరీబెర్రీ షేక్, మాల్టో మింట్, టాంజి ఆరంజ్, బ్లూ ఏంజిల్ వంటి ఫ్లషర్స్ ఇక్కడి ప్రత్యేకత. సమ్మర్ సీజన్ స్పెషల్ అయిన అల్ఫాన్సో మ్యాంగ్ మెలడి షేక్కు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. మిల్క్, చాక్లెట్ ఐస్క్రీమ్, బ్రౌనీలతో రెడీ చేసిన చాక్లెట్ బ్రౌనీ క్రంబుల్ షేక్, హనీ, మ్యూజిలి, వెనీలా కాంబినేషన్తో తయారుచేసిన సూపర్మెన్ సీక్రెట్ షేక్లను టేస్ట్ చేసేందుకు పిల్లలు ఎగబడుతున్నారని చెబుతున్నారు థిక్షేక్ బ్రదర్స్. అలా మొదలైంది.. ‘భువనేశ్వర్లోని జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ చేస్తున్నప్పుడు యూరప్ వెళ్లా. అక్కడి మిల్క్ షేక్ను టేస్ట్ చేశా. సూపర్గా ఉంది. ఎంబీఏ అయ్యాక హైదరాబాద్లోని టీసీఎస్లో ఏడాదిపాటు జాబ్ చేశా. మరోసారి యూరప్కి వెళ్లినప్పుడు మిల్క్షేక్ రుచిని మరిచిపోలేకపోయా. ఇదే తరహా ఐటమ్స్ను ఇండియాలో పరిచయం చేయాలనుకున్నా. నా ఆలోచనను పేరెంట్స్కు చెప్పా. ఎంబీఏ చేసిన తమ్ముడు అశ్విన్ కూడా ‘ఎస్’ అన్నాడు’ అంటూ చెప్పారు యశ్వంత్ నాగ్. ‘తొలినాళ్లలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. మిల్క్షేక్స్తో వ్యాపారం ఏం చేస్తావ్ అన్నవారున్నారు. అయినా అన్నతో కలిసి ముందుకెళ్లా’.. అని చెప్పారు అశ్విన్ అనంత్ నాగ్. మొదట 2013 డిసెంబర్లో కూకట్పల్లి మంజీర హాల్లోని ‘థిక్ షేక్ ఫ్యాక్టరీ’ అవుట్లెట్ ప్రారంభించిన వీరు.. వచ్చిన రెస్పాన్స్తో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10, సికింద్రాబాద్ సింధు కాలనీలోను అవుట్లెట్లు తెరిచి విజయవంతంగా రన్ చేస్తున్నారు. -
రిమ్జిమ్.. బ్రెయిన్ జిమ్
దేహం ఫిట్గా ఉండేందుకు జిమ్కు వెళతాం.. మరి బ్రెయిన్ ఫిట్గా (చురుగ్గా) ఉండాలంటే..! ఇందుకు ప్రత్యేక వ్యాయామాలు ఉన్నాయి. వీటిని చేయించేందుకు ప్రత్యేక జిమ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ కేవలం జ్ఞాపకశక్తిని పెంచే వ్యాయామాలు మాత్రమే చేయిస్తారు. ఇప్పుడు సిటీలో వీటికి క్రేజ్ పెరిగింది. మలేషియాలో అంకురించిన బ్రెయిన్ జిమ్ కాన్సెప్ట్ ఇప్పుడు సిటీవాసులను అలరిస్తోంది. ఇన్నాళ్లు చదువుతో బిజీగా గడిపిన తమ పిల్లల్లో చురుకుదనాన్ని పెంచేందుకు దోహదపడుతున్న ఈ డిఫరెంట్ ఎక్సర్సైజులకు పిల్లల తల్లిదండ్రులు ఆకర్షితులవుతున్నారు. సమ్మర్లో ఈ యాక్టివిటీని నేర్చుకునేందుకు పిల్లలను ఆయా శిక్షణ సంస్థల్లో చేర్పిస్తున్నారు. * శిక్షణకు క్యూ కడుతున్న పిల్లలు * జ్ఞాపకశక్తి పెంచే విభిన్న వ్యాయామాలు.. ఎల్కేజీ నుంచి తమ పిల్లలు చదువులో ముందుండాలనే తాపత్రయం నేటి తల్లిదండ్రుల్లో పెరిగింది. దగ్గరుండి మరీ సందేహలు తీరుస్తున్నారు. కొందరు పిల్లలు తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేక పోతున్నారు. లాస్ట్ బెంచ్ విద్యార్థులను సైతం ఫస్ట్ ర్యాంకర్స్లా తీర్చిదిద్దడానికి పుట్టుకొచ్చిందే బ్రెయిన్ జిమ్. పిల్లల మెదడుకు పదునుపెట్టి.. చురుగ్గా పనిచేసే కిటుకులను నేర్పిస్తోంది. అంతే కాదండోయ్ మెమొరీ గేమ్స్, డాన్స్, ఫన్ యాక్టివిటీస్, రిలాక్సేషన్ ఎక్సర్సైజులను పిల్లలకు నేర్పిస్తున్నారు. పిల్లల్లో జ్ఞాపకశక్తి, గ్రాహకశక్తితో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతున్నారు. రెగ్యులర్కు భిన్నంగా.. పిల్లలను అన్ని పనుల్లో చురుగ్గా ఉంచేందుకు దోహదం చేసే ఈ బ్రెయిన్ జిమ్లో నిపుణుల మార్గదర్శనంలో ఐదేళ్ల నుంచి పదహరేళ్ల పిల్లలతో విభిన్నమైన ఆసనాలు వేయిస్తారు. సాధారణంగా మెడిటేషన్.. మానసిక ప్రశాంతతో పాటు ఏకాగ్రతను పెంచుతుంది. ‘మేం చెప్పే ఎక్సర్సైజు చేస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. భావోద్వేగాలను కంట్రోల్ చేయగలరు. ఒక్కముక్కలో చెప్పాలంటే అన్ని విషయాల్లో పిల్లలు చాలా చురుగ్గా, చాకచాక్యంగా ఉంటార’ని చెబుతున్నారు బ్రెయిన్ జిమ్ ఎక్స్పర్ట్స్. బ్రెయిన్ జిమ్లో కుడి, ఎడమ చేతులు ఒకేసారి పనిచేసేలా ఎక్సర్సైజులు ఉంటాయి. హ్యాండ్స్, లెగ్స్, ఫింగర్స్ కోసం ప్రత్యేక వ్యాయామాలు ఉన్నాయి. అయితే రెగ్యులర్ వ్యాయామాలకు భిన్నంగా ఉండటంతో వీటిని చేసేందుకు చిన్నారులు ఆసక్తి చూపుతున్నారు. మెమొరీ గేమ్స్పై ఆసక్తి.. మెమొరీ గేమ్స్ పిల్లల ఆలోచనల్లో మార్పులు తీసుకొస్తున్నాయి. ‘20 మంది పిల్లలకు మెమరీ గేమ్ను చూపెడతాం. పది మందిని గుర్తు పెట్టుకోమంటాం. ఏ పొజిషన్లో ఏమున్నాయో గుర్తు పెట్టుకొని వాళ్లు మళ్లీ చెప్పాలి. ఇలా ట్రయాంగిల్, సబ్ ట్రయాంగిల్లో నంబర్లు చూపెడతాం. ఇలా చేయడం వల్ల పిల్లలు చూసింది చూసినట్టు గుర్తు పెట్టుకోవడానికి అవకాశముంటుంది. దీన్ని ఫొటోగ్రఫిక్ మెమొరీ అని కూడా అంటారు’ అని చెబుతున్నారు ఎంబీఎం ఇన్స్ట్రక్టర్ సపర్ణ. అలాగే మైండ్ రిలాక్స్ కోసం చేయించే డాన్స్కు కూడా పిల్లల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. స్కూల్లో పుస్తకాలు, ఇంటికొచ్చాక వీడియో గేమ్స్, లేదంటే కంప్యూటర్ ముందు కాలం వెళ్లదీస్తున్న సిటీ పిల్లలకు ఆరోగ్యకరమైన ఎంటర్టైన్మెంట్ ఉండటం లేదు. అందుకే ఎంబీఎం నేర్పిస్తున్న మలేషియన్ డాన్స్ స్టెప్పులపై పిల్లలు ఆసక్తి కనబరుస్తున్నారు సిటీ కిడ్స్. ఇంకా మ్యూజిక్, డిస్కషన్స్, ఆలోచనలు పంచుకోవడం లాంటి అంశాల్లోనూ పిల్లలు పరిణతి సాధించేలా చూస్తున్నారు నిపుణులు. కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, హబ్సిగూడలో ఎంబీఎం కేంద్రాలున్నాయి. ఈ సెంటర్స్లో పిల్లలతో పాటు అరవై ఏళ్ల వయసు వారిని కూడా ఒత్తిడి నుంచి బయటపడేందుకు కౌన్సెలింగ్, సెల్ఫ్ మోటివేటింగ్, క్రియేటివిటీ ఇంట్రెస్టు వంటివి కూడా నేర్పిస్తున్నారు. శిక్షణ తరగతులు... బ్రెయిన్ జిమ్, మెమొరీ ట్రైనింగ్, కాన్సంట్రేషన్ అటెన్షన్ ఇంప్రూవ్మెంట్, బిహేవియర్ ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంఫ్రూవ్మెంట్, క్రాఫ్ట్, హ్యాండ్ రైటింగ్లో క్లాసులు నిర్వహిస్తోంది మిడ్ బ్రెయిన్ మాస్టర్స్. చేరాలనుకునేవారు 81250 50015 నంబర్లో సంప్రదింవచ్చని సంస్థ నిర్వాహకులు తెలిపారు. -
పలుకుబడికి పురస్కారాల జడి..
రేడియో జాకీలు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఐఆర్ఎఫ్-2015’ అవార్డులు ఈసారి నగరానికి నాలుగు కేటగిరీల్లో లభించాయి. జాతీయ స్థాయిలో వివిధ స్టేషన్స్ నుంచి అనేక కేటగిరీల్లో టౌన్ స్థాయి నుంచి మెట్రో సిటీస్ రేడియో స్టేషన్స్, ఆర్జేలు ఈ అవార్డుల కోసం పోటీ పడతారు. అంత పోటీని తట్టుకుని నగర ఆర్జేలు పురస్కారాలు సాధించారు. ఆ వివరాలు.. - సాక్షి, సిటీబ్యూరో బెస్ట్ బ్రేక్ఫాస్ట్ షో.. శివ్ ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలను బ్రేక్ ఫాస్ట్షో, నాన్ బ్రేక్ఫాస్ట్ షోలుగా విభజిస్తారు. దీనిని బట్టి బ్రేక్ ఫాస్ట్షో ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. రేడియో సిటీ 91.1 ఎఫ్ఎంలో ప్రసారమయ్యే బ్రేక్ఫాస్ట్ షోకు ఆర్జే శివ్ అవార్డు అందుకున్నారు. ‘రెండవ అవార్డ్ను ఈ బ్రేక్ఫాస్ట్ షోకి అందుకోవడం చాలా ఆనందంగా వుంది. నా బ్రేక్ ఫాస్ట్లో న్యూస్ హెడ్లైన్స్, లోకల్ హ్యాపెనింగ్స్, జాబ్ అప్డేట్స్, హాట్సీట్లో ఒక సెలబ్రిటీని లేదా పొలిటికల్ పర్సనాలిటీని కూర్చోబెట్టి సెటైరిక్ ప్రశ్నలు వేయడం, సినిమాలో పంచ్ డైలాగ్స్కి రేడియో సిటీ మార్క్లో పంచ్ ఇవ్వటం వంటివి డిఫరెంట్గా ప్రెజెంట్ చేస్తుంటాను’ అని చెప్పారు శివ్. బెస్ట్ షో ఆఫ్ ది ఇయర్.. ‘జబర్ దస్త్ మస్తీ’ ‘అనుకున్నది క్లిక్ అయితే ఆ కిక్కే వేరు’ అంటున్నాడు రెడ్ ఎఫ్ఎం ఆర్జే చైతు. ఈయన చేసిన ‘జబర్ దస్త్ మస్తీ’కి అవార్డ్ అందుకున్నారు. ‘ముందు ఈ లేడిస్ షో నేను చేయనన్నా. కానీ వర్కవుట్ అవుతుందని ఒప్పించారు. ఐదు నెలల్లోనే అవార్డు వచ్చింది. బెస్ట్ ఆర్జే అవార్డ్ సాధించాలని కోరిక’ అంటూ చెప్పాడు. బెస్ట్ ఆర్జే.. శేఖర్ మామ ఎఫ్ఎం రేడియో వినే సిటీవాసులకు శేఖర్ మామ అంటే తెలియనివారు అరుదే. రేడియో జాకీగా, జెమిని యాంకర్గా చిరపరిచితుడైన శేఖర్ బాషా.. ఐఆర్ఎఫ్ నుంచి ‘బెస్ట్ ఆర్జే ఆఫ్ ది ఇయర్ అవార్డ్’ను మరోసారి అందుకున్నాడు. ‘లిజనర్స్కు నా షోస్ను నిర్విరామంగా ఆదరించడం వల్లే ఈ అవార్డ్ను వరుసగా దక్కించుకోగలిగా’ అంటూ ఆనందంగా చెప్పే శేఖర్.. అత్యధిక సంఖ్యలో ఐఆర్ఎఫ్ అవార్డ్స్ (బెస్ట్ ప్రోమోస్, బెస్ట్షోస్ సహా మొత్తం 15) అందుకున్న ఏకైక ఆర్జేగా ఇండియాలోనే రికార్డ్ సృష్టించాడు. వీటితో పాటు ఐఎస్బీ నుంచి ‘యంగ్ కమ్యూనికేటర్ అవార్డ్’ సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. బెస్ట్ ప్రోమో.. శ్రీరామ పవన్ ఈసారి ‘బెస్ట్ ప్రోమో ఇన్హౌజ్ ప్రొడక్షన్’ కేటగిరిలో మళ్లీ అవార్డు దక్కించుకున్నారు రెడ్ 93.5 ఎఫ్ఎం సౌండ్ ఇంజినీర్ శ్రీరామ పవన్ కుమార్. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘నా రేడియో కెరీర్లో మూడో నేషనల్ అవార్డ్ అందుకున్నాను. ‘రేడియో అండ్ టీవీ అడ్వర్టైజ్మెంట్ ప్రాక్టీషనర్ అవార్డ్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (రాపా) ఇచ్చే అవార్డు కూడా నాకొక సర్ప్రైజ్. అలాగే 2012లో రెడ్ ఎఫ్ఎంలో చేసిన ‘సిల్లీ ఫెల్లో’ స్పార్క్లర్కు న్యూయార్క్ రేడియో అవార్డ్ అందుకున్నా’ అని చెప్పారు. -
బాలీవుడ్కు సై.. టాలీవుడ్కు నై..
బాలీవుడ్ను ఏలుతున్న ముంబయి ఫ్యాషన్ తెలుగు తెర కెక్కని స్థానిక సృజన రోజూ ఆంగ్ల పత్రికల పతాక శీర్షికల్లో కనిపిస్తుంటారు. పాట్నీ నుంచి పారిస్ దాకా ర్యాంప్ మీద క్రియేటి విటీని మెరిపిస్తుంటారు. ప్రపంచ స్థాయి ఫ్యాషన్లకు దగ్గరగా ఉండే మన నగర డిజైనర్లు వెండితెరకు మాత్రం దూరమంటారు. ఒకటి రెండు హిట్లతో ‘తారా’పథానికి దూసుకుపోయే అవకాశాలను సైతం తూచ్.. అనేస్తున్నారు. తరుణ్ తహిల్యానీ, నీతాలుల్లా.. ఇలా ఏ ముంబయి డిజైనర్ని చూసినా హిందీ సినిమా ఫ్యాషన్ ‘వెలుగు’లకు కేరాఫ్గా ఉంటున్నారు. దీనికి భిన్నంగా తెలుగు సినిమా సోకులను తీర్చిదిద్దడాన్ని హైదరాబాద్ డిజైనర్లు ‘లైట్’గా తీకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే.. ఇదే సిటీ డిజైనర్లు బాలీవుడ్ సినిమాలకు, తారలకు సైతం డిజైన్లను అందిస్తున్నారు. - సాక్షి, లైఫ్స్టైల్ ప్రతినిధి టాలీవుడ్లో భారీ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. సిటీలో వరల్డ్ క్లాస్ ఫ్యాషన్ ఉత్పత్తులున్నాయి. అయితే ఈ రెండింటి మధ్యా సరైన వారధి మాత్రం ఏర్పడలేదు. నగరంలో పేరున్న డిజైనర్లలో అత్యధికులు తెలుగు సినిమా రంగానికి దూరంగానే ఉంటున్నారు. గతంలో అస్మితా మార్వా, సాహిల్ గులాటి వంటి ఒకరిద్దరు కొన్ని సినిమాలకు వర్క్ చేసినా అరకొర దృష్టాంతాలే తప్ప, సిటీ డిజైన్స్కీ సినిమాకీ మధ్య గ్యాప్ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కొందరు సిటీ టాప్ డిజైనర్లతో ‘సాక్షి’ ముచ్చటించినప్పుడు... అదో ‘చిత్రమైన’ ప్రపంచం తొలిసారి నాకు కృష్ణవంశీ ‘చక్రం’ సినిమాకు ఆఫర్ వచ్చింది. అయితే చాలా తక్కువ టైమ్ ఇచ్చారు. దాంతో చేయలేనని చెప్పేశాను. ఆ తర్వాత కృష్ణవంశీ తీసిన ‘రాఖీ’కి, రాఘవేంద్రరావు తనయుడు హీరోగా వచ్చిన ‘మార్నింగ్ రాగా’.. వంటి సినిమాలకు పనిచేశా. కానీ టాలీవుడ్లో ఇమడలేకపోయాను. నటి శ్రీయ శరన్ తో వర్క్ చేశాను. ఆమె చాలా డౌన్ టు ఎర్త్. అలాగే హ్యాండ్లూమ్ వర్క్స్ మాత్రమే వాడే షబానా ఆజ్మీ, లలిత్ దూబెతో చేసిన వర్క్ కూడా మెమొరబుల్. తప్పొప్పుల గురించి అనను గాని.. మన సినీ ఇండస్ట్రీలో మనగలగాలంటే కొన్ని ‘ప్రత్యేక’ శక్తియుక్తులు కావాలనేది నాకు అర్థమైంది. అవి లేవు కాబట్టి నేను నా వ్యక్తిగత మార్కెట్నే నమ్ముకున్నాను. - శశికాంత్ నాయుడు సమయమే కీలకం.. బాలీవుడ్లో సోనమ్ కపూర్, విద్యాబాలన్ వంటివారికి డిజైన్స్ ఇచ్చాను. టాలీవుడ్ సినిమాలు చేయడం ఇష్టమే. కొన్నేళ్లగా భారతీయ మహిళ కట్టు, బొట్టు సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఖాదీ, సిల్క్స్, కాటన్ వస్త్రాలను రూపొందిస్తున్నాం. అయితే సినిమాలకు సంబంధించి ఉన్న ప్రత్యేక సమస్య సమయం.. సినిమా క్రియేషన్లు తక్కువ టైమ్లో ఎక్కువ వర్క్ని డిమాండ్ చేస్తాయి. అంతేకాకుండా మా వర్క్స్ పూర్తిగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేవే. తగిన సమయం ఇచ్చి, మా తరహా వర్క్స్ని కోరుకునే స్థానిక సినిమా రూపకర్తలతో పనిచేయడానికి మాకు అభ్యంతరం లేదు. అనేక మంది బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలకు వ్యక్తిగతంగా మా గౌరంగ్ లేబుల్ చిరపరిచితం. అలాగే ఇండో వెస్ట్రన్ కలగలిపిన డిజైన్లను క్రియేట్ చేయడానికి, భారతీయ వస్త్ర శైలికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తేవడానికి సినీరంగానికి ఇదే సరైన సమయం అని నా అభిప్రాయం. - గౌరంగ్ అడిగితే ఎందుకు వర్క్ చేయం? ఇప్పటిదాకా 13 ఫ్యాషన్ వీక్లలో పాల్గొన్నాను. కంటిన్యూస్గా నా కలెక్షన్స్ రిలీజ్ చేస్తుంటాను. అయితే టాలీవుడ్ నుంచి మూవీస్కి పనిచేయమని ఎవరూ అప్రోచ్ కాలేదు. అది మాకూ సర్ప్రైజింగ్. విశేషమేమిటంటే... నేను ముంబయిలో కంగనా రనౌత్తో పనిచేశాను. ఆమెకు డిజైన్స్ ఇచ్చాను. ముంబయిలో క్యారెక్టర్ను బట్టి నెయిల్ పాలిష్, హెయిర్ స్టైల్ ఇలా ప్రతి అంశంలోనూ పెద్ద రీసెర్చ్ జరుగుతుంది. మన సిటీలో ఫ్యాషన్ ఫాలోయర్స్ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరంతా చాలా వరకూ బాలీవుడ్నే ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఈ పరిస్థితి మారాలంటే టాలీవుడ్ మరింత ఫ్యాషన్ కాన్షియస్గా మారాల్సి ఉందేమో..! అయితే, ఇక్కడ కూడా నాకు చాలా మంది నటీనటులు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లు నా కలెక్షన్స్ను వ్యక్తిగతంగా వినియోగిస్తుంటారు. - శివాలీ సింగ్ సినీ వర్కింగ్ స్టైల్ వేరు.. మూవీస్ షెడ్యూలింగ్ కంప్లీట్గా డిఫరెంట్. టాలీవుడ్లో ప్రీ ప్లానింగ్ చాలా తక్కువ. ఫినిషింగ్ పట్టించుకోరు. లోపలెలా ఉన్నా పర్లేదు. అంతేకాదు నైట్ చెప్పి రేప్పొద్దున్నకల్లా కావాలంటారు. అది డిజైనర్ వర్క్ స్టైల్ కాదు. ఫ్యాషన్ డిజైనర్ అంటే సీరియస్ ట్రెండ్ సెట్టర్స్. నా వరకూ ఒక్క కరెంట్తీగలో మాత్రం రకుల్ప్రీత్ సింగ్కి చేశాను. నా వర్కింగ్ స్టైల్ తెలుసు కాబట్టి. మంచు లక్ష్మి నాకు తగిన టైమ్ ఇచ్చి చేయించుకున్నారు. ముందే బ్రీఫ్ చేసి టైమ్ ఇవ్వడం వల్ల చేయగలిగాను. పార్టీస్కి, ఈవెంట్స్కి మాత్రం స్టార్స్ చాలా వరకూ డిజైనర్స్ క్రియేషన్స్ వేసుకుంటారు. ‘కామెడీ విత్ కపిల్’ అనే బిగ్ టీవీ షోకి శృతిహాసన్ నా డిజైన్ వేసుకుంటే అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. అలాగే సన్ని లియోన్కి కూడా డిజైన్స్ ఇచ్చాను. బాలీవుడ్లో అడుగుతున్నారు కాబట్టి అనే కాదు.. వాళ్లు తగిన టైమ్ ఇస్తారు కూడా. - శిల్పారెడ్డి -
కేక్... రొటీన్కు బ్రేక్
- ఠీఇంట్లోనే కేక్లు సిద్ధం - విభిన్న రుచుల్లో లభ్యం వేసవి కాలంలో ఇళ్లలోఉండే పిల్లలకు విభిన్న రుచులు చూపించేందుకు రెడీ అవుతున్నారు అమ్మలు. రోజూ అమ్మ చేతి వంట తినే పిల్లలు... సెలవులు కదా అని బయటకు తీసుకెళితే చిరుతిళ్ల కోసం మారాం చేస్తున్నారు. బేకరీ ఫుడ్ నోట్లో పడేదాకా నానా అల్లరి చేస్తున్నారు. అందుకే పిల్లలు అతిగా ఇష్టపడుతున్న కేకులు, స్వీట్లను ఇంట్లోనే రెడీ చేసి ఇవ్వాలనుకుంటున్న సిటీవాసులు... శిక్షణ సంస్థల బాట పడుతున్నారు. వీరి అభిరుచికి తగ్గట్టుగానే కేవలం ఒక రోజులోనే పూర్తి స్థాయి శిక్షణను ఇస్తున్నాయి వివిధ సంస్థలు. ఎగ్ఫ్రీ బేకింగ్, కేక్ డెకరేషన్, డిసార్ట్స్, డూనట్స్, చాక్లెట్ మేకింగ్, పెస్ట్రీలు, ట్రఫుల్, సాస్, ఫ్రూట్ కేక్, మ్యాంగో చాక్లెట్ కేక్, పైనాపిల్ పెస్ట్రీ నేర్చుకునేందుకు చాలా మంది మహిళలు ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు బోయిన్పల్లిలోని టంక్డ్లైట్ నిర్వాహకురాలు ప్రియాంక టంక్. హోం బేకింగ్ అయితే ఎప్పటికప్పుడు తాజాగా... మన అభిరుచులకు అనుగుణంగా రెడీ చేసుకునే అవకాశముంటుందని అంటున్నారు. ఆసక్తి చూపుతున్నారు కప్కేక్స్, అసార్టెడ్ చాక్లెట్, కప్కేక్స్ బాక్సెస్, చాక్లెట్ థీమ్ బోటిక్, కప్ కేక్స్ థీమ్ బొటిక్, ముఫిన్స్, జెల్లీస్, 2-టైర్, 3-టైర్ వెడ్డింగ్ కేక్స్కు సిటీలో మంచి డిమాండ్ ఉంది. విభిన్న ఆకృతుల కేక్లు, చాక్లెట్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు సిటీవాసులు. పిల్లలు కూడా అవే ఇష్టపడుతున్నారు. అందుకే మేం ఈ చాక్లెట్, కేకుల తయారీలో శిక్షణ ఇస్తున్నామని చెబుతోంది ప్రియాంక టంక్. ‘ఆరోగ్యంతో పాటు ఫిట్నెస్ను కాపాడుకోవాలనుకుంటున్న సిటీవాసుల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని డిఫరెంట్ కేకుల బేకింగ్లో శిక్షణ ఇస్తున్నాం. కేలరీ గురించి ఆందోళన చెందే వారికి జింజర్ బ్రెడ్ కేకులు, ఓట్మీల్ కేకులను రెడీ చేయిస్తున్నాం. హెల్తీ, ఫ్యాట్ ఫ్రీతో పాటు టేస్టీగా ఉండేలా చూస్తున్నాం. దీనికి సిటీవాసుల నుంచి మంచి స్పందన ఉంటుద’ంటున్నారు కేక్ డిజైనర్ ప్రియాంక. ఇవీ నా ఫేవరేట్... ‘బర్త్డేలు, వివాహ వేడుకలకు డిజైన్ చేసే కేకులు నా ఫేవరేట్. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి స్పెషల్ మూమెంట్స్. అలాంటి వాటిలో నేను భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంద’ని చెబుతున్నారు ప్రియాంక. ఎంతో మంది మహిళలకు చాక్లెట్ తయారీ, కేక్ బేకింగ్లో శిక్షణ ఇస్తున్నందుకు గర్వంగా ఉందంటున్నారు. పని ఒత్తిడి దూరం... ‘కేక్ బేకింగ్ పని ఒత్తిడిని దూరం చేస్తుంది. కొన్నిసార్లు థెరపటిక్గా కూడా పని చేస్తుంది. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్లు వీకెండ్లలో మా వద్ద శిక్షణకు వస్తున్నారు. ఐదు రోజుల పాటు పనిలో బిజీగా ఉండే వీరికి కేక్ బేకింగ్... ఆ ఒత్తిడి నుంచి దూరం చేస్తోంది. కొంత మంది శిక్షణ తీసుకున్న వారు ఉద్యోగాలకు రాజీనామా చేసి సొంతంగా వెంచర్ను ప్రారంభిస్తున్నవారు కూడా ఉన్నారంటున్నారు ప్రియాంక. ఆర్డర్లపై చాక్లెట్లు, కేకులను పంపిణీ చేస్తున్నామని వివరించారు. అభిరుచి నుంచి వృత్తి వైపు... ‘కేక్ బేకింగ్, చాక్లెట్ తయారీమంచి హాబీ. ఇంట్లో వారి కోసం ఎప్పుడూ చేస్తుండేదాన్ని. ఇలా ఒక రోజు వంట పోటీల్లో పాల్గొన్నా. ఆ అనుభవంతోనే నేను సొంతంగా వెంచర్ను ప్రారంభించాలకున్నా. సిటీలోని ఆరోరా కాలేజీ నుంచి ఎంబీఏ (ఫినాన్స్) పూర్తవగానే హాబీనే ప్రొఫెషన్గా మార్చుకున్నా. తొలినాళ్లలో కప్కేక్స్, చాక్లెట్లతో చిన్నగా ప్రారంభించా. కస్టమర్ల నుంచి వచ్చిన రెస్పాన్స్తో 2012లో టంక్డ్లైట్గా మార్చా’నంటారు ప్రియాంక. తయారీలో శిక్షణ... ఎగ్ఫ్రీ బేకింగ్, కేక్ డెకరేటింగ్, డిసార్ట్స్, డూనట్స్, చాక్లెట్ తయారీలో రెండు రోజుల వర్క్షాప్ నిర్వహిస్తున్నాం. ఈ నెల 23, 24 తేదీల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు చాక్లెట్ కేక్లు, చాక్లెట్ డెకరేషన్, ట్రఫుల్, సాస్, ఫ్రూట్ కేక్, మ్యాంగో చాక్లెట్ కేక్, ఫైనాపిల్ పెస్ట్రీ, ఎగ్లెస్ చాక్లెట్ తయారీలో శిక్షణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు 90526 62545 నంబరులో సంప్రదించవచ్చు. -
దేవుడు మరణించాడు.. మనిషిలో..!
