
శశి వర్గం కొత్త సీఎం అభ్యర్థి ఇతనే
ముఖ్యమంత్రి బాధ్యతలకు రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం.. శశికళకు ఎదురుతిరిగిన విషయం ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, తాను ముఖ్యమంత్రి అయ్యి తీరుతానని శశికళ ప్రకటించడంవంటి పరిణామాలు తెలిసిందే. ఈలోగా సుప్రీంకోర్టు తీర్పు శశికళ సీఎం ఆశలపై పిడుగులా పడిన నేపథ్యంలో శశివర్గానికి వేరే ముఖ్యమంత్రి అభ్యర్థిని తీసుకోవాల్సిరాడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది.
అయితే, వాస్తవానికి తొలుత శశివర్గం నుంచి ముఖ్యమంత్రి రేసులో కే పళని స్వామి, తంబిదురై, సెంగొట్టయన్ తాజాగా జయలలిత మేనళ్లుడు దీపక్ జయకుమార్ పేర్లు కూడా వినిపించాయి. అయితే, తమిళనాడు రహదారులు, ఓడరేవుల బాధ్యతలు నిర్వహిస్తున్న పళని స్వామికి జయలలిత వద్ద మంచి పేరున్నట్లు తెలుస్తోంది. పన్నీర్ తర్వాత అంతటి స్థాయి సౌమ్యుడు కూడా పళని స్వామి అని శశివర్గం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయననే సీఎం అభ్యర్థిగా తెరమీదికి తీసుకొచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.