
న్యూఢిల్లీ: జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) బిల్లుకు వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) 12 గంటల పాటు రోజువారీ విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. ఆందోళనలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఆస్పత్రుల్లో ఔట్పేషంట్ సేవల్ని నిలిపివేయనున్నారు. అత్యవసర వైద్యసేవలు కొనసాగుతాయి.
ఐఎంఏ పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో నేడు ఔట్పేషంట్ సేవలు నిలిచిపోనున్నాయి. ఐఎంఏ స్థానంలో జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటుకు కేంద్రం పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. హోమియో, ఆయుర్వేద కోర్సులు చేసిన డాక్టర్లను ఓ బ్రిడ్జి కోర్సు చేశాక ఆధునిక వైద్యం చేపట్టేందుకు అనుమతించాలన్న నిబంధన చేర్చారు. బిల్లు కారణంగా వైద్యరంగంతో సంబంధం లేనివారికి వైద్యులు జవాబుదారీగా ఉండాల్సి వస్తోందని ఐఎంఏ ఆరోపించింది.