ఇరవై నిమిషాల వ్యవధిలో ముగిసిపోయే షార్ట్ ఫిల్మ్ నుంచి ఏమేం ఆశించవచ్చు? ఆధునిక అనుబంధాలను అర్ధం అయ్యి కానట్టు నిర్వచించే కాసిన్ని ప్రేమ సన్నివేశాలు, యవతకు ‘కిక్కెక్కించే’ ఇంకొన్ని సంభాషణలు.. అంతేకదా..! కాదు, అంతకు మించి కూడా అని నిరూపించాడు నగరానికి చెందిన షార్ట్ ఫిలిమ్స్ రూపకర్త జయశంకర్. ‘ది గాడ్ మస్ట్ బి క్రేజీ’ పేరుతో ఈయన రూపొందించిన పొట్టి చిత్రం గట్టి ఆదరణ పొందుతోంది. అందుకు కారణం.. యువతకు సమకాలీన జీవితాన్ని చూపడం కాదు.. జీవితానికి మరో కోణం చూపడం. అప్లోడ్ చేసిన ఆరు రోజుల్లోనే యూ ట్యూబ్లో దాదాపు లక్షా పాతికవేల వ్యూస్ దక్కించుకున్న ఈ షార్ట్ ఫిల్మ్లో ఏముంది? ‘లైఫ్ అంటే ఏముంది బ్రదర్? నోటినిండా అబద్ధాలు, జేబులో క్రెడిట్ కార్డులు. చిన్న చిన్న మోసాలు.. చిరకాలం కులాసాలు’.. హ్యాపీ గో లక్కీ టైప్లో బతికేసే ప్రస్తుత కుర్రకారు జీవన్నినాదం ఇది. కథలోకి వెళితే ఆవలించినంత తేలికగా అబద్ధాలు చెప్పేసే నవతరం కుర్రాడికి ప్రతినిధి లాంటి గోవింద్ ఇంటర్వ్యూకి వెళతాడు. అక్కడ అతనికి ఓ విచిత్రమైన వ్యక్తి ఎదురవుతాడు. ఇంకు లేని పెన్నుతో పేజీల కొద్దీ రాసేస్తూ గోవింద్కి ప్రశ్నలు సంధిస్తూ, అతను చెప్పే మాటల్లోని నిజానిజాలను ఇట్టే పసిగట్టేస్తుంటాడు. ‘బాబోయ్ ఈ ఇంటర్వ్యూకో దణ్నం’ అంటూ గోవింద్ పారిపోయే ప్రయత్నం చేసినా అవకాశం కూడా అతనికి దొరకదు. చివరికి అది నిజమైన ఇంటర్వ్యూ కాదని, తాను జూబ్లీహిల్స్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయి అక్కడికి వచ్చానని గోవింద్కి తెలుస్తుంది. తనను ఇంటర్వ్యూ పేరుతో ముప్పు తిప్పలు పెట్టిన ఆ వ్యక్తి దేవుడి తరఫున చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) పని చేస్తున్నాడని అర్థం చేసుకుంటాడు. అక్కడి నుంచి సదరు భగవంతుడి సీఈఓకి, గోవింద్కి మధ్య జరిగే సన్నివేశాలు, సంభాషణలే ఈ సినిమాకు ఆయువుపట్టు. ముఖ్యంగా సీఈఓ నోట పలికించిన కొన్ని మాటలు ‘షార్ట్’ సినిమా స్థాయిని అమాంతం బిగ్ స్క్రీన్కు సాటిగా మార్చేలా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ‘దేవుడు మనకు అడిగినవన్నీ ఇస్తే ఆయన మీద నీకు నమ్మక ం పెరుగుతుంది. ఇవ్వకపోతే నీ మీద నీకు నమ్మకం పెరుగుతుంది’, ‘దేవుడు ఎంతో ఇష్టంగా ఈ భూమిని సృష్టించాడు. దీన్ని మనుషులే నరకంగా తయారు చేసి మాకు ఇంకో నరకాన్ని తయారు చేసే అవసరాన్ని తప్పించారు. ఇప్పుడు మిగిలిన గ్రహాల్లో తప్పులు చేసినవారికి పనిష్మెంట్గా భూమికి పంపుతున్నాం’.. వంటివి కొన్ని మచ్చుతునకలు మాత్రమే. దేవుడు చనిపోయాడంటూ చెప్పి మనల్ని షాక్ తినిపిస్తూనే ప్రతి మనిషిలో ఉండాల్సిన దేవుడు చనిపోయాడంటూ ఇచ్చే ముక్తాయింపు ఆకట్టుకుంటాయి. నేపధ్య సంగీతంతో పాటు గోవింద్ పాత్రధారి శశాంక్, సీఈఓగా నటించిన వినోద్ వర్మ.. చక్కగా నటించి మంచి భవిష్యత్తు ఉన్న నటులనిపించారు. మొబైల్తో తీశా.. షార్ట్ ఫిల్మ్ అంటే కేవలం ప్రేమకో, సరదాకో కాకుండా విలువలు నేర్పేది ఎందుకు కాకూడదు? మనల్ని మనం సమీక్షించుకునేలా ఎందుకు ఉండకూడదు? లాంటి ఆలోచన నే ‘ది గాడ్ మస్ట్ బి క్రేజీ’ తీసేందుకు దోహదం చేసింది. ఈ సినిమాని వన్ ప్లస్ వన్ మొబైల్ ఫోన్తో తీయడం మరో విశేషం’ అని చెప్పారు దర్శక, రచయిత జయశంకర్. -
సిటీ టూర్.. ‘భంగ్’తో తీన్మార్
- నగరంపై డాక్యుమెంటరీస్ - యూ ట్యూబ్లో పెరుగుతున్న వీక్షకులు షార్ట్ ఫిల్మ్స్ ఎలాగైతే యువతకు ఫ్యాషన్గా మారుతున్నాయో.. నగరంలో కొంతమందికి డాక్యుమెంటరీస్ కూడా అలాగే హాబీగా మారిపోయాయి. వృత్తి వ్యాపకాలకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా.. తమ అభిరుచి మేరకు డాక్యుమెంటరీలు రూపొందించడంలో సిటీజనులు బిజీ అయిపోతున్నారు. సహజంగానే ఈ డాక్యుమెంటరీలు విభిన్న అంశాలపై, సామాజిక స్పృహ పెంచేలా రూపొందిస్తుండడం స్వాగతించదగిన పరిణామం. భాగ్యనగరంలో కేవలం హైటెక్ సిటీని చూస్తే సరిపోదు.. చార్మినార్ను చుట్టొచ్చినంత మాత్రాన అయిపోదు.. నాలుగొందల ఏళ్ల చరిత్ర ఒకవైపు. కొత్తపుంతలు తొక్కే ఆధునికత మరోవైపు. ఒక్క మాటలో చెప్పాలంటే భిన్న పరిణామాల మేలు కలయిక హైదరాబాద్. ఎన్ని చూసినా చూడాల్సినవి మిగిలే ఉన్నాయి అనిపించే ఈ సిటీలో తప్పకుండా చూడాల్సిన వి, చేయాల్సినవి... చెప్తూ నగరవాసి రాజ్కిషోర్ రూపొందించిన ‘టెన్ థింగ్స్ టు డు ఇన్ హైదరాబాద్’ యూట్యూబ్లో ఇప్పటికే లక్షల సంఖ్యలో వీక్షకుల్ని సాధించింది. అదే ఊపులో నగరంలో హోలీ టైమ్లో వినియోగించే ‘భంగు’ మీద కూడా మరో డాక్యుమెంట్ను తీసి అప్లోడ్ చేశాడీ యువ ఈవెంట్ మేనేజర్. ఈ రెండు డాక్యుమెంటరీల విశేషాలు.. ‘భంగ్’ భళా నగరంలో శివరాత్రి, హోలీ వేడుకల్లో భాగంగా చాలామంది ‘భంగ్’ భళా అంటారనేది తెలిసిందే. ఆ సమయంలో బేగంబజార్ వంటి ప్రాంతాల్లో విస్తృతంగా లభించే ఈ భంగ్ అనే మత్తు పదార్థం.. విచిత్రమైన సంప్రదాయ సేవనంగా మారిపోయిందనే విషయాన్ని తెలియజేస్తూంది ఈ డాక్యమెంటరీ. అధికారికంగా షాపులు తెరచి మరీ ఈ భంగ్ను విక్రయించే విశేషాలను ఇది కళ్లకు కడుతుంది. హోలీ వేడుకల పరమార్థం తెలియకపోయినా, భంగ్ అనే మత్తు పదార్థం గురించి చెప్పమంటే ఉత్సాహం చూపే సిటీ యూత్ను మనం ఈ వీడియోలో కలుసుకోవచ్చు. దేశవ్యాప్తంగా భంగ్కు ఉన్న క్రేజ్, దక్షిణాదిలోనూ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న వైనాన్ని వివరిస్తూ, దీనివల్ల కలిగే ఆరోగ్యపరమైన సమస్యలను వైద్యుల ద్వారా చెప్పించారు. సిటీని చుట్టేస్తూ.. నగరంలోని బేగంబజార్ దగ్గర ప్రారంభమై హలీమ్ రుచి చూస్తూ హైదరాబాద్ అడ్వంచర్ క్లబ్ విశేషాల్ని ఈ డాక్యుమెంటరీ కళ్లకు కడుతుంది. నెక్లెస్రోడ్ సౌందర్యాన్ని వివరిస్తూ టాలీవుడ్ పై ఓ లుక్కేయిస్తుంది. లాడ్బజార్ గాజుల గలగలలు వినిపిస్తూ.. హుస్సేన్సాగర్లో కొలువైన బుద్ధుని చుట్టూ ప్రదిక్షణలు చేయిస్తుంది. గోల్కొండ చరిత్రకు సలామ్ చేస్తూ.. చార్మినార్ విశిష్టతను కళ్లకు కడుతుంది. చివరగా చవులూరించే హైదరాబాద్ బిర్యానీకి అగ్రతాంబూలం ఇస్తుంది. మోడల్ సాత్విక ఈ డాక్యుమెంటరీలో సమర్పకురాలిగా వ్యవహరించారు. ‘సీదా జావ్, ఆగే ఛే’ వంటి సిటీలో తరచుగా వినిపించే పదాలను, సినిమా స్టార్ల పట్ల ఉండే వ్యామోహాన్ని సైతం సరదాగా స్పర్శిస్తూ డాక్యుమెంటరీ సాగిపోతుంది. ‘ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ఇమేజ్ని పెంచడం కోసం ఒక డాక్యుమెంటరీని.. యువత జీవితాల్లో భంగ్ వంటి మత్తుపదార్థాలు సంప్రదాయం పేరుతో తిష్టవేసిన వైనాన్ని వివరించడానికి మరో డాక్యుమెంటరీని తీశా’నంటారు రాజ్కిషోర్. మాదాపూర్లో నివసించే ఈయన వృత్తిరీత్యా ఈవెంట్ మేనేజర్. అయితే సహజంగా ఉన్న ఆసక్తితో ఫిల్మ్ అండ్ మీడియాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు చేశారు. రచయిత, దర్శకుడు, కెమెరా, ఎడిటర్ అన్నీ తనే అయి కేనన్ 5 డి కెమెరాతో ఈ డాక్యుమెంటరీలను రూపుకట్టానని చెప్పారు. -
కమింగ్ సూన్.. ‘అమీర్పేటలో’..
- ఐటీ విద్యార్థుల కథే సినిమాగా.. హైదరాబాద్ మహానగరం ప్రయోగాలకు వేదిక. సిటీలోని ఒక్కో ప్రాంతానిది ఓ ప్రత్యేకత. కృష్ణానగర్ సినీ జీవుల నిలయం.. మాదాపూర్ ఐటీ ఉద్యోగుల ప్లేస్.. అమీర్పేట ఐటీ కోర్సులు చేసి అమెరికా వెళ్లాలనుకునే జీవుల ఆశల అడ్డా. ఇప్పుడు ఈ అడ్డా సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. సాఫ్ట్వేర్ శిక్షణ కేంద్రాల నిలయంగా పేరున్న అమీర్పేట.. సోషల్ వెబ్సైట్, కళాశాలల్లో హాట్ టాపిక్గా మారింది. ‘అమీర్పేటలో’.. ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేసిన కొద్దీ రోజుల్లోనే వేలాది మంది ఆ గ్రూప్లో చేరడం ఆ పేరుకు ఉన్న క్రేజ్కి అద్దం పడుతోంది. ఇంతకీ ఈ పేరే ంటో అనేకదా..! అమీర్పేటలో అన్నది సిటీలో ఓ ప్రాంతం పేరు.. అంతకు మించి ఇప్పుడిది సినిమా పేరు. -సాక్షి, సిటీబ్యూరో - సోషల్ మీడియాలో హల్చల్ - యూత్ను ఆకట్టుకునే ప్రయత్నం - సిటీ లైఫ్లో కొత్తకోణం ‘అమీర్పేటలో’.. సినిమా టైటిల్. ‘కాప్షన్ కమింగ్ సూన్’ అన్నది కాప్షన్. ఈ మూవీ పేరును ఇప్పుడు సిటీలో యూత్ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తమ పేర్లకు ముందు తమ ప్రాంతం పేరును యాడ్ చేసి ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్నారు. ‘అమీర్పేటలో శ్రీ, అమీర్పేటలో అనూష’.. అంటూ ఈ ప్రాంతం వారు ఫేస్బుక్ ఐడీ క్రియేట్ చేసుకుంటే.. ‘ఉప్పల్లో సోనీ’, ‘రామాంతపూర్లో రాము’, ‘మెహదీపట్నంలో సందీప్’, ‘లింగంపల్లిలో కిషన్రావు’.. ఇతర ప్రాంతాలవారు కూడా ఇలా కొత్త ట్రెండ్కు నాంది పలుకుతున్నారు. ఒక రకంగా వీరంతా ‘అమీర్పేటలో’.. చిత్రానికి ప్రచారం కల్పిస్తున్నారు. మరోపక్క ఈ మూవీ కథాంశాన్ని యువతకు తెలియజేస్తూ ఈ చిత్రం టీం సిటీలోని వివిధ కళాశాలల్లో ఫ్లాష్ మాబ్ డాన్స్ చేస్తున్నారు. దీనికి అట్రాక్ట్ అయిన కాలేజీ కుర్రాళ్లు ‘అమీర్పేటలో’ మూవీ ప్రమోషన్లోనూ భాగమువుతున్నారు. ‘బీటెక్ చదువు తర్వాత తమ కెరీర్ గోల్ చేరుకునే క్రమంలో అమీర్పేట అడ్డాగా ఎంత మందికి లైఫ్నిస్తుందో, అక్కడ విద్యార్థుల లైఫ్ స్టైల్ను కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్న ఈ సినిమా కథాంశం మాకు బాగా నచ్చింది. సినిమా టైటిల్ కొత్తగా ఉండటంతో ఈ మూవీ పబ్లిసిటీలో భాగస్వాములం అవుదామని వారి ఫేస్బుక్ పేజీలో మెంబర్ అయ్యామ’ని చెబుతున్నారు ఓ కళాశాల విద్యార్థులు. ‘ఈ టైటిల్ ఇన్నోవేటివ్గా ఉంది. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగే ఈ సినిమాను తెరకెక్కించడం, బీటెక్ చదివిన మధును హీరోయిన్గా తీసుకోవడం... ఇలా దాదాపు బీటెక్ చదివిన వారందరూ ఈ మూవీలో చేస్తుండటం మమ్మల్ని ఆలోచింపజేస్తోంది. అందుకే మా వంతుగా ఈ మూవీ ప్రమోషన్లో పాల్గొంటున్నామని చెబుతున్నారు అమీర్పేట హాస్టళ్లలో ఉంటున్న యువతీయువకులు. వాస్తవానికి ‘అమీర్పేటలో’.. అంటూ ఓ ప్రాంతం పేరును సినిమా టైటిల్గా పెట్టడం కొత్తేమీ కాదు. దాదాపు 24 ఏళ్ల క్రితమే కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘మధురానగరిలో’.. చిత్రం వచ్చింది. అయితే, అప్పటికి ఫేస్బుక్, మాబ్ డాన్సుల వంటి ప్రచారం లేదు. ఇన్నోవేటివ్ పబ్లిసిటీ.. సినిమా షూటింగ్ పూర్తయ్యాక పబ్లిసిటీపై దృష్టి పెడతారు. అయితే ‘అమీర్పేటలో’ టీం మాత్రం.. ఓ వైపు షూటింగ్ చేస్తూ.. పబ్లిసిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ వెబ్సైట్తో పాటు తమ టైటిల్ లోగోతో కాలేజీలకు వెళ్లి యువతను ఆకట్టుకుంటున్నారు. డిఫరెంట్ థీమ్తో ఉన్న టీషర్ట్లతో వెళుతుండడం అందరినీ అటువైపు కన్నేసేలా ఉంది ప్రచారం. ఆడియో లాంచింగ్ కూడా డిఫరెంట్గా.. అమీర్పేట వేదికగా చేసే ప్లాన్లో ఉన్నారు ఈ మూవీ టీం. ఉద్యోగం వదిలేశా.. ‘నేను చదివింది బీటెక్. ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశా. అప్పుడు అమీర్పేటలో ఉండేవాడిని. అక్కడి వాతావరణం, విద్యార్థుల తీరు చూశాక.. నా వ్యక్తిగత అనుభవంతో ఓ మూవీ చేయాలనుకున్నా. అందుకే ఏడాది క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశా. 20 మంది ఫ్రెండ్స్తో కలిసి ఈ మూవీ ప్లాన్ చేశా. ‘అమీర్పేటలో..’ టైటిల్ చెప్పగానే ఓకే అన్నారు. తొలుత ఇబ్బందులు ఎదురైనా ఇప్పుడు సాఫీగా సాగుతోంది. అమీర్పేటలో ఉండేవారినే ఈ సినిమాలో క్యారెక్టర్లుగా తీసుకున్నాం. హీరోయిన్ మధు కూడా అక్కడే ఉంటుంది. ఈ సినిమాలో హీరో పాత్ర పోషిస్తున్నా. డెరైక్టర్, నిర్మాతను కూడా నేనే. అమీర్పేటలో నా లైఫ్ ఈ మూవీ తీసేలా చేస్తోంద’ని అంటున్నారు శ్రీకాంత్ పొడపాటి. -
చిన్నారులకు ఫొటోగ్రఫీ శిక్షణ
సరదాగా కెమెరా క్లిక్మనిపిస్తే అది జస్ట్ క్లిక్ మాత్రమే. కానీ మంచి ఫొటో తీయాలంటే కొంత ఫొటోగ్రఫీ నైపుణ్యం ఉండాలి. దానికి సికింద్రాబాద్లోని అవర్ సాక్రెడ్ స్పేస్లో ఈనెల 16, 17 తేదీల్లో చిన్నారులకు ‘ఫొటోగ్రఫీ వర్క్షాప్’ నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొంటే చిన్న చిన్న టెక్నిక్స్ నేర్చుకుని మెరుగైన ఫొటోలు తీయవచ్చు. -
చూసొద్దాం చలో..చలో..
హైదరాబాద్కు 100 కి మీ పరిధిలోనే పర్యాటక కేంద్రాలు సందర్శకులకు టి-టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు అందుబాటులో అత్యాధునిక వాహనాలు శామీర్పేట్ హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల మధ్య ఉన్న అందమైన ప్రాంతం.. శామీర్పేట్. సికింద్రాబాద్ నుంచి 24 కి.మీ దూరంలో ఉన్న శామీర్ పేట సహజ సిద్ధమైన అందాలకు నెలవు. ఇక్కడ ఉన్న సరస్సు, జింకల పార్కు పర్యాటకులను ఆకర్శిస్తున్నాయి. ఇక్కడ బస చేసేందుకు టూరిజం శాఖ హరిత రెస్టారెంట్ ఏర్పాటు చేసింది. బోటింగ్ సౌకర్యం, స్పా, జిమ్ వంటి అత్యాధునిక సౌకర్యాలు కూడా పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. జూబ్లీ బస్స్టేషన్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. చార్జ్జి రూ.19 చిలుకూరు.. చిలుకూరులోని బాలాజీ టెంపుల్ మహిమ గల ఆలయంగా గుర్తింపు పొందింది. నగరం నుంచి 17 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకునేవారు హిమాయత్ సాగర్, గండిపేట్ ప్రాంతాలను కూడా చూడవచ్చు. కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరుని ప్రతిరూపంగా ఇక్కడ బాలాజీ పూజలందుకుంటున్నారు. జేబీఎస్, మెహదీపట్నం ప్రాంతాల నుంచి ఇక్కడికి బస్సులు ఉన్నాయి. చార్జి రూ.25 పెంబర్తి.. నాణ్యమైన కంచు పాత్రలకు పెట్టింది పేరు పెంబర్తి. నగరానికి 100 కి.మీ దూరంలో ఉన్న ఈ మారుమూల గ్రామం కాకతీయుల కాలం నుంచి ఇత్తడి, కంచు వస్తువుల తయారీకి ప్రత్యేక గుర్తింపు పొందింది. దీపారాధన, దేవతామూర్తుల విగ్రహాలు, లోహపు వస్తువులు ఇక్కడ లభ్యమవుతాయి. జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. చార్జి రూ. 50 మెదక్ చర్చి కాకతీయుల కాలంలో నిర్మించిన బలమైన కోటల్లో మెదక్ పోర్టు ఒకటి. ఈ కోటకు ఉన్న మూడు ద్వారాలు, వాటి ముందు ఉండే ఏనుగుల బొమ్మలు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తాయి. దీనికి సమీపంలోనే పురాతనమైన మెదక్ చర్జి ఉంది. ఇంగ్లాండ్ నుంచి తెచ్చిన తెల్లగ్రానైట్ రాళ్లతో ఈ చర్చి నిర్మాణం చేపట్టారు. ఈ చర్చిపై 175 మీటర్ల ఎత్తులో ఉన్న గంట ఇక్కడ ప్రత్యేకం. సుమారు 5 వేల మంది ఒకేసారి ప్రార్థనలు చేసుకునేందుకు ఇక్కడ అవకాశం ఉంది. జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఆర్డినరి బస్సు రూ.54. ఏసీ బస్సుకు రూ. 73 ప్రజ్ఞాపూర్ నగరానికి 65 కీమీ దూరంలో మెదక్ జిల్లాలో కరీంనగర్ హైవేలో ఉంది. భువనగిరి, జనగామ, సిద్ధిపేట్, వెళ్లే వారు ప్రజ్ఞాపూర్ వద్ద విశ్రాంతి తీసుకొని వెళ్తారు. ఈ ప్రాంతంలో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో హోటళ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడికి సమీపంలోని కొమరవెల్లి మల్లిఖార్జున స్వామి ఆలయం ప్రఖ్యాతి పొందింది. సింగూరు నగరానికి 90 కిమీ దూరంలో మెదక్ జిల్లా సింగూరులో మంజీరా నదిపై నిర్మించిన సింగూరు డ్యాం చూడదగినది. జంటనగరాలకు ఇక్కడి నుంచే మంచినీటి సరఫరా జరుగుతోంది. ఇందులో మొసళ్లు కూడా ఉన్నాయి. వేసవి సెలవుల్లో సేద తీరేందుకు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లొద్దామనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నగరవాసులను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పర్యాటక, దర్శనీయ స్థలాలపై ప్రత్యేకంగా రూపొందించిన కష్టమైజ్డ్ ప్యాకేజీలను ఇప్పుడు టూర్ ఆపరేటింగ్ సంస్థలు, తెలంగాణ టూరిజం శాఖ అందిస్తున్నాయి. వాటిలో కొన్ని... ట్యాంక్బండ్ నగర నడిబొడ్డున ఉండే అందమైన ప్రాంతం. హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండ తర్వాత హుస్సేన్ సాగర్ పై ఉన్న ట్యాంక్బండ్ గుర్తుకు వస్తుంది. ఈ సరస్సు మధ్యలో ఉన్న ప్రపంచంలోనే పెద్దదైన బుద్ధుని విగ్రహం ఇక్కడి ప్రత్యేకత. ఇందులో విహరించేందుకు బోటింగ్, పడవలు, క్రూజర్ సౌకర్యం ఉంది. సాయంత్రం వేళల్లో మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య ఈ ప్రాంతంలో విహరిస్తే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. బస్సు సౌకర్యం... నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ట్యాంక్బండ్ ప్రాంతానికి బస్సులు ఉన్నాయి. చార్జి రూ.25 లోపే. యాదగిరిగుట్ట... తెలంగాణలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. నరసింహస్వామి కొలువైన ఈ క్షేత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనిని పంచ నరసింహ క్షేత్రంగా పిలుస్తారు. పర్యాటకులకు హరిత హోటల్స్, ఇతర వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఆర్డిన రి బస్సుకు రూ.44. శని, ఆదివారాల్లో ప్రత్యేకంగా ఏసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. చార్జి 101. భువనగిరి కోట... క్రీస్తు శకం 1200 సంవత్సరంలో నిర్మించిన చాళుక్య కాలం నాటి కోట ఇక్కడ ప్రత్యేకం. 500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కోట 40 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఇందులో రెండు సరస్సులు ఉన్నాయి. కోటలోని భూ గృహాలు నాటి ఇంజనీరింగ్ ప్రతిభకు అద్దం పట్టేలా ఉంటాయి. ఈ ప్రాంతం నల్గొండ నుంచి 53 కి.మీ దూరంలో ఉంది. జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఏసీ బస్సుకు రూ. 80, ఆర్డ్డినరి రూ. 35 అనంతగిరి హిల్స్ నగరానికి 75 కిమీ దూరంలో వికారాబాద్కు సమీపంలో ఉన్న అనంతగిరి కొండలు ప్రకృతి అందాలకు నెలవు. ఇక్కడ ప్రత్యేకంగా వేసవి విడిది కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. టూరిజం శాఖ ఇక్కడ హరిత రెస్టారెంట్ ను ఏర్పాటు చేసింది. జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. చార్జి రూ.73 కీసరగుట్ట నగర శివార్లలోని కీసర గుట్ట ప్రముఖ శైవక్షేత్రంగా గుర్తింపు పొందింది. ఈ ఆలయంలో 101 శివలింగాలు ఉన్నాయి. నగరానికి చేరువలో ఉండటంతో నిత్యం యాత్రికుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. చార్జ్జి రూ. 20 గంగాపూర్ మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లకు 8 కి.మీ దూరంలో ఉన్న గంగాపూర్ చెన్నకేశవ స్వామి ఆలయం ప్రసిద్ధి గాంచింది. జడ్చర్ల నుంచి కల్వకుర్తి మార్గంలో ఉన్న ఈ క్షేత్రాన్ని రుణ బాధలు ఉన్నవారు ఎక్కువగా దర్శించుకుంటారు. జేబీఎస్ నుంచి ప్రత్యేకంగా బస్సు సౌకర్యం ఉంది. రూ. 85 నాచారం.. మెదక్ జిల్లాలో చూడదగ్గ ప్రాంతంలో ఇది ఒకటి. ఈ ప్రాంతంలోని అసఫ్జాహీ జమామసీద్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడ యాత్రికులకు చక్కటి వసతులు ఉన్నాయి. పర్యాటకులు దీనితోపాటు నాచారం గుట్టపై లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. చార్జి రూ.65 వర్గల్ సరస్వతి ఆలయం.. సికింద్రాబాద్ నుంచి 47 కి.మీ దూరంలో ఉంది. మెదక్ జిల్లా కంచి శంకర మఠం ప్రాంతంలోని ఈ ఆలయ సముదాయంలో విద్యా సరస్వతి, లక్ష్మీగణపతి, శనిచ్ఛంద్ర, వైష్ణవాలయాలు ఉన్నాయి. వర్గల్ సరస్వతి అమ్మవారి వద్ద చాలా మంది తమ పిల్లలకు అక్షరభాస్యం చేయిస్తుంటారు. జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. చార్జి రూ. 32 అందుబాటులో అత్యాధునిక వాహనాలు పర్యాటక కేంద్రాల అభివృద్ధికి తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు యాత్రికులు వెళ్లేందుకు సౌకర్యవంతమైన ఆధునాతన లగ్జరీ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ఒకటైన ‘కారవాన్’ ఏసీ వాహనం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఏడు సీట్లు ఉంటాయి. పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు సోఫా, బెడ్ కూడా ఉన్నాయి. వాహనంలోనే అటాచ్డ్ టాయిలెట్, రెండు ఎల్సీడీ టీవీలు, ఫ్రిజ్ ఏర్పాటు చేశారు. ఈ వాహనానికి కనీస చార్జిగా కి.మీకు రూ. 25, రోజుకు 300 కి.మీ. వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత గంటకు 300 అదనపు చార్జి చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు ఇన్నోవా కూడా అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు తెలంగాణ టూరిజం కార్యాలయంలో గాని, 9848125720,9848306435,9666578880, 9848540374, 9848126947 నంబర్లలో గాని సంప్రదించాలని జనరల్ మేనేజర్ మనోహర్ తెలిపారు. -
సరిగమల సవ్వడి.. సౌండ్ క్రాఫ్ట్
- శాస్త్రీయ సంగీతానికి పాశ్చాత్య స్వరాల మేళవింపు - సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రయోగం - పేద పిల్లలకు ప్రత్యేక శిక్షణ శ్రావ్యమైన సంగీతం చెవిన పడితే అక్కడే ఆగిపోతాడు. చేస్తున్న పని కూడా మరిచిపోయేవాడు. ఆ కుర్రాడు స్వరాలే జీవితం అనుకున్నాడు. సరిగమలతోనే సావాసం చేయాలని తలచాడు. అయితే, పరిస్థితులు అనుకూలించక సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యాడు. తొమ్మిదేళ్లు అదే ఉద్యోగంలో అత్యధిక వేతనం తీసుకుంటున్నా సంతృప్తి లేదు. చివరికి చిన్ననాటి సంగీతాన్నే సాధన చేస్తూ కొత్త అవతారం ఎత్తాడు. తనలాగే సరిగమలను ఆస్వాదించేవారికి శిక్షణ ఇచ్చేందుకు ఓ సంస్థను నెలకొల్పాడు. ఆ సంస్థ పేరు ‘సౌండ్ క్రాఫ్ట్’. ఆ సాధకుడు బికాస్థ్.్ర ఇప్పుడు ఎంతో మంది విద్యార్థులను సంగీత గాంధర్వులుగా తీర్చిదిద్దుతున్నాడు. సాక్షి, సిటీబ్యూరో ఎయిర్ ఇండియాలో పనిచేసిన తండ్రి రాజు కిసారథ్ ప్రోత్సాహం.. టీచరైన అమ్మ మమతారథ్ చేయూతతో చిన్నప్పటి నుంచి సంగీతంపై ఇష్టం పెంచుకున్నారు భువనేశ్వర్కు చెందిన బికాస్థ్.్ర అప్పట్లో సంగీతమే ప్రొఫెషన్గా ఎంచుకునేందుకు కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్కు వచ్చిన బికాస్ 2009లో జాబ్కు బైబై చెప్పారు. పండిట్ గోవింద్ రాజ్ వద్ద హిందూస్థానీ సంగీతాన్ని సాధన చేసి, భార్య ప్రసీదా నాయిర్ రథ్ తోడ్పాటుతో మాదాపూర్లో ‘సౌండ్ క్రాఫ్ట్’ మ్యూజిక్ సంస్థని ప్రారంభించారు. శాస్త్రీయ-పాశ్చాత్య స్వర మేళవింపు.. శాస్త్రీయ సంగీతంతో పాటు పాశ్చాత్య సంగీత పరిమళాలను సిటీవాసులకు పంచాలనుకున్నారు బికాస్థ్.్ర ఉద్యోగులను ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు ఇదొక మంచి మార్గమమనుకున్నారు. అఖిల భారతీయ గాంధర్వ మహా విద్యాలయ నుంచి హిందుస్థానీ సంగీతాన్ని నేర్చుకున్నారు. లండన్లోని ట్రినిటీ కాలేజీలో వెస్ట్రన్ మ్యూజిక్ను వంటబట్టించుకున్నారు. అనంతరం ‘సౌండ్ క్రాఫ్ట్’ మ్యూజిక్ సంస్థను ఏర్పాటు చేసి పలువురిని తీర్చిదిద్దుతున్నారు. గచ్చిబౌలి, కూకట్పల్లి, జూబ్లిహిల్స్లో ఉన్న ఈ సంస్థ శాఖల్లో పియానో, కీబోర్డ్, గిటార్, డ్రమ్స్, వయోలిన్, వెస్ట్రన్ మ్యూజిక్తో పాటు ఫ్లూట్, తబలా, హార్మోనియం, వీణ, హిందూస్థానీ గాత్ర సంగీతంలోనూ శిక్షణ ఇస్తున్నారు. ఈ సంస్థ ఇచ్చే సర్టిఫికెట్ విదేశాల్లో చదువుకునేందుకు అవకాశం ఉండటంతో వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా ఏదైనా వాద్య సంగీతం నేర్చుకోవాలనుకుంటే ఇన్స్ట్రుమెంట్ను ఎవరికివారే తీసుకెళ్లాలి. విలువైన ఆ పరికరాలను కొనుగోలు చేయడం అందరికీ సాధ్యం కాదు. అలాంటివారికి సౌండ్ క్రాఫ్ట్ అకాడమీనే ఇన్స్ట్రుమెంట్స్ను అందిస్తుంది. ఐదేళ్లు పైబడిన వయసు వారు ఎవరైనా ఇక్కడ సంగీతం నేర్చుకోవచ్చు. సౌండ్ క్రాఫ్ట్లో సంగీతం నేర్చుకున్నవారు మ్యూజిక్ టీచర్లుగా సెటిల్ అయినవారున్నారు. కొంత మంది విద్యార్థులు గ్రూప్గా మ్యూజిక్ బ్యాండ్స్ ఏర్పాటు చేసి ప్రదర్శనలిస్తున్నారు. సంగీతమే జీవితం అనుకునే పేద విద్యార్థులకు తన అకాడమీలోనే ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు బికాస్థ్. కొత్తగా రేడియో జాకింగ్, డిస్క్ జాకింగ్, వీడియో జాకింగ్, ఫొటోగ్రఫీలోనూ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపెట్టారు. ‘సౌండ్ క్రాఫ్ట్ ప్రారంభించిన తొలినాళ్లలో సంస్థలో భాగస్వామిగా ఉన్న ఓ మ్యుజీషియన్ నమ్మించి ఆర్థిక నష్టాల్లోకి నెట్టారు. దీంతో మాదాపూర్లోని సౌండ్ క్రాఫ్ట్ కొన్నాళ్లు మూతబడింది. నా భార్య మెడలో ఉన్న బంగారు ఆభరణాలను బ్యాంక్లో కుదువ పెట్టి మళ్లీ సంస్థ ప్రారంభించేందుకు సహకరించింది’ అని వివరిచారు బికాస్థ్. పిల్లలతో స్వర సంగమం.. సంపాదన కోసం సౌండ్ క్రాఫ్ట్ను ఏర్పాటు చేయలేదని, మురికివాడల్లోని పిల్లల్లో ఉన్న సంగీత ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ ఇవ్వడమే తమ ధ్యేయమని చెబుతున్నారు బికాస్. తన కెరీర్లో సంపాదించిన దానికంటే.. ఆ పిల్లలతో గడిపిన సమయమే తనకు ఎక్కువ సంతృప్తినిచ్చిందంటారు. వాళ్లలో కొందరినైనా ఫ్రొఫెషనల్ మ్యుజిషియన్స్ చేయాలన్నది తన లక్ష్యమంటాడు బికాస్థ్.్ర తన వద్ద శిక్షణ పొందిన కొందరు విద్యార్థులు అల్బమ్స్ కూడా రూపొందించారని సంతోషం వెలుబుచ్చారు. నేపాల్ భూకంప బాధితుల కోసం ఇటీవల హైటెక్సిటీలో ఓ ఈవెంట్ నిర్వహించి వచ్చిన మొత్తాన్ని నేపాల్ బాధితులు అందజేసి మానవతవాదాన్ని చాటుకున్నారు బికాస్. ‘సంగీతమంటే సరదాగా నేర్చుకొని వదిలేయడం కాదు. ఈ రోజుల్లో మ్యూజిక్నే జీవితంగా ఎంచుకునేవారు ఉన్నారు. ఇలాంటివారిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు కృషి చేస్తున్నాం’ అంటున్నారు బికాస్థ్ ్రభార్య ప్రసీదా నాయర్ రథ్. ఎంత ఒత్తిడిలో ఉన్న సంగీతం వింటుంటే కలిగే ఆనందమే వేరని చెబుతున్నారు. స్పెషల్ సమ్మర్ శిక్షణ నాలుగు నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ సెషన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, వెస్ట్రన్ డాన్స్, యోగా క్లాసులు నేర్పిస్తోంది సౌండ్ క్రాఫ్ట్. చేరాలనుకునేవారు 8885093930 నంబర్లో సంప్రదించవచ్చు. -
అక్క.. తమ్ముడు.. ఓ కోతి..
ఓ వైపు పేదరికం... మరో వైపు బతుకు సమరం... పోరాడక తప్పదు... ఊహ తెలియని వయసులో ఓ అక్క తన తమ్ముడితో కలిసి ఓ కోతిని వెంటపెట్టుకొని రోడ్డుపైకి బయలుదేరింది. నలుగురు కనిపించిన చోట కోతితో ఆట మొదలు పెడుతోంది. ఎండ తాపం తట్టుకోలేక అలసి సొలసి ఇలా సేదతీరుతున్న దృశ్యం నెక్లెస్ రోడ్డులో ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. ఫొటోలు : దయాకర్ తూనుగుంట్ల -
మురి‘పాలు’ దూరం చేయెద్దు..
తల్లి పాలు శిశువుల ఆరోగ్యానికి పౌష్టికాహారం లాగానే ఆవు పాలు కూడా వాటి దూడలకు అంతే ముఖ్యం. ఆ పాలను మనం తస్కరించవద్దంటూ ప్రసాద్ ఐ మ్యాక్స్ వద్ద ఆవు వేషధారణలతో జాగృతి కల్పిస్తున్న పెటా ఇండియా వలంటీర్లు వీరంతా. ఆదివారం మదర్స్ డే సందర్భంగా రెండు రోజుల ముందే శుక్రవారం... ఇలా పిల్లలు ఆవు వేషధారణల్లో కనిపించి... తల్లులందరూ తమ పాలను పిల్లలకు ఇవ్వాలనుకుంటారని... ఆవు కూడా అంతేననే నినాదాలు చేశారు. -సాక్షి, సిటీబ్యూరో -
ట్రెండ్ గురూ..
పెళ్లంటే తప్పెట్లు... తాళాలు... తలంబ్రాలు.. ఇక్కడితోనే ఆగడం లేదు ఇప్పటి వివాహ వేడుకలు. భారీ సెట్లు ఉండాలి... అదిరిపోయే ఆతిథ్యం ఇవ్వాలి.. వధూవరులు పెళ్లి వస్త్రాల్లో తళుక్కుమనాలి. అందరి దీవనెలతో పాటు ప్రశంసలు అందుకోవాలి. మరి కోరుకున్నట్లు ఉండాలంటే ఫ్యాషన్ డిజైనర్ల చేతిలో వయ్యారాలు పోవాల్సిందే. ఒక్క పెళ్లి కూతురే కాదు పెళ్లి వేడుకలకు హాజరయ్యే ప్రతిఒక్కరూ ఆధునిక డిజైన్లు అద్దుకున్న శారీలు, గాగ్రాలు, లెహంగాలు, డ్రస్సుల్లో తళుక్కు మనేందుకు ఇష్టపడుతున్నారు. సంప్రదాయ పద్ధతినే ఫాలో అవుతూ నయాట్రెండీ డ్రెస్సులకు అలవాటుపడిన సిటీవాసుల నాడి పట్టుకున్న కృష్ణ కార్తీక్ ‘హనీశా రాయల్ కౌచర్’ అనే ఆన్లైన్ వెబ్సైట్ను తొమ్మిది నెలల క్రితం ప్రారంభించారు. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా వెడ్డింగ్ కలెక్షన్స్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సంప్రదాయ శారీల స్థానంలో ప్యూర్ డిజైన్ చీరలను పరిచయం చేశారు. - సాక్షి, సిటీబ్యూరో మహిళల వెతలు విని... నేను పుట్టి పెరిగింది సిటీలోనే. చిన్నప్పటి నుంచి ఫ్యాన్సీ డ్రెస్సులంటే మోజు. బీకామ్ చేశాక మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సిస్టమ్స్ ఇంజినీర్ (ఎంసీఎస్సీ) చేశా. సిటీలోని టాప్ ఐటీ కంపెనీల్లో పనిచేశా. ఆ తర్వాత రెస్టారెంట్ బిజినెస్ చేశా. ఆ తర్వాత ఓ ఎన్జీవోలో కౌన్సెలర్గా ఉద్యోగం చేశా. ఈ సమయంలోనే చాలా మంది మహిళల వెతలు విన్నా. దాంపత్య జీవితంలో అనర్థాలతో, గృహహింస కారణంగా కోర్టుకెళ్లి విడాకులు తీసుకోవాలనుకున్న మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు తీసుకొచ్చా. పెళ్లి సందర్భంలో దుస్తులు, బంగారం విషయాల్లో జరిగిన గోడును వినిపించేవారు. వారు డ్రెస్సులపై చూపిస్తున్న ఆసక్తితో పాటు అప్పటికే నాకు ఫ్యాషన్పై ఉన్న మోజు హనీశా రాయల్ కౌచర్ ప్రారంభించేందుకు దోహదం చేసింది. మార్కెట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న ఫ్యాషన్ డిజైన్ ట్రెండ్ను గమనించా. బెస్ట్ డిజైనర్ల చేతిలో డిజైన్లద్దుకున్న శారీలు, లెహంగాలు, హాఫ్ శారీల కలెక్షన్ సేకరించా. హైదరాబాదీలతో పాటు వివిధ నగరాల్లో ఫుల్ రెస్పాన్స్ ఉందని అంటున్నారు బెస్ట్ కలెక్షన్ హీరో కృష్ణ కార్తీక్. తప్పులే మెళకువలు నేర్పించాయి... బ్రాండ్ షూటింగ్పై నాకు జీరో నాలెడ్జ్. టెక్నికల్గా కెమేరా ఎలా ఉపయోగించాలో తెలియదు. మోడల్స్ను కెమేరాలో బంధించే విధానంలో తొలి, రెండు షూట్లలో బాగానే తప్పులు చేశా. ఫొటోగ్రఫీ నేర్చుకున్న తర్వాత నా టీమ్తో ఇతర బ్రాండ్లకు కూడా షూట్ చేసే స్థాయికి చేరుకున్నానని వివరించారు. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా... బెస్ట్ డిజైనర్ల నుంచి వెడ్డింగ్ వేర్, బ్రైడల్ వేర్, గౌన్లు, హాఫ్ శారీస్, అనార్కలీ శారీ కలెక్షన్స్ సేకరించాం. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా డ్రెస్సులు డిజైన్ చేయిస్తున్నాం. భవిష్యత్లో పెళ్లికూతురుకు అవసరమయ్యే ప్రతి వస్తువు అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికతో ముందుకెళుతున్నాం. లేడీస్ సెక్షన్లో హ్యండ్ బాగ్స్, ఫుట్వేర్లలో త్వరలో ఎంటర్ కాబోతున్నాం. ప్రాంఛైజీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు కృష్ణ కార్తీక్. ఇవీ ప్రత్యేకతలు... పెళ్లి కూతురు కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎలైట్ శారీ, ప్యూర్ జార్జెట్ శారీ, క్రేప్ సిల్క్ శారీలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆర్ట్ వర్క్ బ్రైడల్ వేర్, రెడ్ డిజైనర్ లెహంగాలపై కూడా అతివలు మనసు పారేసుకుంటున్నారు. సంపన్న కుటుంబాలవారు స్లీవ్ లెస్ పింక్ స్టోన్డ్ వర్క్ గౌన్, స్లీవ్ లెస్ పింక్ గౌన్, స్లీవ్ లెస్ గౌన్, రాయల్ కలెక్షన్ లాంగ్ గౌన్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. వీటితో పాటు పింక్ డిజైనర్ హాఫ్ శారీ, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ హాఫ్ శారీ, రెడ్ అండ్ క్రీమ్ కలర్డ్ హాఫ్ శారీ, యెల్లో రెడ్ హాఫ్ శారీ, రెడ్ హాఫ్ శారీ, పింక్ హాఫ్ శారీ, హాఫ్ శారీ వెల్వెట్ అండ్ హ్యాండ్క్రాఫ్ట్ ఎంబ్రాయిడరీ, ఫిష్ కట్ డిజైనర్ హాఫ్ శారీ, హాఫ్ వైట్ అనార్కలీ, పింక్ డిజైనర్ అనార్కలీ, హాఫ్ వైట్ అండ్ పింక్ డిజైనర్ పీస్, ఆరెంజ్ చిఫోన్, బ్లూ కుర్తా అనార్కలీ శారీలకు సిటీవాసులు మొగ్గుచూపుతున్నారని చెబుతున్నారు హనీశా రాయల్ కౌచర్ ఫౌండర్ కృష్ణ కార్తీక్. ఇండియాతో పాటు ఆస్ట్రేలియాలోనూ ఆన్లైన్ ద్వారా అమ్మకాలు చేస్తున్నామన్న కృష్ణ కార్తీక్... భవిష్యత్లో అమెరికాతోపాటు మరిన్ని దేశాలకు తమ అమ్మకాలను విస్తరించాలని అనుకుంటున్నామని వివరించారు. -
మట్టి మహిమ..
మట్టి కొట్టు టెక్నాలజీ, తీరిక లేనితనం, యాంత్రిక జీవనం తదితర కారణాలతో పాత పద్ధతులకు దూరమైన నగ ర జనం క్రమేణా అందులో ఉన్న గొప్పతనాన్ని గుర్తించడం మొదలుపెట్టారు. పెద్దల మాటలు, చేతలు అవి చేసే మేళ్లను ఒంట పట్టించుకుంటున్నారు. చేల గట్ల వెంబడి పారిన నీటిని తాగిన కాలం నుంచి మినరల్ వాటర్ లేనిదే ఉండలేని స్థితికి చేరుకున్న దశలను కాదనుకుని మట్టిలోని మాధుర్యాన్ని అనుభవించేందుకు సిద్ధమవుతున్నారు. ఒళ్లంతా బురదను పులుముకొని ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందుతున్నారు. బురదకు, ఆరోగ్యానికి లింకేమిటని ఆలోచిస్తున్నారా..? ఖచ్చితంగా ఉంది. సబ్బులు, షాంపూలు, కుంకుడు కాయలు కూడా లేని రోజుల్లో ఊరి బయటకు వెళ్లి అక్కడ లభించే రేగడి మట్టినేరుద్దుకుని స్నానం చేసేవారు. ఆ మట్టి స్నానం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ప్రకృతి వైద్యశాస్త్రం చెబుతోంది. ఈ వేసవి నుంచి ఉపశమనాన్ని, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందేందుకు నేచర్క్యూర్ ఆస్పత్రుల్లో మడ్బాత్ (మృత్తిక స్నానం)ను ఆశ్రయిస్తున్నారు నగరవాసులు. కేవలం మడ్బాత్ కోసమే రోజుకు 20-25 మంది నేచర్క్యూర్ ఆస్పత్రికి వస్తున్నారు. - సనత్నగర్ కాలానుగుణంగా చికిత్స... పంచభౌతికమైన శరీరానికి మట్టితో ఇక్కడ చికిత్స చేస్తున్నారు. మట్టిని పట్టీలుగా గానీ, రోగగ్రస్థమైన అవయవంపై లేపనంగా గానీ పూయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఈ చికిత్సను రోగిని అనుసరించి గానీ, వాతావరణం, కాలాలను అనుసరించి గానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎండ తీవ్రతను బట్టి మృత్తిక చికిత్సలు ఉంటాయి. ఈ చికిత్సకు జిగురుతత్వాన్ని కలిగిన బంక మన్ను (రేగడి మన్ను)ను ఉపయోగిస్తారు. రోగమేదైనా పట్టీ ఒక్కటే... ► సహజంగా మట్టిపట్టీని రోగి ఉపవాస కాలంలో రోజుకు రెండుసార్లు (ఉదయం 6 గంటలు, మధ్యాహ్నం 3 గంటలకు) వేయడం ద్వారా శరీరంలోని ఉష్ణోగ్రత మామూలు స్థితికి వస్తుంది. ఠఎంతటి తీవ్రమైన జ్వరమొచ్చినా రెండు మూడు రోజుల్లో తగ్గించే శక్తి మట్టిపట్టీలకు ఉంటుంది. ►పేగుల్లో మండనం (మురుగు) లేకుండా చేస్తుంది. ఆంత్రవ్రణములు, అమీబియాసిస్ తదితర వ్యాధులకు మట్టి పట్టీలు రోజుకు రెండు నుంచి మూడుసార్లు వేసుకోవడం ద్వారా కొద్దిరోజులకే తగ్గుతాయట. మందులు వాడాల్సిన అవసరం అసలే ఉండదు. ఠచీము, రక్త విరేచనాలు, నీళ్ల విరేచనాలు ఒకటి రెండు రోజుల్లో నివారించవచ్చు. ►మహిళలకు వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్కు మట్టిపట్టీలు రోజుకు మూడు లేదా నాలుగుసార్లు రెండు గంటల వ్యవధి చొప్పున వేసుకోవడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయని ప్రకృతి వైద్య నిపుణులు చెబుతున్నారు. మూత్రం రాకుంటే మట్టి లేపనం... నానిన రేగడిమట్టిని ఇక అంగుళం మందంతో పొట్ట భాగంలో లేపనం చేస్తారు. దీని ద్వారా మలబద్దకం, జ్వరం, అతి విరేచనాలు, రక్త గ్రహణి, ఆంత్రవ్రణములతో బాధపడుతున్న వారు ఉపశమనం పొందవచ్చు. మూత్రం మంటగా ఉన్నప్పుడు పొత్తి కడుపుపై మట్టి గానీ, మట్టిపట్టీలు గానీ వేయడం వల్ల మంట వెంటనే తగ్గుతుంది. మూత్రం రానిచో పొత్తి కడుపును కాపడం చేసి మట్టిపట్టీలు గానీ, మట్టి లేపనం గానీ చేసినట్లయితే సత్ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. పక్షవాతం, పోలియోలకూ... రోగిని ఒక స్టూలుపై కూర్చోబెట్టి బాగా నానిన రేగడి మట్టిని కాళ్లకు, చేతులకు లేపనం చేసి 10 నిమిషాల తరువాత స్నానం చేయించాలి. దీని ద్వారా కండరవాతం, మేహవాతం, చేతులు, కాళ్ల మంటలు, పగుళ్లు తీపులు, వాపులు తదితర సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా సంధివాతం, పక్షవాతం, పోలియో తదితర వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ చికిత్స ఎంతో ఉపకరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. నవ నాడులను ప్రేరేపిస్తుంది వీపుభాగంలో, నడుముకు అంగుళం మందంతో నానిన మట్టిని లేపనం చేసి 10 నిమిషాలు ఉంచిన తరువాత మట్టిని తీసివేసి స్నానం చేయించాలి. వెన్ను దేహమునకు కేంద్ర స్థానం కావడం వల్ల మెదడును, నవ నాడులను చల్లబరిచి చురుకుగా పనిచేసేలా మట్టి లేపనం ఎంతో సహాయపడుతుంది. గుండెజబ్బులైనా సరే.. రోగిని బల్లపై గానీ, నేలపై గానీ పడుకోబెట్టి ఒక అంగుళం మందంతో ఛాతి భాగమంతా మట్టి లేపనం చేస్తారు. దీని ద్వారా ఛాతినొప్పి, మంట, గుండె జబ్బులు, రక్తపోటు తదితర వ్యాధులతో బాధపడుతున్నవారు ఉపశమనం పొందవచ్చు. తలను నీటితో తడిపి నానిన రేగడిమట్టిని పూస్తారు. 15 నిమిషాల పాటు ఎండలో ఉన్న తరువాత శిరస్నానం చేయాలి. పురుషులే కాకుండా స్త్రీలు కూడా ఈ రకమైన తలమట్టి స్నానం చేయవచ్చు. దీని ద్వారా తలలో ఉండే చుండ్రు, జుట్టు ఊడిపోవడం, పండిపోవడం, పేలు కొరుకుడు, తలనొప్పి, కళ్ల మంటలు, నీరుకారడం, దృష్టి లోపం, కంటి, చెవి, ముక్కు వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఉన్మాదం, హిస్టీరియా, నిద్రలేమితనంతో బాధపడేవారికి ఎంతో ఉపయోగం. తల నుంచి పాదాల వరకు శరీరం మొత్తం నానిన రేగడి మట్టిని పూసుకుని 30 నిమిషాల తరువాత మట్టిని తీసివేసి స్నానం చేయాలి. మృత్తిక స్నానం వల్ల అన్ని రకాల చర్మవ్యాధులు, మొటిమలు మొదలుకొని గజ్జి, తామర, నల్లమచ్చలు, ఎర్రమచ్చలు, తెల్ల మచ్చలు, తెల్ల పొడలు, మేహం, దారుణం, అతి ఉష్ణం, కుష్టు, చర్మం పగుళ్లు తదితర అన్ని చర్మ వ్యాధుల నివారణకు మృత్తికా స్నానం ఎంతో ఉపయోగపడుతుంది. పాము కాటుకు భూగర్భ స్నానం... తల బయట ఉంచి భూమిలో శరీరం మొత్తాన్ని గానీ, వ్యాధి సోకిన అవయవాన్ని గానీ 10 నుంచి 30 నిమిషాల వరకు ఉంచడమే భూగర్భ స్నానం. దీని ద్వారా పక్షవాతం, పోలియో, కండరవాతం, సంధివాతం, గూని, పోలియో, చర్మవ్యాధులు, కుష్టు, బొల్లి తదితర రోగాలను నయం చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. పాముకాటుకు ఈ స్నానం ఎంతగానో ఉపయోగపడుతుందట. పాము కరిచినప్పుడు రోగిని అడ్డంగా అరగజం లోతు గొయ్యి తవ్వి తల బయటకు ఉంచి మట్టితో కప్పి కొన్ని గంటల వరకు ఉంచితే పాము విషం హరిస్తుందని వైద్యులు చెబుతున్నారు.భూమిలోని అయస్కాంత శక్తితో పాటు సేంద్రీయ లవణాల వల్ల శరీరంలోని ఎన్నో రోగాలు నివారించ వచ్చంటున్నారు. వేసవిలో ఆదరణ బాగుంటుంది... వేసవిలో మడ్బాత్కు ఎంతో ఆదరణ ఉంటుంది. ఎందుకంటే సూర్యరశ్మి ఉన్నప్పుడే మడ్బాత్ చేయాలి. దీని ద్వారా వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడంతో పాటు ఒంట్లోని ఎన్నో రకాల రుగ్మతలను తొలగించుకోవచ్చని ప్రకతి వైద్య శాస్త్రం ద్వారా నిరూపితమైంది. అయితే వైద్యుల పర్యవేక్షణలో చేసుకోవాల్సి ఉంటుంది. నేచర్క్యూర్లో రోజుకు 20 మంది వరకు మడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మంగళ, గురు, శనివారాల్లో మహిళలకు, సోమ, బుధ, శుక్ర వారాల్లో పురుషులకు మృత్తిక చికిత్స చేస్తున్నాం. డాక్టర్ ఎంవీ మల్లికార్జున్, సూపరింటెండెంట్, నేచర్క్యూర్ ఆస్పత్రి, అమీర్పేట్ -
చూడు తమ్ముడూ!
విషయాన్ని సుత్తి లేకుండా.. సూటిగా చెప్పడం చేతకాని వారెందరో.. వాట్సప్ గ్రూపుల్లో ఫ్రెండ్స్ దగ్గర అడ్డంగా బుక్కై పోతుంటారు. విషయ పరిజ్ఞానం ఉన్నా.. సింపుల్గా చెప్పడం తెలియని మేధావుల మెసేజ్లకు వాట్.. వాట్.. అనే రిప్లైలు వస్తుంటాయి. ఇంకొందరుంటారు.. అల్రెడీ ఫోన్లో ఇన్బిల్ట్గా ఉన్న స్మైలీ బొమ్మలను రిప్లైగా పంపుతూ.. అదే క్రియేటివిటీ అని ఫీలైపోతుంటారు. భాషలో రాయలేని విషయాలెన్నో.. ఒక్క బొమ్మ చెప్పేస్తుంది. అలాంటి బొమ్మల కొలువుతో వచ్చేసింది.. దేఖ్ భాయ్ ఆండ్రాయిడ్ యాప్. ఇది ఆన్లైన్ ప్రపంచంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్తో రాజ్యమేలుతోంది. ఈ మధ్య.. వాట్సప్, ఫేస్బుక్ మెసెంజర్, ఇన్స్టాగ్రామ్.. ఇత్యాది మెసేజ్ ఓరియెంటెడ్ ఆన్లైన్లో కొత్తగా కొన్ని చిత్రాలు విచిత్ర సంభాషణలతో కిక్కెక్కిస్తున్నాయి. మాటలకందని ఎన్నో భావాలు ఒక్క హావభావంతో ఎదుటివారికి చేరిపోతాయి. ఇదే సూత్రాన్ని పాటిస్తూ రూపొందించిన దేఖ్భాయ్ యాప్ ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తుంది. కళ్లుమూసుకుని, ఓ చెయ్యెత్తి ఏదో సీరియస్గా చూస్తున్న ఓ గుండు బొమ్మపై.. దేఖ్ భాయ్ అని రాసుంటుంది. సందర్భోచితంగా మీరేదైనా మెసేజ్ రాసుకోవచ్చు. తర్వాత దాన్ని షేర్ చేస్తే చాలు. ఇందులోని ఇన్బిల్ట్ మెసేజ్లు కూడా సరదాగా, ఫన్నీగా ఉంటాయి. హస్తీ హస్తీ.. దోస్తీ దోస్తీ.. ‘దేఖ్ భాయ్.. పైసే మాంగేతో ఫ్రెండ్షిప్ ఖతమ్’ (డబ్బులడిగావో.. దోస్తీ కట్) ఇదో రకం చిలిపి హెచ్చరిక సందేశం. దీన్ని పంపి చూడండి.. అట్నుంచి నవ్వులే రిప్లైగా వస్తాయి. బాయ్ బొమ్మ మాత్రమే కాదు.. ఓ పెద్దావిడ సీరియస్గా హితవు పలుకుతున్నట్టు ఉండే బొమ్మ.. కోపం, సంతోషం, హాస్యం.. ఇలా రకరకాల భావాలకు తగ్గట్టుగా ఉన్న బొమ్మలు ఇందులో ఉన్నాయి. పెద్దావిడ విషయానికి వస్తే.. ‘దేఖ్ బేటా..’ అని మొదలవుతుంది మెసేజ్. ‘దేఖ్ బేటా.. సోజా వర్నా ఫోన్ కో ఆగ్ లగాదూంగీ’ (పండుకో.. లేకపోతే ఫోన్కు నిప్పెట్టేస్తా..!) ఇలాంటి సరదా వార్నింగులెన్నో ఈ పెద్దావిడ బొమ్మను అడ్డం పెట్టుకుని పంపించేయొచ్చు. సెలబ్రిటీ హంగులు.. దేఖ్ భాయ్ ప్రస్థానానికి మూలం గుజరాతీ ‘జో బకా’ (చూడు మిత్రమా). ‘జో బకా’ మెసేజ్లు ఆన్లైన్లో ఎప్పట్నుంచో చక్కర్లు కొడుతున్నాయి. దాన్ని బేస్ చేసుకుని వచ్చిన దేఖ్ భాయ్ సిరీస్కు ఈతరం యువత రెడ్కార్పెట్ స్వాగతం పలుకుతోంది. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ బొమ్మలేకాదు.. సచిన్ టెండూల్కర్, నరేంద్ర మోదీ, బాబా రాందేవ్, రాహుల్ గాంధీ, రజనీకాంత్.. ఇలా ఫేమస్ పర్సనాలిటీల చిత్ర విచిత్రమైన క్యారికేచర్లు కూడా ఈ సరదా సందేశాల్లో పాలుపంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. బొమ్మలకు బ్యాక్ గ్రౌండ్లో కనిపించే ఎల్లో కలర్ను కూడా కస్టమైజ్డ్ గా మీ కిష్టమైన రంగుల్లోకి మార్చుకోవచ్చు. ఇన్బిల్ట్ బొమ్మలే కాదు.. కస్టమైజ్డ్గా ఫొటోలు కూడా ఎంపిక చేసుకునే చాన్స్ ఉంది. ఏ ఎక్స్ప్రెషన్స్నైనా పలికించే బొమ్మలు ఉన్నాయి కదా అని దేఖ్ భాయ్ని ఎడాపెడా వాడేస్తే లాభం లేదంటారు హ్యూమరిస్టులు. ఆ భావానికి తగ్గ భాషను పలికించగలిగితేనే కిక్కు డోసు పెరుగుతుందని చెబుతున్నారు. మరింకెందుకు ఆలస్యం ‘దేఖ్ భాయ్.. సోచ్ మత్.. డౌన్లోడ్ కర్..!!’. -
ప్లస్ టేస్ట్.. ప్లస్ ఏరియా..
