
హోదా లేదు.. దగానే!
- ఏపీకి ‘ప్రత్యేకం’ కుదరదని తేల్చేసిన కేంద్రం
- విభజన చట్టం హామీలనే వల్లె వేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ
- రెండున్నరేళ్ల ఆశలు ఆవిరి.. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలు బలి
- యువత భవితవ్యం అగమ్యగోచరం.. అసలు సూత్రధారి చంద్రబాబే
- బాబు అంగీకరించాకే జైట్లీ ప్రకటన.. ‘ఓటుకు కోట్లు’ వల్లే కాళ్లబేరం
- అర్ధరాత్రి ప్రెస్మీట్ పెట్టి మరీ కేంద్రం వైఖరిని సమర్థించిన చంద్రబాబు
- విభజన చట్టం హామీల ద్వారా మనకు రావలసినవి రూ.2లక్షల కోట్లు
- అవి కాక హోదా కూడా... నాడు పార్లమెంటు సాక్షిగా ప్రధాని హామీ
- రెండున్నరేళ్లుగా బాబు నాటకాలు.. కేంద్రంపై ఒత్తిడి తేకుండా మౌనం
- చంద్రబాబు స్వార్థ రాజకీయం వల్ల ఏపీకి తీరని నష్టం..
5 కోట్ల మంది ఆకాంక్ష
ప్రత్యేక హోదా పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీ
విభజన చట్టం హామీలు కచ్చితంగా అమలు చేయడం కేంద్రం బాధ్యత
ఏం జరిగింది?
ప్రత్యేక హోదాకు అధికారికంగా మంగళం పాడేశారు.
విభజన చట్టం హామీలను అమలు చేస్తున్నామని ప్రకటించారు.
బాబుగారి పాత్రేమిటి?
ప్రత్యేకహోదా సంజీవని కాదన్నారు.. ప్రజల్లో భావోద్వేగాలు పెరగగానే ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నట్లు చంద్రబాబు పోజిచ్చారు.
‘ప్యాకేజీ’ మంతనాలు సాగించారు.. చివరకు హోదా లేదన్న కేంద్రం ప్రకటనను తన మంత్రులను పక్కన కూర్చోబెట్టుకుని ఓకే చేశారు.
ప్రత్యేక హోదా ఉంటే..
వంద ప్యాకేజీలకు సమానం.. ఎందుకంటే రాయితీలు చూసి వందలాది పరిశ్రమలు వస్తాయి.. ఉద్యోగాలు వెల్లువెత్తుతాయి..కేంద్రం గ్రాంట్లు.. విదేశీ రుణాలలో మినహాయింపులు సరేసరి. కేంద్రాన్ని అర్థించాల్సిన అవసరం లేకుండానే ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది.
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
అయిపోయింది... భయపడినంతా జరిగింది. ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేసింది. ఐదుకోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షలు నాశనమైపోయాయి. భావితరాలు పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతయ్యాయి. విభజన కష్టాలతో సతమతమవుతున్న రాష్ట్రానికి సంజీవని వంటి ‘ప్రత్యేక హోదా’ ఆశను సమాధి చేసేశారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని పట్టపగలు ఖూనీ చేసేశారు.
మేనిఫెస్టోలలో పెట్టి మరీ ప్రచారం చేసిన హామీకి పాడెకట్టేశారు. కలసి పోటీ చేసిన బీజేపీ, తెలుగుదేశం పార్టీలు ఎన్నికల సభల్లో ప్రత్యేకంగా ఊదరగొట్టిన ప్రత్యేకహోదాకు మంగళం పాడేశాయి. విభజన చట్టంలోని హామీలు అమలు చేయడం కేంద్రం బాధ్యత. ఆంధ్రప్రదేశ్కు సహజసిద్ధంగా సంక్రమించిన హక్కు అది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని, విభజన చట్టం హామీలనే అమలు చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రకటించారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్న కేంద్రం ప్రకటనను ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యతిరేకించకపోగా జైట్లీ మొక్కుబడి ప్రకటనపైనే సుదీర్ఘంగా మాట్లాడారు.
