National Medical Commission
-
నీట్ యూజీ–2025 పెన్,పేపర్తోనే..
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: పేపర్ లీకేజీలు, ఇతర వివాదాల నేపథ్యంలో నీట్ యూజీ–2025పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక ప్రకటన చేసింది. దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ –2025 పరీక్షను ఆఫ్లైన్ మోడ్లో అంటే పెన్, పేపర్ (ఓఎంఆర్ విధానం) పద్ధతిలో నిర్వహించనున్నట్లు గురువారం ప్రకటించింది. పేపర్ లీక్, ఇతర అక్రమాలను నిరోధించేందుకు ఈసారి దేశవ్యాప్తంగా ‘ఒకే రోజు– ఒకే షిఫ్టు’లో ఈ పరీక్షను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఖరా రు చేసిన మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఎంబీబీఎస్తోపాటు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్ కోర్సులకు యూనిఫామ్ నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. నీట్ యూజీ ఫలితాల ఆధారంగా నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి కింద బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో అడ్మి షన్లు నిర్వహిస్తారు. దీంతోపాటు సాయుధ దళాలకు వైద్య సేవలందించే ఆసుపత్రుల్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో చేరాలనుకునే మిలిటరీ నర్సింగ్ సర్వీస్ అభ్యర్థులు కూడా నీట్ అర్హత సాధించాల్సి ఉంటుంది. నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సుకూ నీట్ యూజీ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని ఎన్టీఏ తెలిపింది. ఆన్లైన్ పరీక్షపై మల్లగుల్లాలు గత సంవత్సరం నీట్–2024లో చోటు చేసుకున్న లీక్ వ్యవహారాల నేపథ్యంలో నీట్ యూజీ– 2025ని జేఈఈ మెయిన్ తరహాలో ఆన్లైన్ విధానంలో నిర్వహించాలనే డిమాండ్లు వచ్చాయి. దీంతో ఎన్టీఏ నిర్వహించే పరీక్షల్లో పారదర్శకతను పెంచే సూచనలు చేసేందుకు ఇస్రో మాజీ చైర్మన్ ఆర్ రాధాకృష్ణన్ నేతృత్వంలో కేంద్రం ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విస్తృత సమాలోచనలు జరిపి ‘మల్టీ సెషన్ టెస్టింగ్, మల్టీ స్టేజ్ టెస్టింగ్ ’విధానంలో నీట్ను.. ‘మల్టిట్యూడ్ సబ్జెక్ట్ స్టీమ్స్’విధానంలో ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) పరీక్షలను నిర్వ హించాలంది. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయి ల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపింది. తాజాగా కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు జరిపిన చర్చల్లో పాత ఓఎంఆర్ పద్ధతికే మొగ్గుచూపుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అవకతవకలకు ఆస్కారం లేకుండా ఒకే రోజు– ఒకే షిఫ్టు విధానాన్ని అవలంబించాలని నిర్ణయించారు. ‘నీట్ యూజీ–2025ని ఆన్లైన్లో నిర్వహించాలా? పెన్, పేపర్ పద్ధతిలో నిర్వహించాలా? అనే అంశంపై కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు చర్చించాయి. ఆ తర్వాతే ఈ పరీక్షను ఓఎంఆర్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించాం. ఎన్ఎంసీ నిర్ణయం ప్రకారం, నీట్–యూజీ–2025ని పెన్, పేపర్ పద్ధతిలోనే నిర్వహిస్తాం. ఒకే రోజు, ఒకే షిఫ్టులో పరీక్ష ఉంటుంది’అని ఎన్టీఏ వర్గాలు చెప్పాయి.దేశంలోనే అతిపెద్ద పరీక్ష దేశంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షగా నీట్కు పేరుంది. 2024లో ఏకంగా 24 లక్షల మందికిపైగా ఈ పరీక్ష రాశారు. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లోని దాదాపు 1.08 లక్షల ఎంబీబీఎస్ సీట్ల భర్తీ కోసం ఏటా నీట్ పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఇందులో దాదాపు 56 వేల సీట్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉన్నాయి. నీట్లో సాధించే మార్కుల ఆధారంగా విద్యార్థులకు వివిధ కోర్సుల్లోనూ ప్రవేశాలు లభిస్తాయి.ఆధార్ ఆథెంటికేషన్ తప్పనిసరి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ కోసం మొబైల్ నంబర్తోపాటు ఆధార్ను లింక్ చేయాలని ఎన్టీఏ గతంలో కోరింది. అభ్య ర్థులు తమ పదోతరగతి సర్టిఫికెట్ ప్రకారం ఆధార్ క్రెడెన్షియల్స్ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సరళమైన దరఖాస్తు ప్రక్రియ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. ఆధార్లోని ఫేస్ అథెంటికేషన్ పద్ధతి వల్ల అభ్యర్థుల గుర్తింపు వేగవంతం, సులభతరమవుతుందని వెల్లడించింది. దీనివల్ల ప్రవేశ పరీక్షలోని అన్ని ప్రక్రియలు సునాయాసంగా పూర్తవుతాయని తెలిపింది. నీట్ యూజీ–2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. సిలబస్ను ఇప్పటికే అధికారిక వెబ్సైట్లో ఉంచారు. -
వైద్యం.. వైవిధ్యం..
మనకు అనారోగ్యం వస్తే.. వైద్యులను ఆశ్రయిస్తాం. మరి అలాంటి వైద్యులే అనారోగ్యం పాలైతే? ఒక వైద్యుడు ఆరోగ్యంగా ఉంటే వందలాది మంది రోగులకు ఆరోగ్యాన్ని అందిస్తాడు. ప్రాణాపాయం నుంచి తప్పిస్తాడు. అందుకే వైద్యుల ఆరోగ్యం అత్యంత విలువైనది. అయితే దురదృష్టవశాత్తూ ప్రజల్ని అనారోగ్యాల నుంచి విముక్తం చేయాల్సిన వైద్యులే తరచూ అనారోగ్యాలకు గురవుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు/ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఆస్పత్రి ప్రాంగణంలో జిమ్ అనే కొత్త సంప్రదాయం ఊపిరి పోసుకుంది. ఈ నేపథ్యంలో దీని గురించి మరిన్ని వివరాలు.. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ) ప్రకారం.. దేశంలో వైద్యులు, జనాభా నిష్పత్తి 1:854 కావడంతో తీవ్ర పని ఒత్తిడి తప్పడం లేదు. దీంతో పాటే అనేక రకాల ఇతరత్రా పరిస్థితులు సైతం వైద్యులను రోగులుగా మారుస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో వైద్యులు/ ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్యాల అంశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే వైద్య రంగంలో రకరకాల మార్పు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగమే ఆస్పత్రుల్లో వ్యాయామ కేంద్రాలు. ఇప్పటి దాకా పలు దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న హాస్పిటల్ జిమ్స్.. ఇప్పుడిప్పుడే మన నగరంలోనూ అందుబాటులోకి వస్తున్నాయి.ఆస్పత్రిలో జిమ్.. అంత ఈజీ కాదు.. నిజానికి కరోనా సమయంలో ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో రద్దీ, బెడ్స్ లేకపోవడం వంటివి అనేక మంది మరణాలకు కారణమవడం అందరికీ తెలిసిందే. మరోవైపు అత్యంత వ్యాపారాత్మక ధోరణిలో నడుస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు తమ వైద్యుల కోసం ఆస్పత్రిలో అత్యంత విలువైన స్థలాన్ని జిమ్కు కేటాయించడం అంత సులభం కాదు కాబట్టి.. ఈ తరహా ట్రెండ్కు శ్రీకారం చుట్టిన ఆస్పత్రివైపు అందరూ అశ్చర్యంగా, అభినందనపూర్వకంగా చూస్తున్నారు. ఒత్తిడిని జయించేందుకు.. ఆస్పత్రి ఆవరణలో జిమ్ ఉండడం అనేక రకాలుగా ప్రయోజనకరం అంటున్నారు పలువురు వైద్యులు. ముఖ్యంగా క్లిష్టమైన కేసుల్ని డీల్ చేయడం, ఆపరేషన్లు వంటివి చేసిన తరువాత కలిగే ఒత్తిడి నుంచి రిలాక్స్ అవడానికి ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల కావడానికి సంగీతం నేపథ్యంలో సాగే వర్కవుట్స్ వీలు కల్పిస్తాయని అంటున్నారు. అంతేకాకుండా గంటల తరబడి ఎక్కువ సమయం ఆస్పత్రిలో గడపాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా జిమ్ అందుబాటులో ఉండడం వల్ల మేలు కలుగుతుందని అంటున్నారు.సిబ్బందికి ఉపయుక్తం.. ఒక పెద్ద కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యుల కంటే నర్సులు, అసిస్టెంట్ స్టాఫ్.. ఇతరత్రా సిబ్బంది ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వైద్యుల కన్నా రోగులతో అత్యధిక సమయం గడిపే వీరి ఆరోగ్యం కాపాడుకోడం చాలా ప్రధానమైన విషయమే. వీరి పనివేళలు సుదీర్ఘంగా ఉన్నా చెప్పుకోదగ్గ ఆదాయం ఉండని, ఈ దిగువ స్థాయి సిబ్బందికి నెలవారీ వేల రూపాయలు చెల్లించి జిమ్స్కు వెళ్లే స్థోమత ఉండదు. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రి ఆవరణలోనే జిమ్ ఉండడం, ఉచితంగా వ్యాయామం చేసుకునే వీలు వల్ల వీరికి వెసులుబాటు కలుగుతోంది. అరుదుగా కొందరు రోగులకు సైతం ప్రత్యేక వ్యాయామాలు అవసరమైనప్పుడు ఈ తరహా జిమ్స్ ఉపయుక్తంగా ఉంటాయి.లాభనష్టాల బేరీజు లేకుండా.. ఆస్పత్రుల్లో జిమ్స్ అనేది విదేశాల్లో కామన్. నేను సింగపూర్లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నప్పుడు అక్కడ టాప్ ఫ్లోర్లో జిమ్ ఉండేది. అక్కడ నేను వర్కవుట్ చేసేవాడిని. ఏ సమయంలోనైనా ఆస్పత్రికి చెందిన వారు వెళ్లి అక్కడ వర్కవుట్ చేయవచ్చు. హౌస్ కీపింగ్ స్టాఫ్ నుంచి డాక్టర్స్ వరకూ ఎవరైనా వర్కవుట్ చేసేందుకు వీలుగా జిమ్ ఉండడం నాకు చాలా నచి్చంది. అదే కాన్సెప్ట్ నగరంలో తీసుకురావాలని అనుకున్నా. సిటీలో ఆస్పత్రి నెలకొలి్పనప్పుడు మా హాస్పిటల్లోనే దాదాపు రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24/7 పనిచేసే జిమ్ను నెలకొల్పాం. లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా దీన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు మా ఆస్పత్రిలోని అన్ని స్థాయిల సిబ్బందీ ఈ జిమ్ను వినియోగించుకుంటున్నారు. – డా.కిషోర్రెడ్డి, ఎండీ, అమోర్ హాస్పిటల్స్ -
ప్రైవేట్ వైద్య‘మిథ్య’
తనిఖీల్లో ఏం తేలింది..? పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 50% వరకు అధ్యాపకులు లేరు. ఓ కాలేజీలో 50.47%, మరో కాలేజీలో 59.3% మేరకు కొరత ఉంది. ఒక కాలేజీలో రెసిడెంట్లు, ట్యూటర్ల కొరత 66.31% వరకు ఉంది. 150 మంది విద్యార్థులుండే కాలేజీ అనుబంధ ఆసు పత్రిలో రోజూ 1,200 మంది ఓపీ ఉండాలి. ఒక చోట 849, మరో చోట 650 మందే వస్తున్నారు. ఓ కాలేజీ ఆసుపత్రిలో 650కి 542 పడకలే ఉన్నాయి. రెండు కాలేజీల ఆసుపత్రుల్లో బెడ్ ఆక్యుపెన్సీ 9.38%, 11.97% చొప్పునే ఉంది. పలుచోట్ల లెక్చర్ హాళ్లు, పరీక్షా కేంద్రాలు సరిపడా లేవు. ఒకే ప్రొఫెసర్ను రెండు కాలేజీల్లో చూపించారు.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కొన్ని కళాశాలల్లో ఉండాల్సిన సంఖ్యలో సగం మంది కూడా లేరు. మరోవైపు విద్యార్థులకు అవసరమైన స్థాయిలో మౌలిక సదుపాయాలు కూడా లేవు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఇటీవలి తనిఖీల్లో ఈ అంశాలు బహిర్గతమయ్యాయి. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫె సర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తగిన సంఖ్యలో లేకపోవడం, ల్యాబ్ల వంటి మౌలిక వసతుల కొరతతో అనేక ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య అత్యంత నాసిరకంగా తయారవుతోందనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఆయా కాలేజీల్లో వైద్య విద్య పూర్తి చేసుకున్న చాలామంది తగిన సామర్థ్యం, నైపుణ్యం లేక వృత్తిలో రాణించలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండేళ్ల క్రితం మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో లేనందుకు విద్యార్థుల అడ్మిషన్లను కమిషన్ రద్దు చేసింది. తర్వాత వారిని ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేసింది. ఎన్ఎంసీ కఠిన చర్యలు తీసుకుంటున్నా, చాలా మెడికల్ కాలేజీలు ఇప్పటికీ అధ్యాపకులను నియమించుకోవడంలో, మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబడే ఉంటున్నాయని, వైద్య విద్యపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆసక్తిని సొమ్ము చేసుకుంటున్న కాలేజీలు నాణ్యమైన విద్య అందించడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏ కాలేజీ..ఎలా ఉండాలి: ఎంబీబీఎస్ సీట్లు 150 ఉన్న మెడికల్ కాలేజీలో 600 పడకలు ఉండాలి. 116 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 76 మంది రెసిడెంట్లు ఉండాలి. ఐదు పడకల ఐసీయూ, పీఐసీయూ వేర్వేరుగా ఉండాలి. ఫిజికల్ మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. స్కిల్ లేబొరేటరీ ఉండాలి. ఇలా ఉన్న సీట్లను బట్టి బోధనా సిబ్బంది, వసతులు ఉండాలి. అన్ని మెడికల్ కాలేజీల్లో తప్పనిసరిగా ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేసే లేబొరేటరీ ఉండాలి. లైబ్రరీలో 4,500 పుస్తకాలుండాలి. అదే 100 సీట్లున్న మెడికల్ కాలేజీ అయితే 3 వేల పుస్తకాలు, 200 సీట్లుంటే 6 వేలు, 250 సీట్లయితే 7 వేల పుస్తకాలు ఉండాలి. లైబ్రరీ వైశాల్యం కూడా సీట్ల సంఖ్యకు అనుగుణంగా ఉండాలి. 150 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు చదివే మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రికి రోజుకు 1,200 మంది ఔట్ పేషెంట్లు అవసరం. ఆ మేరకు తప్పనిసరిగా రోగులు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇలాంటి అనేక వసతులు సరిగ్గా లేకుండానే, బోధనా సిబ్బంది తగిన సంఖ్యలో లేకుండానే నడుస్తున్నట్లు తేలింది. తనిఖీల సమయంలో ‘సర్దుబాట్లు’ రాష్ట్రంలో మొత్తం 64 మెడికల్ కాలేజీలున్నాయి. అందులో 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాగా, 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొత్తం 4,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. కాగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు, రోగుల వివరాలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. వసతులు లేవని విద్యార్థులు బయటకు చెప్పలేని పరిస్థితి ఉందని, ఒకవేళ అలా చెబితే, నిరసన వ్యక్తం చేస్తే ప్రాక్టికల్స్లో తక్కువ మార్కులు వేస్తారన్న భయం వారిలో ఉంటోందని చెబుతున్నారు. కాగా ఎన్ఎంసీ తనిఖీలకు వచ్చే సమయానికి కాలేజీలు సర్దుబాట్లు చేస్తున్నాయి. నకిలీ బోధనా సిబ్బందితో ప్రైవేటు యాజమాన్యాలు నెట్టుకొస్తున్నాయి. అనేక కాలేజీలు సింథటిక్ బయోమెట్రిక్ ద్వారా ఒకరికి బదులు మరొకరితో హాజరు నమోదు చేయిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. -
వైద్య విద్య కల ఛిద్రం.. ఇక ప్రైవేట్ ‘మెడిసిన్’!
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్య కలలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిధ్రం చేసింది. ‘పీ 4’ జపం చేస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టే కుట్రకు తెర తీసింది. అందులో భాగంగానే ఐదు ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నుంచి అనుమతులు రాకుండా తాజాగా అడ్డుపడింది. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభమైతే తమకు వైద్య విద్య చదివే అవకాశం లభిస్తుందని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు కూటమి సర్కారు వెన్నుపోటు పొడిచింది. దీంతో ఈ ఒక్క ఏడాదే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్రం కోల్పోయింది. సాధారణంగా ముఖ్యమంత్రులంతా కొత్తగా వైద్య కళాశాలలకు అనుమతులు రాబట్టి విద్యార్థులకు అదనంగా ఎంబీబీఎస్ సీట్లు సమకూర్చడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటారు. ఇందుకు భిన్నంగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనట్లుగా.. ఎన్ఎంసీ సీట్లు ఇస్తామన్నప్పటికీ మాకు వద్దని రాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాసిన దుస్థితి చంద్రబాబు పాలనలో ఏపీలో నెలకొంది. గత ప్రభుత్వం తలపెట్టిన 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను గుజరాత్ పీపీపీ మోడల్లో ప్రైవేట్కు కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఐదు వైద్య కళాశాలలకు కుట్రపూరితంగా ప్రభుత్వమే పొగ పెట్టింది. మరోవైపు వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు వైద్య కళాశాలల నిర్మాణ పనులను ఇప్పటికే ప్రభుత్వం అటకెక్కించింది. వీటి ద్వారా వచ్చే ఏడాది అందుబాటులోకి రావాల్సిన వెయ్యికి పైగా ఎంబీబీఎస్ సీట్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు మెరుగుపడటంతోపాటు పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువలో అందుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రతి పార్లమెంట్ నియోజక వర్గానికి ఒక మెడికల్ కాలేజీని నెలకొల్పాలని గత ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే మరింత మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలు అందుబాటులోకి వస్తాయి. బోధనాస్పత్రులకు వచ్చే రోగులకు సులభంగా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి. తద్వారా పోటీతత్వం పెరిగి ప్రైవేట్ రంగంలో కూడా వైద్య చికిత్స వ్యయం తగ్గుతుంది. అయితే ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన కూటమి సర్కారు ప్రైవేట్ పాట పాడుతోంది.సర్వం సిద్ధం చేసినా ససేమిరా..2024–25 విద్యా సంవత్సరం నుంచి మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, ఆదోని, పాడేరు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లు ప్రారంభించేలా వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్ కృషి చేశారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా ఐదు చోట్ల బోధనాస్పత్రులను అభివృద్ధి చేశారు. కళాశాల, బోధనాస్పత్రుల్లో అవసరమైన పోస్టులను మంజూరు చేసి ఎన్నికలు ముగిసే నాటికి 70–80 శాతం పోస్టుల భర్తీ చేపట్టారు. తొలి ఏడాది తరగతులు ప్రారంభించడానికి వీలుగా కళాశాలలో సెమినార్ హాల్, ల్యాబొరేటరీ, లైబ్రరీ, హాస్టళ్ల నిర్మాణాలు 80 శాతం పూర్తి అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిని ప్రైవేట్పరం చేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు సాధించకుండా పొగ పెట్టింది.వద్దని ప్రభుత్వమే లేఖ..కొత్త కాలేజీల్లో తొలి విడత తనిఖీల అనంతరం ఐదు చోట్ల స్వల్పంగా వనరుల కొరత ఉందని పేర్కొంటూ ఎన్ఎంసీ అనుమతులు నిరాకరించింది. ఎన్ఎంసీ గుర్తించిన అంశాలను మెరుగు పరచడానికి ఏమాత్రం చర్యలు తీసుకోకుండానే మొక్కుబడిగా చంద్రబాబు ప్రభుత్వం అప్పీల్కు వెళ్లింది. అయినప్పటికీ గత ప్రభుత్వం కల్పించిన వసతుల ఆధారంగానే పులివెందుల వైద్య కళాశాలకు 50 సీట్లను మంజూరు చేస్తూ ఈ నెల 6వ తేదీన ఎన్ఎంసీ లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్ఓపీ) ఇచ్చింది. అయితే ఈ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి ఆ 50 సీట్లతో కళాశాలలను ప్రారంభించేందుకు మనస్కరించలేదు. దీంతో 50 సీట్లు మంజూరు చేసినప్పటికీ కళాశాలలో మేం వసతులు కల్పించలేమని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే ఎన్ఎంసీకి లేఖ రాసింది. ఫలితంగా చేసేదేమీ లేక 50 సీట్లతో ఇచ్చిన ఎల్ఓపీని విత్డ్రా చేసినట్టు ఎన్ఎంసీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు అనుమతులు రద్దు చేసినట్టు స్పష్టం చేసింది.ఉసూరుమన్న విద్యార్థులు, తల్లిదండ్రులుపులివెందుల కాలేజీకి 50 సీట్లు మంజూరు చేసినట్లు ఎన్ఎంసీ ప్రకటించిన అనంతరం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కన్వీనర్ కోటా ఆప్షన్ల నమోదు గడువును పొడిగించింది. బుధవారం (11వ తేదీ) రాత్రితో గడువు ముగిసింది. దీంతో కొత్తగా మంజూరైన పులివెందుల కాలేజీలో ప్రవేశాలు పొందవచ్చని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశ పడ్డారు. అయితే ఆ కళాశాల ఆప్షన్లలో కనిపించకపోవడంతో ఉసూరుమన్నారు.అండర్ టేకింగ్ ఇచ్చి ఉంటే..సాధారణంగా వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ తొలి విడత తనిఖీల అనంతరం వసతుల కొరత ఉంటే అనుమతులివ్వదు. ఆ లోపాలను సవరించుకుని అప్పీల్కు వెళితే రెండో విడత తనిఖీలు చేసి అనుమతులిస్తారు. అదే ప్రభుత్వ కళాశాలలైతే తరగతులు ప్రారంభం అయ్యే నాటికి వసతుల కల్పన చేపడతామని ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇస్తే ఎన్ఎంసీ ఎల్ఓపీ ఇచ్చేస్తుంది. గతేడాది నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం వైద్య కళాశాలలకు అండర్ టేకింగ్ ఇచ్చి వంద శాతం సీట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం రాబట్టింది. అదే తరహాలో ప్రస్తుతం కూటమి సర్కారు కూడా అండర్ టేకింగ్ ఇచ్చి ఉంటే వంద శాతం సీట్లకు అనుమతులు లభించి ఉండేవన్న అభిప్రాయం వైద్య వర్గాల్లో వ్యక్తం అవుతోంది. నిర్మాణాల నిలుపుదలప్రై వేట్పరం చేయడంలో భాగంగా నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలను సైతం కూటమి సర్కారు నిలిపివేసింది. ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఐదు కళాశాలలతో పాటు వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు కళాశాలల నిర్మాణం కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వం పీపీపీ విధానంలో ముందుకు వెళ్లనుందని, అందువల్ల నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో ఆదోని, పెనుకొండ కళాశాలల నిర్మాణం ఎక్కడికక్కడే నిలిపివేయాలని కర్నూలు సర్కిల్ ఏపీఎంఎస్ఐడీసీ ఎస్ఈ లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇచ్చారు. వందేళ్ల చరిత్రలో తొలిసారిగా..2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో ఒకేసారి 17 వైద్య కళాశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను గతేడాది ప్రారంభించి అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలు కల్పించింది. 1923లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2023 వరకు రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు.మోసం చేశారు..నీట్ యూజీలో నేను 593, నా సోదరి 555 స్కోర్ చేశాం. గతేడాదితో పోలిస్తే కటాఫ్లు ఎక్కువగా ఉన్నాయి. రెండేళ్లు లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకున్నా సీట్ రావడం కష్టంగా ఉంది. గతేడాది ఏపీకి అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. ఈసారి కూడా 750 సీట్లు అదనంగా వస్తే వైద్య విద్య అవకాశాలు పెరిగి మా కల నెరవేరుతుందని భావించాం. కానీ కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు రాలేదు. పులివెందుల కాలేజీకి 50 సీట్లతో అనుమతులు వచ్చాయని ఎన్ఎంసీ ప్రకటించినా కౌన్సెలింగ్లో చూపించడం లేదు. దీనివల్ల నాలాంటి ఎందరో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొత్త కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ మాట నిలబెట్టుకోకుండా మమ్మల్ని మోసం చేసింది.– నల్లగట్ల సుధీష్ రెడ్డి, రాజంపేట, అన్నమయ్య జిల్లా -
కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు 112 దరఖాస్తులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా 2024–25 విద్యా సంవత్సరంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు సంబంధించిన దరఖాస్తులను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పరిశీలించింది. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు కోసం 112, ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు 58 దరఖాస్తులు వచి్చనట్టు వెల్లడించింది. కాగా, ఏపీలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు ఐదు దరఖాస్తులు అందినట్టు తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.8 వేల కోట్లకు పైగా వ్యయంతో రాష్ట్రంలో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను 2023–24 విద్యా సంవత్సరంలో ప్రారంభించింది. ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లను విద్యార్థులకు అందుబాటులోకి తెచి్చంది. కాగా వచ్చే విద్యా సంవత్సరం (2024–25)లో పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పాడేరుల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు వైద్య శాఖ దరఖాస్తు చేసింది. అలాగే మరో ఏడు వైద్య కళాశాలలను 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించడానికి వీలుగా బోధనాస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మొత్తం 17 వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మన విద్యార్థులకు 2,550 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెస్తోంది. తద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందని ద్రాక్షగా ఉన్న వైద్య విద్యను వారికి చేరువ చేస్తోంది. ఐదు దశల్లో అనుమతుల ప్రక్రియ కొత్త కళాశాలలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను ఎన్ఎంసీ ఐదు దశల్లో చేపడుతోంది. తొలి దశలో దరఖాస్తుల పరిశీలన అనంతరం నిబంధనల ప్రకారం ధ్రువపత్రాలు సమరి్పంచని, బోధనాస్పత్రుల్లో పడకలు, ఫ్యాకలీ్ట, ఇతర అంశాల్లో లోటుపాట్లు ఉన్న కళాశాలలకు నోటీసులు జారీ చేస్తోంది. వివరణ ఇవ్వడానికి కళాశాలలకు గడువు విధించింది. ఈ ప్రక్రియ ముగిశాక రెండో దశలో ఫ్యాకల్టీ ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్) నమోదు చేపట్టనుంది. ఈ రెండు దశల ప్రక్రియ ముగియడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉంది. అనంతరం మూడో దశలో కళాశాలలు, బోధనాస్పత్రుల్లో ఎన్ఎంసీ తనిఖీలు చేపట్టనుంది. నాలుగో దశలో కళాశాలలపై సమీక్ష చేపడుతుంది. ఐదో దశలో అనుమతులు జారీ చేస్తుంది. -
ఎంబీబీఎస్ విద్యార్థులకు స్టైపెండ్ చెల్లించండి
న్యూఢిల్లీ: దేశంలో 70 శాతం వైద్య కళాశాలలు ఎంబీబీఎస్ విద్యార్థులకు సక్రమంగా స్టైపెండ్ చెల్లించకపోవడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత జరుగుతున్నా జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ఏం చేస్తోందని నిలదీసింది. స్టైపెండ్ చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీ విద్యార్థుల నుంచి భారీగా డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేస్తుంటాయని పేర్కొంది. ఎంబీబీఎస్ విద్యార్థులు నిర్బంధ కారి్మకులు కాదని తేలి్చచెప్పింది. వారికి తక్షణమే స్టైపెండ్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఎన్ఎంసీని ఆదేశించింది. -
భారతీయ వైద్య విద్యార్థులకు గుడ్న్యూస్
న్యూఢిల్లీ: భారతీయ వైద్య విద్యార్థులకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ గుడ్ న్యూస్ అందించింది. ఇకపై భారత్లో మెడికల్ గ్రాడ్యూయేట్ పూర్తి చేసిన విద్యార్థులు విదేశాల్లో కూడా ప్రాక్టిస్ చేయోచ్చని పేర్కొంది. ఈ మేరకు రల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యూకేషనల్ (WFME) నుంచి జాతీయ వైద్య మండలి (NMC) పది సంవత్సరాల వరకు గుర్తింపు పొందింనట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ గుర్తింపుతో భారత్లో వైద్య విద్యనభ్యసించిన వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్లలో పీజీ కోర్సుల్లో చేరడంతో పాటు ప్రాక్టీస్ చేయవచ్చు. 2024 నుంచి భారతీయ వైద్య విద్యార్థులు విదేశాల్లో విద్య, ప్రాక్టీస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెసులుబాటుతో ఇప్పటికే దేశంలో ఉన్న 706 మెడికల్ కాలేజీలతోపాటు రాబోయే 10 ఏళ్లలో కొత్తగా ఏర్పాటు చేయబోయే కళాశాలలు డబ్ల్యూఎఫ్ఎమ్ఈ గుర్తింపు పొందనున్నాయి. దీని వల్ల దేశంలో వైద్య విద్య ప్రమాణాలు మెరుపడటమే కాకుండా భారతీయ వైద్య విద్యార్థులకు ప్రపంచ వ్యాప్తంగా అపార అవకాశాలు లభించనున్నాయి ఈ సందర్భంగా ఎన్ఎమ్సీలోని ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు సభ్యుడు యోగేందర్ మాలిక్ మాట్లాడుతూ.. WFME గుర్తింపుతో భారతీయ వైద్య విద్య అంతార్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. దీనివల్ల భారతీయ వైద్య కళాశాలలకు, నిపుణులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా తమ కెరీన్ను కొనసాగించవచ్చని తెలిపారు. ఎన్ఎమ్సీ అంతర్జాయంగా గుర్తింపు పొందడం ద్వారా విదేశీ విద్యార్థులను భారత వైద్య కళాశాలు ఆకర్షిస్తాయని చెప్పారు. కాగా డబ్ల్యూఎఫ్ఎమ్ఈ అనేది ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన వైద్య విధ్యను అందించేందుకు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సంస్థ. డబ్ల్యూఎఫ్ఎమ్ఈ గుర్తింపు ప్రక్రియ కోసం ప్రతి వైద్య కళాశాల నుంచి 60 వేల డాలర్లు రుసుము వసూలు చేస్తోంది. దీంతో దేశంలోని 706 వైద్య కళాశాలలు డబ్ల్యూఎఫ్ఎమ్ఈ గుర్తింపు కోసం మొత్తంగా సుమారు 4,23,60,000 డాలర్లు ఖర్చు చేయనుంది. చదవండి: గణతంత్ర వేడుకలకు బైడెన్!.. ఆహ్వానించిన ప్రధాని మోదీ -
AP: మరో 5 మెడికల్ కాలేజీలు
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో మరో ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కళాశాలల ప్రారంభానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కి ఆ కళాశాలల ప్రిన్సిపల్స్ దరఖాస్తు చేశారు. పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లెలో ఈ కళాశాలలు నిర్మిస్తున్నారు. ఒక్కో కాలేజిలో 150 సీట్లతో 2024–25 విద్యా సంవత్సరం నుంచి అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభించడానికి దరఖాస్తు చేశారు. అంటే మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయి. ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వీటిలో ఒక్కో కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున మొత్తం 3,530 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పోస్టులను భర్తీ చేసి, కళాశాలలకు అనుమతి కోసం దరఖాస్తు చేశారు. ఈ ఐదు చోట్ల ఉన్న ఏపీవీవీపీ ఆస్పత్రులను ప్రభుత్వం 330 పడకల బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేస్తోంది. వీటిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ తరగతుల ప్రారంభానికి వీలుగా అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఎస్పీఎం, జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్స్ వంటి వివిధ విభాగాలను ఏర్పాటు చేసింది. రూ.8,480 కోట్లతో 17 కళాశాలలు ప్రజలకు ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్య వసతులు సమకూర్చడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రూ.16వేల కోట్లకు పైగా ఖర్చుతో నాడు–నేడు కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రూ.8,480 కోట్లతో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కాలేజీల ద్వారా ఏకంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి తెస్తున్నారు. ఇటీవలే సీఎం వైఎస్ జగన్ నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలలను ప్రారంభించారు. వీటి ద్వారా 750 సీట్లు అదనంగా వచ్చాయి. ఈ కళాశాలల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే ఐదు కొత్త కాలేజీల ద్వారా మరో 750 సీట్లు సమకూరనున్నాయి. ఇక మిగిలిన ఏడు వైద్య కళాశాలలను 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించనున్నారు. అన్ని వనరులతో వైద్య కళాశాలలు కొత్తగా ప్రారంభించే వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా అన్ని వనరులను ప్రభుత్వం సమకూరుస్తోంది. సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కళాశాలలు ప్రారంభించడానికి ఎన్ఎంసీకి దరఖాస్తు చేశాం. అదే విధంగా ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించిన ఐదు కళాశాలలకు ఫస్ట్ రెన్యువల్కు దరఖాస్తు చేశాం. – డాక్టర్ నరసింహం, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ -
రోగాలను బట్టి పీజీ మెడికల్ సీట్లు!