చార్మినార్.. చారిత్రాత్మకంగా సిటీకి ప్లస్. హలీమ్.. రంజాన్ మాసంలో సిటీకి అందే ప్లస్ రుచి. హైదరాబాద్ బిర్యానీ.. ప్రపంచ ఖ్యాతి చెందిన ఈ ఘుమఘుమలు.. టేస్ట్ ఆఫ్ సిటీకి మెగా ప్లస్గా నిలిచింది. ఒక్కసారి ఈ దక్కన్ బిర్యానీ ముద్ద గొంతులోకి దిగితే.. మరో బిర్యానీ రుచి చేసినప్పుడల్లా.. హైదరాబాద్ గుర్తుకు రావాల్సిందే. హైదరాబాదీలకు అనుకున్నదే తడవుగా బిర్యానీ లాగించే అవకాశం ఉంది. మరి ఇతర నగరవాసులుకో..? మన సిటీ బిర్యాని టేస్ట్ చూడాలంటే వారంతా హైదరాబాద్కు రానక్కర్లేదు. మన సిటీ రెస్టారెంట్స్ బిర్యానీని వేడివేడిగా ఇతర రాష్ట్రాలకూ వడ్డించేస్తున్నాయి. మన సిటీలోని రెస్టారెంట్స్లో రాజస్థానీ ఫుడ్ఫెస్టివల్, పంజాబీ రుచులు, గుజరాతీ టేస్ట్లంటూ రోజూ ఏదో ఒక ఫుడ్ ఫెస్టివల్ జరుగుతూనే ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లోనూ.. హైదరాబాద్ ఫుడ్ ఫెస్టివల్స్ ఘనంగానే జరుగుతుంటాయి. చేయి తిరిగిన నలభీములు వండి వార్చినా.. హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ తీసుకురాలేకపోతున్నారు. ఈ సమస్యకు చెక్ పెడుతూ ‘బిర్యానీ బై ఎయిర్’ కాన్సెప్ట్ మొదలైంది. బెంగళూరు, ముంబై, పూణె.. నగరమేదైనా సరే హైదరాబాద్ దమ్ కీ బిర్యానీ రుచి చూడాలనుకుంటే ఇప్పుడు గంటల్లో పని. కాల్ చేసి ఆర్డర్ చేస్తే సరి సాయంత్రానికి వాళ్లింట్లో బిర్యానీ రెడీగా ఉంటుంది. ప్రస్తుతానికి వారానికి మూడు రోజులు ‘బిర్యానీ బై ఎయిర్’ అందుబాటులో ఉంది. ‘బిర్యానీ బై ఎయిర్’ సర్వీస్ను మేం ఈ మధ్యే మొదలు పెట్టాము. నాలుగు నెలలుగా ఆర్డర్లను బట్టి ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. వారానికి మూడు రోజులే సర్వీస్ ఉన్నా.. ఆ మూడు రోజుల్లోనే కనీసం రెండు వేల జంబో బిర్యానీల వరకు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఎక్కువ శాతం మటన్ బిర్యానీని కావాలంటున్నారు’ అంటున్నారు షా గౌస్ రెస్టారెంట్ ప్రొప్రయిటర్ మహ్మద్ రబ్బానీ. - శిరీష చల్లపల్లి -
సింక్ విన్
ఇండియా ఫీస్టా లాటినా.. ఈ పేరు సిటీలో చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఆ తక్కువలోనూ డ్యాన్సర్లే ఎక్కువుంటారు. ఢిల్లీ వేదికగా ఏడాదికోసారి లాటిన్ నృత్యాలతో హోరెత్తించే ‘ఇండియా ఫీస్టా లాటినా’.. ఓ అంతర్జాతీయ నృత్యోత్సవం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన విభిన్న వెరైటీల లాటిన్ డ్యాన్స్ స్టయిల్స్కు పట్టం కడుతూ సాగే ఈ ఫెస్టివల్లో ఈసారి నగరానికి కూడా ప్రాతినిథ్యం లభించడమే విశేషమనుకుంటే.. వీరిలో ప్రొఫెషనల్ డ్యాన్సర్ల కన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుంచి ప్రైవేట్ ఉద్యోగులే ఎక్కువగా ఉండటం మరో విశేషం. - ఎస్.సత్యబాబు ఢిల్లీలోని గుర్గావ్లో ఉన్న లీలా యాంబియన్స్ హోటల్ గత ఏప్రిల్ 10, 11, 12 తేదీలలో టాప్క్లాస్ లాటిన్ డ్యాన్సులతో హోరెత్తింది. ఈ కనుల‘పండుగ’లో సిటీ నుంచి పాల్గొనే అవకాశం సింక్వన్ బృందానికి దక్కింది. ఇటీవలే ఈ ఫెస్ట్ నుంచి సిటీకి తిరిగి వచ్చిన ఈ బృంద సభ్యులు సిటీప్లస్తో తమ అనుభవాలను ఇలా పంచుకున్నారు. రెస్పాన్స్ అదుర్స్.. ‘ఐఎఫ్ఎల్లో సల్సా- పచాంగా స్టైల్ను మైఖేల్ జాక్సన్ థ్రిల్లర్ సాంగ్కు రీమిక్స్ చేసి అందించాం. దీని కోసం ముందుగా బోలెడంత ప్రాక్టీస్ చేశాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన ఆర్టిస్ట్లను కలవడం ఓ స్ఫూర్తిదాయక అనుభవం. మా పెర్ఫార్మెన్స్కు ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ మరచిపోలేం. అక్కడ ఒక వర్క్షాప్ కూడా నిర్వహించాను. ఈ సందర్భంగా టాప్క్లాస్ లాటిన్ డ్యాన్సర్లతో కలిసి పదం కలిపే ఛాన్స్ వచ్చింది’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు సింక్వన్ బృంద సారథి శశాంక్. తనతో పాటు తొమ్మిది మంది ఈ బృందంలో ఉన్నారు. ‘ఇప్పటిదాకా 8 డ్యాన్స్ ఫెస్ట్లలో పాల్గొన్నా.. అన్నింటిలోకి ఇది బెస్ట్’ అని చెప్పాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి అర్జీత్ సింగ్. వీరిలో తొలిసారి డ్యాన్స్ ఫెస్ట్లలో పాల్గొంటున్నవారూ ఉన్నారు. ‘ఇదే ఫస్ట్ టైమ్ నాకు. ఇట్స్ క్రేజీ ఈవెంట్. నేను ఇప్పటిదాకా అటెండవ్వని పూల్ పార్టీనీ ఎంజాయ్ చేశాను’ అంటూ సంబరపడిపోయింది ఐటీ ఉద్యోగిని పరిధి. అన్బిలీవబుల్.. ఎంజాయ్మెంట్ విత్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా దీన్ని అభివర్ణిస్తున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగిని సునంద. ‘ఐఎఫ్ఎల్ కోసం లాస్ట్ డిసెంబర్ నుంచి ప్రిపేరయ్యా. నేర్చుకునేవారికి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునేవారికి ఇదో గొప్ప వేదిక’ అని అన్నారామె. ప్రపంచపు బెస్ట్ ఆర్టిస్ట్స్తో స్టేజ్ షేర్ చేసుకోవడం నమ్మలేకపోతున్నానని చెప్పారు ప్రతీక్. ‘ఇది నేను పాల్గొన్న 4వ ఫెస్టివల్. యూట్యూబ్లో మాత్రమే చూడగలిగే విదేశీ డ్యాన్సర్లను ప్రత్యక్షంగా కలవడం ఒక కలలా అనిపిస్తోంద’ని అన్నారు పార్కర్ ట్రైనర్గా నగరంలో సుపరిచితులైన అభినవ్. ‘తొలిసారి ఐఎఫ్ఎల్లో పాల్గొన్నాను. క్లాసుల నుంచి పెర్ఫార్మెన్స్ల దాకా అన్నీ సూపర్బ్. కొత్త కొత్త మూవ్మెంట్స్ నేర్చుకున్నాం’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది అదితి. ‘ఈ మెగా డ్యాన్స్ ఫెస్ట్లో అంతులేని వినోదాన్ని పొందాను’ అన్నారు మరో డ్యాన్సర్ శ్రవణ్. త్రీ డేస్.. ఓన్లీ డ్యాన్స్ నాలుగేళ్లుగా సింగపూర్ డ్యాన్సర్ నీరజ్ మస్కారా.. లాటిన్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నృత్యాభిమానులు, ప్రొఫెషనల్ డ్యాన్సర్లు పాల్గొనే ఈ ఈవెంట్ ఢిల్లీలో జరిగింది. వరల్డ్ ఫేమస్ డ్యాన్సర్లు 800 మంది వరకు దీనికి హాజరయ్యారు. అమెరికా, యూకే తదితర దేశాల నుంచే కాక హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాలకు చెందిన వారు పాల్గొన్నారు. లాటిన్ డ్యాన్స్పై అవగాహన పెంచే ఉద్దేశంతో దీనిలో రోజంతా వర్క్షాప్స్, సాయంత్రం వేళల్లో డ్యాన్స్ షోలు ఉంటాయి. ఒకరోజు మొత్తం కాంపిటీషన్స్ ఉంటాయి. -
కుర్రకారు
కారు.. నాడది స్టేటస్ సింబల్. నేటి మెట్రో లైఫ్స్టైల్లో కొందరికది నీడ్! అయితే, ఏదో బ్రాండ్.. ఒక కారుంటే చాలు అనుకునే జనరేషన్ కాదిది. ఈతరం యువత.. తమకెలాంటి కారు కావాలో పేరెంట్స్కి చెబుతోంది. లగ్జరీయస్ కార్లకు ఓటేయిస్తోంది. సో.. కార్ల యూసేజ్ ఏజ్ గ్రూప్ మారి సేల్స్కు అమాంతం బూమ్ వచ్చింది. - హనుమా పదిపన్నెండేళ్ల కిందటి రోజులతో పోలిస్తే ఇప్పటి జనరేషన్ ఆలోచనా ధోరణి మారింది. అప్పట్లో యాభై ఏళ్లు పైబడిన వారు అత్యధికంగా కార్లు కొనేవారు. పైగా ఎటువంటి కారు కావాలో ఇంటి పెద్దే నిర్ణయించే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తి భిన్నం. ఐటీ, ఇతర ప్రైవేటు ఉద్యోగావకాశాల వల్ల ఇన్కమ్ లెవల్స్ భారీగా పెరిగాయి. చిన్న వయసులోనే డబ్బు సంపాదిస్తుండటం, బాధ్యతలు, ఖర్చులు పెద్దగా లేకపోవడం వల్ల స్వేచ్ఛగా విలాసవంతమైన అవసరాలపై ఖర్చు పెడుతున్నారు. అందుబాటులో ఉన్న లగ్జరీస్ను ఆస్వాదించాలనే ధోరణి, చూసేవారికి డాబుగా కనిపించాలనే తపన, ఈజీ ఈఎంఐలు, రుణ సౌకర్యాలు... ఇవే కార్లపై యువత మనసు పారేసుకొనేలా చేస్తున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం కార్లు కొనే ఏజ్ గ్రూప్ ఎక్కువగా 28-48 ఏళ్ల మధ్య ఉంటోంది. ఫీచర్ రిచ్.. లైఫ్లో భాగమైపోయిన గాడ్జెట్స్ వంటివే కార్లలో కోరుకొంటున్నారు. కొనుగోలుదారుల్లో ఎక్కువ కుర్రాళ్లే ఉండటం వల్ల ఇలా ఫ్యూచర్ రిచ్ కార్లకు క్రేజ్ పెరిగింది. ఇదివరకు రేడియో, టేపురికార్డర్ ఉంటే చాలనుకొనేవారు. ‘ఇప్పుడు ఎల్ఈడీ, యూఎస్బీ డ్రైవ్, వైఫై, టచ్స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ స్పీకర్స్.. ఇలా కార్లలో కూడా టెక్నాలజీ కోరుకొంటున్నారు. అలాగే అన్నీ అందుబాటులో ఉండాలి. అంటే.. ఏరోప్లేన్ కాక్పిట్లో పెలైట్ చేతికి అన్నీ ఎలా చేరువలో ఉంటాయో అలా! ఆడియో కంట్రోల్ స్టీరింగ్ వీల్పై కావాలి. పవర్ విండోస్, డోర్స్ లాక్, ఆటోమేటిక్ ఫోల్డింగ్ మిర్రర్స్.. ఇలా అన్ని ఫీచర్సూ ఉండాలి. అవి చేతికి అందాలి. సేమ్టైమ్.. స్టైలిష్గా, రిచ్గా, విభిన్నంగా, వినూత్నంగా ఉండే డ్యాష్బోర్డ్స్ ప్రిఫర్ చేస్తున్నారు’ అని చెబుతున్నారు బేగంపేట్ వరుణ్ మోటర్స్ షోరూమ్ డెరైక్టర్ డీకే రాజు. మైలేజ్ ఇంపార్టెన్స్.. ఇండియన్ మార్కెట్లో మైలేజీకే అధిక ప్రాధాన్యం. అలాగని పికప్ తగ్గకూడదు. సో.. బిగ్గర్ కార్.. స్మాలర్ సీసీ. అమెరికా వంటి దేశాల్లోనూ ఇదే పాలసీ. ఉదాహరణకు సియాజ్, డిజైర్ వంటి వాటిల్లో ఇంజిన్ కెపాసిటీ తక్కువ. కానీ 1.3 లీటర్ ఇంజినే అయినా అందులో విపరీతమైన పవర్ జనరేట్ అవుతుంది. 115 వీహెచ్పీ. ఆర్పీఎం ఎక్కువగా ఉంటుంది. టర్బో చార్జర్ల వల్ల పికప్ బాగుంటుంది. ఇప్పటి ట్రెండ్, యంగ్ జనరేషన్ను ఆకట్టుకోవాలంటే ఇలాంటివన్నీ మ్యానుఫ్యాక్చరర్స్ అందించక తప్పడం లేదు. రియర్ షేప్.. లుక్ డిఫరెంట్.. కారు చూడగానే డిఫరెంట్గా, ఆకట్టుకొనేలా ఉండాలి. వెర్నా, హోండా సిటీ వంటి కార్లను గమనిస్తే మస్కులర్ డిజైన్స్ కనిపిస్తాయి. ఇలా గ్రీన్లైన్స్ను ఇష్టపడుతున్నారు కుర్రకారు. ఫ్రంట్ షేప్కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో.. రియర్పైనా అంతే ఆసక్తి చూపుతున్నారు. ‘ముందు భాగాన్ని ఏ తయారీదారులైనా పెద్దగా మార్చలేరు. ఏరోడైనమిక్ షేప్లో స్లీక్గా ఉండాల్సిందే. బ్యాక్ పోర్షన్ను మార్చొచ్చు. అదీగాక కారును వెనక నుంచి చూసేవారే ఎక్కువగా ఉంటారు. కారణం... ఆపోజిట్ డెరైక్షన్లో అందరి కళ్లూ ట్రాఫిక్పైనే ఉంటాయి. సో.. మ్యానుఫ్యాక్చరర్స్ దీనికి ప్రాధాన్యమిస్తున్నారు. యూత్ టేస్ట్కు తగ్గట్టుగా స్లీక్ డిజైన్, హ్యుండై ఐ20లా టేల్ ల్యాంప్స్ ఇలా ప్రతిదానిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు’ అంటారు హిమాయత్నగర్ లక్ష్మీ హ్యూండయ్ బ్రాంచ్ మేనేజర్ సంజయ్. యావరేజ్ హైట్.. గతంతో పోలిస్తే యావరేజ్ ఇండియన్ హైట్లో కూడా మార్పు వచ్చింది. కొంత పొడవు పెరిగింది. దీంతో ‘టాల్బాయ్ డిజైన్ షేప్డ్’ కార్లను ప్రిఫర్ చేస్తున్నారు. అంటే.. హెడ్, లెగ్ రూమ్స్.. ఏదీ పట్టుకోకుండా కూర్చొని లేవడానికి సులువుగా ఉండాలి. సిటింగ్, డ్రైవింగ్ పోస్టర్స్ బాగుండాలి. ఇక టీ మగ్గులు తొణకకుండా కప్ హోల్డర్స్, మొబైల్ చార్జర్లు, బ్యాక్సైడ్ వారికి బెడ్ల్యాంప్స్, బ్యాగ్, కోట్ హుక్స్, ముఖ్యమైన, విలువైనవి సీక్రెట్గా పెట్టుకోవడానికి సీటు కింద స్టోరేజ్ వంటివన్నీ కామన్ ఫీచర్స్. సిటీలో హయ్యస్ట్ సెల్లింగ్ కారు డిజైర్. స్టైలిష్గా, ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ ఇందులో ఉంటాయి. తరువాతి కారు స్విఫ్ట్. గతంలో ఆటోగేర్ కార్లు వెయ్యికి ఒకటి అమ్మడం కష్టంగా ఉండేది. ఇప్పుడు సగటున 15-20 శాతం ఈ కార్లు అమ్ముడవుతున్నాయి. కారణం.. మైలేజ్, స్లీక్ మోడల్, ఇంటిగ్రేటెడ్ స్టీరియో వంటి ఫీచర్స్. -
ఫేస్బుక్ ఫ్రెండ్స్ & ఎన్వరాన్మెంటలిస్ట్
ఇంటిపంట సాగుదారులంతా ఫేస్బుక్లో ఫ్రెండ్స్. ఏయే పంటలు పండిస్తున్నారు? ఏం తింటున్నారు? ఏం వండుతున్నారు?.. ఇవన్నీ పోస్ట్స్, షేర్స్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా బంజారాహిల్స్లోని లామకాన్లో మీట్ అయ్యారు. ముచ్చటపడి ఇంట్లో పండించే ఆకు, కాయగూరలను ఆహారంగా ఎలా తీసుకోవాలనే విషయమై వర్క్షాపు నిర్వహించుకున్నారు. దీనికి హాజరైన ఎన్వరాన్మెంటలిస్ట్ సీతా ఆనంద్ వారందరికీ చెప్పిన విషయాలు మనకీ ఉపయోగపడేవే.. - ఓ మధు మనం ఇంట్లో పండించుకునే ఆకుకూరలు వారం.. పదిహేను రోజులకు చేతికొచ్చేవై ఉంటే మంచిది. ఇక మనం మోజుపడి పెరటిలోనే పండించుకునే వాటిని ఎలా తింటున్నామన్నది ముఖ్యం. ఉదాహరణకు చిక్కుడు, వంకాయ వంటివి వండేటప్పుడు బాగా నూనె వేసి డీప్ ఫ్రై చేసేస్తుంటాం. అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఏ కూరగాయలైనా, పప్పులైనా ఎంత పచ్చివి తినగలిగితే ఆరోగ్యానికి అంత మంచిది. శ్రీరామ నవమికి తినే వడపప్పు చక్కటి రా ఫుడ్ రెసిపీ. అలాంటివి రెగ్యులర్గా అన్ని పప్పులతో కలిపి కాంబినేషన్గా చేసుకోవచ్చు. పచ్చివి తింటేనే.. సలాడ్ చేసుకునేందుకు వీలైన కూరగాయలను కూడా ఇంట్లో పెంచవచ్చు. చాలా కూరగాయలను సలాడ్స్ చేసుకోవటం కుదరదని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. బీరకాయ, సొరకాయ, బూడిద గుమ్మడి కాయలు వంటివి పచ్చివి తినటమే ఉత్తమం. నీటి పరిమాణం ఎక్కువగా ఉండే కూరగాయల్ని వేడి చేయకూడదు. అంటే వండకూడదు. ఆ నీటిలో చాలా పోషకాలుంటాయి. వండటం వలన నీరు పోయి పోషకాలు నశిస్తాయి. ఆ కూరగాయల్లో ఉండే రసాయనాలు మారిపోతాయి. అలా కాంపోజిషన్స్ మారిపోతే ఆరోగ్యానికే హాని. తీగకూరగాయలన్నిటినీ సలాడ్స్గా చేసుకుని తింటేనే మంచిది. టమోటా, బాదం లాంటివి ఆ సలాడ్స్లోకి చేరిస్తే మంచి రుచి వస్తుంది. గంగవాయిలీ, పాలకూరలు కూడా సలాడ్లో వేసుకోవచ్చు. తోటకూర తినటం కొంచెం కష్టం. దీంట్లో కీరదోస, టమోటా, పచ్చిమిర్చి, నువ్వులు, పచ్చి నూనె.. ఇలా కాంబినేషన్స్తో ట్రై చేస్తే టేస్టీగా మారుతుంది. గానుగ నూనె వాడాలి. ఆహార క్రమం.. మనం తీసుకునే ఆహారంలో మొదటి స్థానంలో ఫ్రూట్స్ ఉండాలి. ఆ తరువాత స్థానం ఆకు, కూరగాయలకు ఇవ్వాలి. పప్పులకు కూడా ప్రాధాన్యమివ్వాలి. సమ్మర్లో ఎక్కువగా సలాడ్స్, ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సీజనల్ ఫుడ్నుసమపాళ్లతో తీసుకోవాలి. సమ్మర్ స్పెషల్ స్మూదీ.. నచ్చిన ఆకుకూర ఒక కప్పు, అరటిపండు, బాదం లేదా కొబ్బరిపాలు మిక్సీలో వేసుకోవాలి. అరటిపండు... లేకపోతే ఖర్జూరాన్ని వేసుకోండి. జ్యూస్లా చేసుకోవాలి. దానిలో సబ్జా గింజలు వేస్తే.. సమ్మర్ స్పెషల్ స్మూదీ రెడీ. ఇందులో కావాలంటే కొంచెం కొబ్బరి కూడా కలపొచ్చు. -
అల్లరి రాక్షసి
మీ..స్రవంతి ఎక్కడ నుంచి వచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అన్నది పాయింట్! ఇదిగో ఇలా చిలిపి నవ్వులు రువ్వుతూ.. సోగ కళ్లతో ఓ లుక్కేస్తున్న ఈ అల్లరి పిల్ల కూడా అంతే! గుడివాడలో పుట్టి..నెల్లూరులో చదివినా.. సిటీలో ‘కిర్రాక్’ పుట్టిస్తోంది. వరుస టీవీ షోలతో యాంకర్గా అదరగొట్టేస్తున్న ఈ అచ్చ తెలుగు అమ్మాయి పేరు స్రవంతి. మాటల మ్యాజిక్తో ఇంటింటికీచేరువైన అమ్మడు ‘సిటీప్లస్’తో కాసేపు ‘ప్లే బ్యాక్’కు వెళ్లింది. అది ఆమె మాటల్లోనే... - శిరిష చల్లపల్లి ఇంట్లో మగ పిల్లలు ఎవరూ లేరు. నేను.. చెల్లి! సో.. మనకు పూర్తి స్వేచ్ఛ. అమ్మాయినే అయినా.. అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోని అల్లరి. చిన్నప్పుడైతే డ్రెస్సులు కూడా ప్యాంటులు, షర్ట్లే! హెయిరూ షార్ట్ కటింగే. అమ్మానాన్నలూ నన్ను అబ్బాయిలానే చూసుకున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ మా నానమ్మ గొడవ మొదలు పెట్టింది.. మగాడిలా ఆ గెటప్ ఏమిటని! తన పోరు భరించలేక చివరకు ఇదిగో ఇలా లాంగ్ హెయిర్ పెంచాల్సి వచ్చింది. నేను పుట్టింది కృష్ణాజిల్లా గుడివాడలో. స్కూలింగ్ అంతా నెల్లూరులో. నాన్న ఆస్ట్రాలజర్. అమ్మ హౌస్వైఫ్. ఇంటర్లో సిటీకి షిఫ్ట్ అయ్యాం. నాటి నుంచి సనత్నగర్లోనే మకాం. ఇక్కడి హిందూ జూనియర్ అండ్ డిగ్రీ ఉమెన్స్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశా. కాలేజీ దగ్గరే ఇల్లు. ఒక్కోసారి లంచ్ బ్రేక్లో ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చేవారు. అమ్మ అందరికీ వండి పెట్టేది. ప్లేసు మారినా... నా అల్లరి తగ్గలేదు. నన్ను భరించలేక ఇంటి నుంచి కాలేజీ వరకూ అందరూ ‘అల్లరి రాక్షసి’ అని పిలిచేవారు. మా కాలేజీ ఫంక్షన్కు ఓసారి ఎంఎస్ నారాయణ కుమార్తె శశికిరణ్ వచ్చారు. వివిధ అంశాల్లో నా పెర్ఫార్మెన్స్ నచ్చి.. యాంకరింగ్ చేస్తావా అన్నారు. అలా అనుకోకుండా యాంకర్నయ్యా. తరువాత హాబీగా, ఇప్పుడు ప్రొఫెషన్గా మారిపోయింది. నా తొలి ప్రోగ్రామ్ ‘హ్యాపీ డేస్ జాలీ డేస్’. ఇక అక్కడి నుంచి లైవ్ షోస్, సెలబ్రిటీలు, పొలిటికల్ పర్సనాల్టీలతో ఇంటర్వ్యూలు. వాటిల్లో మొదటిది కేసీఆర్ గారితో చేశాను. ‘కిర్రాక్ విత్ క్యాండీ’తో మంచి క్రేజ్ వచ్చింది. మరికొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నా. ‘పిల్లా నువ్వు లేని జీవితం, ఒక లైలా కోసం’ సినిమాల్లో చేశా. టెన్షన్స్ ఎన్ని ఉన్నా కెమెరా ముందుకెళ్లానంటే ప్రపంచాన్నే మర్చిపోతా. -
ఫిట్ & గ్రీన్
FUN WAY హైదరాబాదీలు ఆడుతూపాడుతూ సైకిల్ తొక్కేస్తున్నారు. ఆఫీసులకు రివ్వున దూసుకుపోతున్నారు. ఇక వీక్లీ రౌండప్స్ సరేసరి. కాలు కదిపితే కార్లు.. రైడ్ కొట్టేందుకు స్పోర్ట్స్ బైక్.. ఇవన్నీ ఉన్నా కూడా మా స్టేటస్ సింబల్- సైకిల్ అంటున్నారు. ఆరోగ్యానందాల కోసం ఇంతకుమించిన బెని‘ఫిట్’ లేదంటున్నారు. గ్రీన్సిటీ అనేది ఓ డ్రీమ్ కాదు.. డెస్టినేషన్. సైక్లింగ్ మాత్రమే ఆ గమ్యాన్ని చేర్చగలదంటున్న మన హైదరాబాదీల న్యూ స్టైల్ స్టేట్మెంట్- ‘సైకిల్ టు వర్క్’. - సీహెచ్.ఎమ్.నాయుడు ఇప్పుడు మెట్రో నగరాలు రెండు రకాలు..ఒకటి- సైకిల్ నెట్వర్క్ ఉన్నవి.. రెండు- అటువంటి నెట్వర్క్ కోరుకుంటున్నవి..మన హైదరాబాద్ ఏ ట్రాక్పై ఉందో తెలుసుకోవాలంటే.. సిటీలో వాహనాల సగటు వేగం గంటకు 15 కిలోమీటర్ల లోపే. దాదాపు ఇదే వేగంతో మోటారు వాహనాలతో పోటీపడి నగరంలో సైకిళ్లు రోజూ వేల ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఇంధన వ్యయం, కాలుష్యం, జర్నీ టైమ్ పెరిగిపోతుండటం, వాహనాలతో కిక్కిరిసిపోతున్న ఇరుకిరుకు రోడ్లకు సైకిళ్లే ప్రత్యామ్నాయం అవుతున్నాయి. పైగా గజిబిజీ లైఫ్స్టైల్లో కసరత్తులు చేసే ఓపిక, తీరిక ఎవరికీ ఉండట్లేదు. అందుకే సైక్లింగ్ మంచి ఎక్సర్సైజ్గా మారుతోంది. ఇటు ట్రాఫిక్ సమస్యా తీరుతోంది. ఫలితంగా ఐదారంకెల జీతాలు అందుకుంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కార్లు, బైకులు వదిలేసి సైకిళ్లెక్కుతున్నారు. ‘సాఫ్ట్వేర్ జాబ్ కూర్చుని చేసేది. బాడీ యాక్టివిటీ ఉండదు. అలాగని జిమ్కి వెళ్లే టైమూ ఉండదు. కాబట్టి ఆరోగ్యం కోసమైనా సైక్లింగ్ మంచిది. అందుకే ఇప్పుడు చాలామంది ఐటీ పీపుల్ సైకిల్ టు వర్క్ను ప్రిఫర్ చేస్తున్నారు’ అంటారు రన్కోడ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంట్రీహెడ్ ప్రవీణ్ పమిడిముక్కల. హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్లో ఆరు వేల మంది సభ్యులుంటే, వీరిలో సైకిల్ టు వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు దాదాపు 2500. సై.. సైక్లింగ్ సైబరాబాద్.. సాఫ్ట్వేర్, ఎంఎన్సీ, కార్పొరేట్ కంపెనీల ఎదుట ఎన్ని అత్యాధునిక, ఖరీదైన వాహనాలుంటే అంత గొప్పగా భావించే పరిస్థితి అక్కడ. అటువంటి కంపెనీలు ఇప్పుడు సైకిళ్లపై ఆఫీస్లకు వచ్చే ఉద్యోగులకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తామంటున్నాయి. టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, రాయదుర్గంలోని వెల్స్ ఫార్గో సొల్యూషన్స్, హెచ్ఐసీసీ వంటి కార్పొరేట్ సంస్థలు సైకిల్ పార్కింగ్ జోన్లు, వాష్రూమ్లు ఏర్పాటు చేస్తున్నాయి. వేవ్రాక్ కంపెనీలో ప్రత్యేక సైకిల్ పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇంకొన్ని సంస్థలు ఫుడ్ కూపన్స్ అందిస్తున్నాయి. అయితే, సైకిళ్లపై ఆఫీస్లకు వచ్చే వారు వెంటనే రీఫ్రెష్ కావడానికి విదేశాల్లో ఆఫీస్ కారిడార్లలోనే ‘బైక్ పాడ్స్’ (రీఫ్రెషింగ్ పాయింట్స్) ఉంటాయి. వాటితో పాటు లోన్లు, బీమా సౌకర్యాలు మన దగ్గరా కల్పిస్తే సైక్లింగ్ మరింత పెరుగుతుందంటున్నారు ఐటీ ఉద్యోగులు. గ్రీన్రైడ్... ఇప్పుడు మెట్రో నగరాలు సైకిల్ నెట్వర్క్ను కోరుకుంటున్నాయి. ఇందులో బెంగళూరు రైట్ ట్రాక్లో ఉంది. అక్కడ సైకిల్ టు వర్క్ చేసే వారందరికీ ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉంది. మన సైబరాబాద్ ఇప్పుడిప్పుడే గ్రీన్రైడ్ చేస్తోంది. గ్రేటర్ సిటీలోని దాదాపు 45 లక్షల వివిధ రకాల వాహనాలు నిత్యం 63 లక్షల లీటర్ల ఇంధనాన్ని కాల్చేస్తున్నాయి. ఒక లీటర్ పెట్రోల్ నుంచి 2.3 కేజీల కార్బన్ డై ఆక్సైడ్ (వాహనం కండిషన్ బట్టి) విడుదలవుతుందని అంచనా. అంటే, ఏటా వాహనాల నుంచి 144.9 లక్షల కిలోల సీఓ2 విడుదలవుతుంది. అయితే ఒక చెట్టు రోజూ 21.77 కేజీల కార్బన్డైఆక్సైడ్ మాత్రమే గ్రహించగలదు. మన సిటీలో చెట్లకు మించి కార్లే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. సైకిల్ ఫ్రెండ్లీ సిటీ.. నగరంలో ఎక్కువ మంది నిత్యం ప్రయాణించే దూరాలు సగటున 5 నుంచి 10 కిలోమీటర్లు. ఈ ప్రయాణానికి సైకిలే తగిన రవాణా సాధనం అంటారు అర్బన్ ట్రాన్స్పోర్ట్ నిపుణుడు ప్రశాంత్ బాచు. ‘మెట్రో రైలు వస్తున్నా.. మన ప్రజా రవాణా వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న రష్ తగ్గదు. ఎందుకంటే ఆర్టీసీ, సైకిల్ స్టేషన్లతో మెట్రో స్టేషన్లు ఎంతగా అనుసంధానం అవుతాయనే దానిని బట్టే ఇది సక్సెస్ అవుతుంది’ అంటారాయన. ప్రస్తుతం రహేజా మైండ్స్పేస్ జంక్షన్ టు బయో డైవర్సిటీ పార్కు వరకు 1.2 కిలోమీటర్ల మేర నగరం మొత్తానికి ఒకే ఒక్క సైకిల్ ట్రాక్ ఉంది. కొన్ని రహదారులపై ఎల్లో లైన్స్ వేసి అదే సైకిల్ ట్రాక్ అంటున్నారు. ఇక, నక్లెస్ రోడ్, గచ్చిబౌలి, ఇందిరాపార్క్ ప్రాంతాల్లో సైకిల్ స్టేషన్లు ఉన్నాయి. ‘మన రోడ్లపై సైకిల్ ట్రాక్లు లేవు. కనీసం సైకిల్ వే సూచించే గుర్తులూ లేవు. అయినా సరే.. ఇది దేశంలోనే మంచి సైకిల్ ఫ్రెండ్లీ సిటీ. అంతేకాదు.. సిటీలో సైక్లింగ్ పెరుగుతోంది. నేను సైక్లింగ్ చేసిన మొదట్లో రోజూ ఐదారుగురిని రోడ్లపై చూసేవాడిని. వారంతా చిరు వ్యాపారులే. ఇప్పుడు నిత్యం 60 మంది వరకు కనిపిస్తున్నారు. వీళ్లలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులే’ అంటారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కృష్ణ మండవ. శ్రీనివాస్ కొల్లి ప్రొఫెషన్: అడ్మినిస్ట్రేటివ్ ఇన్చార్జ్, మాక్రో మీడియా సిస్టమ్స్ సైకిల్ టు వర్క్: ఏడేళ్లుగా.. పెడల్ పవర్: ఎల్లారెడ్డిగూడ-చర్లపల్లి ఐడీఏ (రానుపోను 44 కి.మీ.) ట్రాక్లైన్: చాలా కాలం ఒబేసిటీతో బాధపడ్డా. సైక్లింగ్తో ఫిట్ అయ్యా. ప్రవీణ్ పమిడిముక్కల ప్రొఫెషన్: కంట్రీహెడ్, రన్కోడ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సైకిల్ టు వర్క్: రెండేళ్ల నుంచి పెడల్ పవర్: బోయిన్పల్లి-బంజారాహిల్స్ (రానుపోను 16 కి.మీ.) ట్రాక్లైన్: హెల్త్ బెనిఫిట్ కోసమైనా సిటీలో సైక్లింగ్ కల్చర్ పెరగాలి. కృష్ణ మండవ ప్రొఫెషన్: అసిస్టెంట్ మేనేజర్, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సైకిల్ టు వర్క్: తొమ్మిదేళ్లుగా.. పెడల్ పవర్: సికింద్రాబాద్-బషీర్బాగ్ (అప్అండ్డౌన్ 14 కి.మీ.) ట్రాక్లైన్: తక్కువ దూరాలకు సైకిల్పైనే ప్రయాణించాలి. తీరు మారితేనే... ‘సిటీలో నేటికీ సైకిల్ అంటే పేదవాడి రవాణా సాధనంగానే చూస్తున్నారు. నగరాలను జీవనయోగ్యంగా తీర్చిదిద్దే క్రమంలో ఆధునిక హంగులపైనే దృష్టి సారించి, సైకిళ్లను విస్మరిస్తున్నారు. ఫలితంగానే సిటీలో సైకిల్ ట్రాక్లు కనిపించట్లేదు’ అంటారు సైకిల్ టు వర్క్ కోఆర్డినేటర్ విశాల. ‘సిటీలైఫ్లో ఏదైనా కెరీర్లో స్థిరపడగానే చాలామంది తమ స్థాయి, హోదా పెరిగే కొద్దీ... బైక్.. ఆ తరువాత కారు.. ఇలా వారి స్టేటస్ సింబల్స్ మారిపోతున్నాయి. నిజానికి లైఫ్స్టైల్ అప్గ్రేడ్ చేసుకోవడం అంటే, హోదా చిహ్నాలను పెంచుకుంటూ పోవడం కాదు కదా! అందరూ ఇంధన వాహనాలే వాడితే.. రోడ్లన్నీ వాటితోనే నిండిపోతే పరిస్థితి ఏమిటి?..ఈ ప్రశ్నకు సమాధానమే సైకిల్ టు వర్క్’ అంటారామె. ఐడెంట్సిటీ ఫౌండర్ డెరైక్టర్ కూడా అయిన ఈమె.. సిటీలో సైక్లింగ్ను పెంచేందుకు గల అవకాశాలపై తెలంగాణ రాష్ట్ర ఇండ్రస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ)తో కలిసి ప్రాజెక్ట్ రిపోర్ట్ను రూపొందిస్తున్నారు. రాజశేఖర్ బత్తుల ప్రొఫెషన్: ఇన్చార్జ్, గోస్ గ్రీన్ స్టోర్స్ సైకిల్ టు వర్క్: నాలుగేళ్లుగా.. పెడల్ పవర్: సనత్నగర్-బంజారాహిల్స్ (రానుపోను 16 కి.మీ.) ట్రాక్లైన్: సిటీలో ఇప్పుడున్న ట్రాఫిక్ స్థితిగతులకు సైకిలే బెటర్ ఆప్షన్. -
నృత్యహాసం
కమల్ హాసన్.. నవరసాలను దశావతారాల్లో చూపించే మెగా నటుడు. ఈ నటనగం గారాల పట్టి శ్రుతిహాసన్ మల్టీటాలెంట్తో ఇండస్ట్రీని దున్నేస్తోంది. తరుచూ పరస్పర పొగడ్తలతో పిత్రోత్సాహం, పుత్రికోత్సాహం పొందుతున్న వీరిద్దరూ సరదాగా స్టెప్పులేశారు. చెన్నైలో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో కనిపించిన ఈ దృశ్యం అభిమానులకు కనువిందు చేసింది. తన తండ్రితో కలసి పబ్లిక్ ఫంక్షన్లో డ్యాన్స్ చేయడం మరచిపోలేని అనుభూతి అంటోంది శ్రుతి. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ట్వీటుతూ.. ‘నాన్నతో కలసి వేసిన స్టెప్స్ కూతురిగా నాకు స్పెషల్ మూమెంట్’ అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. -
ఠండీ సండీ
బయట ఎండలు మండిపోతుంటే... గొంతులోకి చల్లగా ఐస్క్రీమ్ జారడం అద్భుతమైన అనుభూతి. పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు ఐస్క్రీమ్స్ ఇష్టపడని వారు ఉండరు. ఇలాంటి హిమక్రీమ్ల ప్రేమికుల కోసమే... రెస్టారెంట్స్, ఐస్క్రీమ్ పార్లర్స్, మాల్స్... డిఫరెంట్ ఐస్క్రీమ్స్ను మార్కెట్లోకి తెస్తున్నాయి. ఇక ఈ సమ్మర్ స్పెషల్గా అందరి నోరూరించనుంది సండీ. చాక్లెట్ ైబె ట్స్, కలర్ఫుల్ జెమ్స్, సీజనల్ ఫ్రూట్స్, డ్రై-ఫ్రూట్స్, చెర్రీస్, డేట్స్, వాల్నట్స్, సేమియా ఇలా అనేక రకాల కాంబినేషన్స్తో తయారు చేసి.. దానికి ఓరియో, వేపర్, చాక్లెట్ అండ్ కారమేల్ స్ప్రింకిల్స్, పైన్ ఆపిల్, ఆపిల్ క్రష్డ్ పీసెస్.. వంటి వాటితో డెకరేట్ చే స్తున్నారు. కోల్డ్ కాఫీ, ఐస్క్రీమ్ పంచ్, మాక్టైల్స్, కోక్ఫ్లోట్, ఫ్రూట్ సలాడ్ వంటి తినుబ ండారాల్లో సైతం కలుపుతున్నారు. నోరు తీపి చేసే గులాబ్జామూన్, హల్వా, ఖుర్బానీ-కా-మీటా, డబుల్-కా-మీటాల్లో సైతం ఈ సండీని కాంబినేషన్గా వాడుతున్నారు. ‘డిఫరెంట్ టైప్ ఆఫ్ డిషెస్ ఇష్టపడుతున్నట్టే... ఐస్క్రీమ్స్లోనూ వెరైటీలను కోరుకుంటున్నారు. అలాంటి ఐస్క్రీమ్ లవర్స్ వీటిని ఇష్టంగా టేస్ట్ చేస్తారు’ అని చెబుతున్నారు హాజెల్ ఐస్క్రీమ్ కెఫే మేనేజర్ రాకేష్ కుమార్. - శిరీష చల్లపల్లి చిన్నారుల కోసం.. రొటీన్ సమ్మర్ క్యాంపులకు భిన్నంగా తాహెర్ అలీ బేగ్ థియేటర్ గ్రూప్ పిల్లల కోసం ప్రత్యేక వర్క్షాపు నిర్వహిస్తోంది. ‘స్కెచ్చింగ్, క్రియేటివ్గా ఆలోచించడం’ అనే అంశాలపై నిర్వహించే శిక్షణకు మూడు నుంచి ఏడేళ్లలోపు చిన్నారులు అర్హులు. మే 2 నుంచి 23 వరకు వారాంతాల్లో తరగతులు ఉంటాయి. వివరాలకు taher@ flickrollers.com -
డబ్బు దారుల్లో చోద్యాలు
ధనం అన్ని అనర్థాలకు మూలం అంటారు కొందరు. డబ్బంటే సుఖం. డబ్బంటే అధికారం. డబ్బంటే మనమాటను అందరూ వినడం అనుకుంటారు అధికులు. కాబట్టే కదా చరిత్ర నిండా ఇన్ని రక్తపాతాలు- కన్నీళ్లు! దీన్నెవడు కనిపెట్టాడో కాని, లోకంలో డబ్బనేది లేకపోతే చీకూచింతా ఉండదు కదా అని వాపోతారు మరి కొందరు. ఊహల్లోంచి బయటకు వస్తే డబ్బు ఆక్సిజన్ ! డబ్బు కావాలి! ఎంత? ‘చాలు చాలు’ అనేంత! కలవారు డబ్బు వ్యర్థం అనుకుంటారు. లేనివారు వెంపర్లాడతారు. డబ్బొద్దు అనుకున్నా డబ్బుండాలి కదా!. డబ్బు చేసుకోవడానికి మంచి సలహాలు ఎవరిస్తారు? సంపాదన చేతకాని వాళ్లు మాత్రమే! సంప్రదాయక విజ్ఞానం మనిషి ముందు మూడు దారులు పరచింది. బెగ్-బారో-స్టీల్! అడుక్కో-అప్పుచేయి-లాక్కో! కొందరు అడుక్కునే వారిని మనం గుర్తించలేం. వారు మనోవిజ్ఞానంలో మాస్టర్స్. ట్రాఫిక్ సిగ్నల్స్ కూడలిలో ఎర్రలైటు పడగానే ప్రత్యక్షమవుతారు. వారి వల విడిపించుకోలేనిది. డబ్బివ్వకపోతే అపరాధ భావన కు గురవుతాం! ప్రార ్థన స్థలాల్లో భగవంతుడేమో కాని అడుక్కునేవారు తప్పనిసరిగా ప్రత్యక్షమవుతారు. ‘దైవాన్ని రహస్యంగా అడుక్కున్నదాంట్లో కొంచెమేగా మేము ఆశిస్తున్నది, మాకు చిల్లర విదిలించకపోతే మీకు టోకు లభిస్తుందా?’ అన్నట్లుగా కళ్లల్లోకి సూటిగా సంభాషిస్తారు. రెస్టారెంట్లో బిల్లు చెల్లించిన తర్వాత మీ స్థాయిని అంచనా వేస్తారు కొందరు బేరర్స్. మీరు అతిథి కావచ్చు, ఆతిథ్యం ఇచ్చిన వారు కావచ్చు, ఆత్మశోధనకు గురిచేస్తారు. తగిన మొత్తం ఘరానాగా చదివించి ఒక తలపంకింపును స్వీకరిస్తేగాని మీ మనస్సు తేలికపడదు. చోర్ మచాకే.. దొంగిలించడం అనే కళలోనూ రిస్క్ ఉంది. మీరు ఉద్యోగులా? అయితే పెట్టిన ఖర్చుకంటే అదనంగా చట్ట ప్రకారం దొంగిలించవచ్చు. టీఏ డీఏలను అదనంగా చూపవచ్చు. రాని వ్యక్తులను అతిథులుగా, తినని పదార్థాలను, ద్రవాలను సేవించినట్లు రికార్డులను చూపవచ్చు! అప్పు చేయడం ద్వారానూ కొందరు డబ్బు సంపాదిస్తారు. కుటుంబసభ్యుల్లో ఎవరి అంత్యక్రియలకో వెళ్లాలనడం, అయిన వారిని తక్షణం దవాఖానాలో చేర్పించాలనే నెపం అభినయించి అప్పిచ్చే వారిలో మానవత్వాన్ని తట్టిలేపాలి. తిరిగి చెల్లించకపోయినా ఫర్వాలేదనుకునే అమౌంట్కు ఎర్త్ పెట్టాలి. జ్ఞాపకశక్తి లోపించిన వారి దగ్గర, అడిగేందుకు మొహమాటపడే వారి దగ్గర అప్పు చేయడం శ్రేయస్కరం. దురదృష్టం ఏంటంటే అంతంత మాత్రం జ్ఞాపకశక్తి ఉన్నవాళ్లు కూడా అప్పిచ్చిన వైనాల్లో చురుగ్గా ఉంటారు! ఆమ్యామ్యా.. డబ్బు సంపాదనలో లంచం కూడా ఒక మార్గమే! ఇందుకు ఒక కొలువు తప్పనిసరి. కొలువు ఏదైనా లంచానికి కాదేదీ అన ర్హం! లంచం తీసుకున్నందుకు చట్టం శిక్షించదు, తీసుకున్నట్లు పట్టుబడితేనే సుమా! లంచం ఆశించేవారు తెలివిగా ఉండాలి. మరీ దురాశకు పోరాదు. ఈ ఆశ లేనివాళ్లు ఏదైనా రాష్ట్రానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వెళ్లవచ్చు. - ప్రెజెంటేషన్ : పున్నా కృష్ణమూర్తి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, రచయిత. సెల్ నెం : 7680950863 -
సంగీతలక్ష్మి
‘చదువైనా.. సంగీతమైనా.. సముపార్జనకంటే నలుగురికి పంచడంలోనే సంతోషం ఉంది!’ అని నమ్ముతారు హబ్సిగూడకు చెందిన రాళ్లబండి ఆదిలక్ష్మి. అందుకే ఎనభై ఏళ్లు దాటిన తరువాత కూడా.. సప్తస్వరాలనూ నలుగురికి పంచుతూ అసలైన ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. ఈతరంతో పోటీ పడుతూ 2009లో జరిగిన లక్ష గళార్చనలో పాల్గొని గిన్నిస్ బుక్ రికార్డుల్లోనూ చోటు సంపాదించుకున్న ఆమె పరిచయం... ..:: మండల్రెడ్డి భూపాల్రెడ్డి, హబ్సిగూడ గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టిన ఆదిలక్ష్మి ఆరో ఏటనే సంగీతం నేర్చుకున్నారు. సప్తస్వరాలపై ఉన్న మక్కువతో ఇతర విషయాల జోలికి వెళ్లకుండా ఇంటర్మీడియట్లోనూ మ్యూజిక్ కోర్సునే ఎంపిక చేసుకున్నారు. తనకిష్టమైన సంగీతం నుంచే డిగ్రీ పట్టా కూడా పొందారు. తరువాత పెళ్లి, పిల్లలు.. బాధ్యతలు. అయినా ఆమెలో ఉన్న సంగీత తృష్ణ నిలవనీయలేదు. అయితే ఏం చేయాలో స్పష్టత కూడా లేదు. అదే సమయంలో ఓసారి ఒడిశా నుంచి హైదరాబాద్కు రైలులో ప్రయాణిస్తుండగా గతంలో ఆమెకు సంగీతం నేర్పిన ప్రిన్సిపల్ రేవతి కనిపించారు. సంగీతంలో కొన్ని మెళకువలు చెప్పడమే కాదు.. ఎందుకు నేర్పించగూడదనే సలహా ఇచ్చారు. ఆమె సలహాను పాటించిన ఆదిలక్ష్మి ఆదాయ మార్గంగా కాక.. తను నేర్చుకున్న సంగీతాన్ని నలుగురికీ పంచుతూ శారదా పుత్రికగా వెలుగుతున్నారు. ఇప్పటికే కొన్ని వందల మందికి ఉచిత శిక్షణ ఇచ్చారు. ఎంతోమందిని విద్వాంసులుగా తీర్చిదిద్దారు. ఆమె శిష్యులు సైతం సంగీతంలో శిక్షణ ఇస్తున్నారు. త్యాగరాయగాన సభ, ఆర్టీసీ కళాభవన్, తెలుగు లలితా కళాతోరణ, రవీంద్రభారతి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం... వేదిక ఏదైతేనేం సంగీత పోటీల్లో పాల్గొనేవారెందరో ఇప్పటికీ హబ్సిగూడలోని ఆమె నివాసానికి వచ్చి శిక్షణ తీసుకుంటుంటారు. గిన్నిస్ బుక్ రికార్డు.. 2009 మేలో సిలికానాంధ్ర, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా ఏర్పాటు చేసిన లక్ష గళార్చనలో ఆమె తన శిష్యులతో కలిసి భాగం పంచుకున్నారు. గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు ఆదిలక్ష్మి. ఈమె శిష్యులు దేశ, విదేశాల్లో సంగీత అధ్యాపకులుగా కొనసాగుతుండటం విశేషం. పిల్లలంతా విదేశాల్లో ఉన్నా తను మాత్రం... ఇండియానే కాదు ఇల్లునూ వదిలిపెట్టలేదు. ఈ 80 ఏళ్ల వయసులో... మూడేళ్ల నుంచి 70 ఏళ్ల వయసున్నవారి వరకు సంగీతంలో ఎందరికో శిక్షణ ఇస్తున్నారు. -
ఆకుట్టుకున్నాడు..
గాన గంధర్వుడు ఎస్పీ బాలు గళం.. నటుల గళాన్ని అనుసరిస్తూ సాగుతుంది. సెలబ్రిటీ టైలర్గా పేరొందిన మురళి కూడా అంతే.. మనుషుల రూపురేఖల్ని బట్టి అందంగా ఆహార్యాన్ని రూపుదిద్దుతాడు. ఒక్కసారి టైలర్ గారి పనితనం చూపిన డ్రెస్ వేసుకుంటే.. సదరు వ్యక్తికి అదే అ‘డ్రెస్’గా సెట్ అయిపోతుంది. అబిడ్స్.. రద్దీగా కనిపించే ఈ ప్రాంతంలో.. ఎన్నో డిజైనర్ షోరూమ్లు అద్దాల మేడల్లో మెరిసిపోతుంటాయి. ఇక్కడి మయూర్ కుశాల్ కాంప్లెక్స్ తొలి అంతస్తులోని బి-బ్లాక్లో ఉంటుందీ టైలర్ కొట్టు. మెడలో ఓ టేప్ వేసుకుని.. సాదాసీదాగా కనిపించే మురళి.. కొలతలు తీసుకున్నాడా..! మీరు నిశ్చింతగా ఉండొచ్చు. మీ బాడీకి కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా డ్రెస్ కుట్టిపెడతాడాయన. ఈయన పనితనం ఒక్కసారి చూస్తే.. ఎవరూ ఆయనను వదిలిపెట్టరు. అంత అందంగా ఒంటిపై ఒదిగిపోతాయి ఈయన కుట్టిన డ్రెస్లు. ఈయన లిస్ట్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా ఉన్నారు. 15 ఏళ్లపాటు వెంకయ్యనాయుడు ఈయన కుట్టిన చొక్కాల్లోనే తళుక్కుమన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి, ఎమ్మెల్సీ రంగారెడ్డి, ఒకప్పటి డీజీపీ సుకుమార్, చంచల్గూడ జైలు సూపరింటెండెంట్ నర్సింహారెడ్డి (రిటైర్డ్), ఇంకా పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్లు, పారిశ్రామికవేత్తలు, మార్వాడీ, అగర్వాల్ ప్రముఖులు కూడా మురళి కుట్టిన జోతలకు జేజేలు పలికిన వారిలో ఉన్నారు. ఆయన కుట్టుబాటుతనం అలాంటిది మరి. ఈయనకు జంట రాష్ట్రాల నుంచే కాదు.. విదేశీ కస్టమర్లు కూడా ఉన్నారంటే దర్జీగా ఆయన దర్జా ఏంటో తెలుస్తుకోవచ్చు. ఓ సినిమాలో నాగార్జున కాస్ట్యూమ్స్ ఈయనే రూపొందించాడు. అలాగే డెలాయిట్ కంపెనీ ఉద్యోగులకు కొన్నాళ్ల పాటు ఈయనే డ్రెస్లను కుట్టి పెట్టారు. రేమాండ్ అడ్డాగా.. మెదక్ జిల్లా జిన్నారానికి చెందిన మురళీధర్ చిన్నప్పటి నుంచే కుట్టు మిషన్పై కదం తొక్కేవాడు. 1990లో అబిడ్స్లోని సుమంగళ్ రేమాండ్ షోరూమ్లో టైలరింగ్ విభాగంలో హెడ్గా తన ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 2010లో ఆ షాప్ మూతపడటంతో తనే సొంతంగా టైలర్ షాప్ ప్రారంభించాడు. రేమండ్కు అనుబంధంగా 20 ఏళ్లపాటు పనిచేయడంతో.. ఆ షోరూమ్కు వచ్చే ప్రముఖులందరూ మురళీ కస్టమర్లుగా మారిపోయారు. ఆయన పనితనం తెలిసిన వారు మాత్రం.. ఇప్పటికీ ఆయన షాపును వెతుక్కుంటూ వస్తున్నారు. -
క్లిక్ & బుక్
ఒకప్పుడు నాడి పట్టుకుంటే చాలు.. రోగి ఒంట్లోని జబ్బేంటో చెప్పేసేవారు వైద్యులు. ఇప్పుడు ఏ చిన్న రోగం వచ్చినా.. వైద్యుడిని సంప్రదించే ముందే డయాగ్నోస్టిక్ సెంటర్ గురించి వాకబు చేయాల్సిందే. నగరంలోని డయాగ్నోస్టిక్ సెంటర్స్ అడ్రస్లను, ఇతర వివరాలను అందుబాటులో ఉంచుతోంది ‘బుక్ మై ల్యాబ్’ వెబ్సైట్. కామన్ పీపుల్ భారంగా భావించే వైద్య పరీక్షలను సులభతరం చేస్తోంది. - భువనేశ్వరి ఒంట్లో నలతగా ఉంటే డాక్టర్ను సంప్రదిస్తాం. డాక్టర్ ఫలానా వైద్య పరీక్షలు చేయించండని చెబుతారు. ఆ టెస్ట్లు చేయించడం కోసం మంచి డయాగ్నోస్టిక్ సెంటర్లను వెతకాల్సిన పని లేకుండా చేస్తోంది ‘బుక్ మై ల్యాబ్’. ముందుగా మీరు ఈ వెబ్సైట్లోకి ఎంటరై.. మీ పేరిట అకౌంట్ ఓపెన్ చేయాలి. వెబ్సైట్లో మూడు వందలకు పైగా డయాగ్నోస్టిక్ సెంటర్ల అడ్రస్లు, ఫోన్నంబర్లు అందుబాటులో ఉన్నాయి. మీరున్న ఇంటికి దగ్గరగా ఉన్నది, లేదా మీకు నమ్మకమైంది ఎంచుకుని ఒక్క ఫోన్ కొడితే చాలు.. సదరు డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రతినిధులు మీ ఇంటికొచ్చి మరీ బ్లడ్ శాంపుల్స్ సేకరిస్తారు. ఇక్కడితోనే బుక్ మై ల్యాబ్ పని అయిపోదు.. శాంపుల్స్ను పరీక్షించాక ఆ వివరాలను మీ అకౌంట్లో పొందుపరుస్తారు. మీ రిపోర్ట్స్ మీరెక్కడికి వెళ్లినా వన్ క్లిక్ దూరంలో మీకు అందుబాటులో ఉంటాయన్నమాట. ఒక పరిష్కారంగా.. ‘మేం ఈ వెబ్సైట్ మొదలుపెట్టి ఆరు నెలలు కావొస్తోంది. వెయ్యిమంది పేషెంట్లు అకౌంట్ ఓపెన్ చేస్తే సక్సెస్ అయినట్టేనని భావించాం. అయితే ఇప్పటి వరకు నగరంలోని 2,600 మంది బుక్ మై ల్యాబ్లో అకౌంట్లు ఓపెన్ చేసుకున్నారు. మనకు వైద్యం అందుబాటులోకి వచ్చినంత వేగంగా.. డయాగ్నోసెంటర్ల సేవలు అందడం లేదు. ఏదైనా పేరున్న సెంటర్కి వెళ్తే గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగానే బుక్ మై ల్యాబ్ను తీసుకొచ్చాం’ అని చెబుతారు దీని రూపకర్త శంకర్. నిక్షేపంగా.. ఈ రోజుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ ఎంత పదిల ంగా దాచుకోవాలో.. టెస్ట్ రిపోర్ట్స్ కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తోంది. దీర్ఘకాలిక రోగాల బారిన పడిన వారికి ఇది అత్యంత అవసరం. నగరంలో చాలా మంది రోగులు రిపోర్ట్స్ను భద్రంగా దాచుకోలేక.. చేయించుకున్న టెస్ట్లే మళ్లీ చేయించుకోవాల్సి వస్తోందని ఒక సర్వేలో తేలింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బుక్ మై ల్యాబ్కు రూపకల్పన చేశామంటారు శంకర్. ‘మొదట కేవలం పరీక్షల రిపోర్ట్స్ భద్రపరిచే ప్లాట్ఫామ్గా దీన్ని ఉంచాలనుకున్నాం. కానీ, రోగుల అవసరాల దృష్ట్యా వారికి డయాగ్నోస్టిక్ సెంటర్ల వివరాలను అందుబాటులో ఉంచాం’ అంటారు శంకర్. అతని స్నేహితులు కాశి, ప్రమోద్తో పాటు మరో ఏడుగురు కుర్రాళ్లు ఈ వెబ్సైట్ నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు. అన్నీ ఆన్లైన్... వైద్యపరీక్షల పత్రాలే కాదు.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ కూడా ఇందులో భద్రపరుచుకోవచ్చు. డాక్టర్ రాసిచ్చిన మందుల చీటీని స్కాన్ చేసి అకౌంట్లో పెట్టుకుంటే సరి. ఈ వివరాలు అకౌంట్ హోల్డర్ అదుపాజ్ఞల్లోనే ఉంటాయి. మరొకరు ఈ వివరాలు తెలుసుకునే వీలుండదు. ఇటీవల శ్రీనగర్కాలనీలోని ఒక అపార్ట్మెంట్కు చెందిన 200 మంది ఒకేసారి బుక్ మై ల్యాబ్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవడానికి ముందుకొచ్చారు. నిత్యజీవితంలో అన్నీ ఆన్లైన్ అయిపోతున్న ఈ తరుణంలో.. వైద్యపరీక్షలు మాత్రం ఎందుకు ఆన్లైన్లో భద్రపరచకూడదని వారు భావిస్తున్నారు. -
ప్రేమతో..
www.youtube.com/watch?v=4EzmS5pcZuQ ప్రేమ.. మనసుల్లో చిగురించి మనుషుల్లో రాగబంధాలు పూయిస్తుంది. ప్రేమ అతి సున్నితం... అపురూపం. అందుకే ప్రేమించడం కన్నా ప్రేమను గౌరవించడం ఎంతో ముఖ్యమంటాడు యువ దర్శకుడు రాజు వరికుప్పల. తన షార్ట్ ఫిలిం ‘లవ్ మెయిల్’ ద్వారా ఇదే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఎంబీఏ చదివి హెచ్ఆర్గా పనిచేస్తూనే తనకిష్టమైన గ్లామర్ ఫీల్డ్లో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాడు. తపన ఉంటే అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించిన రాజు రూపొందించిన ఈ చిత్రం హీరో కావాలనుకొనే యువకుడు గౌతమ్ స్టోరీ. స్నేహితుడితో కలిసి బస్టాప్లో ఉన్న గౌతమ్... అక్కడ రోజాతో ఓ లెటర్ పట్టుకు నిలుచున్న అమ్మాయి అందానికి ఫిదా అయిపోతాడు. కొంత కాలం తరువాత ఆ విషయాన్ని ఆ బ్యూటీకి చెప్పాలనుకుంటాడు. రోజూ తనకు రోజాతో లెటర్స్ అక్కడ పెడుతుంది గౌతమేనని ఆమె అనుకుంటుంది. తను కూడా ప్రేమను ఓ లెటర్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటుంది. బస్టాప్కు వస్తుంది. షాక్..! గౌతమ్ కనిపించడు. కానీ... ఉత్తరాలు మాత్రం అందుతుంటాయి. ఇవి ఇక్కడ ఎవరు పెడుతున్నారో తెలుసుకోవాలని ఓ రోజు ముందే వస్తుంది. గౌతమ్ అక్కడ లెటర్ పెట్టడం చూసిన అమ్మాయి... అతడిని నిలదీస్తుంది. అవి తాను రాసినవి కాదంటాడు అతడు. పెద్ద ట్విస్ట్! అసలా లెటర్స్ రాస్తున్న అజ్ఞాత వ్యక్తి కార్తీక్. ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తాడు. ఆ విషయం చెప్పేలోపు యాక్సిడెంట్ అయి అతడు కోమాలోకి వెళతాడు. విషయం తెలిసిన గౌతమ్... వారి ప్రేమను బతికించడానికి ఆ లెటర్స్ పెడుతుంటాడు. ఆమెకు విషయం అర్థమవుతుంది. ప్రేమిస్తున్న అమ్మాయితో అవి తనవి కావని ఎందుకు చెప్పావని అతడి ఫ్రెండ్ గౌతమ్ను అడుగుతాడు. మోసం చేసి పెళ్లి చేసుకోవచ్చని... కానీ ఆ తరువాత నిజం తెలిసి ఆమె కళ్లతో ప్రశ్నిస్తే అది చూసి తాను తట్టుకోలేనంటాడు గౌతమ్. ‘ప్రేమలో ఓడిపోయినా... ఓ అమ్మాయి మనసు, ఆమె ఇష్టాన్ని గౌరవించిన నువ్వు హీరో’వంటూ అభినందించడంతో కథ ముగుస్తుంది. - ఓ మధు -
100 రోజుల ప్రయాణం
లఘుచిత్రాలు అంటే.. ప్రేమ, కామెడీ వీటి చుట్టూనే తిరుగుతుంటాయి. ఇందుకు భిన్నంగా ఎంఆర్ ప్రొడక్షన్స్ విలువలతో కూడిన చిత్రాలను తీస్తూ వచ్చింది. వందో చిత్రంగా ‘ప్రయాణం’ లఘుచిత్రాన్ని 45 నిమిషాల నిడివితో తీసింది. వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ వందో చిత్రం.. ఏడు లక్షల మంది వీక్షకులను మూటగట్టుకుంది. మంచి సంభాషణలు, మంచి సంగీతం.. మేళవించిన ‘ప్రయాణం’ పల్లెటూరి వాతావరణంలో సాగుతుంది. ఈ పొట్టిచిత్రంతో పాతకాలపు విలువలను మరోసారి గుర్తుచేశారు యువ దర్శకులు సుభాష్, ధీరజ్రాజ్. నాయికా నాయకులకు సీతారాముల పేర్లను పెట్టారు. పల్లెటూరుకు వెళ్తే నిజమైన ప్రేమ విలువ తెలుస్తుందని సీతను అక్కడకు పంపిస్తుంది ఆమె తల్లి. తాను రామ్ని ప్రేమిస్తున్న విషయం పల్లెకు వెళ్లాక తెలుసుకుంటుంది సీత. పెళ్లిపీటల మీదకు చేరిన ఈ ప్రేమను అందంగా చూపించారు. అలనాటి పెళ్లి ముచ్చట్లతో సరదాగా సాగిపోతుందీ చిత్రం. కాలక్షేపానికి ప్రేమించడం, బ్రేకప్ చెప్పడం, మళ్లీ ప్రేమ, మళ్లీ బ్రేకప్.. జీవితమంటే ఇది కాదని ఈ చిత్రం ద్వారా చెప్పారీ దర్శకులు. - వైజయంతి -
కోలన్ హైడ్రోథెరపీ.. సరికొత్త చికిత్స
మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా? గ్యాస్ సమస్య, పదేపదే తేన్పులు వస్తూ, కడుపుబ్బరంగా ఉంటోందా? జీర్ణకోశ సమస్యలతో విపరీతమైన ఒత్తిడి చెందుతున్నారా? అప్పుడేం చేస్తారు.... మెడికల్ షాప్కి వెళ్ళి ఏ టాబ్లెట్లో తెచ్చుకుంటారు లేదా డాక్టర్ని అడిగి మందు వేసుకుని ఉపశమనం పొందుతారు. కానీ దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడాలంటే ఇది సరిపోదు. సరైన పోషకాహారం తీసుకుంటూ, అవసరమైన మందులు వేసుకుంటూనే ఈ సమస్యకు మూలకారణాన్ని తొలగించాలి. పెద్దపేగులో పేరుకున్న మలినాలను తొలగించడమే దీనికి ఆ పరిష్కారం. ఇందుకు ఉపయోగపడే కోలన్ హైడ్రోథెరపీ. జీర్ణక్రియ, విసర్జన క్రియలు సక్రమంగా జరుగుతున్నప్పుడే ఏ మనిషైనా ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉండగలుగుతాడు. రోజంతా ఆహ్లాదంగా గడవాలంటే వీటిలో ఎటువంటి సమస్యలు ఉండకూడదు. అయిదు అడుగుల పొడవుతో ఉండే పెద్దపేగు విసర్జనక్రియలో కీలకపాత్ర పోషిస్తుంది. కోలన్ని శుభ్రపరచడం అనే విధానం అభివృద్ధి చెందిన దేశాల్లో ఎప్పటినుంచో ఉంది. మనదేశంలో కూడా ఇది ఇప్పుడిప్పుడే ప్రాధాన్యం సంతరించుకుంటున్నది. ఎలా పనిచేస్తుంది? కోలన్ హైడ్రోథెరపీలో నీరు వివిధ దశల్లో ఫిల్టర్ అవుతుంది. అంతేగాక అల్ట్రా వయొలెట్ వాటర్ ప్యూరిఫికేషన్ ద్వారా నీరు శుభ్రమవుతుంది. ఆ తరువాతే రెక్టమ్ ద్వారా లోపలికి వెళ్లి, ఆ నీరు నెమ్మదిగా పెద్దపేగును చేరుతుంది. సురక్షితమైన, స్వచ్ఛమైన, నియంత్రిత ఉష్ణోగ్రతతో నీరు పెద్దపేగును చేరుతుంది. గోరువెచ్చని (37.5 డిగ్రీ) నీరు పెద్దపేగును చేరగానే సహజసిద్ధంగా మలినాలతో సహా బయటకు వచ్చేస్తుంది. మృదువుగా మారిన మలినాలన్నీ కింద ఉన్న కోలన్ హైడ్రోథెరపీ టేబుల్ కిందకు చేరుతాయి. ఇదంతా పూర్తవడానికి 35 నిమిషాలు పడుతుంది. వాసనను బయటికి పంపించే వ్యవస్థ కూడా దీనిలో ఉంటుంది. కాబట్టి చికిత్స జరిగేటప్పుడు ఎటువంటి దుర్వాసన రాదు. ఈ ప్రక్రియ కోసం ఒక వ్యక్తికి ఒక డిస్పోజబుల్ రెక్టల్ నాజిల్ను ఉపయోగిస్తారు. ఈ చికిత్స చేయించుకోవడానికి రెండు గంటల ముందు వరకు ఏమీ తినకూడదు. కోలన్ హైడ్రోథెరపీ ఎన్నిసార్లు చేయించుకోవాలనేది పేషెంటు ఆరోగ్య పరిస్థితులను బట్టి ఉంటుంది. ఈ చికిత్స ఇప్పుడు వారానికి ఒక రోజు నెలలో 5 సార్లు ఒక ప్యాకేజిగా అందుబాటులో ఉంది. వెల్నెస్ ప్రోగ్రామ్లో భాగంగా ఎటువంటి సమస్య లేనివాళ్లు కూడా కోలన్ హైడ్రోథెరపీ చేయించుకోవచ్చు. శుద్ద్కొలన్ కేర్ ఇప్పుడు శాద్నగర్లో అందుబాటులో ఉంది. కోలన్ థెరపీ యంత్రాలను కూడా ఇక్కడ తయారుచేస్తున్నారు. హాస్పిటల్, నర్సింగ్ హోమ్స్, స్లిమ్మింగ్ సెంటర్లు, స్పాలు... ఎవరికి అవసరమున్నా సప్లయి చేస్తున్నారు. ఇవీ ఫలితాలు... మలబద్ధకం, కడుపుబ్బరం, గ్యాస్, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. మలినాలతో పాటు హానికర బ్యాక్టీరియా వెళ్లిపోతాయి. కాబట్టి సంపూర్ణంగా ఆరోగ్యం చేకూరుతుంది. జీవక్రియలు మెరుగుపడతాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నొప్పిలేని, సురక్షిత చికిత్సా పద్ధతి. వీరిలో ప్రతికూల సంకేతాలు ⇒ గర్బిణులు, పెద్దపేగు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్కి ⇒సంబంధించిన తీవ్రమైన సమస్యలున్నవాళ్లు. ⇒హార్ట ఫెయిల్యూర్ సమస్య ఉన్నవాళ్లు ⇒రెక్టల్ క్యాన్సర్ ఉన్నవాళ్లు అల్సరేటివ్ కోలైటిస్ ⇒తీవ్రమైన పైల్స్ (అర్శమొలలు) సమస్య ఉన్నవాళ్లు రాజగోపాల్ శుద్ధ్ కోలన్ కేర్ డెరైక్టర్ mail id: info@shuddhcoloncare.com website: www.shuddhcoloncare.com అడ్రస్ : shuddh colon care opp GVK entry gate,Road No. 4, Banjara Hills,hyderabad 8008002032, 8008002033 షాద్నగర్ :9948328351 -
కరాచీ గుండెల్లో.. మన చార్మినార్
షహర్ కీ షాన్ మీకు ఓ అందమైన దృశ్యమో, అద్భుతమైన కట్టడమో కనిపించిందనుకోండి ఏం చేస్తారు. ఫొటో తీసి గుర్తుగా పెట్టుకుంటారు. స్నేహితులకు చూపి మురిసిపోతారు. కానీ ‘వారు’ అలా చేయలేదు. ఆ ‘జ్ఞాపకాన్ని’ అంతకుమించిన రీతిలో పదిలపరుచుకున్నారు. అనుకున్నదే తడువుగా అలాంటి రూపాన్ని తమ ఊళ్లో నిర్మించుకున్నారు. మరో అడుగుముందుకేసి ఆ కట్టడం ఉన్న కూడలికి దాని పేరును సుస్థిరం చేశారు. ఆ నిర్మాణం.. మన చార్మినార్!. అది ఉన్నది.. పాకిస్థాన్ వాణిజ్య నగరం కరాచీ శివారులోని బహదూరాబాద్లో..!! ఇంతకూ నిర్మించింది ఎవరో తెలుసా..??? దేశ విభజన సమయంలో మన హైదరాబాద్ నుంచి వెళ్లి అక్కడ స్థిరపడ్డవారు..!!! ఆకాశాన్ని ముద్దాడేందుకు ఆతృత చూపుతున్నట్టు అంతెత్తున నాలుగు మినార్లు.. అద్భుత నగిషీలతో మంత్రముగ్ధులను చేసే నిర్మాణ కౌశలం.. ద్రాక్షగుత్తి కోసం ఆరాటపడే ఉడతలు, చటుక్కున పండు నోటకరుచుకెళ్లే పక్షులు.. కట్టడం రెండో అంతస్తులో ఇరాన్ నిర్మాణ శైలితో ఆకట్టుకునే మసీదు.. డంగుసున్నం, నల్లబెల్లం, కరక్కాయ, గుడ్డు సొన, రాతిపొడి మిశ్రమంతో రూపుదిద్దుకుని.. ప్రపంచంలోని అపురూప కట్టడాల్లో ఒకటిగా నిలిచిన చార్మినార్ అందమిది. ఇక్కడికొచ్చే పర్యాటకులు దాని ముందు ఫొటో దిగి అపూరూపంగా దాచుకుంటారు. అలాంటిది దాన్ని చూస్తూ పెరిగినవారు మరో దేశంలో స్థిరపడితే ఎలా ఉంటుంది. దేశ విభజన సమయంలో చార్మినార్కు దూరమైన హైదరాబాదీలదీ అదే వ్యథ. చార్మినార్పై అభిమానంతో.. కరాచీ నగర శివారులోని బహదూరాబాద్ వాణిజ్య ప్రాంతం. శరణార్ధులు అధికంగా ఉండే పట్టణం. నిజాం జమానాలో జాగీర్దారైన బహదూర్ యార్ జంగ్ కూడా ఈ ప్రాంతానికి చేరుకోవటంతో ఆయన పేరుతోనే దానికి బహదూరాబాద్ అనే పేరొచ్చింది. దేశ విభజన సమయంలో మన హైదరాబాద్ నుంచి కూడా కొన్ని కుటుంబాలు ఆ ప్రాంతానికి వెళ్లి స్థిరపడ్డాయి. హైదరాబాద్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది చార్మినారే కదా. అందుకే వీరికి కూడా చార్మినార్ అంటే ఎంతో అభిమానం. చార్మినార్ను చూస్తూ పెరిగిన వారు పాకిస్థాన్కు వెళ్లిపోవటంతో నిరంతరం వారిని ఆ వెలితి వెంటాడుతుండేది. అందుకే ఇండియాకు వచ్చినప్పుడల్లా వీలుచూసుకుని హైదరాబాద్కు వచ్చి చార్మినార్ కట్టడాన్ని చూసి, ఫొటోలు దిగి మురిసిపోయేవారు. అయినా ఏదో వెలితి.. ఈ క్రమంలో వారి తరువాతి తరంలోని కొందరికి మెరుపులాంటి ఆలోచన కలిగింది. దాన్ని తోటి మిత్రులతో పంచుకుని స్థానిక ప్రభుత్వ సహకారంతో దాన్ని సాకారం చేసుకున్నారు. సృష్టికి పునఃసృష్టి అక్కడి బహదూరాబాద్ చౌరంగీ (కూడలి)లో 2007లో చార్మినార్ను పోలిన కట్టడాన్ని నిర్మించారు. మెరుగులు దిద్దే పని 2010లో పూర్తయింది. ప్రస్తుతం ఈ కూడలి పేరు.. చార్మినార్ చౌరంగీ. మన చార్మినార్ అంత ఎత్తు కాకున్నా, మినార్లతో కలుపుకొంటే దాదాపు 50 అడుగుల ఎత్తుతో నిర్మించుకున్నారు. ఇక ఫొటోలలో చార్మినార్ను చూసి మురిసిపోయే పాత రోజులకు సెలవు చెప్పారు. ఆ కూడలికి వచ్చి మినీ చార్మినార్ను చూసి సంబరపడేవారు. దాన్ని చూసిన తర్వాత... పాకిస్థాన్లోని చాలామందికి మన హైదరాబాద్లోని అసలు చార్మినార్ను చూడాలనే కోరిక పెరిగిందట. ఇందుకోసం మన నగరానికి వచ్చేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకునేవారి సంఖ్యా పెరిగిందట. వెరసి... పాకిస్థాన్లో మన ‘గుర్తు’సగౌరవంగా నిలబడి అక్కడి వారితో సలామ్ చేయించుకుంటోంది. - గౌరీభట్ల నరసింహమూర్తి -
తీన్మార్ రచ్చ
మీ.. రాములమ్మ (రమ్యకృష్ణ) రాములమ్మ.. తీరైన బొట్టు, వాలుజడ, చేతినిండా గాజులతో ‘తీన్మార్ న్యూస్’లో యాంకర్గా పరిచయమైన హైదరాబాదీ. తెలంగాణ యాసతో పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సంపాదించుకుంది. ఫిజియో థెరపీ చదువుతూనే ‘రాకింగ్ రాములమ్మ’గా అప్పుడప్పుడూ ప్రేక్షకులను పలకరిస్తోంది. ఏదో ట్రైచేద్దామనుకుంటే నా స్టార్ తిరిగిందంటున్న ఈ సిటీగాళ్ ముచ్చట్లు ‘మీ’కోసం... నా అసలు పేరు రమ్యకృష్ణ. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. చదువు కూడా ఇక్కడే. ఫిజియోథెరపీ ఫైనల్ ఇయర్ చేస్తున్న. స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. అయితే ఒక్క చదువు విషయంలో తప్ప దేనికీ ప్లానింగ్ చేయను. ఎప్పుడు ఏది అనిపిస్తే అది చేస్తా. అందుకే ఫిజియోథెరపీలో ఉండగానే చానల్లో ఒక స్పెషల్ ప్రోగ్రాం కోసం ఆడిషన్స్ నడుస్తున్నయని చెబితే... చలో పబ్లిక్తో మాట్లాడనీకి ఒక ఆప్షన్ దొరుకుతుంది గదా, నా జాతకం ఎట్లుందో ట్రైజేద్దాం అని పొయిన. లక్కీగా సెలక్ట్ అయిన. నా స్టార్ తిరిగింది. తీన్మార్ ప్రోగ్రామ్ల రాములమ్మలా అవతరామెత్తిన. ఒక ఏడాదంతా ప్రోగ్రాం చేసిన. దాంతో ఆ ఏడంతా నాకు ఇష్టమైన చదువుకు దూరమైన. మళ్లీ స్టడీస్... ఇట్ల కాదులే అని మళ్లీ కాలేజీలో జాయిన్ అయిన. ఇప్పుడు రోజూ కాలేజీకి వెళ్తూ వీకెండ్స్లో 6టీవీలో ‘రాకింగ్ రాములమ్మ’ ప్రోగ్రామ్తో మళ్లీ జనానికి దగ్గరైన. సెలబ్రిటీస్తో ముచ్చట్లు, కామన్మ్యాన్తో చిట్చాట్, వీక్డేస్లో స్పెషల్క్లాసులు, హోమ్వర్క్లు మస్తు బిజీ. మస్తు ఖుషీ! అయితే అప్పుడప్పుడు నేనేంది ఛానల్స్లో పనిజేసుడేంది అని ఆలోచిస్తుంటి. అప్పుడు మా అమ్మ చెప్పింది.. నేను చిన్నప్పుడు పగిలిపోయిన ఎర్రటి రబ్బర్బాల్కి కట్టె గుచ్చి మైక్లాగ చేతిలో పట్టుకుని టీవీ చూస్తూ న్యూస్రీడర్లాగ చేసేదాన్నట. బహుశా నాకు ఊహ తెల్వనప్పటినుంచే ఈ ఫీల్డ్ అంటే ఇష్టం అనుకుంటా. గోల్గప్పాలంటే ఇష్టం... నీళ్లల్లో ఉన్న చేప బయటికొస్తే ఎంత విలవిల్లాడుతుందో... హైదరాబాద్ ఇడిసి బయటకు పోవాల్సి వస్తే నాదీ ఇంచుమించు అలాంటి పరిస్థితే. ఊపిరి ఆడనట్టు ఫీలవుతా. సిటీ విషయానికొస్తే... బేగం బజార్లో గాజులు, కోఠిలో బట్టలు, అబిడ్స్లో చెప్పులు... ఇలా చిన్నప్పటినుంచి ఇప్పటివరకు తిరగని ప్లేసంటూ లేదు. నాకు బాగా నచ్చే ఫుడ్ ‘గోల్గప్పాలు’.. అంటే పానీపూరి. అవి ఉంటే చాలు నాకు అన్నం కూడా అవసరం లేదు.నిజం చెప్పాలంటే నాకు పల్లెలు, అక్కడి పచ్చటి పొలాలు అన్నా ఇష్టమే. ‘చంటి’ సినిమాలో మీనాలా ఆటలాడుకోవాలనిపిస్తది. కానీ నాకు చుట్టాలుపక్కాలు, అక్కలు, చెల్లెళ్లు అందరూ హైదరాబాద్లోనే ఉన్నరు. పల్లెటూరికి పోదామంటే తెల్సినోళ్లెవ్వరు లేరు. ఈ విషయంలో మాత్రం అన్లక్కీ! - శిరీష చల్లపల్లి -
కౌబాయ్
హైందవ సంప్రదాయంలో గోవును ప్రత్యక్ష దైవంగా భావిస్తారు.. పూజిస్తారు. ఆధ్యాత్మిక మార్గంలో.. ఎల్లలు దాటి సంచరిస్తున్న జూలియన్ కిర్పాల్ బ్లెస్ కూడా ఆవును అమితంగా ప్రేమిస్తారు. గో సంరక్షణ ప్రాధాన్యం తెలియజేస్తూనే.. సేవాగుణం గొప్పదనాన్ని చాటుతున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన కిర్పాల్.. తను నమ్మిన సిద్ధాంతాలను పాటిస్తూ, వాటికి ప్రచారం కల్పిస్తూ.. 12 ఏళ్లుగా ముందుకు సాగుతున్నారు.ఈ ప్రయాణంలో హైదరాబాద్కు వచ్చిన అతన్ని సిటీప్లస్ పలకరించింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. - కోన సుధాకర్ రెడ్డి ఈ ప్రపంచాన్ని మార్చగలిగేవి రెండే రెండు. ఒకటి- సేవాగుణం, రెండు- ఆధ్యాత్మికత. ఈ రెండూ ఉన్న చోట ధర్మం నిలబడుతుంది. ఇది మెట్ట వేదాంతం కాదు. జీవిత సత్యం. ఈ నిజం నాకు అవగతమై పన్నెండేళ్లు అవుతోంది. అప్పట్నుంచి నేను నమ్మిన సిద్ధాంతాన్ని పది మందికీ పరిచయం చేస్తున్నా. దైవంగా పూజించే గోవును చంపడాన్ని నేను నేరంగా భావిస్తాను. ఒక్క ఆవునే కాదు.. ఏ మూగజీవాన్నీ చంపడం, వాటి మాంసం భుజించడాన్ని నేను సమర్థించను. నేనే కాదు అమెరికాలోని మా కుటుంబం నాన్వెజ్ పూర్తిగా మానేసింది. శాకాహారం ఆరోగ్యానికి మేలు కూడా చేస్తుంది. మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండేలా చేయగలుగుతుంది. కొన్నాళ్ల కిందట అమెరికాలోని విస్టన్ వ్యాలీ మీడియం కరెక్షనల్ జైలులోని ఖైదీలకు పూర్తిగా శాకాహారం అందించడం మొదలుపెట్టాం. కొన్నాళ్లకు ఆ ఖైదీల మానసిక ప్రవర్తనలో స్పష్టమైన మార్పు కనిపించింది. నేనే బండి లాగాను.. కర్మభూమిగా భాసిల్లుతున్న భారతదేశం సంస్కృతి చాలా గొప్పది. ప్రపంచ దేశాలకు భారత్ ఒక దిక్సూచి వంటిది. భారతదేశం గొప్పదనం గురించి పుస్తకాల్లో చదివాక.. ఈ దేశానికి ఎప్పుడెప్పుడు రావాలా అని అనుకున్నాను. ఆ క ల మూడుసార్లు నెరవేరింది. ఇప్పటికే భారత్లో రెండుసార్లు పర్యటించాను. ఇది మూడోసారి. ఢిల్లీ, చెన్నై, పాండిచ్చేరి, హైదరాబాద్తో పాటు పలు ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా చూశాను. ఈ ప్రయాణంలో ఎన్నో గోశాలలు సందర్శించాను. అనారోగ్యంతో బాధపడుతున్న ఆవులకు వైద్యం అందించడం చూశాను. ఢిల్లీలో ఉండగా.. ఎద్దుతో నడిపించే బండిని చూశాను. తట్టుకోలేకపోయాను. వెంటనే దాన్ని విడిపించి నేనే బండి లాగాను. పశువులతో పని చేయించుకోవడం తప్పు కాదు. కాని, వాటిపై మోయలేని భారాన్ని మోపడం సరికాదు. ఇలాగే సాగుతా.. మానవ మనుగడకు పర్యావరణం ప్రధాన వనరు. పర్యావరణాన్ని రక్షిస్తే.. అది మనల్ని కాపాడుతుంది. నేను ఎంచుకున్న సేవా పథంలో పర్యావరణ పరిరక్షణే మొదటి అంశం. దీనిపై కూడా నాకు తోచినంతలో పది మందికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక నా గురించి చెప్పాలంటే.. వయసు 48. పెద్దగా చదువుకోలేదు. అమెరికాలో రియల్ఎస్టేట్ వ్యాపారం ఉంది. ఆరు నెలల కిందట ఇండియాకు వచ్చాను. ప్రస్తుతం కుటుంబ సభ్యులే నాకు కావాల్సిన ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారు. ఆరోగ్యం సహకరించినన్ని రోజులూ.. సమాజ హితం కోరుతూ ఇలా ముందుకు సాగుతాను. రెండు నెలలుగా.. ఆరు నెలల కిందట ఇండియా టూర్కు వచ్చిన కిర్పాల్.. రెండు నెలలుగా హైదరాబాద్లోనే ఉంటున్నాడు. ఓ వైపు తను నమ్మిన సిద్ధాంతాలను ప్రచారం చేస్తూనే తెలుగు భాషా, సంస్కృతులపై అధ్యయనం చేస్తున్నాడు. రవీంద్ర భారతికి కిర్పాల్ నిత్య అతిథి. సామాజిక దృక్పథం ఉన్న నాటకాలు, ప్రదర్శనలు చూసి ఆహా.. ఓహో.. అని చప్పట్లు చరచడమే కాదు.. వాటి విశేషాలను ప్రచారం చేస్తుంటాడు. -
ఎంట్రీలు అదుర్స్
వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన వ్యక్తులను సత్కరించేందుకు సాక్షి మీడియా గ్రూప్ నిర్వహిస్తున్న ‘సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్-2014’ ప్రక్రియ కొనసాగుతోంది. సంగీతం-నృత్య రంగాలకు సంబంధించి ఏపీ, తెలంగాణల నుంచి వచ్చిన ఎంట్రీలను... షార్ట్లిస్ట్ జ్యూరీ సభ్యులు- నాటక రంగ ప్రముఖులు గుమ్మడి గోపాలకృష్ణ, అల్లాణి శ్రీధర్, నృత్యకారిణి స్వాతి సోమనాథ్ శుక్రవారం పరిశీలించి స్కోర్ ఇచ్చారు. ఈ స్కోర్ ఆధారంగా ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’ ఐదు బెస్ట్ నామినీలను ఫైనల్ జ్యూరీకి పంపనుంది. తుది విజేతను ఫైనల్ జ్యూరీ ఎంపిక చేయనుంది. ‘ఎంట్రీలలో దాదాపు 70 శాతం బాగున్నాయి. మారుమూల ప్రాంతాల నుంచి ఎక్కువగా ఈ ఎంట్రీలు రావడం శుభపరిణామం’ అని సినీ దర్శక నిర్మాత అల్లాణి శ్రీధర్ అన్నారు. ‘ఆర్టిస్టులను ప్రోత్సహించేందుకు సాక్షి మీడియా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది అద్భుతమైన కళాకారులు వెలుగులోకి వస్తార’ని రంగస్థల దర్శకుడు, నటుడు గుమ్మడి గోపాలకృష్ణ ఆకాంక్షించారు. సాక్షి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం మరెందరికో స్ఫూర్తినివ్వాలని కోరుకుంటానన్నారు నృత్యకారిణి స్వాతి సోమనాథ్. ఈరోజు ‘ఎన్జీవో ఆఫ్ ది ఇయర్’ విభాగ ఎంట్రీలను జ్యూరీ సభ్యులు పరిశీలించనున్నారు. మే ఐదు, ఆరు తేదీల్లో ఆయా విభాగాల్లో తుది విజేతలను ప్రకటిస్తారు. -
అవసరాల అవధి..
జీవితంలో మంచీచెడు రెండూ ఒకదానివెంట ఒకటి ఉంటాయి. ఒకదానిపై మరొకటి పెత్తనం చెలాయిస్తాయి. నైతికత, ఔచిత్యం.. ఇవన్నీ మనిషిని ఉన్నతమైన ఆలోచనల దిశగా ప్రభావితం చేస్తే, అవసరాలు మనసును కలుషితం చేస్తుంటాయి. ఇవే అంశాలను ఒక ఆటోడ్రైవర్ జీవితానికి జతకలిపి రూపొందించిన చిట్టి చిత్రం ‘ద క్యాటలిస్ట్’. బెంగళూరుకు చెందిన ఓ ఆటోడ్రైవర్కు తన ఆటోలో పర్స్ దొరుకుతుంది. ఆ పర్స్ను ఆ ప్యాసింజర్కు తిరిగి ఇచ్చేయమని మనసు చెబుతుంది. అదే సమయంలో అతడి ఆర్థిక అవసరాలు.. ఆ డబ్బును వినియోగించుకోవాలని ప్రోద్బలం చేస్తాయి. ఈ సంఘర్షణలో ఆ ఆటోడ్రైవర్ ఏం చేశాడన్నది తర్వాతి కథాంశం. వైష్ణవి సుందర్ దర్శకత్వం వహించిన ఈ కన్నడ చిత్రాన్ని ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రదర్శించనున్నారు. వేదిక: అవర్ సేక్రెడ్ స్పేస్, ఎస్పీరోడ్, సికింద్రాబాద్ -
భ్రమణం
ఒంటి స్తంభం మేడ మీద అందాల యువతి. ఆనందంగా పాటలు పాడుకుంటున్న ఆమె గొంతు విని ఎలాగైనా ఆమెను చూడాలనుకుంటాడు ఓ రాకుమారుడు. అక్కడే మాటువేసి ఉంటాడు. ఇంతలో మాంత్రికుడు వచ్చి మంత్రం చదవగానే బారెడు జడ కిందకు వస్తుంది. దాన్ని పట్టుకుని మాంత్రికుడు పైకి ఎక్కడం గమనిస్తాడు. మాంత్రికుడు వెళ్లి పోయాక అదే విధంగా పైకి వెళ్లి ఆ యువతిని కలుసుకుంటాడు రాకుమారుడు. యవ్వనవతి, సౌందర్యవతి అయిన ఆ చక్కటి చుక్క ఆ ఒంటి స్తంభం మేడనే ప్రపంచం అనుకుంటుంది. తనలాగే యవ్వనంలోకి వచ్చిన వారంతా ఇలాగే ఉంటారనే భ్రమలో బతుకుతుంటుంది. చిన్నప్పుడు చదివిన ఫెయిరీటేల్ రపుంజెల్లాగే సాగిన ‘సంపంగి’ నాటకంలో బలమైన ఆలోచన ఉంది. సమాజాన్ని... ఒక మంత్రగాడిగా చూపిస్తూ ప్రపంచాన్ని తెలుసుకునే అవకాశం లేకుండా టీనేజర్స్ని కూపస్త మండూకాల్లా కట్టిపడేస్తున్నారు పేరెంట్స్. సమాజంలో జరుగుతున్న అనేక విషయాలను చూపించి భయపెడుతూ వారిని సమాజం నుంచి వేరు చెయ్యటం వల్ల యువత రెండు రకాల ప్రపంచాలను, రెండు వ్యక్తిత్వాలను సృష్టించుకుంటున్నారు. ఫ్యామిలీలో ఒకలా ప్రవర్తిస్తూ... తమకు నచ్చిన పని చెయ్యటానికి, తమకు ఆసక్తిగల విషయాలను తెలుసుకోవటానికి మరో రకమైన యాటిట్యూడ్ని అలవర్చుకుంటున్నారు. దాని వల్ల వాళ్లు ఏం కోల్పోతున్నారనే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం చేశామంటున్నారు ఈ ప్లే దర్శకుడు, నటుడు కృష్ణప్రసాద్. తాదామ్య విచ్ఛేదం.. హీరో హీరోయిన్, మాంత్రికుడు పాత్రలతో నాటకం సాగుతుండగా అందులో సూత్రధారుడు ఆ సన్నివేశాన్ని ఆపి.. ఇది ఎందుకు ఇలా ఉండాలి, ఆమెను మాంత్రికుడు ఎందుకు బాధిస్తున్నాడు? వంటి ప్రశ్నలు వేస్తాడు. బాధ పెట్టే మాంత్రికుడికి శిక్షపడాలని సూచిస్తాడు. ఈ ప్రక్రియ గురించి అక్కడికి ప్రేక్షకుడిగా వచ్చిన తణికెళ్ల భరణి మాట్లాడుతూ ‘ఇది ఎలియనేషన్ ప్రక్రియ. తాదామ్య విచ్ఛేదం అంటారు. ఒక విషయం నాటకం ద్వారా ప్రెజంట్ చేస్తున్నప్పుడు, ఆడియెన్స్ మదిలో మెదిలే ప్రశ్నలను.. సూత్రధారుడే చెప్పి మళ్లీ నాటకాన్ని కొనసాగిస్తాడు. ఎలా అంటే.. రామాయణ కథ తెలిసిందే అయినా సీతను ఎత్తుకుపోతున్నప్పుడు ఆడియెన్స్ బాధ పడుతుంటారు. అప్పడు సూత్రధారుడు నాటకాన్ని ఆపి ‘ఆ సీత ఎవరో కాదు నీ చెల్లెలు, నీ భార్య జాగ్రత్త!’ అంటూ మళ్లీ చెప్పటం మొదలుపెడతాడు. అంటే ఒక విషయాన్ని రియాలిటికీ కనెక్ట్ చెయ్యటం. ఈ టెక్నిక్ని ఇక్కడ బాగా అడాప్ట్ చేసి ప్రదర్శించారు. సరదా స్క్రీన్ప్లేతో చాలా స్ట్రాంగ్ మెసేజ్ని అందించారు’ అని వివరించారు. జెర్మన్ నాటకాన్ని సంపంగి పేరుతో తెలుగు ఆడియెన్స్కు నచ్చే విధంగా, కొత్తగా ఆలోచించే విధంగా రాశారు ఉదయభాను గరికపాటి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ మాండలికాల్లో, హాస్య సంభాషణలతో సాగిన ఈ నాటకాన్ని భూమిక థియేటర్ గ్రూప్ ఇటీవల లామకాన్లో ప్రదర్శించింది. - ఓ మధు -
రాజకీయాల్లోకి రండి..