దీనిని బట్టి కేంద్రంతో కలసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను దారుణంగా వంచించిన విషయం తేటతెల్లమైపోయిందని విశ్లేషకులంటున్నారు. ప్రత్యేకహోదా సాధ్యం కాదని పార్లమెంటులో ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ చెబుతుంటే రక్తం మరిగిపోయిందన్న చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదాకు చరమగీతం పాడేసి.. రోజంతా అదే జైట్లీతో ప్యాకేజీ ముచ్చట్లు సాగించారు. ప్రకటన పాఠాన్ని ముందుగా చంద్రబాబుకు పంపి, ఆయన ఆమోదించిన తర్వాతనే జైట్లీ ప్రకటించారని అంటున్నారు. అయితే పైకి మాత్రం ప్రత్యేకహోదా ప్రకటిస్తానంటేనే ఢిల్లీ వస్తానని చంద్రబాబు భీషణమైన ప్రకటన చేసినట్లు ప్రచారాలు సాగాయి. చివరకు ప్రత్యేక హోదా లేదని ప్రకటించి.. ప్రత్యేక ప్యాకేజీ కూడా లేదని తేల్చేసి కేంద్రం చేతులు దులుపుకుంది.
అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే..
ఆంధ్రప్రదేశ్కి ఏదో ప్రత్యేకంగా ప్రకటించబోతున్నారంటూ ఢిల్లీలో రోజంతా హడావిడి నడిచింది. చంద్రబాబుతో ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు ఫోన్లో చర్చించారు. మెరుగైన ప్యాకేజీ కోసం కేంద్రంతో లాబీ చేస్తున్నారని మీడియాలో ప్రచారం జరిగింది. ప్యాకేజీపై కేంద్రప్రభుత్వానికి, చంద్రబాబుకు మధ్య ఏకాభిప్రాయం కుదరిందని, చంద్రబాబుతో చర్చించే ప్యాకేజీకి కేంద్రం తుదిరూపు ఇస్తున్నదని ప్రచారం చేశారు. సుజనాచౌదరి, సీఎం రమేశ్, కొనకళ్ల నారాయణ తదితరులు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్జైట్లీతో చర్చలు జరిపారు. తొలుత సాయంత్రం 6.30 గంటలకు జైట్లీ ప్రకటన ఉంటుందన్నారు. తర్వాత అది రాత్రి 8.00 గంటలకు మారింది. చివరకు 11.00 గంటలకు విలేకరుల సమావేశం జరిగింది. అరుణ్జైట్లీ ప్రకటించే సమయంలో అక్కడ చంద్రబాబు కూడా ఉండాలని కేంద్రం భావించింది. అయితే అందుకు చంద్రబాబు సిద్ధపడలేదు.
హోదా ప్రకటిస్తామని చెబితేనే తాను ఢిల్లీ వస్తానని చంద్రబాబు అన్నట్లుగా మీడియాలో ప్రచారం చేయించారు. వాస్తవానికి చంద్రబాబు చెప్పినట్లుగానే, ఆయన ఆశించిన విధంగానే జైట్లీ ప్రకటన ఉన్నపుడు జైట్లీ ప్రకటన చేసే సమయంలో అక్కడ ఉండడానికి చంద్రబాబుకు అభ్యంతరం ఎందుకో బీజేపీ నాయకులకు అర్ధం కాలేదు.
ప్రత్యేక హోదా కోసం ప్రజలలో భావోద్వేగాలు పతాకస్థాయిలో ఉన్న ప్రస్తుత సమయంలో బీజేపీపైనే జనాగ్రహం ఉండాలనేది చంద్రబాబు వ్యూహంగా కనబడుతోంది. తాను చివరి నిమిషం వరకు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తూనే ఉన్నానని, కేంద్రమే ఈ మొక్కుబడి ప్రకటన చేసిందని ప్రచారం చేయించి తప్పుకోవాలనేది చంద్రబాబు పథకంగా కనిపిస్తోంది. అయితే ప్రత్యేక హోదా లేదని ప్రకటించడానికే కేంద్రమంత్రులు పరిమితమయ్యారు. విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేస్తున్నామని ప్రకటించి చేతులు దులుపుకున్నారు.
