
జెరూసలేం: కోవిడ్-19(కరోనా వైరస్) రక్కసి ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది. మనుషుల ప్రాణాలను హరించుకుపోతున్న దీని నివారణకు మందు కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు తలమునకలయ్యారు. ఇదిలా ఉండగా ‘చికిత్స కన్నా నివారణ మేలు’ అన్న విధానాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమీన్ నెతన్యాహు అవలంభిస్తున్నారు. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దేశప్రజలకు సూచనలిచ్చారు. ఆయన తాజాగా కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి, వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాముఖంగా మాట్లాడుతూ దేశ ప్రజలు షేక్హ్యాండ్ ఇవ్వడం మానుకోవాలని కోరారు. దానికి బదులుగా భారతీయ సంప్రదాయ పద్ధతిలో నమస్తే చెప్పుకోవాలని కోరారు. (అప్పుట్లోనే ‘కరోనా’ను ఊహించారా?)
రెండు చేతులను జోడించి నమస్కారం ఎలా పెట్టాలో కూడా చూపించారు. భారతీయ విధానంలోనే ఇతరులను పలకరించాలని, లేకపోతే షాలోమ్(హాయ్) చెప్పినా సరిపోతుందన్నారు. కానీ షేక్హ్యాండ్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వకండని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్లో ఇప్పటివరకు 15 మంది కరోనా బారిన పడగా, భారత్లో 28 కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మూడువేల మంది దీనివల్ల ప్రాణాలు కోల్పోగా 90వేల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కాగా కరోనా మహమ్మారి గాలి ద్వారా సులువుగా ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించి వెళ్లాలని, అలాగే వ్యక్తిగత శుభ్రతతోపాటు, తరచూ చేతులు సబ్బుతో కడుక్కోవాలని సూచిస్తున్నారు. (దేశం కోసం గాయపడ్డాను: నెతన్యాహు భావోద్వేగం)