
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంటలో వైఎస్ జగన్ 44వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఆయన వెంట నడిచేందుకు భారీగా జనం తరలివచ్చారు. వారందరినీ అప్యాయంగా పలకరిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు.
అక్కడి నుంచి వేపరాళ్ల క్రాస్ మీదుగా తాళ్ల కాల్వ చేరుకున్న ఆయనకు ఘనస్వాగతం లభించింది. రాజన్న తనయుడికి తాళ్ల కాల్వ వాసులు ఆత్మీయ స్వాగతం పలికారు. తర్వాత రెక్క మాను మీదుగా గాజులవారిపల్లె చేరుకుంటారు. అనంతరం చామలగొంది క్రాస్ నుంచి 11 గంటలకు ధనియని చెరువు చేరుకుని వైఎస్ జగన్ అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు ఎన్.పి కుంట మండలంలోని ధనియని చెరువులో వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ధనియని చెరువులో మహిళలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. డి కొత్తపల్లి, కొట్టాలవారిపేట మీదుగా సాగిన పాదయాత్ర 5 గంటలకు బండారుచెట్లుపల్లికి చేరుకుంటుంది. వెంకమద్ది క్రాస్ లో 44వ రోజు పాదయాత్ర ముగుస్తుంది. జననేత వైఎస్ జగన్ రాత్రి ఇక్కడే బస చేస్తారు.