రానున్న ఎన్నికల్లో ప్రజావ్యతిరేక కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని, అది కూడా లెఫ్ట్ పార్టీల నాయకత్వంలో రావాలని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ఎస్పీ) జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీఎంపీ అబనీరాయ్, రాష్ట్రకార్యదర్శి జానకిరాములు అభిప్రాయపడ్డారు.
దోమలగూడ,న్యూస్లైన్: రానున్న ఎన్నికల్లో ప్రజావ్యతిరేక కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని, అది కూడా లెఫ్ట్ పార్టీల నాయకత్వంలో రావాలని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ఎస్పీ) జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీఎంపీ అబనీరాయ్, రాష్ట్రకార్యదర్శి జానకిరాములు అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ క్రాస్రోడ్డులోని ఓ హోటల్లో ఈనెల 11,12,13 తేదీల్లో జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశ వివరాలను బుధవారం దోమలగూడ ఎస్ఎంఎస్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు వెల్లడించారు.
ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకున్నారని, కాంగ్రెస్, బీజేపీలను పక్కకు పెట్టడడమే ఇందుకు నిదర్శనమన్నారు. వామపక్షాలు కూడా ప్రజాసమస్యలపై నిత్యం ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రజామద్దతు అనుకున్నంత కూడగట్ట లేకపోతున్నామని, దీనిపై ఆలోచన చేయాల్సిన ఆవశ్యత ఉందన్నారు. ధరల పెరుగుదలపై ఈనెల 16 నుంచి 31 వరకు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. రాష్ట్రం విడిపోకూడదనేదే తమ పార్టీ విధానమని, అదే క్రమంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తున్నట్లు వారు చెప్పారు. పార్టీ యువజన విభాగమైన ఆర్వైఎఫ్ జాతీయ మహాసభలు మార్చి 2 నుంచి ఢిల్లీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.