సాక్షి, హైదరాబాద్: ఆయా ప్రాంతాల్లో వ్యాధులు.. రోగుల సంఖ్య..అందుతున్న వైద్య సేవలను బట్టి మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు కేటాయించాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది. అంటే ఏ ప్రాంతంలో ఎలాంటి రోగాలున్నాయో, ఆయా ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీలకు ఆయా స్పెషాలిటీల్లో పీజీ మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మేరకు కొత్త పీజీ మెడికల్ ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం.. మెడికల్ కాలేజీలో సంబంధిత స్పెషాలిటీ వైద్యంలో ఔట్ పేషెంట్ (ఓపీ)ల సంఖ్య 50కి తగ్గకుండా ఉంటేనే రెండు ఎండీ లేదా ఎంఎస్ సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేస్తుంది. ఉదాహరణకు ఒక మెడికల్ కాలేజీకి రెండు పీడియాట్రిక్ సీట్లు కావాలంటే సంబంధిత కాలేజీలో రోజుకు చిన్న పిల్లల ఓపీ కనీసం 50 ఉండాలి. ఒక ఆపరేషన్ థియేటర్ 24 గంటలు పనిచేస్తేనే రెండు పీజీ అనస్తీషియా సీట్లు ఇస్తారు. వారానికి 20 ప్రసవాలు జరిగితేనే రెండు గైనిక్ సీట్లు ఇస్తారు. ఇక సంబంధిత స్పెషాలిటీలో అదనంగా మరో సీటు కావాలంటే 20 శాతం ఓపీ పెరగాలి. సూపర్ స్పెషాలిటీకి సంబంధించి రెండు సీట్లు కేటాయించాలంటే ఆయా సూపర్ స్పెషాలిటీ విభాగంలో రోజుకు 25 ఓపీ ఉండాలి. పడకల్లో 75% ఆక్యుపెన్సీ ఉండాలి ఎన్ఎంసీ మరికొన్ని కొత్త నిబంధనలను కూడా ముసాయిదాలో చేర్చింది. మెడికల్ కాలేజీల్లోని స్పెషాలిటీ పడకల్లో 75 శాతం ఆక్యుపెన్సీ ఉండాలి. అల్ట్రా సౌండ్లు రోజుకు 30 జరగాలి. 10 సీటీ స్కాన్లు చేయాలి. రోజుకు మూడు ఎంఆర్ఐ స్కాన్లు తీయాలి. రోజుకు 15 శాతం మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి. గతంలో ఇలాంటి నిబంధనలు లేవు. సంబంధిత స్పెషాలిటీలో నిర్ణీత ఓపీ సంఖ్యతో సంబంధం లేకుండా మౌలిక సదుపాయాలు, సర్జరీలు, అన్ని రకాల ఓపీలు, ఐపీలు, బ్లడ్ బ్యాంకు నిర్వహణ, సీటీ స్కాన్, ఎంఆర్ఐ యంత్రాలు ఉన్నాయా లేవా? వంటివి మాత్రమే చూసి సీట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రధానంగా ఓపీని ప్రామాణికంగా తీసుకొని ఇవ్వాలని నిర్ణయించారు. ఐసీఎంఆర్ ఆన్లైన్ కోర్సులు చదవాలి ఎండీలో కొత్తగా 3 కోర్సులను ఎన్ఎంసీ చేర్చింది. ప్రజా రోగ్యం, బయో ఫిజిక్స్, లేబొరేటరీ మెడిసిన్లను ప్రవేశపెట్టింది. అలాగే సూపర్ స్పెషాలిటీలో ఉండే చిన్న పిల్లల గుండె, రక్తనాళాల కోర్సులను ఎత్తివేసి, సాధారణ గుండె, ఛాతీ, రక్తనా ళాల సర్జరీలో చేర్చింది. సూపర్ స్పెషాలిటీలో ఉన్న ఛాతీ శస్త్రచి కిత్స కోర్సును ఎత్తివేసి సాధారణ గుండె శస్త్రచికిత్సలో కలి పేసింది. అలాగే 11 పోస్ట్ డాక్టర్ సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపె ట్టింది. అవయవ మార్పిడి అనెస్తీషియా, పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీ, లేబొరేటరీ ఇమ్యునాలజీ, న్యూక్లియర్ నెఫ్రాలజీ, రీనాల్ పెథాలజీ, గ్యాస్ట్రో రేడియాలజీ, రక్తమార్పిడి థెరపీ, పెయిన్ మేనేజ్మెంట్, హిమటో ఆంకాలజీ, పీడియాట్రిక్ ఈ ఎన్టీ, స్పైన్ సర్జరీ కోర్సులు ప్రవేశపెట్టారు. పీజీ అయిపో యిన వారు ఈ కోర్సులను చేసే సదుపాయం కల్పించారు. ప్రతి పీజీ విద్యార్థి మొదటి ఏడాది ఐసీఎంఆర్ నిర్వహించే ఆన్ లైన్ కోర్సులు తప్పనిసరిగా చదవాలి. ఈ ముసాయిదా లోని అంశాలపై అభ్యంతరాలను 15లోగా తెలియజేయాలన్నారు. ఇలా అయితేనే ఉపయోగం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు దాదాపు అన్ని జిల్లాలకు విస్తరించాయి. అందువల్ల ఆయా మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్ సీట్లను స్థానిక రోగాలను బట్టి కేటాయిస్తేనే ఉపయోగం ఉంటుంది. ఎన్ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో శాస్త్రీయ మైనది. ఆయా ప్రాంతాల రోగులకు సంబంధిత వైద్యం అందుబాటులోకి వస్తుంది. – డాక్టర్ కిరణ్ మాదల,ఐఎంఏ సైంటిఫిక్ కన్వీనర్, తెలంగాణ -
ఇది సరైన ఔషధమేనా?
జనరిక్ ఔషధాల వినియోగాన్ని మెరుగ్గా అమలు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. ఖరీదైన కంపెనీ మందుల బదులు చౌకగా లభించే జనరిక్ ఔషధాలనే తప్పక రాయాలంటూ వైద్యులకు ఆదేశాలిచ్చింది. వైద్యం ఖరీదవుతున్న వేళ సామాన్యులకు సాంత్వననిచ్చే ఆదేశాలు స్వాగతించాల్సినవే. ఈ విషయంలో ఎన్ఎంసీ మార్గదర్శకాలివ్వడం ఇదేమీ తొలిసారి కాదు. మునుపెప్పుడో ఇచ్చినా, వాటి అమలు అంతంత మాత్రమైంది. అందుకే, ఈసారి ఆదేశాలు పాటించకుంటే జరిమానాలు విధిస్తామంటూ హెచ్చరించింది. ఇక్కడే తకరారు వచ్చింది. ఇది ‘పట్టాలు లేకుండా రైళ్ళు నడపడం లాంటిది’ అంటూ దేశంలోని వైద్యులకు అతి పెద్ద సంఘమైన భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) తప్పుపడుతోంది. ఈ విధాన నిర్ణయాలు తీసుకొనే ముందే జనరిక్ మందుల్ని ప్రోత్సహించి, నాణ్యమైనవి దొరికేలా చేయాల్సింది. అది చేయకుండా జరిమానా నిబంధనలు పెట్టడం ఏ మాత్రం సబబన్నది ఐఎంఏ వాదన. వెరసి, వృత్తి నిర్వహణకు సంబంధించి ఆగస్ట్ మొదట్లో అమలులోకి వచ్చిన కొత్త మార్గదర్శకాలపై చర్చ జరుగుతోంది. ఈ నిబంధనల ప్రకారం డాక్టర్లు ఇకపై మోతాదులో స్వల్పతేడా సైతం దుష్పరిణామాలకు దారి తీసే మందుల విషయంలో తప్ప, మిగతావన్నీ జనరిక్ మందులే సిఫార్సు చేయాలి. ఫలానా బ్రాండే వాడాలనకూడదు. తత్సమాన జనరిక్ ఔషధం పేరు రాయాలి. నిర్ణీత మోతాదులో, అనుమతించిన కాంబినేషన్లలోనే ఆచితూచి మందులు రాయాలి. స్పష్టంగా, అర్థమయ్యేలా, ఇంకా వీలుంటే ఇంగ్లీషులో పెద్ద బడి అక్షరాల్లో మందుల చీటీ రాయాలి. అర్థం కాని కోడిగీతల్లో రాస్తే గందరగోళ పడ్డ రోగులు పొరపాటుగా వేరే మందులు తీసుకొనే ప్రమాదం ఉందనేది అంతరార్థం. అలాగే రోగి పరిస్థితి, చికిత్స, ఫలితం లాంటివి డాక్టర్లు ట్విట్టర్ వగైరాల్లో చర్చించరాదంటూ రోగుల హక్కులు కాపాడేలా 11 అంశాలతో సోషల్ మీడియా మార్గదర్శకాలూ ఇచ్చింది. ఇవన్నీ మంచి మాటలే. బ్రాండెడ్ మందులతో పోలిస్తే, జనరిక్ ఔషధాలు సగటున 30 నుంచి 80 శాతం చౌకని ఓ లెక్క. అందువల్ల ఆ మేరకు ఆరోగ్యరక్షణ ఖర్చులు తగ్గుతాయి. సహజంగానే సామాన్యులకు అది పెద్ద ఊరట. అదే సమయంలో, డాక్టర్ల వాదన ఏమిటంటే – మిగిలే లాభం తక్కువ గనక అన్ని ఫార్మ సీలూ అన్నిరకాల జనరిక్ మందులనూ నిల్వ చేయవు. డాక్టర్ రాసిచ్చిన మందు లేనప్పుడు నిర్ణయం షాపువాడి చేతిలోకి వస్తుంది. అప్పుడు నాణ్యతతో సంబంధం లేకుండా, ఎక్కువ లాభం మిగిలే మందులను అంగట్లో అంటగట్టే ప్రమాదం ఉంది. అంతేకాక, వైద్యులు తమ అనుభవం కొద్దీ రోగికి సరిపోయే మందు రాయడానికి వీలు లేకుండా పోతుందనీ, కంపెనీలను బట్టి జనరిక్ ఔషధాల నాణ్యతలోనూ తేడాలు తప్పవు గనక చికిత్స సమర్థంగా సాగదనీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో నాణ్యతా ప్రమాణాల నియంత్రణ అంతంత మాత్రమే. కాబట్టి ఈ ఆందోళనను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. నాణ్యతకు హామీ లేకపోతే, మందుల్ని వాడినా ప్రయోజనం ఉండదన్నది నిష్ఠురసత్యం. ఈ రకమైన చికిత్స, ఔషధ వినియోగంతో వ్యాధి తగ్గకుంటే రోగికి నష్టం, డాక్టర్ పేరుకూ దెబ్బ. ఇన్ని లోతుపాతులున్న అంశంపై నిర్ణయాలు ప్రకటించే ముందు సంబంధిత వర్గాలన్నిటితో సమగ్రంగా చర్చించడం తప్పక అవసరం. అదేమీ లేకుండా మార్గదర్శకా లను నోటిఫై చేశారని వైద్యవర్గాల ఆరోపణ. నిజానికి, దేశంలోని జనరిక్ ఔషధాల నాణ్యత విషయంలో చేయాల్సింది చాలా ఉంది. అది డాక్టర్లు, మందుల ఉత్పత్తిదార్లు, పాలకులు – అంతా అంగీకరించే మాటే. తయారయ్యే మందుల్లో అన్ని బ్యాచ్లకూ ప్రభుత్వం నాణ్యతా పరీక్ష చేయడం ఆచరణ సాధ్యం కాదు. కేవలం 0.1 శాతం మందులకే పరీక్షలు జరుగుతున్నాయట. గత మూడేళ్ళ కాలంలో జనరిక్, బ్రాండెడ్ జనరిక్, బ్రాండెడ్ మందులన్నిటికీ జరిపిన పరీక్షల్లో దాదాపు 3 శాతం ప్రమాణాల మేరకు నాణ్యంగా లేవని సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మందుల తయారీలో నిర్దుష్టమైన విధానాల్ని అనుసరించడమే నాణ్యతను సాధించ డానికి మూల మంత్రం. పాలకులు అందుకు కట్టుదిట్టమైన విధివిధానాలు పెట్టాలి. ఆ మాటకొస్తే కొన్నేళ్ళ క్రితం దాకా జనరిక్స్ తయారీ సంస్థలకు కొన్ని టెస్ట్లు తప్పనిసరి కాదు. బ్రాండెడ్ మందులకు సమానంగా జనరిక్ మందు స్పందిస్తున్నట్టు నిర్ధరించే బయో–ఈక్వలెన్స్ పరీక్ష కానీ, నిర్ణీత వాతావరణ పరిస్థితుల్లో ఔషధ నాణ్యత ఏ మేరకు మారుతుందో చూసే స్టెబిలిటీ అధ్యయనాలు కానీ జరపకుండానే బండి నడిచింది. ఇప్పుడవి తప్పనిసరి చేశారు. కానీ, అవేవీ జరగకుండానే బయటకొచ్చిన జనరిక్స్ చాలానే ఇప్పటికీ విపణిలో ఉన్నట్టు ఔషధరంగ నిపుణులు అంగీకరిస్తున్నారు. అందుకే, ఇప్పటికైనా నిబంధనల అమలును వాయిదా వేసి, అన్ని వర్గాలతో కేంద్ర ప్రభుత్వం విస్తృత స్థాయి సంప్రతింపులు జరపాలన్నది వైద్య సంఘం డిమాండ్. వైద్యవృత్తికి సంబంధించి నియంత్రణాధికారాలున్న ఎన్ఎంసీ ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. వైద్యులు నిరంతరం తమ వృత్తినైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్న మార్గదర్శకం ఆచరణలో ఏ మేరకు సాధ్యమో ఆలోచించాలి. పర్యవేక్షించే విధానమేమిటో చెప్పాలి. అన్నిటి కన్నా ముందు బ్రాండెడ్కు దీటుగా జనరిక్ ఔషధాలు పనిచేస్తాయనే భరోసా ప్రజల్లో కల్పించాలి. షాపుల్లో ఈ రకం ఔషధాలన్నీ పెద్దయెత్తున నిల్వ ఉండేలా, జన్ ఔషధీ కేంద్రాలు ఊరి నలుమూలలా నెలకొనేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ఆ పని చేయకుండా మార్గదర్శకాలు, జరిమానాలంటూ హడావిడి చేస్తే ఏం లాభం? పుండు ఒకచోట ఉంటే, మందు మరొకచోట రాసినట్టే! -
ఆన్లైన్ కౌన్సెలింగ్తోనే వైద్య సీట్ల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్ల బ్లాకింగ్కు చెక్ పెట్టే దిశగా జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారానే అన్ని సీట్లను భర్తీ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యక్ష (ఫిజికల్) కౌన్సెలింగ్ చేపట్టవద్దని స్పష్టం చేసింది. పలుమార్లు ఆన్లైన్ కౌన్సెలింగ్లు నిర్వహించాలని, అప్పటికీ సీట్లు మిగిలిపోతే వాటికి ప్రత్యక్ష కౌన్సెలింగ్ నిర్వహించకుండా అలాగే వదిలేయాలని సూచించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ప్రతిభకు న్యాయం 2023–24 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్ఎంసీ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో సీట్ల బ్లాకింగ్ నిలిచిపోతుందని, ఫలితంగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. అభ్యర్థుల ఫిర్యాదులు, కోర్టు కేసులను పరిష్కరించడంలో ఇది సాయపడుతుందని ఎన్ఎంసీ కూడా స్పష్టం చేసింది. కాగా ఈసారి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ యాజమాన్య సీట్లు దాదాపు 50కు పైగా, పీజీ మెడికల్లో 30కి పైగా మిగిలిపోయే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. బ్లాకింగ్తో కోట్లు దండుకున్న కాలేజీలు! గతేడాది వరకు ఎంబీబీఎస్, పీజీ సీట్ల బ్లాకింగ్తో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అక్రమ వ్యాపారం చేశాయనే ఆరోపణలున్నాయి. ప్రతిభ కలిగిన విద్యార్థులు తమ కాలేజీల్లోని ఏ, బీ కేటగిరీ సీట్లలో చేరేలా యాజమాన్యాలు ముందస్తు అవగాహన కుదుర్చుకునేవి. దీంతో ఈ కేటగిరీలకు రెండు విడతల కౌన్సెలింగ్, చివరి మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్లు పూర్తయ్యేవరకు ఉత్తమ ర్యాంకర్లు తమ సీట్లను అలాగే అట్టిపెట్టుకునేవారు. అన్ని కౌన్సెలింగ్లూ పూర్తయిన తర్వాత ఒకవేళ సీట్లు మిగిలితే అవి ఆటోమెటిక్గా సీ (ఎన్ఆర్ఐ) కేటగిరీ సీట్లుగా మారిపోతాయి. ఆ సమయంలో అప్పటికే ఫీజు చెల్లించిన మెరిట్ విద్యార్థులు ముందుగా కుదుర్చుకున్న అవగాహన మేరకు తమ సీట్లు వదిలేసుకునేవారు. దీంతో ఇవి కూడా నిబంధనల ప్రకారం సీ కేటగిరీ సీట్లుగా మారిపోతాయి. వీటికి అభ్యర్థులతో ప్రత్యక్ష కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా ప్రైవేట్ కాలేజీలు కోట్లు దండుకునేవి. కన్వీనర్ కోటాకు ఏడాదికి రూ.60 వేలు, బీ కేటగిరీ సీటుకు రూ.11.55 లక్షల ఫీజు ఉంటుంది. ఇక సీ కేటగిరీ సీటుకు బీ కేటగిరీ సీటు కంటే రెట్టింపు ఫీజు ఉంటుంది. అంటే ఏడాదికి రూ.23.10 లక్షల వరకు ఉంటుందన్న మాట. ఇలా కోర్సు మొత్తానికి కోటికి పైగా వసూలు చేస్తారు. రూ.60 వేలున్న కన్వీనర్ కోటా సీటును కూడా అదే రేటుకు అమ్ముకునేవారు. ఇక అవగాహన మేరకు వర్సిటీకి రూ.3 లక్షల జరిమానా చెల్లించి మరీ సీట్లు వదులుకున్న విద్యార్థులకు వాళ్లు చెల్లించిన ఫీజుతో పాటు రూ.10 లక్షల వరకు అదనంగా యాజమాన్యాలు చెల్లిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ విద్యార్థులు ఆ తర్వాత ఇతర కాలేజీల్లో చేరిపోయేవారు. ఇతర రాష్ట్రాల ముఠాల ప్రమేయం గతంలో మాదిరిగానే ఏ, బీ కేటగిరీ సీట్లను సీ కేటగిరీగా మార్చుకునేలా యాజమాన్యాలు విద్యార్థులకు వల వేసినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ దందాలో అనేక ఇతర రాష్ట్రాల ముఠాలు, ప్రైవేటు కాలేజీలు, కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాలుపంచుకుంటున్నట్లు తెలిసింది. గతంలో కర్ణాటకలో జరిగిన ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణంలో కాలేజీల చైర్మన్లు, వైద్యాధికారులు కూడా ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఇదంతా గుట్టుగా సాగిపోతుండటం గమనార్హం కాగా.. ఎన్ఎంసీ తాజా నిర్ణయంతో సీట్ల బ్లాకింగ్కు చెక్ పడుతుందనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. -
ఎందుకో బిల్ కౌంటర్ దగ్గరే అనుచితంగా ప్రవర్తిస్తున్నారు!!
ఎందుకో బిల్ కౌంటర్ దగ్గరే అనుచితంగా ప్రవర్తిస్తున్నారు!! -
ఆర్ఎంపీలకు కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఆర్ఎంపీ) వైద్యులకి జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కొత్త నియంత్రణలు విధించింది. ఫార్మా కంపెనీలు, వారి ప్రతినిధులు, వైద్య పరికరాల సంస్థల దగ్గర్నుంచి వైద్యులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి కానుకలు, డబ్బులు, ఆతిథ్యం స్వీకరించకూడదని నిబంధనలు విధించింది. ఫార్మా కంపెనీలు ఇచ్చే పార్టీల్లో పాల్గొనడం, ప్రయాణ సదుపాయాలను తీసుకోవడం వంటివి చేయకూడదని పేర్కొంది. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు వృత్తిపరమైన బాధ్యతని కలిగి ఉంటూ ప్రవర్తించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగస్టు 2నే ఈ నిబంధనల్ని జారీ చేసింది. అంతే కాదు ఫార్మా కంపెనీలు తయారు చేసే మందులు ఇతర పరికరాల వినియోగాన్ని ఆమోదిస్తూ ప్రకటనలివ్వకూడదంది. -
ఎన్ఎంసీ తీరు మారాలి
దేశంలో వైద్య విద్య పర్యవేక్షణకు నెలకొల్పిన భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) భ్రష్టుపట్టిందనీ, దాని ప్రక్షాళన అసాధ్యమనీ పదమూడేళ్ల క్రితం సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆ తర్వాత 2019లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు చట్టమై జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) ఆవిర్భవించింది. 2020 సెప్టెంబర్ నుంచి కొత్త సంస్థ పనిచేయటం ప్రారంభమైంది. పాత వ్యవస్థలోని లోపాలనూ, దోషాలనూ పరిహరించి కొత్త వ్యవస్థ వస్తున్నదంటే ఎవరైనా స్వాగతిస్తారు. కానీ ఈ మూడేళ్లలో ఎన్ఎంసీ ఆచరణ సరిగా ఉందా లేదా అన్నదే ప్రశ్న. కొత్త చట్టం వచ్చినప్పుడూ, కొత్త వ్యవస్థలు రూపుదిద్దుకున్నప్పుడూ సంబంధిత రంగాల్లోనివారు నిశితంగా గమనిస్తారు. అవి తమ ఆశలకూ, ఆకాంక్షలకూ అనుగుణంగా ఉన్నాయో లేదో తరచి చూస్తారు. ఎంబీబీఎస్ పూర్తయ్యాక వైద్య వృత్తిలో ప్రవేశించేందుకైనా, పీజీ కోర్సుల్లో ప్రవేశం కోరడానికైనా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్(నెక్ట్స్) పేరిట జరిగే ఉమ్మడి ప్రవేశపరీక్ష రాయాల్సిందేనన్న నిబంధనను బిల్లుపై పార్లమెంటు చర్చిస్తున్న సమయంలోనే వైద్యరంగ నిపుణులు, వైద్య విద్యార్థులు గట్టిగా వ్యతిరేకించారు. అలాగే ఫీజుల నిర్ణయం విషయంలోనూ ఆందోళన వ్యక్తమైంది. వారి అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ అది చట్టంగా మారింది. దాని సంగతలావుంచి కొత్త వ్యవస్థ అయినా పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదా? దేశవ్యాప్తంగా 38 వైద్య కళాశాలల గుర్తింపు రద్దు చేస్తున్నట్టు ఈమధ్యే ఎన్ఎంసీ ప్రకటించింది. మరో వందకు పైగా వైద్య కళాశాలల్లో అనేక లోటుపాట్లను గుర్తించి వాటిని సరిచేసుకోనట్టయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిజానికి గతంలో ఎంసీఐ సైతం ఇలాంటి తనిఖీలే చేస్తుండేది. చర్యలు తీసుకునేది. అయినా దానిపై ఎందుకు ఆరోపణలొచ్చేవో, అది ఎందుకు భ్రష్టుపట్టిపోయిందో కొత్త వ్యవస్థ సారథులు సరిగా అర్థం చేసుకున్నట్టు లేరు. వచ్చే నెలలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ ప్రవేశాలుంటాయి గనుక ఎన్ఎంసీ ముందుగానే వైద్య కళాశాలలను తనిఖీ చేయటం మెచ్చదగింది. గుర్తింపు రద్దు చేసినంత మాత్రాన వెంటనే ఆ కళాశాలలకు కేటాయించిన సీట్లన్నీ రద్దుకావు. అవి సకాలంలో మేల్కొని దిద్దుబాటు చర్యలు తీసుకుని, తిరిగి దరఖాస్తు చేసుకుంటే ఎన్ఎంసీ పరిశీలించి అనుమతులు పునరుద్ధరిస్తుంది. అలాగే ఎన్ఎంసీ సంతృప్తి చెందని పక్షంలో సంబంధిత కళాశాల కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖను కూడా ఆశ్రయించే వెసులుబాటుంది. వైద్య కళాశాలలపై ప్రధానంగా బోధనా సిబ్బంది కొరత విషయంలోనే ఆరోపణలొస్తున్నాయి. రెసిడెంట్ డాక్టర్ల సమస్య సరేసరి. ఇక ఇత రేతర మౌలిక సదుపాయాల లేమి సైతం ఎన్ఎంసీ కన్నెర్రకు కారణమవుతోంది. వైద్య కళాశాలల్లో విద్యా ప్రమాణాల తీరుతెన్నులనూ, అక్కడి మౌలిక సదుపాయాల కల్పననూ మదింపు వేయటం చాలా అవసరం. అయితే ఆ ప్రక్రియలో పారదర్శకత లోపిస్తే మాత్రం ప్రయోజనం శూన్యం. వాస్త వానికి ఎన్ఎంసీ చట్టం–2019లోని సెక్షన్ 26(ఈ) ప్రకారం సంస్థకు చెందిన మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (మార్బ్) కళాశాల తీరుతెన్నులపై ఇచ్చే మదింపు, ఆ కళాశాలకిచ్చే రేటింగ్ అందరికీ అందుబాటులో ఉంచాలి. కానీ ఈ నెల మొదట్లో జారీ చేసిన కళాశాలల ఏర్పాటు, మదింపు, రేటింగ్ నిబంధనల్లోని సెక్షన్ 25 దీన్ని నీరుగారుస్తోంది. నిజానికి ఎన్ఎంసీ ఏర్పడింది మొదలు కళాశాలల మదింపు నివేదికల జాడే లేదు. సరిగదా అంతక్రితం ఎంసీఐ ఉన్నప్పుడు పొందుపరిచిన మదింపు నివేదికలు, రేటింగ్లు సైతం మాయమయ్యాయి. ఫలానా కళాశాలలో ఏ సదుపాయాలు లోపించాయో, దానిపై ఎందుకు చర్యలు తీసుకోవలసి వచ్చిందో, కాలక్రమంలో అది ఏయే అంశాల్లో మెరుగుపడిందో అందరికీ తెలియకపోతే ఎట్లా? ఇక ఆ తనిఖీల వల్ల సాధారణ విద్యార్థులకు ఒరిగేదేముంటుంది? విద్యార్థులు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకునే సమయంలో ఎన్ఎంసీ మదింపు నివేదికలు అందుబాటులో ఉంటే, కళాశాల పూర్వ చరిత్ర తెలిస్తే వారు మెరుగైన నిర్ణయం తీసుకోగలుగుతారు. అంతేతప్ప కేవలం అది ప్రకటించిన ఫలితాన్నీ, దాని రేటింగ్నూ చూసి ఎలా సరిపెట్టుకుంటారు? ఈ చిన్న విషయం ఎన్ఎంసీకి తెలియదా? ఇలాంటి ధోరణి అటు కళాశాలలకు సైతం నష్టం కలిగిస్తుంది. రేటింగ్ సరిగా లేని కళాశాలలో స్వల్ప లోటుపాట్లు మాత్రమే ఉండొచ్చు. అవి సరిచేసుకునే స్థాయిలోనే ఉండొచ్చు. కానీ ప్రత్యర్థి కళాశాలకు చెందినవారు మాత్రం ఆ లోపాలను భూతద్దంలో చూపి తప్పుడు ప్రచారానికి దిగొచ్చు. విద్యార్థులకు తగిన సమాచారం అందుబాటులో లేకపోవటంతో ఆ కళాశాలపై అనాసక్తి ప్రదర్శిస్తారు. ఎన్ఎంసీ తీరుపై కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)కి చాన్నాళ్ల క్రితమే ఫిర్యాదులు దాఖలయ్యాయి. ఆ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సీఐసీ మొన్న మార్చిలో ఆదేశాలు కూడా ఇచ్చింది. తీరా ఈ నెల మొదట్లో నోటిఫై చేసిన నిబంధనలు గమనిస్తే సీఐసీ ఆదేశాలు బేఖాతరైనట్టు అర్థమవుతుంది. గతంలో పనిచేసిన ఎంసీఐ అవినీతిమయం అయిందని రద్దు చేస్తే, దాని స్థానంలో వచ్చిన ఎన్ఎంసీ కూడా అదే బాటలో సాగుతున్నదన్న అభిప్రాయం కలిగిస్తే, పారదర్శకతకు పాతరేస్తే ఏమనాలి? ఇది సరికాదు. దేశంలోని ప్రతి వైద్య కళాశాలకు సంబంధించి ఎంసీఐ కాలంనాటి మదింపు నివేదికలు, రేటింగ్లతోపాటు ఎన్ఎంసీ గత మూడేళ్ల అంచనాలు సైతం అందరికీ అందుబాటులో ఉంచాలి. విద్యార్థులు మెరుగైన నిర్ణయం తీసుకొనేందుకు తోడ్పడాలి. -
మచిలీపట్నం వైద్య కళాశాలకు గ్రీన్సిగ్నల్
సాక్షి, అమరావతి/మచిలీపట్నం టౌన్: కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లకు 2023–24 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు చేపట్టడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ), మెడికల్ అసెస్మెంట్ మరియు రేటింగ్ బోర్డు అనుమతులిచ్చింది. ఈ మేరకు గురువారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారికి ఎన్ఎంసీ నుంచి ఉత్తర్వులు అందాయి. ఇప్పటికే ఏలూరు, నంద్యాల, విజయనగరం వైద్య కళాశాలల్లో రానున్న విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు మొదలు పెట్టడానికి లైన్క్లియర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మచిలీపట్నం కళాశాలకు కూడా గ్రీన్సిగ్నల్ రావడంతో నాలుగు వైద్య కళాశాలల్లో ఒక్కోచోట 150 చొప్పున మొత్తం 600 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా వచ్చినట్లైంది. మరోవైపు.. రాజమండ్రి వైద్య కళాశాలకు అనుమతులు రావాల్సి ఉంది. ఈ కళాశాలలో కూడా మరో 150 సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీంతో ఈ ఏడాది ఏకంగా 750 ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాది ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమవుతుండటం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మచిలీపట్నం మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ విజయకుమారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఈ ఏడాది తరగతుల నిర్వహణకు అన్నీ సిద్ధంచేశామని చెప్పారు. నూతన భవనాల్లో తరగతి గదుల నిర్మాణం పూర్తయ్యిందని.. ఫర్నిచర్, హాస్టల్కు అవసరమైన సామాగ్రి నెలాఖరుకుకల్లా వస్తుందన్నారు. రూ.8,480 కోట్లతో 17 వైద్య కళాశాలలు.. రాష్ట్రంలో వైద్య విద్యలో నూతన అధ్యాయానికి తెరతీస్తూ సీఎం జగన్ ప్రభుత్వం రూ.8,480 కోట్లతో 17 వైద్య కళాశాలలు ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రానున్న విద్యాసంవత్సరంలో ఐదుచోట్ల అడ్మిషన్లు ప్రారంభిస్తున్నారు. మరోవైపు.. 2024–25లో పులివెందుల, ఆదోని, పాడేరు కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభించాలని కార్యాచరణ రూపొందించారు. ఇందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటవుతున్న 17 వైద్య కళాశాలల్లో మరో 2,100 ఎంబీబీఎస్ సీట్లు సమకూరనున్నాయి. ముఖ్యమంత్రికి ‘పేర్ని’ కృతజ్ఞతలు ఇక మచిలీపట్నంలో శరవేగంగా వైద్య కళాశాలను ఏర్పాటుచేస్తున్న సీఎం జగన్కి మాజీమంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని కృతజ్ఞతలు తెలిపారు. 67 ఎకరాల విస్తీర్ణంలో రూ.550 కోట్లతో వైద్య కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని.. నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఇదే క్రమంలో రానున్న విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు చేపట్టడానికి అనుమతులు రావడం సంతోషకరమన్నారు. అలాగే, బందరు ప్రజల చిరకాల స్వప్నమైన పోర్టు నిర్మాణానికి ఈనెల 22న సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: హోంశాఖ సమీక్షలో సీఎం జగన్ కీలక ప్రకటన -
5 ఏళ్లు.. 50 బిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: వైద్య రంగంలో ఉపయోగించే పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగానే తయారీకి ఊతమివ్వడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీ 2023కి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. వైద్య పరికరాల రంగం వచ్చే అయిదేళ్లలో 50 బిలియన్ డాలర్ల స్థాయికి (దాదాపు రూ. 4.1 లక్షల కోట్లు) చేరేందుకు ఇది తోడ్పడనుంది. భారత్లో వైద్య పరికరాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుండటంతో వీటిని దేశీయంగానే ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని క్యాబినెట్ సమావేశం అనంతరం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మీడియాకు తెలిపారు. ప్రపంచీకరణ నేపథ్యంలో దిగుమతులు కూడా ఉంటాయని, అయితే సాధ్యమైనంత మేరకు స్థానిక అవసరాలకు అనుగుణంగా దేశీయంగానే ఉత్పత్తిని పెంచుకోవడమే కొత్త విధానం లక్ష్యమని వివరించారు. ఆరు వ్యూహాలు..: నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీలో ఆరు వ్యూహాలను నిర్దేశించుకున్నారు. నియంత్రణ విధానాలను క్రమబద్ధీకరించడం, మౌలిక సదుపాయాల కల్పన, పరిశోధన.. అభివృద్ధి.. ఆవిష్కరణలకు తోడ్పాటు అందించడం, పరిశ్రమలోకి పెట్టుబడులను ఆకర్షించడం, మానవ వనరుల అభివృద్ధి, మన పరిశ్రమకు బ్రాండింగ్ సాధించడం .. అవగాహన కల్పించడం వంటివి ఈ వ్యూహాల్లో ఉన్నాయి. ఇటు భారత్, అటు ప్రపంచ హెల్త్కేర్ అవసరాలను తీర్చే దిశగా దేశీయంగా వైద్య పరికరాల రంగం స్వయం సమృద్ధి సాధించేలా, ఒడుదుడుకులను సమర్థంగా ఎదుర్కొంటూ పటిష్టమైన పరిశ్రమగా ఎదిగేలా అవసరమైన మద్దతు కల్పించి, దిశా నిర్దేశం చేసేందుకు ఈ పాలసీ ఉపయోగపడనుంది. ప్రధానంగా పేషంట్లను దృష్టిలో ఉంచుకుని, వారి అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులను తయారు చేస్తూ వైద్య పరికరాల రంగం వేగవంతంగా వృద్ధి చెందేలా ఊతమివ్వాలని ఇందులో నిర్దేశించుకున్నారు. 11 బిలియన్ డాలర్ల పరిశ్రమ.. దేశీయంగా వైద్య పరికరాల మార్కెట్ 2020లో 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 90,000 కోట్లు) స్థాయిలో ఉందని అంచనా. అంతర్జాతీయంగా మెడికల్ డివైజ్ల మార్కెట్లో మన వాటా దాదాపు 1.5% వైద్య పరికరాల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా కేంద్రం ఇప్పటికే ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాన్ని అమలు చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్లో 4 మెడికల్ డివైజ్ పార్క్ల ఏర్పాటు కోసం తోడ్పాటు అందిస్తోంది. ఈ స్కీము కింద ఇప్పటివరకు రూ. 1,206 కోట్ల విలువ చేసే పెట్టుబడులతో 26 ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. 37 ఉత్పత్తులను తయారు చేసే 14 ప్రాజెక్టులు ప్రారంభమైనట్లు వివరించింది. వీటిలో లీనియర్ యాక్సిలరేటర్, ఎంఆర్ఐ స్కాన్, సీటీ–స్కాన్, మామోగ్రామ్, సీ–ఆర్మ్, ఎంఆర్ఐ కాయిల్స్, అధునాతన ఎక్స్–రే ట్యూబ్స్ మొదలైనవి ఉత్పత్తి చేస్తున్నారు. -
ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు.. జాతీయ మెడికల్ కమిషన్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ర్యాగింగ్ వంటి చర్యలకు పాల్పడరాదని.. అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) హెచ్చరించింది. విద్యార్థులు మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండాలని.. రోగులతో మర్యాదగా, సున్నితంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. మారుతున్న వైద్య విధానాలు, సాంకేతికత, చికిత్సలపై అవగాహన పెంచుకోవాలని సూచించింది. రోగులు, వారికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని పేర్కొంది. దేశంలో వైద్య విద్యార్థుల వృత్తిపరమైన బాధ్యతలపై ఎన్ఎంసీ తాజాగా మార్గదర్శకాలను జారీచేసింది. వైద్య విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఈ అంశాలు కీలకమని పేర్కొంది. వైద్య విద్యార్థులు రోగులతో సమర్థవంతంగా మాట్లాడటానికి స్థానిక భాష నేర్చుకోవాలని కోరింది. ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు, వైద్యారోగ్య అత్యవసర పరిస్థితుల వంటి సందర్భాల్లో వీలైనంత సాయం చేయాలని సూచించింది. శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి కేవలం చికిత్సకే పరిమితం కాకుండా వైద్యారోగ్య వ్యవస్థపై నమ్మకం కలిగేలా రోగి–వైద్యుడి సంబంధం ఉండాలని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని.. జాతీయ ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యతలపై అవగాహన కలిగి ఉండాలని సూచించింది. కేవలం పుస్తకాల నుంచే మాత్రమే కాకుండా అధ్యాపకుల అపార అనుభవం, ఆచరణాత్మక బోధన నుంచి నేర్చుకోవాలని పేర్కొంది. విద్యార్థులు ప్రాక్టికల్ రికార్డులు, కేస్షీట్లను శ్రద్ధగా నిర్వహించాలని.. కాపీ చేయడం, తారుమారు చేయడం వంటివి చేస్తే తగిన చర్యలు చేపడతామని హెచ్చరించింది. -
