
'ఫిరాయింపు నేతలతో ప్రమాణం చేయించొద్దు'
హైదరాబాద్: పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించొద్దని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) రాజ్భవన్ ముట్టడికి యత్నించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన శనివారం మెరుపు ధర్నా చేపట్టారు. వెంటనే అలర్టయిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఈ సందర్భంగా వీహెచ్ ఆరోపించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించకూడదని వీహెచ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో చేసినట్టే ఏపీలో కూడా చేస్తే గవర్నర్ను బర్తరఫ్ చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరతామని ఆయన తెలిపారు. అంతే కాదు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అవసరమైతే ఉద్యమం కూడా చేపడతామని వీహెచ్ హెచ్చరించారు.