విభజనచట్టంలోని హామీలనే ప్రస్తావించారు..
అరుణ్జైట్లీ, వెంకయ్య చెప్పిన అంశాలలో కొత్తవి ఏవీ లేవని, అన్నీ విభజన చట్టంలో ప్రస్తావించినవేనని విశ్లేషకులంటున్నారు. ఆ హామీలకు దేనికెంత అవుతుందో తెలుపుతూ వాటి గురించి వెబ్సైట్లో పెట్టబోతున్నామని జైట్లీ చెప్పారు.. విభజన చట్టం హామీలన్నీ అమలు చేయాలంటే దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు మనకు కేంద్రం నుంచి రావలసి ఉంటుందని అంచనా. ప్రత్యేక హోదా కన్నా కేంద్రం ప్రకటించబోతున్న ప్యాకేజీయే మెరుగైనదంటూ.. రెండింటినీ ఒకదానికొకటి ప్రత్యామ్నాయమన్నట్లుగా ప్రచారం సాగించారు.
కానీ విభజన చట్టంలోని హామీలన్నిటినీ అమలు చేస్తూనే ప్రత్యేక హోదా ఇస్తామన్నది కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాట. అవే హామీలతో తెలుగుదేశం, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మరీ ఓట్లడిగాయి. ఇపుడు అదే వాగ్దానానికి ఆరెండు పార్టీలు తిలోదకాలిచ్చేశాయి. ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలను దేనితోనూ పోల్చలేమని నిపుణులంటున్నారు. ప్రత్యేకహోదాతో వచ్చే పన్ను రాయితీల వల్ల వచ్చే పరిశ్రమల సంఖ్యను, ఉపాథి అవకాశాల సంఖ్యను అస్సలు అంచనా వేయలేమని పరిశ్రమాధిపతులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సహజవనరుల విస్తృతి దృష్ట్యా ప్రత్యేకహోదా ఉంటే అనతికాలంలోనే రాష్ర్టం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుందని వారంటున్నారు. విభజన చట్టంలోని హామీలకే నిధులు అంచనా వేసి వాటినే ప్యాకేజీగా ప్రకటిస్తే రాష్ట్రానికి అదనంగా వచ్చే ప్రయోజనమేమీ లేదని వారు పేర్కొంటున్నారు.
‘అంతకుమించి’ సాధించాలిగా..
కలసి పోటీ చేసిన బీజేపీ, తెలుగుదేశం ఎన్నికల ప్రచారసభల్లో ప్రత్యేక హోదాపై ఊదరగొట్టాయి. కేంద్రంలోనూ, రాష్ర్టంలోనూ అధికారపగ్గాలు చేపట్టిన తర్వాత హోదాను గాలికొదిలేశాయి. ప్రత్యేక హోదా అనేది పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్కి లభించిన హక్కు. కానీ చంద్రబాబు నాయుడు ఏనాడూ అందుకోసం కేంద్రంపై వత్తిడి చేసిన పాపాన పోలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి కాశ్మీర్ పర్యటన సందర్భంగా ఆ రాష్ట్రానికి రూ.70 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. బీహార్ పర్యటనలో ఆ రాష్ట్రానికి రూ. 1.65లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు.
కేంద్రంలో బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇలాంటి ప్రత్యేక ప్యాకేజీ ఏమన్నా సాధించారా అంటే లేదు. ప్రధాని తలచుకుంటే అది అసాధ్యం కాదు కదా? కానీ మనకు ఇప్పటి వరకు అలాంటి అదనపు ప్రయోజనమేమీ లభించలేదు. విభజన చట్టం హామీలు మన హక్కు. ప్రత్యేక హోదా మనకు పార్లమెంటు సాక్షిగా లభించిన హామీ. అలా కాకుండా ప్రత్యేక హోదాకు మంగళం పాడేసి అంతకన్నా మెరుగైనదంటూ విభజన చట్టంలోని హామీలకు ప్యాకేజీ ముసుగేసి ప్రకటించడం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినట్లు కాదా?