ఐదేళ్లలో 119 మంది మెడికోల ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: దేశంలో 512 మెడికల్ కాలేజీల్లో 119 మంది వైద్య విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినట్లు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. ఆత్మహత్య చేసుకున్నవారిలో ఎంబీబీఎస్ తదితర వైద్య గ్రాడ్యుయేట్లు 64 మంది ఉండగా, 55 మంది ఎండీ, ఎంఎస్ చదువుతున్న విద్యార్థులున్నారని పేర్కొంది. వేధింపులు, ఒత్తిడి తదితర కారణాల వల్ల 1,166 మంది మధ్యలోనే వైద్యవిద్యను వదిలేసి వెళ్లిపోయారని వివరించింది. అందులో ఎంబీబీఎస్ విద్యార్థులు 160 మంది, పీజీలో ఎంఎస్ జనరల్ సర్జరీ విద్యార్థులు 114 మంది, ఎంఎస్ ఆర్థోపెడిక్స్ 50 మంది, గైనిక్ 103 మంది, ఎంఎస్ ఈఎన్టీ 100 మంది, పీజీ ఎండీ జనరల్ మెడిసిన్56 మంది, ఎండీ పీడియాట్రిక్స్ 54 మంది, ఇతర బ్రాంచీలకు చెందినవారు 529 మంది ఉన్నారని తెలిపింది. 18–30 ఏళ్ల మధ్యలో వైద్యవృత్తిలో తలెత్తే ఒడిదొడుకులను తట్టుకోలేక కొందరు యువవైద్యులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికలో వెల్లడించింది. వైద్య విద్యార్థుల్లో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) పాసయ్యేవారు 20 శాతం వరకే ఉంటున్నారు. ఎఫ్ఎంజీఈ పాసైతేనే మన దేశంలో మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్కు అర్హత ఉంటుంది. పీజీలో ఆర్థికభారం, వృత్తి బాధ్యతలు, పెళ్లికాకపోవడం వంటివి ఆత్మహత్యలకు కారణాలుగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఆత్మహత్యల్లో 60 శాతం ఒత్తిడికి సంబంధించినవే ఉంటున్నాయని వివరించారు. -
‘విదేశీ’ వైద్య విద్యార్థులకు ఇంటర్న్షిప్
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఎంబీబీఎస్, తత్సమాన మెడికల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు రాష్ట్రంలో కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్షిప్ (సీఆర్ఎంఐ) చేసుకునేందుకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో రాష్ట్రంలో ఇంటర్న్షిప్కు అవకాశం ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల వివరాలను పొందుపరిచింది. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (ఎఫ్ఎంజీఈ) పాసైన విద్యార్థులంతా రాష్ట్రంలో ఇంటర్న్షిప్ చేసుకోవచ్చని తెలిపింది. ఏడాది ఇంటర్న్షిప్ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వారికి స్టైపెండ్ కూడా ఇవ్వాలని ఎన్ఎంసీ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. త్వరలో ఇంటర్న్షిప్ కోసం ఎఫ్ఎంజీఈ పాసైన విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని కాళోజీ వర్సిటీ తెలి పింది. ఎన్ఎంసీ ఆదేశాల మేరకు నడుచుకుంటామని వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. 3,833 మందికి ఇంటర్న్షిప్ అవకాశం.. కరోనా కాలంలోనూ, ఆ తర్వాత అనేకమంది విదేశీ ఎంబీబీఎస్ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. కొందరు అక్కడకు వెళ్లి చదవగా, చాలామంది ఆన్లైన్ క్లాసుల ద్వారా మెడికల్ కోర్సు పూర్తి చేశారు. అలా విదేశీ వైద్య విద్య పూర్తి చేసినవారు తర్వాత దేశంలో మెడికల్ రిజిస్ట్రేషన్, ప్రాక్టీస్ కోసం ఎఫ్ఎంజీఈ పరీక్ష రాయాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎఫ్ఎంజీఈ పరీక్ష పాసైన వారు ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంది. గతంలో విదేశీ గ్రాడ్యుయేట్ల కోసం కొన్ని కాలేజీల్లోనే ఇంటర్న్షిప్కు అవకాశం ఉండగా, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 44 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్న్షిప్ చేయడానికి వీలు కల్పించారు. ప్రస్తుతం ఆయా కాలేజీల్లో 3,833 మంది ఇంటర్న్షిప్ చేయవచ్చు. ఇప్పటివరకు ఎంబీబీఎస్ బ్యాచ్ బయటకు రాని మెడికల్ కాలేజీల్లో ఆయా కాలేజీలకు చెందినవారు ఇంటర్న్షిప్ దశకు చేరుకోనందున, అక్కడ పూర్తిస్థాయిలో విదేశీ గ్రా డ్యుయేట్లకు ఇంటర్న్షిప్కు అవకాశం కల్పించారు. సీట్ల సంఖ్యకు మించి కూడా కొన్నిచోట్ల ఇంటర్న్షిప్కు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. -
వైద్య విద్యార్థుల గోస.. టీఆర్ఆర్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు రద్దు
టీఆర్ఆర్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు రద్దయిన ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారిని వివిధ మెడికల్ కాలేజీల్లో సర్దుబాటు చేసినా, ఆ కాలేజీ నుంచి ఫీజు బదిలీ జరగకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సర్దుబాటు చేసిన కాలేజీలకు ఫీజు చెల్లించకపోతే మొదటి ఏడాది పరీక్ష రాసేందుకు వీలు లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. టీఆర్ఆర్ యాజమాన్యం ఫీజు డబ్బులు బదిలీ చేయకపోవడం లేదా వెనక్కు ఇవ్వకపోవడంతో ఏకంగా బీ, సీ కేటగిరీలకు చెందిన ఏడుగురు విద్యార్థులు వైద్య విద్యకు స్వస్తి చెప్పాల్సివచ్చిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. – సాక్షి, హైదరాబాద్ ఎవ్వరికీ పట్టని విద్యార్థుల గోడు 2021–22 వైద్య విద్యా సంవత్సరంలో ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలు లేవంటూ రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీల్లోని మొదటి ఏడాది ఎంబీబీఎస్ అడ్మిషన్లను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) రద్దు చేసిన సంగతి తెలిసిందే. సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్, పటాన్చెరులోని టీఆర్ఆర్, వికారాబాద్లోని మహవీర్ కాలేజీల్లో మొదటి ఏడాదికి చెందిన మొత్తం 450 ఎంబీబీఎస్ సీట్లను ఎన్ఎంసీ రద్దు చేసింది. దాంతో ఆయా కాలేజీల్లో చేరిన వైద్య విద్యార్థులు అడ్మిషన్లు పొందిన నెలకే రోడ్డున పడ్డారు. వాటిల్లో తొలి ఏడాది చేరిన వైద్య విద్యార్థులు అంతా కలిపి రూ.66 కోట్లు చెల్లించారు. తర్వాత టీఆర్ఆర్, మహావీర్ మెడికల్ కాలేజీలకు చెందిన 300 మంది (ఒక్కో మెడికల్ కాలేజీకి చెందిన 150 మంది) విద్యార్థులను 13 ప్రైవేట్ కాలేజీల్లో సర్దుబాటు చేశారు. ఎమ్మెన్నార్ కాలేజీ విద్యార్థులను మాత్రం తిరిగి అందులోనే కొనసాగించారు. ఈ క్రమంలో టీఆర్ఆర్ కాలేజీ డబ్బులు ఇవ్వకుండా చెక్కులు ఇచ్చింది. అయితే అవి బౌన్స్ అవుతున్నాయి. ముఖ్యంగా బీ, సీ కేటగిరీల్లో పెద్ద మొత్తంలో డొనేషన్లు చెల్లించిన విద్యార్థులకు రసీదులు లేకపోవడం ఒక సమస్య కాగా, కొందరు తక్కువ ధరకు మాట్లాడుకోవడం వల్ల ఇతర కాలేజీల్లో సర్దుబాటుతో అక్కడ పూర్తి స్థాయి ఫీజు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సీ కేటగిరీకి చెందిన కొందరు విద్యార్థులైతే ఏకంగా ఏడాదికి రూ. 23 లక్షల చొప్పున చెల్లించారు. ఇందులో డొనేషన్ల సొమ్ముకు కాలేజీలు ఎలాంటి రసీదులూ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. బీ, సీ కేటగిరీలకు చెందిన ఓ ఏడుగురు విద్యార్థులు పెద్దమొత్తంలో టీఆర్ఆర్ కాలేజీకి డొనేషన్ చెల్లించారు. కానీ ఆ కాలేజీ యాజమాన్యం ఇప్పటివరకు తిరిగి డబ్బు ఇవ్వకపోవడం, తమకు తిరిగి సీటు కేటాయించిన కాలేజీకీ డబ్బులు బదిలీ చేయకపోవడం.. మళ్లీ ఇక్కడ అంత మొత్తంలో చెల్లించేంత డబ్బు తమ వద్ద లేకపోవడంతో మొత్తంగా ఆ ఏడుగురు విద్యార్థులూ ఎంబీబీఎస్ విద్యకే దూరమయ్యారని అంటున్నారు. కాగా మొత్తం ఈ వ్యవహారంపై కాలేజీ యాజమాన్యం వివరణ కోసం పలుమార్లు ఫోన్ చేసినా వారు స్పందించకపోవడం గమనార్హం. వైద్య విద్యకు దూరం మా అమ్మాయిని సీ కేటగిరీలో టీఆర్ఆర్లో చేర్పించాను. ఒకేసారి రూ. 75 లక్షల ఫీజు చెల్లించాను. ఇతర కాలేజీలో చేరాలంటే అక్కడ డబ్బు చెల్లించాలన్నారు. టీఆర్ఆర్ యాజమాన్యం మాత్రం డబ్బులు బదిలీ చేయలేదు. దీంతో మా అమ్మాయి ఏకంగా ఎంబీబీఎస్ చదువుకే దూరమైంది. – శ్రద్ధ (విద్యార్థిని తల్లి) రసీదులు తెస్తే న్యాయం చేస్తా టీఆర్ఆర్ కాలేజీలో చేరి డబ్బులు చెల్లించినట్లు తల్లిదండ్రులు, విద్యార్థులు తమ వద్దకు రసీదులతో వచ్చి లిఖిత పూర్వక ఫిర్యాదులు చేస్తే, అటువంటి వారికి న్యాయం చేస్తాము. కాలేజీ యాజమాన్యంతో మాట్లాడతాం. – కరుణాకర్రెడ్డి, వీసీ, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రూ.45 లక్షలు చెల్లించా మా అబ్బాయిని టీఆర్ఆర్లో చేర్పించాను. ïఫీజు రూ.75 లక్షలకు మాట్లాడుకున్నాను. అడ్మిషన్ రద్దయ్యే నాటికి రూ. 45 లక్షలు చెల్లించాను. ఇప్పుడు మా అబ్బాయిని కరీంనగర్లోకి ఒక కాలేజీలో సర్దుబాటు చేశారు. టీఆర్ఆర్ కాలేజీ చెక్లను కరీంనగర్ కాలేజీ అనుమతించడంలేదు. టీఆర్ఆర్ కాలేజీ యాజమాన్యం ఇప్పటివరకు మేం చెల్లించిన సొమ్మును ఇవ్వలేదు. పరీక్ష ఫీజు దగ్గర పడుతోంది. ఫీజు చెల్లించకుంటే పరీక్ష రాసే పరిస్థితి లేదంటున్నారు. – శ్రీనివాసరెడ్డి, ఎంబీబీఎస్ విద్యార్థి తండ్రి చెక్లు బౌన్స్ అవుతున్నాయి టీఆర్ఆర్ కాలేజీలో బీ కేటగిరీలో మా అబ్బాయిని చేర్పించాను. మొదటి ఏడాది కింద రూ. 11.25 లక్షల ఫీజు చెల్లించాను. తర్వాత ఆర్వీఎం కాలేజీలో సర్దుబాటు చేశారు. కానీ టీఆర్ఆర్ కాలేజీ యాజమాన్యం మాత్రం ఫీజు ఆర్వీఎం కాలేజీకి బదిలీ చేయలేదు. దీంతో మళ్లీ ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. లేకుంటే పరీక్ష రాయడానికి వీలుండదని చెబుతున్నారు. – రుక్మిణి, (ఎంబీబీఎస్ విద్యార్థి తల్లి) -
విదేశీ వైద్య విద్యార్థులకు వెసులుబాటు
సాక్షి, హైదరాబాద్: గతంలో భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) అనుమతి పొందిన, 2022 అక్టోబరు 21వ తేదీ లోపు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) గుర్తించిన విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు.. ఆయా దేశాల్లోనే ఏడాది పాటు ఇంటర్న్షిప్ చేస్తే దాన్ని ఈ ఒక్క ఏడాది వరకు గుర్తిస్తామని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏ దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసినా కూడా భారత్లో అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, అనంతరం ఒక ఏడాది పాటు తప్పనిసరిగా ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంది. ఈ నిబంధన తాజాగా అమల్లోకి రావడంతో 2022 అక్టోబర్కు ముందే ఇంటర్న్షిప్ విదేశాల్లో పూర్తి చేసిన వారు మళ్లీ ఇక్కడ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అలాంటి అభ్యర్థులు ఈ నిబంధనను సడలించాలని ఎన్ఎంసీని కోరారు. దీన్ని పరిశీలించిన ఎన్ఎంసీ తాజాగా వెసులుబాటు కల్పించింది. తాము అనుమతించిన కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో గతేడాది అక్టోబర్ 21కు ముందు ఎంబీబీఎస్, తత్సమాన అర్హతతో వైద్య విద్య పూర్తి చేసి, ఏడాది పాటు ఇంటర్న్షిప్ చేసినట్లయితే వారికి ఈ ఒక్క ఏడాదికి సడలింపిస్తామని ఉత్తర్వులు జారీచేశారు. (క్లిక్ చేయండి: 20 కోట్ల ఆఫర్ని కాదన్నాడు.. రూ.100కోట్లు ఇచ్చినా కూడా..) -
నెక్ట్స్ పాసైతేనే ఎంబీబీఎస్ పట్టా
సాక్షి, హైదరాబాద్: ఇకపై ఎంబీబీఎస్ పట్టా పొందాలన్నా, పీజీ మెడికల్ సీట్లలో ప్రవేశించాలన్నా, విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు గుర్తింపు ఇవ్వాలన్నా అందరూ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (ఎగ్జిట్) పాస్ కావాలి. ఆ తర్వాతే వైద్యవిద్య పట్టా ఇవ్వనున్నారు. నెక్ట్స్ పాసైతేనే మెడికల్ ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి లభిస్తుంది. అంతేకాదు నియామకాలకు కూడా ఈ పరీక్షలో వచ్చే మార్కులే ఆధా రం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తాజాగా విడుదల చేసింది. దాన్ని ప్రజాభిప్రాయం నిమిత్తం అందుబాటులో ఉంచింది. తదుపరి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి దీన్ని అమలులోకి తీసుకొస్తారు. అంటే 2019–20లో ఎంబీబీఎస్లో చేరిన బ్యాచ్ నుంచి ఇది అమలవుతుందని అంటున్నారు. అంటే వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి అమలవుతుందని చెబుతున్నారు. దీనిపై ఎన్ఎంసీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. రెండింట్లో పాసైతేనే... నెక్ట్స్ పరీక్ష రెండుషెడ్యూళ్లలో నిర్వహిస్తారు. స్టెప్–1, స్టెప్–2 పద్ధతిలో జరుగుతుంది. స్టెప్–1 పరీక్ష నాలుగున్నరేళ్లకు తర్వాత... ఇంటర్న్షిప్కు ముందు ఉంటుంది. ఇది ఎంబీబీఎస్ ఫైనలియర్ పరీక్షతో సమానం. అంటే ఎంబీబీఎస్లో ఫైనయర్ బదులుగా నెక్ట్స్ స్టెప్–1 థియరీ పరీక్ష నిర్వహిస్తారు. ఏటా డిసెంబర్ రెండో వారంలో దీన్ని నిర్వహిస్తారు. దీని ఫలితాలు జన వరి రెండో వారంలో విడుదల చేస్తారు. ఆ తర్వాత యథావిధిగా కాలేజీలు నిర్వ హించే ప్రాక్టికల్ పరీక్షలుంటాయి. ఇంటర్న్షిప్ అయ్యాక స్టెప్–2 ప్రాక్టికల్స్ ఉంటాయి. కోర్సు పూర్తయ్యాక అంటే స్టెప్–1 పరీక్ష తర్వాత ఏడాదికి స్టెప్–2 పరీక్షను నిర్వహిస్తారు. అది పూర్తిగా ప్రాక్టికల్ పరీక్ష. స్టెప్–2 పరీక్ష ఏటా మార్చిలో నిర్వహించి ఏప్రిల్లో ఫలితాలు విడుదల చేస్తారు. ఈ రెండింటిలో పాసైతేనే ఎంబీబీఎస్ పట్టా, పీజీ మెడికల్ అర్హత, విదేశీ వైద్య కు గుర్తింపు ఉంటుంది. స్టెప్–2 కేవలం పాసైతే సరిపోతుంది. ఒకవేళ ఇందులో 3 అంతకంటే తక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలైతేనే సప్లిమెంటరీ ఉంటుంది. లేకుంటే అన్ని పరీక్షలు రాయాలి. మూడు కంటే ఎక్కువ ఫెయిలైతే ఏడాది కోల్పోయినట్లే లెక్క. పదేళ్లలోగా ఎన్నిసార్లు అయినా నెక్ట్స్ రాసుకోవచ్చు. అలాగే ఒకసారి పాసైనా కూడా మార్కులను పెంచుకొనేందుకు కూడా పరీక్ష రాసుకోవచ్చు. అంటే పీజీలో సీటు పొందేందుకు ఎక్కువ మార్కులు రావాలనుకుంటే మరోసారి రాసుకోవచ్చు. నెక్ట్స్ అమలైతే సంబంధిత సమానమైన ప్రస్తుత పరీక్షలు దశలవారీగా రద్దవుతాయి. ఉదాహరణకు ‘నీట్’పీజీ పరీక్ష రద్దు అవుతుంది. ప్రాక్టికల్స్కు ప్రాధాన్యత ఇవ్వాల్సింది... అమెరికా లాంటి దేశాల్లో గత 20 ఏళ్ల నుంచి ఈ తరహా పరీక్షా విధానం అమలవుతోంది. వైద్యవిద్యలో దేశవ్యాప్తంగా ఏకీకృతంగా ఇప్పటికే అమలు చేస్తున్న ‘నీట్’విధానానికి నెక్ట్స్ కొనసాగింపు మాత్రమే. తుది ర్యాంకులో స్టెప్–1కు మాత్రమే కాకుండాప్రాక్టికల్స్కు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేది. – డాక్టర్ కిరణ్ మాదల, తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం రాష్ట్ర ఉపాద్యక్షుడు -
కొత్త వైద్య కళాశాలల దరఖాస్తుకు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా 2023–24 వైద్య విద్య సంవత్సరానికి కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, ప్రస్తుత కాలేజీల్లో యూజీ, పీజీ సీట్లను పెంచుకునేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు పత్రాలను దాఖలు చేయడానికి గడువు తేదీని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) పొడిగించింది. ఎంబీబీఎస్ సీట్లకు ఆగస్టు 31తో, పీజీ సీట్లకు జూలై 20తో గడువు ముగియగా... కాలేజీల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకొని గురువారం నుంచి ఈ నెల 23 వరకు దరఖాస్తులను స్వీకరించడానికి గడువు పొడిగించినట్లు పేర్కొంది. దేశంలో డీమ్డ్ వైద్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలనుకునే సందర్భంలో ప్రస్తుత నిబంధనలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. విశ్వవిద్యాలయానికి సమీపంలోనే రెండేళ్ల కాలం నాటి వెయ్యి పడకల ఆసుపత్రి తప్పనిసరిగా ఉండాలనే నిబంధనను సడలించింది. సమీపంలో లేకపోయినా దేశంలో ఎక్కడైనా సరే వెయ్యి పడకల ఆసుపత్రి రెండేళ్లుగా ఉంటే సరిపోతుందని స్పష్టం చేసింది. అయితే వైద్య సంస్థ, ఆసుపత్రి భవనాలు సొంతంగా ఉండాలని చెప్పింది. డీమ్డ్ విశ్వవిద్యాలయం కోసం దరఖాస్తు చేసే సమయానికే వెయ్యి పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నెలకొల్పి ఉండాలని తేల్చిచెప్పింది. మరోవైపు, మెడికల్ కాలేజీల్లో తనిఖీలు, పర్యవేక్షణకు నిపుణుల కమిటీలో సభ్యులుగా అర్హులైన అధ్యాపకుల పేర్లను పంపించాలని తెలిపింది. ఆధార్ లింక్తో బయోమెట్రిక్ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కచ్చితంగా ఆధార్ నంబర్తో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అనుసరించాల్సిందేనని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. అధ్యాపకులు, ట్యూటర్లు, డిమానిస్ట్రేటర్లు, సీనియర్ రెసిడెంట్లు సహా ప్రతి ఒక్కరు కూడా ఈ విధానాన్ని పాటించాలని, లేకపోతే తదుపరి సంవత్సరాలకు మెడికల్ సీట్లను పొడిగించడం, కొత్త సీట్లకు అనుమతించడం, కొత్త కళాశాలను స్థాపించడం వంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తేల్చిచెప్పింది. ఆధార్ బయోమెట్రిక్ హాజరును ఎన్ఎంసీకి అనుసంధానం చేయాలని తెలిపింది. దీనిపై అభ్యంతరాలు, సూచనలను నెల రోజుల్లోగా director.nmc@nmc.org. inకు పంపాలని పేర్కొంది. -
అనుమతి లేని కాలేజీల్లో చేరొద్దు.. మెడికల్ అభ్యర్థులకు ఎన్ఎంసీ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: అనుమతి లేని మెడికల్ కాలేజీల్లో చేరవద్దని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) విద్యార్థులను హెచ్చరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సహా ఇతర వైద్య కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్న నేపథ్యంలో ఎన్ఎంసీ ఈ ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేని రాజస్తాన్లోని సింఘానియా యూనివర్సిటీ ఎంబీబీఎస్, ఇతర మెడికల్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానించినట్లు ఎన్ఎంసీ తెలిపింది. వివిధ వార్తాపత్రికల్లో సైతం ఈ సంస్థ ప్రకటన ఇచ్చిందని వివరించింది. కొత్త మెడికల్ కాలేజీని స్థాపించడానికి, ఆధునిక వైద్యంలో కోర్సులను అందించడానికి ఎన్ఎంసీ ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది. అనుమతి లేని సంస్థల్లో ఎంబీబీఎస్, ఎండీ సహా ఇతరత్రా వైద్య కోర్సులు చేసిన విద్యార్థులు మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి అనర్హులవుతారని హెచ్చరించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అనుమతి ఉన్న వైద్య కళాశాలల వివరాలను, సీట్ల సంఖ్యను ఎన్ఎంసీ వెబ్సైట్లో ప్రదర్శించింది. ఏదైనా మెడికల్ కాలేజీలో అడ్మిషన్ తీసుకునేముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెబ్సైట్ను పరిశీలించాలని సూచించింది. అన్ని విధాలా కాలేజీలను పరిశీలించి తనిఖీ చేసిన తర్వాతే వాటిల్లో చేరే విషయమై నిర్ణయం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దళారులను నమ్మి మోసపోవద్దు.. రాష్ట్రంలో గత వైద్య ప్రవేశాల అనంతరం మూడు మెడికల్ కాలేజీల అడ్మిషన్లను ఎన్ఎంసీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇది పెద్ద దుమారాన్నే లేపింది. కొన్ని నెలల అనంతరం ఒక కాలేజీ సీట్లను పునరుద్ధరించగా, మరో రెండు కాలేజీల విద్యార్థులను ఇతర ప్రైవేట్ కాలేజీల్లో సర్దుబాటు చేశారు. అయితే 2022–23 వైద్య విద్య అడ్మిషన్లలో ఆ రెండు కాలేజీలైన టీఆర్ఆర్, మహావీర్లకు ఎన్ఎంసీ అనుమతి ఇవ్వలేదు. ఈ విషయాన్ని విద్యార్థులు ప్రత్యేకంగా గమనంలో ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొందరు దళారులు సీట్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుంటారని, ఇలాంటి వారిని నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. -
ఎంబీబీఎస్ విద్యార్థులు ఇకపై ఫ్యామిలీ డాక్టర్లుగా..
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ విద్యార్థులు ఇక ముందు ఫ్యామిలీ డాక్టర్లుగా మారిపోనున్నారు. నేరుగా గ్రామాల్లోని ప్రజల వద్దకే వెళ్లి.. కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోనున్నారు. ఆ కుటుంబాల యోగక్షేమాలను తెలుసుకోవడం, రెండు వారాలకోసారి ఇంటికే వచ్చి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, అవసరమైన మందులు సూచించడం, మరీ అవసరమైతే ఆస్పత్రులకు రిఫర్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించడం వంటివి చేయనున్నారు. ఎంబీబీఎస్ సిలబస్లో భాగంగా కుటుంబాల దత్తత కార్యక్రమాన్ని చేపట్టాలని గతంలో చేసిన సిఫార్సులను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తాజాగా అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు వైద్య విద్య క్యాలెండర్లో కుటుంబాల దత్తతను ప్రధాన అంశంగా ప్రస్తావించింది. ఇంటి ముంగిటికే వైద్యం ప్రస్తుతం చాలావరకు గ్రామాల్లో గుర్తింపు లేని ప్రైవేట్ ప్రాక్టీషనర్లు, ఆర్ఎంపీల వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. కొందరు తెలిసీ తెలియని వైద్యం చేస్తుండటం, నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రాణాల మీదకు వచ్చిన ఘటనలూ ఎన్నో. అర్హత లేని ప్రాక్టీషనర్లు ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాల్సి ఉండగా.. కొందరు సర్జరీలు, డెలివరీలు వంటివి కూడా చేస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. అంతేగాకుండా విచ్చలవిడిగా నొప్పుల మాత్రలు, యాంటీ బయాటిక్స్, ఇతర మందులు ఇస్తున్నారు కూడా. ఈ క్రమంలో అటు గ్రామీణ ప్రజలకు మంచి వైద్యం అందించడం, ఇటు ఎంబీబీఎస్ విద్యార్థులకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు, వివిధ వ్యాధులపై అవగాహన, ప్రాక్టీస్ లభించేందుకు.. కుటుంబాల దత్తత కార్యక్రమాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ఎన్ఎంసీ గతంలోనే సిఫార్సు చేసింది. తాజాగా దీనిని అమల్లోకి తెచ్చింది. దీనితో పలుచోట్ల గ్రామీణ ప్రాంతాల వారికి నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో బ్యాచ్కు ఒక్కో గ్రామం ఎన్ఎంసీ నిర్ణయం ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలకు చెందిన ఒక్కో బ్యాచ్ విద్యార్థులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. బ్యాచ్లోని ఒక్కో విద్యార్థికి ఐదు నుంచి ఏడు కుటుంబాలను కేటాయిస్తారు. ప్రతి 25 మంది విద్యార్థుల బృందాన్ని పర్యవేక్షించడానికి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటారు. వైద్య విద్యార్థులకు స్థానికంగా ఆశా కార్యకర్తల సాయం అందించేలా ఏర్పాటు చేస్తారు. వైద్య విద్యార్థులు ఆయా కుటుంబాల్లోని వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎవరికైనా, ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. తక్షణమే టెలి మెడిసిన్ పద్ధతిలో అవసరమైన వైద్య సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. అవసరమైతే ఆస్పత్రికి రిఫర్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు రెండు వారాలకోసారి ఆయా గ్రామాలకు వెళ్లాలి. కోర్సు మొదటి ఏడాదిలో కనీసం 10 సార్లయినా వారికి కేటాయించిన కుటుంబాల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. దీనంతటినీ కోర్సులో భాగంగానే పరిగణిస్తారు. ఇలా విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుంచే ఫ్యామిలీ డాక్టర్ల అవతారం ఎత్తుతారు. దత్తత తీసుకున్న గ్రామాలకు పదుల సంఖ్యలో వైద్య విద్యార్థులు వచ్చిపోవడం, సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల అక్కడి ప్రజలకు ఆరోగ్య సమకూరుతుందని చెప్తున్నారు. వేల మంది విద్యార్థులు.. లక్షన్నరకుపైగా కుటుంబాలు.. ఈ ఏడాది మొదలవుతున్న కొత్త కాలేజీలతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం 18 ప్రభుత్వ, 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో వచ్చే నెల 15వ తేదీ నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నాయి. అన్ని బ్యాచ్లకు చెందినవారు కలిపి దాదాపు 20 వేల మందికిపైగా ఎంబీబీఎస్ విద్యార్థులు ఉంటారు. ఆయుష్, డెంటల్ వారినీ కలిపితే మరో ఐదారు వేల మంది జత అవుతారు. ఇంతమందికి కుటుంబాల దత్తత బాధ్యత ఇస్తే.. లక్షన్నరకు పైగా కుటుంబాలకు ఆరోగ్య సేవలు అందనున్నాయి. ప్రతి జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఉన్నందున అన్ని చోట్లా ఫ్యామిలీ డాక్టర్ పద్ధతి అమల్లోకి వస్తుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థులు చేసేదిదీ.. ►వైద్య విద్యార్థులు గ్రామాల్లో తాము దత్తత తీసుకున్న కుటుంబాల వద్దకు నెలకు రెండు సార్లు వస్తారు. కుటుంబంలోని వారందరితో మాట్లాడి వారి ఆరోగ్య వివరాలను తెలుసుకుంటారు. ►వ్యక్తుల వారీగా ఆరోగ్య రికార్డులను తయారు చేస్తారు. ఆహారపు అలవాట్లు, వ్యసనాలను తెలుసుకుని నమోదు చేస్తారు. ►అవసరాన్ని బట్టి బీపీ, షుగర్, కిడ్నీ, లివర్, గుండె పనితీరు పరీక్షలు, కేన్సర్ స్క్రీనింగ్, ఇతర వైద్య పరీక్షలు చేయిస్తారు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే.. పరిశీలించి తగిన వైద్య సలహాలు ఇస్తారు. మందులు సూచిస్తారు. అవసరమైతే ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. ►పిల్లలకు వ్యాక్సిన్లు, గర్భిణులకు రెగ్యులర్ చెకప్లపై అవగాహన కల్పిస్తారు. ►రోగాలు రాకుండా ఎలాంటి ఆహార అలవాట్లు అలవరుచుకోవాలో సూచిస్తారు. వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహిస్తారు. ►గ్రామాల్లో స్థానిక పరిస్థితులు, తరచుగా వస్తున్న వ్యాధులను పరిశీలిస్తారు. ►ఈ అన్ని అంశాల్లో తమకు పర్యవేక్షకుడిగా ఉండే అసిస్టెంట్ ప్రొఫెసర్ సూచనల మేరకు వైద్య విద్యార్థులు వ్యవహరిస్తారు. -
మెడి‘కిల్స్’పై ఎన్ఎంసీ నజర్
సాక్షి, హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో జరుగుతున్న ఆత్మహత్యలు, ఆత్మహత్యా ధోరణుల నివారణపై జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) దృష్టి సారించింది. గత ఐదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న పీజీ మెడికల్ విద్యార్థుల సంఖ్య, అదేకాలంలో కాలేజీలను మధ్యలోనే వదిలేసిన విద్యార్థుల వివరాలను తమకు అందజేయాలని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, డీన్లకు తాజాగా లేఖ రాసింది. ఆత్మహత్యలు, కోర్సు వదిలిపెట్టి వెళ్లడం, వైద్య విద్యార్థుల పనివేళలకు సంబంధించిన ఒత్తిడి వివరాలను ఈ నెల ఏడో తేదీ నాటికి పంపాలని కోరింది. ఇటీవల ఎన్ఎంసీ ఆధ్వర్యంలోని అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు(యూజీఎంఈబీ) అధ్యక్షులు డాక్టర్ అరుణ వి.వాణికర్ నేతృత్వంలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటైంది. దాని మొదటి సమావేశంలో వైద్యవిద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి అందిన ర్యాగింగ్ ఫిర్యాదులను సమీక్షించింది. వైద్యవిద్యార్థుల ఆత్మహత్యలు, ఆత్మహత్యా ధోరణిపై చర్చించింది. వైద్యవిద్యార్థులు సంబంధిత మెడికల్ కాలేజీలతోపాటు ఎన్ఎంసీకి కూడా ఫిర్యాదులు చేయడానికి ప్రత్యేక ఈ–మెయిల్ ఐడీని సృష్టించింది. ఈ సమాచారాన్ని అన్ని కాలేజీల వెబ్సైట్లలో ప్రదర్శించాలని, హాస్టల్, మెస్, క్లాస్రూమ్, లైబ్రరీ, లెక్చర్ హాల్, కామన్ రూమ్ మొదలైన ప్రముఖ ప్రదేశాలలో ప్రదర్శించడం ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ఎన్ఎంసీ సూచించింది. 18–30 ఏళ్ల మధ్యలో ఆగమాగం వైద్యవృత్తిలో తలెత్తే ఒడిదొడుకులను తట్టుకోలేక కొందరు యువవైద్యులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక నివేదికలో వెల్లడించిన సంగతి తెలిసిందే. 2016 నుంచి 2020 మధ్యకాలంలో 18 నుంచి 30 ఏళ్ల వయసుకు చెందిన వివిధ రకాల వృత్తుల్లో ఉన్నవారు పలు సమస్యలతో 3,100 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో అనేకమంది వైద్యులు ఉన్నారని పేర్కొంది. అదేకాలంలో వివిధ వయస్సులవారు 12,397 మంది పరీక్షల్లో ఫెయిల్ కావడంవల్ల ఆత్మహత్య చేసుకున్నారు. వారిలోనూ వైద్య విద్యార్థులున్నారు. ఈ నేపథ్యంలో వైద్యవిద్యార్థుల్లో ఒత్తిడి, నిరాశలను తగ్గించడానికి మెడికల్ కాలేజీల్లో యోగాను ఎన్ఎంసీ ప్రవేశపెట్టింది. మరోవైపు విదేశాల్లో చదివిన వేలాదిమంది భారత వైద్య విద్యార్థుల్లో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్(ఎఫ్ఎంజీఈ) పాసయ్యేవారు 20 శాతం వరకే ఉంటున్నారు. ఎఫ్ఎంజీఈ పాసైతేనే మనదేశంలో మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అర్హత ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆత్మహత్యల్లో మూడింట ఒక వంతు పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థులు, మిగిలినవారు ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులు ఉంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. పీజీలో ఆర్థికభారం, వృత్తిపరమైన బాధ్యత, వివాహం కాకపోవడం వంటివి ఆత్మహత్యలకు కారణాలుగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఆత్మహత్యల్లో 60 శాతం ఒత్తిడికి సంబంధించినవే ఉంటున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో కాలేజీ స్థాయిలో జరిగే ఆత్మహత్యల నివారణకు ఎన్ఎంసీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. -
కొత్త వైద్య కళాశాలలకు దరఖాస్తు.. వచ్చే ఏడాదికల్లా మరో ఐదు..
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం (2023–24) నుంచి రాష్ట్రంలో కొత్తగా ఐదు వైద్య కళాశాలలు ప్రారంభించేందుకు వీలుగా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కు చేసే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 16 వైద్య కళాశాలలను ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరంలలో ఏర్పాటవుతున్న కొత్త వైద్య కళాశాలల్లో అకడమిక్ కార్యకలాపాలను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వైద్యశాఖ వేగంగా చేపడుతోంది. వీటి ఏర్పాటు నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అప్గ్రేడ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రులను డీఎంఈ పరిధిలోకి బదలాయించి, ఈ ఐదుచోట్ల ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్లను నియమించారు. వీరే కొత్త కాలేజీల అనుమతుల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేశారు. రూ.401 కోట్ల వ్యయంతో.. ఆయా ప్రాంతాల్లోని జిల్లా ఆస్పత్రులను బోధనాసుపత్రులుగా అభివృద్ధి చేయడంతో పాటు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.401.40 కోట్లు వెచ్చిస్తోంది. ఒక్కో ఆస్పత్రిలో రూ.5 కోట్లతో అదనపు నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతోంది. రూ.100 కోట్లతో అవసరమైన పరికరాలను కూడా సమకూరుస్తోంది. అలాగే, వైద్య కళాశాలల కార్యకలాపాల కోసం నంద్యాల, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం మచిలీపట్నంలలో రూ.146 కోట్లతో ప్రీ–ఇంజనీర్డ్ బిల్డింగ్స్ (పీఈబీ) నిర్మిస్తున్నారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు లెక్చర్ హాళ్లు, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, అనాటమీ బ్లాకులతో పీఈబీలు నిర్మిస్తున్నారు. రూ.16 వేల కోట్లతో నాడు–నేడు వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం రూ.16వేల కోట్లకు పైగా వ్యయంతో నాడు–నేడు కార్యక్రమానికి సీఎం జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతమున్న 11 వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు, ఇతర ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు 16 నూతన వైద్య కళాశాలలను ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం రూ.12,268 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. ఏలూరు, విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, నంద్యాలలో 2023–24 నాటికి, మిగిలిన 11 చోట్ల 2024–25లోగా వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు చేపట్టాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ ఏడాది ఆఖరులో తనిఖీలు ఐదు కొత్త వైద్య కళాశాలల అనుమతుల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేశాం. ఈ ఏడాది ఆఖరులో ఎన్ఎంసీ బృందం తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంది. తనిఖీల అనంతరం అనుమతులు మంజూరు అవుతాయి. – డాక్టర్ ఎం. రాఘవేంద్రరావు, డీఎంఈ కొత్తగా 750 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా ఏర్పాటయ్యే ఈ ఐదు వైద్య కళాశాలల్లో ఒక్కోచోట 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రెండు వేలకు పైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వైద్య విద్యను అభ్యసించాలనుకునే వారికి కొత్త కాలేజీల ఏర్పాటు ఎంతో వరంగా మారనుంది. -
అడుగడుగునా కెమెరాలు .. బయోమెట్రిక్ అటెండెన్స్
సాక్షి, హైదరాబాద్: మెడికల్ కాలేజీల ఇష్టారాజ్యానికి చెక్ పెట్టేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నడుం బిగించింది. అధ్యాపకులు పూర్తి స్థాయిలో లేని కళాశాలలకు చెక్ పెట్టేలా చర్యలకు సంసిద్ధమైంది. వైద్య విద్యలో నాణ్యతను పెంపొందించే దిశగా పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఎన్ఎంసీ ఆదేశించింది. ప్రతి కాలేజీలో 25 చొప్పున సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. అదే విధంగా అన్ని మెడికల్ కాలేజీల్లో ఆధార్ సహిత బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్), రోగుల వివరాలు, స్థితిగతులు తెలుసుకునేలా (ట్రాకింగ్) హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (హెచ్ఎంఎస్) అమలు చేయాలని స్పష్టం చేసింది. కళాశాలల్లోని ఈ వ్యవస్థను ఢిల్లీలోని ఎన్ఎంసీ వద్ద ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానిస్తారు. లైవ్ వీడియో ఫీడ్ను కమాండ్ సెంటర్కు షేర్ చేసేలా ఏర్పాట్లు చేయాలని ఎన్ఎంసీ మార్గదర్శకాలు జారీ చేసింది. తద్వారా ప్రతి మెడికల్ కాలేజీని నేరుగా ఎన్ఎంసీ పర్యవేక్షించనుంది. మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలు.. ►బోధన సిబ్బంది,సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్ల హాజరును నమోదు చేయడానికి సమర్థవంతమైన డిజిటల్ పరిష్కారం బయోమెట్రిక్ వ్యవస్థ. అందువల్ల నేషనల్ ఇన్ఫర్మేటి క్స్ సెంటర్ (ఎన్ఐసీ) అభివృద్ధి చేసిన ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీ లు ఈ నెల పదో తేదీలోగా అమల్లోకి తేవాలి. ►మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లోని రోగుల లోడ్, ఇతర వివరాలను పర్యవేక్షించేందుకు హెచ్ఎంఎస్ను అమలు చేయాలి. అందుకోసం ఈ–హాస్పిటల్ సాఫ్ట్వేర్ను ఎన్ఐసీ అభివృద్ధి చేసింది. ఇది ఆసుపత్రి కౌంటర్లో రోగుల నమోదును సులభతరం చేస్తుంది. మొబైల్ ఓటీపీ, ఆధార్ మొదలైన వాటి ద్వారా రోగుల స్వీయ నమోదును సులభతరం చేస్తుంది. ►వైద్య విద్యపై నియంత్రణకు, ప్రత్యేకించి కొన్ని వైద్య కళాశాలలు తనిఖీల సందర్భంగా నకిలీ ఫ్యాకల్టీలను, రోగులను తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న విధానాన్ని నిరోధించేందుకు కొత్త పద్ధతి ఉపయోగపడుతుంది. ►మెడికల్ కాలేజీల ప్రాంగణంలోని తరగతి గదులు, ఇతర కీలక ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు.. ప్రతిదీ ట్రాక్ చేయడానికి, కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయా కాలేజీలన్నిటినీ పరిశీలించడానికి వీలు కలుగుతుంది. ►కాలేజీల నుంచి లైవ్ ఫీడ్, బయో మెట్రిక్ హాజరు తదితరాల పర్యవేక్షణకు, సమన్వయం చేసేందుకు ఒక నోడల్ అధికారిని నియమించాలి. ►ఏఈబీఏఎస్ పోర్టల్లో ఫ్యాకల్టీ మొత్తం స్వయంగా నమోదు చేసుకోవాలి. మెడికల్ కాలేజీ నోడల్ అధికారి హాజరును పర్యవేక్షిస్తారు. ►ఈ నెలాఖరు నాటికి మెడికల్ కాలేజీలు ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. -
విదేశీ వైద్య విద్యార్థులకు రెండేళ్ల ఇంటర్న్షిప్
సాక్షి, హైదరాబాద్: ఉక్రెయిన్లో చదువుకున్న వైద్య విద్యార్థులకు భారత ప్రభుత్వం ఊరటనిచ్చింది. యుద్ధం కారణంగా చదువు చివరి సంవత్సరంలో ఆగిపోయిన విద్యార్థులకు ఉపశమనమిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్ 30 కన్నా ముందు మెడిసిన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్లు జారీచేసింది. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష (ఎఫ్ఎంజీఈ) రాసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే వారు ఆ దేశంలో భౌతికంగా తరగతులకు హాజరుకానందున, ఎఫ్ఎంజీఈలో అర్హత సాధించాక వారు రెండేళ్లపాటు కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్షిప్ (సీఆర్ఎంఐ) చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. కరోనా లేదా ఉక్రెయిన్–రష్యా యుద్ధం కారణంగా చాలా మంది వైద్య విద్యార్థులు మెడిసిన్ పూర్తి చేయకుండా ఫైనల్ ఇయర్లోనే తిరిగొచ్చారు. వారు ఎలాంటి ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోలేదు. దీంతో సీఆర్ఎంఐని రెండేళ్లు తప్పనిసరి చేసింది. ఆ తర్వాత వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హులవుతారు. అనంతరం ఎక్కడైనా ప్రాక్టీస్ గానీ, ఏవైనా ఆస్పత్రుల్లో పనిచేయడానికి గానీ వీలు కలుగుతుంది. కాగా, కేంద్రం ఈ వెసులుబాటును ఈ ఏడాది వరకే కల్పించినట్లు ఎన్ఎంసీ స్పష్టంచేసింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి 20 వేల మంది మెడికల్ విద్యార్థులు ఇండియాకు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. అందులో చివరి ఏడాది చదువుతున్న వారు 4 వేల మంది వరకు ఉంటారని అంచనా. వారందరికీ కేంద్రం ఇచ్చిన వెసులుబాటు ప్రయోజనం కలగనుంది. -
ఉక్రెయిన్లో చదివిన వైద్య విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్
సాక్షి,న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో చదువుకున్న వైద్య విద్యార్థులకు భారత ప్రభుత్వం ఊరటనిచ్చింది. యుద్ధ కారణంగా చదువు ఆగిపోయిన విద్యార్థులకు ఉపశమనమిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 కన్నాముందు మెడిసిన్ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్కు కేంద్ర ప్రభుత్వం సర్టిఫికేట్లు జారీ చేసింది. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష(ఎఫ్ఎంజీఈ) రాసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఇందులో అర్హత సాధించిన వారు రెండేళ్లపాటు కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్షిప్(CRMI) చేయాల్సి ఉంటుంది. ఈమేరకు జాతీయ వైద్య కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కరోనా లేదా ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా చాలా మంది వైద్య విధ్యార్థులు మెడిసిన్ పూర్తి చేయకుండా ఫైనల్ ఇయర్లోనే తిరిగొచ్చారు. వారు ఎలాంటి ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోలేదు. దీంతో సీఆర్ఎంఐని రెండేళ్లు తప్పనిసరి చేసింది కేంద్రం. సాధారణ వైద్య విద్యార్థులకు ఇది ఒక్క ఏడాదే ఉంటుంది. చదవండి: జర జాగ్రత్త.. దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు -
మనసుంటే మార్గం లేదా!
అగమ్యగోచరం! ఒక్కమాటలో ఉక్రెయిన్ నుంచి భారత్ తిరిగొచ్చిన మన వైద్య విద్యార్థుల ప్రస్తుత పరిస్థితి ఇదే! రష్యా దాడితో యుద్ధంలో చిక్కిన ఉక్రెయిన్ నుంచి నాలుగు నెలల క్రితం, నానా కష్టాలు పడి స్వదేశానికి తిరిగొచ్చిన దాదాపు 20 వేల మంది భారతీయ వైద్య విద్యార్థులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రాణాలు అరచేత పట్టుకొని భారత్కు తిరిగొచ్చిన ఆ విద్యార్థులు అటు మళ్ళీ ఉక్రెయిన్కు పోలేక, ఇటు స్వదేశీ విద్యాలయాల్లో మెడికల్ కోర్సును కొనసాగించేందుకు అనుమతి రాక తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తున్నారు. విదేశీ వైద్య సంస్థల విద్యార్థులను భారతీయ వైద్య సంస్థల్లోకి బదలీ చేసేందుకు, సర్దుబాటు చేసేందుకు 1956 నాటి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టంలో కానీ, 2019 నాటి నేషనల్ మెడికల్ కమిషన్ చట్టంలో కానీ నిబంధనలు లేవంటూ కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఇటీవల తేల్చిచెప్పడం విద్యార్థులకు అశనిపాతమే. అమూల్యమైన కాలం, చదువు నష్టపోకుండా కాపాడతామంటూ ‘ఆపరేషన్ గంగ’ ద్వారా వారిని స్వదేశానికి తెస్తున్నప్పుడు వాగ్దానం చేసిన కేంద్రం ఇప్పుడిలా చేతులు దులుపుకోవడం దారుణం. నెలలు గడుస్తున్నప్పటికీ దేశంలో వైద్య విద్యనూ, వైద్య నిపుణులనూ నియంత్రించే ‘జాతీయ వైద్య కమిషన్’ (ఎన్ఎంసీ) నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు రాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లి తండ్రులు ఏమీ పాలుపోని స్థితిలో ఉన్నారు. ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఈ ఒక్కసారికి తమకు ఎలా గైనా భారత వైద్యవిద్యా సంస్థల్లో చోటిచ్చి, కోర్సు కొనసాగించే వీలు కల్పించాలని ప్రధాని మోదీని వేడుకుంటున్నారు. నిజానికి, దేశంలోని ఫిజిషియన్ల స్వచ్ఛంద సంఘమైన ‘భారతీయ వైద్య సంఘం’ (ఐఎంఏ) సైతం విద్యార్థులను భారతీయ వైద్యసంస్థల్లో సర్దుబాటు చేయాల్సిందిగా నాలుగు నెలల క్రితమే కేంద్రాన్ని అభ్యర్థించింది. ‘ఉక్రెయిన్లో పరిస్థితులు చక్కబడే వరకు వారిని త్రిశంకు స్వర్గంలో ఉంచడం సరికాదు’ అంటూ ప్రధానికి లేఖ కూడా రాసింది. సుప్రీమ్ కోర్ట్ సైతం ఉక్రెయిన్ నుంచి వచ్చేసిన మన విద్యార్థులు ఇక్కడి కాలేజీల్లో క్లినికల్ శిక్షణ పూర్తి చేసుకొనేలాగా రెండు నెలల్లో ఒక కార్యాచరణ పథకాన్ని తయారు చేయమంటూ ఏప్రిల్ 29న ఎన్ఎంసీకి ఆదేశాలి చ్చింది. కానీ, నెలలు గడిచినా ఎన్ఎంసీ నిర్ణయం వాయిదాలు వేస్తూ వచ్చింది. తీరా ఇప్పుడు స్టూడెంట్లకు అనుమతి నిరాకరించినట్టు ప్రభుత్వం పార్లమెంట్లో తాపీగా బయటపెట్టింది. ఏ రకంగా చూసినా ఈ నిర్ణయం సమర్థనీయం కాదు. ఇప్పటికే సమస్యను ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళేందుకు విద్యార్థుల బృందం అయిదు రోజుల నిరాహార దీక్షకూ దిగింది. అయినా పాలకుల మనసు కరగట్లేదు. అధికారిక అంచనాల ప్రకారం ఉక్రెయిన్, చైనాల్లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న 40 వేల మందికి పైగా భారతీయులు యుద్ధం, కరోనాల కారణంగా ఇంటికి తిరిగొచ్చారు. రష్యా, ఫిలిప్పైన్స్, జార్జియాలను కలుపుకొంటే 60 వేల మంది దాకా ఉన్నారు. వారందరికీ ఇప్పుడిదే సమస్య. కాలం వృథా అయినా, చివరకు ఆయా కేసులను బట్టి విద్యార్థులను తిరిగి చేర్చుకోవడానికి చైనా అంగీకరించింది. ఇక, ఉక్రెయిన్ నుంచి వచ్చినవారు ఇప్పటికైతే ఆన్లైన్ క్లాసులు హాజరవుతున్నారు. నేరుగా హాజరై చేయాల్సినవి కాబట్టి సహజంగానే ప్రాక్టికల్స్పై దెబ్బపడింది. ఫిబ్రవరి 24న మొదలైన యుద్ధానికి ఇప్పుడప్పుడే తెర పడేలా లేదు. ప్రాక్టికల్స్ లేకుండా పరిపూర్ణత అసాధ్యం గనక విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. యుద్ధం వల్ల చదువు వదిలేసి మధ్యలో వచ్చేసిన మన వైద్య విద్యార్థులు మిగిలిన ఇంటర్న్ షిప్ను భారత్లో పూర్తి చేసుకోవచ్చంటూ ఎన్ఎంసీ మార్చిలో సర్క్యులర్ జారీ చేసింది. కాకపోతే విదేశీ వైద్య విద్యార్హత ఉన్న భారతీయ స్టూడెంట్స్ అందరి లాగానే వాళ్ళు కూడా తప్పకుండా స్క్రీనింగ్ పరీక్ష ‘ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్’ (ఎఫ్ఎంజీఈ)లో పాస్ కావాలని షరతు పెట్టింది. అలాంటి షరతులు మరిన్ని కావాలంటే పెట్టి, మిగతా విద్యార్థులకు కూడా ఎన్ఎంసీ సాంత్వన కలిగించవచ్చు. కానీ, ఆ పని ఎందుకు చేయట్లేదో అర్థం కాదు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక లాంటి కొన్ని రాష్ట్రాలు మన ఉక్రెయినీ విద్యార్థలు ‘పరిశీలకుల’ లాగా స్థానిక కళాశాలలకు ఆన్ లైన్లో హాజరు కావచ్చని అనుమతి ఇచ్చాయి. అయితే, ప్రాక్టికల్ క్లాసులు లేని ఈ అబ్జర్వర్షిప్ తాత్కాలిక పరిష్కారమే. శాశ్వత పరిష్కారం కేంద్రం చేతుల్లోనే ఉంది. సర్కారు ఇప్పటికైనా దీన్ని స్పెషల్ కేసుగా పరిగణించాలి. చట్టంలో అవకాశం లేదంటూ పిల్లల భవిష్యత్తును చీకటిలోకి నెట్టే కన్నా, మనం చేసుకున్న చట్టమే గనక వెసులుబాటిస్తూ మార్పు చేసుకో వడం విజ్ఞత. ఉక్రెయిన్ సమస్య ఒక రకంగా మేలుకొలుపు. పాలకులు ఇకనైనా కళ్ళు తెరిచి, మన వాళ్ళు వైద్యవిద్య కోసం విదేశాలకు ఎందుకు ఎగబడుతున్నారో ఆలోచించాలి. ఉక్రెయిన్లో రూ. 4 లక్షల్లో వైద్యవిద్య చదవచ్చనీ, జర్మనీ లాంటి ఇతర ఐరోపా దేశాలతో పోలిస్తే అక్కడ జీవనవ్యయం తక్కువనీ భావన. రోగులతో పోలిస్తే వైద్యుల సంఖ్య చాలా తక్కువున్న మన దేశంలోనూ ప్రభుత్వం ఇకనైనా తక్కువ ఫీజులతో, నాణ్యమైన వైద్యవిద్యను అందుబాటులో ఉంచాలి. మరింతమంది వైద్యుల్ని దేశంలోనే తయారు చేయాలి. అందుకు తొలి అడుగు ఇప్పుడే వేయాలి. యుద్ధంతో ఇంటిదారి పట్టి, ఇప్పటికే బోలెడంత మానసిక్ష క్షోభతో తాము చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న ఈ పిల్లల గోడు వినకపోతే అది మహాపాపం. వారి జీవితాలను కాపాడాల్సింది పాలకులే! ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక చర్యలు అవసరం. ప్రభుత్వానికి మనసుంటే మార్గం లేదా! -
వైద్య సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు మెడికల్ కాలేజీల్లో మెడికల్ సీట్ల రద్దుతో విద్యాసంవత్సరం నష్టపోయే విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేసే అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ విషయమై గత నెల 30న లేఖ రాసిన జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) వారంలోగా స్పందించాలని సూచించినా వైద్య, ఆరోగ్యశాఖ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అయితే విద్యార్థులను సర్దుబాటు చేయాలని మాత్రమే ఎన్ఎంసీ సూచించిందని... అదనపు సీట్లు (సూపర్ న్యూమరరీ) సృష్టించడంపై స్పష్టత ఇవ్వలేదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు చెబుతున్నాయి. సరైన వసతులు లేవంటూ సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్, పటాన్చెరులోని టీఆర్ఆర్, వికారాబాద్లోని మహావీర్ కాలేజీల్లోని మొత్తం 450 ఎంబీబీఎస్ సీట్లతోపాటు రెండు కాలేజీల్లోని 113 పీజీ మెడికల్ అడ్మిషన్లను ఎన్ఎంసీ రద్దు చేయడం తెలిసిందే. దీంతో ఆయా కాలేజీల్లో ఈ ఏడాది చేరిన వైద్య విద్యార్థులు అడ్మి షన్లు పొందిన నెల రోజులకే రోడ్డున పడ్డారు. తమ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్నారు. ఎన్ని విన్నపాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అంటున్నారు. బిహార్లో సర్దుబాటు... రాష్ట్రానికి రాసిన లేఖలో బిహార్లో సర్దుబాటు అంశాన్ని ఎన్ఎంసీ ప్రస్తావించింది. ఆ కాపీని కూడా జత చేసింది. బిహార్లోని ఒక కాలేజీలో సైతం ఎంబీబీఎస్ అడ్మిషన్లు రద్దవగా అందులోని విద్యార్థులను ఏడు ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేశారు. అయితే ఒక కాలేజీ కాబట్టి విద్యార్థుల సర్దుబాటు చిన్న విషయమని కాళోజీ వర్గాలు అంటున్నాయి. కానీ రాష్ట్రంలో మూడు కాలేజీల విద్యార్థులను సర్దుబాటు చేయడం కష్టమని చెబుతున్నాయి. అయినా ఎన్ఎంసీ అనుమతిస్తే ఎంబీబీఎస్ విద్యార్థులను సర్దుబాటు చేయొచ్చని, పీజీ మెడికల్ విద్యార్థులను సర్దుబాటు చేయడం క్లిష్టమైన వ్యవహారమని పేర్కొంటున్నాయి. ఎన్ఎంసీ నుంచి మార్గదర్శకాలు రాకుండా సర్దుబాటు చేస్తే తర్వాత న్యాయపరమైన చిక్కులు వస్తాయని కాళోజీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎన్ఎంసీ మార్గదర్శకాలు ఇచ్చిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని విద్యార్థులు నిలదీస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. -
రోగులపై ప్రత్యక్ష ప్రయోగాలొద్దు
పీజీ వైద్య విద్యలో జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మరిన్ని సంస్కరణలను తీసుకొచ్చింది. 23 సంవత్సరాల తర్వాత పీజీ వైద్యవిద్యలో మార్పులకు శ్రీకారం చుట్టిన ఎన్ఎంసీ... 2022–23 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా తీసుకొచ్చిన విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు పీజీ కోర్సులు చదువుతున్న వైద్య విద్యార్థులు పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలను నేర్చుకోవడంతోపాటు కోర్సు చివర్లో పరీక్షలు రాస్తున్నారు. దీంతో వైద్యులంతా ఒకే తరహా వైఖరికి అలవాటుపడుతున్నట్లు గుర్తించిన ఎన్ఎంసీ... తాజాగా ఆ విధానాలను సంస్కరించింది. పలు రకాల మార్పులు చేస్తూ సరికొత్త విధానాలను ప్రవేశపెట్టింది. కొత్తగా అమల్లో్లకి తెచ్చిన విధానంతో పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలే కాకుండా రోగితో మెలిగే తీరు, కేసులను నిర్వహించే పద్ధతులు, ప్రయోగాలు తదితరాలన్నింటా నూతన విధానాలను తీసుకొచ్చింది. – సాక్షి, హైదరాబాద్ వైద్యవిద్యలో చివరగా 1998 సంవత్సరంలో అప్పటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సంస్కరణలు వచ్చాయి. ఆ తర్వాత 2018లో మరిన్ని సంస్కరణలను ప్రభుత్వం తీసుకురాగా... వాటిని 2022’–23 సంవత్సరం నుంచి ఎన్ఎంసీ అమలు చేస్తోంది. పుస్తకాల్లోని సిలబస్ ఆధారంగా పాఠ్యాంశాలను అర్థం చేసుకున్నప్పటికీ... అభ్యసన కార్యక్రమాలన్నీ నైపుణ్యంఆధారంగా చేపట్టేలా వైద్య విద్య సాగాలని ఎన్ఎంసీ ఆదేశించింది. ఈ మేరకు నైపుణ్య ఆధారిత పీజీ వైద్య విద్యను ప్రవేశపెట్టింది. ఆ మేరకు నిబంధనలు పొందుపరిచి అందుకు సంబంధించిన మార్గదర్శకాలను వైద్య విద్యాసంస్థలకు జారీ చేసింది. ఇప్పటివరకు పీజీ వైద్య విద్యార్థులు పాఠ్యాంశాన్ని వినడం (థియరీ), నిపుణుల సమక్షంలో రోగులపై ప్రయోగాలు చేయడం జరిగేది. థియరీ క్లాస్లో విజ్ఞానాన్ని సంపాదించడం, ప్రయోగాత్మకంగా చికిత్స అందించడం, పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత సాధించడం లాంటి మూడు పద్ధతులుండేవి. ఇకపై పీజీ వైద్య విద్యార్థి తాను చదువుతున్న స్పెషలైజేషన్ కోర్సుకు సంబంధించి పాఠ్యాంశాలను వినడంతోపాటు నేరుగా రోగులపై శిక్షణలో భాగంగా ప్రయోగాలు చేసే వీలు లేదు. ఎందుకంటే వైద్య విద్యార్థులు చేస్తున్న ప్రత్యక్ష ప్రయోగాలతో రోగులకు ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇవి వికటించడంతో ప్రాణాలు సైతం కోల్పోతున్న ఉదాహరణలున్నాయి. ఈ క్రమంలో ఇకపై విద్యార్థులు పాఠ్యాంశాన్ని అర్థం చేసుకున్నాక మనుషులను పోలిన మోడల్స్ (నమూనా)పై నిర్దిష్ట పద్ధతిలో ప్రయోగాలు జరపాలి. ఉదాహరణకు గైనకాలజిస్ట్ నేరుగా డెలివరీ చేయకుండా గర్భిణిగా ఉన్న మహిళ రూపాన్ని పోలిన బొమ్మపై నిర్దేశించిన నిబంధనలు పాటిస్తూ డెలివరీ చేయాల్సి ఉంటుంది. ప్రతి మెడికల్ కాలేజీలో స్కిల్ ల్యాబ్స్ తప్పకుండా ఉండాలని జాతీయ మెడికల్ కమిషన్ స్పష్టం చేసింది. స్కిల్ ల్యాబ్ నిర్వహణ ఆధారంగా కాలేజీలకు ర్యాంకింగ్ లు సైతం ఇవ్వనున్నట్లు తాజా మార్గదర్శకాల్లో పొందుప ర్చింది. స్కిల్ ల్యాబ్స్లో వైద్య విద్యార్థులు నైపుణ్యం ఆధారిత విజ్ఞానాన్ని పెంచుకుంటారు. ఇందులో అన్ని వైద్యశాస్త్రాలకు సంబం ధించిన అన్ని నమూనాలు, ఉదాహరణలతో సహా అందుబాటులో ఉంటాయి. స్కిల్ ల్యాబ్స్ ఆధారంగానే పీజీ సీట్ల కేటాయింపు ఉంటుంది. Ü పీజీ వైద్య విద్యా ర్థులు రోగితో ఎలా మాట్లాడాలి... వారితో ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి తదితర అంశాలపైనా అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా ప్రతి మూడు నెలలకోసారి ప్రతి అంశంపైనా ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. పాఠ్యాంశ పరిజ్ఞానం, రోగితో మాట్లాడటం, ప్రయోగ పరీక్షలు చేసి చూపడంపై ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతి మూడు నెలలకోసారి ప్రతి సబ్జెక్ట్పై కొన్ని లక్ష్యాలను చేరుకుంటూ కోర్సును ముందుకు తీసుకెళ్లాలి. పీజీ వైద్యవిద్యలో ప్రస్తుతం 77 సబ్జెక్టులు ఉన్నాయి. అందులో 30 ఎండీలు, 6 ఎంఎస్లు, 19 డిప్లొమాలు, 15 డీఎంలు, 7 ఎంసీహెచ్ల విభాగాలు ఉంటాయి. ప్రతి కోర్సుకు మూడు నెలలకోసారి ఏం సాధించాలో లక్ష్యాలు ఉంటాయి. రోగితో ఎలా వ్యవహరిస్తారన్న దానిపై ప్రతి మూడు నెలలకోసారి పరీక్ష ఉంటుంది. రోగితో ఎలా మాట్లాడాలన్న దానిపై శిక్షణ ఇస్తారు. కఠినంగా ఉంటే మార్పులు చేపట్టే అవకాశం ఉంటుంది. -
మెడికల్ సీట్ల రద్దుపై ఎన్ఎంసీ మార్గదర్శకాలు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సీట్లను రద్దు చేస్తూ జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ఇటీవల ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో వాటి అమలుకు స్పష్టమైన మార్గదర్శకాలను ఇవ్వాల్సిందిగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎన్ఎంసీని కోరింది. ఈ మేరకు లేఖ రాసినట్లు కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ బి.కరుణాకర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎన్ఎంసీ మార్గదర్శకాలు వచ్చిన తర్వాత ఆయా కళాశాలల్లోని విద్యార్థులను నిబంధనల మేరకు యూనివర్సిటీ పరిధిలోని వివిధ వైద్య కళాశాలల్లో సర్దుబాటు చేస్తామన్నారు. ఏ విద్యార్థి కూడా సీటు కోల్పోవడం జరగదని ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. -
మెడి‘కిల్’ సీట్లపై కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెన్నార్, మహవీర్, టీఆర్ఆర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది చేరిన ఎంబీబీఎస్, పీజీ విద్యార్థుల అడ్మిషన్లను జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) రద్దు చేసిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ కరుణాకర్రెడ్డి, వైద్య విద్యా సంచాలకుడు రమేశ్రెడ్డి ఇందులో ఉన్నారు. అడ్మిషన్లు పూర్తయి, తరగతులు కూడా ప్రారంభించాక మెడికల్ సీట్లను ఉపసంహరించుకోవడం సమంజసం కాదని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని కమిటీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్ఎంసీ అధికారులతో కమిటీ పలు దఫాలుగా మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఆయా ప్రైవేటు మెడికల్ కాలేజీలకు చెందిన విద్యార్థులు కొందరు మంగళవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావును కలిసి గోడు విన్నవించుకున్నారు. మరికొందరు విద్యార్థులు వరంగల్లోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులను కలిసి తమ పరిస్థితిని విన్నవించారు. సర్దుబాటు సాధ్యం కాదు! ఒకవైపు ఉన్నతస్థాయి కమిటీ సంప్రదింపులు కొనసాగుతుండగా మరోవైపు ఎన్ఎంసీకి నేరుగా లేఖ రాయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మంత్రి హరీశ్రావును కలిసిన సందర్భంగా ఆయన ఈ విషయం తమకు చెప్పినట్లు విద్యార్థులు వెల్లడించారు. అడ్మిషన్లకు ముందు అనుమతి ఇచ్చి విద్యార్థులు చేరిన తర్వాత కొంతకాలానికే వాటిని ఉపసంహరించుకోవడం వల్ల విద్యార్థులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని, కాబట్టి వారు ఈ సంవత్సరం ఆయా కాలేజీల్లోనే చదివేలా చూడాల్సిందిగా లేఖలో కోరాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. కాలేజీలు నిర్ణీత సమయంలోగా లోపాలను సరిచేసుకునేలా యాజమాన్యాలను ఆదేశించాలి్సందిగా ఎన్ఎంసీకి సూచించడంతోపాటు ఆ మేరకు ప్రభుత్వం కూడా ప్రైవేటు కాలేజీలపై ఒత్తిడి తెస్తుందనే హామీ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. మూడు కాలేజీల్లో పెద్ద సంఖ్యలో ఉన్న విద్యార్థులను ఇతర చోట్ల సర్దుబాటు చేయడం సాధ్యం కాదనే విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావించే అవకాశముందని చెబుతున్నారు. కోర్టుకెళ్లడమే మార్గమా? వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారినా ఆయా కాలేజీల యాజమాన్యాలు పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం మౌలిక సదుపాయాలు లేనప్పుడు కౌన్సెలింగ్జాబితాలో వాటిని ఎందుకు చూపించాల్సి వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో కాళోజీ వర్సిటీపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీల యాజమాన్యాల కారణంగా ఉత్పన్నమైన ఈ సమస్య పరిష్కారానికి కోర్టుకు వెళ్లడం ఒక్కటే మార్గమని కొందరు అధికారులు చెబుతున్నారు. కాగా, మరిన్ని ప్రైవేటు కాలేజీల్లో సీట్లు రద్దయ్యే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారంతో వసతులు సరిగా లేని కాలేజీల యాజమాన్యాల్లో ఆందోళన మొదలైంది. ప్రొఫెసర్లను మీరే తెచ్చుకోండి.. ఇదీ ఓ కాలేజీ వరస మౌలిక వసతులు లేకపోవడం, అధ్యాపకుల కొరత వంటి ప్రధాన కారణాలతోపాటు ఇతరత్రా కారణాలతో ఎన్ఎంసీ అడ్మిషన్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. ఒక కాలేజీలో కీలకమైన పీజీ స్పెషలైజేషన్కు ప్రొఫెసర్లు లేనేలేరు. లైబ్రరీ వసతి లేదు. దీనిపై కొందరు విద్యార్థులు ఇటీవల యాజమాన్యాలను నిలదీస్తే ‘మీరే ప్రొఫెసర్లను తెచ్చుకోండి’ అంటూ దురుసుగా సమాధానమిచ్చారని విద్యార్థులు తెలిపారు. ఇలాంటి కాలేజీల్లో చేరి తాము తప్పు చేశామని, ప్రభుత్వం తమ సమస్యపై దృష్టి పెట్టి ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయాలని కోరుతున్నారు. -
మెడికోలపై పిడుగు.. జాతీయ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యపై ఆశతో ప్రైవేటు కాలేజీలే అయినా చేరారు. కన్వీనర్, బీ కేటగిరీ, ఎన్ఆర్ఐ కోటాల్లో అడ్మిషన్ కోసం లక్షల రూపాయలు చెల్లించారు. రోజూ తరగతులకు హాజరవుతున్నారు. తీరా నెల రోజులకే తమ మెడికల్ సీట్లు రద్దు కావడంతో కంగుతిన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చెందిన ఈ వైద్య విద్యార్థులు.. తమ భవిష్యత్తు ఏమిటో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఆయా కాలేజీల్లో ఇటీవల చేరిన ఎంబీబీఎస్, పీజీ మెడికల్ విద్యార్థుల అడ్మిషన్లకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తీసుకున్న సంచలన నిర్ణయమే ఇందుకు కారణం. కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం, అధ్యాపకుల్ని అవసరం మేరకు నియమించక పోవడం, లేబొరేటరీలు సరిపడా లేకపోవడం వంటి తదితర కారణాలతో మొత్తం 520 సీట్లకు ఇచ్చిన అనుమతిని రద్దు చేసినట్లు ఎన్ఎంసీ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు లేఖ రాసింది. అలాగే సంబంధిత ఎంఎన్ఆర్, టీఆర్ఆర్, మçహావీర్ కాలేజీల యాజమాన్యాలకు కూడా లేఖలు పంపించింది. కాగా అడ్మిషన్ల రద్దుపై ఈ 3 కాలేజీలు ఎన్ఎంసీకి అప్పీలుకు వెళ్లాయి. కాలేజీల్లో చేరిన నెల రోజుల్లోపే ఇలా సీట్లకిచ్చిన అనుమతిని రద్దు చేయడం ఇటీవలి కాలంలో ఎప్పుడూ జరగలేదని వైద్యవిద్య వర్గాలు వెల్లడించాయి. విద్యార్థులు క్లాసులకు వెళ్తుండగా.. సాధారణంగా మెడికల్ అడ్మిషన్లకు ముందే ఎన్ఎంసీ ఆకస్మిక తనిఖీలు చేసి అడ్మిషన్లకు అనుమతి ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తుంది. కానీ 2021–22 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి గతేడాది నవంబర్లో అడ్మిషన్లు చేసుకోవచ్చని ఆయా కాలేజీలకు అనుమతినిచ్చింది. తీరా అడ్మిషన్లు పూర్తయిన తర్వాత, విద్యార్థులు కాలేజీలకు వెళ్తున్న సమయంలో ఆయా అడ్మిషన్లకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్లు ఎన్ఎంసీ తెలిపింది. ఎంఎన్ఆర్ (సంగారెడ్డి), టీఆర్ఆర్ (పటాన్చెరు), మహవీర్ (వికారాబాద్) మెడికల్ కాలేజీల్లో మొదటి ఏడాది ఎంబీబీఎస్ సీట్లు ఒక్కోచోట 150 చొప్పున మొత్తం 450 సీట్లు భర్తీ అయ్యాయి. ఎంఎన్ఆర్, మహవీర్ కాలేజీల్లో 70 వరకు పీజీ మెడికల్ సీట్లను భర్తీ చేశారు. ఎంబీబీఎస్ సీట్లల్లో సగం కన్వీనర్ కోటావి ఉండగా, మిగిలిన వాటిల్లో 35 శాతం బీ కేటగిరీ, 15 శాతం ఎన్ఆర్ఐ కోటా సీట్లున్నాయి. అలాగే పీజీ సీట్లల్లోనూ కన్వీనర్, బీ, సీ కేటగిరీ సీట్లున్నాయి. అలాగే ఇనిస్టిట్యూషనల్ కోటా సీట్లున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం కాలేజీ యాజమాన్యాల తప్పయితే, అడ్మిషన్లు అయిపోయాక వాటి అనుమతిని రద్దు చేయడం ఎన్ఎంసీ తప్పు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరేడేళ్ల క్రితం కూడా రాష్ట్రంలో ఒకసారి ఇలాగే అడ్మిషన్లు అయిపోయాక సీట్లను రద్దు చేస్తే, ఆయా విద్యార్థులను వివిధ మెడికల్ కాలేజీల్లో సర్దుబాటు చేశారు. ఇప్పుడు మూడు కాలేజీలు అప్పీలుకు వెళ్లినందున ఎన్ఎంసీ సానుకూలంగా స్పందిస్తే కొంతవరకు పరవాలేదు. ఒకవేళ ఎన్ఎంసీ రద్దు నిర్ణయానికే కట్టుబడి ఉంటే విద్యార్థులను ఇతర ప్రైవేట్ కళాశాలల్లోనే సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అయితే 450 మంది ఎంబీబీఎస్, 70 మంది పీజీ విద్యార్థులను అడ్జెస్ట్ చేయడమంటే మాటలు కాదని అంటున్నారు. ఎన్ని ఇబ్బందులో..! విద్యార్థులు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. బీ, ఎన్ఆర్ఐ కోటాలో చేరిన విద్యార్థుల్లో పూర్తి కోర్సు పూర్తి ఫీజును చెల్లించినవారు కూడా ఉన్నారు. ఉదాహరణకు ఐదేళ్ల ఫీజు ఒకేసారి చెల్లిస్తే తక్కువ వసూలు చేసిన కాలేజీలు ఉన్నాయి. అటువంటి చోట తిరిగి ఆ ఫీజు వసూలు కాదు. డొనేషన్లు చెల్లించిన చోట్ల కూడా ఆ డబ్బులు తిరిగిరావు. ఎందుకంటే వాటికి రసీదు కూడా ఉండదు. ఎక్కడైనా అడ్జెస్ట్ చేస్తే ఆ ప్రైవేట్ కాలేజీలు కూడా ఫీజును ముక్కుపిండి వసూలు చేస్తాయి. ఇది విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారుతుంది. మొత్తం మీద ప్రైవేట్ మెడికల్ కాలేజీల నిర్లక్ష్యం వైద్య విద్యార్థులకు శాపంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేడు మంత్రి హరీశ్రావు దృష్టికి.. కాగా ఆ మూడు కాలేజీలకు చెందిన విద్యార్థులు తమకు జరిగిన అన్యాయంపై మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావును, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులను కలిసి విన్నవించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఒక ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లడంతో ఎన్ఎంసీ దీనిపై తగు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించినట్లు కాళోజీ వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. విద్యార్థులకు న్యాయం చేయాలి అకస్మాత్తుగా మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్లను రద్దు చేయడం వల్ల ఇప్పటికే చేరిన విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. కాబట్టి విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా, వారి భవిష్యత్తు అంధకారంలో పడకుండా ఎన్ఎంసీ తగిన చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ కార్తీక్ నాగుల, అధ్యక్షుడు, జూనియర్ డాక్టర్ల సంఘం విద్యార్థుల జీవితాలతో చెలగాటం నీట్లో మంచి ర్యాంకులు సాధించి కౌన్సెలింగ్ ద్వారా ఈ కాలేజీలను ఎంచుకుని చేరిన విద్యార్థుల జీవితాలతో ఎన్ఎంసీ చెలగాటమాడుతోంది. ముందుగా వీటికి అనుమతి ఉందని కౌన్సెలింగ్ నిర్వహణకు, విద్యార్థులను చేర్చుకోవడానికి అనుమతించి తీరా ఆ ప్రక్రియ ముగిశాక అడ్మిషన్లు రద్దు చేయడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఇందులో ఏమైనా రాజకీయ కోణం ఉందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. – ఒక వైద్యాధికారి జీవితాలతో చెలగాటం విద్యార్థుల జీవితాలతో ఎన్ఎంసీ చెలగాటమాడుతోంది. ముందుగా వీటికి అనుమతి ఉందని కౌన్సెలింగ్ నిర్వహణకు, విద్యార్థులను చేర్చుకోవడానికి అనుమతించి తీరా ఆ ప్రక్రియ ముగిశాక అడ్మిషన్లు రద్దు చేయడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఇందులో ఏమైనా రాజకీయ కోణం ఉందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. – ఒక వైద్యాధికారి -
కంపెనీ పేరుతో మందులు రాయొద్దు :పెద్ద అక్షరాలతో అర్థమయ్యేలా రాయాలి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజులు రోగులకు అందుబాటులో ఉండా లని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) పేర్కొంది. డాక్టర్ ఫీజు, కన్సల్టేషన్, రిఫండ్ వంటి వివిధ అంశాల ఆధారంగా ఫీజులు వసూలు చేయకూడదని, అలాంటి వాటితో రోగికి సంబంధం లేదని స్పష్టం చేసింది. వైద్య నియమావళిలో పలు కీలక మార్పులు చేస్తూ, వైద్య సేవలకు సంబంధించి కొత్త నిబంధనలు విధిస్తూ, వైద్యులకు పలు సూచనలు చేస్తూ.. ఎన్ఎంసీ ముసాయిదాను రూపొందించింది. ముఖ్యాంశాలివీ.. కంపెనీ పేరుతో మందులు రాయొద్దు కార్పొరేట్ ఆసుపత్రులు తాము అందించే వైద్య సేవలను మాత్రమే తెలియజేయాలి. దాని ఫీజును చెప్పుకోవచ్చు. అయితే డాక్టర్ల పేరుతో ప్రచారం చేయకూడదు. జనరిక్ పేరుతోనే మందులు రాయాలి కానీ కంపెనీ పేరుతో రాయకూడదు. మందులు రాసేటప్పుడు పెద్ద అక్షరాల్లో (క్యాపిటల్ లెటర్స్) అర్ధమయ్యేట్లు రాయాలి. ఫార్మాస్యూటికల్ కంపెనీల నుంచి డాక్టర్లు ఎలాంటి బహుమతులు పొం దకూడదు. ఐదేళ్లకోసారి ఆ మేరకు అఫిడవిట్ సమర్పించాలి. ఒకవేళ పొం దితే దాన్ని వెల్లడించాలి. కంపెనీల ప్రభావానికి లోనుకాకూడదు. కాన్ఫరెన్స్లు, సెమినార్లకు కూడా కంపెనీల స్పాన్సర్షిప్ తీసుకోకూడదు. ప్రాక్టీస్పై జీవితకాల నిషేధం! రోగులు తమకు ఏదైనా అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినప్పుడు, అది నిజమని తేలితే నిపుణుల కమిటీ తగిన చర్యలు చేపడుతుంది. సాధారణ తప్పు అయితే డాక్టర్ను మందలిస్తుంది. కొన్నిసార్లు కౌన్సెలింగ్ ఇస్తుంది. ఒకవేళ లైసెన్స్ లేకుండా డాక్టర్ ప్రాక్టీస్ చేస్తే, లైసెన్స్ ఫీజుకు పది రెట్లు జరిమానాగా విధిస్తుంది. – వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా రోగి చనిపోయినా, భారీ తప్పులు జరిగినా.. తీవ్రత ఆధారంగా అవసరమైతే ప్రాక్టీస్ చేయకుండా జీవితకాలం నిషేధం విధించే అవకాశం కూడా ఉంది. – రోగుల విషయంలో నైతిక నియమాలను సరిగా పాటించకపోతే లైసెన్సును నెల రోజుల వరకు సస్పెండ్ చేయవచ్చు. రోగికి ప్రత్యక్షంగా హాని జరిగితే మూడు నెలల నుంచి మూడేళ్ల వరకు సస్పెండ్ చేయొచ్చు. రోగికి వాస్తవ సమాచారం ఇవ్వాలి – రోగి పరిస్థితిని ఉన్నదున్నట్టు తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు చెప్పాలి. దాచిపెట్టడం కానీ, ఎక్కువ చేసిగానీ చెప్పకూడదు. యథార్థ సమాచారం ఇవ్వాలి. ఆపరేషన్ అవసరమైతే కుటుంబ సభ్యుల అనుమతితోనే చేయాలి. సర్జన్ పేరు కూడా రికార్డులో ఉండాలి. – మైనర్లకు, మానసికంగా సరిగా లేని వ్యక్తులకు ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా వాళ్ల కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరి. 8 ఏళ్లకు పైబడిన చిన్నారులైతే ఆ పిల్లలకు సంబంధిత చికిత్స వివరాలను తెలియజేయాలి. – రోగికి వైద్యం చేసిన తర్వాత వారి రికార్డులను మూడేళ్లు భద్రపరచాలి. వాటిని సంబంధిత వ్యవస్థలు ఏవైనా అడిగితే ఐదు రోజుల్లోగా ఇవ్వాలి. – నూతన నియమావళి రూపొందిన మూడేళ్ల లోపు రోగుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. ప్రతి రికార్డును డిజిటలైజ్ చేయాలి. అలాగే రోగి వివరాలను గోప్యంగా ఉంచాలి. కొన్నిటికి మాత్రమే టెలిమెడిసిన్ – ఎలాంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయకుండా టెలీ మెడిసిన్ ద్వారా మందులు ఇవ్వకూడదు. కనీసం గత ప్రిస్కిప్షన్ల వంటి ఆధారమైనా లేకుండా మందులు ఇవ్వకూడదు. – టెలీ మెడిసిన్.. వీడియో, ఆడియో, మెస్సేజ్, ఈ మెయిల్ రూపంలో జరుగుతుంది. కాబట్టి కొందరిని భౌతికంగా పరీక్షించాల్సి ఉంటే అలా చేయాల్సిందే. – ఆన్లైన్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించవచ్చు. కౌన్సిలింగ్ ఇవ్వడానికి, కొన్ని రకాల మందులు సూచించడానికి ఇది పనికి వస్తుంది. దగ్గు మందులు, నొప్పి మందులు, యాంటీ ఫంగల్, యాంటీబయోటిక్స్ వంటి మందులను ఆన్లైన్లో సూచించవచ్చు. వాట్సాప్లోనూ ఇవ్వొచ్చు. – వీడియో కన్సల్టేషన్లో చర్మ, ఆస్తమా, మధుమేహం, రక్తపోటు, క్షయ వంటి వాటికి మందులను ఇవ్వొచ్చు. ఫాలోఅప్లో మందులు కూడా ఇవ్వొచ్చు. – క్యాన్సర్, మెదడును ఉత్తేజపరిచే, సైకియాట్రిక్ మందులు వాట్సాప్ ద్వారా కానీ టెలీమెడిసిన్లో కానీ ఇవ్వొద్దు. ఆ రోగులను భౌతికంగా చూడాల్సిందే. రోగి అనుమతితోనే మీడియాలో ప్రచురించాలి – రోగికి ఏవైనా ప్రత్యేక చికిత్సలు చేసినప్పుడు వారి అనుమతి మేరకే మీడియాలో ప్రచురించాలి. – గుర్తింపులేని వైద్యులతో కలసి పని చేయకూడదు. వైద్యంతో సంబంధం లేనివారు కూడా ప్రాక్టీస్ పెడుతున్నందున వారితో కలిసి పనిచేయవద్దు. – డాక్టర్లు సెమినార్లు, సదస్సులకు హాజరవుతూ వైద్యంలో అవుతున్న అప్డేట్ ఆధారంగా ప్రతి ఐదేళ్లకోసారి 30 మార్కులు పొందాల్సి ఉంటుంది. అలా సాధిస్తేనే ఐదేళ్లకోసారి రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేస్తారు. – ఎలాంటి గుర్తింపు లేనివారికి వారి అనుభవం ఆధారంగా (ఆర్ఎంపీల వంటి వారికి) వైద్యులు సర్టిఫికెట్లు ఇవ్వకూడదు. – వైద్యులు ఇతర రాష్ట్రాల్లో పనిచేసేందుకు ప్రస్తుతం ఎన్వోసీ త్వరగా ఇవ్వడంలేదు. దాన్ని ఇప్పుడు సరళతరం చేసి వారంలో ఇచ్చేలా మార్పు చేశారు. -
గడువులోగా మెడికల్ కౌన్సెలింగ్ పూర్తి
లబ్బీపేట(విజయవాడతూర్పు): మెడికల్ అడ్మిషన్స్లో ఈ ఏడాది సాంకేతిక, న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో వాటిని పరిష్కరిస్తూ ప్రక్రియను కొనసాగిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం వీసీ డాక్టర్ పి.శ్యామ్ప్రసాద్ చెప్పారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ణయించిన సమయానికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. యూనివర్సిటీ యూజీ, పీజీ అడ్మిషన్ల ప్రక్రియను ఆయన గురువారం మీడియాకు వివరించారు. యూనివర్సిటీ అడ్మిషన్లకు సంబంధించి పదేళ్లుగా ఒకే సాఫ్ట్వేర్ సంస్థను వినియోగిస్తుండటంతో ఆడిట్ అభ్యంతరాలు తలెత్తాయని, దీంతో టెండర్లు పిలవగా.. హైదరాబాద్కు చెందిన సంస్థ టెండర్ దక్కించుకుందని తెలిపారు. అపోహలకు తావులేదు.. యూనివర్సిటీ పరిధిలోని వైద్య కళాశాలల్లో మొత్తం 2,342 పీజీ/డిప్లమో సీట్లుండగా, వాటిలో 50 శాతం నేషనల్ పూల్కు పోను, రాష్ట్ర కోటాగా 38 స్పెషాలిటీల్లో 1,171 సీట్లకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యూనివర్సిటీ పీజీ, డిప్లమో సీట్ల భర్తీకి నవంబర్ 3న నోటిఫికేషన్ ఇచ్చినట్టు వీసీ తెలిపారు. వెబ్సైట్లో కొన్ని సాంకేతిక పరమైన చిక్కులతో డిసెంబర్ 23న రీ నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. మెరిట్ లిస్టును జనవరి 19న ప్రకటించి, నాన్ సర్వీసు కోటాకు సంబంధించి ఫిబ్రవరి 1న సీట్ల అలాట్మెంట్ చేశామన్నారు. కొన్ని లోపాలు తలెత్తినట్టు నిపుణుల కమిటీ గుర్తించి, వాటిని రద్దు చేసి, ఫిబ్రవరి 2న రీ నోటిఫికేషన్ ఇచ్చినట్టు చెప్పారు. ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో 7న సీట్లు అలాట్ చేసి, 14లోపు జాయిన్ అవ్వాలని ఆదేశాలిచ్చామన్నారు. సర్వీసు కోటాకు సంబంధించి తెలంగాణ వారికీ సీట్లు కేటాయించాలని కోర్టు ఉత్తర్వుల మేరకు వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఈ నెల 13న నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. సర్వీస్ కోటాలో మిగిలిన సీట్లు నాన్ సర్వీస్ కోటాలో భర్తీ చేస్తామని తెలిపారు. మార్చి 7 నాటికి పీజీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేస్తామని, ఇందుకోసం యూనివర్సిటీ సిబ్బంది పబ్లిక్ హాలిడేస్, ఆదివారాల్లో సైతం పనిచేస్తున్నారని, ఎలాంటి అపోహలకు తావులేదని వీసీ వివరించారు. యూజీకి 14 వేల దరఖాస్తులు.. ఎంబీబీఎస్, ఎండీఎస్ అడ్మిషన్ల కోసం జనవరి 28న నోటిఫికేషన్ ఇచ్చినట్టు తెలిపారు. నోటిఫికేషన్ గడువు ఫిబ్రవరి 8తో ముగిసిందని, ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన జరుగుతోందన్నారు. ఈ నెల 25తో పరిశీలన పూర్తి చేసి, 28న ఫైనల్ మెరిట్ లిస్టు ప్రకటిస్తామని వీసీ వివరించారు. మార్చి మొదటి వారంలో మొదటి దశ, రెండో వారంలో రెండో దశ, మూడో వారంలో మూడో ఫేస్ యూజీ కౌన్సెలింగ్ నిర్వహించి మార్చి 19 నాటికి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. -
విద్యా సంవత్సరం కుదింపు.. సెలవుల్లో కోత.. ఎన్ఎంసీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్యవిద్య ఆలస్యం కావడంతో 2021–22లో కొత్తగా చేరే ఎంబీబీఎస్ విద్యార్థులకు విద్యాసంవత్సర కాలపరిమితిని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) కుదించింది. మొదటి ఏడాది సహా అన్ని సంవత్సరాల వైద్యవిద్యను 11 నెలలపాటు నిర్వహించేలా ఆదేశాలిచ్చింది. తాజాగా సవరించిన నిబంధనలు కేవలం 2021–22 బ్యాచ్ వైద్య విద్యార్థులకే వర్తిస్తాయని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. సాధారణంగా ఫస్టియర్ కోర్సు కాలవ్యవధి 13 నెలలు, ఇతర సంవత్సరాల్లో 12 నెలలు ఉంటుంది. ఇందులో మొదటి ఏడాది ఒక నెల ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. తాజా మార్పుల నేపథ్యంలో ఈ కాల వ్యవధిని రెండు నెలలు తగ్గించారు. ఈ కోర్సును రోజువారీ తరగతుల్లో భాగంగా కొంత సమయాన్ని అదనంగా కేటాయించి బోధించాలని ఎన్ఎంసీ ఆదేశించింది. తొలి సంవత్సరం సహా మిగిలిన సంవత్సరాల్లోనూ పండుగలు, వేసవి సెలవులు కలుపుకొని సుమారు 2 నెలలు సెలవు దినాలుంటాయి. అయితే ఈ సెలవు రోజులను ఒక నెలకు కుదిస్తూ ఎన్ఎంసీ ఆదేశాలిచ్చింది. ఈ బ్యాచ్ విద్యార్థులకు అన్ని సంవత్సరాల్లోనూ ఆ ఏడాది మొత్తమ్మీద గరిష్టంగా నెల రోజుల సెలవులే ఉంటాయి. దీంతో 11 నెలలపాటు విద్యాబోధన వారికి కొనసాగుతుంది. 2021–22 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థులకు ఈ నెలలో తరగతులు ప్రారంభమై ఇదే ఏడాది డిసెంబర్లో ముగుస్తాయి. 2023 జనవరిలో ఈ బ్యాచ్ తొలి సంవత్సరం వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. మళ్లీ అదే సంవత్సరం ఫిబ్రవరి నుంచి 11 నెలలపాటు రెండో ఏడాది తరగతులుంటాయి. ఇలా కొనసాగే వారి వైద్యవిద్య 2026 జూన్లో తుది సంవత్సరం పరీక్షలతో ముగుస్తుంది. ఈ బ్యాచ్ విద్యార్థులకు సెలవులను కుదించి, బోధన కాలపరిమితిని పెంచారే తప్ప, పాఠ్యాంశాల్లో లేదా బోధనా విధానం, ప్రాక్టికల్స్లో ఎటువంటి మార్పులు చేయలేదని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. 2021–22 బ్యాచ్కు చెందిన విద్యార్థుల హౌస్ సర్జన్ కూడా ఏడాది పాటే ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలలు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని జాతీయ వైద్య కమిషన్ తాజాగా ఆదేశాలిచ్చింది. 14 నుంచి తరగతులు... ఈ నెల 14 నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ వైద్య తరగతులు ప్రారంభించాల్సిందేనని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. ఆ మేరకు రాష్ట్రాల్లో తొలి ఏడాది ప్రవేశాల ప్రక్రియను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. -
'పల్లె నాడి పట్టే మెడికో'.. ఎన్ఎంసీ వినూత్న ఆలోచన
వారు వైద్య విద్యార్థులు.. రెండు వారాలకోసారి మీ ఊరిలో నేరుగా మీ ఇంటికి వస్తారు. మీతో, మీ ఇంట్లో వారితో మాట్లాడుతారు. అందరి ఆరోగ్యం ఎలా ఉందో పరిశీలిస్తారు. ఏదైనా సమస్య ఉంటే తగిన సూచనలు చేస్తారు. మీ ఆరోగ్య సమస్యకు కారణాలను గుర్తించి పరిష్కారాలను సూచిస్తారు. మంచి అలవాట్లు, పరిశుభ్రత కోసం ఏం చేయాలో చెప్తారు. అదే సమయంలో వైద్యం, ఆరోగ్యంపై తామూ కొంత నేర్చుకుంటారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) చేసిన సిఫార్సులు అమల్లోకి వస్తే.. ఇది అమల్లోకి రానుంది. సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ కోర్సులో గ్రామాలు/ప్రజల దత్తత కార్యక్రమాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) సిఫా ర్సు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యారోగ్య సౌకర్యాలను మరింతగా అందుబాటులోకి తీసుకురావ డం, అదే సమయంలో వైద్య విద్యార్థుల్లో వివిధ వ్యాధులు, క్షేత్రస్థాయి అంశాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొంది. సమాజంలో ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపర్చడానికి ఇది తోడ్పడుతుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై ఎన్ఎంసీకి చెందిన యూజీ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (యూజీఎంఈడీ) ఒక నివేదికను రూపొందించింది. అందులో కీలక సిఫార్సులు చేసింది. కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదిస్తే త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉండనుంది. క్షేత్రస్థాయికి వెళ్లేలా.. ఎన్ఎంసీ సిఫార్సుల ప్రకారం.. ఒక్కో బ్యాచ్ ఎంబీ బీఎస్ విద్యార్థులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవా లి. బ్యాచ్లోని ఒక్కో విద్యార్థికి ఐదు నుంచి ఏడు కుటుంబాలను కేటాయిస్తారు. వారు ఆ కుటుంబా ల్లోని వారి ఆరోగ్య పరిస్థితులను గుర్తించి, ఏవైనా సమస్యలు వస్తే ప్రాథమిక సలహా ఇవ్వాలి. ప్రతి 25 మంది విద్యార్థుల బృందాన్ని పర్యవేక్షించడానికి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటారు. వారికి స్థానిక ఆశా కార్యకర్తల సాయం అందించేలా ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు రెండు వారాలకోసారి ఆయా గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. కోర్సు తొలి ఏడాదిలో కనీసం 10 సార్లయినా గ్రామాలను సందర్శించాలి. వారు గ్రామా ల్లో గడిపే సమయాన్ని కోర్సులో భాగంగానే పరిగణిస్తారు. విద్యార్థులకు ఆచరణాత్మక శిక్షణ అందేలా పాఠ్యాంశాలు, సిలబస్ను రూపొందిస్తారు. ఇక ఈ దత్తత కార్యక్రమంతో విద్యార్థులు క్షేత్రస్థాయికి వెళతారు. ఎంబీబీఎస్ తొలి ఏడాది కోర్సు నుంచే ప్రజలతో మమేకమవుతారు. గ్రామాల ఆరోగ్యానికి.. గ్రామాలను దత్తత తీసుకోవడం వల్ల ఎంబీబీఎస్ విద్యార్థులు క్షేత్రస్థాయిలో స్వయంగా ప్రజల ఆరో గ్య సమస్యలు, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి వీలుంటుంది. ఇదివారిలో సామాజిక బాధ్యత, అవగాహన పెరగడానికి తోడ్పడనుంది. సరైన ఆహార అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత, అనారోగ్యం బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించే వీలు కలుగుతుంది. ఒక్కో విద్యార్థికి ఏడు కుటుంబాల వరకు బాధ్యత ఇవ్వడం వల్ల.. ఆయా కుటుంబాల్లోని వారిలో ఎవరికైనా, ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. తక్షణమే టెలి మెడిసిన్ పద్ధతిలో అవసరమైన వైద్య సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. అవసరమైతే తాము చదివే మెడికల్ కాలేజీకి రమ్మనడానికి, ఏదైనా ఆస్పత్రికి రిఫర్ చేయడానికి వీలుంటుంది. ఇలా మరెన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దత్తత తీసుకున్న గ్రామాలకు పదుల సంఖ్యలో వైద్య విద్యార్థులు వచ్చిపోవడం, సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల ఆయా గ్రామాలు ఆరోగ్యంగా మారుతాయని చెప్తున్నారు. 33 కాలేజీలు.. 20 వేల మంది విద్యార్థులు రాష్ట్రంలో ప్రస్తుతం 10 ప్రభుత్వ, 23 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మొత్తంగా 165 బ్యాచ్ల్లో కలిపి దాదాపు 20 వేల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఉంటారు. వీరితోపాటు ఆయుష్, డెంటల్ విద్యార్థులకు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ప్రవేశపెడితే మరో ఐదారు వేల మంది అవుతారు. ఇంతమందికి గ్రామాల దత్తత బాధ్యత ఇస్తే ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు అందుతాయని.. విడతల వారీగా కొత్త గ్రామాల్లోనూ వైద్య చైతన్యం వస్తుందని నిపుణులు చెప్తున్నారు. పల్లెల్లో ఏం చేయాలంటే? ►తమకు కేటాయించిన ఐదు నుంచి ఏడు కుటుంబాల ఆరోగ్య రికార్డులను తయారు చేయాలి. ►కుటుంబాల్లోని వారు ఎటువంటి జబ్బులతో బాధపడుతున్నారో గుర్తించి నోట్ చేసుకోవాలి. ► ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారుంటే.. అవసరమైన వైద్య సలహాలు ఇవ్వాలి. ► ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. ► రోజువారీ ఆహారపు అలవాట్లు, వ్యసనాలు వంటివి గుర్తించాలి. ► రోగాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగిన సూచనలు చేయాలి. ► సమీపంలోని ప్రభుత్వ డయాగ్నొస్టిక్ సెంటర్లలో వారికి బీపీ, షుగర్, ఇతర పరీక్షలు చేయించాలి. ► కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, కిడ్నీ, లివర్ ఫంక్షనింగ్ టెస్టులు చేయించాలి. ఈ మేరకు వారిని ప్రోత్సహించాలి. ► పిల్లలకు వ్యాక్సిన్లు, గర్భిణులకు ఇతర చెకప్లు చేయించుకోవాల్సిందిగా సూచించాలి. ► అవసరమైనప్పుడు ఫోన్లో అందుబాటులో ఉంటూ.. వైద్య సలహాలు ఇవ్వాలి. -
వైద్య విద్య కఠినతరం .. ‘ఎగ్జిట్’ దాటితేనే ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో నాసిరకమైన వైద్య విద్యకు చెక్ పెట్టేలా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విదేశాల్లో నాణ్యమైన ఎంబీబీఎస్ పూర్తి చేసినవారికే మన దేశంలో శాశ్వత మెడికల్ రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. ఏ దేశంలోనైనా గుర్తింపు పొందిన వైద్య కాలేజీల్లోనే చదవాలని విద్యార్థులకు సూచించింది. మన దేశంలో మాదిరిగా వైద్య విద్య కోర్సు (నాలుగున్నరేళ్లు), ఇంటర్న్షిప్ (ఏడాది) రెండూ కలిపి ఐదున్నరేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. విద్యార్థులు తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియంలోనే ఆయా దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేయాలి. కోర్సు పూర్తయి వచ్చాక, స్వదేశంలో మరో 12 నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. ఎగ్జిట్ పరీక్షలో పాసై తీరాలి. పదేళ్లలోపే ఎంబీబీఎస్ కోర్సు, ఇంటర్న్షిప్ మొత్తం పూర్తిచేయాలి. అప్పుడే మనదేశంలో రిజి స్ట్రేషన్కు, ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి లేదా ఏదైనా ఆసుపత్రిలో పనిచేయడానికి వీలుపడుతుందని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. చదవండి: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నాలుగో రోజు ప్రారంభం సీటు రాక .. తక్కువ ఫీజుతో.. ఈ ఏడాది 15.44 లక్షల మందికిపైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా, దాదాపు 8.70 లక్షల మంది అర్హత సాధించారు. కానీ, మన దేశంలో కేవలం 85 వేల ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనే చాలామంది విదేశాల్లో ఎంబీబీఎస్ కోసం వెళ్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కలిపి మొత్తం 5,200 బీబీఎస్ సీట్లున్నాయి. కానీ 20 వేల మందికిపైగా నీట్ అర్హత సాధించి ఉంటా రని అంచనా. మరోవైపు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీటు పొందాలంటే డొనేషన్లు పెద్ద మొత్తంలో ఉంటున్నాయి. బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.11.50 లక్షలు, ఎన్ఆర్ఐ సీటు ఫీజు రూ.23 లక్షల వరకు ఉంటోంది. విదేశాల్లో చదివితే రూ. 30 లక్షల నుంచి రూ.40 లక్షలవుతోంది. ఈ కారణంగానే చాలా మంది విద్యార్థులు చైనా, రష్యా, ఉక్రెయిన్, నేపాల్, కజకిస్తాన్, జార్జియా, ఫిలిప్పీన్స్, కిర్గిస్తాన్, బంగ్లాదేశ్, అర్మేనియా, పాకిస్తాన్ ల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఎఫ్ఎంజీఈ ఉత్తీర్ణత 14 శాతమే... విదేశాల్లో ఎంబీబీఎస్ అంత నాణ్యతతో ఉండటం లేదన్న అభిప్రాయం ఉంది. పలు దేశాల్లో చదివి వచ్చినవారు అనేకమంది ఇక్కడ రిజిస్ట్రేషన్కు ముందు రాసే పరీక్షలో ఉత్తీర్ణులు కాకపోవడం ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తోంది. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేశాక మనదేశంలో ప్రాక్టీస్ చేసేలా లైసెన్స్ పొందడానికి మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించాలంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) పాస్ కావాలి. 2015–18 మధ్య జరిగిన ఎఫ్ఎంజీఈ పరీక్షలకు 61,418 మంది విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు హాజరుకాగా, కేవలం 8,731 మంది మాత్రమే పాసయ్యారని కేంద్రం వెల్లడించింది. అంటే 14.22 శాతమే ఉత్తీర్ణులయ్యారన్నమాట. చైనా, రష్యా, ఆయా దేశాల్లో చదివినవారు చాలా తక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారని కేంద్రం తెలిపింది. ప్రతి విద్యార్థికీ ఈఎఫ్ఎంజీఈ పరీక్ష రాయడానికి మూడుసార్లు అవకాశముంటుంది. కొత్త నిబంధనల మేర కు విదేశాల్లో వైద్యవిద్య ఎంతవరకు సాధ్యమవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. చదవండి: కోవిషీల్డ్ బూస్టర్ కోసం సీరమ్ దరఖాస్తు నాణ్యమైన విద్యకు తోడ్పాటు ఎన్ఎంసీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు విదేశాల్లో నాణ్యమైన వైద్య విద్యను అభ్యసించడానికి తోడ్పడతాయి. తద్వారా ఇక్కడ ఎఫ్ఎంజీఈ పరీక్ష పాసవడానికి, ప్రాక్టీస్ చేయడానికి వీలుకలుగుతుంది. మన దేశంలో మాదిరి కోర్సు కాలవ్యవధి, ఇలాంటి సిలబస్ ఉన్న వియత్నాంలో చదివేం దుకు అడ్మిషన్ తీసుకున్నా. – నర్మద తూతూ మంత్రం చదువుకు చెక్ కొన్ని విదేశీ మెడికల్ కాలేజీలు తూతూమంత్రంగా చదువుచెప్పి మన విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నాయి. వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకే ఎన్ఎంసీ ఈ నిబంధనలు తీసుకొచ్చింది. – డాక్టర్ కరుణాకర్రెడ్డి, వీసీ, కాళోజీ హెల్త్ వర్సిటీ -
తెలంగాణ: మరో 8 మెడికల్ కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మంచిర్యాల, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్కర్నూల్, జగిత్యాల, రామగుండం, వనపర్తిలో వచ్చే ఏడాదే కొత్త వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ప్రతీ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున 1,200 సీట్లు 2022–23 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తాయి. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం జాతీయ వైద్య కమిషన్కు శనివారం దరఖాస్తు చేసినట్లు రాష్ట్ర వైద్య, విద్య సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్ రెడ్డి తెలిపారు. నవంబర్, డిసెంబర్లో సంబంధిత అధికారులు తనిఖీలకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కొత్త కాలేజీలకు అవసరమైన అధ్యాపకులు, ఇతర వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. -
జాతీయ మెడికల్ కమిషన్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: చిన్న పిల్లలకు పీడియాట్రిక్స్ స్పెషలైజేషన్లాగే... వృద్ధులకు ప్రత్యేకంగా వైద్యం అందించేలా పీజీ మెడికల్లో జీరియాట్రిక్స్ స్పెషలైజేషన్ కోర్సును కేంద్ర ప్రభుత్వం పరిచయం చేయనుంది. ఈ మేరకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తాజాగా ప్రకటించింది. దేశంలో వృద్ధుల జనాభా పెరుగుతుండటం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వృద్ధులు జీవితాంతం నాణ్యమైన జీవితాన్ని గడిపేలా ఈ కోర్సును తీర్చిదిద్దుతారు. ప్రస్తుతం పీజీ ఎండీ, ఎంఎస్లలో 32 కోర్సు లున్నాయి. వీటిల్లో కొత్తగా 4 కోర్సులను ప్రారంభిస్తారు. సూపర్ స్పెషాలిటీలో ప్రస్తుతం 38 కోర్సు లున్నాయి. ఈ కేటగిరీలో కొత్తగా 8 కోర్సులను ప్రారంభించాలని ఎన్ఎంసీ నిర్ణయం తీసుకుంది. చదవండి: ఏపీ: ప్రతి 100 మందిలో 30 మందికి అప్పుడే పెళ్లిళ్లు వైద్య రంగంలో నైతిక విలువలు... వైద్యరంగంలో నైతిక విలువలపై ప్రత్యేకంగా ఎటువంటి కోర్సు లేదు. కానీ రాబోయే రోజుల్లో పీజీ మెడికల్లో ఐసీఎంఆర్ నిర్వహించే మెడికల్ ఎథిక్స్ అనే సర్టిఫికెట్ కోర్సును తప్పనిసరిగా చదవాలి. మొదటి ఏడాదిలోనే ఈ కోర్సును పూర్తి చేయాలి. దాన్ని రాయకుంటే ఫైనలియర్ పరీక్ష రాయడానికి వీలుండదు. ఒక డాక్టర్ వేరే డాక్టర్ గురించి చెడుగా చెప్పకూడదు.. కమీషన్ల కోసం ఇతర ఆసుపత్రులకు రోగులను రిఫర్ చేయకూడదు.. డాక్టర్, రోగుల మధ్య సంబంధాలపై మానవీయ కోణాన్ని పెంపొందించడానికి ఈ కోర్సును ఉద్దేశించారు. చదవండి: మహానేత వైఎస్సార్కు సీఎం వైఎస్ జగన్ నివాళి మరికొన్ని అంశాలు... పీజీ మెడికల్లో మొదటి ఏడాది ఐసీఎంఆర్ నిర్వహించే బేసిక్ బయో మెడికల్ రీసెర్చి కోర్సును ఆన్లైన్లో చదివి రాయాల్సి ఉంటుంది. వైద్య విద్యార్థుల్లో పరిశోధనను పెంపొందించాల్సి ఉంది. ఎలాంటి అంశాలపై చేయవచ్చు అన్న దానిపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. ♦ బేసిక్ లైఫ్ సపోర్టుపై అన్ని స్పెషలైజేషన్ కోర్సు ల వైద్య విద్యార్థులకు తప్పనిసరి చేశారు. అత్యవసర వైద్యాన్ని అందరూ నేర్చుకోవాలి. ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. తర్వాత సరి్టఫికెట్ ఇస్తారు. ♦గతంలో పీజీ మెడికల్లో మొదటి ఏడాది, చివరి ఏడాది మాత్రమే పరీక్ష ఉండేది. ఇప్పుడు కోర్సును 50 మాడ్యూల్స్గా విభజిస్తారు. దాని ప్రకారం వాళ్లకి శిక్షణ ఇచ్చి, అంతర్గత పరీక్షలు నిర్వహిస్తారు. మాడ్యూల్స్ పూర్తి కాగానే పరీక్ష నిర్వహిస్తారు. ఇవన్నీ ప్రాక్టికల్ పరీక్షలే. ♦పీజీ మెడికల్ విద్యార్థులు జిల్లా ఆసుపత్రిలో కోర్సు పీరియడ్లో తప్పనిసరిగా 3 నెలలు పనిచేయాలి. దీనివల్ల జిల్లా ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్య సేవలు మెరుగుపడతాయి. జాతీయ ఆరోగ్య పథకాలు, స్థానిక జబ్బులపై అవగాహన కలి్పంచడానికి దీన్ని ఉద్దేశించారు. ♦ అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల అనుభవం, పరిశోధనల ఆధారంగా పీజీ సీట్లను ఆయా కాలేజీలకు అనుమతిస్తారు. ప్రస్తుతం ఒక అసోసియేట్ ప్రొఫెసర్కు 2, ప్రొఫెసర్కు 3 సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేస్తోంది. ప్రొఫెసర్ల సామర్థ్యం సరిగా లేకుంటే అటువంటి కాలేజీలకు ప్రొఫెసర్కు ఒక సీటునే మంజూరు చేస్తారు. ♦ప్రతీ ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ కోర్సులను ప్రారంభించాలంటే తప్పనిసరిగా ఎంఆర్ఐ, సీటీ స్కాన్లు ఉండాలన్నది నిబంధన. ఎంవోయూ లేదా ఔట్సోర్సింగ్ పద్ధతిలో బయ ట సమకూర్చుకోవడాన్ని అనుమతించరు. కొత్త కోర్సులు... మెడికల్ పీజీలో (ఎండీ, ఎంఎస్) ♦ ఏరోస్పేస్ మెడిసిన్ ♦ మెరైన్ మెడిసిన్ ♦ ట్రమటాలజీ అండ్ సర్జరీ... ♦ జీరియాట్రిక్ సూపర్ స్పెషాలిటీలు... ♦ మెడికల్ జెనెటిక్స్ ♦వైరాలజీ మెడిసిన్ ♦ చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీ ♦ జీరియాట్రిక్ మెంటల్ హెల్త్ ♦ హెపటాలజీ (లివర్) ♦ ఎంసీహెచ్ ఎండోక్రైన్ సర్జరీ ♦ హెపటో పాంకీయాట్రో బిలియరీ సర్జరీ ♦ రీప్రొడెక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ 20 ఏళ్ల తర్వాత మార్పులు 20 ఏళ్ల తర్వాత పీజీ మెడికల్లో పలు కీలకమైన మార్పులు చేశారు. ప్రస్తుతం తీసుకొచ్చిన కోర్సులు శాస్త్రీయంగా, సామాజిక అవసరాలకు తగినట్లుగా ఉన్నాయి. మెడికల్ కాలేజీల్లో వైద్య పరిశోధనకు ఊపు తీసుకురావాలని ఎన్ఎంసీ నిర్ణయించడం ముదావహం. నియమాలు ఒకవైపు సరళతరం చేస్తూనే మరోవైపు కొన్ని కొత్త మార్పులు సూచించారు. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
