
పణజి : పదవిలో ఉన్న రాజకీయనాయకుడు చనిపోతే.. ఆ స్థానంలో నిర్వహించే బై ఎలక్షన్లో సదరు నాయకుడి వారసులు పోటీ చేయడం సాధరణంగా జరిగే విషయం. కానీ దివంగత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ పెద్ద కుమారుడు ఉత్పల్ పరీకర్ మాత్రం పోటీ చేసేందుకు తాను సిద్ధంగా లేనంటున్నాడు. పరీకర్ మరణం తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఉత్పల్ ‘మా నాన్న చనిపోయిన బాధ నుంచి ఇంకా కోలుకోలేదు. రాజకీయాల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సమయం వచ్చినప్పుడు ప్రజల ఆకాంక్షల మేరకు నిర్ణయం తీసుకుంటాను. ప్రస్తుతానికైతే దీనీ ప్రస్తుతం దీని గురించి నా మనసులో ఎలాంటి ఆలోచన లేద’ని తెలిపారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం పరీకర్ మరణించిన తర్వాత ఆయన కుమారులిద్దరిని పార్టీలో చేరమని కోరిందట.
దేశరాజకీయాల్లో అజాతశత్రువు, మృదు స్వభావి, బీజేపీ సీనియర్ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్(63) ఈ నెల 17న కన్నుమూసిన సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా ప్యాంక్రియాటిక్ కేన్సర్తో బాధపడుతున్న పరీకర్ ఆదివారం పణజిలోని డౌనాపౌలాలో ఉన్న స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.