
కశ్మీర్లో మళ్లీ ఉద్రిక్తత
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. షోపియాన్లో ఆందోళనకారులు ప్రభుత్వ భవనానికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. ఆందోళనకారులు భద్రతాబలగాల పైకి రాళ్లు విసరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుర్హాన్ వాని ఎన్కౌంటర్ నేపథ్యంలో చెలరేగిన అల్లర్లు 58 వ రోజుకు చేరుకోగా సుమారు 70 మంది మృతి చెందారు.
కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష బృందం ఇవాళ కశ్మీర్ చేరుకున్న నేపథ్యంలో ఈ ఘర్షణలు చెలరేగడం గమనార్హం. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, గవర్నర్తో అఖిలపక్షం నేడు భేటీ కానుంది. అలాగే అక్కడి రాజకీయ పార్టీలతోనూ అఖిలపక్షం సమావేశం కానుంది. కాగా జమ్మూకశ్మీర్లో జమ్మును ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలనే కొత్త డిమాండ్ వినిపిస్తోంది.