‘రాజకీయాలను, ప్రభుత్వాలను తిట్టుకుంటూ కూర్చుంటే సరిపోదు. స్వచ్ఛమైన, కల్మష రహిత నేపథ్యం ఉన్నవాళ్లు మరింత ఎక్కువగా రాజకీయాల్లోకి రావాలి’ అంటూ స్పష్టం చేశారు షాజియా ఇల్మి. దేశ రాజకీయాల్లో స్వల్పకాలంలోనే చిరపరిచితమైన నేతగా ఎదిగిన ఈ ఢిల్లీ మహిళ... సిటీకి వచ్చారు. నగరానికి చెందిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఒ),యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (వైఎఫ్ఎల్ఒ)లకు నూతన గవర్నింగ్ బాడీస్ ఏర్పాటైన సందర్భంగా హోటల్ తాజ్కృష్ణాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ‘రాజకీయాల్లో సిద్ధాంతాలు’పై మాట్లాడారు. ఆ ప్రసంగంలోని ప్రధానాంశాలు ఆమె మాటల్లోనే.. మార్పు దిశగా పయనిద్దాం... రాజకీయం అనేది నా భావాలు వ్యక్తం చేసేందుకు, నిర్ణయాత్మక శక్తిగా నన్ను నేను మలచుకునేందుకు నేను ఎంచుకున్న వేదిక. ఒకప్పుడు జర్నలిస్ట్గా ఉన్న నేను కేవలం రిపోర్టింగ్ చేసేసి ఆ తర్వాత సెలైంట్గా ఉండిపోవడానికి పరిమితమవడం కన్నా.. నిర్ణయాలు తీసుకోవడంలో భాగం కావాలనుకున్నా... రాజకీయాల్లోకి వచ్చింది అందుకే. మన సిస్టమ్ బాగోలేదనడం, ప్రభుత్వాలను తప్పుపట్టడమూ సులభమే. అయితే మనం మేల్కొని మార్పుకు కారణం కావాల్సిన సమయం ఇది. కార్యాచరణలోకి దిగాల్సిన సమయం ఇది. మార్పును స్వీకరిస్తూ దేశాన్ని మార్చే దిశగా మనం పయనించాలి. మన తలరాత రాసేది రాజకీయాలే... కులం, మతం, ప్రాంతం. తన మన భేదాలు ఇంకా అలాంటి అనేకానేక అంశాల ఆధారంగా ఓట్లేస్తున్నాం. ఇలా వేసినంత కాలం మనం రాజకీయాల్లో విలువల్ని ఆశించలేం. భారతదేశ తలరాతను రాసేవి రాజకీయాలే. మన బిడ్డల భవిష్యత్తును, మన జీవన స్థితిగతులను, పాఠశాలల్లో పద్ధతులను, మన అక్కా చెల్లెళ్ల భద్రతను, తోటి పౌరుల భద్రతను అన్నింటినీ నిర్ణయించేవి అవే. కాబట్టి దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఓటేయాలి. మహిళలు మరింతగా రాజకీయాల్లోకి రావాల్సి ఉందని నేను నమ్ముతున్నాను. - ఎస్.సత్యబాబు -
వలంటీచర్స్
రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏం చేస్తారు? మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తారు. మరికొందరు కృష్ణారామా అంటూ తీర్థయాత్రలు చేస్తారు. కానీ.. అడవికొలను కనకరాజు అందుకు భిన్నం. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ చేసినా.. వాలంటరీ టీచర్గా మారారు. విశ్రాంత జీవితం గడపాల్సిన సమయంలో పాఠశాల ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఆ సరస్వతీ నిలయం గురించి... - వాంకె శ్రీనివాస్ అడవికొలను కనకరాజు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా 1992లో పదవీ విరమణ చేశారు. ఆ రోజు అక్షరాలకు దూరమవుతున్నానన్న ఆవేదనతో వచ్చిన ఆయన కన్నీళ్లను ఆపడం ఎవరితరం కాలేదు. నాలుగు అక్షరాలను నలుగురికీ పంచాలనే తృష్ణ ఉంటే టీచర్ ఉద్యోగమే ఉండాలా? తానెందుకు ఓ పాఠశాల నడిపించగూడదు? అనుకున్న కనకరాజ్ ఎస్ఈఎస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ను ఏర్పాటు చేశారు. అమెరికాలో ఉన్న పిల్లల దగ్గర విశ్రాంత జీవితం గడిపేందుకు గ్రీన్ కార్డు ఉన్నా.. అక్కడికి వెళ్లడం కంటే పిల్లలకు అక్షరాలు నేర్పడంలోనే అసలైన సంతోషం ఉంటుంది అంటున్నారు కనకరాజు. ఈ ప్రయాణంలో ఆయనకు తోడుగా నిలిచింది భార్య సుందరీ ఇందిర. రిటైర్డ్ టీచరైన ఆమె కూడా ఈ అక్షర యజ్ఞంలో పాలుపంచుకుంటోంది. కాలిఫోర్నియాలో ఉంటున్న ఇద్దరు కొడుకులు వీళ్ల ఆశయానికి అండగా నిలిచారు. నాన్న స్ఫూర్తితో... ‘ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం సంపాదించి.. 40 ఏళ్ల కెరీర్లో సిటీలోని వివిధ స్కూళ్లలో సేవలందించా. రిటైర్మెంట్ తరువాత పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యనందించేందుకే పాఠశాలను ప్రారంభించా. చాలా ఏళ్ల క్రితం మా నాన్న దివంగత శేషగిరిరావు ఏర్పాటు చేసిన ఎస్వీఈఎస్ తెలుగు మీడియం స్కూల్... తరువాత డిగ్రీ కాలేజీగా మారింది. వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దింది. నా ఈ స్కూల్ ఏర్పాటు వెనుక ఆయన స్ఫూర్తి ఉంది’ అని గర్వంగా చెబుతారు కనకరాజు. కులమతాలతో సంబంధం లేకుండా... పెద్ద మొత్తంలో డొనేషన్లు చెల్లించలేని పేద పిల్లలను స్కూల్లో చేర్చుకుంటున్నారు. 2001లో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఈ పాఠశాల ప్రస్తుతం 250 మంది విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తోంది. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తోంది. డొనేషన్లు లేకుండా... తొలినాళ్లలో నెలకు రూ.50 ఫీజు మాత్రమే తీసుకునేవారు. 2006 నుంచి పూర్తిగా ఉచిత విద్యను అందిస్తున్నారు. ‘మొదట పేరెంట్స్ను కన్విన్స్ చేయడం కష్టమైంది. వాళ్లను ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. అయితే ఫైనల్గా వారు పాజిటివ్గా స్పందించి పిల్లలను బడికి పంపించారు. అలా ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు ఎంతోమంది విద్యార్థులు చదవుతుండడం సంతోషంగా ఉంది. నా ఇద్దరు కుమారులు కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. అక్కడికెళ్లినప్పుడు ఆశా ఎస్వీ వాళ్లతో ఏర్పడిన పరిచయం మా స్కూల్కు ఆర్థిక సహాయం చేసే వరకు వచ్చింది. అలా మా సేవను హైదరాబాద్కు వచ్చి ప్రత్యేకంగా వీక్షించిన వారు ఫండింగ్ చేశారు. ఇప్పుడు మాత్రం లోకల్ మెంబర్స్ సహకారాన్ని తీసుకుంటున్నామ’ని చెబుతున్నారు కనకరాజు దంపతులు. వీరిని స్ఫూర్తిగా తీసుకున్న మరికొంత మంది రిటైర్డ్ టీచర్స్ మీనాక్షి, రాణి ప్రమీల, కె.రాజ్గోపాల్, వాసుదేవరావులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ స్కూల్లో భాగస్వామయినందుకు సంతోషంగా ఉందంటున్నారు వాలంటరీగా పనిచేస్తున్న సాయిలత. అన్నింటిపై దృష్టి... ‘ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెడతాం. వారు వీక్గా ఉన్న సబ్జెక్ట్లను గుర్తించి ప్రత్యేక తరగతులు తీసుకుంటాం. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించేలా పక్కా ప్రణాళిక ఉంది. ప్రతి నెలా పేరెంట్, స్టాఫ్ మెంబర్స్తో ఇంటారాక్టివ్ సెషన్ నిర్వహిస్తాం. ఇలా చేయడం వల్ల విద్య ప్రాధాన్యతని పేరెంట్స్కి చెబుతూనే... వారి నుంచి ఏమైనా సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. మాణిక్యాల్లాంటి విద్యార్థులను వెలికి తీసేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం’ అని అంటున్నారు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ దేవులపల్లి విజయ్. -
సరిపని.. సిరిగని
సొంత లాభం కోసం పొరుగువారికి ఎంత నష్టం వచ్చినా ఫర్వాలేదనుకునే నేటితరాన్ని చూసి గురజాడవారు ‘దేశమంటే మట్టి కాదోయ్..! ఒట్టి మట్టి బుర్రలోయ్..!’ అని సెలవిచ్చేవారేమో.. !!. టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అని అనుకునే ఈ రోజుల్లో.. ప్రతి పనికీ డబ్బే కొలత. ఎంత పనికి అంత డబ్బు అనే రోజులు పోయి.. ఎంత డబ్బుకు అంత పని అనే రోజులొచ్చేశాయి. నిజానికి తక్కువ పనికి ఎక్కువ డబ్బులు ఎక్కడొస్తాయని చూసే రోజుల్లో ఉన్నాం. ఇంకొంత మంది గుర్తింపు ఉన్న పని కోసం పాకులాడుతూ ఉంటారు. దీన్ని పనికి వచ్చే గుర్తింపనుకొని కన్ఫ్యూజ్ కాకండి. అది వేరు సుమా..! ఏ పనికైనా నాకేంటి అని ప్రశ్నించే జాతి ఎక్కువైపోతున్న ఈ తరుణంలో, వారి పని చేయడమే మహాభాగ్యమనుకుంటుంటే.. తమ పనిలోనే మరొక్క అడుగు ముందుకేసి పక్కవారికి సహాయపడదామనుకునే వారిని దేవుళ్లనుకోవాలి మరి. పెద్దపెద్ద పనులు అక్కర్లేదు.. ఒక్కోసారి చిన్నచిన్న పనుల్లోనే దైవత్వం కనిపిస్తుంది. పక్కవాడికి సాయపడటం మర్చిపోయిన రోజుల్లోనే.. మానవత్వం అనే మాట కూడా మాయమైపోయి చిన్నపనుల్లోనే దైవత్వం కనిపిస్తుంది. అలా నాకెదురైన చిన్నచిన్న సంఘటనల్లో కనిపించిన దైవత్వం గురించి మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మేలైన పనితనం.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.. ఏసీ వెయిటింగ్ హాల్.. ఓ హౌస్ కీపర్ తన షిఫ్ట్ అయిపోవడంతో యూనిఫాం మార్చుకుని ఇంటికి వెళ్లడానికి సిద్ధమైంది. నన్ను గుర్తుపట్టి నవ్వుతూ పలకరించిందామె. రైల్వేస్టేషన్లో అంత నీట్గా ఉన్న బాత్రూమ్ల గురించి మెచ్చుకుంటున్నానో లేదో.. ఇంతలో ఓ పెద్దావిడ వాంతులతో లోపలికి వచ్చింది. ఆమెకు నేను మంచినీళ్ల సాయం మాత్రమే చేశాను. కాని, ఆ అజ్ఞాత హౌస్కీపర్ దేవత అంతకంటే ఎక్కువ సేవే చేసింది. పెద్దావిడ తేరుకొని బయటకు వచ్చాక.. టాయ్లెట్ని శుభ్రంగా కడిగేసింది. ఆమె హౌస్కీపర్ కదా.. అది ఆమె డ్యూటీ అని అనుకోవచ్చు. కాని, ఆ అమ్మాయి డ్యూటీ దిగిపోతూ.. తన తర్వాత షిఫ్ట్లో వచ్చేవాళ్లు ఆ పని చూసుకుంటారులే అని అనుకోలేదు. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే ఏంటో ఆమెను చూస్తేనే అర్థమైంది. మనసు దోశాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్.. మధ్యాహ్నం ఫ్లయిట్ కోసం.. బ్రేక్ఫాస్ట్కి.. లంచ్కి మధ్య సంధికాలంలో ఎయిర్పోర్ట్కి చేరాను. ఇండియన్ ప్యారడైజ్కి చేరి దోశ అని ఆర్డరిచ్చాను. అక్కడున్న మేనేజర్.. ఇబ్బందిపడుతూ, ‘లంచ్ ఏర్పాట్లు జరుగుతున్నాయండి.. బ్రేక్ ఫాస్ట్ క్లోజ్’ అని చెప్పాడు. కాఫీతోనో, షాండ్విచ్తోనో సరిపెట్టుకోవాల్సిందే అని డిసైడై కూర్చున్నాను. నా వెనుక రెండేళ్ల చిన్నారితో వచ్చిన ఓ ఫ్యామిలీ కూడా దోశ అని ఆర్డరిచ్చింది. కాని, అదే సమాధానం. ఆ పాప దోశ తప్ప మరేమీ తిననని మారాం చేస్తోంది. ఇంతలో లోపల్నుంచి చెఫ్ బయటకు వచ్చి ఆ పాప కోసం దోశ వేస్తాను అన్నాడు. అంత పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ.. పాప ఆకలి తీర్చడం తన బాధ్యత అనుకున్న ఆ చెఫ్కి, ఆ దోశ వల్ల ప్రమోషనూ రాదు.. ఆ కంపెనీకి గిరాకీ పెరగదు. అయినా తన పనికి మించి స్పందించిన ఆయనలో మానవత్వాన్ని మించిన దైవత్వం కనిపించింది నాకు. యారా తుఝ్మే రబ్ దిఖ్తాహై అనుకున్నాను. వర్క్ విజన్ ఈ మధ్యకాలంలోనే మా నాన్నగారికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ కోసం.. మాక్సివిజన్లో వెయిట్ చేస్తూ ఉన్నాం. థియేటర్ బయట వార్డ్లో.. కళ్ల మీద స్టిక్కర్ గుర్తులతో.. కళ్లలో చుక్కలతో.. చాలామంది ఉన్నారక్కడ. అందులో పెద్దవయసు వారే ఎక్కువ ! మా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరుగుతున్నాయో లేదో.. చూస్తున్న సీనియర్ ఆప్టోమెట్రిస్ట్ వెంకట్రావుగారు అక్కడి ఫోన్ ఒకటే మోగుతుంటే గబగబా వెళ్లి ఆన్సర్ చేశారు. నర్స్ రాగానే విషయం చెప్తాను అని పెట్టేశారు. అలా ఒక్కసారి కాదు.. అక్కడ ఆయనున్న పది నిమిషాల్లో.. కనీసం ఐదుసార్లయినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేశారు. ఒకసారి ఫైల్లో డిటెయిల్స్ చూసి చెప్పారు. మళ్లీ ఫోన్ మోగితే.. ఈసారి నంబర్ నోట్ చేసుకున్నారు. అది అక్కడున్న నర్స్ పని కదా..! తనకెందుక ని అనుకోలేదు. అది తన సంస్థ.. ఆ పనిలో తనకూ భాగస్వామ్యం ఉందని అనుకున్నారు. అందుకే ఆ చిన్న పనిని కూడా ఆయన పనిగానే భావించారు. గాడ్ ఈజ్ ఇద్ ద డీటెయిల్స్ అంటే ఇదేనేమో! నీకు కుశలమేగా.. మొన్నీమధ్యే బ్యూటీపార్లర్లో నా పక్క సీట్లో కూర్చున్న ఓ చిన్నారి హెయిర్ కటింగ్కు భయపడి నానాయాగీ చేస్తోంది. ఇది గమనించిన నా హెయిర్ స్టయిలిస్ట్ పవన్.. తన పని కాదని ఊరుకోలేదు. తోటి హెయిర్స్టయిలిస్ట్ దగ్గర కత్తెర అందుకుని, ఆ పాపను మాటల్లో పెట్టి.. హాయిగా నవ్విస్తూ పని పూర్తి చేశాడు. చిన్నపనులే కావొచ్చు. కాని అవి పెద్ద హృదయాన్ని సూచిస్తాయి. ‘యోగః కర్మ సుకౌశలం..’ అని గీతలో కృష్ణుడు చెప్పినట్టు, కర్మల్లో కుశలత్వమే యోగం. పని డబ్బు కోసమే చేస్తాం, కాని హృదయంతో చేయండి. పొరుగువారికి సాయపడటానికి సొంతలాభం మానక్కర్లేదండి. డూ గుడ్.. ఫీల్ గుడ్. -
రేసు పావురం
పీజియన్ రేసింగ్! ఈ ట్రెండ్ కుతుబ్షాహీలు, నిజామ్ల కాలం నాటిది. నిజామ్లు, రాజ్యాలు పోయినా వాళ్ల అభిరుచులు మాత్రం మిగిలాయి. పీజియన్ రేసింగ్ కొంచెం మోడర్న్ టచ్తో ఇప్పుడు సిటీ యూత్కి లేటెస్ట్ ట్రెండ్గా మారింది. కష్టమైన ఈ హాబీని ఇష్టంగా కొనసాగిస్తున్న హైదరాబాదీ ఫ్యాన్సీయర్స్ గురించి.. - కట్ట కవిత వందల ఏళ్ల కిందటి పీజియన్ రేసింగ్ని రివైవ్ చేసి మళ్లీ ట్రెండ్గా మార్చింది సిటీ యూత్. ఇప్పుడు పీజియన్ స్పోర్ట్స్ ఓల్డ్ సిటీలో పాపులర్. ఇందుకోసం క్లబ్స్ కూడా ఉన్నాయి. పావురాల ఓనర్స్ని ఫ్యాన్సీయర్స్ అంటారు. హైదరాబాద్లో గ్రే కలర్ పావురాలే ఎక్కువగా క నబడుతుంటాయి. కానీ వీటిలో జాతులు అనేకం. వాటిలో రేసింగ్కు అనుకూలంగా ఉండేవి కొన్నే. తుగుడి, హోమెర్, టంబ్లర్ పీజియన్స్ రేసింగ్లో నెంబర్వన్స్. హోమర్ డిస్టెన్స్రేస్లో పాల్గొంటే, టంబ్లర్ తన ఓర్పును పరీక్షించమంటుంది. ఇక తుగుడి తోటిపావురాల్లో తానెంత స్పెషలో చెబుతుంది. గ్రూప్ స్పోర్ట్స్లో ఇది చాలా యాక్టివ్. ‘50 ఏళ్ల కిందట ఈ కల్చర్ డిసప్పియర్ అయ్యింది. మళ్లీ 2010లో షకీర్ నోమన్తో కలిసి ‘హైదరాబాద్ హోమర్ పీజియన్ క్లబ్’ ప్రారంభించాం. ప్రస్తుతం 14 మంది సభ్యులున్నారు’ అంటున్నారు హెచ్హెచ్పీసీ ట్రెజరర్ సయ్యద్ ఆరిఫ్. ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ క్లబ్లో టెకీలు, డాక్టర్స్, ప్రభుత్వోద్యోగులూ ఉన్నారు. కాస్ట్లీ హాబీ... 8 నెలల నుంచి ఐదేళ్ల మధ్య వయసున్న హోమర్ బ్రీడ్ పావురాలు రేసింగ్కి అనుకూలం. మూడు నెలల వయసు నుంచే వీటికి ట్రైనింగ్ ప్రారంభమవుతుంది. ఏడాది పాటు ఇంటి చుట్టూ తిప్పుతారు. పావురాలు రేసింగ్కి పనికొస్తాయా లేదా అనేది వాటి కళ్లను చూస్తే తెలిసిపోతుందంటారు ఫ్యాన్సీయర్స్. వీటి డైట్ ప్రత్యేకం. పది రకాల ధాన్యాలు, మొక్కజొన్నలు, జొన్నలు, కుంకుమపూలు కలిపి ఆహారంగా పెడతారు. రోజూ మూడు పూటలా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. ‘ఇది ఎంత మంచి హాబీనో అంతే కాస్ట్లీ కూడా. నెలనెలా రూ. 8 వేల వరకు ఖర్చవుతుంది. వ్యాక్సిన్స్, మెడిసిన్ యూఎస్ నుంచి తెప్పిస్తాం’ అని చెప్పారు హెచ్హెచ్పీసీ ప్రధాన కార్యదర్శి కృష్ణ. ఓన్లీ ప్యాషన్... రేసింగ్ కోసం ఆదిలాబాద్, నిర్మల్, వార్దా, బీతుల్, భోపాల్ వంటి ప్రదేశాలను ఎంచుకుంటారు. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన పావురాలను.. ముందుగా నిర్ణయించుకున్న ప్రదేశానికి పంపుతారు. ప్రతి పావురానికి రింగ్ నంబర్, కేటగిరీస్ ఉంటాయి. వాటిని ఉదయమే మంచినీరు తాగించి వదిలేస్తారు. ఆయా పావురాల యజమానుల ఇళ్లలో రిఫరీ ఉంటారు. పావురం ఏ టైమ్కు వచ్చిందో చూసుకుని.. దూరాన్ని బట్టి స్పీడ్ను కాలిక్యులేట్ చేస్తారు. ముందుగా చేరుకున్న పావురాన్ని విజేతగా నిర్ణయిస్తారు. ఎంత దూరంలో వదిలిపెట్టినా తిరిగి ఇంటికి కరెక్టుగా వచ్చేస్తాయివి.కావాల్సిందల్లా వాటికి డెరైక్షన్ ఇచ్చే టెక్నిక్ మాత్రమే. కొన్నిసార్లు పావురం ఏడాది తరువాత కూడా ఇంటికి చేరుకోవచ్చు. రేసింగ్లో కుతుబ్షాహీల కాలంలో ఉన్న నిబంధనలనే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు రేసర్స్. పూర్తిగా న్యాయసమ్మతమైన ఈ రేసింగ్లో పాల్గొనేవాళ్లు కచ్చితంగా పావురాల ప్రేమికులై ఉండాలనేది నిబంధన. ఇది పూర్తిగా ప్యాషన్తో కూడుకున్నది. ఎలాంటి బెట్టింగ్స్ ఉండవు. హైదరాబాద్తో పాటు బెంగళూరు, చెన్నయ్, కోల్కతాల్లో కూడా రేసింగ్ క్లబ్స్ ఉన్నాయి. అథ్లెట్లా... పీజియన్స్ను సంరక్షించాలనే ఆకాంక్షతోనే రేసింగ్ను నిర్వహిస్తున్నాం. జంగ్లీ పీజియన్కు, హోమర్కి.. లాబ్రడార్, సాధారణ శునకానికి ఉన్న తేడా ఉంటుంది. నా దగ్గర వంద పావురాలున్నాయి. వీటికోసం రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు స్పెండ్ చేస్తుంటాను. రేసింగ్ అంత ఈజీ కాదు. వాటికి మంచి పౌష్టికాహారం అందించాలి. ఓ అథ్లెట్ను తయారు చేసినట్టు చేయాలి. బెల్జియం, నెదర్లాండ్స్ లాంటి కంట్రీస్లో ఇదో ఇండస్ట్రీ. దీనికి అక్కడి ప్రభుత్వాల సపోర్ట్ కూడా ఉంది. పక్షులు, జంతువుల కోసం మనమూ ఎంతో కొంత చేయాలి. మన నిర్లక్ష్యం వల్ల పిచ్చుకలు దాదాపు అంతరించిపోయాయి. మేల్కోకుంటే భవిష్యత్లో పావురాలుదీ అదే పరిస్థితి. - సయ్యద్ ఆరిఫ్, హెచ్హెచ్పీసీ ట్రెజరర్ -
స్వెట్ & బర్న్
కార్పొరేట్ ఉద్యోగం. జాలీగా సాగిపోతున్న జీవనం. అయినా ఏదో తెలియని వెలితి. ఇలా రొటీన్ లైఫ్కి భిన్నంగా ఏదైనా చేయాలనుకుంది. 18 ఏళ్ల కార్పొరేట్ కెరీర్కు గుడ్బై చెప్పి ఫిట్నెస్ కోసం స్టెప్స్ వేసింది. శరీరం సహకరించక ఇబ్బందులు ఎదురైనా... అవలీలగా అధిగమించి ఇప్పుడు సర్టిఫైడ్ పర్సనల్ ట్రైనర్, ఏరోబిక్స్ అండ్ జుంబా ట్రైనర్గా మారింది. ఆమె జాక్వలిన్ బబితా జేవియర్. డిప్రెషన్నుంచి బయటపడేందుకు ఈ హైదరాబాదీ మొదలుపెట్టిన పరుగు... ఎన్నో పతకాలను తెచ్చిపెట్టింది. 44 ఏళ్ల వయసులో అథ్లెట్గా మారి, ఇద్దరు పిల్లల తల్లిగా విజయపథంలో దూసుకెళ్తూ మేరీకోమ్ను తలపిస్తున్న బబిత పరిచయం... రెస్టారెంట్ నిర్వహిస్తున్న భర్త. ఇద్దరు పిల్లలు. మంచి ఉద్యోగం. జాబ్ చేసుకుంటూనే పిల్లల ఆలనాపాలన చూస్తున్న బబితకు ఇది రొటీన్ అనిపించింది. వ్యక్తిగతంగా ఏదో సాధించాలన్న ఆలోచన వచ్చింది. అందుకోసం ఫిట్నెస్ రంగాన్ని ఎంచుకుంది. అలా 2011లో ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ దినాజ్ దగ్గర ఏరోబిక్ పాఠాలు నేర్చుకున్న ఆమె... రెండేళ్ల పాటు ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేసింది. గతేడాది సైనిక్పురిలో ‘స్వెట్ ఎన్ బర్న్ ఫిట్నెస్’ స్టూడియోను ప్రారంభించి ఫిట్నెస్ గురువుగా మారిపోయింది. అయితే కేవలం ఫిట్నెస్ ట్రైనర్గానే ఉండిపోతే ఆమె గురించి చెప్పుకోవడానికి ఏమీ లేకపోయేది. గతేడాది... ఎంతో ప్రీతిపాత్రంగా ఉండే ఓ స్నేహితురాలు ఆమెను అవమానించింది. అది బబితను డిప్రెషన్లోకి తీసుకెళ్లింది. ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు రన్నింగ్ మొదలు పెట్టింది. మనస్సు కాస్త కుదుటపడింది. ఒత్తిడికి దూరం అయ్యింది. అలా ప్రారంభించిన రన్ ఈ రోజు ఆమెను జాతీయస్థాయి క్రీడాకారిణిగా నిలబెట్టింది. కాన్ఫిడెన్స్ పెంచింది... ‘2014 జనవరి 5న శామీర్పేట బిట్స్పిలానీ దగ్గర హైదరాబాద్ రన్నర్స్ నిర్వహించిన అలంకృత బ్రేక్ఫాస్ట్ రన్కు వెళ్లా. సరదాగా ఐదు కిలోమీటర్లు పరుగెత్తి బ్రేక్ఫాస్ట్ చేద్దాంలే అనుకున్నా. అక్కడికెళ్లాక ఏకంగా 21 కిలోమీటర్ల పరుగెత్తా. ఆ ఫిట్నెస్ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. నాలో కాన్ఫిడెన్స్ కూడా పెంచింది. గతేడాది మార్చి 9న హైదరాబాద్ రన్నర్స్ నిర్వహించిన క్లబ్న్ల్రో 40 ప్లస్ కేటగిరిలో పరుగెత్తా. రెండు గంటల 14 నిమిషాల్లో 21 కిలోమీటర్లు రన్చేసి సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నా. ఆ తర్వాత చెన్నై ట్రెయిల్ రన్లో సెకండ్ ప్రైజ్, కొచ్చిన్ మారథాన్లోనూ రెండో స్థానంలో నిలిచా. బెంగళూరులో జరిగిన రన్లోనూ పాల్గొన్నా. హైదరాబాద్ మారథాన్లో నా పిల్లలతో కలిసి పార్టిసిపేట్ చేశా’ అని చెబుతుంది బబిత. గర్వంగా ఉంది... గతేడాది నవంబర్లో కరీంనగర్లో డిస్ట్రిక్స్ మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్షిప్ జరుగుతుందని తెలిసి బబిత పాల్గొన్నది. 1500 మీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల విభాగంలో మూడు బంగారు పతకాలు వచ్చాయి. ఆ ఆత్మవిశ్వాసంతో హిమాచల్ప్రదేశ్ ధర్మశాలలో జరిగిన నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్షిప్కు వెళ్లింది. అక్కడా 35 ప్లస్ కేటగిరి ఐదు కిలోమీటర్ల విభాగంలో కాంస్యపతకం, పది కిలోమీటర్లు, 1500 మీటర్ల విభాగంలో రజత పతకాలు దక్కించుకుంది. ‘నన్ను కుంగదీసేందుకు అన్న మాటలే నాకు ప్రేరణగా నిలిచాయి. నన్ను జాతీయ స్థాయి క్రీడాకారిణిగా మార్చాయి. వెనక్కి తిరిగి ఈ ప్రయాణాన్ని చూసుకుంటే గర్వంగా అనిపిస్తుంది’ అని ధీమాగా చెబుతుంది బబిత. లేటు వయసులో అథ్లెట్గా రాణిస్తూనే, ఫిట్నెస్ ట్రైనర్గా దూసుకుపోతున్న బబిత భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం! - వీఎస్ -
her కేలియే..
పాప్ సింగర్గా ఉర్రూతలూగించే పాటలతో అభిమానుల హృదయాలు కొల్లగొట్టిన రెగ్గి బెంజిమన్.. తన కళను ఓ ప్రయోజనానికి వేదికగా మలచుకున్నాడు. అవనిలో అతివలపై జరుగుతన్న దాడులను అడ్డుకునే లక్ష్యంతో.. ఆమె కోసం.. మిషన్ సేవ్ హర్ సంస్థకు శ్రీకారం చుట్టాడు. బుధవారం హైదరాబాద్లో తన ఫౌండేషన్ విధివిధానాలను తెలియజేశాడు. తాను రాసిన ‘సేవ్ హర్’ పాటను పాడి వినిపించారు. ఈ సందర్భంగా బెంజిమన్ను ‘సిటీప్లస్’ పలకరించింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... - వాంకె శ్రీనివాస్ మా పేరెంట్స్ది మెదక్ జిల్లాలోని నర్సాపూర్. నాన్న రాస్కో బెంజిమన్ పాస్టర్. అమ్మ రోజ్ బెంజిమన్ నర్స్. నేను పుట్టకముందే వాళ్లు కెనెడాకు వెళ్లారు. నేను కెనెడాలోనే పుట్టాను. నాకు తొమ్మిదేళ్లున్నప్పుడు అమెరికాకు షిఫ్ట్ అయ్యాం. స్కూలింగ్, కాలేజ్ డేస్ అంతా చికాగాలోనే సాగిపోయాయి. నాన్న క్రిస్టియన్ ప్రీచర్ కావడంతో చిన్నతనంలోనే మ్యూజిక్ అబ్బింది. మ్యూజిక్ వాయిస్లో డిగ్రీ చేశాను. బిజినెస్ కమ్యూనికేషన్ కోర్స్ కూడా చేశాను. తర్వాత మ్యూజిక్కే పూర్తి టైమ్ కేటాయించాను. నా ఫస్ట్ ఆల్బమ్ 2ఎక్స్ సెంట్రిక్స్కు ఇండియాలో మంచి ఆదరణ లభించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. పాప్ కెరీర్ను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. నా పాటలు 25 దేశాల్లో వినిపిస్తున్నాయి. ఇండో, అమెరికన్ పాప్ స్టార్గా పేరు రావడం ఆనందంగా ఉంది. ఆ ఘటన కదిలించింది.. ప్రపంచవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. అమెరికాలో ప్రతి రెండు నిమిషాలకు, ఇండియాలో ప్రతి 22 నిమిషాలకు ఒక మహిళ లైంగిక వేధింపులకు గురువుతున్నారు. కెనెడాలో ప్రతి 17 మంది మహిళల్లో ఒకరు, యూకేలో ప్రతి ఐదుగురి ఆడవాళ్లలో ఒకరిపై అత్యాచారం జరుగుతోంది. ఇటీవల ఇండియాలో ఇద్దరు మహిళలపై లైంగిక దాడి జరిపి.. ఆపై వారిని ఉరి తీయడం నన్ను ఎంతగానో కదిలించింది. ఆ బాధితుల తల్లిదండ్రులతో మాట్లాడాను. ఇక్కడ మహిళల అక్రమరవాణా కూడా ఆందోళనకర స్థాయిలో సాగుతోంది. తల్లిలా చూడాల్సిన ఆడవారిపై జరుగుతున్న దాడులను ఆపడానికి నా వంతుగా ఏదో ఒకటి చేయాలనుకున్నా. నా ఫ్రెండ్స్తో మాట్లాడి ‘మిషన్ సేవ్ హర్’ ఫౌండేషన్కు శ్రీకారం చుట్టా. ‘సేవ్ హర్’ అనే పాట రాసి.. పద్నాలుగు మంది హాలీవుడ్ సెలబ్రిటీలతో పాడించాను. దీనికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ వస్తోంది. ఈ పాట విని కొందరైనా.. మారితే చాలు. ఈ ఆల్బమ్కు వచ్చే నిధులను ‘సేవ్ హర్ ఫౌండేషన్’కు అందేలా చూస్తున్నాం. స్పెషల్ ఫోకస్... ప్రపంచవ్యాప్తంగా ‘సేవ్ హర్’ విస్తరించాలని భావిస్తున్నాం. భారత్లో ఒక్క హైదరాబాద్లోనే కాదు. ముంబై, పూణె, ఢిల్లీ, బెంగళూరులలో మా సేవలు ప్రారంభించాలనుకుంటున్నాం. ఇండియాపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని నిర్ణయించాం. నాకు మంచి పేరెంట్స్తో పాటు ఎంతో మంది భారత్ అభిమానులను ఇచ్చిన ఈ పుణ్యభూమికి ఈ రకంగానైనా సేవ చేయాలనుకుంటున్నా. అందరి సహకారం అందుతుందని ఆశిస్తున్నా. -
రీడ్ అండ్ లీడ్
