బోనం.. తెలంగాణ ప్రాణం
హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల ప్రతీక బోనం ప్రపంచ రికార్డుకెక్కింది. పోతు రాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల మధ్య దాదాపు 2,650 మంది మహిళలు బోనాలు ఎత్తుకున్నారు. ఈ అపూర్వ సన్నివేశం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం చోటు చేసుకుంది. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, తనిష్ నీలిమ డ్యాన్స్ అకాడమి, వాసవి మహిళా సమాఖ్య, తెలంగాణ కలల వేదిక, కైరా ఫౌండేషన్, మయూరి రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ‘బోనం.. తెలంగాణ ప్రాణం’ పేరిట ప్రపంచ రికార్డ్ స్థాయిలో బోనాల ప్రదర్శన నిర్వహించారు.
బోనాల వైభవాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని దత్తాత్రేయ సూచించారు. కార్యక్రమంలో హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి జయంత్రెడ్డి, సంఘటన్ జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల శేఖర్జీ, లక్ష్మీదేవి, ఉప్పల రాజ్య లక్ష్మి, స్వరూపరాణి, ఉమా మహేశ్వరి, వన్పల్లి శ్రీనివాస్రెడ్డి, ప్రతాప్, బండి దీక్షిత్, నర్సింహారెడ్డి, సతీశ్గౌడ్ పాల్గొన్నారు.