
ఏడాది పాటు కంప్యూటర్లకు ఇంటర్నెట్ బంద్
ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు నిలిపి వేయాలని సింగపూర్ ప్రభుత్వం నిర్ణయించింది.
సింగపూర్: ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్లకు ఇంటర్నెట్ సేవలు నిలిపి వేయాలని సింగపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. భద్రతా కారణాలతో ఏడాది పాటు ఇంటర్నెట్ నిలిపి వేయాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. దీనివల్ల ప్రభుత్వ కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగబోదని ఇన్ఫోకామ్ డెవలప్ మెంట్ ఆథారిటీ(ఐడీఏ) వెల్లడించినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఈ నిర్ణయంతో లక్ష కంప్యూటర్లపై ప్రభావం చూపనుంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో కొంతమందిని ఎంచుకుని వారికి మాత్రమే ప్రత్యేకంగా ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తామని ఎఎప్ఫీకి లిఖితపూర్వకంగా ఐడీఏ వెల్లడించింది. సైబర్ దాడులను నిలువరించేందుకు, అనవసరమైన ఈ-మెయిల్స్ ప్రభుత్వ కార్యాలయ కంప్యూటర్లలోకి చొరబడకుండా చూడాలన్న ఉద్దేశంతో సింగపూర్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల్లో సింగపూర్ ఒకటి. ఆన్లైన్ ద్వారా పలు సేవలు అందిస్తోంది.
ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లకు ఇంటర్నెట్ నిలిపివేసినా ఆన్లైన్ సేవలకు ఎటువంటి అంతరాయం కలగదని అధికార వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వ అధికారులు వ్యక్తిగత టాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ తో కనెక్ట్ అవుతారని వెల్లడించాయి. 2014లో ప్రధానమంత్రి వెబ్ సైట్, అధ్యక్షుడి నివాస వెబ్ సైట్ పై సైబర్ దాడులు జరగడంతో ఐటీ సెక్యురిటీని సింగపూర్ మరింత కట్టుదిట్టం చేసింది.