
సిరా గుర్తుతో సీఎం రఘుబర్ దాస్
రాంచీ: ఉద్రిక్తత నడుమ జార్ఖండ్లో రెండో దశ పోలింగ్ ముగిసింది. 63.36 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. సిసాయ్ నియోజకవర్గంలోని 36వ పోలింగ్ బూత్ వద్ద పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించిన వ్యక్తుల మీద భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి మరణించగా, మరి కొందరు గాయపడ్డారని ఏడీజీపీ మురారి లాల్ మీనా చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరపుతున్నామని జార్ఖండ్ ఎన్నికల అధికారి వినయ్ కుమార్ చౌబే తెలిపారు. పోలీసుల కాల్పుల అనంతరం కోపోద్రిక్తులైన ప్రజలు రాళ్లు విసరడంతో ఓ పోలీసుకు గాయాలయ్యాయి. రెండో దశలో మొత్తం 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనుండగా, అందులో 18 స్థానాల్లో మధ్యాహ్నం 3 వరకూ మరో రెండు స్థానాల్లో సాయంత్రం 5 వరకు పోలింగ్ జరిగింది. దాదాపు ఏడు జిల్లాల వ్యాప్తంగా 42 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించినట్లు చెప్పారు.