
కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని హౌరాలో జొమాటో డెలివరీబాయ్ల నిరసనల నేపథ్యంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం వివరణ ఇచ్చింది. తమ మత విశ్వాసాలకు విరుద్ధంగా బీఫ్, ఫోర్క్ సరఫరా చేయబోమని డెలివరీబాయ్లు సోమవారం నుంచి సమ్మెకు పిలుపు ఇవ్వడంతో జొమాటో స్పందించింది. భారత్ వంటి వైవిధ్య దేశంలో వెజ్, నాన్వెజ్ ప్రాధామ్యాలుగా ఎంచుకుని డెలివరీ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. పనిలోకి వచ్చే ముందే డెలివరీ ఎగ్జిక్యూటివ్లు తమ ఉద్యోగ స్వభావాన్ని అవగతం చేసుకుంటారని, తమ భాగస్వాములు అందరూ ఈ ప్రక్రియపై అవగాహన కలిగి ఉన్నారని పేర్కొంది. ‘ఈ ఉద్యోగం ఎలాంటిదో వారు అర్థం చేసుకోవాలి. భారత్లోని భిన్నత్వం ఇందులో ప్రతిబింబిస్తుంది. డెలివరీ చేయాల్సింది శాకాహారమా.. మాంసాహారమా అన్న విషయంలో తేడా చూపలేము. ఇది అర్థం చేసుకోవాలి’ అని స్పష్టం చేసింది.
కాగా, తమ మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉండే ఆహారాన్ని సరఫరా చేయబోమని చెబుతూ హిందూ, ముస్లిం ఫుడ్ డెలివరీబాయ్స్ అందరూ సోమవారం నుంచి సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. తమ డిమాండ్లపై తాము ఇప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా ఇంతవరకూ వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదని వెల్లడించారు. ఇటీవల కొన్ని ముస్లిం రెస్టారెంట్లును ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లో యాడ్ చేశారని, అయితే వీటి నుంచి బీఫ్ను సరఫరా చేసేందుకు కొందరు హిందూ డెలివరీ బాయ్లు నిరాకరిస్తున్నారని జొమాటో ఫుడ్ డెలివరీ ఉద్యోగి మౌసిన్ అఖ్తర్ చెప్పుకొచ్చారు. అయితే కొన్ని సందర్భాల్లో తాము పందిమాంసం డెలివరీ చేయాల్సి వస్తోందని ముస్లిం డెలివరీ బాయ్స్ వీటిని డెలివరీ చేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మరోవైపు వేతన, చెల్లింపుల సమస్యలపై కూడా తాము అసంతృప్తిగా ఉన్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment