సీఎం యోగి మరో తీవ్ర నిర్ణయం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ అధికారులను పరుగులు పెట్టిస్తున్న ఆయన తాజాగా మరో శాఖకు పరుగుపందెం పెట్టినంత పని చేశారు. దాదాపు 60 లక్షల రేషన్ కార్డులను వెనక్కి తీసుకుంటున్నారు. వీటన్నింటిపైనా మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఫొటోలు ముద్రించి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే హడావుడిగా అఖిలేశ్ ప్రభుత్వం దాదాపు నాలుగు కోట్ల రేషన్ కార్డులను ముద్రించారు.
వీటిల్లో దాదాపు 60లక్షల కార్డులపై అఖిలేశ్ ఫొటోలు ముద్రించారు. అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం మూలంగా వాటిల్లో చాలా కార్డులు పంపిణీ చేయలేదు. ఈ కార్డులపై సమాజ్వాది పార్టీ జెండా రంగులు ఎరుపు, ఆకుపచ్చ ముద్రించారు కూడా. ప్రస్తుతం యోగి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో రేషన్ కార్డులపై ప్రభుత్వ పెద్దల ఫొటో ఉండరాదని పేర్కొంటూ ఆ కార్డులను వెనక్క తీసుకుంటుంది. అలాగే, ఆ సమయంలో ముద్రించిన నాలుగు కోట్ల కార్డులను రద్దు చేయనుంది.