వృద్ధుల కోసం.. జీరియాట్రిక్స్
సాక్షి, హైదరాబాద్: చిన్న పిల్లలకు పీడియాట్రిక్స్ స్పెషలైజేషన్లాగే... వృద్ధులకు ప్రత్యేకంగా వైద్యం అందించేలా పీజీ మెడికల్లో జీరియాట్రిక్స్ స్పెషలైజేషన్ కోర్సును కేంద్ర ప్రభుత్వం పరిచయం చేయనుంది. ఈ మేరకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తాజాగా ప్రకటించింది. దేశంలో వృద్ధుల జనాభా పెరుగుతుండటం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వృద్ధులు జీవితాంతం నాణ్యమైన జీవితాన్ని గడిపేలా ఈ కోర్సును తీర్చిదిద్దుతారు. ప్రస్తుతం పీజీ ఎండీ, ఎంఎస్లలో 32 కోర్సు లున్నాయి. వీటిల్లో కొత్తగా 4 కోర్సులను ప్రారంభిస్తారు. సూపర్ స్పెషాలిటీలో ప్రస్తుతం 38 కోర్సు లున్నాయి. ఈ కేటగిరీలో కొత్తగా 8 కోర్సులను ప్రారంభించాలని ఎన్ఎంసీ నిర్ణయం తీసుకుంది. వైద్య రంగంలో నైతిక విలువలు... వైద్యరంగంలో నైతిక విలువలపై ప్రత్యేకంగా ఎటువంటి కోర్సు లేదు. కానీ రాబోయే రోజుల్లో పీజీ మెడికల్లో ఐసీఎంఆర్ నిర్వహించే మెడికల్ ఎథిక్స్ అనే సర్టిఫికెట్ కోర్సును తప్పనిసరిగా చదవాలి. మొదటి ఏడాదిలోనే ఈ కోర్సును పూర్తి చేయాలి. దాన్ని రాయకుంటే ఫైనలియర్ పరీక్ష రాయడానికి వీలుండదు. ఒక డాక్టర్ వేరే డాక్టర్ గురించి చెడుగా చెప్పకూడదు.. కమీషన్ల కోసం ఇతర ఆసుపత్రులకు రోగులను రిఫర్ చేయకూడదు.. డాక్టర్, రోగుల మధ్య సంబంధాలపై మానవీయ కోణాన్ని పెంపొందించడానికి ఈ కోర్సును ఉద్దేశించారు. మరికొన్ని అంశాలు... ►పీజీ మెడికల్లో మొదటి ఏడాది ఐసీఎంఆర్ నిర్వహించే బేసిక్ బయో మెడికల్ రీసెర్చి కోర్సును ఆన్లైన్లో చదివి రాయాల్సి ఉంటుంది. వైద్య విద్యార్థుల్లో పరిశోధనను పెంపొందించాల్సి ఉంది. ఎలాంటి అంశాలపై చేయవచ్చు అన్న దానిపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. ►బేసిక్ లైఫ్ సపోర్టుపై అన్ని స్పెషలైజేషన్ కోర్సు ల వైద్య విద్యార్థులకు తప్పనిసరి చేశారు. అత్యవసర వైద్యాన్ని అందరూ నేర్చుకోవాలి. ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు. ►గతంలో పీజీ మెడికల్లో మొదటి ఏడాది, చివరి ఏడాది మాత్రమే పరీక్ష ఉండేది. ఇప్పుడు కోర్సును 50 మాడ్యూల్స్గా విభజిస్తారు. దాని ప్రకారం వాళ్లకి శిక్షణ ఇచ్చి, అంతర్గత పరీక్షలు నిర్వహిస్తారు. మాడ్యూల్స్ పూర్తి కాగానే పరీక్ష నిర్వహిస్తారు. ఇవన్నీ ప్రాక్టికల్ పరీక్షలే. ►పీజీ మెడికల్ విద్యార్థులు జిల్లా ఆసుపత్రిలో కోర్సు పీరియడ్లో తప్పనిసరిగా 3 నెలలు పనిచేయాలి. దీనివల్ల జిల్లా ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్య సేవలు మెరుగుపడతాయి. జాతీయ ఆరోగ్య పథకాలు, స్థానిక జబ్బులపై అవగాహన కల్పించడానికి దీన్ని ఉద్దేశించారు. ►అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల అనుభవం, పరిశోధనల ఆధారంగా పీజీ సీట్లను ఆయా కాలేజీలకు అనుమతిస్తారు. ప్రస్తుతం ఒక అసోసియేట్ ప్రొఫెసర్కు 2, ప్రొఫెసర్కు 3 సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేస్తోంది. ప్రొఫెసర్ల సామర్థ్యం సరిగా లేకుంటే అటువంటి కాలేజీలకు ప్రొఫెసర్కు ఒక సీటునే మంజూరు చేస్తారు. ►ప్రతీ ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ కోర్సులను ప్రారంభించాలంటే తప్పనిసరిగా ఎంఆర్ఐ, సీటీ స్కాన్లు ఉండాలన్నది నిబంధన. ఎంవోయూ లేదా ఔట్సోర్సింగ్ పద్ధతిలో బయ ట సమకూర్చుకోవడాన్ని అనుమతించరు. కొత్త కోర్సులు... మెడికల్ పీజీలో (ఎండీ, ఎంఎస్) ►ఏరోస్పేస్ మెడిసిన్ ►మెరైన్ మెడిసిన్ ►ట్రమటాలజీ అండ్ సర్జరీ... ►జీరియాట్రిక్ సూపర్ స్పెషాలిటీలు... ►మెడికల్ జెనెటిక్స్ ►వైరాలజీ మెడిసిన్ ►చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీ ►జీరియాట్రిక్ మెంటల్ హెల్త్ ►హెపటాలజీ (లివర్) ►ఎంసీహెచ్ ఎండోక్రైన్ సర్జరీ ►హెపటో పాంకీయాట్రో బిలియరీ సర్జరీ ►రీప్రొడెక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ 20 ఏళ్ల తర్వాత మార్పులు 20 ఏళ్ల తర్వాత పీజీ మెడికల్లో పలు కీలకమైన మార్పులు చేశారు. ప్రస్తుతం తీసుకొచ్చిన కోర్సులు శాస్త్రీయంగా, సామాజిక అవసరాలకు తగినట్లుగా ఉన్నాయి. మెడికల్ కాలేజీల్లో వైద్య పరిశోధనకు ఊపు తీసుకురావాలని ఎన్ఎంసీ నిర్ణయించడం ముదావహం. నియమాలు ఒకవైపు సరళతరం చేస్తూనే మరోవైపు కొన్ని కొత్త మార్పులు సూచించారు. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
వైద్య విద్యార్థులకు మరో శుభవార్త..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీల నిర్మాణానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో వైద్య విద్యార్థులకు మరో శుభవార్త. ఎంబీబీఎస్తో సమానంగా పీజీ వైద్య సీట్లను పెంచేందుకు వీలుగా జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలను సడలించింది. ఇకపై మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు (అండర్ గ్రాడ్యుయేట్) ఎన్ని ఉంటాయో పీజీ వైద్య సీట్లను కూడా ఆ మేరకు పెంచుకోవచ్చని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైద్యవిద్యా శాఖ పీజీ వైద్య సీట్ల పెంపుపై దృష్టి సారించింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 2,185 ఎంబీబీఎస్ సీట్లుండగా 910 మాత్రమే పీజీ వైద్య సీట్లున్నాయి. ఇప్పుడు అదనంగా 1,275 సీట్లను పెంచుకునే వెసులుబాటు ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 308 పీజీ సీట్లకు ప్రభుత్వం ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ జారీచేసింది. అంటే వచ్చే ఏడాది ఈ 308 సీట్లు దాదాపుగా ఖరారైనట్టే. ఇవికాకుండా 967 సీట్లు పెంచుకునేందుకు అవకాశం ఉంది. ప్రైవేట్ కాలేజీల్లో పీజీ వైద్య సీటును రూ. కోట్లలో విక్రయిస్తున్న తరుణంలో ప్రభుత్వ కాలేజీల పరిధిలో సీట్లు పెరగనుండటం మెరిట్ విద్యార్థులకు వరం లాంటిదని నిపుణులు పేర్కొంటున్నారు. వైద్యులు, మౌలిక సదుపాయాలు.. కొత్తగా సీట్లు పెరగాలంటే తగినంత మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్లు, ప్రొఫెసర్లు విధిగా అవసరం. దీంతో పాటు మౌలిక వసతులను కూడా మెరుగు పరచాల్సి ఉంటుంది. నర్సులు, పారా మెడికల్ సిబ్బందినీ నియమించుకోవాలి. వీటన్నిటిపైనా వైద్యవిద్యాశాఖ ప్రత్యేక నివేదిక తయారు చేస్తోంది. పెంచుకునే అవకాశం ఉన్న ప్రతి సీటునూ ఎలాగైనా సాధించేలా కసరత్తు చేస్తున్నారు. మంచి అవకాశం.. జాతీయ మెడికల్ కమిషన్ పీజీ సీట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకునే దిశగా కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం 308 పీజీ సీట్లకు అనుమతిచ్చింది. మిగతా సీట్లకు తగినట్లుగా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. కొత్తగా 16 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల భారీగా ఎంబీబీఎస్ సీట్లు పెరుగుతాయి’ – డా.రాఘవేంద్రరావు, వైద్యవిద్యా సంచాలకులు చదవండి: పేదలందరికీ సొంతిళ్లు.. ఇదీ నా కల: సీఎం జగన్ ఆరోగ్యశ్రీలో 13.74 లక్షల మందికి ఉచిత వైద్యం -
డబ్బుంటేనే డాక్టర్ గిరి?
ప్రైవేట్ కాలేజీల్లో ప్రభుత్వం భర్తీ చేసే సీట్ల ఫీజు రూ.60 వేలు. అదే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ కేటగిరీ సీట్ల ఫీజు రూ.11.55 లక్షలు. అదే సీ(ఎన్ఆర్ఐ) కేటగిరీ ఫీజు రూ. 23.10 లక్షలు. ఇప్పుడు వీటినే ప్రధానంగా మార్చనున్నారు.ప్రభుత్వ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లు, ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్ల ఫీజులు పేదలకు, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఎంతో ఉపశమనంగా ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్ల ఫీజులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2020–21 వైద్య విద్యా సంవత్సరంలోనే ఈ ఫీజుల భారాన్ని వైద్య విద్యార్థులపై పడేసేలా కేం ద్రం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చట్టం అమలుపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ఫీజుల క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలను సిద్ధం చేయాలని ఎంసీఐ స్థానంలో ఏర్పడిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (బోగ్)ను కేంద్రం తాజాగా ఆదేశించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50% సీట్ల ఫీజును కాలేజీ యాజమాన్యాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేస్తారు. మిగి లిన 50% కన్వీనర్ కోటా ఫీజులను కేంద్రం నిర్ధారించనుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ‘బోగ్’ఫీజులపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపింది. వారి సలహాలను కోరింది. ఎంఎన్సీ చట్టం వల్ల అత్యంత తక్కువగా ఉన్న ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా ఫీజులు మరింత పెరుగుతాయి. యాజమాన్య సీట్ల ఫీజులూ ఇష్టారాజ్యంగా పెంచుకునే వెసులుబాటు కల్పిస్తారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్ఎంసీ బిల్లుపై మొదట్లో జూనియర్ డాక్టర్లు (జూడా) రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. కానీ సర్కారు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. పేద విద్యార్థులపై పిడుగు... తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 4,900 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 1,500 వరకు కన్వీనర్ కోటా సీట్లున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల ఫీజు ఏడాదికి రూ. 10 వేలుకాగా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్లను కూడా ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. వాటి ఫీజును రూ. 60 వేలుగా ప్రభుత్వం నిర్ధారించింది. ప్రభుత్వ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లు, ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్ల ఫీజులు పేదలకు, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఎంతో ఉపశమనంగా ఉన్నాయి. అదే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 35 శాతంగా ఉన్న బీ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్ల ఫీజు ఏడాదికి రూ. 11.55 లక్షలుగా ఉండగా సీ (ఎన్ఆర్ఐ) కేటగిరీ ఫీజు ప్రస్తుతం ఏడాదికి రూ. 23.10 లక్షలుగా ఉంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్ల ఫీజులను ఎంఎన్సీ నియంత్రిస్తుంది. వాటినే ఇప్పుడు ప్రధానంగా మార్చనున్నారు. ప్రస్తుతం ఈ ఫీజులు అందరికీ అందుబాటులో ఉన్నాయి. డీమ్డ్ వర్సిటీల్లోని అన్ని ఎంబీబీఎస్ సీట్లకు ఒకటే ఫీజు ఉంది. దేశవ్యాప్తంగా ఒక్కో డీమ్డ్ వర్సిటీలో ఫీజులు మన రాష్ట్రంలోని బీ కేటగిరీ ఫీజులకు దగ్గరగా ఉంటాయి. వాటిని క్రమబద్ధీకరించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయా ఫీజులను రూ. 6–7 లక్షల వరకు క్రమబద్ధీకరిస్తారని సమాచారం. అవే ఫీజులను ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు కూడా ఖరారు చేస్తారని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు అంటున్నాయి. గందరగోళం నెలకొంది... ఎన్ఎంసీ చట్టం నేపథ్యంలో ఫీజులపై ఇప్పుడు కసరత్తు ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్ఎంసీ చట్టం ప్రకారం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్ల ఫీజును ‘బోగ్’నిర్ధారించనుంది. మిగిలిన 50 శాతం సీట్ల ఫీజును ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదించి యాజమాన్యాలు నిర్ధారించుకునే అవకాశముంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అయితే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్ల ఫీజును ఇప్పుడు ఏ మేరకు నిర్ధారిస్తారన్న దానిపై గందరగోళం నెలకొంది. ఫీజుల పెంపుపై మాకు ఇప్పటివరకు సమాచారం రాలేదు. – డాక్టర్ కరుణాకర్రెడ్డి, వీసీ, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పెంచితే పెనుభారమే... డీమ్డ్ వర్సిటీలను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల ఫీజులను పెంచితే అది పేద విద్యార్థులకు పెనుభారమే కానుంది. ఫీజులు పెంచుతారన్న ఆందోళనైతే ఇప్పటికీ నెలకొని ఉంది. ఎన్ఎంసీ బిల్లు వచ్చిన సమయంలో ఫీజులు పెరుగుతాయని ఉద్యమాలు చేశాం. అయినా బిల్లు చట్టంగా రూపుదిద్దుకుంది. - డాక్టర్ విజయేందర్, సలహాదారు, జూడాల సంఘం -
‘నీట్’తోనే ఎయిమ్స్, జిప్మర్ ప్రవేశాలు
న్యూఢిల్లీ చెన్నై: ఆల్ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్)లో ప్రవేశాలను వచ్చే ఏడాది నుంచి నీట్ ద్వారానే చేపట్టనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు మినహా మిగతా అన్ని కాలేజీల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలను నీట్ ద్వారా చేపడుతున్నారు. జాతీయ మెడికల్ కమిషన్ యాక్ట్ ప్రకారం వచ్చే ఏడాది నుంచి అన్ని కాలేజీల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలను నీట్ ద్వారానే జరపనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో అన్ని కాలేజీలకు ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహించే వీలు ఉంటుందన్నారు. తమ మంత్రిత్వశాఖ కింద పనిచేసే ఎయిమ్స్, జిప్మర్లో ప్రవేశానికి ఇకపై ప్రత్యేక పరీక్ష ఉండదని వెల్లడించారు. ఎన్ఎంసీ ప్రకారం పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు, ప్రాక్టీస్ లైసెన్స్ పొందడానికి ‘నెక్ట్స్’పరీక్ష నిర్వహించే ఆలోచనలో ఉన్నామన్నారు. దేశమంతటా నీట్ కుంభకోణం నీట్ ఎంట్రెన్స్లో అవకతవకలకు పాల్పడి తప్పుడు మార్గంలో మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు పొందిన వ్యవహారంపై కేంద్రానికి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కుంభకోణం తమిళనాడుకే పరిమితంకాదని, దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేసింది. కేవీ ఉదిత్ సూర్య అనే విద్యార్థి అక్రమంగా మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందారంటూ సూర్యతోపాటు ఆయన తండ్రి డాక్టర్ వీకే వెంకటేశన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుంభకోణంపై హైకోర్టు కేంద్ర ఆరోగ్య, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ప్రతిస్పందించాలని పేర్కొంది. ఇప్పటివరకు ఐదుగురు విద్యార్థులు తమ తరఫున వేరే వారితో ఎంట్రెన్స్ రాయించారని తేలింది. -
ఏపీలో సమ్మె విరమించిన జూడాలు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ప్రభుత్వ చొరవతో జూడాలు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎమ్సీ) బిల్లును రద్దు చేయాలని కోరుతూ జూడాలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరించాలనే డిమాండ్తో కొద్ది రోజులుగా జూడాలు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులతో 13 జిల్లాలకు చెందిన జూనియర్ డాక్టర్స్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం జూడాలు జరిపిన చర్చల సఫలం అయ్యాయి. జూడాలు తమ వద్ద ప్రస్తావించిన సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు అంగీకరించారు. దీంతో జూడాలు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. -
ఎన్ఎంసీ బిల్లు రద్దు చేయాలి
సాక్షి, మొయినాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ(నేషనల్ మెడికల్ కమిషన్) బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భాస్కర ఆసుపత్రికి చెందిన జూనియర్ వైద్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. గురువారం మొయినాబాద్ మండలంలోని భాస్కర ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇన్టెన్స్(హౌజ్ సర్జరీ) డాక్టర్లు, పీజీ వైద్య విద్యార్థులు కలిసి భాస్కర ఆసుపత్రి నుంచి హిమయత్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్తూ ఎన్ఎంసీ బిల్లును రద్దు చేయాలని నినదించారు. హిమయత్ నగర్ చౌరస్తాలో దాదాపు అరగంట సేపు రాస్తారోకో నిర్వహించి వాహనాలను నిలిపివేశారు. ఎన్ఎంసీ బిల్లును తీసుకురావడంతో పేద, మధ్యతరగతి వారికి వైద్య విద్య అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థుల ధర్నాతో హిమయత్నగర్ చౌరస్తాలో వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం తెలుసుకున్న మొయినాబాద్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు వెంకట్, జగదీశ్వర్లు సిబ్బందితో కలిసి ధర్నా చేస్తున్నవారిని పక్కకు పంపించి ట్రాఫిక్ని పునరుద్ధరించారు. వైద్యులు, విద్యార్థులు తిరిగి ర్యాలీగా భాస్కర ఆసుపత్రికి వెళ్లారు. బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలి: ఐఎంఏ అనంతగిరి: కేంద్రం ఎన్ఎంసీ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఐఎంఏ వికారాబాద్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ భక్తవత్సలం, ఉపాధ్యక్షుడు డాక్టర్ పవన్కుమార్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆస్పత్రుల బంద్లో భాగంగా గురువారం వికారాబాద్లో బంద్ పాటించారు. ఈ సందర్భంగా పట్టణంలో గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6గంటల వరకు ఆస్పత్రులను బంద్ (అత్యవసర సేవలు మినహాయించి) నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐఎంఏ ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్రం ఎన్ఎంసీ బిల్లును తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 6 నెలల బ్రిడ్జి కోర్సు పెట్టి వైద్య విద్యార్థుల పొట్ట కొట్టాలని చూస్తుందని మండిపడ్డారు. కేంద్రం వెంటనే 32, 51, 15 సెక్షన్లను తొలగించాలన్నారు. ఈ సెక్షన్లు అమలైతే 6 సంవత్సరాలు యంబీబీఎస్ చదివిన మెడిసిన్ విద్యార్థుల చదువుకు విలువ లేకుండా పోతుందన్నారు. ఎలాంటి అర్హతలు లేని వారు 6 నెలల కోర్సుతో ఎలాంటి విధులు నిర్వర్తిస్తారో అర్థం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వికారాబాద్ ప్రధాన కార్యదర్శి భక్తవత్సలం, ఉపాధ్యక్షుడు పవన్కుమార్, కోశాధికారి హర్షవర్ధన్రెడ్డి, ప్రతినిధులు సబితాఆనంద్, భరత్కుమార్, రమ్య, దీపా భక్త వత్సలం, సందీప్ తదితరులు పాల్గొళన్నారు. -
స్తంభించిన వైద్యసేవలు
సాక్షి, హైదరాబాద్ : వైద్యుల సమ్మెతో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోనూ వైద్యసేవలు స్తంభించిపోయాయి. జూడాలకు మద్దతుగా సీనియర్ వైద్యులు కూడా సమ్మెలో పాల్గొనడంతో ఆయా ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ సేవలు నిలిచిపోగా, గురువారం జరగాల్సిన పలు చికిత్సలు వాయిదా పడ్డాయి. అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి ఆయా ఆస్పత్రులకు చేరుకున్న రోగులు.. వైద్యసేవలు అందక నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును (ఎన్ఎంసీ) వ్యతిరేకిస్తూ గురువారం తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీఎస్ జూడా) ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద తెలంగాణ వైద్య మహగర్జన నిర్వహించారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్ సహా నగరంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని జూనియర్, కొంత మంది సీనియర్ వైద్యులు ఈ మహాగర్జనలో పాల్గొన్నారు. ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిల్లును రద్దుచేయాలని డిమాండ్ చేశారు. మహాగర్జనకు హాజరైన ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ నాగేశ్వర్, సీనీ హీరో జీవితా రాజశేఖర్, మాజీ జేడీ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాది రచన తదితరులు వైద్యులకు సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీలో కూర్చొని నియంత్రణా?: కోదండరాం ఢిల్లీలో ఎవరో కూర్చుని ఇక్కడ వైద్య వ్యవస్థను నియంత్రించడం ఎంతవరకు సమంజసమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ప్రశ్నించారు. ఈ బిల్లును మార్చే వరకు ఊరుకోబోమని హెచ్చరించారు. సినీనటులు జీవితారాజశేఖర్ దంపతులు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీకి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఐదేళ్లు చదివి పరీక్ష రాసి పాసైన విద్యార్థులకు మరోసారి ఎగ్జిట్ పరీక్ష పెట్టడం దారుణమన్నారు. -
కాలేజీ చేతుల్లోకి మెడిసీన్!
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) స్థానంలో తీసుకొచ్చిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చట్టంపై వైద్య విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీని ప్రకారం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50% సీట్ల ఫీజులను మాత్రమే ప్రభుత్వం నియంత్రిస్తుంది. మిగతా ఫీజుల నిర్ణయం కాలేజీ యాజమాన్యాలదే. అలాగే ప్రస్తుతం పీజీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ పరీక్షను రద్దు చేసి ‘నెక్ట్స్’అనే పరీక్ష పెడతామని ప్రతిపాదించింది. ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పుడే అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు కాలేజీలు.. తాజా నిర్ణయంతో మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని జూడాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మిగులుతుందని అంటున్నారు. సాక్షి, హైదరాబాద్ : నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చట్టంపై జూనియర్ డాక్టర్ల ఆందోళనలు ఉధృతమయ్యాయి. దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళన చేస్తుండగానే.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. దీంతో 1956 నాటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) స్థానంలో, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అమల్లోకి వచ్చింది. డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సెక్షన్లకు ఎటువంటి సవరణలు చేయకుండానే బిల్లు చట్ట రూపం దాల్చింది. ఈ చట్టంలో ప్రతిపాదించిన కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్, కమిషన్లో డాక్టర్లకు బదులు నాన్–డాక్టర్లకు అవకాశం కల్పించడం.. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం, ప్రైవేటు కాలేజీల్లోని 50% సీట్ల ఫీజులను యాజమాన్యాలకే కట్టబెట్టడం వంటి అంశాలను డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2017లోనూ బిల్లుపై వ్యతిరేకత ఎన్ఎంసీ బిల్లును తొలిసారి 2017 డిసెంబర్లో లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సహా దేశవ్యాప్తంగా డాక్టర్లు ఈ బిల్లును వ్యతిరేకించడంతో సెలెక్ట్ కమిటీకి పంపించారు. 16వ లోక్సభ రద్దు అవడంతో ఈ బిల్లు మురిగిపోయింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. తాజాగా చట్టంగా మారడంతో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50% సీట్ల ఫీజులను మాత్రమే ప్రభుత్వం నియంత్రిస్తుంది. మిగతా 50% సీట్ల ఫీజుల నిర్ణయం కాలేజీ యాజమాన్యాలదే. దీంతో కాలేజీలు ఇష్టానికి ఫీజులు పెంచేసే అవకాశముందని, ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పుడే అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు కాలేజీలు, తాజా నిర్ణయంతో మరింతగా రెచ్చిపోయే ప్రమాదముందని డాక్టర్లు అంటున్నారు. ఈ బిల్లుతో పేద, మధ్యతరగతి స్టూడెంట్లకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రవేశ పరీక్షల్లో మెరిట్ సాధించకపోయినా, కోట్లలో ఫీజులు కట్టే సామర్థ్యం ఉన్నవాళ్లకు ఎంబీబీఎస్ సీట్లు దక్కుతాయని చెబుతున్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసనలు చేపట్టారు. దీనికి తోడు ఈ బిల్లులో ప్రతిపాదించిన నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ (నెక్ట్స్)పై వైద్య విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒకే ఎగ్జామ్ను 3 రకాలుగా వినియోగించాలని కేంద్రం నిర్ణయించింది. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పరీక్షగా, దేశ, విదేశాల్లో చదివిన విద్యార్థులకు ఎగ్జిట్ ఎగ్జామ్గా, పీజీ ప్రవేశాలకు ఎంట్రన్స్ ఎగ్జామ్గా ఈ పరీక్షను నిర్వహించాలని భావిస్తున్నారు. అంటే, ఇకపై ఎంబీబీఎస్ విద్యార్థులు ఈ పరీక్ష పాసైతేనే డాక్టర్గా ప్రాక్టీస్ చేసేందుకు లైసెన్స్ ఇస్తారు. ఈ నేపథ్యంలోనే నెక్ట్స్ను ఎగ్జిట్ ఎగ్జామ్గా పేర్కొంటున్నారు. ఎన్ఎంసీ అమల్లోకి వస్తే.. విదేశాల్లో చదివిన వాళ్లు కూడా ఎఫ్ఎంజీఈకి బదులు, నెక్ట్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇందులో పాసైతేనే ప్రాక్టీస్కు అర్హులవుతారు. అలాగే, ప్రస్తుతం పీజీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ విధానాన్ని రద్దు చేసి, నెక్ట్స్లో సాధించిన మార్కుల ఆధారంగానే పీజీ సీట్లు కేటాయిస్తామని బిల్లులో ప్రతిపాదించారు. దీన్నే విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ ఎన్ఎంసీ బిల్లులోని సెక్షన్ 32లో కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ అనే క్లాజ్ ఉంది. మోడ్రన్ సైంటిఫిక్ మెడికల్ ప్రొఫెషన్తో ముడిపడి ఉన్న వ్యక్తులకు ‘కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్’గా ‘లిమిటెడ్ లైసెన్స్’ఇవ్వొచ్చునని ఈ సెక్షన్లో ప్రతిపాదించారు. దీన్ని డాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ పేరుతో స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ఫిజియో థెరపిస్టులు తదితరులకు మోడ్రన్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే అవకాశం ఇచ్చే అవకాశముంది. అయితే వీళ్లకు మోడ్రన్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసేందుకు అవకాశమిస్తే, ప్రజారోగ్యం దెబ్బతింటుందని డాక్టర్లు చెబుతున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా వైద్య విద్యార్ధులు, జూనియర్ డాక్టర్లు గళమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా, హైదరాబాద్ ధర్నాచౌక్లో గురువారం భారీ సంఖ్యలో ధర్నా నిర్వహించారు. దీనికి పలు రాజకీయ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు హాజరై సంఘీభావం తెలిపారు. కమిషన్లో నాన్–డాక్టర్స్ ప్రస్తుతం ఉన్న మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా గవర్నింగ్ బాడీలో 80% మంది డాక్టర్లు ఉంటే, 20% మంది నాన్–డాక్టర్స్ ఉంటారు. కానీ, మెడికల్ కమిషన్లో 80% స్థానాల్లో నాన్–డాక్టర్స్ను కూడా నియమించుకునే అవకాశమిచ్చారు. ఇలా నాన్–డాక్టర్స్ కీలకంగా ఉండే కమిషన్లో రాజకీయ జోక్యం పెరుగుతుందని, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల చేతుల్లోకి వైద్య విద్య వ్యవస్థ వెళ్తుందని డాక్టర్లు ఆరోపిస్తున్నారు. భారీగా పెరగనున్న ఫీజులు నేషనల్ మెడికల్ కమిషన్ చట్టంతో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఫీజుల ధరలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బ్రిడ్జ్ కోర్సు, ఎగ్జిట్ ఎగ్జామ్, ఫీజుల నియంత్రణ ఎత్తివేయడం వంటి అనేక అంశాలు మెడిసిన్ స్టూడెంట్లకు, మెడిసిన్ చదవాలనుకుంటున్న విద్యార్థులకు నష్టాన్ని కలిగిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు కాలేజీల్లోని మొత్తం సీట్ల ఫీజులను నియంత్రించే అధికారం ప్రభుత్వాలకు ఉంది. ఎన్ఎంసీ చట్టంతో ప్రైవేటులోని 50% సీట్లపై ప్రభుత్వం నియంత్రణ కోల్పోనుంది. చాలా రాష్ట్రాల్లో బీ–కేటగిరీ సీటుకు కనీసం రూ.50లక్షలు, సీ–కేటగిరీ సీటుకు కోటి రూపాయల వరకూ కాలేజీలకు చెల్లించాల్సి వస్తోంది. ఈ నియంత్రణ ఎత్తివేస్తే ఫీజులు రెండు, మూడింతలు పెరిగే ప్రమాదముంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారనుంది. -
ఇంతకూ వైద్యం సేవా.. వ్యాపారమా?
