
గొల్లపూడి పార్థీవదేహానికి నివాళులర్పించిన చిరంజీవి, సుహాసిని
సాక్షి, చెన్నై: ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు భౌతికకాయాన్ని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ఆయన స్వగృహానికి తరలించారు. ప్రముఖుల, అభిమానులు సందర్శనార్థం గొల్లపూడి పార్థీవదేహాన్ని టీనగర్లోని ఆయన నివాసంలో ఉంచనున్నారు. గొల్లపూడి అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు కన్నమ్మపేట దహనవాటికలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అదేరోజు ఉదయం టీనగర్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుందని వారు చెప్పారు.
చిరంజీవి, సుహాసిని నివాళి
గొల్లపూడి మారుతీరావు భౌతికకాయానికి హీరో చిరంజీవి నివాళులర్పించారు. చెన్నై టీనగర్లోని శారదాంబల్లోని ఆయన నివాసానికి వెళ్లిన చిరంజీవి.. గొల్లపూడి పార్థీవదేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. చిరంజీవితో పటు సినీనటి సుహాసిని సహా పలువురు ప్రముఖులు గొల్లపూడికి నివాళులర్పించారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి మారుతీరావు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఇంట్లో రామయ్య- వీధిలో క్రిష్ణయ్య సినిమాతో ఆయన నటుడిగా పరిచయం అయ్యారు. దాదాపు 250 సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, నవలలు, కథలు రాసేవారు. డాక్టర్ చక్రవర్తి సినిమాతో రచయితగా సినిమాలోకానికి పరిచయం అయ్యారు. వినూత్న విలనిజానికి ఆయన పెట్టింది పేరు. రచయితగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా ఇలా అన్ని కోణాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
చదవండి:
గొల్లపూడి నాకు క్లాస్లు తీసుకున్నారు
సాహితీ శిఖరం.. కళల కెరటం..