ఎన్నో నాటకాలు.. అంతా వంచన..
గడచిన రెండున్నరేళ్లలో ఎన్నో నాటకాలు.. ఎన్నో మోసాలు.. అంతా వంచన. ప్రజల కళ్లకు గంతలు కట్టి మరీ చంద్రబాబు కుట్రలు సాగించారు. అవినీతి కుంభకోణాలు, ఓటుకు కోట్లు కేసు ముఖ్యమంత్రి నోరు మెదపనీయకుండా చేశాయి. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం పాదాక్రాంతం చేశారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా 15 ఏళ్లు తీసుకొస్తామన్న చంద్రబాబు ఎన్నికలు ముగిసి పీఠం ఎక్కగానే ప్లేటు ఫిరాయించారు. హోదాపై వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేశారు. హోదా ఏమన్నా సంజీవనా? అని హాస్యాస్పదంగా మాట్లాడారు.
కేంద్రం హోదా ఇస్తానంటే వద్దంటానా అంటూ కోడలు మగబిడ్డను కంటానంటే ఏ అత్త అన్నా వద్దంటుందా అని వ్యాఖ్యానించారు. హోదా ఉన్న రాష్ట్రాలకు ఏం ఒరిగింది అని ప్రశ్నించారు. ప్రత్యేకహోదాతోనే అభివృద్ధి చెందదు అన్నారు. హోదాయే సరిపోదు అన్నారు. చివరకు ప్రత్యేక హోదా విషయంలో ఐదుకోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచుతూ అలుపెరుగని పోరాటం సాగిస్తుంటే చంద్రబాబు రకరకాలుగా విమర్శించారు. ప్రత్యేక హోదాపై ప్రజలలో భావోద్వేగాలు పెరగ్గానే మళ్లీ మాటమార్చారు. హోదా మనకు జీవన్మరణ సమస్య అని వ్యాఖ్యానించారు.
హోదా కోసం పోరాడుతున్నట్లు బిల్డప్ ఇవ్వడం మొదలు పెట్టారు. అరుణ్జైట్లీ ప్రత్యేకహోదా సాధ్యంకాదని రాజ్యసభలో వ్యాఖ్యానించినపుడు ‘నా రక్తం మరిగిపోయింది’ అని చంద్రబాబు హూంకరించారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం రూ.1.53 లక్షల కోట్లు ఇచ్చిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్షా ప్రకటించగా ఎక్కడిచ్చారు? అంటూ కేంద్రాన్ని ఢీకొంటున్నట్లు పోజు పెట్టారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు జరపాల్సిందిగా ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశించగానే చంద్రబాబు రక్తం చల్లబడిపోయింది. మరోమారు కేంద్రం పాదాల ముందు మోకరిల్లారు.
ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్లు కలర్ ఇచ్చారు. సుజనాచౌదరిని పురమాయించి జైట్లీతోనూ, వెంకయ్యతోనూ, అమిత్షాతోనూ ప్రత్యేక హోదాపై చర్చించడం కోసం పురమాయించినట్లు ప్రచారం చేయించుకున్నారు. వాస్తవానికి ప్యాకేజీపై ఓ ప్రకటన చేసి ప్రస్తుత సంక్షోభ పరిస్థితి నుంచి గట్టెక్కించాలని వేడుకున్నట్లు కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యేక హోదాను సమాధి చేసేసి హోదా కన్నా ఈ ప్యాకేజీయే మెరుగైనదన్న ప్రచారం జోరుగా సాగించేందుకు కేంద్రంతో చేతులు కలిపిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని అన్యాయం చేశారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.