
సాక్షి, బెంగళూరు (బెళగావి): అవినీతిపై పోరాటం అంటూ ప్రసంగాల్లో ఊదరగొట్టే ప్రధాని మోదీ లోక్పాల్ను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రశ్నించారు. సోమవారం కర్ణాటకలో బెళగావి రామదుర్గ బహిరంగసభలో ప్రసంగిస్తూ కనీసం ఢిల్లీలో కూడా లోక్పాల్ను మోదీ ఏర్పాటు చేయలేకపోయారన్నారు. దేశంలో అతి పెద్ద మోసాలు, నేరాలు సంభవిస్తుంటే ప్రధాని నోరు మెదపడం లేదన్నారు. మోదీ కర్ణాటక రాష్ట్రానికి వచ్చి తమ సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
అవినీతి కేసుల్లో జైలుకెళ్లి వచ్చిన యడ్యూరప్ప, బీజేపీ మాజీ మంత్రులు పక్కనే కూర్చొని ఉండడాన్ని మరచినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. దేశంలోని కార్పొరేట్ శక్తుల కోసమే మోదీ పనిచేస్తున్నారన్నారు. కర్ణాటకలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని రాహుల్ చెప్పారు. రాష్ట్రంలో పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని, వారే తమను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మూడు రోజుల రెండో విడత జనాశీర్వాద యాత్ర సోమవారంతో ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment