న్యూఢిల్లీ: ఆదాయాన్ని పెంచుకునే ఆలోచనల్లో భాగంగా రైల్వే స్టేషన్లలో తయారయ్యే చెత్తను అమ్మకానికి పెట్టాలని రైల్వే శాఖ యోచిస్తోంది. రైల్వే స్టేషన్ల నుంచి కిలోకు రూ. 1.50 చొప్పున చెత్తను కొనుగోలు చేసేందుకు ఒక వేస్ట్ మేనేజ్మెంట్ గ్రూప్ ముందుకు వచ్చిందని రైల్వే శాఖ ఉన్నతాధికారి ఒకరు గురువారం వెల్లడించారు. తొలి దశలో అమృతసర్, అంబాలా, ఛత్రపతి శివాజీ టెర్మినస్ - ముంబైతోపాటు తదితర 12 స్టేషన్లలో చెత్తను సేకరిస్తామని ఆ సంస్థ పేర్కొందన్నారు. చెత్త సేకరణ, రవాణా, నిర్వహణ.. తదితర విధులు ఆ సంస్థవేనన్నారు. దీనివల్ల రైల్వేకు ఆదాయం సమకూరడంతో పాటు, స్టేషన్ల పరిశుభ్రత కూడా సాధ్యమవుతుందన్నారు.