
ఢిల్లీలో లిక్కర్ షాపుల మూసివేత మేలంటున్న బీజేపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మద్యం దుకాణాలు తెరవడంపై పునరాలోచించాలని ఢిల్లీ బీజేపీ నేతలు ఆప్ ప్రభుత్వాన్ని కోరారు. మద్యం షాపులతో కోవిడ్-19 కేసులు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం దుకాణాలను ఢిల్లీ ప్రభుత్వం అనుమతించడాన్ని అసెంబ్లీలో విపక్ష నేత రాంవీర్ సింగ్ బిధూరీ విమర్శించారు. ఈ నిర్ణయంతో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 10 శాతం వరకూ పెరుగుతాయని అన్నారు.
మార్చి 23న ఢిల్లీలో లాక్డౌన్ అమలైన తర్వాత తొలిసారిగా ఢిల్లీలో 150 ప్రభుత్వ మద్యం దుకాణాలు సోమవారం తెరుచుకున్నాయి. లిక్కర్ షాపుల ఎదుట 1 కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకూ మద్యం ప్రియులు క్యూ కట్టారు. పలుచోట్ల ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడంతో ఆయా మద్యం షాపులను అధికారులు మూసివేసిన సంగతి తెలిసిందే. లిక్కర్ షాపులను తెరవడంపై పునరాలోచించాలని ఢిల్లీ బీజేపీ ప్రతినిధి ప్రవీణ్ శంకర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పోలీస్ కమిషనర్ ఏకే శ్రీవాస్తవలకు విజ్ఞప్తి చేశారు.