కార్పొరేట్ వైద్యం రాజ్యమేలుతూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ప్రాథమిక ఆరోగ్య సేవలు నత్తనడకతో సాగుతున్న పరిస్థితిని సరిచేయడానికి ఫ్యామిలీ మెడిసిన్ ప్రాముఖ్యతని అన్ని దేశాలూ గుర్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ వైద్య కమిషన్ బిల్లు ప్రజా వ్యతిరేకత లక్ష్యంతో ఉంది. ఈ కమిషన్ సూచించే నియంత్రణలన్నీ ప్రభుత్వ కళాశాలలకి మాత్రమే వర్తిస్తాయి. అలాంటప్పుడు సమానత్వం ఎక్కడిది? ఒకే రకమైన, నాణ్యమైన విద్య ఎక్కడిది? ప్రైవేట్ వైద్యకళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో 15 శాతం సీట్లు యాజమాన్యం చేతిలో ఉండగా ఇప్పుడు ఈ బిల్లులో దాన్ని 50 శాతానికి పెంచడం పేదలకు ఎలా ఉపకరిస్తుంది? అందుకే ఇది ‘ప్రజా వ్యతిరేక, పేదల వ్యతిరేక బిల్లు’ మాత్రమే. మన వైద్య రంగాన్ని నిర్వీర్యపరిచే ఇలాంటి బిల్లులు సమానత్వాన్ని చాటలేవు. వైద్యాన్ని మొత్తంగా ప్రభుత్వపరం చేసి, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరిచే విధానాలు మాత్రమే ప్రజల ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడగలవు. మన కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జాతీయ వైద్య కమిషన్ బిల్లు (ఎన్.ఎం.సి. బిల్) అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. అందుకే దేశవ్యాప్తంగా వైద్యరంగ నిపుణులు, వైద్య విద్యార్థులు తమ నిరస నని తెలుపుతున్నారు. 1956 నాటి భారతీయ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ని రద్దు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎం.సి.ఐ.లో అవినీతి పేరుకు పోయినందుకు, దాన్ని రద్దుచేసి, వైద్యవిద్య, ఆరోగ్య రంగాల్లో ఈ కొత్త నియంత్రణలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. దీని ద్వారా దేశానికి అవసరమైన ఉన్నతస్థాయి వైద్యులని అందించవ చ్చని, అత్యాధునిక పరిశోధనని అమలు చేయవచ్చని, వైద్య కళాశాలలపై క్రమబద్ధమైన పర్యవేక్షణ వీలవుతుందని, సమస్యల పరిష్కా రానికి తగిన వేదిక ఏర్పడుతుందనీ ప్రభుత్వం వాదిస్తోంది. కానీ అవినీతి లేనిదెక్కడ? అవినీతిని రూపు మాపడం కోసం ఈ కొత్త కమిషన్ని ఏర్పాటు చేయాలని చెప్పే అమాత్యుల్లో ఎంతమంది లంచగొండులున్నారు? ఐదేళ్ల పరిపాలనా కాలంలో వారి ఆస్తులు ఎంత పెరిగాయో లెక్కలు తీసి ఫాస్ట్ కోర్టులకి అప్పగించాలని జస్టిస్ చలమేశ్వర్ సూచించారు. 34 శాతం కొత్త ఎంపీల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రజాస్వామిక సంస్కరణల సంస్థ (ఏడీఆర్) నిర్ధా రించింది. డాక్టర్లు ఎన్నుకున్న ఎంసీఐలో 120 మంది సభ్యులు ఉంటారు. వీరిలో కొందరు అవినీతిపరులున్నారనే నెపంతో ఆ సంస్థనే రద్దు చేస్తే, మరి పై అంచనాల ప్రకారం అసెంబ్లీలు, పార్ల మెంట్లు ఏమవ్వాలి? ఈ కమిషన్ సూచించే నియంత్రణలన్నీ ప్రభుత్వ కళాశాలలకి మాత్రమే వర్తిస్తాయి. అలాంటప్పుడు సమా నత్వం ఎక్కడిది? ఒకే రకమైన, నాణ్యమైన విద్య ఎక్కడిది? ప్రైవేటు కళాశాలలకి నియమ నియంత్రణలు ఉండవు. తనిఖీలు ఉండవు. నామమాత్రపు అనుమతితో కాలేజీ పెట్టవచ్చు. సీట్లు పెంచుకో వచ్చు. దాదాపు 80 మంది ఎంపీలకు ప్రైవేటు వైద్య కళాశాలలతో సంబంధాలున్నాయి. వాటి యజమానులుగానో, ట్రస్టీలుగానో, మేనే జింగ్ భాగస్వాములుగానో వాటిలో వారి ప్రమేయం ఉంది. అందుకే నియంత్రణలో ఈ పక్షపాత వైఖరి. ప్రైవేటు వైద్య కళాశాలలు 90వ దశకం తర్వాత విపరీతంగా పుట్టుకొచ్చాయి. వాటిని నియంత్రించి, ప్రమాణాలకి చేరని వాటిని రద్దుచేసి, మిగిలిన వాటిని ప్రభుత్వపరం చేయాలి. అప్పుడు నియం త్రణ సజావుగా, సమానంగా ఉంటుంది. అంతేగానీ, హెచ్చుతగ్గు లను అలాగే ఉంచి, సమానత్వం ఎలా సాధిస్తారు? ప్రస్తుతం ప్రైవేటు కళాశాలల్లో, డీమ్డ్ యూనివర్సిటీల్లో 80 శాతం సీట్ల ఫీజుని ప్రభుత్వం నిర్ణయిస్తుంటే, 15 శాతం సీట్లు ప్రైవేటు కాలేజీ చేతిలో ఉండేవి. ఇప్పుడు ఈ బిల్లులో దాన్ని 50 శాతం చేశారు. ఇది పేదలకి ఎలా ఉపకరిస్తుంది? అందుకే దీన్ని ‘ప్రజా వ్యతిరేక, పేదల వ్యతిరేక బిల్లు’గా డాక్టర్లు అభివర్ణిస్తున్నారు. గామీణ ప్రాంతాల్లో డాక్టర్లని పెంచే దిశగా ఈ బిల్లుని ఏర్పరిచామని చెప్పే ప్రభుత్వం ఇలా ధని కులకి కోటాని పెంచి, పేదలకి అవకాశాలు తగ్గించేస్తోంది. కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్లుగా కొందరికి లైసెన్స్ ఇచ్చే అధి కారం ఈ కమిషన్కి ఉంది. ఈ మధ్యస్థాయి ప్రాక్టీషనర్ల స్థాయి ఏమిటనేది స్పష్టం చేయడం లేదు. కానీ వారు ప్రాథమిక వైద్య స్థాయిలో కొన్ని మందులు వాడవచ్చని ప్రతిపాదించారు. ఎంబీబీఎస్ కాని వారికి ఆరు నెలల బ్రిడ్జి కోర్సు కలిగించి వారిని గ్రామీణ డాక్టర్లుగా గుర్తించే ప్రతిపాదనని అందరూ అడ్డుకోగా, ఇప్పుడు మాటలు మార్చి, అదే ప్రతిపాదనని దొడ్డితోవన తీసుకొచ్చి, నకిలీ డాక్టర్లకి అవకాశం కల్పిస్తున్నారు. అల్లోపతి డాక్టర్లు పల్లెలకు పోవడం లేదని, పల్లెల్లో ఆరోగ్య వ్యవస్థని పటిష్టం చేయడం కోసం ఈ చర్య తప్పదని అంటున్నారు. మనం ప్రతి ఏటా 60 వేల మంది డాక్టర్లని తయారు చేస్తున్నాం. వారిలో కొద్దిమందికి మాత్రమే కాంట్రాక్టు ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మిగిలినవారు పల్లెలకి పోతామని, దానికి తగిన వసతులు కల్పించమని, జీతాలు తగినట్టు ఇవ్వమని చెబుతూ కొన్ని సౌకర్యాలు ఇవ్వమని కోరుతున్నారు. కానీ ఈ నిరు ద్యోగుల మొర ఆలకించకపోగా, నిపుణులని పక్కకి నెట్టి, అరకొర వైద్యం తెలిసిన వారిని అందలం ఎక్కించి ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. ఏ రంగానికి ఆ రంగాన్ని వృద్ధి చేయకుండా, అడ్డదారిలో వైద్యాన్ని ప్రవేశపెడితే, ఆయుష్ విద్యార్థులు మాత్రం తమ ప్రమాణాలని ఎలా పెంచుకోగలరు? వైద్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచి, ప్రభుత్వ వైద్య సంస్థల ప్రమాణాలని పెంచి, అల్లోపతి డాక్టర్ల నియామకాలను పెంచితే సమస్య పరిష్కారం అవుతుంది కానీ ఇలా చిట్కాలతో సమస్య తీరదు. నిజానికి మనకి డాక్టర్ల కొరత లేదు. స్పెషలిస్టుల కొరత ఉంది. పీజీ సీట్లు పెంచి, వారి నైపుణ్యాన్ని పెంచి, వారిని ప్రభుత్వ రంగంలో నిలిపి ఉంచుకోగలిగితే వైద్య రంగం పురోగమిస్తుంది. కానీ అన్ని రంగాల్లో లాగానే వైద్య రంగంలో కూడా కార్పొరేట్లకి రాయితీలు ఇస్తూ ప్రాథమిక వైద్య సేవలని దెబ్బ తీస్తున్నారు. మన దేశంలో ప్రాథమిక ఆరోగ్య విధానం దిగజారిపోతోంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే విధానాలు అంటువ్యాధులని నియం త్రించే ప్రాథమిక సూత్రాలు అడుగంటిపోతున్నాయి. జీవన విధాన మార్పులతో వచ్చే వ్యాధులకి మాత్రమే ప్రాధాన్యతనిచ్చే కార్పొరేట్ వైద్యం రాజ్యమేలుతోంది. ప్రజల జీవన ప్రమాణాలని పెంచే ప్రాథ మిక ఆరోగ్య సేవలు నత్తనడకన సాగుతున్నాయి. దీన్ని సరిచేయ డానికి ఫ్యామిలీ మెడిసిన్ ప్రాముఖ్యతని అన్ని దేశాలూ గుర్తిస్తు న్నాయి. కానీ మన దేశంలో మాత్రం ఈ నిపుణుల సేవలని అంది పుచ్చుకోవడంలో విఫలం అవుతున్నాం. అన్ని వయసుల వారిని, అన్ని ప్రాథమిక వ్యాధులని పరీక్షించగల నైపుణ్యంగల ఈ డాక్టర్లని, ఈ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ప్రాథమిక వైద్య కేంద్రాల్లో వీరి సేవలను ఉపయోగిస్తే ప్రాథమిక స్థాయిలో ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఏ వృత్తికి ఆ వృత్తి స్వయం నిర్ణయాధికార హక్కు ఉండాలి. అలా వైద్య వృత్తిని వైద్యులు నియంత్రించాలిగానీ ప్రభుత్వాలు కాదు. ప్రైవేటు కళాశాలలని ప్రభుత్వపరం చేయడానికి బదులు వారికి 50 శాతం సీట్ల ఫీజులపై పెత్తనాన్ని అప్పగించడం సమా నత్వం ఎలా అవుతుంది? వైద్య విద్యని మేధ కాక డబ్బు నియంత్రిస్తే నీట్ ఎందుకు? నెక్ట్స్ ఎందుకు? కష్టపడి చదవడం ఎందుకు? పేదల నోట్లో మన్ను ఎందుకు? విద్యని కొనుక్కునే డాక్టర్లు సామాన్యుల ఆశాజ్యోతులవుతారా? విద్య వైద్యం పూర్తిగా ప్రభుత్వపరంగా ఉండి ప్రజల అవసరా లను తీరిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ ప్రస్తుతం ఈ రెండు రంగాల్లో ప్రైవేటు సంస్థలు రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వం తన బాధ్యతని దులిపేసుకోవడంతో ప్రజలు 80 శాతం వైద్య ఖర్చులను తామే భరిస్తూ నిరుపేదలవుతున్నారు. రైతుల ఆత్మహత్యలకి కార ణాల్లో వైద్య పరమైన అప్పులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. సేవా రంగాలను వ్యాపార రంగాలుగా మార్చడం మానాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెంచి, అందులో నైపుణ్యం గల డాక్టర్లని నియమించి, వైద్య విద్యా ప్రమాణాలను పెంచి, వాటి అనుబంధ ఆసుపత్రులకి కేటాయింపులు పెంచి, నాణ్యమైన పరికరాలు అందిస్తే వైద్యం అందరికీ అందుబాటులోకి వస్తుంది. ప్రాథమిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలే తప్ప, అవకతవక సంస్కరణలతో వారిపై భారాన్ని పెంచి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీయకూడదు. క్యూబా, థాయ్లాండ్, యూరప్ వంటి చోట్ల ఉన్న మెరుగైన వైద్య ఆరోగ్య సేవల అనుభవాన్ని అధ్యయనం చేసి మన వైద్య రంగాన్ని మెరుగు పర్చుకోవాలి. లేదంటే, ఈ తప్పుడు విధానాల వల్ల అంటువ్యాధులు ప్రబలి, జాతీయ భద్రతకే ముప్పు వాటిల్లవచ్చు. మనవైద్య రంగాన్ని నిర్వీర్యపరిచే ఇలాంటి బిల్లులు సమాన త్వాన్ని చాటలేవు. వైద్యాన్ని మొత్తంగా ప్రభుత్వపరం చేసి, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరిచే విధానాలు మాత్రమే ప్రజల ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడగలవు. సేవా రంగాన్ని వ్యాపారం మింగేస్తే అలాంటి దేశానికి భవిష్యత్తు ఉండదు. - డాక్టర్ నళిని, పిల్లల వైద్య నిపుణులు -
జూడాల ఆందోళన ఉద్రిక్తం
లబ్బీపేట (విజయవాడ తూర్పు)/సాక్షి, అమరావతి/తిరుపతి తుడా: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ)ను రద్దు చేయాలని కోరుతూ విజయవాడలో జూనియర్ వైద్యులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆరు రోజులుగా ప్రభుత్వాస్పత్రి, వైద్య కళాశాల ప్రాంగణంలో నిరసనలు తెలుపుతున్న జూడాలు బుధవారం జాతీయ రహదారిపైకి వచ్చి మహానాడు రోడ్డు జంక్షన్ను దిగ్బంధం చేశారు. వారి ఆందోళన అర్ధగంటకు పైగా సాగడంతో నాలుగు వైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ట్రాఫిక్ సమస్య దృష్ట్యా ఆందోళన విరమించాలని కోరారు. అందుకు జూడాలు నిరాకరించడంతో బలవంతంగా వాహనాల్లో ఎక్కించి భవానీపురం, వన్టౌన్ పోలీసుస్టేషన్లకు తరలించారు. ఆ క్రమంలో ఓ జూడాపై డీసీపీ హర్షవర్ధన్ దురుసుగా ప్రవర్తిస్తూ చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఐఎంఏ ప్రతినిధుల సంప్రదింపులు ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ టీవీ రమణమూర్తి, డాక్టర్ మనోజ్ తదితరులు వన్టౌన్, భవానీపురం పోలీసుస్టేషన్లకు వెళ్లి జూడాలను వదిలివేయాలని కోరారు. వారి భవిష్యత్తో కూడిన అంశం కావడంతో ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ట్రాఫిక్ సమస్య సృష్టించాలని కానీ, ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం వారికి లేదని చెప్పడంతో కొద్దిసేపటి తర్వాత జూడాలను పోలీసులు వదిలివేశారు. అనంతరం ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న జూడాలు.. తమ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారి క్షమాపణ చెప్పాలంటూ నిరసన దీక్షకు దిగారు. జూడాలను బూట్ కాలితో తన్నుతున్న టీటీడీ వీజీవో అశోక్కుమార్ గౌడ్ మంత్రి, కార్యదర్శులకు వినతిపత్రాలు ఎన్ఎమ్సీని రద్దు చేసి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరించాలనే డిమాండ్తో కూడిన వినతిపత్రాలను జూనియర్ వైద్యుల సంఘ ప్రతినిధులు సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్రెడ్డికి సమర్పించారు. అలిపిరి వద్ద ఆందోళన.. రసాభాస ఎన్ఎమ్సీ బిల్లుకు వ్యతిరేకంగా తిరుపతిలో జూడాలు చేపట్టిన ఆందోళన రసాభాసగా మారింది. భక్తులు తిరుమలకు వెళ్లే అలిపిరి మార్గంలో రాస్తారోకో నిర్వహించడంతో మూడు గంటల పాటు రాకపోకలు ఆగిపోయాయి. దీంతో పోలీసులు, టీటీడీ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ అధికారులు అక్కడకు చేరుకుని జూడాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఓ వైపు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో సహనం నశించి భక్తులు వైద్య విద్యార్థులతో గొడవకు దిగారు. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ అధికారి అశోక్కుమార్ గౌడ్ వైద్య విద్యార్థిపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు కాలితో తన్నడంతో ఒక్కసారిగా జూడాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ అధికారి చర్యలకు నిరసనగా మరోసారి ఆందోళనకు దిగారు. ఎంతకీ వినకపోవడంతో వారిని అరెస్టు చేసి ఎమ్మార్పల్లిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్కు తరలించారు. -
ఆపరేషన్లు ఆగిపోయాయ్!
సాక్షి, హైదరాబాద్: జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు నిరసనగా వైద్యులు చేపట్టిన ఆందోళన శుక్రవారం కూడా కొనసాగింది. 3రోజుల క్రితం ఓపీ సేవలు ఆపేసి ఆందోళన చేపట్టిన వైద్యులు గురువారం మధ్యాహ్నం నుంచి అత్యవసర వైద్యసేవలనూ బహిష్కరించిన విషయం తెలిసిందే. జ్వరం, దగ్గు, జలుబు వంటి సాధారణ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రి ఓపీకి చేరుకున్న ఔట్ పేషెంట్లకే కాకుండా ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి గాంధీ, ఉస్మానియా, నిమ్స్ అత్యవసర విభాగాలకు చేరుకున్న రోగు లూ వైద్యసేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లగా.. మరి కొందరు ఆస్పత్రి ప్రాంగణాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. రోజంతా ఏకధాటిగా కురుస్తున్న వర్షం, వైద్యులు సమ్మెకు దిగిన సమాచారంతో ఆయా ఆస్పత్రులకు రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇదిలా ఉండగా పార్లమెంట్లో జాతీయ వైద్య కమిషన్ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. దానిని ఉపసంహరించే వరకు ఆందోళనను విరమించేది లేదని వైద్యులు మరోసారి స్పష్టం చేశారు. అత్యవసరం తప్ప అంతా బంద్! సాధారణ రోజుల్లో ఉస్మానియాలో రోజుకు సగటున 150, గాంధీలో 200, నిలోఫర్లో 40–50, ఈఎన్టీలో 25, నిమ్స్లో 250 వరకు చిన్నాపెద్దా సర్జరీలు జరుగుతాయి. అయితే జూడాల సమ్మెతో 30% సర్జరీలు వాయిదా వేయాల్సి వచ్చింది. అత్యవసర సర్జరీ లు కొనసాగినప్పటికీ.. మిగిలిన ఆపరేషన్లను వాయి దా వేశారు. ఇప్పటికే సర్జరీకి డేట్ తీసుకుని, ఉదయాన్నే ఆయా ఆపరేషన్ థియేటర్ల వద్దకు చేరుకున్న బాధితులు తీరా ఆపరేషన్ వాయిదా వేసినట్లు తెలిసి నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. గాంధీ ఆస్పత్రి లోని జూడాల సామూహిక ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. కోఠి ఈఎన్టీ ఆస్పత్రి వైద్యులు ప్రధాన గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేయగా, ఉస్మానియాలో పాతభవనం ముందు ఆందోళన చేపట్టారు. నిలోఫర్ చిన్నపిల్లల దవాఖానాలో సకాలం లో వైద్య సేవలు అందక పసిపిల్లలు అవస్థలు పడుతున్నారు. నిమ్స్లో రెసిడెంట్ వైద్యులు విధులు బహిష్కరించడంతో అత్యవసర విభాగానికి చేరుకు న్న రోగులకే కాకుండా ఆస్పత్రిలోని వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులకు వైద్యసేవలు అందలేదు. స్టాఫ్ నర్సులే పెద్దదిక్కు: జూనియర్లు సమ్మెలో ఉండటంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. తాత్కాలికంగా సెలవులను రద్దు చేశారు. సీనియర్ ఫ్యాకల్టీ మొత్తాన్ని ఓపీ, ఐపీ, అత్యవసర విభాగాల్లో అందుబాటులో ఉంచారు. ఉదయం 9 గంటలకే ఐపీ రౌండ్స్ నిర్వహించాల్సిన సీనియర్ వైద్యులు ఓపీలో కూర్చోవడంతో ఆయా విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగులకు స్టాఫ్నర్సులే పెద్దదిక్కుగా మారారు. ఇప్పటికే ఆస్పత్రిలో అడ్మిటైన వారికి సర్జరీ కోసం ఎదురు చూపులు తప్పలేదు. -
వైద్యరంగం మేలుకేనా?!
భ్రష్టుపట్టిన వైద్య రంగానికి, వైద్య విద్యకు చికిత్స చేయడం కోసమంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) బిల్లుకు గురువారం రాజ్యసభ కూడా ఓకే అనడంతో పార్లమెంటు ఆమోదం లభించినట్టయింది. ఈ బిల్లుకు వైద్యులు, వైద్య విద్యార్థులు మొదటి నుంచీ వ్యతిరేకం. నిరుడు జనవరిలో తొలిసారి లోక్సభలో దీన్ని ప్రవేశపెట్టినప్పుడు వారు దేశ వ్యాప్తంగా 12 గంటల సమ్మె చేశారు. సభలో సైతం వ్యతిరేకత వెల్లువెత్తడంతో అప్పట్లో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారు. అయితే తాము ఆదినుంచీ వ్యతిరేకిస్తున్న పలు అంశాలు ఇప్పటికీ ఈ బిల్లులో ఉన్నాయన్నది వైద్యులు, వైద్య విద్యార్థుల ప్రధాన ఆరోపణ. ఈమధ్యకాలంలో ఈ స్థాయిలో వివాదాస్పదమై, తీవ్ర నిరసనలు వ్యక్తమైన బిల్లు ఇదే. ఈ బిల్లు ముసాయిదా రెండేళ్ల క్రితం వెల్లడైనప్పుడు ఇది తమకు సమ్మతం కాదని వైద్యరంగ నిపుణులు, విద్యార్థులు తేల్చి చెప్పారు. అదే సమయంలో భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) పని తీరు సక్రమంగా లేదన్న విష యంలో అందరికీ ఏకీభావం ఉంది. కానీ దాని స్థానంలో తీసుకొచ్చిన ఎన్ఎంసీ సైతం లొసుగుల మయం అయితే ఎలాగన్నది వారి ప్రశ్న. తమ అభ్యంతరాల తర్వాత కేవలం కొన్ని నిబంధనలు మాత్రమే స్వల్పంగా మారాయని వారంటున్నారు. పాత బిల్లు స్థాయీ సంఘం పరిశీలనకెళ్లాక ప్రధానంగా అందులో రెండు మార్పులు చేశారు. ఎంబీబీఎస్ పూర్తయ్యాక పట్టా ఇచ్చేముందు విడిగా పెట్టదల్చిన పరీక్షను రద్దు చేశారు. కానీ అదే సమయంలో ఆఖరి సంవత్సరం ‘నేషనల్ ఎగ్జిట్ టెస్ట్’(నెక్ట్స్) పేరిట ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని, అందులో కృతార్థులైనవారే వైద్య వృత్తిలో ప్రవేశించేందుకైనా, పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశం కోరడానికైనా అర్హులని బిల్లులోని సెక్షన్ 15(1) చెబుతోంది. పీజీ కోర్సులకోసం నిర్వహించే ఇప్పు డున్న నీట్ పరీక్ష రద్దును వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. హోమియోతో పాటు భారతీయ వైద్య విధానాలను ప్రాక్టీస్ చేసేవారికి ‘బ్రిడ్జి కోర్సు’ పెట్టి వారు రోగులకు అల్లోపతి మందుల చీటిలు రాయడాన్ని అనుమతించే పాత నిబంధన తొలగించారు. అయితే ‘బ్రిడ్జి కోర్స్’ అనే మాట లేదు తప్ప సామాజిక వైద్య సహాయకుల(సీహెచ్పీ) పేరిట కొత్త నిబంధన ఏర్పరిచారు. శిక్షణ పొందాక మండలాల స్థాయిలో వీరు అల్లోపతి ఔషధాలను ఒక స్థాయి వరకూ రోగులకు సూచించవచ్చునని చెబుతున్న నిబంధన వల్ల గ్రామీణ ప్రాంత వైద్య ఆరోగ్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందన్నది వైద్యులు, వైద్య విద్యార్థుల వాదన. ఇందులో నిజముంది. మారు మూల ప్రాంతాల్లో నాణ్యమైన, ప్రామాణికమైన వైద్య సేవలందితే నిరుపేద జనం ప్రాణాంతక మైన దీర్ఘ రోగాల బారినపడే అవకాశాలుండవు. వైద్యుల వద్ద కాంపౌండర్లుగా పనిచేసినవారో, ఇతరత్రా కోర్సులు చేసినవారో వైద్యులుగా అవతారమెత్తి ఇష్టానుసారం మందులు రాస్తుండటం వల్ల ఇప్పటికే ఎన్నో సమస్యలొస్తున్నాయి. కొత్తగా ఏర్పరిచే వ్యవస్థ ఈ స్థితిని నిర్మూలించకపోగా, దాన్ని చట్టబద్ధం చేసే ప్రమాదం కనబడుతోంది. ఈ నిబంధన పర్యవసానంగా కొత్తగా రంగంలో కొచ్చే మూడున్నర లక్షలమంది సీహెచ్పీలు తమకున్న పరిధులు అతిక్రమించరన్న గ్యారెంటీ లేదు. ఒకపక్క అయిదేళ్లపాటు వైద్య విద్య అభ్యసించినవారికి పట్టా ఇవ్వడం విషయంలోనే తీవ్ర మార్పులు చేసినవారు... వైద్య విద్యతో సంబంధంలేనివారిని సీహెచ్పీలుగా ఉదారంగా అనుమ తించడం మున్ముందు సమస్యలకు దారితీసే అవకాశం లేకపోలేదు. నిజానికి ఈ నిబంధన తొలగిం చాలని స్థాయీ సంఘం సూచించింది. అయినా జరిగిందేమీ లేదు. ఇక వైద్య విద్యకు సంబంధించిన నిబంధనలు కూడా విమర్శలకు తావిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు మెడికల్ కళాశాలలు, డీమ్డ్ వర్సిటీల్లో 50 శాతం సీట్లకు సంబంధించిన ఫీజుల్ని నియంత్రించే నిబంధన వల్ల మిగిలిన 50శాతం సీట్లకూ వారు ఇష్టానుసారం ఫీజులు నిర్ణయించే ప్రమాదం ఉంటుంది. సారాంశంలో ఇది వైద్య విద్యను ప్రైవేటీకరించడమే అవుతుంది. 75శాతం సీట్లకు సంబంధించిన ఫీజుల్ని నియంత్రించే విధానం ఉన్నప్పుడే సాధారణ కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకూ, ప్రతిభ గల విద్యార్థులకూ వైద్య విద్య అందుబాటులో ఉంటుంది. అయితే ఎన్ఎంసీ పరిధిలోకి రాని మిగిలిన 50 శాతం సీట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజుల్ని నియం త్రించుకోవచ్చునని ప్రభుత్వం అంటోంది. కానీ ఇది ఆచరణ సాధ్యమవుతుందా? ఎన్ఎంసీలో ఉండే సభ్యులకు సంబంధించిన నిబంధనలో కొంత మార్పులు చేశారు. ఇప్పుడున్న నిబంధన ప్రకారం కేంద్రం 14మందిని నామినేట్ చేస్తుంది. రాష్ట్రాల నుంచి పదిమంది ఉంటారు. వీరుగాక 9మంది స్వతంత్ర సభ్యులుంటారు. అయితే మొత్తంగా వైద్యరంగాన్ని పర్యవేక్షించే వ్యవస్థను ఆ రంగంలోని నిపుణులకే విడిచిపెట్టడం ఉత్తమం. ఆ వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వాలు నామినేట్ చేసేవారే అధికంగా ఉంటే ఆ రంగానికి చెందిన నిపుణుల సూచనలు వీగిపోతాయి. దీన్ని గురించి ఆలోచించి ఉంటే బాగుండేది. అయితే ఎన్ఎంసీ పరిధికింద నాలుగు బోర్డులు ఏర్పాటు చేయడం ఒక రకంగా మంచిదే. దీని ప్రకారం డిగ్రీ స్థాయి విద్య కోసం ఒకటి, పీజీ విద్యా వ్యవహారాలు చూసేందుకు మరొకటి బోర్డులు ఏర్పాటవుతాయి. ఇక వైద్య కళాశాలల పనితీరు మదింపు వేయడం, వాటికి రేటింగ్ నిర్ణయించడంవంటివి పర్యవేక్షించడానికి ఒక బోర్డు, ఈ రంగంలో నైతిక విలువల పరిరక్షణకు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు చూసేందుకు మరొక బోర్డు ఏర్పాటవుతాయి. ఇన్నాళ్లూ అన్నిటినీ ఒకేచోట కేంద్రీకరించడంవల్ల పర్యవేక్షణ లోపం మాత్రమే కాదు... అవినీతి కూడా ఊడలు వేసిందని అందరూ అనుకుంటున్నదే. మొత్తానికి ఎన్నో ఏళ్ల తర్వాత సమగ్రమైన మార్పులు చేయడానికంటూ తీసుకొచ్చిన బిల్లు సైతం ఆ రంగంలోనివారికి పెద్దగా సంతృప్తినీయకపోవడం విచారకరం. ఈ విషయంలో కేంద్రం మరిన్ని సంప్రదింపులు జరిపి ఉంటే బాగుండేది. -
‘మెడికల్’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: వివాదాస్పద నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బిల్లుకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. వైద్య విద్యకు సంబంధించి అతిపెద్ద సంస్కరణగా ప్రభుత్వం అభివర్ణిస్తున్న ఈ బిల్లులో.. అవినీతికి ఆలవాలంగా మారిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పొందుపర్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన తెలుపుతున్నారు. ఈ బిల్లును ‘ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956’కు ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చారు. అన్నాడీఎంకే వాకౌట్ చేయగా మూజువాణి ఓటుతో బిల్లును రాజ్యసభ ఆమోదించింది. లోక్సభలో ఇప్పటికే ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. తాజాగా రెండు సవరణలకు లోక్సభ ఆమోదం తెలపాల్సి ఉన్న నేపథ్యంలో మరోసారి ఈ బిల్లు లోక్సభకు వెళ్లనుంది. బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్.. ‘నకిలీ వైద్యులకు అడ్డుకట్ట వేసేలా ఈ బిల్లు ఉంది. తప్పుడు వైద్య విధానాలకు పాల్పడేవారికి సంవత్సరం జైలుశిక్షతో పాటు, రూ. 5 లక్షల జరిమానా విధించే ప్రతిపాదన బిల్లులో ఉంది. ఇప్పటివరకు అలాంటివారికి ఎంసీఐ నామమాత్రపు జరిమానా మాత్రమే విధించేది’ అని తెలిపారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చిన మూడేళ్లలో నెక్ట్స్(నేషనల్ ఎగ్జిట్ టెస్ట్)ను నిర్వహించడం ప్రారంభిస్తామన్నారు. ఎన్ఎంసీలో రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం లేదన్న ఎంపీల విమర్శలపై స్పందిస్తూ.. మొత్తం 25 మంది సభ్యుల్లో 11 మంది రాష్ట్రాల ప్రతినిధులేనన్నారు. నెక్ట్స్గ్ పరీక్షను మెడికల్ పీజీ ఎంట్రన్స్ పరీక్షగా, అలాగే విదేశాల్లో ఎంబీబీఎస్ చేసినవారికి స్క్రీనింగ్ పరీక్షగా పరిగణిస్తామన్నారు. కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్ల(సీహెచ్పీ) వ్యవస్థను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిందని, అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆ వ్యవస్థను అమలు చేస్తున్నాయని, భారత్ కూడా ఆ దిశగా వెళ్తోందని చెప్పారు. ఎన్ఎంసీలోని 25 మంది సభ్యుల్లో 21 మంది వైద్యులేనని, వారు సీహెచ్పీల అర్హతలను నిర్ణయిస్తారని హర్షవర్ధన్ వివరించారు. బిల్లును స్థాయీసంఘానికి పంపాలని తృణమూల్ కాంగ్రెస్ సహా పలు పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. వైద్య విద్య అభ్యసించని 3.5 లక్షలమంది నాన్ మెడికల్ సిబ్బందికి ఆధునిక వైద్యం అందించే వైద్యులుగా లైసెన్స్ ఇవ్వాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ వ్యతిరేకించారు. బిల్లులోని ముఖ్యాంశాలు ► ఇప్పటివరకు అమల్లో ఉన్న ఎంసీఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. వందమందికిపైగా సభ్యులు ఉండే ఇందులో 70 శాతం మందిని ఎన్నుకుంటారు. ఇక కొత్తగా వచ్చిన ఎన్ఎంసీలో 25 మందే సభ్యులుగా ఉంటారు. వారిలో అత్యధికుల్ని కేంద్రమే నామినేట్ చేస్తుంది. ► కేంద్రం నియమించిన ఏడుగురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీ ఎన్ఎంసీ చైర్ పర్సన్ పేరుని, తాత్కాలిక సభ్యుల పేర్లను సిఫారసు చేస్తుంది. ► కొత్త కమిషన్లో 8 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో నలుగురు వైద్య విద్యకు సంబంధించిన వివిధ బోర్డుల అధ్యక్షులు ఉంటారు. మరో ముగ్గురిని ఆరోగ్యం, ఫా ర్మా, హెచ్ఆర్డీ శాఖలే సిఫారసు చేస్తాయి. ► ఎంసీఐ సమావేశం కావాలంటే వందమందికిపైగా ఉన్న సభ్యుల్లో 15 మంది హాజరైతే సరిపోయేది. వారు తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు అయ్యేవి. జాతీయ వైద్య కమిషన్కు సంబంధించి 25 మందిలో 13 మంది హాజరైతేనే కీలక నిర్ణయాలు తీసుకోగలరు. ► ఎన్ఎంసీ సభ్యులందరూ విధిగా తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించాలి. ► ఎంసీఐ కాలపరిమితి అయిదేళ్లయితే ఎన్ఎంసీ కాలపరిమితి నాలుగేళ్లు. తాత్కాలిక సభ్యులు రెండేళ్లకి ఒకసారి మారతారు. ► కమిషన్ చైర్మన్ను, అందులో సభ్యుల్ని తొలగించే అధికారం పూర్తిగా కేంద్రానిదే. ► ఎంబీబీఎస్, మెడికల్ పీజీకి సంబంధించి అన్ని ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిట్లీ 50 శాతం సీట్లలో ఫీజుల నియంత్రణ కమిషన్ చేతుల్లోనే ఉంటుంది. ► వైద్య విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి, మెడికల్ ప్రాక్టీస్ అనుమతికి సంబంధించి ఎంబీబీఎస్ చివరి ఏడాది నిర్వహించే పరీక్షనే అర్హతగా పరిగణిస్తారు. దీనిని నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్) పేరుతో నిర్వహిస్తారు. విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించిన విద్యార్థులు భారత్లో ప్రాక్టీస్ చేయాలంటే స్క్రీనింగ్ టెస్ట్కి హాజరుకావాలి. ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో వైద్యవిద్యనభ్యసించాలంటే ఇకపై నీట్తో పాటు గా నెక్ట్స్ పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది. ► దేశంలోని హోమియో, యునాని, ఆయుర్వేదం కోర్సులు చదివిన వారు కూడా ఒక బ్రిడ్జ్ కోర్సు ద్వారా అల్లోపతి వైద్యాన్ని చేయవచ్చు. -
నేడు వైద్యం బంద్
సాక్షి, లబ్బీపేట(విజయవాడ) : వైద్యుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా, కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ పార్లమెంటులో నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును ఆమోదించడానికి నిరసనగా నేడు వైద్యం బంద్ చేయనున్నారు. అందులో భాగంగా బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకూ ఓపీ సేవలతో పాటు, ఎమర్జెన్సీ కూడా బంద్ పాటించాలని ఐఎంఏ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఏపీ చాప్టర్ నిర్ణయించినట్లు విజయవాడ శాఖ కార్యదర్శి డాక్టర్ సీహెచ్ మనోజ్కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. అయితే మానవతా దృక్ఫథంలో ప్రాణాపాయంతో ఆస్పత్రికి వచ్చిన వారికి వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో దశాబ్దాలుగా ఉన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ)ను రద్దు చేసి, నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటును ఐఎంఏ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. వైద్యులు ఆందోళన చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిరంకుశత్వంగా బిల్లును పార్లమెంటులో ఆమోదించడంపై వైద్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా బంద్ పాటించాలని నిర్ణయించారు. నగరంలోని అన్ని కారొపరేట్ ఆస్పత్రిలు, నర్సింగ్ హోమ్స్, క్లినిక్లలో అవుట్ పేషేంట్ సేవలతో పాటు, అన్ని రకాల సేవలు నిలిపివేయనున్నట్లు డాక్టర్ మనోజ్కుమార్ తెలిపారు. అయితే రోడ్డుప్రమాదాలు, గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వాటితో ప్రాణాపాయంతో వచ్చిన వారికి మాత్రం సేవలు అందిస్తామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వాస్పత్రిలో కొనసాగనున్న సేవలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బంద్కు పిలుపునిచ్చినప్పటికీ ప్రభుత్వాస్పత్రిలో సేవలు యథాతదంగా అందించనున్నారు. అవుట్పేషెంట్ సేవలతో పాటు అన్ని రకాల సేవలు అందిస్తారు. కాగా జూనియర్ వైద్యులు మాత్రం బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. -
ఎన్ఎంసీ బిల్లుకు లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత వైద్య మండలి(ఎంసీఐ) స్థానంలో జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)ను ఏర్పాటు చేసే బిల్లుకు లోక్సభ సోమవారం ఆమోదం తెలిపింది. దీనివల్ల వైద్య విద్యారంగంలో పారదర్శకత ఏర్పడుతుందనీ, అనవసరమైన తనిఖీల ప్రహసనం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో ఏకీకృత విధానాలను తీసుకురానున్నారు. ఇందులోభాగంగా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షను పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పరీక్షగా పరిగణిస్తారు. అలాగే విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి భారత్లో పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థుల కోసం ఓ స్క్రీనింగ్ టెస్ట్ను నిర్వహించనున్నారు. ఈ స్క్రీనింగ్ పరీక్షకు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్(నెక్టŠస్)గా నామకరణం చేశారు. ఎన్ఎంసీ చట్టం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాల్లో 50 శాతం సీట్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకు అందుతాయని ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన మూడేళ్ల లో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ను నిర్వహిస్తామన్నారు. పోంజి బిల్లుకు ఆమోదం: చిట్ఫండ్ పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టే ‘అనియంత్రిత డిపాజిట్ స్కీంల నిషేధ’ బిల్లును సోమవారం పార్లమెంట్ ఆమోదించింది. పేద డిపాజిటర్ల సొమ్ముకు రక్షణ కల్పించడం, వసూలు చేసిన డబ్బును తిరిగిచ్చేలా చూడటం ఈ బిల్లు ఉద్దేశం. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే చట్ట విరుద్ధంగా వసూళ్లకు పాల్పడిన వారికి జరిమానా, జైలుశిక్ష పడనున్నాయి. ఈ విషయమై ఆర్థికమంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ..‘ ‘చట్టంలోని లొసుగుల ఆధారంగా కొందరు వ్యక్తులు నిరుపేదలకు భారీవడ్డీ ఆశచూపి నగదును వసూలుచేస్తున్నారు. తాజా బిల్లులో పోంజి పథకంతో పాటు స్నేహితులు, పరిచయస్తులు, బంధువుల నుంచి వసూలు చేసే రియల్ఎస్టేల్ సంస్థలపైనా చర్యలు తీసుకునేలా నిబంధనలు చేర్చాం. సంబంధిత వ్యక్తులకు ఏడా ది నుంచి పదేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.2 లక్షల నుంచి రూ.50 కోట్ల వరకు జరిమానా విధించవచ్చు. పోంజి స్కీమ్లకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 978 కేసులు నమోదు కాగా, వీటిలో 326 కేసులో పశ్చిమబెంగాల్లోనే నమోదయ్యాయి’ అని తెలిపారు. ఈ బిల్లును లోక్సభ జూలై 24న ఆమోదించింది. ‘ఉన్నావ్’ ప్రమాదంపై సభలో రగడ.. ఉన్నావ్ రేప్ బాధితురాలి కారును ఓ లారీ అనుమానాస్పద రీతిలో ఢీకొట్టడంపై ప్రతిపక్షాల ఆందోళనలతో రాజ్యసభ దద్దరిల్లింది. ఎస్పీ నేత రామ్గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బాధితురాలిని చంపే ప్రయత్నం జరిగింద ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులు యాదవ్కు మద్దతుగా నినాదాలు చేయడంతో రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదాపడింది. -
జూలై 18 నుంచి పార్లమెంటు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలను జూలై 18 నుంచి ఆగస్టు 10 వరకూ నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్కుమార్ తెలిపారు. సోమవారం జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అనంతరం అనంత్కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో దాదాపు 18 పనిదినాలు ఉండనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లు, ఓబీసీ జాతీయ కమిషన్కు రాజ్యంగబద్ధత బిల్లు, జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటు బిల్లు, ట్రాన్స్జెండర్స్ బిల్లుతో పాటు 6 ఆర్డినెన్సుల్ని ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ పదవీకాలం జూన్తో ముగియనున్న నేపథ్యంలో కొత్త డిప్యూటీ చైర్మన్ను ఎన్నుకునేందుకు ఈ సమావేశాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్లమెంటు వర్షకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్షాలకు అనంత్ విజ్ఞప్తి చేశారు. -
వీరూ మందులు రాయొచ్చు
సాక్షి, అమరావతి: ఇప్పటివరకు రోగికి వైద్యులు మాత్రమే మందులు రాసేవారు. కానీ, ఇక నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన ఫార్మసిస్ట్లు, ఫిజీషియన్ అసిస్టెంట్లు, ఆప్టోమెట్రిస్ట్లు, ఆఫ్తాల్మజీ అసిస్టెంట్లకు కూడా ఈ అవకాశం దక్కనుంది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఈ మేరకు బిల్లును రూపొందించింది. ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం కూడా పొందింది. త్వరలో వీరికి లైసెన్సులు జారీ చేయనున్నారు. తర్వాత వీరంతా లైసెన్స్డ్ నాన్ మెడికల్ ప్రాక్టీషనర్లగా నిర్దేశిత వైద్య సేవలు అందిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను వీరి ద్వారా అధిగమించవచ్చని ఎన్ఎంసీ భావిస్తోంది. ఈ నిర్ణయంపై వైద్య సంఘాలు మండిపడుతుండగా, ఫార్మసీ సంఘాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. త్వరలో లైసెన్సులు ఎన్ఎంసీ.. నాన్ మెడికల్ ప్రాక్టీషనర్లకు త్వరలో లైసెన్సులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. అయితే వీరికి కొన్ని మందులు రాయడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. అది కూడా ప్రాథమిక వైద్యం, ప్రివెంటివ్ మెడిసిన్లో భాగంగానే. నాన్ మెడికల్ ప్రాక్టీషనర్స్కు ఇచ్చే లైసెన్సులను ఎన్ఎంసీ పరిధిలోని నైతిక విలువల కమిటీ పర్యవేక్షిస్తుంది. కాగా.. ఐసీయూ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులకు కూడా మందులు రాసే అవకాశం ఉంటుంది. ఏ పరిస్థితుల్లో మందులు రాస్తారు? ప్రధానంగా ఓటీసీ (ఓవర్ ద కౌంటర్) డ్రగ్స్ విషయంలో ఈ మందులు రాస్తారు. అంటే.. వైద్యుడు లేని సమయంలో నేరుగా మందుల షాపునకు వెళ్లి తెచ్చుకునేవారికి వీళ్లు మందులు ఇవ్వవచ్చు. అది కూడా ప్రాథమిక స్థాయిలో కొన్ని మందులకు మాత్రమే. ఉదాహరణకు పల్లెటూరిలో ఓ వ్యక్తి జ్వరం, మలేరియా, టైఫాయిడ్ వంటి వాటికి గురైనప్పుడు అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ లేనప్పుడు ఇలాంటి నాన్ మెడికల్ ప్రాక్టీషనర్లు మందులు ఇస్తారు. వీరు ఇష్టారాజ్యంగా మందులు రాయకుండా ఎన్ఎంసీ వారిని పర్యవేక్షిస్తుంది. శిక్షణ ఇచ్చిన తర్వాత మాత్రమే లైసెన్సులు ఇస్తారు. అత్యవసరం కాని కేసుల్లో మాత్రమే వీళ్లు మందులు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునేందుకు ఎథిక్స్ కమిటీ ఉంటుంది. దుర్వినియోగమయ్యే అవకాశాలు కూడా.. నాన్ మెడికల్ ప్రాక్టీషనర్లకు అనుమతులివ్వడం దుర్వినియోగమవ్వొచ్చని వైద్య వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఆర్ఎంపీలు, ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్స్ (పీఎంపీలు) ఇష్టారాజ్యంగా యాంటీబయోటిక్స్ రాస్తున్నారని, నాన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కూడా ఇలాగే మందులు రాస్తే చర్యలు తీసుకునే యంత్రాంగం ఉందా? అని ప్రశ్నిస్తున్నాయి. వేలాది మంది రోగులు అవసరం లేని, మోతాదుకు మించిన మందులు వాడుతూ కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారు. దీనిపై ఇప్పటివరకూ చర్యలు లేవని, ఇకపై తీసుకుంటారన్న నమ్మకం లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కాగా.. అమెరికా, ఫ్రాన్స్, కెనడా, బ్రిటన్ వంటి దేశాల్లో డాక్టర్కు మినహా మరెవరికీ మందులు రాసే అవకాశం లేదు. డాక్టర్ రాసే మందుల ప్రభావం, మోతాదులను పరిశీలించి వాటిని ఆపడం/కొనసాగించే హక్కు మాత్రం రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్కు ఉంది. అంతేకాకుండా ఓవర్ ద కౌంటర్లో భాగంగా సాధారణ జబ్బులకు 70 నుంచి 80 రకాల మందులు ఫార్మసిస్ట్ ఇవ్వచ్చు. రాష్ట్రంలో వేధిస్తున్న డాక్టర్ల కొరత రాష్ట్రంలో డాక్టర్ల కొరత వేధిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి వేయి మందికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉండాలి. కానీ మన రాష్ట్రంలో ప్రతి 1700 మందికి కూడా ఒక డాక్టర్ లేరు. స్పెషలిస్టు డాక్టర్ల సేవలు పట్టణాలకే అది కూడా 30 శాతం మందికి మాత్రమే పరిమితం. గ్రామీణులు స్పెషలిస్ట్ డాక్టర్ సేవలు పొందాలంటే కనీసం 40 కి.మీ రావాల్సిందే. ఇప్పటికీ గ్రామీణులు ఆర్ఎంపీ, పీఎంపీలపైనే ఆధారపడి వైద్యం పొందుతున్నారు. ఇప్పటికే రోగులు ఇబ్బంది పడుతున్నారు రోగులకు ఇష్టారాజ్యంగా మందులు రాయడంతో తీవ్ర దుష్ఫరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అవసరం లేకపోయినా బాగా బలమైన మందులు ఇవ్వడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతోంది. శరీరానికి ఎంత మోతాదులో మందులు ఇవ్వాలో డాక్టర్లకే తెలుసు. ఇలా ఎవరు పడితే వాళ్లు మందులిస్తే రోగులు తీవ్రంగా నష్టపోతారు. –డా.జయశంకర్, అధ్యక్షుడు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఏపీ) ఆర్ఎంపీల కంటే వాళ్లే నయం అనుభవం, అర్హత లేని ఆర్ఎంపీలు, పీఎంపీలు మందులు రాయడం కంటే అనుభవం ఉన్నవారు రావడాన్ని స్వాగతించొచ్చు. కానీ ఎంసీఐ, ఎన్ఎంసీ వంటి సంస్థలు మార్గదర్శకాలు జారీ చేయగలవే కానీ చట్టాలు చేయలేవు. నాన్ మెడికల్ ప్రాక్టీషనర్కు మందులు రాసే అధికారం ఇచ్చినా ఆర్ఎంపీల మాదిరి నియంత్రణను గాలికొదిలేయకూడదు. –విజయ్ ఆర్ అన్నపరెడ్డి, ఫార్మసీ కౌన్సిల్ మాజీ అధ్యక్షులు గ్రామీణ ప్రాంతాలకు మేలు జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్ల కొరత ఎక్కువగా ఉంది. అక్కడ లైసెన్స్డ్ నాన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉపయోగం చాలా ఉంటుంది. మందులపై వీరికి కనీస పరిజ్ఞానం ఉంటుంది. డాక్టర్లు లేని చోట పేద రోగులు వెంటనే ఉపశమనం పొందే అవకాశాలు ఉంటాయి. –ఎన్.హేమంతర్ కుమార్, ఉపాధ్యక్షులు, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (ఫార్మడి) -
ఎయిమ్స్లో.. ‘శంకర్దాదా ఎంబీబీఎస్’
సాక్షి, న్యూఢిల్లీ : అద్నన్ ఖుర్రమ్ 19 ఏళ్ల యువకుడు. ఎంతటివారినైనా బురిడీ కొట్టించగల ఘనుడు. తన ప్రతిభతో డాక్టర్ సీటు సంపాదించలేకపోయాడు గానీ ప్రొఫెసర్ల కళ్లుగప్పి ఐదు నెలలపాటు ఎయిమ్స్ జూనియర్ డాక్టర్గా నటిస్తూ లబ్ది పొందాలని చూశాడు. చివరికి మోసం బయటపడటంతో కటకటాల పాలయ్యాడు. బీహార్ టూ ఢిల్లీ.. బీహార్కు చెందిన అద్నన్ ఖుర్రమ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ప్రొఫెసర్లతో పరిచయం పెంచుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎమ్సీ) బిల్లుకు వ్యతిరేకంగా రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్(ఆర్డీఏ) ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్లో ఖుర్రమ్ తనను తాను జూనియర్ రెసిడెంట్ డాక్టర్గా వారికి పరిచయం చేసుకున్నాడు. మోసం బయటపడిందిలా.. ఆర్డీఏ చేపట్టే ప్రతీ నిరసన కార్యక్రమాల్లో, మారథాన్లలో ఖుర్రం చురుగ్గా పాల్గొనేవాడు. అయితే ఆ కారణంగానే అతని మోసం బయటపడింది. మామూలుగా జూనియర్ రెసిడెంట్ డాక్టర్లకు 18 నుంచి 20 గంటల డ్యూటీ ఉంటుంది. డ్యూటీ చేయకుండా ఖుర్రం ఎప్పుడూ బయటే కనిపించేవాడని, దాంతో అతనిపై అనుమానం కలిగిందని డాక్టర్ హర్జీత్ సింగ్ భట్టి తెలిపారు. వెంటనే విద్యార్థుల ప్రవేశ పట్టికతో పాటు స్టైఫండ్ పొందే విద్యార్థుల జాబితా పరిశీలించగా ఖుర్రమ్ పేరు ఎక్కడా కనిపించలేదని ఆయన పేర్కొన్నారు. ఎయిమ్స్లో సుమారు 2 వేల మంది రెసిడెంట్ డాక్టర్లు ఉంటారని.. అందుకే ఖుర్రం మోసాన్ని కనుక్కోలేకపోయామని తెలిపారు. అంతేకాకుండా నిరసనకు మద్దతు తెలిపేందుకు వచ్చే వీఐపీలతో ఫొటోలు దిగడానికి మాత్రమే ఆసక్తి చూపేవాడని పేర్కొన్నారు. అలా రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ వంటి ప్రముఖ వ్యక్తులతో ఫొటోలు దిగి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని.. జూనియర్ డాక్టర్లుగా చెప్పుకుంటూ తమ కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు పొందారన్నారు. ఖుర్రంను అరెస్టు చేసిన పోలీసులు సెక్షన్ 419(మోసం), సెక్షన్ 468(ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం)ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
లొసుగుల మయం
ఇటు వైద్య విద్యనూ, అటు వైద్యరంగాన్ని ప్రక్షాళన చేసి నిఖార్సయిన వ్యవస్థల రూపకల్పన కోసం ప్రామాణికమైన విధివిధానాలను రూపొందించామంటూ తీసు కొచ్చిన జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) బిల్లు చివరకు సెలెక్ట్ కమిటీ పరిశీలనకు వెళ్లింది. ఈ బిల్లుపై లోక్సభలో చర్చ ప్రారంభమైన సోమవారం రోజున దేశ వ్యాప్తంగా వైద్యులు 12 గంటల సమ్మెకు దిగారు. అటు సభలో సైతం అన్ని పక్షాల సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫలితంగా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంప డానికి కేంద్రం అంగీకరించింది. దేశంలో ప్రపంచశ్రేణి వైద్య విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేస్తూ నీతిఆయోగ్ ఈ బిల్లు రూపకల్పనకు పూను కొంది. అయితే వైద్య రంగ నిపుణులు ఈ బిల్లు ముసాయిదా ఏడాదిక్రితం బయటి కొచ్చినప్పుడే పెదవి విరిచారు. వైద్య విద్య నియంత్రణ కోసం నెలకొల్పిన భార తీయ వైద్య మండలి(ఎంసీఐ)వల్ల ఆ రంగానికి ఎంత నష్టం జరిగిందో అందరికీ తెలుసు. వైద్య కళాశాలల గుర్తింపు మొదలుకొని అదనపు సీట్లు, అదనపు కోర్సుల మంజూరు వరకూ అన్ని విషయాల్లోనూ ముడుపులు చేతులు మారతాయన్న అప ఖ్యాతిని ఆ సంస్థ మూటగట్టుకుంది. 2010లో ఆ సంస్థ అధ్యక్షుడిగా ఉన్న కేతన్ దేశాయ్ లంచం తీసుకుంటూ దొరికిన తర్వాత ఆయన చేసిన అక్రమాల చిట్టా బయటపడింది. అర్హత లేని సంస్థలకు అనుమతులు మంజూరయ్యాయని, ప్రమా ణాలు ఎంత తీసికట్టుగా ఉన్నా చూసీచూడనట్లు వదిలేశారని, ...వీటన్నిటికీ మూలం ముడుపుల్లో ఉన్నదని తేలింది. ఆ తర్వాత వచ్చినవారి వల్ల సైతం ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. కనీసం తన జోక్యంతోనైనా పరిస్థితి చక్క బడవచ్చునని భావించి సర్వోన్నత న్యాయస్థానం రిటైరైన న్యాయమూర్తి ఆధ్వ ర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రూపొందించిన విధానాలు సైతం బేఖాతరయ్యాయి. ప్రక్షాళన చేయడానికి అసాధ్యమయ్యేంతగా ఎంసీఐ నాశ నమైందని అందరికీ అనిపిస్తున్న తరుణంలో మెరుగైన ప్రత్యామ్నాయాన్ని రూపొం దించాలని కేంద్ర ప్రభుత్వం నీతిఆయోగ్ను కోరింది. అయితే ఎన్ఎంసీ బిల్లు ఉన్న పరిస్థితిని బాగు చేయడం మాట అటుంచి, దాన్ని మరింత భ్రష్టు పట్టించే ప్రమాదం ఉందని అందులోని అంశాలు గమనిస్తే అర్ధమ వుతుంది. ఎంసీఐకి ఆ దుస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణం దాని పని విధానంలో పారదర్శకత లోపించడం. దాని స్థానంలో వచ్చే ఎన్ఎంసీ మెరుగ్గా ఉండాలంటే సహజంగానే పారదర్శకతకు ప్రాధాన్యతనీయాలి. కానీ బిల్లులో అందుకు సంబం ధించిన సూచనలేమీ లేవు. పైగా ఎన్ఎంసీలో ఉండే 25మంది సభ్యులను ప్రభు త్వమే నియమిస్తుంది. వైద్య రంగంలాంటి కీలకమైన రంగాన్ని సరిచేయడానికి ఎలాంటి చర్యల అవసరం ఉన్నదో ప్రభుత్వం సూచించడంలో తప్పులేదు. కానీ అంతిమంగా దాన్ని మెరుగుపరిచే బాధ్యతను ఆ రంగంలోని నిపుణులకే వదలాలి. అప్పుడే దానికి ప్రజల్లో విశ్వనీయత ఏర్పడుతుంది. పనితీరులో లోటుపాట్లున్నా, దేన్నయినా చూసీచూడనట్టు వదిలేస్తున్న దాఖలాలు కనిపించినా సంస్థను జనం నిలదీస్తారు. సభ్యుల నియామకంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే రాజకీయ పలు కుబడి ఉన్నవారికే తప్ప అన్యులకు అందులో చోటుండదు. సర్కారు ప్రమేయం ఉన్నది గనుక పరిస్థితి ఇలాగే ఉంటుందన్న నిర్లిప్తత ఏర్పడుతుంది. వైద్య రంగంలోని సంప్రదాయ, ఆధునిక వ్యవస్థల అనుసంధానం కోస మంటూ బిల్లులో పెట్టిన ప్రతిపాదనలు మరింత విడ్డూరంగా ఉన్నాయి. భిన్న వైద్య విధానాలను ఉపయోగిస్తే సత్వర ఫలితముంటుందని, రోగం నుంచి త్వరగా కోలుకోవడం వీలవుతుందని వాదించేవారున్నారు. కానీ అది ఎంతవరకూ ఆచరణ సాధ్యం? ఒక జబ్బును అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి, యునాని వంటి వైద్య విధానాలు చూసే తీరు ఒకేలా ఉండదు. రోగికి స్వస్థత చేకూర్చడానికి అను సరించే ప్రక్రియలు కూడా ఈ వైద్య విధానాల్లో భిన్నంగా ఉంటాయి. ఒక బ్రిడ్జి కోర్సు ద్వారా ఆయుర్వేదం, హోమియో, యునాని వైద్యులకు ఆధునిక వైద్య విధా నంలో అవగాహన కల్పించి వారు కూడా మందుచీటీల్లో అల్లోపతి ఔషధాలు రాసేందుకు అనుమతించాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ విషయంలో సంప్ర దాయ వైద్య రంగ నిపుణులకు విధించే పరిమితులేమిటో, ఎలాంటి రోగాలకు సంబంధించినంతవరకూ వారు మందుచీటీలు రాయవచ్చునో బిల్లు స్పష్టంగా చెప్పలేదు. అందుకు సంబంధించిన విధివిధానాలను ఎన్ఎంసీ రూపొందిస్తుంది. దాని సంగతలా ఉంచి కేవలం ఆర్నెల్లో, ఏడాదో శ్రమపడి ఒక బ్రిడ్జి కోర్సు ద్వారా అవగాహన తెచ్చుకుంటే ఆధునిక వైద్య విధానాలను కూడా అనుసరించవచ్చునని లైసెన్స్ ఇస్తే అది దేనికి దారితీస్తుందో ప్రభుత్వం ఆలోచించినట్టు లేదు. నిర్దేశించిన పరిమితులకు ఎందరు కట్టుబడతారు? వాటిని ఉల్లంఘిస్తే, ఏదైనా ముప్పు ఏర్ప డితే బాధ్యులెవరు? ఒకపక్క ఎంబీబీఎస్ పూర్తయి వైద్య రంగంలోకొస్తున్నవారిలో తగినన్ని ప్రమాణాలుండటం లేదని భావించి అందుకోసం పట్టా ఇచ్చే ముందు వారికి మరో పరీక్ష పెట్టాలని ఆలోచిస్తూ... వేరే వైద్య విధానాల్లో చదివినవారిని నామమాత్రపు బ్రిడ్జి కోర్సుతో అనుమతించడం సరైందేనా? మన పల్లె సీమల్లో ఈనాటికీ కనీస వైద్య సదుపాయాలు లేవన్నది వాస్తవం. దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే తప్ప చెప్పుకోదగ్గ ఆసుపత్రులు అందుబాటులో ఉండవు. చిన్న చిన్న వ్యాధులను నయం చేయడానికి సైతం ఎవరూ లేక నాటు వైద్యులను, చిట్కా వైద్యులను ఆశ్రయించి జనం దెబ్బతింటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రతి వెయ్యిమందికీ ఒక డాక్టర్ ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశిస్తోంది. కానీ మన దేశంలో 1,674మందికి ఒక డాక్టరున్నారు. మారుమూల ప్రాంతాల్లో చాలా చోట్ల వైద్యులే లేరు. ఈ స్థితిని చక్కదిద్దడం అవసరమని అందరూ అంగీకరిస్తారు. కానీ అందుకు ఎన్ఎంసీ బిల్లు సూచిస్తున్న విధానం పరిష్కారమో... ప్రమాదక రమో ఆలోచించాలి. వైద్య రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే ఈ బిల్లును సంపూర్ణంగా మార్చాలి. -
స్టాండింగ్ కమిటీకి మెడికల్ బిల్లు
న్యూఢిల్లీ: దేశంలోని వైద్య విద్య ప్రక్షాళనతో పాటు భారతీయ వైద్య మండలి(ఎంసీఐ)ని మార్చేందుకు ఉద్దేశించిన వివాదాస్పద నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపారు. బడ్జెట్ సమావేశాలకు ముందు నివేదిక సమర్పించాలని కమిటీని లోక్సభ కోరింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనకు దిగడంతో పాటు, మంగళవారం సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలిపాయి. ఈ నేపథ్యంలో బిల్లుపై లోక్సభలో మంగళవారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్కుమార్ ప్రకటన చేస్తూ.. ప్రతిపక్షంతో పాటు అధికార ఎన్డీఏ కూడా బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని కోరిందని అందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. బడ్జెట్ సమావేశాలకు ముందే నివేదికను సమర్పించాలని కమిటీని కోరాలని స్పీకర్ మహాజన్ను మంత్రి కోరారు. తర్వాత స్పీకర్ లోక్సభలో ప్రకటన చేస్తూ.. బడ్జెట్ సమావేశాలకు ముందు లోక్సభకు నివేదిక సమర్పించాలని స్టాండింగ్ కమిటీని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, స్టాండింగ్ కమిటీ నివేదిక నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు వైద్య వృత్తికి ఉపయోగకరమని కేంద్రం ప్రకటించింది. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఐఎంఏ ఈ బిల్లును ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అధికారులకు, వైద్య విద్యతో సంబంధంలేని యంత్రాంగానికి తమను జవాబుదారీగా ఉంచడమంటే వైద్య వృత్తిని నిర్వీర్యం చేయడమేనని వారు ఆరోపిస్తున్నారు. మంగళవారాన్ని బ్లాక్ డేగా ప్రకటిస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో దేశ వ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో ఉదయం నుంచి వైద్య సేవలు నిలిచిపోయాయి. సమ్మె నుంచి అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చారు. అయితే లోక్సభలో బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపడంతో ఐఎంఏ సమ్మెను విరమించుకుంది. రాజ్యసభ ‘ప్రశ్నల’ రికార్డు ప్రశ్నోత్తరాల సమయంలో జాబితాలోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా రాజ్యసభ మంగళవారం రికార్డు సృష్టించింది. ప్రశ్నలడిగిన 20 మంది సభ్యుల్లో మంగళవారం 10 మంది గైర్హాజరు కావడంతో ఇది సాధ్యమైంది. ఆ తర్వాత మిగతా సభ్యులు అప్పటికప్పుడు ప్రశ్నలడిగేందుకు సభాధ్యక్షుడు వెంకయ్య అనుమతించారు. జీరో అవర్లో గరిష్టంగా18 మంది పలు ప్రజాప్రాముఖ్యం ఉన్న అంశాలపై మాట్లాడారు. ‘దివాలా’ బిల్లుకు ఓకే దివాలా చట్టం సవరణ బిల్లుపార్లమెంట్లో ఆమోదం పొందింది. ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(సవరణ) ఆర్డినెన్స్ పేరిట తెచ్చిన ఈ బిల్లు మంగళవారం రాజ్యసభలో గట్టెక్కింది.అవసరాలకు తగినట్లు బిల్లులో మార్పులు చేస్తామని జైట్లీ సభకు హామీ ఇచ్చారు. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపరచి రాజకీయాలకు అతీతంగా ఉంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎవరి రుణాలనూ రద్దుచేయలేదన్నారు. అన్ని వస్తువులకు ఒకే జీఎస్టీ రేటు వర్తింపజేయడం సాధ్యం కాదన్నారు. మొత్తం జనాభా దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న దేశాల్లోనే ఏకరేటు పన్ను విధానం అమల్లో ఉందని, భారత్లో అది సాధ్యం కాదనిచెప్పారు. యూరియా వాడకాన్ని తగ్గించడానికి ఒక సంచి పరిమాణాన్ని 45 కిలోలకు తగ్గించినట్లు ఎరువుల శాఖ సహాయ మంత్రి లోక్సభలో చెప్పారు. -
నేడు ఆస్పత్రుల్లో ఓపీ సేవలకు ఆటంకం
న్యూఢిల్లీ: జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) బిల్లుకు వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) 12 గంటల పాటు రోజువారీ విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. ఆందోళనలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఆస్పత్రుల్లో ఔట్పేషంట్ సేవల్ని నిలిపివేయనున్నారు. అత్యవసర వైద్యసేవలు కొనసాగుతాయి. ఐఎంఏ పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో నేడు ఔట్పేషంట్ సేవలు నిలిచిపోనున్నాయి. ఐఎంఏ స్థానంలో జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటుకు కేంద్రం పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. హోమియో, ఆయుర్వేద కోర్సులు చేసిన డాక్టర్లను ఓ బ్రిడ్జి కోర్సు చేశాక ఆధునిక వైద్యం చేపట్టేందుకు అనుమతించాలన్న నిబంధన చేర్చారు. బిల్లు కారణంగా వైద్యరంగంతో సంబంధం లేనివారికి వైద్యులు జవాబుదారీగా ఉండాల్సి వస్తోందని ఐఎంఏ ఆరోపించింది. -
లోక్సభకు మెడికల్ కమిషన్ బిల్లు
న్యూఢిల్లీ: కీలకమైన నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బిల్లును ప్రభుత్వం శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. వైద్య విద్యలో మరింత పారదర్శకత కోసం ఉద్దేశించిన ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే ప్రస్తుతం ఉన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ వస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. వైద్య విద్య విభాగంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ పలు ఫిర్యాదులు వస్తుండటంతో ఈ మేరకు సంస్కరణలను చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ బిల్లుపై మరింత అధ్యయనం చేసేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపించాలంటూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే, స్పీకర్ సుమిత్రా మహాజన్ వారి డిమాండ్ను తిరస్కరిస్తూ.. సభ్యులు సభా నియమాలను తెలుసుకోవాలన్నారు. సహకార బ్యాంకులకు పన్ను మినహాయింపు లేదు వాణిజ్య బ్యాంకుల మాదిరిగా పనిచేస్తున్న సహకార బ్యాంకులకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వటం లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. పరస్పర సహకార భావనను వదిలి లాభాలే లక్ష్యంగా అవి పనిచేస్తున్నందునే పన్ను మినహాయింపు ఇవ్వటం లేదన్నారు. దాదాపు 98 ప్రైవేట్ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో... శుక్రవారం రాజ్యసభ కార్యకలాపాలు ప్రశాంతంగా జరిగాయి. నేతాజీ జయంతిని దేశ్ప్రేమ్ దివస్(దేశభక్తి దినం)గా ప్రకటించాలని సీపీఎం బహిష్కృత నేత రితబ్రత బెనర్జీ జీరో అవర్లో కోరారు. ‘బెగ్’ అనే మాటను వాడవద్దని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు మరోసారి సభ్యులు, మంత్రులకు సూచించారు. బ్రిటిష్ కాలం నాటి భావజాలాన్ని విడనాడాలని సూచించారు. పార్లమెంట్కు వరుస సెలవులు శని, ఆదివారాలతోపాటు నూతన సంవత్సరాది సందర్భంగా సోమవారం జనవరి ఒకటో తేదీన సెలవు ప్రకటిస్తూ పార్లమెంట్ ఉభయసభలు నిర్ణయించాయి. జనవరి రెండో తేదీన తిరిగి సమావేశం అవుతాయి. ఈశాన్య రాష్ట్రాల సభ్యుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హోమియోపై మరో కమిషన్.. నేషనల్ మెడికల్ కమిషన్ మాదిరిగానే భారత జాతీయ వైద్యవిధానాలు, హోమియోపతి కమిషన్ ఏర్పాటుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్లు తాజాగా ప్రతిపాదించాయి. బిల్లులోని ముఖ్యాంశాలు... ► నేషనల్ మెడికల్ కమిషన్కు ఛైర్మన్తోపాటు సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ► ఈ బిల్లు ద్వారా గ్రాడ్యుయేషన్ వైద్య విద్యకు ఒక బోర్డు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యవిద్యకు మరో బోర్డు, వైద్య విద్యా సంస్థల గుర్తింపు, సమీక్షకు ఒక బోర్డు, వైద్యుల రిజిస్ట్రేషన్ బోర్డు ఏర్పాటవుతాయి. ► వైద్య కళాశాలలు పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రారంభించుకునేందుకు, సీట్లను పెంచుకునేందుకు ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఇకపై ఉండదు. ► వైద్య విద్యలో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ► పీజీ చేసిన వారు ప్రాక్టీస్ చేసుకోవాలంటే ప్రత్యేక పరీక్ష రాయాల్సి ఉంటుంది. -
16న వైద్య సేవలు బంద్
దేశ వ్యాప్తంగా ఐఎంఏ సత్యాగ్రహం విజయవాడ (లబ్బీపేట): నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటు ప్రతిపాదనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో ఈ నెల 16న దేశ వ్యాప్తంగా సత్యాగ్రహాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి గంగాధరరావు చెప్పారు. ఆ రోజు ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను నిలిపేస్తామన్నారు. గవర్నర్పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతోపాటు ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ జి.సమరం, డాక్టర్ అప్పారావు, డాక్టర్ సీఎస్ఆర్ ప్రసాదరావు పాల్గొన్నారు.