‘హస్తిన’ బాటపట్టిన ఎమ్మెల్యేలు
దిగ్విజయ్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూపు
అసంతుష్టుల జాబితాలో ఐదుగురు ఎమ్మెల్యేలు
సాక్షి, రంగారెడ్డి జిల్లాప్రతినిధి: కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణపై శివారు ఎమ్మెల్యేలు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న శాసనసభ్యులు ఏదొకటి తేల్చుకునేందుకు ఢిల్లీబాట పట్టారు. మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి ‘సర్వే’కు మరోసారి టికెట్ ఇవ్వవద్దనే డిమాండ్తో పార్టీ పెద్దలను కలవాలని నిర్ణయించారు. మల్కాజిగిరి లోక్సభ స్థానం పరిధిలోని ఐదుగురు ఎమ్మెల్యేలు సర్వే సత్యనారాయణపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు హస్తిన వెళ్తున్నారు.
ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ అపాయింట్మెంట్ను కోరుతూ లేఖ రాశారు. మాజీమంత్రి శంకర్రావు సహా ఎమ్మెల్యేలు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బండారి రాజిరెడ్డి, ఆకుల రాజేందర్, దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఈ మేరకు డిగ్గీరాజాకు సంయుక్తంగా లేఖ రాశారు. అధికారికంగా దిగ్విజయ్ అపాయింట్మెంట్ ఖరారు కానప్పటికీ, ఆయనకు అందుబాటులో ఉండేందుకు ఎమ్మెల్యేలు శంకర్రావు, రాజిరెడ్డి ఇప్పటికే అక్కడ మకాంవేశారు.
మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, ఆకుల రాజేందర్ కూడా శుక్రవారం రాత్రి దేశ రాజధానికి పయనమయ్యారు. కాగా, రంగారెడ్డి జిల్లాలో పార్టీ వ్యవహారాలు, మల్కాజిగిరి పార్లమెంటరీ సీటు పరిధిలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పార్టీ పరిస్థితిని తమతో చర్చిస్తామని లేఖలో పేర్కొన్నప్పటికీ, కేంద్రమంత్రి సర్వేపై ఫిర్యాదు చేసే అంశమే ప్రధానంగా కనిపిస్తోంది.
కొన్నాళ్లుగా సర్వేపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఎమ్మెల్యేలు... ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన కు ఈసారి లోక్సభ టికెట్ రాకుం డా ప్రయత్నించాలనే నిర్ణయానికి వచ్చారు. అవినీతి, గ్రూపు రాజకీయాలను కేంద్రమంత్రి ప్రోత్సహిస్తున్నట్లు ఎమ్మెల్యేలు కొంతకాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. స్థానికంగా ఆయనపై ఉన్న వ్యతిరేకత కూడా తమ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపుతుందనే భయం వీరిలో నెలకొంది.
సర్వే’పై ఫిర్యాదాస్త్రం
Published Sat, Jan 25 2014 3:43 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement