
సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పుంజుకుంటున్నాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి సమకూర్చడంపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వేగం పెంచారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అశోక్ లవసా బుధవారం రాష్ట్రంలో పర్యటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఏర్పాట్లపై ముఖ్య ఎన్నికల అధికారులు రజత్కుమార్, ఆర్.పి.సిసోడియాలతో చర్చించారు. ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్)కు వెళ్లి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం), ఓటింగ్ రసీదు యంత్రాల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ సుదీప్జైన్, రాష్ట్ర అధికారులతో ఈ అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ జనార్ధన్రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ ఎం.వి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.