
నాగ్పూర్: గుండె ధమనుల పనితీరు దెబ్బతినడంతోనే జస్టిస్ బ్రిజ్గోపాల్ హర్కిషన్ లోయా మృతి చెందారని పోస్ట్మార్టం నివేదికను ఉటంకిస్తూ ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. నాగ్పూర్ ప్రభుత్వ వైద్యకళాశాల, ఆస్పత్రి అందించిన ఈ నివేదికతోనే సీఆర్పీసీ సెక్షన్ 174 కింద ఈ కేసు విచారణ ముగిసిందన్నారు. వైద్యుల హిస్టోపాథాలజీ నివేదికలో లోయా భౌతికకాయంలో విషపూరితమైన పదార్థాలేవీ లేవని తేలిందన్నారు.
2014లో డిసెంబర్ 1న నాగ్పూర్లో ఓ వేడుకకు హాజరైన లోయా అకస్మాత్తుగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ చీఫ్ అమిత్ షా నిందితుడిగా ఉన్న సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసును జస్టిస్ లోయా విచారిస్తున్న సంగతి తెలిసిందే. సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాకు, మిగతా నలుగురు సుప్రీం న్యాయమూర్తులకు మధ్య నెలకొన్న తాజా సంక్షోభానికి జస్టిస్ లోయా మృతి కేసు విచారణ కూడా కారణం కావడం గమనార్హం.