‘పుస్తకం లేని గది ఆత్మ లేని శరీరం లాంటిది’ అంటారు రోమ్ ప్రముఖ తత్వవేత్త మార్కస్ టులియస్ సిసెరో. ఓ మంచి పుస్తకం విజ్ఞానం, వికాసం వైపు నడిపిస్తుంది. కానీ ప్రస్తుత హైటెక్ యుగంలో పుస్తక పఠనం బాగా తగ్గిపోయింది. విస్తృతమైన ఇంటర్నెట్, విరుచుకుపడుతున్న గాడ్జెట్స్.. పుస్తకం తెరిచే సమయమే ఉండటం లేదు నేటి తరానికి. ఈ పరిస్థితిని కొంతైనా మార్చి పుస్తకానికి పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ‘యానిమల్ రీహాబిలిటేషన్ ప్రొటెక్షన్ ఫ్రంట్’(ఏఆర్పీఎఫ్) వారు. ఏటా ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకొని పేద పిల్లలకు వివిధ రకాల పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. వారిని బుక్ రీడింగ్ వైపు మళ్లించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నగరంలోని అనాథ ఆశ్రమాలు, ప్రభుత్వ పాఠశాలలు, మురికి వాడల్లోని పిల్లలు, వారి తల్లిదండ్రులకు పుస్తకం ప్రాముఖ్యాన్ని తెలిపేలా క్యాంపెయిన్ చేపట్టారు. విజ్ఞాన, వినోద పుస్తకాల గురించి వారికి వివరించారు. జంతు సంరక్షణ, భూ సంరక్షణ, జనరల్నాలెడ్జ్ తదితర బుక్స్ను పంపిణీ చేశారు. వాటితో పాటు పెన్సిల్స్, పెన్స్ పంచిపెట్టారు. ‘అంతటితోనే మా మిషన్ ఆగిపోదు. ఆయా ప్రాంతాల్లో విద్యపై ఆసక్తి ఉండి, ఆర్థిక పరిస్థితులు అనుకూలించక చదువుకోలేని వారిని బడిలో చేర్పిస్తున్నాం. జీవితానికి ఉపయోగపడే మంచి పుస్తకాలు, వాటి రచయితల విశిష్టతను పిల్లలకు తెలియజెబుతూ వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నాం’ అంటూ చెప్పారు సంస్థ నిర్వాహకుడు నిహార్. ఈ సామాజిక సేవలో నిహార్కు తోడుగా ఎంతో మంది వాలంటీర్లు జతకలిశారు. ‘పుస్తకం, విద్య, జీవజాలం, భూమి.. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయాలంటే వీటి ప్రాధాన్యం నేటితరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అంటారు టీం మెంబర్స్. - సిరి -
పేపర్.. సూపర్
తెల్లారి లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మనం వాడే అన్నీ, అంతటా.. ప్లాస్టిక్మయం. ఆధునికత పేరిట ఆడంబరాన్ని చాటుకునేందుకు పర్యావరణానికి చేటు తెచ్చే వస్తువులను ఎడాపెడా వాడేస్తున్నాం. అయితే, వాటి వాడకాన్ని తగ్గించాలని చెప్పడమే కాదు.. అటువంటి వాటికి ప్రత్యామ్నాయాలను సృష్టిస్తున్నారు ఇద్దరు యువతులు. అంతేనా.. మహిళా సాధికారతకు దారి చూపిస్తున్నారు. వారి పరిచయం.. - ఓ మధు ఫొటోలు: ఎన్.రాజేష్రెడ్డి యూసుఫ్గూడ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన అనుభవం గౌరీ మహేంద్రది. టీచ్ ఫర్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా రెండేళ్లు ఆమె ఇక్కడ పనిచేసినపుడు స్కూల్లో హాజరు శాతం పెరగకపోవడం కలవరపరిచింది. సమీపంలోని మురికివాడల్లో తిరిగి పరిశీలించింది. పూట గడవడానికి పిల్లలు బడి మాని పనికి వెళ్తున్న పరిస్థితి కళ్లకుకట్టింది. కడు పేదరికంతో ఉన్న ఆ కుటుంబాలకు కాసింత ఉపాధి చూపితే్త తప్ప వారి పిల్లలను బడికి మళ్లించడం కష్టమని అర్థమైంది ఆమెకు. వారందరికీ ఉపాధి కల్పించాలంటే ఏం చేయాలి! ‘ఈ ఆలోచన నన్ను తొలిచేసింది. ఈ సమయంలో రాజస్థాన్లో బేర్ఫుట్ కాలేజీ కమ్యూనిటీకి వెళ్లాను. అక్కడ అరుణారాయ్ వద్ద ఉపాధి శిక్షణ ఇవ్వదగ్గ వివిధ అంశాల గురించి తెలుసుకున్నా. హైదరాబాద్కు తిరిగొచ్చాక.. నాలాంటి ఆలోచనలతోనే ఉన్న ఉదితా చడ్డాతో కలిసి ఆర్గనైజేషన్ ప్రారంభించాను. దాని పేరే ఉమీద్’ అని వివరించింది గౌరీ. మహిళా సాధికారత... ‘దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న మహిళలకు ఉపాధి కల్పించాలి. అలాగే ముడి సరుకు కోసం ఎక్కువ ఖర్చు కాకూడదు. పర్యావరణానికి హాని కలిగించకూడదు. ఇలా ఆలోచించి వేస్ట్ న్యూస్పేపర్తో విభిన్నమైన వస్తువులు రూపొందించేలా శిక్షణ ఇస్తున్నాం. యూసుఫ్గూడ, ఓల్డ్సిటీ, అబిడ్స్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పది మంది మహిళలు పేపర్తో అద్భుతమైన కళాకృతులు తయారు చేశారు. వాటిని లామకాన్లో ప్రదర్శనకు పెట్టినప్పుడు మంచి స్పందన లభించిందని’ చెప్పింది ఒకే ఆశయం కోసం గౌరీతో కలిసి నడుస్తున్న ఉదితా చడ్డా. పెన్ స్టాండ్స్, టేబుల్ డెకరేటివ్ ఐటెమ్స్, వాల్ హ్యాంగింగ్స్... ఇలా ప్రదర్శనలో ఏది చూసినా వాటి వెనుక కళాకారుల అద్భుత పనితనం కనిపిస్తుంది. కాగితంతో వివిధ కళాత్మక ఐటెమ్స్ తయారు చేయించడమే కాదు.. స్కిల్ ట్రైనింగ్, మైండ్సెట్ మార్చడానికి టీమ్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం, మహిళలు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే వేదికను కల్పించడం కూడా తమ బాధ్యతగా భావిస్తున్నారు వీరిద్దరూ. స్నేహితుల సహకారంతో మొదలుపెట్టిన ‘ఉమీద్’కు ‘అన్లిమిటెడ్ ఇండియా’ హైదరాబాద్ చాప్టర్ నుంచి ఎల్ వన్ స్టేజ్లో కొంత ఫండింగ్ అందుతోంది. నిఫ్ట్ కాలేజీ స్టూడెంట్స్ కొంతమంది వాలంటీర్లుగా డిజైనింగ్, క్రాఫ్ట్స్, ప్రమోషన్స్లో సంస్థకు సహకారం అందిస్తున్నారు. ‘రాబోయే రోజుల్లో మా సంస్థ ద్వారా మహిళా సాధికారత సాధించాలన్నది మా ప్రయత్నం’ అంటూ చెప్పుకొచ్చారు గౌరీ, ఉదిత. ఉమీద్లో భాగస్వాములు కావాలనుకొంటే లాగిన్ అవ్వండి. www.facebook.com/UMEEDsocialmedia/info?tab=page_info -
మదర్ ఎర్త్
బీటలువారిన భూమి.. ‘మొక్క’వోని సంకల్పంతో ఆ పగుళ్లకు బ్యాండేజీ వేసి, చికిత్స చేస్తే.. పుట్టింది ఓ లత. భూమి నిండా పచ్చదనం అలా తీగలా అల్లుకోవాలని సందేశాన్నిస్తున్న ఈ చిత్రం.. ఇంకా మనం ఈ భూమిపై సృష్టిస్తున్న విధ్వంసాన్ని కళ్లకు కడుతుంది. ధరిత్రి పట్ల మనమెంత బాధ్యతాయుతంగా ఉండాలో చెబుతుంది. నిలువెల్లా గాయాలతో విలయం అంచున ఉన్న భూమిని ఇప్పటికైనా కాపాడుకొని ఆకుపచ్చని వాతావరణాన్ని సృష్టిద్దామంటున్న ఇటువంటి చిత్రాలెన్నో... - కళ ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలు.. వనాలు కరుమరుగై ఎటుచూసినా జనాలు, భవనాలు.. విషతుల్యంగా మారిపోతున్న జలాలు.. బీడుపడి గోడు వెళ్లబోసుకుంటున్న నేల.. ఈ పరిస్థితికి కారణం మనిషేనంటున్నాయి ఈ చిత్రాలు. ఎర్త్ డే సందర్భంగా బంజారాహిల్స్లోని గోథెజంత్రమ్ ‘పర్స్పెక్టివెన్: మదర్ఎర్త్’ పేరుతో వరుసగారెండోసారి ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. ఇందులో 45 ఫొటోలను ప్రదర్శనకు ఉంచారు. ఇవన్నీ ధరిత్రి సౌందర్యాన్ని.. ఈ నేలపై మనం సృష్టిస్తున్న విధ్వంసాన్ని తెలియచెప్పేవే. ‘దక్కన్ పీఠభూమి దర్పాన్ని చాటే ‘రాక్స్’.. ఇప్పుడు ఠీవిని కోల్పోతున్నాయి. మనిషి దెబ్బకు ఛిద్రమవుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే దక్కన్ రాతి కొండల్ని ఫొటోల్లో మాత్రమే చూడగలం’ అని చెబుతుంది హైదరాబాదీ ఫొటోగ్రాఫర్ అశోక్ తీసిన చిత్రం. భూమే ఆధారం... మన ఉనికికి భూమే ఆధారం. భూమి మీద ఆధారపడిన అనేకానేక జీవుల్లో మనమూ ఒకరం. కానీ నేల, నీరు, వాతావరణాన్ని మన చేష్టలతో ఎంత పాడుచేస్తున్నామో ఇక్కడ కొలువుదీరిన చిత్రాలు కళ్లకు కడుతున్నాయి. ‘పర్యావరణానికి ఎంత చేటు తెస్తున్నామో నిత్యం చేసే పనుల ద్వారా మనకు తెలుస్తూనే ఉంటుంది. మోడు వారిన చెట్లు.. గుక్కెడు నీరు దొరకని పరిస్థితులు.. నగర జీవనంలో ఈ దృశ్యాలు కనిపించని రోజు ఉండదు. బిజీ లైఫ్లో పడి మన పనులు, ఆలోచనల్లో మునిగిపోతాం. ఆ దృష్టిని మార్చుకోవాల్సిన అవసరాన్ని ఈ ఫొటోలు చెబుతాయి’ అంటారు ఈ ఎగ్జిబిషన్ క్యూరేటర్ ప్రశాంత్ మంచికంటి. తల్లి కంటే మిన్నగా... ‘మన మనుగడకు ఏకైక ఆధారం భూమి. అమ్మ కన్నా మిన్నగా మదర్ ఎర్త్ను కాపాడుకోగలిగితే మనకు మంచి భవిష్యత్తు ఇస్తుంది. పచ్చని నేల, స్వచ్ఛమైన నీరు, గాలిని భద్రంగా భావి తరాలకు అందించే బాధ్యత మన మీదే ఉంది’ అని చాటుతున్నాయి ఈ పర్యావరణ ఫొటోగ్రాఫర్లు తీసిన ఫొటోలు. ‘మదర్ ఎర్త్: బ్యూటీ, హర్ జాయ్స్, సారోస్ అండ్ పెయిన్.. ఈ మూడు అంశాలను ఈ చిత్రాల ద్వారా చెప్పాలన్నదే మా ప్రయత్నం’ అంటారు ప్రశాంత్ మంచికంటి. ఉప్పొంగే సముద్రం, కొండలు, నదులు ఈ సౌందర్యం మాటునే విధ్వంసమూ చోటుచేసుకుంటోంది. భూమిపై జరుగుతున్న వాతావరణ మార్పులు ఏమిటో ఇవి తెలియ చెబుతాయి. ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది హైదరాబాదీ ఫొటోగ్రాఫర్ సత్యప్రసాద్ తీసిన హియాలయాల చిత్రం. నింగిని తాకే వెండికొండ అందాలు.. ఆ పక్కనే గొడ్డలివేటుకు బలైన మహా వటవృక్షాల తాలూకు మోడులు.. ఈ చిత్రం భూమిపై జరుగుతున్న డిఫారెస్టేషన్కు నిదర్శనం. ఎన్విరాన్మెంటల్ ఏప్రిల్ ఎర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. ‘మనం బతికేందుకు అన్నీ ఇస్తున్న నేల తల్లిని ఎంతగా వేధిస్తున్నామో గ్రహించి, దానిని సరిదిద్దుకోవాలని చెప్పడమే ఈ ప్రదర్శన ఉద్దేశం. ఏటా ఏప్రిల్ మాసాన్ని ఎన్విరాన్మెంటల్ ఏప్రిల్గా పరిగణిస్తూ మదర్ ఎర్త్ పేరుతో ఫొటో ప్రదర్శనలు, ఫిల్మ్ స్క్రీనింగ్స్, చర్చలు, వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాం’ అని చెప్పారు గోథెజంత్రమ్ డెరైక్టర్ అమితాదేశాయ్. -
ఎకో పంథా
సిటీలోని బడా హోటళ్లు నయా పంథాలో నడుస్తున్నాయి. ఆర్గానిక్ ఫుడ్కు ఓటేస్తూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మంగళవారం ‘ప్లానెట్ 21’ పేరుతో ‘నోవాటెల్’ వార్షికోత్సవాన్ని పర్యావరణ హితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహారం, పర్యావరణం, పచ్చదనం ప్రాధాన్యతను ఇక్కడ వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తాము టేస్ట్ అండ్ హెల్తీ మెనూను సిద్ధం చేస్తున్నట్టు కార్యక్రమం నిర్వాహకులు తెలిపారు. కాగా, కస్టమర్లు సైతం ఈ తరహా ఫుడ్కే ఓటేస్తుండటంతో బడా హోటళ్ల దారిలోనే మధ్య, చిన్నస్థాయి హోటళ్లూ నడుస్తున్నాయి. సేంద్రియ ఆహార ఉత్పత్తులను కాస్త ఎక్కువ రేటైనా పెట్టి కొనుగోలు చేస్తున్నాయి. కొన్ని హోటళ్లయితే ఏకంగా రైతులతోనే అగ్రిమెంట్ చేసుకొని రసాయనిక మందులు వాడని కూరగాయలు, బియ్యం తెప్పించుకుంటున్నాయి. రైతులకు కూడా బాగానే గిట్టుబాటు అవుతుండటంతో హోటళ్లకు తమ ఉత్పత్తులు అందించేందుకు ముందుకు వస్తున్నారు. ‘గిరిజన ప్రాంతాలైన ఆదిలాబాద్, మహబూబ్నగర్, కర్నూలు, కదిరి, మిర్యాలగూడ నుంచి రాగులు, కొర్రలు, జొన్నలు, అరికెలు, పప్పు, జొన్న ధాన్యాలు తెప్పిస్తున్నాం. మిల్లెట్ దోశ, రాగులు, జొన్న ఇడ్లీలు, చిరుధాన్యాల వడ, రాగులతో అటుకులు, జొన్న, సజ్జలతో అటుకులు (పోహ) చేస్తున్నాం, సిటీవాసుల నుంచి వీటికి మంచి రెస్పాన్స్ ఉంద’ని అంటున్నారు బంజారాహిల్స్ ఆహార్ బిస్ట్రో నిర్వాహకురాలు అర్చన. మా వద్దకు వచ్చే కస్టమర్లు టిఫిన్స్, లంచ్, డిన్నర్కు వాడే ఐటమ్స్ సేంద్రియ ఆహార పదార్థాలేనా అని అడుగుతున్నారంటే ఆహారం విషయంలో సిటీవాసులు ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు ట్రైడెంట్ హోటల్ ఉద్యోగి మోనిక. ‘ఒక్క ఆహారం విషయంలోనే కాదు మా హోటల్లో కస్టమర్లు వాడిన శీతలపానీయ బాటిళ్లను పారేయడం లేదు. వాటిని శుభ్రం చేసి అందులో ఇసుక నింపి ఇటుకల మధ్యలో వాడుతున్నాం. అలాగే ఉద్యోగులందరూ సైకిల్పై రావాలని కోరాం. తప్పనిసరై బైక్, కార్లపై వచ్చిన ఉద్యోగుల కోసం పొల్యూషన్ చెక్ వెహికల్ అందుబాటులో ఉంచాం. హోటల్కు వచ్చిన కస్టమర్ల వెహికల్కు కూడా ఫ్రీగానే చెక్ చేస్తున్నాం’ అంటున్నారు నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ జనరల్ మేనేజర్ నీల్ పీటర్సన్. ఈ సందర్భంగా వృథా అనుకునే ప్రతి వస్తువును తిరిగి ఏదో రకంగా ఎలా ఉపయోగించవచ్చో వివరించారు. - వాంకె శ్రీనివాస్ -
సమ్మర్లో హాయి.. హాయ్
‘పిచ్చెక్కిస్తా’ మూవీ ద్వారా టాలీవుడ్కి పరిచయమైన అందాల బొమ్మ హరిణి మంగళవారం తాజ్ దక్కన్లో తళుకులీనింది. ‘ఫ్యాషన్ అన్లిమిటెడ్’ ఎక్స్పోను ప్రారంభించింది. ఫ్యాషన్, లైఫ్స్టైల్ యాక్ససరీస్తో కొలువుదీరిన ఈ ఎక్స్పో నేడు కూడా కొనసాగనుంది. ఈ సందర్భంగా సిటీప్లస్తో హరిణి పంచుకున్న ముచ్చట్లు.. . - శిరీష చల్లపల్లి నాన్నది అసోం. అమ్మది విశాఖపట్నం. నేను అసోంలోనే పుట్టాను. చదువంతా వైజాగ్లోనే. నాకు ఇద్దరు చెల్లెళ్లు. నేను పూర్తిగా అమ్మకుట్టిని. నా ముద్దు పేరు అమ్ము. డిగ్రీ తరువాత మోడలింగ్ చేశాను. కొన్ని షోస్లో ర్యాంప్వాక్ చేశాను. అప్పుడే నాకు సినీ అవకాశాలు రాసాగాయి.‘పిచ్చెక్కిస్తా’ నా తొలి మూవీ. లాస్ట్ ఇయర్ ఈ మూవీ షూటింగ్ నిమిత్తం ఫస్ట్టైమ్ హైదరాబాద్ వచ్చా. గోల్కొండ ఫోర్ట్లో షూటింగ్ కావడంతో కోట మొత్తం చుట్టేశాను. అక్కడ గోడలపై లవర్స్ పేర్లు, గబ్బిలాల చక్కర్లు, చప్పట్ల శబ్దాలు నాకు వింతగా అనిపించాయి. చికెన్ అంటే బాగా ఇష్టం. గోంగూర చికెన్ కాంబినేషన్ అదరగొట్టేలా వండుతాను. అది వండినప్పుడల్లా ఫ్రెండ్స్ అందరికీ మా ఇంట్లోనే ట్రీట్. ప్రస్తుతం ‘నాడు నేడు’, ‘వలయం’, ‘ఈ వయసులో’ సినిమాలు ప్రాసెస్లో ఉన్నాయి. నాకు పదహారణాల తెలుగమ్మాయి రోల్ వేయాలని ఉంది. సౌందర్య నా అభిమాన నటి. ఇక సమ్మర్ సీజన్ బాగా ఇష్టం. కొబ్బరిబోండాలు, తాటిముంజలు, మామిడిపండ్లు ఈ సీజన్ను జాయ్ఫుల్గా మారుస్తాయి. ఈ హాట్ సమ్మర్లో స్విమ్మింగ్ని ఎంజాయ్ చేస్తా. పెళ్లిళ్లు, ఫంక్షన్లతో వేసవి భలే సందడిగా ఉంటుంది. -
కాగితం నగషీ
మగువ అందానికి పొందికగా ఒదిగిపోతాయి ఈ నగలు. ఆ ఆభరణాలు ఎక్కువ డబ్బు ఖర్చు, బరువు లేకుండా... ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు అల్లాణి రాధిక. అదీ పర్యావరణహితంగా! ఖాళీ సమయాన్ని క్రియేటివ్గా మార్చుకుని పేపర్తో జ్యువెలరీ చేస్తున్నారు ఈమె. ‘పర్యావరణాన్ని కాపాడటమంటే సింపుల్గా ఉండటం కాదు. ఎకోఫ్రెండ్లీగా ఉంటూనే చక్కని అలంకరణతో అందంగా కనిపించవచ్చు. ఆసక్తి ఉంటే ఏ శిక్షణా అవసరం లేదు’ అంటున్న రాధిక... ఇంటర్నెట్ ముందు కూర్చునే ఈ పేపర్ ఆర్ట్ వర్క్ నేర్చుకున్నారు. దిల్సుఖ్నగర్లో ఉంటున్న ఈమె భర్త ప్రైవేటు ఉద్యోగి. కాలేజీ లైఫ్లో పిల్లలు బిజీ. ఇంట్లో పని అయిపోయాక ఖాళీగా ఉన్న రాధిక... ఏదో ఒకటి చేద్దామన్న ఆలోచనతో నెట్టింట్లో సెర్చ్ మొదలు పెట్టారు. అప్పుడు తట్టిందే ఈ ఐడియా. నాలుగు నెలల్లోనే చేయి తిరిగిన ఆర్టిస్టుగా మారిపోయారు. ఫిల్లింగ్ పేపర్తో కమ్మలు, గొలుసుల వంటివి ఎంతో ఆకర్షణీయంగా, ముచ్చటగా రూపొందించారామె. చూడ్డానికి ఫ్యాన్సీ జ్యువెలరీలా ఉన్న ఈ ఐటెమ్స్ ఖరీదు కూడా తక్కువే. అన్నింటి కంటే ముఖ్యంగా పర్యావరణానికి హాని చేయని ప్రొడక్ట్స్. వీటన్నింటినీ లామకాన్లోని ‘ఆర్గానిక్ బజార్’లో ప్రదర్శనకు ఉంచారు ఆమె. వచ్చిన వారందరూ వీటిని అపురూపంగా చూస్తున్నారు. ‘మనమేం చేయగలమనే కంటే ఆలోచనను ఆసక్తి ఉన్న వైపు మళ్లిస్తే ఇలా పర్యావరణం కోసం అందరూ ఎంతో కొంత చేయవచ్చు’ అనేది రాధిక అభిప్రాయం. -
ఐ & లెన్స్
ఐఫోన్తో ఏం చేయొచ్చు? ‘ఐట్యూన్స్ వినొచ్చు, ఇంటర్నెట్ను ఈజీగా బ్రౌజ్ చేయొచ్చు.. అప్పుడప్పుడూ ఫొటోస్ తీసుకోవచ్చు’ అనుకుంటాం. కానీ అప్పుడప్పుడూ కాదు.. అద్భుతమైన ఫొటోలు తీయొచ్చు. ఎంతలా అంటే ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ నిర్వహించేంత! అది నిజం చేసి చూపించారు ఫొటోగ్రాఫర్ శివ చిలువేరు.తన ఐఫోన్ 4ఎస్తో తీసిన చిత్రాలతో మాదాపూర్లోని అలంకృత ఆర్ట్ గ్యాలరీలో ‘ద ఐఫొనోగ్రఫీ’ పేరిట ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఐఫోన్తో శివ చేసిన మ్యాజిక్ గురించి.. - కట్ట కవిత సాధారణంగా బయటికి వెళ్లేటప్పుడు అన్నీ ఉన్నాయా అని బ్యాగ్ చెక్ చేసుకుంటాం. కానీ శివ మాత్రం తన ఐఫోన్ ఉందో లేదో అని చూసుకుంటారు. ఎందుకంటే... ఈజీగా క్యారీ చేసే ఆ ఇన్స్ట్రుమెంట్లో హైరిజల్యూషన్ కెమెరానే కాదు, అమేజింగ్ ఎడిటింగ్ ఆప్షన్స్ ఉండటం అందుకు కారణం. న్యూయార్క్లో ఫైన్ఆర్ట్స్ మాస్టర్స్ చేసిన ఈ హైదరాబాదీ... స్టీవ్ జాబ్స్ ఫొటోగ్రఫీ విజన్ తనకు స్ఫూర్తి అంటారు. న్యూయార్క్ నుంచి హైదరాబాద్కు వచ్చేశాక వ్యాపారవేత్తగా, ఫొటోగ్రాఫర్గా రెండు ప్రొఫెషన్స్ కొనసాగించారు. కొంతకాలానికే పూర్తిస్థాయిలో ఫొటోగ్రఫీకే షిఫ్ట్ అయిపోయారు. ఐఫోనోగ్రఫీ ఎప్పటి నుంచి... ‘యాపిల్ ప్రొడక్ట్స అంటే అభిమానం. మొదటి ఐఫోన్ రిలీజైనప్పుడు యూఎస్లోనే ఉన్నాను. 2013లో ఐఫోన్ తీసుకున్నా. అందులో కెమెరా క్వాలిటీ చూసి ఆశ్చర్యపోయాను. రిజల్యూషన్ చెక్ చేసుకుని వెంటనే ఫొటోస్ తీయడం మొదలు పెట్టాను. ఆనలాగ్ కెమెరా ప్లేస్ను డిజిటల్ కెమెరా రీప్లేస్ చేసింది. ఇప్పుడు డిజిటల్ కెమెరాల స్థానాన్ని హైరిజల్యూషన్ కెమెరాస్ ఉన్న ఫోన్స్ ఆక్రమించుకుంటున్నాయి. ఇది మార్పుకు సంకేతం’ అంటారు శివ. 2013 డిసెంబర్ నుంచి ఈ ఎగ్జిబిషన్ కోసం పనిచేయడం ప్రారంభించారు. వీటికోసం హైదరాబాద్లోని అన్ని చారిత్రాత్మక కట్టడాలు, సిటీ ఔట్స్కట్స్, ఇతర నగరాల ను చుట్టేశారు. ఆయన ప్రస్తుత ప్రదర్శనలో 31 ఫొటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఈ నెల 25 వరకు ఈ ఫొటో షో కొనసాగుతుంది. గతంలో ఎగ్జిబిషన్స్... ఐఫోన్తో తీసిన ఫొటోస్తో ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం ఇదే తొలిసారి. ప్రదర్శనలో ఉన్న చిత్రాలన్నీ రోజూ మనం చూసేవే. కానీ పట్టించుకోనివి. పరిశీలించనవి. రోజూవారీ జీవితాన్ని ప్రతిబింబించే చిత్రాల్ని తన లెన్స్లో బంధించానంటారు శివ. ఆయన సూర్యోదయం, సూర్యాస్తమయాలు అస్సలు మిస్సవ్వరు. మార్కెట్స్, ఇతర రద్దీ ప్రదేశాలను ఫ్రేమ్ చేసుకుంటాడు. ఎన్నో కెమెరాలుండగా ఐఫోన్నే ఎందుకు ఎంచుకున్నారంటే.. ‘కెమెరా ఫోన్లు క్యారీ చేయడం సులువు. ఫొటో ఎడిటింగ్కి సంబంధించి ఐఫోన్లో మంచి అప్లికేషన్స్ ఉన్నాయి. ఫొటో తీయగానే బ్రైట్నెస్, కాంట్రాస్ట్ వంటి బేసిక్ టూల్స్ను ఉపయోగించి ఎడిట్ చేస్తాను’ అని చెబుతారు శివ. బేసిక్స్ తెలియాలి... చేతిలో కెమెరా ఉన్నంతనే ఎవరూ ఫొటోగ్రాఫర్ అయిపోరు. ఫొటోగ్రఫీ బేసిక్స్ తప్పనిసరిగా తెలిసి ఉండాలి’ అంటారు శివ. భవిష్యత్లో మొబైల్ ఫొటోగ్రాఫర్స్ అందరినీ ఒక వేదికపైకి తేవాలనుకుంటున్న శివ.. ఐఫోన్లో చిత్రీకరించిన షార్ట్ ఫిలింస్తో షార్ట్ఫిల్మ్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. -
చీరస్తు
జుబిన్ డిజైన్ మస్తు కొంతకాలంగా సిటీ పేజ్ త్రీ సర్కిల్స్లో గాని, ఫ్యాషన్ సీన్లో గాని పెద్దగా కని-వినిపించని జుబిన్.. మరోసారి న్యూస్ మేకర్ అయ్యారు. తన స్టైల్కు పూర్తి భిన్నంగా.. శారీ కలె క్షన్స్ను క్రియేట్ చేసి వావ్ అనిపిస్తున్నారు. తరుణ్ తహిల్యానీ, రోహిత్ ఖోస్లా వంటి టాప్ డిజైనర్స్కు వర్క్ చేసిన మాయా అనంతరాజన్ హ్యాండ్ పెయింటింగ్ తోడుగా ఆయన ఈ కలె క్షన్స్ డిజైన్ చేశారు. జుబిన్ కలెక్షన్స్లో అందంగా మెరిసిపోతున్న మిస్ ప్లానెట్ మెహక్మూర్తి స్టిల్స్ని ఫొటోగ్రాపర్ సిరాజ్ క్లిక్మనిపించారు. - ఎస్.సత్యబాబు వెస్ట్రన్ వేర్. ఈ పదం వినగానే సిటీలోని ఫ్యాషన్ లవర్స్కి ఠక్కున గుర్తొచ్చే పేరు జుబిన్ వకీల్. అల్ట్రామోడ్రన్కి ఆల్టర్నేటివ్ అనిపించేలా మీ వర్క్స్ ఉంటాయంటూ తరచుగా కాంప్లిమెంట్స్ అందుకునే ఈ డిజైనర్.. వర్క్ పరంగానూ, వ్యక్తిగతంగానూ టాక్ ఆఫ్ ది టౌన్. దాదాపు 15 ఏళ్లుగా ఈ రంగంలో ఉన్న జుబిన్ తొలిసారి శారీస్ డిజైనింగ్లోకి ప్రవేశించారు. ఒక్క‘శారీ’ కమిట్ అయితే... ‘నా చేత శారీ కలెక్షన్స్ లాంచ్ చేయించిన క్రెడిట్ నా క్లయింట్ సునందా సేన్ గుప్తాకే దక్కుతుంది’ అని చెప్పారు జుబిన్. తన కోసం ఒక్క శారీ డిజైన్ చేసి ఇమ్మని పదే పదే సునంద రిక్వెస్ట్ చేయడంతో కాదనలేక శారీస్ డిజైనింగ్కు సిద్ధమయ్యానన్నారు. ‘అయితే వర్క్ చేస్తున్నప్పుడే అర్థమైంది శారీస్ డిజైనింగ్లో లభించే ఆనందం ఏమిటో’ అన్న జుబిన్.. అదే ఊపులో కొత్త కలెక్షన్స్ లాంచ్ చేసేశారు. సమకాలీన డిజైనర్లకు భిన్నంగా కొన్నేళ్లు ముందుకు వెళ్లి డిజైన్ చేయడానికి ఇష్టపడే ఈ ట్రెండ్ సెట్టర్.. తాజా కలెక్షన్స్లో ఎల్లో మేళవించిన ఆలివ్ గ్రీన్, డల్ గ్రీన్-పింక్ మిక్సింగ్.. వంటి కలర్స్ కాంబినేషన్లతో తన ఫాస్ట్ ఫార్వర్డ్ ఐడియాస్కి అందమైన రూపమిచ్చారు. సిల్క్స్, ఆర్గాంజా, షిఫాన్ తదితర ఫ్యాబ్రిక్స్తో రూపొందిన ఈ లైట్ వెయిట్ శారీస్ డిఫరెంట్ లుక్తో అందర్నీ ఆకట్టుకుంటున్నాయని జుబిన్ హ్యాపీగా చెప్పారు. ఆర్టిస్ట్ మాయా అనంతరాజన్ తన శారీస్పై ఆమె హ్యాండ్ పెయింటింగ్ చేయాలనుకుంటున్నట్టు చెప్పగానే.. ఆమె పెయింటింగ్ స్టైల్ తన కలెక్షన్స్కు నప్పుతుందా లేదా అని కొంత తటపటాయించినా.. ఒక్కసారి ఆమె వర్క్ చూశాక ఫిదా అయిపోయానంటున్నారీ ప్రయోగాల డిజైనర్. నా రూటే వేరు... ఫ్యాషన్వీక్స్, సెలబ్రిటీ షోస్, బొటిక్స్, స్టోర్స్.. ఇలా ఎప్పుడూ న్యూస్లో వెలిగిపోయే మిగిలిన డిజైనర్ల మార్గాన్ని ఎంచుకోని జుబిన్.. ఫ్యాషన్ వీక్ అనేది ఒక వ్యయప్రయాసల వ్యవహారమని అంటారు. దీని కోసం నిధులు సమకూర్చే ‘ఫండింగ్’ పర్సన్ని వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత డిజైనర్దేనని, సెలబ్రిటీలు డబ్బుల విషయంలో పెట్టే ఇబ్బందులు భరించడం తనవల్ల కాదన్నారు. క్లయింట్స్ను మెప్పించినంత కాలం.. ఈ రంగంలో సక్సెస్ఫుల్గా కొనసాగడం సాధ్యమేనంటున్న జుబిన్... శారీస్ డిజైనింగ్ కొనసాగిస్తూనే.. తనదైన శైలి షాకింగ్ డ్రెస్లతో మెరిపిస్తానని చెప్పారు. -
ఐఓఈ
మారుతున్న జీవన పరిస్థితులతో పర్యావరణ సమతుల్యతకు తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. అన్నింటికీ ఆధారభూతమైన ఈ భూమండలం మనం సృష్టించే కాలుష్యం దెబ్బకు ఉక్కిరిబిక్కిరవుతోంది. పర్యావరణాన్ని రక్షించుకొంటే గానీ మనుగడకు ముప్పు తప్పదనే సందేశంతో ప్రదర్శించే నాటకం ‘ఐఓఈ: ది ఇన్హెరిటర్స్ ఆఫ్ ది ఎర్త్’. మలయాళం రచయిత వైకోమ్ మహమ్మద్ బషీర్ రాసిన పొట్టి కథ ‘భూమియూడె అవకాషికల్’ ఆధారంగా ఈ నాటకాన్ని రూపొందించారు. క్యారెక్టర్లతో పాటు పపెట్స్, మాస్క్స్, మల్టీమీడియా వంటివి కూడా ఈ ప్లేలో భాగం పంచుకుంటాయి. ఇందులో ఉపయోగించే మెటీరియల్స్ అన్నీ ఓ రీసెర్చ్ వర్క్షాప్లో ఈ థియేటర్ గ్రూప్ మెంబర్స్ సొంతంగా తయారు చేసినవే. ఓ గ్రామ, నగర బాహ్య, అంతర జీవన గమన తీరును చూపే ప్రయత్నం ఇది. యాభై నిమిషాల నిడివి ఉన్న ఈ నాటకాన్ని ధరిత్రీ దినోత్సవం సందర్భంగా నగరానికి చెందిన థియేటర్ హట్... ‘బీ 4.48 థియేటర్’ గ్రూప్ ప్రదర్శిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారుల సమాహారం థియేటర్ హట్. ఎన్నో రకాల కల్చరల్, థియేటర్ వర్క్షాప్స్ నిర్వహించింది. వేదిక: లామకాన్, బంజారాహిల్స్ సమయం: గురువారం రాత్రి 8 గంటలకు, ఎంట్రీ పాస్ల కోసం ఫోన్: 9676145161 -
అన్నీ అనుకోకుండానే..
ఎయిర్ హోస్టెస్గా అనుకున్న ఉద్యోగం సంపాదించింది. అదే ఉద్యోగం ఆమెను హీరోయిన్గా టాలీవుడ్లో ల్యాండ్ అయ్యేలా చేసింది. హిందీ, ఇంగ్లిష్ తప్ప మరో భాషరాని ఈ అమ్మాయి ఇప్పుడు తెలుగులో అదరగొడుతోంది. సినిమా తెరపై నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్న కెనీష చంద్రన్ ఇటీవల బంజారాహిల్స్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైంది. తన కెరీర్ ముచ్చట్లను సిటీప్లస్తో పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే. - వాంకె శ్రీనివాస్ చిన్నప్పటి నుంచి విమానంలో ప్రయాణించాలనే కాదు.. ఫ్లయిట్లోనే ఉద్యోగం చేయాలని కోరిక ఉండేది. నేను పుట్టింది కేరళలో అయినా.. పెరిగిందంతా ఢిల్లీలోనే. బీఎస్సీ సైకాలజీ చేశాను. తర్వాత ఎయిర్ హోస్టెస్గా ఉద్యోగం వచ్చింది. రెండేళ్ల కిందట డ్యూటీలో ఉండగా.. విమానంలో ఓ ప్రయాణికుడు నన్ను చూసి యూనినార్ బ్రాండ్ అంబాసిడర్గా చేస్తావా అని అడిగారు. ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. తర్వాత తేరుకుని ఓకే చెప్పాను. అలా యూనినార్ ప్రచార చిత్రాల్లో నటించాను. చాలా ఇబ్బందిపడ్డా.. యాడ్స్ మూడ్ ఎంజాయ్ చేస్తుండగానే ఒకరోజు అనుకోకుండా టాలీవుడ్ నుంచి ఫోన్ వచ్చింది. గణపతి బప్పా మోరియాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. షూటింగ్ మొదట్లో తెలుగు అస్సలు వచ్చేది కాదు. సహ నటులతో మాట్లాడాలంటే చాలా ఇబ్బందిపడ్డా. ఎలాగైనా తెలుగు నేర్చుకోవాలని పట్టుదలతో ప్రయత్నించా. ఇప్పుడు తెలుగులో గలగలా మాట్లాడేస్తున్నా. తాజాగా జగన్నాటకం సినిమాలో కూడా నటించాను. కోలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఓల్డ్ సిటీ చాలా ఇష్టం... కెరీర్పరంగా నాకు లైఫ్నిచ్చిన హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. ఇక్కడి ప్రజలు ఆత్మీయంగా పలకరిస్తారు. ఓల్డ్ సిటీలో చక్కర్లు కొట్టడం అంటే భలే సరదా. షూట్స్ లేని సమయాల్లో.. ఫ్రెండ్స్తో కలసి పాతబస్తీని చుట్టేస్తుంటా. ఫలక్నుమా ప్యాలెస్, చార్మినార్, గోల్కొండ ఫోర్ట్ చూసి ఎంతో మురిసిపోయాను. ఇక దక్కన్ స్పెషల్.. స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఢిల్లీకి వెళ్లినప్పుడు మా పేరెంట్స్ దగ్గర హైదరాబాదీ బిర్యానీ గురించి ఎంతో గొప్పగా చెప్పా. వారు సిటీకి వచ్చినప్పుడు.. బిర్యానీ టేస్ట్ కూడా చూపించాను.