
సీఆర్పీఎఫ్ కోసం అక్తర్ గీతం
28న రాష్ట్రపతి ఆవిష్కరణ
న్యూఢిల్లీ: దాదాపు 3 లక్షల మంది సిబ్బందితో దేశ భద్రతలో ప్రధాన భూమిక పోషిస్తున్న కేంద్ర పారామిలిటరీ బలగాల(సీఆర్పీఎఫ్) సేవలను కొనియాడుతూ ప్రఖ్యాత బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ ఓ గీతాన్ని రాశారు. ‘హం హే దేశ్కే రక్షక్..’ అంటూ సాగే ఈ గీతాన్ని సీఆర్పీఎఫ్ 75వ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించనున్నట్టు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
సీఆర్పీఎఫ్కు ఇప్పటికే ఓ గీతం ఉన్నప్పటికీ తాజా సేవలు, పరిణామాల నేపథ్యంలో సీఆర్పీఎఫ్ డెరైక్టర్ జనరల్ దిలీప్ త్రివేదీ ఈ గీతాన్ని రాయించారని వివరించారు. నక్సల్స్ వ్యతిరేక పోరులో విజయం సాధించిన బలగాలకు ఆవిర్భావ దినోత్సవంలో శౌర్య పతకాలను అందించనున్నట్టు తెలిపారు.