
న్యూఢిల్లీ: స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం భారత్లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న మొదటి కేంద్ర ప్రభుత్వంగా నరేంద్రమోదీ సర్కారు చరిత్రలో నిలిచిపోనుంది. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దుచేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అమిత్ షా ప్రకటన వెలువడిన వెంటనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ట్విటర్లో ప్రధాని నరేంద్రమోదీకి సంబంధించిన ఆసక్తికరమైన ఫొటోను పోస్టు చేశారు. ఎప్పటిదో తెలియని ఈ పాత ఫొటోలో యవ్వనంలోని నరేంద్రమోదీ ఓ కార్యక్రమంలో కూర్చొని ఉన్నారు. ఆర్టికల్ 370ను రద్దు చేయాలి.. ఉగ్రవాదాన్ని అంతమొందించాలని ఆయన వెనుక ఉన్న బ్యానర్లో రాసి ఉంది. ఈ ఫొటోను పోస్టు చేసి.. ‘హామీ నెరవేరింది’ అని రాం మాధవ్ కామెంట్ చేశారు. ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా యవ్వనంలో ఉన్నప్పుడు నరేంద్రమోదీ ఆందోళన నిర్వహించినప్పటి ఫొటో ఇది అయి ఉంటుందని, నేడు ఆర్టికల్ 370 రద్దు అయిన నేపథ్యంలో ఈ అరుదైన ఫొటోను ఆయన షేర్ చేసి ఉంటారని భావిస్తున్నారు.
Promise fulfilled pic.twitter.com/iiHQtFxopd
— Ram Madhav (@rammadhavbjp) August 5, 2019