Ram Madhav
-
కశ్మీర్ ఎన్నికల కోసం బీజేపీ బిగ్ ప్లాన్
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ బిగ్ స్కెచ్ గీసింది. ఈ క్రమంలో మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ను మళ్లీ తెర మీదకు తెచ్చింది. ఆయన్ని జమ్ము కశ్మీర్ ఎన్నికల ఇన్చార్జీగా నియమిస్తూ అధికారిక ప్రకటన చేసింది. 2014 ఎన్నికల్లో జమ్ము కశ్మీర్లో బీజేపీని అధికారంలోకి(సంకీర్ణం) తీసుకురావడంలో రామ్ మాధవ్ కీలక పాత్ర పోషించారు. రామ్ మాధవ్ దాదాపు ఆరేడు సంవత్సరాల పాటు బీజేపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో అక్కడి రాజకీయాలపై అనుభం ఉన్న రామ్మాధవ్ను బీజేపీ మళ్లీ రంగంలోకి దించింది. ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రంకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎన్నికల ఇన్చార్జీగా రామ్మాధవ్ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఎన్నికల ఇన్చార్జీగా రామ్మాధవ్ కీయాశీలక రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వటం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నట్లు తెలుస్తోంది. -
సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో పుస్తక సమీక్ష
శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో, సింగపూర్లో ప్రవాసభారతీయులతో డా. రామ్ మాధవ్ రచించిన నూతనగ్రంధ పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. డా రామ్ మాధవ్ ఇటీవల రచించిన *ది ఇండియన్ రియాలిటీ: మారుతున్న కథనాలు, షిఫ్టింగ్ పర్సెప్షన్ (“The Indian Reality: Changing Narratives, Shifting Perceptions”) పుస్తక పరిచయం,విశ్లేషణ కార్యక్రమం సింగపూర్లో మే 4న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక స్థానిక భారతీయ సంస్థల అధిపతులతో పాటు సుమారు 100 మంది సింగపూర్ వాసులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పుస్తక రచయిత, బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌండేషన్ పాలక మండలి అధ్యక్షుడు డా రామ్ మాధవ్ భారతదేశం చుట్టూ అభివృద్ధి చెందుతున్న కథనంపై అంతర్దృష్టి దృక్కోణాలను పంచుకున్నారు. భారతదేశంలోని ప్రస్తుత పరిపాలన ద్వారా అందించబడిన జవాబుదారీతనాన్ని ఆయన నొక్కిచెప్పారు, సానుకూల మార్పును ప్రభావితం చేయడానికి ప్రధాన స్రవంతి రాజకీయాల్లో యువకులు విద్యావంతులు పెరుగుతున్న భాగస్వామ్యాన్ని హైలైట్ చేశారు. అంతేకాకుండా, భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని గురుంచి నొక్కిచెప్పారు. అనంతరం రామ్ మాధవ్ , వామరాజు సత్యమూర్తిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్షుడు వామరాజు సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సభ్యులు అడిగిన సందేహాలను నివృత్తి చేసారు. 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ అతిధులకు, ఇంకా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, సుధాకర్ జొన్నాదుల, పాతూరి రాంబాబు, నిర్మల్ కుమార్, కాత్యాయని గణేశ్న, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి ప్రభురామ్, మమత, దినేష్, ఇండియా ఫౌండేషన్ నుండి దీక్ష తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. అతిధుల విందు భోజనంతో ఈ కార్యక్రమం ముగిసింది. -
సింగపూర్లో రామ్ మాధవ్ పుస్తక సభ విజయవంతం
డాక్టర్ రామ్ మాధవ్ రచించిన "ది హిందుత్వ పారడైమ్" (సమగ్ర మానవతావాదం మరియు పాశ్చాత్యేతర ప్రపంచ దృష్టికోణం కోసం అన్వేషణ) పుస్తక పరిచయం విశ్లేషణ కార్యక్రమము సింగపూర్ ఘనంగా జరిగింది. శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ ఆధ్వర్యంలో మే 8న జరిగిన ఈ కార్యక్రమంలో పదికి పైగా స్థానిక భారతీయ సంస్థలు అధిపతులతో పాటు సుమారుగా ౩౦౦ మందికి పైగా సింగపూర్ వాసులు పాల్గొన్నారు. పుస్తక రచయిత, బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌడేషన్ పాలక మండలి సభ్యుడు డాక్టర్ రామ్ మాధవ్ మాట్లాడుతూ... నేను వ్రాసిన హిందుత్వం పుస్తకం 21వ శతాబ్దపు వాస్తవికతకు అన్వయించవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడుతుంది, ఈ ఆలోచన ప్రపంచ దృక్పథం ఆధారంగా మన రాజకీయ వ్యవస్థలను అభివృద్ధి చేయగలమా లేదా అనేది తెలియచేస్తుంది అని తెలిపారు. అనంతరం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానాలు చెప్పి సందేహ నివృత్తి చేసారు. 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థని స్థాపించాక మొట్టమొదటి స్థానిక సామూహిక కార్యక్రమము విజయవంతం అవ్వడంపట్ల నిర్వాహుకులు కవుటూరు రత్నకుమార్ తదితరులు సంతోషం తెలియచేశారు. ఈ కార్యక్రమము విజయవంతం కావడం కోసం అహర్నిశలు కృషిచేసిన ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రవితేజ్ భాగవతుల, రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, సురేష్ చివుకుల, యోగేష్ హిందూజ, సంజయ్, ఊలపల్లి భాస్కర్,రాధిక మంగిపూడి, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి ప్రభురామ్, మమత, దినేష్, ఇండియా ఫౌండేషన్ నుండి దీక్ష తదితరులకు శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు ధన్యవాదాలు తెలియచేసారు. కార్యక్రమ నిర్వహణకు ఆడిటోరియం, భోజన సదుపాయాలను గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యక్షుడు అతుల్ ప్రత్యేకంగా అందజేశారు. చదవండి: ఘంటసాల గొప్ప గాయకుడు, మానవతావాది, సంగీత విద్వాంసులు -
ఈ యుద్ధం వెనుక ఏముంది?
రష్యాలో అతి సాధారణంగా కనిపించే ఇంటిపేరు ‘వ్లాదిమిర్’... ఉక్రెయిన్లోనూ కనిపిస్తుంది. పుతిన్, జెలెన్స్కీ ఇద్దరి పేర్లలోనూ వ్లాదిమిర్ ఉండటం గమనార్హం. ఇరు దేశాలకూ అంత దగ్గరితనం ఉంది. అంత ఉమ్మడి చరిత్ర ఉంది. కానీ ఉక్రెయినియన్ అనేది ప్రత్యేక జాతి అన్న వాదనను పుతిన్ అంగీకరించరు. దాన్ని తమ నుండి వేరు చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయనేది ఆయన వాదన. కానీ శతాబ్దాల పాటు ప్రత్యేక భాష, సంస్కృతితో ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా ఉందని ఉక్రెయినియన్ల విశ్వాసం. సోవియట్ యూనియన్ పతనాన్ని ఒక ‘విపత్తు’గా పరిగణించే పుతిన్... రష్యా అన్ని కష్టాలకూ పాశ్చాత్య శక్తులే కారణమని నమ్ముతారు. అందుకే ఈ యుద్ధం వెనుక సంక్లిష్ట చరిత్ర, భావజాలాలు ఉన్నాయి. ఇది ఇద్దరు వ్లాదిమిర్ల మధ్య జరుగుతున్న యుద్ధం. ఒకరు రష్యాకు తిరుగులేని అధ్య క్షుడు వ్లాదిమిర్ పుతిన్. వ్యూహాలు పన్నడంలో, రాజనీతిజ్ఞతలో దశా బ్దాల అనుభవం ఉన్న బలమైన నాయకుడు. ఇంకొకరు వ్లాదిమిర్ జెలెన్స్కీ. ఉక్రెయిన్ అనే చిన్న దేశానికి అధ్యక్షుడు. జన్మతః యూదుడు. రాజకీయవేత్తగా మారిన నటుడు. ఒక శక్తిమంతమైన సైనిక శక్తిగల దేశం, తన కన్నా సగానికి తక్కువ సైన్యం గల ప్రత్యర్థితో జరుపుతున్న యుద్ధం. రెండు అసమాన శక్తుల పోరాటం. ఉక్రెయిన్లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) దుందుడుకు చర్యల నుండి ఉత్పన్నమవుతున్న భద్రతాపరమైన ఆందోళనల కారణంగా తన చర్యలు ఉన్నాయని పుతిన్ వేదన. అయితే ఉక్రెయిన్ ‘డీనాజిఫికేషన్’పై ఆయన వ్యాఖ్యలు ఇది కేవలం సైనిక యుద్ధం గురించి మాత్రమే కాదని సూచిస్తోంది. దీని వెనక చారిత్రక, సైద్ధాం తిక భావజాలాలు ఉన్నాయి. అందుకే రష్యాలో అతి సాధారణంగా కనిపించే ఇంటి పేరు ‘వ్లాదిమిర్’తో దీనికి సంబంధం ఉంది. సహస్రా బ్దాల చరిత్ర గల కీవ్ రస్ సామ్రాజ్యపు 10వ శతాబ్దపు యువరాజు ‘వ్లాదిమీర్ ద గ్రేట్’ను ఆధునిక రష్యా పితామహడిగా పరిగణిస్తారు. కానీ ఉక్రెయినియన్లు కూడా క్రీ.శ. 980–1015లో కీవ్ రాజుగా ఉన్న ఆయన్నే ఉక్రెయిన్ పితామహడిగా భావిస్తారు. ‘వ్లాదిమిర్ ద గ్రేట్’ వేరువేరు దేశాలకు పితామహడు కాలేడనేది పుతిన్ వాదన. ‘‘చరిత్ర నా పట్ల అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే నేనే చరిత్ర రాయాలనుకుంటున్నాను’’ అని విన్స్టన్ చర్చిల్ ఓ సంద ర్భంలో చమత్కరించారు. ‘చరిత్ర’ ఎవరు, ఎలా చూపెడుతారు అన్న దానిపై ఆధారపడుతుంది. ఉక్రెయిన్ భూభాగంలో రష్యా సేనలు ప్రవేశించడానికి కొన్ని రోజుల ముందు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ పుతిన్ చరిత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. ఉక్రెయినియన్ అనేది ప్రత్యేక జాతి అన్న వాదనను కొట్టిపారేశారు. ‘వ్లాదిమిర్ ద గ్రేట్’ నిర్మించిన సామ్రాజ్యం ‘రస్’లో నివసించిన ప్రజలందరూ రష్యన్లే ననీ, ఉక్రెయినియన్లను వేరు చేసేందుకు ఆస్ట్రో–హంగేరియన్లు, జర్మన్లు, పోల్స్, లిథువేనియన్లు వివిధ చారిత్రక సందర్భాలలో ప్రయత్నించారనీ ముక్తాయించారు. కానీ ఉక్రెనియిన్లకు తమ సొంత చరిత్ర ఉంది. శతాబ్దాల పాటు ప్రత్యేక భాష, సంస్కృతితో ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా ఉందని వారి విశ్వాసం. ‘వ్లాదిమిర్ ద గ్రేట్’ సామ్రాజ్యం కీవ్, ప్రస్తుత ఉక్రెయిన్ రాజధాని, రెండవ సహస్రాబ్దిలో ఒక శక్తిమంతమైన సామ్రాజ్యం అనీ, రష్యన్ జార్స్ నియంత్రణలో ఎప్పుడూ లేదనీ వారి వాదన. సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ యూని యన్(యూఎస్ఎస్ఆర్)లో 1922లో మాత్రమే ఉక్రెయిన్ భాగ మైంది. అప్పుడు కూడా ఉక్రెనియిన్ కమ్యూనిస్టులు సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఎస్యూ) నుండి ప్రత్యేక గుర్తింపును కొనసాగించారు. యూఎస్ఎస్ఆర్ పతనం సమయంలో, ఆ తరువాతి సంవత్స రాలలో రష్యా అధ్యక్షుడిగా ఉన్న బోరిస్ యెల్త్సిన్కు పుతిన్ అత్యంత విశ్వసనీయుడు. ఆ కృతజ్ఞతతో యెల్త్సిన్ 1999లో పదవి వీడుతూ పుతిన్ను తన వారసుడిగా ప్రకటించారు. పుతిన్ ఒక రష్యన్ జాతీయ వాది. సోవియట్ యూనియన్ పతనం ఒక ‘విపత్తు’ అనేది ఆయన అభిప్రాయం. 1991లో సోవియట్ విచ్ఛిన్నంతో సహా రష్యా కష్టాలకు పాశ్చాత్య శక్తులే కారణమని ఆయన నమ్మకం. ‘టేమ్ రష్యా’ (రష్యాను అదుపుచెయ్) అనేది గత సహస్రాబ్దిలో అనేక యూరోపియన్ శక్తుల ప్రాజెక్ట్. ఇది ప్రచ్ఛన్న యుద్ధ కాలం లోనూ కొనసాగింది. సోవియట్ యూనియన్ను నిలువరించేందుకే 1957 నాటి ‘ఐజెన్హోవర్ సిద్ధాంతం’! స్టాలిన్కూ, అతని వారసు లకూ పశ్చిమ దేశాలపై ఎన్నో అనుమానాలున్నాయి. సోవియట్ యూనియన్ పతనానంతరం తొలుత పుతిన్ యూరోపియన్ యూని యన్లో చేరేందుకు ప్రతిపాదించాడు. పశ్చిమ దేశాలతో ఐక్యంగా ఉండేందుకు ప్రయత్నించి భంగపడ్డాడు. ఈ అవమానానికి యూరోపి యన్లకు తగిన గుణపాఠం చెప్పాలని పుతిన్ గట్టిగా తీర్మానించు కున్నాడు. దీని వెనుక చరిత్రతో పాటు సైద్ధాంతిక కోణమూ ఉంది. పాశ్చాత్య దేశాలు రష్యన్లను అనాగరికులుగా, వారి మత విశ్వాసాలు, రాజకీయాలు హీనమైనవిగా పరిగణించాయి. ప్రతీకారంగా పాశ్చాత్య దేశాల ఉదారవాద రాజకీయాలను పుతిన్ తిరస్కరించాడు. డిజిటల్ వేదికపై వాటిని అణగదొక్కేందుకు చేయగలిగిందంతా చేశాడు. పుతిన్ జాతీయత–సాంస్కృతిక గుర్తింపు... పశ్చిమ దేశాల ఆధునిక భౌగోళిక రాజకీయ జాతీయతకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఉక్రెయిన్ ఉదార వాద ప్రజాస్వామ్యం ఆయన రాజకీయ సిద్ధాంత ఓటమికి సంకేతం. ‘రష్యా భాగస్వామ్యంతో మాత్రమే ఉక్రెయిన్ నిజమైన సార్వభౌమాధి కారం సాధ్యమవుతుంది’ అనేది పుతిన్ ఉద్ఘాటన. కమ్యూనిస్టులు మతాన్ని వ్యతిరేకించారు. హిట్లర్ను నిలువరించ డానికి పోప్ మద్దతును సమీకరించాలని 1943 తెహ్రాన్ కాన్ఫరెన్స్లో చర్చిల్ సూచించినప్పుడు, ‘పోప్కి ఎన్ని సైనిక విభాగాలు ఉన్నాయి?’ అని స్టాలిన్ ప్రముఖంగా అడిగారు. పుతిన్ మతానికి వ్యతిరేకం కాదు. కానీ ఉక్రేనియన్లను తమ నుండి దూరం చేసి రష్యన్ ఆర్థొడాక్స్ మత గుర్తింపును బలహీన పరిచేందుకు క్యాథలిక్ శక్తులు ప్రయత్నిస్తున్నా యని ఆయన అనుమానం. యాదృచ్ఛికంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒక యూదుడు కావడం పుతిన్ అనుమానానికి బలం చేకూర్చింది. ఈ యుద్ధం వెనుక ఉన్న సంక్లిష్ట చరిత్ర, భావజాలమే భారతదేశ సంకట స్థితికి కారణం. ఒకపక్క టిబెట్, తైవాన్ సహా పలు ప్రాంతా లను తమవిగా చెప్పుకుంటోన్న చైనా వైఖరిని తిరస్కరించే భారత్, ఉక్రెయిన్ ప్రత్యేక దేశం కాదన్న పుతిన్ వాదనను సమర్థించలేదు. అదే సమయంలో నాటో దేశాల రెచ్చగొట్టే చర్యల నేపథ్యంలో రష్యా భద్రతాపర ఆందోళనలనూ పూర్తిగా తిరస్కరించనూలేదు. నేడు ప్రపంచం పుతిన్ చర్యలను వ్యతిరేకిస్తుంది. ఉక్రెయిన్పై యుద్ధాన్ని వ్యతిరేకించడంలో భారతదేశం ఒక దృఢ సైద్ధాంతిక వైఖరిని తీసుకుంది. కానీ, ఐక్యరాజ్యసమితిలో చైనా, మనం ఇంచు మించు ఒకే వైఖరి తీసుకోవడం ప్రపంచ దేశాలను కలవరపరు స్తోంది. ఎంతో విశిష్టమైన మన గొప్ప ప్రజాస్వామ్య దేశం ఎంత కాలం ఈ తటస్థ వైఖరిని కొనసాగించగలదు? వ్యాసకర్త: రామ్మాధవ్ ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు -
కమ్యూనిస్ట్లు ఐడియాలజిస్ట్లు.. హిందువులు తత్వవేత్తలు: రాంమాధవ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత రాంమాధవ్ రచించిన ‘ది హిందుత్వ పరాదిమ్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఫోరమ్ ఫర్ నేషనల్ థింకర్స్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగింది. పుస్తకాన్ని రిటైర్డ్ జస్టిస్ రఘురాం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాంమాధవ్ హిందుత్వం గురించి మంచి పుస్తకాలు రాస్తారన్నారు. సరళమైన భాషలో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉంటాయని రఘురాం అన్నారు. ఈ పుస్తకంలో అనేక అంశాలు తానను ఆకట్టుకున్నాయన్నారు. రాంమాధవ్ మాట్లాడుతూ కార్ల్మార్క్స్' కమ్యూనిస్ట్ భావజాలాన్ని వ్యాప్తి చేశారన్నారు. హిందుయిజం శంకరాచార్యులు, గాంధీ లాంటి వ్యక్తులను తయారు చేసిందన్నారు. ‘‘సావర్కర్ పితృభూమి అన్నారు. నేను మాతృభూమి అంటున్నాను. కమ్యూనిస్ట్లు ఐడియాలజిస్ట్లు.. హిందువులు తత్వవేత్తలు. హిందుత్వం, హిందుయిజం, ఇండియా అన్నీ ఒక్కటేనని’’ రాంమాధవ్ అన్నారు. -
సోషల్ మీడియా నియంత్రణకు చట్టం!
కోల్కతా: సామాజిక మాధ్యమాలు ప్రభుత్వాలను కూలదోయగలవని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చగలవని అందుకే వాటిలోని పోస్టులపై నియంత్రణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ఓ చట్టాన్ని తయారు చేస్తోందని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన కోల్కతాలో తాను రాసిన ‘బికాజ్ ఇండియా కమ్స్ ఫస్ట్’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయేతర, విదేశీ శక్తుల వల్ల ప్రజాస్వామ్యానికి సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. సామాజిక మాధ్యమాల్లోని ఇలాంటి పోస్టులను ఎదుర్కునేలా ప్రస్తుత చట్టాలు రూపొందలేదని, వాటిని ఎదుర్కోవడానికి కొత్త చట్టం కావాలని, దానిపై ఇప్పటికే ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. దేశంలో ట్విట్టర్పై ప్రభుత్వం నుంచి ఇప్పటికే పలు సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తాను రాసిన కొత్త పుస్తకం మోదీ ప్రభుత్వంలోని పలు నిర్ణయాలపై చర్చ చేస్తుందని తెలిపారు. -
మోదీ హయాంలోనే 'ఇండియస్ ఫస్ట్' సాధ్యం
హైదరాబాద్: తాను రచించిన "బికాజ్ ఇండియా కమ్స్ ఫస్ట్" అనే పుస్తకంపై జరిగిన ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో బీజేపీ జాతీయ నేత రాం మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'అమెరికా ఫస్ట్' స్పూర్తితో 'ఇండియా కమ్స్ ఫస్ట్' పుస్తకానికి నామకరణం చేయడం జరిగిందని అన్నారు. మోదీ హయాంలో భారత్ అత్యున్నత శిఖరాలకు చేరుకుందని, మోదీ వల్లే 'ఇండియస్ ఫస్ట్' సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రపంచ దేశాల నేతలతో సత్సంబంధాలు కలిగివుంటారని, అది భారత్కు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. గతంలో దేశంలో ఎక్కడో ఒక చోట ఉగ్ర దాడులు జరిగేవని, ఉగ్రవాదాన్ని అదుపు చేసేందుకు మోదీ అనుసరిస్తున్న విధానాలు సత్ఫలితాల్ని ఇచ్చాయని రాం మాధవ్ పేర్కొన్నారు. అయోధ్య పేరులోనే శాంతి ఉందని, రామ మందిరం విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ముస్లింలతో సహా అన్ని మతాలు స్వాగతించాయని ఆయన గుర్తు చేశారు. భారత్, అమెరికా మధ్య సత్సంబందాలు మోదీ హయాంలో నిరాటంకంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. భారత్ జాతీయవాదాన్ని మరింత పటిష్టపరుచుకోవాలని.. జాతీయం, జాతీయవాదం రెండు భిన్నమైనవని ఆయన అభిప్రాయడ్డారు. 1962 భారత్, చైనా యుద్ధం ప్రస్తావన రాగా.. గతంలో భారత్, చైనా కంటే బలహీనమైన దేశంగా ఉండేదని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని, అందుకు మోదీ విధానాలే కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా హవాను ఎదుర్కోవడం భారత్కు పెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డారు. 2017 డోక్లాం ఘటన తరువాత సరిహద్దు వివాదాల్లో భారత్ తీరు మారిందని ఆయన గుర్తు చేశారు. తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు భారత్ ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. చైనా ఎదుగుదలకు భారత్ వ్యతిరేకం కాదని, అలాగని కయ్యానికి కాలు దువ్వితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. -
అలా చేస్తే ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది
సాక్షి, విశాఖపట్నం : భారతదేశంలో రాజ్యాంగం పటిష్టంగా ఉందని, రాజ్యాంగ వ్యవస్థ దేశ ప్రజల్ని ప్రపంచంలో ముందుండే విధంగా నడిపిస్తుందని బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్ వ్యాఖ్యానించారు. శనివారం ‘బికాస్ ఇండియా కమ్స్ ఫస్ట్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ రాజ్యాంగ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తే ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది. రాజ్యాంగానికి విరుద్ధంగా కొంత మంది రైతులు, నాయకులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలపై రైతులు ప్రభుత్వంతో చర్చించాలి. కొద్దిమంది నియంత్రణలో నుంచి రైతులను బయటకు తీసుకు వచ్చేందుకే వ్యవసాయ సంస్కరణలు తీసుకొచ్చాం. ఏం జరిగినా రాజ్యాంగపరమైన వ్యవస్థల ద్వారా జరగాలి. రాష్ట్రాల్లో దేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశం మా దృష్టికి వచ్చింది. దేవాలయాలపై దాడులు అంశాన్ని ఓ పార్టీపై మరొక పార్టీ నెట్టుకోవడం సరికాదు. దేవాలయాలపై దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని అన్నారు. -
‘ఎల్ఏసీ’ని తేలుస్తాం : రాంమాధవ్
సాక్షి, హైదరాబాద్ : పాకిస్తాన్తో సరిహద్దు వెంబడి ఉన్న నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) తరహాలో చైనాతో సరిహద్దు వెంబడి వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)ను తేల్చేందుకు ప్రధాని ధృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారని బీజేపీ సీనియర్ నేత, ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ వి.రాంమాధవ్ తెలిపారు. భారత భూభాగంలో 60 ఏళ్లుగా జరిగిన చైనా ఆక్రమణలను అప్పటి ప్రభుత్వాలు నిలువరించకపోయాయని ఆయన విమర్శించారు. అవేర్నెస్ ఇన్ యాక్షన్ ఆధ్వర్యంలో ‘ఇండో–చైనా స్టాండ్ ఆఫ్: ది రోడ్ అహెడ్’అనే అంశంపై శనివారం హైదరాబాద్లో జరిగిన చర్చా కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాంచందర్రావుతో కలసి రాంమాధవ్ హాజరై మాట్లాడారు. ‘‘60 ఏళ్లుగా ఎల్ఏసీని నిర్వచించలేకపోయాం. కానీ ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే ఎల్ఏసీని నిర్వచిస్తుంది. ఏ భూభాగం ఎవరికి చెందుతుందో చైనాతో చర్చిస్తుంది’’అని రాంమాధవ్ పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధి కోసమే ప్రైవేటు పెట్టుబడులు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రధాని శ్రమిస్తున్నారని, ఏళ్లుగా మూసధోరణితో ఉన్న అంశాలను సంస్కరిస్తున్నారని రాంమాధవ్ ఉద్ఘాటించారు. ఆర్థికాభివృద్ధి కోసమే ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ మయాంక్ సింగ్, అవేర్నెస్ ఇన్ యాక్షన్ ప్రతినిధులు బీజీ రాజేశ్వర్, బుచ్చిబాబు, మాధవి, రామకృష్ణ పాల్గొన్నారు. -
'ప్రపంచాన్ని చైనా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోంది'
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని చైనా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోందని బీజేపీ నేత, ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ రామ్ మాధవ్ అన్నారు. ఇండియా- చైనా మధ్య వివాదం ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం అనే అంశంపై హోటల్ క్షత్రియాలో అవేర్నెస్ ఇన్ యాక్షన్ ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నేత రామ్ మాధవ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు. కార్యక్రమంలో రామ్ మాధవ్ మాట్లాడుతూ.. 'చైనా మనకు రెండు విధాలుగా సవాల్ విసురుతోంది. ఒకటి ఆర్థికంగా ఎదిగిన చైనా ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోంది. అందుకే మన దేశంలాంటి దేశాలు అన్నీ కలిసి ఆర్థికంగా ఎదగాలి. అందుకే ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ప్రైవేటైజేషన్ను ప్రోత్సహిస్తున్నాం' అని తెలిపారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ.. 'చైనా అనేక కుయుక్తులు పన్నుతోంది. పాకిస్తాన్తో ఏకమై పనిచేస్తూ ఆ దేశాన్ని భారత్పై ఉసిగొల్పుతోంది. భారత్కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో లాబీయింగ్ చేస్తోంది. శ్రీలంకలో చైనా అనేక నిర్మాణాలు చేస్తోంది. ఇది భారతదేశానికి చాలా ఇబ్బంది కలిగించేదే. నేపాల్లో చైనా మధ్యవర్తిత్వంలో అక్కడి రాజకీయాల్లో మార్పు వస్తోంది. చైనా వల్ల ఇండియన్ ఓసియన్లో ఉన్న అన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చైనా వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. చదవండి: (ప్రయాణికుడి ట్వీట్కు స్పందించిన కేటీఆర్) దేశ విస్తరణ కాంక్షతో చైనా ఇలా వ్యవహరిస్తోంది. భారతదేశం ఏనాడు టెరిటరీ బార్డర్ను పెంచుకోవాలని కోరుకోలేదు. చైనా యాప్ల బ్యాన్ ద్వారా మన దేశ యువకులకు మంచి అవకాశం వచ్చింది. చైనాను కమ్యూనిస్టు దేశం అనేందుకు ఏ దేశం ఇష్టపడటం లేదు. భారత్ ఎప్పుడూ చైనాతో యుద్ధం కోరుకోవడం లేదు. కానీ చైనా మన దేశ సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నం చేస్తోంది. బీజేపీ ఎప్పుడూ స్నేహ హస్తం ఇస్తుంది. కవ్వింపులకు పాల్పడితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నాం. దేశ వ్యవహారాల్లో ఎవరి ప్రమేయం ఒప్పుకోం. నేపాల్ లాంటి దేశాలు చైనా వలలో పడకూడదు' అని కోరుకుంటున్నట్లు వివరించారు. -
రామ్ మాధవ్, మురళీధర్రావుకు ప్రమోషన్?
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ గత ఆదివారం జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి డీకే అరుణ, దగ్గుబాటి పురందేశ్వరి, సత్యకుమార్కు చోటు కల్పించింది. డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి దక్కగా.. ఏపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, సత్యకుమార్కు కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవులు లభించాయి. అయితే, ఇన్నాళ్లు జాతీయ కార్యదర్శులుగా ఉన్న తెలుగు రాష్ట్రాల సీనియర్ నేతలు రామ్ మాధవ్, మురళీధర్రావును పక్కన పెట్టేయడంపై ఇంటా బయటా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముందు నుంచీ పార్టీకీ విధేయులుగా సేవలు చేస్తున్నవారిని ఎందుకు దూరం పెట్టారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి: ఆపరేషన్ 2023) మరోవైపు రామ్ మాధవ్, మురళీధర్రావుకు ప్రధాని మోదీ కేబినెట్లో మంత్రులుగా అవకాశం ఇవ్వనున్నట్టు కొన్ని వార్తలు ప్రచారమవుతున్నాయి. అందుకనే జాతీయ కార్యదర్శులుగా తప్పించానేది ఆ వార్తల సారాంశం. అంతర్జాతీయ వ్యవహారాలపై పట్టు ఉన్న రామ్ మాధవ్కు విదేశాంగ శాఖ, వ్యాపార వ్యవహారాల్లో అనుభవం ఉన్న మురళీధర్ రావుకు వాణిజ్య శాఖలు కేటాయిస్తారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీకి చాలా కాలంగా సేవలు చేస్తున్న ఈ ఇద్దరికీ కీలక పదవులు దక్కడం ఖాయమని కొందరు బీజేపీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. కాగా, తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్కు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవి లభించడం విశేషం. (చదవండి: నడ్డా టీంలో పురందేశ్వరి, డీకే అరుణ) -
రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీ
సాక్షి, అమరావతి: ‘‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని చెబుతున్నది మాటవరసకి కాదు. రాజకీయ పార్టీ చారిటీ కోసం కాదు. రాష్ట్ర ప్రజల సేవ కోసం అధికారం సంపాదించేలా మన రాజకీయాలు ఉండాలి. రాష్ట్రంలో 2024లో బీజేపీ అధికారంలోకి రావడం అంత సులభం కాదు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది. దానిని బీజేపీ భర్తీ చేయాలి’’ అని పార్టీ కార్యకర్తలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ దిశానిర్దేశం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు మంగళవారం అధికారికంగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. దీనికి రామ్మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. – సోము వీర్రాజు నాయకత్వంలో నేతలందరూ సమష్టి కృషితో 2024లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషిచేయాలి. – ఐదేళ్లో, పదేళ్లో హైదరాబాద్లో ఉండి రాజధాని నిర్మాణం చేయాలని అప్పటి ప్రభుత్వానికి సలహా ఇస్తే.. విజయవాడకు పరిగెత్తుకొని వచ్చారు. – అమరావతిలో రాజధాని కట్టుకుంటామంటే కేంద్రం వద్దన్నదా? ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజధానిపై నిర్ణయం తీసుకుంటే దాంట్లో కేంద్రం పాత్ర నామమాత్రంగా ఉంటుంది. – అయితే మూడు రాజధానులను ఎవరూ ప్రశ్నించకూడదని కాదు. – మూడు రాజధానులన్నది అవినీతికి ఆలవాలంగా మారకూడదు. – రాజధాని ప్రాంతం రైతులందరికీ న్యాయం జరగాలన్న పోరాటంలో బీజేపీ ముందుండాలి. అన్నివర్గాలను కలుపుకొని వెళ్తా.. రాబోయే ఎన్నికల్లో మిత్రపక్ష పార్టీతో కలిసి రాష్ట్రంలో బీజేపీ అధికారం సాధించే దిశగా ప్రయత్నం చేస్తానని సోము వీర్రాజు అన్నారు. కులాలకు అతీతంగా జాతీయ వాదంతో పనిచేసే పార్టీ బీజేపీ అని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను కలుపుకొని పనిచేస్తానన్నారు. టీడీపీ, వైఎస్సార్సీపీలు తమకు సమదూరమేనని, వారిరువురు శత్రువులు కాదు, మిత్రులు కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ నేతలు సతీష్జీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దియోధర్, నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు హయాంలో అవినీతి: రామ్మాధవ్
-
‘హైదరాబాద్ వదిలి ఎందుకు వచ్చారో తెలుసు’
సాక్షి, అమరావతి: ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం అంత సులభం కాదని.. రాష్ట్ర బీజేపీని సోము వీర్రాజు మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ అన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన సోము వీర్రాజు ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా బీజేపీ ఎదగాలన్నారు. ‘‘రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్రం అడ్డుకోలేదు. రాజధాని అంశంపై కేంద్రం ఏనాడు జోక్యం చేసుకోలేదు. కేంద్రం తన పరిధిలోనే వ్యవహరించిందని’’ రామ్మాధవ్ పేర్కొన్నారు. (జగన్ దృఢసంకల్పంతో పనిచేస్తున్నారు) రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది. ప్రతిపక్ష స్థానాన్ని బీజేపీ భర్తీ చేయాలన్నారు. ‘‘మోదీ భుజాలపై తుపాకీ పెట్టి యుద్ధం చేయాలని చంద్రబాబు చూశారు. హైదరాబాద్లో ఉండి 5 లేదా 10 ఏళ్లలో రాజధాని కట్టుకోమని చెప్పాం. ఆయన హైదరాబాద్ను వదిలి ఎందుకు వచ్చారో అందరికీ తెలుసు. చంద్రబాబు హయాంలో అమరావతిలో అవినీతి జరిగిందని’’ రామ్మాధవ్ విమర్శించారు. రాజధాని వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోదు: సోము వీర్రాజు రాజధాని వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం, పార్టీ వేర్వేరు అని తెలిపారు. రాజధాని రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కాంగ్రెస్, సీపీఐ రామకృష్ణ ఎవరు రాసి ఇచ్చిన స్క్రిప్టు చదువుతున్నారో అందరికి తెలిసిందేనన్నారు. అధ్యక్షుడిగా తన మీద మరింత బాధ్యత పెరిగిందన్నారు. పార్టీని రాష్ట్రంలో మరింత బలోపేతం చేస్తానని పేర్కొన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీగా బీజేపీ వ్యవహారిస్తుందని సోము వీర్రాజు తెలిపారు. -
ఉపరాష్ట్రపతిని కలిసిన సోమువీర్రాజు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా సోము వీర్రాజును ప్రకటించిన తర్వాత మొదటసారి శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బీఎల్ సంతోష్, రాంమాధవ్లను కలిసి కేంద్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర నాయకత్వానికి సోమువీర్రాజు వివరించారు. (సుజనాకు ఝలక్ ఇచ్చిన ఏపీ బీజేపీ) -
సింగపూర్లో సాహిత్య సమ్మేళన వేడుకలు
సింగపూర్: శ్రీ సాంస్కృతిక కళా సారథి సంస్థ ఆవిర్భావ సందర్భంగా సింగపూర్లో నిర్వహించిన అంతర్జాతీయ సాహిత్య సమ్మేళన వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఆసాంతం రమ్యంగా సాగిన తెలుగు సాహిత్యారాధనలో వక్తలు తమ వ్యాసాలను, కవితలను, పద్యాలను, పాటలను శ్రోతలకు వినిపించారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాభినందనలతో కూడిన లేఖను పంపారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ, గరికిపాటి నరసింహారావు వారి సందేశాలను పంపారు. కార్యక్రమ విశిష్ట అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ‘జూమ్’ద్వారా పాల్గొని ప్రసంగించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు వంగూరి చిట్టెన్ రాజు, ప్రముఖ సినీ సంగీత విశ్లేషకులు రాజా గౌరవ అతిథులుగా పాల్గొని తెలుగు సాహిత్యంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కంభంపాటి సోదరులు, రెలారే రెలా జానకీరావు, రాంబాబు పద్యాలతో అలరించారు. ‘అలా సింగపురంలో..’పేరుతో తెలుగు సంస్కృతి గొప్పదనంపై తీసిన లఘు చిత్రం ట్రైలర్, సంస్థ వెబ్సైట్, ఆస్ట్రేలియాకు చెందిన ఉమా మహేశ్ రాసిన ‘అక్షరోద్యమం’ అనే పుస్తకాన్ని రామ్మాధవ్ సమక్షంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ నుండి భాస్కర్, అరుణ్, రాధాకృష్ణ,శిల్ప, ప్రావీణ్య, స్వాతి, శ్రీనివాస్ జాలిగామ, లక్ష్మి ప్రసాద్ రెడ్డి, రాధా శ్రీనిధి, వేణు మాధవ్, పాటూరి రాంబాబు, ఆస్ట్రేలియా నుండి కొంచాడ రావు, న్యూజిలాండ్ నుండి జగదీశ్వరరెడ్డి దంపతులు, హాంకాంగ్ నుండి జయ, యూకే నుండి జొన్నలగడ్డ మూర్తి, మలేసియా నుండి అచ్చయ్య కుమార్ రావు, కువైట్ నుండి వీర నరసింహరాజు, భరతభూమి నుండి లావణ్య, సూర్యప్రకాశరావు, రవీంద్ర బాబు, శివ శంకర్, ఖతార్, దక్షిణాఫ్రికా, ఒమన్, జర్మనీ తదితర దేశాలకు చెందిన రచయితలు పాల్గొన్నారు. కార్యక్రమ ముఖ్యనిర్వాహకుడిగా కవుటూరు రత్నకుమార్, సాంకేతిక నిర్వహణ బాధ్యతలను భాస్కర్, రాధాకృష్ణ నిర్వర్తించగా, వ్యాఖ్యాతగా రాధిక, సహ వ్యాఖ్యాతగా రామాంజనేయులు, నిర్వాహక వర్గ సభ్యులుగా శ్రీధర్, రాంబాబు, సుధాకర్ సేవలందించారు.‘శ్రీ సాంస్కృతిక కళాసారధి’ సంస్థ ద్వారా భవిష్యత్లో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించి వర్ధమాన కళాకారులను, రచయితలను ప్రోత్సహిస్తామని నిర్వాహకులు తెలిపారు. దాదాపు 14 దేశాల నుంచి సాహితీవేత్తలు హాజరైన సభగా, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈ కార్యక్రమానికి చోటు దక్కిందని సంస్థ అధ్యక్షుడు వెంటాచారి వెల్లడించారు. -
మోదీ రేటింగ్ 90 శాతానికి పైగానే..
(వెంకటేష్ నాగిళ్ల, సాక్షి ప్రతినిధి): అఖండ మెజారిటీతో రెండోసారి ప్రధాని అయిన తర్వాత నరేంద్ర మోదీ.. ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ అన్నారు. ముఖ్యంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎంతో ధీటుగా ఎదుర్కొన్నారని చెప్పారు. ఈ విపత్కర సమయంలో అన్ని రాష్ట్రాలను ఏకతాటిపై నడిపించారన్నారు. ప్రజలు సైతం ఆయనకు సబ్ కా విశ్వాస్ అంటూ అండదండలందించారని చెప్పారు. ఎక్కువ కాలం అధికారంలో ఉంటే వ్యతిరేకత పెరగడం సహజమని.. కానీ, దీనికి భిన్నంగా మోదీ రేటింగ్ 90శాతానికి పైగా ఉందని రామ్మాధవ్ వివరించారు. అలాగే.. ఈ ఏడాది కాలంలో ప్రధాని ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ప్రధాని మోదీ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రామ్మాధవ్ ‘సాక్షి ప్రతినిధి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ఆర్థిక రంగంపై.. ► 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీసాధించే దిశగా వెళ్తున్నాం. ► బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు తీసుకువస్తున్నాం. ► ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు అనేక సంస్కరణలు తీసుకువస్తున్నాం. కొత్త ప్యాకేజీలను ప్రకటించాం. ► పలు పథకాలను రాష్ట్రాలతో కలిసి అమలుచేస్తాం. కరోనా కట్టడిపై.. ► దేశ ఆర్థిక వ్యవస్థను పట్టా లెక్కించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ విపత్తు వచ్చింది. ► కరోనా కాలంలో రాష్ట్రాలన్నిటినీ ప్రధాని ఏకతాటిపై నడిపించారు. ► ఈ విషయంలో 130కోట్ల మంది ప్రధానికి అండగా నిలబడ్డారు. ► పేదలను ఆదుకునేందుకు వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ చేశాం, గ్యాస్ సిలిండర్లు అందజేశాం. ► రైల్వే శాఖ 30లక్షల మంది వలస కూలీలను స్వస్థలాలకు పంపించింది. ► కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఉచితంగా డబ్బులిచ్చే ప్యాకేజీ కాదు. ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే ప్యాకేజీ ఇది. ► రాష్ట్రాల అవసరం మేరకు కేంద్రం సహకారం అందిస్తుంది. అంతేతప్ప నేరుగా వారికి డబ్బులు ఇవ్వం. చైనాతో సంబంధాలపై.. ► చైనాతో భారత్ ఎప్పుడు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించలేదు. ► ఒక్క అంగుళం భూముని కూడా వదిలిపెట్టే ప్రసక్తిలేదు. ► మన సకారాత్మక దౌత్యనీతి ద్వారానే చైనా వెనక్కి తగ్గింది. ► ఎప్పటికీ భారత్ తన ఎల్ఏసి (వాస్తవాధీన రేఖ) వద్ద తన మౌలిక సదుపాయాలను పెంచుకుంటుంది. ► ఇక నేపాల్తో సమస్యలు దౌత్యపరంగా పరిష్కరిస్తాం. నేపాల్, భారత్లను ఎవరూ వేరు చేయలేరు. కశ్మీర్ అంశంపై.. ► ఆర్టికల్ 370 రద్దుచేశాం. ఇది జరిగి తొమ్మిది నెలలు గడిచినా ప్రజలు రోడ్లపైకి రాలేదు. ► దీని తర్వాత కశ్మీర్లో స్థానికంగా ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ లేదు. ► ఈ సంవత్సరాంతానికి కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతాయి. ► కరోనా కాలంలోనూ పాకిస్తాన్ బుద్ధి మారలేదు. ఈ సమయంలోనూ ఉగ్రవాదులను పంపుతోంది. ► అయినా మన భద్రతా బలగాలు వారిని కఠినంగా అణిచివేస్తున్నారు. ఇవేకాక.. ► రామమందిర నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటుచేశాం. ► ముస్లిం మహిళల చిరకాల వాంఛ ట్రిపుల్ తలాక్ను రద్దుచేశాం. -
మాధవ్ మన్కీ బాత్
-
ఏడాది పూర్తిచేసుకున్న సీఎంకు అభినందనలు
-
జగన్ దృఢసంకల్పంతో పనిచేస్తున్నారు
(వెంకటేష్ నాగిళ్ల, సాక్షి ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్ దృఢసంకల్పంతో పనిచేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, సీఎం జగన్కు మధ్య మంచి సత్సంబంధాలు కొనసాగుతున్నాయని.. అక్కడి రాష్ట్ర ప్రజల కోసమే ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. అంతేకాదు.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని మంచి నిర్ణయాలకు పార్లమెంట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు లభిస్తోందని.. దీనిని తాము స్వాగతిస్తున్నామన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ, అఖండ మెజారిటీతో తొలిసారి ఏపీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్.. ఇద్దరూ ఏడాది పాలన పూర్తిచేసుకున్న నేపథ్యంలో రామ్మాధవ్ శుక్రవారం ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏడాది పూర్తయిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ► దేవదాయ ఆస్తుల విషయంలో సాధుసంతుల కమిటీ ద్వారా నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరం. ఇది చాలా మంచి నిర్ణయం. అక్కడక్కడ కొన్ని వివాదాలు వస్తున్నా అవి పెద్దవి కావు. వాటిపై కొంచెం జాగ్రత్త వహించాలి. ► అన్నింటికీ ముఖ్యమంత్రిని తప్పుపట్టడం సరికాదు. ► విశాలమైన లక్ష్యాలను సాధించే క్రమంలో వాటిని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ► ఏపీ ప్రజల అభివృద్ధి కోసమే ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్ కలిసి పనిచేస్తున్నారు. ఏపీకి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్రం పూర్తి మద్దతుగా నిలిచి అండదండలు అందిస్తుంది. ► రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలతోపాటు దానికి మించి ఏపీకి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని చెప్పారు. ► 15వ ఆర్థిక సంఘం సైతం నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకునేందుకు వీలైనంత ఎక్కువ సాయం చేయాలని ఆలోచించింది. ► మేం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకమని భావించవద్దు. ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం. ► ఆంధ్ర రాష్ట్రం తక్కువ వనరులతో అవతరించింది. ఈ రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం చేయూత తప్పనిసరి. ► ఆంధ్ర వాడిగా నా వంతుగా నేను ఏపీ అభివృద్ధి కోసం కృషిచేస్తా. ► రెండోసారి ప్రధాని అయిన తర్వాత ప్రధాని మోదీ.. అచ్ఛేదిన్ నినాదం నుంచి ఆత్మనిర్భర్ భారత్ వరకు ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ► కరోనా మహమ్మారిని ఎంతో ధీటుగా ఎదుర్కొన్నారు. ► ఎక్కువ కాలం అధికారంలో ఉంటే వ్యతిరేకత పెరగడం సహజం.. కానీ, దీనికి భిన్నంగా ప్రధాని మోదీ రేటింగ్ 90శాతానికి పైగా ఉంది. -
ఏపీ అభివృద్ధికి కేంద్రం చేయూత తప్పనిసరి
-
మోదీ, జగన్ మధ్య సత్సంబంధాలు: రామ్మాధవ్
సాక్షి,న్యూఢిల్లీ: అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిపథంలో తీసుకెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్ ధృడ సంకల్పంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. అక్కడక్కడా కొన్ని వివాదాలున్నా అవేం పెద్దవి కాదని అభిప్రాయపడ్డారు. అన్నిటికీ ముఖ్యమంత్రిని తప్పుబట్టడం సరికాదని విమర్శకులకు హితవు పలికారు. దేవాదాయ ఆస్తుల విషయంలో సాధుసంతువుల కమిటీ ద్వారా.. నిర్ణయం తీసుకుంటామని సీఎం నిర్ణయించడం సంతోషకరమని రామ్మాధవ్ చెప్పుకొచ్చారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. (చదవండి: బాలకృష్ణలో ఆ బాధ కనిపిస్తోంది : ఇక్బాల్) మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని మంచి నిర్ణయాలకు.. వైఎస్ఆర్సీపీ మద్దతు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని రామ్మాధవ్ అన్నారు. పార్లమెంట్లో నిర్ణయాలకు వైఎస్ఆర్సీపీ నుంచి మంచి మద్దతు లభిస్తోందని తెలిపారు. ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్కు మధ్య సత్సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఎటువంటి ఒడిదుడుకులు లేవని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ప్రజల అభివృద్ధి కోసం ప్రధాని మోదీ, సీఎం జగన్ కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలతో పాటు, ఇతర అంశాలపై ఏపీకి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీయే చెప్పారని రామ్మాధవ్ గుర్తు చేశారు. 15వ ఆర్థిక సంఘం సైతం నూతనంగా ఏర్పడిన ఏపీని ఆదుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. వీలైనంత ఎక్కువ సహాయం చేయాలని ఆర్థిక సంఘం ఆలోచన చేసిందని ఆయన పేర్కొన్నారు. విభజన తర్వాత ఏపీ తక్కువ వనరులతో అవతరించింది రామ్మాధవ్ గుర్తు చేశారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం చేయూత తప్పనిసరిగా ఉంటుందన్నారు. ఏపీకి చెందినవాడిగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నిస్తానని రామ్మాధవ్ వెల్లడించారు. (చదవండి: ఏపీలో కొత్తగా 33 పాజిటివ్ కేసులు) -
భారత్ కేంద్రంగా నూతన ప్రపంచం
ఒకవైపు అమెరికా, ఐరోపా దేశాలు కరోనా వైరస్ ప్రభావాన్ని కట్టడి చేయడానికి కష్టపడుతోంటే, ఈ మహమ్మారిని ఆసియాలోని ప్రజాస్వామ్య దేశాలు సమర్థవంతంగా ఎదుర్కోగలగటం గమనార్హం. కోవిడ్–19ను ఎదుర్కోవడంలో ప్రజాస్వామ్య క్రియాశీలత కనపరచి భారతదేశం మిగతా వారికి ఓ ఉదాహరణగా నిలిచింది. దూరదృష్టి కల నేతల నేతృత్వంలోని ప్రజాస్వామ్య దేశాలు ఇటువంటి సవాళ్ళను ఉదారవాద విలువల విషయంలో రాజీ పడకుండా ఎదుర్కోగలవని మోదీ నిరూపించారు. ఇప్పుడిప్పుడే ఆవిష్కృతమవుతున్న నూతన ప్రపంచ క్రమంలో, మోదీ సూచించిన ‘మానవ కేంద్రక అభివృద్ధి సహకారం’ ఆధారంగా నూతన ప్రపంచ వ్యవస్థను నిర్మించటంలో అమెరికా, జర్మనీ దేశాలతో కలిసి భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషించగలదు. శతాబ్ద కాలం క్రితం అమెరికా, ఐరోపా దేశాలు, ఆ దేశాల కాలనీలలో పర్యటించా లంటే ప్రజలెవరికీ వీసాలు, పాస్ పోర్టుల అవసరం ఉండేది కాదు. మొదటి ప్రపంచ యుద్ధం వచ్చిన తరువాత పరిస్థితులు మారిపోయాయి. దేశాల సరిహద్దులు కఠినతరంగా మారాయి. ఆర్థిక వ్యవస్థ స్తంభించటం, ఆర్థికమాంద్యం పెరిగి పోవటం జరిగింది. జాతీయవాదం హద్దు మీరిన జాతీయవాదంగా పరిణమించటంతో రెండో ప్రపంచ యుద్ధం సంభవించింది. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత దేశాలన్నీ కలిసి ఒకరితో ఒకరికి సంబంధం ఉండేలా ఓ వ్యవస్థీకృత ప్రపంచ వ్యవస్థని రూపొందించుకొన్నాయి. అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ గత 65 సంవత్సరాలలో ప్రపంచ క్రమం అదే రీతిలో కొనసాగింది. ఆ ప్రపంచ క్రమాన్ని కరోనా విశ్వ మహమ్మారి ఆస్థిరపరచేలా ఉంది. దేశాలు అంతర్ముఖంగా, కొన్నైతే నిరంకుశంగా మారుతు న్నాయి. కొద్ది మంది రాజకీయ శాస్త్రజ్ఞులు తలుపులు మూసుకొని ఉండే సంకుచిత జాతీయవాదం ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతుందని చెబుతున్నారు. ప్రపంచీకరణ, స్వేచ్ఛా వాణిజ్యాలకు కాలం చెల్లిందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఈ నిరాశావాదం ఎక్కడ నుండి పుడు తోంది? దీనికంతటికీ కేవలం కరోనా వైరస్ కారణం కాకపోవచ్చు. అత్యంత శక్తివంతమైన దేశాలుగా భావించబడే రెండు దేశాలు యావత్ ప్రపంచ విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేశాయి. హూవర్ సంస్థకు చెందిన అమెరికా చరిత్రకారుడు నియాల్ ఫెర్గుసన్ వాటిని ‘చిమేరా’గా వర్ణించాడు. చిమేరా అంటే గ్రీకు పురాణాల్లో సింహం తలతో, మేక శరీరంతో, పాము తోకతో, నోటి నుండి మంటలను ఊదుతూ ఉండే ఓ భయం కర సంకర జీవి. గత దశాబ్దం పైగా అమెరికా, చైనాలు సృష్టించిన ఆర్థిక సంబంధ నమూనాను ఫెర్గుసన్ 20వ శతాబ్దం చివర వరకు అమెరికా, జపాన్ దేశాల మధ్య ఉన్న ‘నిచిబెయి’ ఆర్థిక బంధాన్ని పోలి ఉన్నదని పేర్కొన్నాడు. కరోనా వైరస్ చిమెరికా (చైనా, అమెరికా) అంటే కేవలం చిమేరా మాత్రమేనని తెలియజేస్తుంది. నిజాలను ప్రపంచం నుండి దాచిపెట్టి, వైరస్ చైనా సరిహద్దులను దాటి విశ్వ మహమ్మారిలా పరిణమించేలా చేసిందనే ఆరోపణలను చైనా ఎదు ర్కొంటున్నది. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న అమెరికన్ ఎంటర్ ప్రైజ్ ఇన్స్టిట్యూట్ అనే మేధో సంస్థకు చెందిన డెరెక్ సిసోర్స్ చైనాలో వైరస్ సంక్రమణ కేసులు అది అధికారికంగా చెపుతున్న దానికంటే అనేక రేట్లు అధికంగా ఉన్నాయని వాదిస్తున్నాడు. ఆచారబద్ధమైన పద్ధతులను అనుసరించని దేశాలలో చైనా ఒకటి. ‘చారిత్రక అనుభవం’ అనే మార్గాన్ని అనుసరిస్తున్నామని చైనా భావి స్తూంటుంది. దీర్ఘకాల పోరాటం లేదా విప్లవం తరువాత 1949లో మావో అధికారం హస్తగతం చేసుకోవటం కారణంగానే తాము నేడు ఈ స్థాయిలో ఉన్నామని చైనా భావిస్తుంది. చైనా వాళ్ళ ప్రపంచ వీక్షణ మూడు ముఖ్య సూత్రాల ఆధారంగా ఉంటుంది. అవి జీడీపీ వాదం– స్థూల జాతీయ ఉత్పత్తి వాదం, చైనా మధ్యస్థ వాదం–అన్నిటికీ చైనానే కేంద్రం అనే వాదం, చైనీయులు అసాధారణులనే వాదం– చైనీయులు మిగతా వారందరి కంటే భిన్నమైన, ఉన్నతమైన వారు అనే వాదం. అన్నిటికంటే ముఖ్యమైన తర్కం ఆర్థికాభివృద్ధి అని డెంగ్ జియా వోపింగ్ 1980లో పేర్కొన్నాడు. చైనా ఆర్థిక వేత్తలు దీనిని జీడీపీ వాదంగా వర్ణిస్తుంటారు. స్వతంత్రం, స్వయంప్రతిపత్తి, స్వయం సమృద్ధి ఉండాలని మావో నొక్కి చెప్పేవాడు. మాతృభూమిపై వాంగ్ షేన్ రచించిన భావగీతం చైనాలో ప్రఖ్యాత దేశభక్తి గీతం. పర్వతాలు, మైదానాలు, యాంగ్సీ, హుయాంగ్ నదులతో కూడిన ప్రియమైన మన మాతృభూమి అందమైనది, వైభవోపేత మైనది అని ఆ పాటలో ఉన్న వర్ణన చైనీయుల మనస్సులలో గాఢంగా నాటుకుపోయింది. చైనా కేంద్రక వాదం చైనాలో ప్రబలంగా ఉంటుంది. మూడవది, చైనీయులు అసాధారణమనే వాదం. ఇతరుల నుంచి నేర్చుకోవటాన్ని చైనా విశ్వసించదు. సమస్యల పరిష్కారం కోసం సొంత జ్ఞానాన్నే వాడాలని చైనా నాయకులు పదేపదే చెపుతుం టారు. చైనీయుల జాతీయవాద ప్రపంచ దృక్కోణం రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు కాలంలో జర్మనీ దృక్పథాన్ని పోలిఉంది. 1930 లలో జర్మన్ జాతి పరమైన ఆధిపత్యం, చరిత్రాత్మక హక్కులను ప్రస్తా వించటం, జాతిపరంగా తాము సర్వోత్తమమనే భావం తెలిసిందే. అంతకుముందు చెకోస్లోవేకియాకి చెందిన సుదేటెన్లాండ్ అనే జర్మన్ భాష మాట్లాడే ప్రాంతాన్ని హిట్లర్ ఆక్రమించినపుడు ఐరోపా అతడిని ఎదుర్కోవటానికి బదులుగా సంతృప్తిపర్చడానికి ప్రయ త్నించింది. బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ వంటి ఐరోపా దేశాలు హిట్లర్తో మ్యూనిచ్ ఒప్పందం కుదరటంతో సంబరపడుతుండగా, నాటి అమె రికా అధ్యక్షుడు రూజ్వెల్ట్, మీ ఈ చర్య యావత్ మానవాళికి మీరు చేసిన అసాధారణ చారిత్రాత్మక సేవగా కోటానుకోట్ల ప్రజలు గుర్తిస్తా రని హిట్లర్ను పొగిడాడు. ఇక మీదట ఆక్రమణలకు పాల్పడనని చేసిన వాగ్దానాన్ని దురదృష్టవశాత్తు ఒప్పందం కుదిరిన సంవత్సరం లోపే హిట్లర్ ఉల్లంఘించటంతో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అయ్యింది. 1939–40 కాలంలో బ్రిటన్ ఏ పరిస్థితిలో ఉందో ప్రస్తుతం అమెరికా అదే పరిస్థితిలో ఉంది. అమెరికాలోని రాష్ట్రాలను కరోనా వైరస్ బీభత్సానికి గురిచేసిన తరువాతగానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేల్కొనలేదు. కరోనా వైరస్ అమెరికాలో విజృంభిం చనున్నదనే హెచ్చరికలు చేసే వారిని పట్టించుకోవద్దంటూ ఫిబ్రవరి 28నాడు దక్షిణ కరోలినాలోని తన మద్దతుదారులను ట్రంప్ కోరారు. మీడియా హిస్టీరియాతో ప్రవర్తిస్తున్నదని చెబుతూ, కరోనా వైరస్ ప్రబ లబోతున్నదంటూ మీడియా పేర్కొనటాన్ని గాలివార్తలుగా ట్రంప్ కొట్టిపారేశాడు. చైనా ప్రతిపాదించిన బెల్ట్ అండ్ రోడ్ ప్రణా ళికలోని లాభాల కోసం చైనాను కౌగలించుకొన్న ఐరోపా దేశాలు కరోనా వైరస్ ప్రభావాన్ని కట్టడి చేయటానికి కష్టపడుతున్నాయి. ఈ మహమ్మారిని ఆసియాలోని ప్రజాస్వామ్య దేశాలు సమర్థ వంతంగా ఎదుర్కోగలగటం గమనార్హం. సగటున ఒక రోజులో అమె రికా కంటే ఎక్కువ కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపిన దక్షిణ కొరియా అందరికంటే ముందు నిలబడింది. సింగపూర్ విస్తృతంగా పరీక్షలు జరుపుతూ వైరస్ లక్షణాలను కనుగొనే భారీ ప్రయత్నం చేసింది. గతంలో సార్స్ వైరస్ కారణంగా మరణాలను చవిచూసిన అను భవంతో హాంకాంగ్æ, తైవాన్లు కరోనా వైరస్ని సమర్థవంతంగా కట్టడి చేయటానికి సమయోచిత చర్యలు తీసుకున్నాయి. కోవిడ్– 19ను ఎదుర్కోవడంలో ప్రజాస్వామ్య క్రియాశీలత కనపరచి భారత దేశం మిగతా వారికి ఓ ఉదాహరణగా నిలిచింది. పూర్తి స్థాయి ప్రజా మద్దతుతో లాక్ డౌన్ అమలు పరచటం, భౌతిక దూరం పాటించే నిరోధక చర్యలు తీసుకోవటం ద్వారా ప్రధాన మంత్రి సహచరులతో పాటుగా ముందుండి దేశాన్ని నడిపిస్తున్నారు. నూట ముప్పై కోట్ల ప్రజలున్న దేశంలో మే ఒకటి నాటికి 35,365 యాక్టివ్ కేసులు నమోదై ఉన్నాయి. ఉద్దేశపూర్వక కవ్వింపు చర్యలు, ఇస్లామోఫోబియా అనే తప్పుడు ప్రచారాలను ఎదుర్కొన్నప్పటికీ మోదీ ఎటువంటి ఏకపక్ష, నిరంకుశ చర్యలకు ఉపక్రమించలేదు. కవ్వింపు చర్యలు ఎదురుగా కనపడుతున్నప్పటికీ మోదీ నిబ్బరంగా, శాంతంగా, ఆశావాద దృక్పథం కనపరచారు. దూరదృష్టి కల నేతల నేతృత్వంలోని ప్రజాస్వామ్య దేశాలు ఇటువంటి సవాళ్ళను ఉదార వాద విలువల విషయంలో రాజీ పడకుండా ఎదుర్కోగలవని నిరూపించారు. ఇప్పుడిప్పుడే ఆవిష్కృతమవుతున్న నూతన ప్రపంచ క్రమంలో, మోదీ సూచించిన ‘మానవ కేంద్రక అభివృద్ధి సహకారం’ ఆధారంగా నూతన ప్రపంచ వ్యవస్థను నిర్మించటంలో అమెరికా, జర్మనీ దేశాలతో కలిసి భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషించగలదు. పర్యావరణం, ఆరోగ్య సంరక్షణ, సాంకేతిక విజ్ఞానం, ప్రజా స్వామ్య ఉదారవాదం ఆధార స్తంభాలుగా కొత్త ప్రపంచ వ్యవస్థ సంస్థాగత నియమావళి ప్రకటించే సమయం ఆసన్నమౌతోంది. అంతర్గతంగా అశాంతిని, అంతర్జాతీయంగా నిందలు ఎదుర్కొంటు న్నప్పటికీ చైనాకు ఒక అవకాశం ఉన్నది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ వాడు కలో ‘లూక్సియాన్ డౌజ్హేంగ్’ అనే పదబంధం ఉంది. దాని అర్థం ఆకృతి, విధానం నిర్ధారించే పోరాటం. అధికారం కోసం పోరాటం అని కొందరు అర్థం చేసుకున్నప్పటికీ, పార్టీ కొత్త విధానాన్ని నిర్ణయించే పోరాటం అనే అర్థం సైతం ఉన్నది. అటువంటి పోరాటాలు గతంలో ఎన్నో జరిగాయి. నేటి ప్రపంచం అటువంటి మెరుగైన పోరాటం కోసం ఆశించవచ్చా? రాం మాధవ్ వ్యాసకర్త భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇండియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులు -
జన విశ్వాసమే మోదీ ఆయుధం
కరోనాపై యుద్ధంలో 130 కోట్ల భారతీయుల విశ్వాసమే మోదీ ఆయుధం. మోదీ ప్రజల్లో సహజసిద్ధంగా అంతర్గతంగా ఉండే మంచితనాన్ని ప్రేరేపించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. తన సందేశంలో మోదీ ప్రజలను భగవత్ స్వరూపులుగా వర్ణించి వారి మహాశక్తిని, విరాట్ స్వరూపాన్ని ప్రదర్శించమని కోరారు. కరోనా పోరాట యోధుల్ని అభినందిస్తూ కరతాళధ్వనులను చేయమన్నప్పుడు, వారికొరకు దీపాలు వెలిగించమని పిలుపు ఇచ్చిన సందర్భంలోనూ లభించిన అపూర్వ ప్రజాస్పందన మోదీ వెనుక ప్రజలు స్థిరంగా నిలబడ్డారని సూచించింది. మోదీ ప్రజలను కేవలం ఓటర్లుగానో లేక ప్రేక్షకులుగానో చూడలేదు. పాలనలో ప్రజలను పాత్రధారులుగా చేశారు. ఇది మోదీ ప్రభుత్వం ముఖ్యమైన లక్షణం. హంగేరి దేశ ప్రధాని విక్టర్ ఒర్బాన్ కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్–19)పై తన పోరాటానికి పార్లమెంట్ ఆటంకపరుస్తున్నదని భావించారు. పార్లమెంటులో తనకున్న ఆధిక్యతను ఆసరాగా తీసుకుని అత్యవసర అధికారాలను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన న్యాయవ్యవస్థ సమీక్షకు అవకాశం లేని ఉత్తర్వుల ద్వారా హంగేరిని పాలిం చవచ్చు. ఆయన ఉత్తర్వులను విమర్శిస్తే ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అసాధారణ సమయాల్లో అసాధారణ నిర్ణయాలు అవసరం. అందులో కొన్ని సమర్థనీయమే. కానీ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని అనువుగా తీసుకుని కొందరు నాయకులు సర్వాధికారాలు చేజిక్కిం చుకుని నియంతలుగా మారుతున్నారని విమర్శకులు పేర్కొంటున్నారు. అయితే మనం రష్యా లేక చైనా గురించి మాట్లాడటం లేదు. సాంప్రదాయిక ప్రజాస్వామ్య దేశాలైన బ్రిటన్, ఇజ్రాయెల్లకు కూడా విశ్వ మహమ్మారిపై పోరులో అత్యవసర అధికారాలు వాడుకోవడం తప్పలేదు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు న్యాయస్థానాలను మూసివేయవలసిందిగా ఆదేశించారు. అవినీతి కేసులో నేర విచారణ నుండి స్వయంగా తప్పించుకోవడానికే ఈ చర్య తీసుకున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. నెతన్యాహు దేశ అంతర్గత భద్రతా సంస్థలను పౌరులపై విస్తృత నిఘా విధించేందుకు అనుమతించారు. ఇజ్రాయెల్లో లాక్డౌన్ ఉల్లం ఘించిన వారికి ఆరునెలల కారాగార శిక్ష విధిస్తున్నారు. స్థిరమైన ప్రజాస్వామ్య సంస్థలు, పద్ధతులు కలిగి ఉన్న యునైటెడ్ కింగ్డమ్లో సైతం మహమ్మారి సంబంధిత బిల్లును వేగిరంగా ఆమోదింప చేసుకోవడం ద్వారా వివిధ మంత్రిత్వ శాఖలకు విశేషాధికారాలు కల్పించారు. ఈ చట్టం వ్యక్తులను కాలపరిమితి లేకుండా నిర్బంధించే అధికారాన్ని కల్పిస్తుంది. బ్రిటన్ ఆరోగ్య శాఖ కార్యదర్శి మాట్ హాంకాక్ సాధారణంగా బ్రిటన్ వ్యవహరించే తీరుకు ఇది భిన్నమైనదేనని అంగీకరించారు. ఫిలిప్పైన్స్ దేశాధ్యక్షుడు రోడ్రిగో డ్యూటీర్ట్, థాయ్ లాండ్ ప్రధానమంత్రి ప్రయూత్ చాన్ ఓచ్లు విశేష అధికారాలు కల్పించుకున్నారు. ఇటలీ, స్పెయిన్ దేశాలు వేలాది ప్రజ లను వేరువేరుగా ఉంచడానికి, క్వారంటైన్ చేయడానికి సైన్యంపై ఆధారపడవలసి వచ్చింది. హంగేరి, లెబనాన్, మలేసియా, పెరూ మొదలైన దేశాలు ఆంక్షలను అమలు చేయడం కోసం సైన్యాన్ని వీధుల్లోకి తీసుకురావలసి వచ్చింది. జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్లు కూడా సాయం కోసం సైన్యం వైపు చూడవలసి వచ్చింది. యునైటెడ్ కింగ్డమ్ ఇరవై వేలమంది సైనికులతో ‘కరోనా స్పందన సమూహాన్ని’ ఏర్పర్చింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మొదటి దశలో వ్యక్తులను విచారణ లేకుండా నిరవధికంగా నిర్బంధించే విశేషాధికారం కల్పించుకోవడానికి, దేశంలో ఆశ్రయం కోరే విదేశీయులకు చట్టబద్ధంగా ఉన్న హక్కులను రద్దు చేయడానికి ప్రయత్నం చేసినా, అమెరికన్ కాంగ్రెస్ జోక్యంతో న్యాయ మంత్రిత్వ శాఖ కోరికల చిట్టా నీరుగారింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం అక్కడి రాష్ట్రాల గవర్నర్లకు లాక్డౌన్ విషయంలో సర్వాధికారాలు ఉండ టంవల్ల దేశాధ్యక్షుడు ట్రంప్ అధికారాలు కాస్తంత పరిమితమైనవిగానే ఉన్నాయి. అలా వివిధ దేశాల్లో జరుగుతున్న పరిణామాలను భారతదేశంలో జరుగుతున్న దానితో పోల్చి చూస్తే, ప్రధాని నరేంద్ర మోదీ ఎటువంటి అత్యవసర అధికారాలకోసమో, విశేషాధికారాల కోసమో అడుగలేదు. సెన్సార్షిప్ విధించడమో లేక విచారణ లేకుండా నిర్బంధించే చర్యలకో దిగలేదు. ప్రచార మాధ్యమాల గొంతు నొక్కుతున్నారంటూ వినపడుతున్న అపస్వరాలన్నీ అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నవే. సుప్రీంకోర్టు కేవలం తప్పుడు వార్తల పట్ల జాగ్రత్త వహించమని, అధికార గణాంకాలకు చోటివ్వమని మాత్రమే మీడియాను కోరింది. మోదీ సైన్యం సాయం తీసుకోవాలని అనుకోలేదు. ప్రజల ప్రాథమిక మానవ హక్కులను కొట్టిపారేయలేదు. చాలావరకు లాక్డౌన్ సూచనలన్నీ ప్రజాహితం కోరి చేస్తున్నవే. ప్రజలు స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కఠిన చర్యలకు ఉపక్రమించాలని మోదీకి ఎవరో సలహా ఇవ్వకపోలేదు. మోదీ నిరంకుశ అధికారాల మీద కాకుండా, ప్రజాస్వామ్య మాధ్యమాల మీదే ఆధారపడ్డారు. తాను స్వయంగా ప్రపంచ యుద్ధం తరహా పరిస్థితిగా వర్ణించిన పరిస్థితుల్లో కూడా మోదీ మౌలిక మానవ హక్కులను ఆదరిస్తూ ప్రజాస్వామ్యవాదిగా నిలబడగలిగారు. కరోనాపై యుద్ధంలో 130 కోట్ల భారతీయుల విశ్వాసమే మోదీ ఆయుధం. ఇటీవల మోదీ జాతికి ఇచ్చిన సందేశంలో శాసనం (రాజకీయ నాయకత్వం) ప్రశాసనం (ప్రభుత్వోద్యోగులు) జనతా జనార్దన్ (దైవాంశ సంభూతులైన ప్రజలు) కరోనాపై తన పోరాట సమూహమని పేర్కొన్నారు. దేశంలో సగం రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నా మోదీ ఎలాంటి వ్యతిరేకతనూ ఎదుర్కోలేదు. ఇది మోదీ విశ్వసనీయత స్థాయి ఉన్నతంగా ఉందని తెలియజేస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ సుయేమోల మధ్య ఇటీవల కాలంలో వాగ్వివాదం చోటు చేసుకోవడం గమనార్హం. ‘ప్రజల ద్వారా, ప్రజల కొరకు, ప్రజలచే’ ప్రభుత్వం ఉండటమే ప్రజాస్వామ్యమని గంభీర ప్రకటనలు వింటుం టాం కానీ చాలా దేశాల్లో ప్రజలచేత విషయాలు నిర్వహించడం అనేది అరుదు. కానీ మోదీ దాన్ని మార్చివేశారు. మోదీ ప్రజలను కేవలం ఓటర్లుగానో లేక ప్రేక్షకులుగానో చూడలేదు. పాలనలో ప్రజలను పాత్రధారులుగా చేశాడు. ఇది మోదీ ప్రభుత్వం ముఖ్యమైన లక్షణం. స్వచ్ఛ భారత్ పేరున పారిశుధ్యం కోసం చేసిన మొట్టమొదటి భారీ ప్రచారోద్యమం నుంచి నేటి మహమ్మారితో పోరాటం వరకు ప్రజలను ఎక్కువగా క్రియాశీల పాత్రధారులను చేసే ప్రత్యేకమైన నేర్పును మోదీ కనబరిచారు. ఫ్రాన్సిన్ ఫుకుయామా అనే రాజకీయ శాస్త్రవేత్త చట్టబద్ధమైన పాలన, చట్టంచేత పాలనల మధ్య ఆసక్తికరమైన వ్యత్యాసాన్ని పేర్కొన్నారు. రాజ్యాంగం ఏర్పర్చిన నియమాలు శిరోధార్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో చట్టబద్ధపాలన సాగుతుంది. నియంతలు మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా చట్టం అదనుగా పాలన చేయాలని చూస్తారు. మోదీ చట్టబద్ధమైన పాలన పట్ల నిబద్ధతను స్పష్టంగా కనబరిచారు. తబ్లిగీ జమాత్ మర్కజ్ అనే మతవర్గం లాక్డౌన్ నిబంధనలు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, భారీ సంఖ్యలో వలస కార్మికులు తమతమ ప్రాంతాలకు తరలిపోవడం వంటి రెచ్చగొట్టడానికి ఆస్కారం ఉన్న సంఘటనలు జరిగాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా లాక్డౌన్ నియమాలను ఉల్లం ఘించిన సంఘటనలు సైతం ఉన్నాయి. అయినప్పటికీ మోదీ తన కార్యపద్ధతి నమూనాను మార్చుకోలేదు. మోదీ ప్రజల్లో సహజ సిద్ధంగా అంతర్గతంగా ఉండే మంచితనాన్ని ప్రేరేపించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. తన సందేశంలో మోదీ ప్రజలను భగవత్ స్వరూపులుగా వర్ణించి వారి మహాశక్తిని, విరాట్ స్వరూపాన్ని ప్రదర్శించమని కోరారు. కరోనా పోరాట యోధుల్ని అభినందిస్తూ కరతాళధ్వనులను చేయమన్నప్పుడు, వారికొరకు దీపాలు వెలిగించమని పిలుపు ఇచ్చిన సందర్భంలోనూ లభించిన అపూర్వ ప్రజాస్పందన మోదీ వెనుక ప్రజలు స్థిరంగా నిలబడ్డారని సూచించింది. మోదీ విశ్వ మహమ్మారి కరోనాపై పోరును మరో స్థాయికి తీసుకుని వెళ్లారు. శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ, సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగిస్తూ, కరోనా వ్యతిరేక పోరులో 130 కోట్లమంది ప్రజలను పాత్రధారులను చేశారు. దూరదృష్టితో, తనదైన విలక్షణ పద్ధతిని అవలంబిస్తూ ‘మానవ కేంద్రిత అభివృద్ధి సహకారం’ అనే నమూనాను మోదీ ప్రపంచం ముందు ఆవిష్కరించారు. (వ్యాసంలో అభిప్రాయాలు వ్యక్తిగతం) రాం మాధవ్ వ్యాసకర్త బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులు -
అధ్యక్ష తరహా ఎన్నికపై చర్చ జరగాలి
సాక్షి, రాయదుర్గం: స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిని, అధ్యక్ష తరహాలో ప్రధానిని ప్ర త్యక్షంగా ఎన్నుకోవాలనే ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా తాము సానుకూలమేనని బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పేర్కొన్నారు. దామాషా పద్ధతిన ఎన్నికల నిర్వహణపై కూడా చర్చ జరగాలన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్, ఐఎస్బీ, హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్– మనీ పవర్ ఇన్ పాలిటిక్స్’ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒకే దేశం, ఒకేసారి ఎన్నికల నిర్వహణపై కూడా అన్ని రాజకీయపార్టీలు చర్చించి ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర దేశాల్లోని అధ్యక్షతరహా, దామాషా ఎన్నికల వంటి మార్పుల కోసం ప్రయత్నిస్తూనే, ఇప్పటికే ఉన్న వ్యవస్థను సరిదిద్దే పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సిన అవసరం ఉందని, పార్లమెంటులో 1,000 స్థానాలు ఉండాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అభిప్రాయపడ్డారని గుర్తు చేశారు. చట్టవిరుద్ధం కాకూడదు రాజకీయాల్లో డబ్బు అవసరమేరనని, అయితే అది చట్టవిరుద్ధం కాకూడదని కేంద్ర ఎన్నికల కమిషనర్ అ««శోక్ లావాసా పేర్కొన్నారు. సెలబ్రిటీల ప్రచారం, పార్టీలకు సొంత మీడియా దగ్గుర్నుంచి అనేక కోణాల్లో ఎన్నికల్లో వ్యయంపై చర్చ జరగాలన్నారు. ఎన్నికల సంస్కరణల గురించి సీఎంలు ఎన్నడూ మాట్లాడినట్లు తాను చూడలేదన్నారు. ఎన్నికల్లో నమోదైన కేసుల గురించి హోంమంత్రులు పట్టించుకోవటం లేదన్నారు. ఒక పరిధి దాటి ఎన్నికల్లో డబ్బు వ్యయాన్ని కట్టడి చేసే శక్తి ఈసీకి లేదన్నారు జమిలి ఎన్నికలతో మార్పు రాదు స్థానిక స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఒకేసారి(జమిలి) ఎన్నికలు నిర్వహించటం వల్ల పెద్ద మార్పురాదని ఎఫ్డిఆర్ ప్రధాన కార్యదర్శి జయప్రకాశ్నారాయణ్ అన్నారు. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రిని ప్రత్యక్షంగా ఎన్నుకునే విధంగా ఎన్నికల వ్యవస్థను సవరించాలన్నారు. కాలిఫోర్నియా యూనివర్శిటీ ప్రొఫెసర్ ప్రదీప్చిబ్బర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐఎస్బీ అసోసియేట్ ప్రొఫెసర్ అశ్వినిచాత్ర, హెచ్సీయూ ప్రొఫెసర్ కె.సి.సూరి, అంతకుముందు సమావేశంలో శివసేన ప్రతినిధి ప్రియాంకా చతుర్వేది,స్వరాజ్య ఎడిటోరియల్ డైరెక్టర్ ఆర్ జగన్నాథన్ తదితరులు ప్రసంగించారు. 4 అంశాలతో ‘హైదరాబాద్ డిక్లరేషన్’ ‘ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్– మనీ పవర్ ఇన్ పాలిటిక్స్’పేరిట రెండ్రోజులపాటు నిర్వహించిన సదస్సు ముగింపు వేడుకల్లో జయప్రకాశ్ నారాయణ నాలుగు అం«శాలతో కూడిన హైదరాబాద్ డిక్లరేషన్ను ప్రకటించారు. అందులో... రాజకీయాల్లో డబ్బు వల్ల కలిగే పరిణామాలపై పౌరుల్లో అవగాహన పెంచాలి. పౌరులు, పౌరసమాజ సంఘాలు, ఎన్నికల సంఘం సమిష్టిగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీల ప్రజాస్వామ్య పనితీరును నిర్ధారించడానికి, రాజకీయరంగంలోకి డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి బలమైన చట్టపరమైన వ్యవస్థ అవసరం. పార్టీలు తమ వార్షిక ఆదాయ,వ్యయాలను సకాలంలో ప్రకటించాలి. ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస ఆర్థిక సహాయం ఉండాలి. రాజకీయాల్లో చట్టవిరుద్ధమైన డబ్బు శక్తి, బహుమతులు ఇవ్వడాన్ని తగ్గించడానికి ఉత్తమ మార్గాలు అవసరం. దేశంలో పెద్ద మొత్తంలో నగదు, మద్యం పంపిణీ, ప్రచార వ్యయానికి మించి జరుగుతోంది. దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. -
రాజకీయాల కోసం ముస్లింలను వాడుకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టంపై (సీఏఏ) అవగాహన లేకుండానే ప్రతిపక్ష నేతలు వ్యతిరేకిస్తున్నారని, కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా విభేధిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పేర్కొన్నారు. సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చాలామంది నేతలకు సరిగ్గా తెలియదని విమర్శించారు. ప్రజ్ఞాభారతి, సోషల్ కాజ్ సంయుక్తాధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో భారత్కు సీఏఏ ఎందుకు అవసరమన్న అంశంపై సదస్సు జరిగింది. ఇందులో రాంమాధవ్ ప్రధాన వక్తగా ప్రసంగించారు. దేశంలో ప్రతిపక్ష నాయకులది నాలెడ్జ్ ప్రూఫ్ విధానమని, గడియారాల్లోకి వాటర్ పోకుండా ఎలా వాటర్ ప్రూఫ్ ఉంటుందో.. ప్రతిపక్ష నేతలు తమ మెదళ్లలోకి సమాచారం వెళ్లనీయకుండా నాలెడ్జ్ ప్రూఫ్గా తయారయ్యారని ఎద్దేవా చేశారు. మతపరంగా రెచ్చగొట్టి, విభజన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలోని ముస్లింలు వారి మాటలను నమ్మొద్దని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు తమ రాజకీయాల కోసం ముస్లింలను బలి పశువులను చేస్తున్నాయని మండిపడ్డారు. మన దేశంలోనే 72 రకాల తెగలకు చెందిన ముస్లింలు ఉన్నారని, మన దేశంలో ఉన్న ఇన్ని రకాల ముస్లింలు మరెక్కడా లేరని చెప్పారు. ఈ చట్టం దేశంలో ఉన్న వారి కోసం కాదని వివరించారు. శరణార్థులుగా వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వాల్సిన బాధ్యత దేశంపై ఉందని, కేంద్రం అదే పని చేస్తోందని స్పష్టం చేశారు. కొన్ని నియమ నిబంధనలు పాటిస్తే ఎవరైనా దేశ పౌరసత్వం పొందొచ్చని, మతపరమైన కారణాలతో పౌరసత్వాన్ని నిరాకరించే అధికారం ఎవరికీ లేదని తెలిపారు. అందుకే సోనియాగాంధీ, అద్నాన్ సమీకి పౌరసత్వం లభించిందని గుర్తుచేశారు. భయపడాల్సిన పనిలేదు.. ఈ దేశ పౌరులు ఏ మతానికి చెందిన వారైనా, ఏ చట్టానికి భయపడాల్సిన అవసరం లేదని, విదేశాల నుంచి అక్రమంగా వచ్చిన వారిని మాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదని రాంమాధవ్ పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనల మేరకు కేంద్రం సీఏఏ తీసుకొచ్చిందని తెలిపారు. మోదీని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రతిపక్షాలు మతపరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు. అసోం ప్రజల ఆందోళనలో అర్థం ఉందని, కేంద్ర ప్రభుత్వం దాన్ని గౌరవిస్తోందని చెప్పారు. ప్రజ్ఞాభారతి చైర్మన్ హనుమాన్ చౌదరి మాట్లాడుతూ.. దేశంలోని మేధావులు అనేకమంది సీఏఏకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. దేశ విభజనను కాంగ్రెస్ చేస్తే, కమ్యూనిస్టులు సమర్థించారని ఆరోపించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులే వేర్పాటువాదులని విమర్శించారు. కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాను చేసిందని చెప్పారు. అలాంటి వారివల్లే దేశం ఇస్లామీకరణ వైపు పోతోందని దుయ్యబట్టారు. సదస్సులో మాజీ డీజీపీ అరవిందరావు, నలంద యూనివర్సిటీ వైస్చాన్స్లర్ సునయనసింగ్, మాజీ ఎంపీ వివేక్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సీఏఏపై వివరణ ఇచ్చిన రాం మాధవ్
సాక్షి, హైదరాబాద్ : పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి దీని గురించి పూర్తిగా తెలియాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధమ్ అన్నారు. హైదరాబాద్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ చట్టంపై కొంతమంది తెలియక.. కొంతమంది తెలుసుకోవాలని.. మరికొంత మంది తెలివి లేక పోరాడుతున్నాని వ్యాఖ్యానించారు. దేశంలో 90 శాతం మంది భారతీయులు సీఏఏను స్వాగతిస్తున్నారని వెల్లడించారు. మిగిలిన పది శాతం మందికి కూడా దీనిని స్వాగతించేలా అర్థం చేయాలనేదే తమ ఉద్దేశ్యమని తెలిపారు. భారత దేశంలో నివసిస్తున్న.. ఇక్కడే పౌరులుగా ఉన్న వారికి సంబంధించిన బిల్లు కాదని వివరించారు. పౌరసత్వ చట్టంలో అనేక క్లాజులు ఉన్నాయని, శరనార్థులు పక్క దేశం నుంచి వచ్చి దశాబ్దాల కాలంగా ఇక్కడే సెటిల్ అయ్యేవారి కోసమే ఈ చట్టమని స్పష్టం చేశారు. ఎన్నార్సీలో రిలీజియన్ అంశమే ఉండదని, సెక్యులర్ స్పిరిట్కు బీజేపీ కుట్టుబడి ఉందన్నారు. మానవత్వం అదరికీ సమానంగా ఉంటుందని, కాంగ్రెస్ నేతలు వారి చరిత్రనే చదవలేరు కానీ ఎన్నార్సీని ఏం చదువుతారని ఎద్దేవా చేశారు. శరనార్థులకు పౌరసత్వం ఇవ్వాలని మొదటి ప్రధాని నెహ్రూనే చెప్పారని రాం మాధవ్ గుర్తు చేశారు. గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించామని, అప్పట్లో బ్రిటిష్ పాస్ పోర్టు ఉన్న వారు ఉగాండా నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిందన్నారు. భారతదేశం నుంచి బ్రిటన్ పాస్ పోర్టుతో ఉగాండా వెళ్ళిన వారికి ఇందిరా గాంధీ పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించారన్నారు. రాహుల్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ముస్లిం దేశాల్లో ఎక్కడా ముస్లింలు స్వేచ్ఛగా లేరని, భారతదేశంలో మాత్రమే స్వేచ్ఛగా ఉంటున్నారని పేర్కొన్నారు. బిల్లును రాష్ట్రాలు కాదు నేతలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. క్రిస్టియన్లు శరనార్థులుగా కేరళకు రాగా వారిని ఆదరించామని, ఎవరు వచ్చిన స్వాగతించడం మన రక్తంలోనే ఉందని ప్రస్తావించారు. 2014 డిసెంబర్ 31 ముందు వచ్చిన శరనార్థులకు ఈ చట్టం వర్తిస్తుందని, అవాస్తవాలతోనే ప్రజలు ఆస్థులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. అస్సాం చిన్న రాష్ట్రం అవ్వడం వలన అక్రమ వలసలు కొనసాగాయన్నారు. ఉప ఎన్నికల్లో లక్ష కొత్త ఓటర్లు వచ్చారని, 1971 కటాఫ్ ఇయర్గా పెట్టామని తెలిపారు. అస్సామీలకు భాష, సంస్కృతిలో పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. భారత్ రక్షణ కోసం భారత ప్రభుత్వం కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు. -
విపక్షాలపై రాంమాధవ్ మండిపాటు
-
సోనియా గాంధీకి పౌరసత్వం ఇవ్వలేదా?
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నాయకులు మిడిమిడి జ్ఞానంతో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. ప్రతిపక్ష నాయకుల బుర్రలోకి సరైన సమాచారం పోలేదని విమర్శించారు. పౌరసత్వ చట్టం ఎందుకు వ్యతిరేకిస్తున్నారో వాళ్లకే తెలియట్లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పౌరసత్వ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 130 కోట్ల భారతీయ ప్రజలకు దీనితో సంబంధం లేదని పేర్కొన్నారు. మతపరమైన కారణాలతో పౌరసత్వం రద్దు చేయరని స్పష్టం చేశారు. పొరుగు దేశం నుంచి భారత్కు వచ్చేవారి కోసమే ఈ చట్టాన్ని రూపొందించారని రాంమాధవ్ తెలిపారు. ఈ లెక్కన సోనియా గాంధీకి భారత పౌరసత్వం ఇవ్వలేదా అని ప్రశ్నించారు. చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లకు వాస్తవాలు తెలియడం లేదని అభిప్రాయపడ్డారు. శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడం మన దేశ బాధ్యతగా అభివర్ణించారు. దివంగత నేత, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే ప్రయత్నం చేయలేదని గుర్తుచేశారు. కానీ నేడు ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని అమలు చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. -
టీడీపీ మునిగిపోతున్న నావలాంటిది
-
తెలుగుదేశం పార్టీలో ఎవరూ మిగలరు...
సాక్షి, గుంటూరు : గాంధీజీ సంకల్పయాత్ర ర్యాలీని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ బుధవారం గుంటూరు జిల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..టీడీపీ మునిగిపోతున్న నావలాంటిదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఆ పార్టీలో ఎవరూ మిగలరని జోస్యం చెప్పారు. వలసలను ఆపటానికి బీజేపీతో పొత్తు గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని, ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదని స్పష్టం చేశారు. అంతేగాకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ప్రత్యామ్నాయంగా, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నామని రాంమాధవ్ తెలిపారు. -
ఏపీలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరించేందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తెలిపారు. నగరంలో బీజేపీ సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంమాధవ్ మాట్లాడుతూ.. ‘సామాన్య ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలు అందేలా చేస్తాం. ఏపీలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం. తన పార్టీ నుంచి వలసలను ఆపేందుకు బీజేపీతో పొత్తు గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబు పరిస్థితి ఆకులు కాలాక చేతులు పట్టుకున్న చందంగా ఉంది. మాకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం. రాష్ట్రంలో ఏ పార్టీకి జూనియర్ పార్టీగా వ్యవహరించం.’ అని స్పష్టం చేశారు. -
కశ్మీర్ అభివృద్ధే ప్రథమ ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: జమ్మూ,కశ్మీర్ అభివృద్ధే తమ ప్రథమ ప్రాధాన్యం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు.త్వరలోనే కశ్మీర్ ప్రజలకు అన్ని రాజకీయహక్కులు కల్పిస్తామని, అక్కడి అసెంబ్లీలో ఎస్టీలకు సీట్లు రిజర్వ్ చేస్తామని చెప్పారు. అలాగే ఎస్టీ, మహిళా, మైనారిటీ కమిషన్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసునని పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ‘ఆర్టికల్ 370 రద్దు’పై ఏర్పాటు చేసిన జనజాగరణసభకు రాంమాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కశ్మీర్ అంశంపై పాకిస్తాన్తో చర్చలు జరిపే అవకాశమే లేదని, చర్చించాల్సి వస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే ఉంటుందని స్పష్టంచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ దృష్టంతా పీఓకేను ఎలా సంపాదించాలన్నదానిమీదే ఉందన్నారు. ఉగ్రవాదులకు మద్దతుపలుకుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఆర్టికల్ 370 రద్దు చేశాక 200 మందివరకు మాత్రమే ముందస్తుగా అధికారులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. 370 రద్దు ధైర్యంతో తీసుకున్న నిర్ణయమని, ఈ ఆర్టికల్ ద్వారానే వేర్పాటువాదానికి ఊతం ఏర్పడిందని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య అన్నారు. ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్లోని ముస్లింలను రెచ్చగొట్టే ప్రయ త్నం చేయడాన్ని తప్పుబట్టారు. జమ్మూ, కశ్మీర్లో ఆర్మీ కోర్ కమాండర్గా, ఆ తర్వాత అక్కడి ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నపుడు తన అనుభవాలను లెఫ్టినెంట్ మహ్మద్జకీ పంచుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు సాహసోపేతమైన చర్యఅని సీఆర్పీఎఫ్ మాజీ డీజీ ఎంవీ కృష్ణారావు అన్నారు. -
ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు
-
జైట్లీ లేని లోటు నాకు వ్యక్తిగత నష్టం..
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీ మృతిపట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం చెన్నై పర్యటనలో ఉన్న ఆయన...జైట్లీ మరణవార్త వినగానే హుటాహుటీన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘జైట్లీ లేని లోటు దేశానికి తీర్చలేనిది. నాకు అత్యంత సన్నిహితుడు. ఆయన లేని లోటు నాకు వ్యక్తిగత నష్టం. అనేక పార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడంలో జైట్లీ సిద్ధహస్తుడు. జీఎస్టీ లాంటి సంస్కరణలు విజయవంతంగా అమలు చేయడంలో ఆయన కృషి ఎంతో ఉంది. అత్యుత్తమ పార్లమెంటేరియన్గా అవార్డు అందుకున్నారు. నీతి నిజాయితీ, విలువలకు కట్టుబడి రాజకీయ జీవితాన్ని కొనసాగించారు.’ అని వెంకయ్య ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. I am deeply shocked to learn about the demise of Shri Arun Jaitley,a long time dear friend and one of my closest associates. His death is an irreparable loss to the nation and a personal loss to me. I have no words to express my grief. — VicePresidentOfIndia (@VPSecretariat) August 24, 2019 మరోవైపు జైట్లీ మరణంతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర ముఖ్య నాయకులు తిరుపతిలోని పలు కార్యక్రమాలు రద్దు చేసుకుని ఢిల్లీ పయనం అయ్యారు. చదవండి: అరుణ్ జైట్లీ అస్తమయం -
బీజేపీలోకి 10 మంది ఎమ్మెల్యేలు
గ్యాంగ్టక్: ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేని లేదా అధికార సంకీర్ణంలో లేని రాష్ట్రం సిక్కిం ఒక్కటే. తాజాగా ఆ రాష్ట్రంలోనూ అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా కమలదళం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే సిక్కిం డెమొక్రాటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్)కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ఈశాన్య రాష్ట్రాల పార్టీ ఇన్చార్జి రాంమాధవ్ల సమక్షంలో మంగళవారం వారు బీజేపీలో చేరారు. ప్రస్తుతం సిక్కింలో ఎస్కేఎం అధికారంలో ఉంది. ఇటీవలి ఎన్నికల్లో మొత్తం 32 స్థానాలకు గానూ 17 సీట్లను ఎస్కేఎం గెలుచుకుంది. పవన్ కుమార్ చామ్లింగ్ నేతృత్వంలోని సిక్కిం డెమొక్రాటిక్ ఫ్రంట్ 15 సీట్లను గెలుచుకుంది. వారిలో ఇద్దరు రాజీనామా చేయడంతో ఆ పార్టీకి ప్రస్తుతం 13 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. వారిలో 10 మంది ఇప్పుడు బీజేపీలో చేరడంతో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోని బీజేపీకి ఇప్పుడు సిక్కిం లో ప్రధాన ప్రతిపక్ష హోదా లభించనుంది. మూడింట రెండు వంతులకు పైగా ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినందున ఫిరాయింపుల నిరోధక చట్టం వారికి వర్తించదు. రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని రాంమాధవ్ చెప్పారు. -
బీజేపీ తదుపరి ఆపరేషన్ ఆకర్ష్.. సిక్కిం?
గ్యాంగ్టక్ : సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ(సీడీఎఫ్) నుంచి 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సమక్షంలో వారు కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం సిక్కింలో బీజేపీకి ఒక్క సీటుకూడా లేకపోవడం గమనార్హం. దీంతో సిక్కింలో ప్రతిపక్షపార్టీ అయిన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీని తాజా చేరికలతో బీజేపీ విలీనం చేసుకోవడంతో ఆ పార్టీ అక్కడ రెండోస్థానంలో నిలిచింది. 25 సంవత్సారలకుపైగా సిక్కిం డెమోక్రటిక్పార్టీ అధ్యక్షుడు పవన్కుమార్ చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా పాలన అందించారు. ఆయన దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 2019లో పార్లమెంటు ఎన్నికలతో పాటు జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ స్వల్ప తేడాతో ఓటమి చవిచూసింది. ఇప్పుడీ తాజా చేరికలతో ఆ పార్టీలో కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే మిగిలారు. 2019లో మొత్తం 32 స్థానాలకు ఎన్నికలు జరుగగా 17 స్థానాలు గెలుచుకొని ప్రేమ్సింగ్ తమంగ్ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. అక్కడ బీజేపీ పోటీచేసినా ఒక్కసీటు కూడా గెలుచుకోలేదు. ఇప్పుడు ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు చేరడంతో అక్కడ కూడా బీజేపీ పార్టీ బలపడినట్లయింది. పార్టీమారిన ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ప్రధాని నరేంద్రమోదీ లుక్ ఈస్ట్ విధానం నచ్చిందని, మేం సిక్కింలో కమల వికాసం కోరుకుంటున్నామని’ అన్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాట్లాడుతూ సిక్కింలో ఇక నుంచి మేం నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తామని తెలిపారు. పార్టీలో ఎమ్మెల్యేలు చేరితే ఫిరాయింపులను ప్రోత్సహించిందనే నిందను మోయకుండా మూడింట రెండు వంతుల సంఖ్యలో పార్టీలో చేర్చుకుంటూ రాజ్యాంగబద్దంగానే బీజేపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని సీడీఎఫ్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు విమర్శించారు. సిక్కింలో కూడా పాగా వేస్తే సెవెన్ సిస్టర్స్ అని పిలుచుకునే ఈశాన్య రాష్ట్రాలలో పది సంవత్సరాల క్రితం ఉనికిలో కూడా లేని బీజేపీ నేడు సిక్కిం మినహా మిగతా అన్ని ఈశాన్యరాష్ట్రాలలో ఏదో ఒక విధంగా అధికారంలో ఉంది. ఇక సిక్కింలో తాజా చేరికలతో ఆ పార్టీ అధికారానికి కేవలం ఆరుగురు ఎమ్మెల్యేల దూరంలో ఉంది. అక్కడ రెండు ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నందున, అలాగే అధికార పార్టీకి మెజార్టీ తక్కువ ఉండటం, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టులో బీజేపీ కేసు వేయడం చూస్తుంటే అతి దగ్గరలోనే మరో కర్ణాటక, గోవా రాజకీయాలను సిక్కింలో చూస్తామనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా సిక్కిం రాష్ట్రం నేపాల్, చైనా, భూటాన్ దేశాల సరిహద్దులో ఉండటంతో వ్యూహాత్మకంగా భారత్కు కీలకమైన రాష్ట్రంగా ఉంది. -
ఆర్టికల్ 370 రద్దు.. మోదీ అరుదైన ఫొటో!
న్యూఢిల్లీ: స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం భారత్లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న మొదటి కేంద్ర ప్రభుత్వంగా నరేంద్రమోదీ సర్కారు చరిత్రలో నిలిచిపోనుంది. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దుచేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అమిత్ షా ప్రకటన వెలువడిన వెంటనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ట్విటర్లో ప్రధాని నరేంద్రమోదీకి సంబంధించిన ఆసక్తికరమైన ఫొటోను పోస్టు చేశారు. ఎప్పటిదో తెలియని ఈ పాత ఫొటోలో యవ్వనంలోని నరేంద్రమోదీ ఓ కార్యక్రమంలో కూర్చొని ఉన్నారు. ఆర్టికల్ 370ను రద్దు చేయాలి.. ఉగ్రవాదాన్ని అంతమొందించాలని ఆయన వెనుక ఉన్న బ్యానర్లో రాసి ఉంది. ఈ ఫొటోను పోస్టు చేసి.. ‘హామీ నెరవేరింది’ అని రాం మాధవ్ కామెంట్ చేశారు. ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా యవ్వనంలో ఉన్నప్పుడు నరేంద్రమోదీ ఆందోళన నిర్వహించినప్పటి ఫొటో ఇది అయి ఉంటుందని, నేడు ఆర్టికల్ 370 రద్దు అయిన నేపథ్యంలో ఈ అరుదైన ఫొటోను ఆయన షేర్ చేసి ఉంటారని భావిస్తున్నారు. Promise fulfilled pic.twitter.com/iiHQtFxopd — Ram Madhav (@rammadhavbjp) August 5, 2019 -
‘చారిత్రక తప్పిదాన్ని సవరించారు’
న్యూఢిల్లీ: కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ప్రశంసించారు. చారిత్రక తప్పిదాన్ని నేడు సవరించారన్నారు. జమ్మూకశ్మీర్ విభజనపై అరుణ్ జైట్లీ స్పందిస్తూ.. చారిత్రక తప్పిదాన్ని సవరించిన ప్రధాని నరేంద్ర మోదీని, అమిత్ షాను అభినందిస్తున్నాను అన్నారు. ఇక మీదట మహోన్నత భారత్ దిశగా పయనించబోతున్నాం అంటూ జైట్లీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఇది అద్భుతమైన రోజు. జమ్మూకశ్మీర్ను భారత్లో పూర్తిగా విలీనం చేయాలన్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వంటి ఎంతో మంది అమరుల త్యాగాలు ఫలించాయి. సమగ్ర భారతదేశం కోసం ఏడు దశాబ్దాలుగా సాగుతున్న పోరాటానికి ఇక తెరపడింది. జీవితంలో అసలు ఇలాంటి పరిణామం వస్తుందని ఊహించామా’ అని రామ్ మాధవ్ ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో పాటు, 35ఏ రద్దు, జమ్మూకశ్మీర్ను రెండు ప్రాంతాలుగా విభజిస్తూ అమిత్ షా రాజ్యసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్ను చట్టసభతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లడఖ్ చట్టసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందని స్పష్టం చేశారు. -
‘టీడీపీ తానా సభల్లో మాత్రమే మిగులుతుంది’
సాక్షి, గుంటూరు : టీడీపీ కేవలం తానా సభల్లో మాత్రమే మిగులుతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పనైపోయిందని అన్నారు. గుంటూరులో ఆదివారం బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాంమాధవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంమాధవ్ మాట్లాడుతూ.. బీజేపీ అంటే ఒక రాజకీయ సంస్కృతి అని తెలిపారు. భిన్నమైన రాజకీయ సంస్కృతికి ప్రధాని నరేంద్ర మోదీ ఆద్యుడని పేర్కొన్నారు. అన్ని పార్టీల వారు బీజేపీలో చేరేందుకు వస్తున్నారని చెప్పారు. ఏపీ ప్రజలను బీజేపీ వైపు ఆకర్షించాలని దిశానిర్దేశం చేశారు. ఏపీలో బలపడేందుకు చాలెంజింగ్గా పని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయ పార్టీ అనే నమ్మకం ప్రజల్లో కలిగిందని తెలిపారు. ఏపీ ప్రజలకు కూడా ఆ నమ్మకం కలిగించాలని అన్నారు. అవినీతి, అక్రమాలకు టీడీపీ నిలయంగా మారిందని మండిపడ్డారు. 2024 నాటికి ఏపీలో బీజేపీ అధికార పార్టీ దిశగా ఎదగాలని ఆకాక్షించారు. 25 మందిని కూడా స్వయంగా సభ్యత్వం చేయించని వారికి ఏ పదవి ఆశించే అర్హత లేదని స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంటుందని వెల్లడించారు. -
అవి 'తానాసభలు' కాదు.. వారి ‘భజనసభలు’
సాక్షి, అమరావతి : అమెరికాలో జరుగుతున్న తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సభలను టీడీపీ నేతలు భ్రష్టుపట్టిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. తానా సభల్లో బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ జాతీయవాద ప్రసంగానికి అడ్డుతగిలి అవమానించిన లోకేష్ గ్యాంగ్ మరోసారి తమ నీచబుద్ది బయటపెట్టారని అన్నారు. ఈ సభలను పచ్చతమ్ముళ్లు టీడీపీ భజన సభలుగా మార్చి అమెరికాలో కూడా తెలుగువాళ్ల ప్రతిష్ట దిగజారుస్తున్నారని మండిపడ్డారు. ఈమేరకు ఆయన ట్విటర్లో స్పందించారు. ‘ఏపీలో మీ బురద రాజకీయాల్లో నుండే కమలవికాసం జరుగుతుంది’అని కన్నా వ్యాఖ్యానించారు. -
హాయ్ల్యాండ్లో రెండోరోజు బీజేపీ నేతల భేటీ
సాక్షి, గుంటూరు : మంగళగిరి హాయ్ల్యాండ్లో శనివారం ఏపీ బీజేపీ ముఖ్యనేతల సమావేశం రెండో రోజు జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే సుమారు 75 మంది కీలక నేతల చేరికపై సమావేశంలో చర్చించనునారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ, పురందరేశ్వరి, జీవీఎల్, వి మురళీదరన్, సోము వీర్రాజు, సతీష్ జి, సునీల్ దియోదర్ పాల్గొన్నారు. ఇతర పార్టీల నుంచి చేరికలు, సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతానికి చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. జమిలీ ఎన్నికలు వస్తే సన్నద్దతపై చర్చించారు. నేడు మూడు గంటలకు తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. -
తెలుగుదేశం పార్టీకి షాక్, వరదాపురం సూరి రిజైన్
సాక్షి, అనంతపురం : ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. తాజాగా తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, జిల్లా ప్రధాన కార్యదర్శి గోనుగుంట్ల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ వరదాపురం సూరి శుక్రవారం బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఆ పార్టీ సీనియర్ నేత రాంమాధవ్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో ధర్మవరం నుంచి గెలిచిన సూరి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాగా అంతకు ముందు వరదాపురం సూరి జిల్లా ప్రధాన కార్యదర్శి పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపారు. అనివార్య కారణాల వల్ల తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను ఆమోదించాలని ఆయన ఆ లేఖలో కోరారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు బీజేపీ అధిష్టాన ప్రతినిధులతో సంప్రతింపులు జరుపుతున్న విషయం తెలిసిందే. -
‘యోగాతో రాహుల్ పిల్ల చేష్టలకు చెక్’
తిరువనంతపురం : అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యర్ధులపై రాజకీయ విమర్శలకూ వేదికైంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సెటైర్లతో విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో రాహుల్ ఫోన్ చూస్తూ గడపడాన్ని రాం మాధవ్ పరోక్షంగా ప్రస్తావించారు. పార్లమెంట్లో కొంతమంది పిల్లలు ఉన్నారని, యోగా అభ్యసించడం ద్వారా వారు తమ పిల్ల చేష్టలను అధిగమించవచ్చని రాహుల్ను ఆయన ఎద్దేవా చేశారు. క్లాస్ రూంలో ఉపాధ్యాయుడు చెప్పే విషయాలపై దృష్టి కేంద్రీకరించడం కొందరికి కష్టం కావచ్చు..పరీక్షల సమయంలో పాఠ్యపుస్తకాలపై మనం దృష్టి సారించలేకపోవచ్చు.. అంటూ అయితే వీటికోసం చింతించాల్సిన అవసరం లేదని, స్కూళ్లలో చిన్నారులు ఉన్నట్టే మన పార్లమెంట్లోనూ పిల్లలు ఉన్నారని రాహుల్ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో పిల్లలు మన రాష్ట్రపతి ప్రసంగాన్నే ఆలకించరని, వారు తమ మొబైల్ ఫోన్లలో మెసేజ్లు చెక్ చేసుకంటూ వీడియో గేమ్లు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తారని చురకలు అంటించారు. వారి చిన్నపిల్లల మనస్తత్వాన్ని యోగాతో నియంత్రించుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు. -
బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత
సాక్షి, న్యూఢిల్లీ : అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆమె మంగళవారం కాషాయం కండువా కప్పుకున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ నేతృత్వంలో ఆమె కమలం గూటికి చేరారు. అంతేకాకుండా గత ఏడాది తాను స్థాపించిన జనజాగృతి రాజకీయ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. -
బీజేపీ.. ఆపరేషన్ ఆకర్ష్ షురూ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కమలనాథుల ఆపరేషన్ ప్రారంభమైంది. రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల కీలక నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను ఆర్ఎస్ఎస్ మాజీ నేత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్కు అధిష్టానం అప్పగించింది. ఇందులో భాగంగా రాంమాధవ్ హైదరాబాద్ వచ్చి పార్క్ హయత్లో మకాం వేశారు. మధ్యాహ్నం నుంచి పలువురు నేతలతో ఆయన సమావేశమయ్యారు. రాంమాధవ్తో భేటీ అయిన వారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఆయన సోదరుడు మోహన్రెడ్డి, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యారావు ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగుదేశం పార్టీ కీలక నేతలు రాంమాధవ్తో టచ్లో ఉన్నట్లు తెలిసింది. 2023నే లక్ష్యంగా... కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో పాగ వేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా 4 లోక్సభ స్థానాలను అనూహ్యంగా గెలుచుకున్న తెలంగాణలో పార్టీని విస్తరించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వాన్ని అప్రమత్తం చేయడంతోపాటు వివిధ రాజకీయ పార్టీల్లో అసంతృప్తులుగా ఉన్న నేతలను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను రాంమాధవ్కు అప్పగించారు. దీనిలో భాగంగానే రాంమాధవ్ ప్రాథమికంగా కొందరు నేతలను ఆకర్శించే వ్యూహంతో బుధవారం హైదరాబాద్ వచ్చారు. ఆయనతో తెలంగాణలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు సమావేశం అయ్యేలా స్థానిక నాయకత్వం ఏర్పాట్లు చేసింది. బుధవారం మధ్యాహ్నం తర్వాత రాంమాధవ్ పలు పార్టీల నేతలను కలిశారు. వీరిలో కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, టీజేఎస్ నేతలు ఉన్నట్లు తెలిసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో 2023 కల్లా రాష్ట్రంలో కనీసం సగం కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే వ్యూహంతో రాంమాధవ్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. బుధవారం పలువురి నేతలను కలసిన ఆయన గురువారం కూడా హైదరాబాద్లోనే ఉండి మరికొందరిని కలువనున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాంమాధవ్ను కలసిన నేతలంతా దాదాపు బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే బీజేపీలో పలువురు నేతల చేరిక కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఒక్కరిద్దరు కాంగ్రెస్ ఎంపీలు కూడా రాంమాధవ్తో టచ్లోకి వెళ్లారని బీజేపీ వర్గాలు చెబుతున్నప్పటికీ ఆ ఎంపీలు, టీపీసీసీ వర్గాలు ఖండిస్తున్నాయి. రాంమాధవ్ నేతృత్వంలో ఎవరెవరు బీజేపీలో చేరతారనేది ఒకటెండ్రు రోజుల్లో తేలనుంది. రాంమాధవ్ వ్యూహం ఫలిస్తే.. 2020 చివరినాటికి బీజేపీ బలమైన శక్తిగా ఎదిగి 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొంటామని ఆ పార్టీ నేతలు చెబతున్నారు. -
బీజేపీలోకి ఇద్దరు టీ కాంగ్రెస్ ఎంపీలు?
న్యూఢిల్లీ : తెలంగాణలో కాంగ్రెస్కు మరో భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ అధిష్టానంతో రహస్య మంతనాలు జరిపినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిలతో పాటు మాజీ ఎంపీ వివేక్, కేసీఆర్ అన్న కూతురు కల్వకుంట్ల రమ్య రావు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్తో భేటీ అయినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు బీజేపీలో చేరతున్నట్టుగా ప్రచారం జరుగుతున్నటప్పటికీ.. నేతలు ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు. అయితే తాజా పరిణామాలు ఆ వార్తలకు మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కోలుకునే అవకాశం లేకపోవడంతోనే పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టీ టీడీపీకి చెందిన పలువురు నేతలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం. -
పార్టీ మారుతున్న జేసీ బ్రదర్స్!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాయలసీమకు చెందిన పలువురు టీడీపీ కీలక నేతలు త్వరలో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్, పరిటాల కుటుంబం, పల్లె రఘునాథరెడ్డి, వరదాపురం సూరి తదితరులు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం ఇప్పటికే వీరితో సంప్రదింపులు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో చేరిక తేదీని ఖరారు చేసుకుని త్వరలోనే వీరు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఎదుట కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన.. ఈ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టీడీపీ కోలుకోలేని విధంగా దెబ్బతింది. 14 అసెంబ్లీ స్థానాలకుగానూ 12 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. హిందూపురం, ఉరవకొండలో మాత్రమే నందమూరి బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ గెలుపొందారు. 2 పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయ బావుటా ఎగురవేసింది. ఒకపక్క చంద్రబాబు విశ్వసనీయత కోల్పోవడం, మరోవైపు లోకేష్ సామర్థ్యంపై నమ్మకం లేని టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై కలవరం చెందుతున్నారు. బంపర్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం ఖాయమనే అంచనాకు వచ్చిన టీడీపీ నేతలు ప్రత్యామ్నాయం దిశగా అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీని వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పుట్టపర్తి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యేలు కూడా.. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరితో కూడా రాంమాధవ్ చర్చలు జరిపినట్లు సమాచారం. జేసీ బ్రదర్స్ చేరిక తర్వాత వీరు పార్టీలో చేరే అవకాశం ఉంది. ఈ నెల 23 లేదా 27న వీరు బీజేపీలో చేరతారని తెలుస్తోంది. ముందు వరుసలో జేసీ బ్రదర్స్ టీడీపీని వీడి బీజేపీలో చేరనున్న నేతల్లో జేసీ బ్రదర్స్ మొదటి వరుసలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో జేసీ సోదరులు రాజకీయాల నుంచి తప్పుకుని వారసులను బరిలోకి దింపినా వారూ ఓటమి పాలయ్యారు. తమ కుమారులతో చర్చించిన జేసీ బ్రదర్స్ టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని, తిరిగి అధికారంలోకి రావడం అసంభవం అనే నిర్ధారణకు వచ్చారు. దీంతో తమ వారసులను బీజేపీలోకి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్తో ఇప్పటికే చర్చలు కూడా ముగిసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 12న అమిత్షా ఎదుట వీరు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అపాయింట్మెంట్ లభించకుంటే త్వరలోనే మరో తేదీ ఖరారు చేసుకుని బీజేపీలో చేరే అవకాశం ఉంది. పరిటాల కుటుంబంతో చర్చలు సఫలం పరిటాల కుటుంబం రాజకీయ జీవితం టీడీపీతోనే మొదలైంది. 2005లో పరిటాల రవీంద్ర హత్య అనంతరం ఆయన సతీమణి సునీత రాజకీయాల్లోకి వచ్చారు. ఈ దఫా ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ పోటీ చేసి ఓటమి చవిచూశారు. బీజేపీలో చేరేందుకు వీరు కూడా సంప్రదింపులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్నందున హఠాత్తుగా పార్టీ మారితే నియోజకవర్గంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి? కేడర్ తమతో వస్తుందా? రాదా? అనే సందిగ్ధంలో ఉన్నారు. దీంతో పార్టీ కేడర్ను ఒప్పించి బీజేపీలో చేరాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జేసీ బ్రదర్స్, పల్లె, సూరి చేరికల తర్వాత పరిటాల కుటుంబం బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన నేతలు కూడా టీడీపీలో కొనసాగే పరిస్థితి లేదని, వారు కూడా ఎవరిదారి వారు చూసుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఎగ్జిట్ పోల్స్ అలా అయితే ఓకే..
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే భారీ ఆధిక్యం సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తోసిపుచ్చిన విపక్షాలపై బీజేపీ మండిపడింది. ఇవే ఎగ్జిట్ పోల్స్ విపక్షాలకు అనుకూలంగా వస్తే వాటిని సమర్ధించేవని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందు తాము చెప్పిన స్ధానాలకు అనుగణంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయని చెప్పారు. 2014 లోక్సభ ఎన్నికల కంటే తమకు ఎక్కువ సీట్లు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ను మమతా బెనర్జీ, కుమార స్వామి, చంద్రబాబునాయుడు వంటి విపక్ష నేతలు ప్రశ్నించడాన్ని ప్రస్తావిస్తూ వారి అంచనాలకు తగినట్టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వస్తే అవి సరైనవేనని, లేకుంటే వాటిని తప్పుపడతారని వ్యాఖ్యానించారు. వారంతా ఈవీఎంల ద్వారానే గతంలో గెలిచినా ఇప్పుడు వాటి పనితీరును ప్రశ్నిస్తున్నారని ఆక్షేపించారు. విపక్ష నేతలకు ఈనెల 23న భంగపాటు తప్పదని స్పష్టం చేశారు. తమ పార్టీకి 300 స్ధానాల వరకూ దక్కుతాయని రాంమాధవ్ ధీమా వ్యక్తం చేశారు. -
ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా వచ్చాయి కాబట్టే..
సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాలకు తక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తే సాధారణంగానే వారు ఆ ఫలితాలను తప్పుపడతారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాదవ్ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. దీనిపై మాదవ్ స్పందిస్తూ.. ‘‘ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విపక్షాలకు అనుకూలంగా వస్తే అవి సరైనవి. వారికి వ్యతిరేకంగా వస్తే సరైనవి కావు అనే విధంగా ప్రతిపక్ష పార్టీల సభ్యులు వ్యవహరిస్తున్నారు. ఓటమిని అంగీకరించలేక ఎన్నికల సంఘం, ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు. ఫలితాలు వారికి అనుకూలంగా వస్తే ఎవరినీ ప్రశ్నించరు. వారికి వ్యతిరేకంగా వస్తే వ్యవస్థనే తప్పుపడతారు. మమతా బెనర్జీ, చంద్రబాబు నాయడు, కూమరస్వామి వీరంతా ఎగ్జిట్ పోల్స్ను ప్రశ్నిస్తున్నారు. గతంలో వారు కూడా ఇవే ఈవీఎంలతో గెలిచిన విషయాన్ని మర్చిపోయారు. గతంలో కంటే ఈసారి తమకు మెరగైన ఫలితాలు వస్తాయి. మోదీ నాయకత్వంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మే 23న వచ్చే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. 300లకు పైగా స్థానాలకు గెలుచుకుంటాం’’ అని అన్నారు. కాగా హోరాహోరీగా సాగిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీకే ప్రజామోదం ఉంటుందని ఎగ్జిట్పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. మోదీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఆదివారం సాయంత్రం విడుదల చేసిన అంచనాల్లో పేర్కొన్నాయి. -
‘బీజేపీ కంటే మోదీకే పాపులారిటీ’
ఢిల్లీ: ప్రజలందరూ పదే పదే మోదీ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో తెలుగు వారి ఓటర్ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర బీజేపీ నేతలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాం మాధవ్ మాట్లాడుతూ..కాశ్మీర్లో ఆజాద్ హిందూస్తాన్... నరేంద్ర మోదీ జిందాబాద్ అని నినాదాలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రాబల్యం లేని చోట కూడా నరేంద్ర మోదీకి ప్రజాదరణ ఉందన్నారు. వాస్తవంగా బీజేపీ కంటే నరేంద్ర మోదీకే ఎక్కువ పాపులారిటీ ఉందని చెప్పారు. ‘దేవెగౌడ ప్రధాని అయినప్పుడు తామెందుకు ప్రధాని కాలేరని చిన్న పార్టీల నేతలు కలలు కంటున్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు కింగ్మేకర్లు కావాలని కలలు కంటున్నారు. మావద్ద కింగే ఉన్నప్పుడు కింగ్ మేకర్ అవసరం లేదు. మే 23న ఫలితం ఏమిటనేది ప్రజలందరికీ ఇప్పటికే తెలుసు. 2014లో బీజేపీకి 225 కంటే ఎక్కువ రావని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ మా ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ వచ్చింది. ఈ సారి కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తి మెజారీటీతో గెలవడం ఖాయమ’ని వ్యాఖ్యానించారు. ‘తాము అధికారంలోకి వస్తే రూ.72 వేలు ఇస్తామని రాహుల్ గాంధీ అంటున్నారు. మరి 70 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఏం చేశారు. నరేంద్ర మోదీ ఉచితంగా ఏదీ ఇవ్వలేదు. డబ్బున్న వ్యక్తికి, లేని వ్యక్తికీ సమానమైన చికిత్స అందించాలని ఉద్దేశంతోనే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకువచ్చారు. ఆ పథకంతో టైర్-2 సిటీల్లో కూడా మంచి ఆసుపత్రులు వస్తున్నాయి. ప్రజలు బిచ్చగాళ్లు కాదు..వారికి గౌరవప్రదమైన జీవితం ఇవ్వాలనేదే మోదీ ప్రభుత్వ ఉద్దేశమ’ని చెప్పారు. ‘దేశంలో 9 కోట్ల మరుగుదొడ్లు కట్టించి మహిళల ఆత్మగౌరవం నిలబెట్టారు. ఎస్సీ, ఎస్టీలకు గ్యారంటీ లేకుండా రూ.15 లక్షల అప్పు ఇచ్చే ముద్ర యోజన పథకాన్ని తీసుకువచ్చాం. ఉద్యోగాల కోసం వెతికిన వాళ్లు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ప్రపంచ దేశాల్లో భారతీయులు తలెత్తుకుని బతికేలా గౌరవాన్ని పెంచారు. ప్రతి రంగంలోనూ నరేంద్ర మోదీ తనదైన ముద్రవేశారు. సర్జికల్ స్ట్రైక్స్లకు ఆధారాలు కావాలంటే మిగ్ విమానాలకు కట్టేసి తీసుకెళ్లాలా..? భారత్ సమర్పించిన ఆధారాల కారణంగానే ఐక్యరాజ్య సమితి, మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించారు. దొంగే దొంగ అన్నట్లుగా.. చౌకీదార్ చోర్ అంటున్నారు. నరేంద్ర మోదీ అవినీతిరహిత వ్యక్తి. అవినీతిపరులు దేశం వదిలిపారిపోయే పరిస్థితి వచ్చింది. ప్రజలందరి హృదయాల్లో నరేంద్ర ఉన్నార’ని కొనియాడారు. -
‘హమారే పాస్ మోదీ హై’
జమ్మూ: విపక్ష నాయకులపై బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆదివారం జమ్మూ కశ్మీర్లోని రియాసి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన సినిమాటిక్ స్టైల్లో విమర్శలు గుప్పించారు. ప్రముఖ బాలీవుడ్ చిత్రం దీవార్ డైలాగ్ను గుర్తుకు తెచ్చేలా ఆయన పంచ్లు పేల్చారు. ప్రతిపక్షాల కూటమిలో నరేంద్ర మోదీ వంటి శక్తి సామర్థ్యాలు కలిగిన నేత ఎవరు లేరని ఎద్దేవా చేశారు. అందుకే వారు కూటమిగా ఏర్పరడ్డారని విమర్శించారు. కానీ.. హమారే పాస్ మోదీ హై( మా దగ్గర మోదీ ఉన్నారు) అని వ్యాఖ్యానించారు. మోదీ భారత్ను అవినీతి రహిత, తీవ్రవాద రహిత దేశంగా మార్చారని పునరుద్ఘాటించారు. విపక్షాల కూటమిలో ఎక్కువ మందికి ప్రధాని సీటు పైనే దృష్టి ఉందని.. వారు విజయం సాధించలేరని అన్నారు. మరోవైపు జుమ్మూ కశ్మీర్లోని కథువాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ కుటుంబాలు ఇక్కడి ప్రజల జీవితాలను నాశనం చేశాయని ఆరోపించారు. తొలి దశలో ఓటు వినియోగించుకున్న బారాముల్లా, జమ్మూ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.ఇక్కడి ఓటర్లు పోలింగ్ను పెంచడం ద్వారా భారతదేశ ప్రజాస్వామ్యం ఎంత బలమైనదో చాటిచెప్పారని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు తమ ఓటుతో ఉగ్రవాద నాయకులకు, అవకాశవాదులకు ధీటైన జవాబు చెప్పారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి దశలో బారాముల్లా, జమ్మూలో ఎన్నికల జరిగాయి. రెండో దశలో ఉద్దంపూర్, శ్రీనగర్లో పోలింగ్ జరగనుంది. అనంత్నాగ్లో మాత్రం మూడు, నాలుడు, ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. లడఖ్లో ఐదో దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. -
‘బాబుకు ఓటమి తప్పదు’
సాక్షి, నెల్లూరు : రాష్ట్రంలో అధికారం కోల్పోతున్న చంద్రబాబు.. ఢిల్లీలో చక్రం తిప్పుతాననడం హాస్యాస్పాదంగా ఉందంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఎద్దేవా చేశారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదని స్పష్టం చేశారు. ఈ ఐదేళ్లలో బాబు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబును ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. దేశంలో మరోసారి నరేంద్ర మోదీనే భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం
ఆర్మూర్: కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రాగానే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని, ఈ అంశాన్ని తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఏర్పాటు చేసిన బహిరంగలో ఆయన ప్రసంగించారు. తమ పార్టీ నిజామాబాద్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చొరవ వల్లే సమస్య తీవ్రత కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు. వరి, మొక్కజొన్న, సోయాబీన్, పొద్దుతిరుగుడు లాంటి పంటలకు గిట్టుబాటు ధరను పెంచిన కేంద్ర ప్రభుత్వానికి పసుపు పంటకు ధర ఇవ్వడం పెద్ద సమస్య కాదని చెప్పారు. సుమారు 150 రకాల పసుపు, ఎర్రజొన్న లాంటి పంటలు పండించే రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పసుపు, ఎర్రజొన్న పంటలను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితిని రైతులు ఎదుర్కొన్న తరుణంలో రైతు పంటను అమ్ముకున్న ధరకు, మార్కెట్ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని రాంమాధవ్ హామీ ఇచ్చారు. పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రభుత్వంపై ఉన్న వారి ఆక్రోశాన్ని వెళ్లగక్కడానికి పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తున్నారని తెలిపారు. ఇది ఎంపీ కవిత వైఫల్యమేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనతో నిరంకుశ పాలన సాగుతోందని రాంమాధవ్ విమర్శించారు. బీజేపీ విజయాన్ని అడ్డుకోలేరు.. పాలమూరు: బీజేపీ విజయాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని రాంమాధవ్ అన్నారు. మహబూబ్నగర్లో ఆయన మాట్లాడుతూ. తానే కింగ్ మేకర్ అంటున్న కేసీఆర్, మోదీ పాలనను అడ్డుకుంటామన్న మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లాంటి నాయకులెవరూ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. కేంద్రంలో ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెబుతున్న చంద్రబాబు మొదట ఆంధ్రలో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. దేశంలో రాహుల్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని విమర్శించారు. రాహుల్ ఎక్కడ పర్యటించినా మోదీ..మోదీ అంటూ ప్రజలు నీరాజనం పలుకుతున్నారని గుర్తు చేశారు. 300 స్థానాల్లో ఒంటరి పోరు వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 300 స్థానాల్లో పోరాడుతుందని, అన్ని స్థానాల్లో గెలిచి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రాంమాధవ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ను ఓడించేందుకు బీజేపీ నాయకులు శక్తి వంచన లేకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కుటుంబపాలన సాగుతోందని, ఎక్కువ మెజార్టీతో గెలిచాడని అల్లుడు హరీశ్రావును పక్కన పెట్టారని, మహబూబ్నగర్ ఎంపీగా ఉన్న జితేందర్రెడ్డికి సైతం టికెట్టు ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. ఈ నెల 29న ప్రధాని నరేంద్రమోదీ మహబూబ్నగర్సభలో పాల్గొంటారని తెలిపారు. కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి మాట్లాడుతూ.. ఉగ్రవాదులను అణచివేయడంలో ప్రపంచంలో మోదీకి మించిన నాయకుడు లేడని కొనియాడారు. -
ఎంపీగా పోటీ చేయకుండా ప్రధాని ఎలా అవుతారు?
సాక్షి, మహబూబ్నగర్ : తెలంగాణలో భయోత్పాద వాతావరణంలో రాజకీయాలు కొనసాగుతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. నేతలు ఎవ్వరు స్వచ్ఛందంగా టీఆర్ఎస్లోకి వెళ్లడంలేదని, భయపెట్టి లాక్కుంటున్నారని ఆరోపించారు. మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామ జన్మభూమి తమ ఎన్నికల నినాదం కాదని, కోట్లాది మంది ప్రజల మనోభావాల అంశంగానే రామజన్మభూమిని పరిగణిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కులాలను రాజకీయాలకు ఎలా వాడుకుంటున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రధానమంత్రి అవుతామని అంటున్న నేతలు ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఎద్దేవా చేశారు. ఎంపీలుగా పోటీ చేయకుండా ప్రధానమంత్రి ఎలా అవుతారో చెప్పాలన్నారు. కేసీఆర్ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషించడంలేదని మహబూబ్నగర్ బీజేపీ అభ్యర్తి డీకే అరుణ విమర్శించారు. టీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యామ్నాయం అన్నారు. దేశ భద్రత, సంక్షేమం కోసం ప్రజలు నరేంద్రమోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. 16 సీట్లు గెలిస్తే తాను ప్రధానిని అవుతానంటూ కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రధానమంత్రి ఎలా అవుతారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మహమూబ్నగర్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. -
కేసీఆర్కు రాంమాధవ్ సూటిప్రశ్న..!
సాక్షి, మహబూబ్నగర్ : ఎంపీ సీట్లను గెలిచి కేంద్రంలో కింగ్ మేకర్ అవుతానంటూ పదేపదే చెప్తున్న సీఎం కేసీఆర్ లోక్సభకు ఎందుకు పోటీచేయడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సూటిగా ప్రశ్నించారు. బ్రేక్ఫాస్ట్, లంచ్ రాజకీయాలతో ప్రంట్లు ఏర్పడవని వ్యాఖ్యానించారు. మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు గెలవడం అసాధ్యమని, ఆయన అతి తెలివితేటలు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనను తలదన్నేలా కేసీఆర్ పాలన ఉందని విమర్శించారు. ప్రతిపక్షాల మనుగడను దెబ్బతీస్తున్నారని, అవినీతి అహంకార పాలన సాగుతోందని మండిపడ్డారు. సొంత బంధువుకు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ వచ్చిందనే అక్కసుతో ఆయన ఉనికిని దెబ్బ తీస్తున్నారని, ఎంపీ జితేందర్రెడ్డి ఎదుగుదలను కట్టడి చేయడానికి టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని, నరేంద్రమోదీ రెండోసారి ప్రధాని అవుతారని మాధవ్ జోస్యం చెప్పారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి హరిదీప్సింగ్ పూరి తదితరులు పాల్గొన్నారు. -
అక్కడ అమిత్ షా కన్నా ఆయనే ముఖ్యం
న్యూఢిల్లీ : బీజేపీలో ప్రస్తుతం అమిత్ షా శకం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని చోట్ల పార్టీ బలోపేతానికి అమిత్ షా కృషి చేస్తున్నారు. అయితే ఈశాన్య రాష్ట్రల్లో మాత్రం అమిత్ షా ప్రభావం అంతగా లేదట. అక్కడ అమిత్ షా కన్నా అస్సాం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వా శర్మకే అధిక ప్రాధాన్యం ఉందంటున్నారు పార్టీ జనరల్ సెక్రటరీ రాం మాధవ్. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో పార్టీ హిమంత బిశ్వాకు టికెట్ కేటాయించలేదు. ఈ విషయంపై స్పందించిన రాం మాధవ్.. ‘దీన్ని బట్టి పార్టీ అమిత్ షా కన్నా ఎక్కువ బాధ్యతలు హిమంతకే అప్పగించిందనే విషయం స్పష్టమవుతోంది. ఈశాన్య భారతంపై హిమంత బిశ్వాకు చాలా పట్టుంది. ఇప్పటి వరకూ 5, 6 ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోశించారు. అందుకే పార్టీ.. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ప్రచార భారాన్నంత ఆయన మీదనే మోపింది. ఇందుకు చాలా శక్తి, సమయం కావాలి. ఈ బాధ్యతలు చూడ్డానికే టైం సరిపోదు. ఇక ఆయన కూడా పోటీలో ఉంటే.. పార్టీ ప్రచార బాధ్యతలతో పాటు ఆయన గెలుపు కోసం కూడా కష్టపడాల్సి ఉంటుంది. దీని వల్ల హిమంత బిశ్వాపై ఒత్తిడి పెరుగుతుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే పార్టీ ఆయనకు టికెట్ కేటాయించలేద’ని తెలిపారు. హిమంత బిశ్వాకు టికెట్ కేటాయించకపోవడంపై అమిత్ షా స్పందిస్తూ.. ‘ప్రస్తుతం ఈశాన్యం ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసే ముఖ్యమైన బాధ్యతలను ఆయనకు అప్పగించాం. అందుకే ఈ సారి ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని తెలిపారు. ఈశాన్య రాష్ర్టాల్లో బీజేపీకి లైఫ్ ఇచ్చిన హిమంత బిశ్వా.. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. 2015లో ఈయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఈశాన్య ప్రాంతంలో కమలం వికసించేలా కృషి చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ట్రబుల్ షూటర్గా గుర్తింపు పొందారు. -
కాంగ్రెస్ పాక్లో పోటీ చేయాలి
గువాహతి: కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేయడంలో ఆరితేరిపోయిందని, ఒకవేళ వారు పాకిస్తాన్లో పోటీచేస్తే అక్కడ ఆ పార్టీ గెలిచేందుకు అవకాశముంటుందని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆదివారం గువాహతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చాలా విషయాలపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై భారత్లోకంటే పాకిస్తాన్లోనే స్పందన ఎక్కువగా వస్తున్నదని, పొరుగుదేశంలోనే వారి వ్యాఖ్యలకు విపరీతంగా ప్రచారం లభిస్తోందని ఆయన అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పాకిస్తాన్లో ప్రతిపక్షంగా ఉంటే విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, దేశంలో ప్రధాన ప్రతిపక్షం తీరు ఇలా ఉందని ఆయన అన్నారు. ‘ప్రభుత్వంపైనా, ప్రధానిపైనా విమర్శించడానికి ఏమీ లేక వారు పాకిస్తాన్ విషయంలో అబద్ధాలతో కాలం వెల్లదీస్తున్నారు’అని రాంమాధవ్ విమర్శించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప బీజేపీ అగ్రనేతలకు రూ.1,800 కోట్ల లంచం ఇచ్చారన్న ఆరోపణలపై విలేకరులు ప్రశ్నించగా రాంమాధవ్ తీవ్రంగా ఖండించారు. ‘అది పూర్తిగా సత్యదూరం, ప్రతిపక్షానికి ఆరోపించడానికి ఏమీ లేక ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అయినా ఇది 2011లో జరిగిందని అంటున్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అధికారంలో ఉన్నది, వారు ఆ సమయంలో నిద్ర పోతున్నారా’అని వ్యాఖ్యానించారు. వారి ఆరోపణల్లో ఏమాత్రం పస లేదు, దేశమంతా మోదీ గాలి వీస్తోంది, గతంలో కన్నా ఎక్కువ సీట్లు బీజేపీ గెలవబోతోంది అని అన్నారు. బీజేపీ ఒంటరిగా 2014కన్నా ఎక్కువగా సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఎన్డీయే పక్షాలు సైతం మెజారిటీ సీట్లు గెలుచుకుంటారు. పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీ కచ్చితంగా సాధిస్తాం’అని పునరుద్ఘాటించారు. -
‘వారు పాక్లో పోటీ చేస్తే గెలుపు ఖాయం’
గువహటి : రానున్న లోక్సభ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ నాయకులపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్లో పోటీ చేస్తే గెలుపొందడం ఖాయమని బీజేపీ నేత రాంమాధవ్ ఎద్దేవా చేశారు. విపక్ష నేతలు చేస్తున్న ట్వీట్లు భారత్లో కంటే అధికంగా పాకిస్తాన్లోనే రీట్వీట్ అవుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ట్వీట్లు మనదేశంలో కంటే పొరుగు దేశంలోని ప్రజలే ఎక్కువగా రీట్వీట్ చేస్తున్నారని, వారు అక్కడికి (పాకిస్తాన్) వెళ్లి ఎన్నికల్లో పోటీ చేస్తే వారు గెలుపొందే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. దేశంలో విపక్ష తీరు ఇలా ఉందని రాంమాధవ్ ఎండగట్టారు. విపక్ష నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతలు భారత్కు అనుకూలంగా మాట్లాడుతున్నారా లేక పాక్కు వత్తాసుపలుకుతున్నారా అనేది ప్రజలకు అర్ధం కావడం లేదన్నారు. భారత సైన్యంపై విపక్ష నేతలు అమర్యాదకరమైన భాషను ప్రయోగిస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో మోదీ ప్రభంజనం ఉందని, బీజేపీ దాని మిత్రపక్షాలు గత సార్వత్రిక ఎన్నికల కంటే ఎక్కువ స్ధానాలను ఈసారి కైవసం చేసుకుంటాయని ఆయన జోస్యం చెప్పారు. -
కాంగ్రెస్కు డీకే ఆరుణ గుడ్ బై?
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్కు ఊహించని భారీ షాక్ తగిలింది. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఇప్పటికే సగం మంది ఎమ్మెల్యేలు, పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ను వీడగా.. మరికొంత మంది అదే బాటలో ఉన్నారు. తాజాగా మహబూబ్నగర్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ కాంగ్రెస్ను వీడే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్కు గుడ్బై చెప్పి బీజేపీలో చేరాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ జాతీయ నేత రామ్ మాధవ్ డీకే అరుణను మంగళవారం కలిశారు. రామ్ మాధవ్తో దాదాపు 45 నిమిషాల పాటు చర్చించారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో మాట్లాడించినట్లు తెలుస్తోంది. రాజకీయ పరంగా ఆమె భవిష్యత్పై షా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అమిత్ షా హామీతో ఆమె ఢిల్లీ పయనమయ్యారు. బుధవారం జాతీయ అధ్యక్షుడు సమక్షంలో అరుణ బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆమె మహబూబ్ నగర్ లోక్ సభ నుంచి ఎన్ని కల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీకే ఆరుణతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక ఇప్పటికే చేవెళ్ల ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో సహా పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. -
మోదీతోనే అందరికీ న్యాయం
సాక్షి, హైదరాబాద్: దేశంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ పేర్కొన్నారు. దేశ ప్రజలు మళ్లీ మోదీ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారన్నారు. గత ఐదేళ్లలో దేశాన్ని ‘ఉగ్రవాదరహిత దేశం’గా మార్చారన్నారు. ‘ఫోరం ఫర్ న్యూథింకర్స్’ ఆధ్వర్యంలో ఆది వారం హైదరాబాద్లో ‘మరోసారి మోదీ రావాలి’ అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మోదీ కాకుండా మరో ప్రభుత్వం వస్తే పేదలకు మళ్లీ ఇబ్బందులు తప్పవన్నారు. 2022 నాటికి 75ఏళ్లు పూర్తి చేసుకోనున్న స్వతంత్ర భారతంలో ఇంకా ఆకలి చావులు ఉండకూడదనుకుంటే మళ్లీ మోదీయే ప్రధాని కావాలన్నారు. ఆయనే దేశాన్ని ‘నవభారతం’గా మారుస్తున్నారని పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలో 2020కి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుందన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 338 సీట్లు వస్తాయని, తమ పార్టీనే అధికారంలోకి వస్తుందన్నారు. తాము మీడియాను మీడియాలాగే చూస్తున్నామన్నారు. తమ పార్టీకి సొంత మీడియా వస్తుందని అప్పటివరకు నమో యాప్ను వాడాలని సూచించారు. మోదీ ప్రభుత్వం ఏపీకి సంబంధించి 80% హామీలను నెరవేర్చిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ మోదీ పాలనలో ప్రజలకు మంచి రోజులు వచ్చాయన్నారు. పంటలకు మద్దతు ధర పెంచడమే కాకుండా ఫసల్ బీమా యోజన వంటి పథకాలతో వ్యవసాయరంగానికి లబ్ధిచేకూర్చారన్నారు. ఇబ్బందులు ఎదురైనా ఇప్పుడు జీఎస్టీ ఫలాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. ఆర్థికంగా వెను కబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీయేతరులకు 10% రిజర్వేషన్లు కల్పించిన ఘనతా మోదీదేనన్నారు. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో మోదీ ప్రజల కోసం పనిచేస్తున్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్ రాంచంద్రరావు తదితరులు మాట్లాడారు. -
‘మనకూ సొంత మీడియా వస్తుంది’
హైదరాబాద్: 2020 నాటికి భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్ధిక దేశంగా మారుతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. మోదీ మరోసారి రావాలి అనే అంశంపై హైదరాదాబాద్ మారీగోల్డ్ హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన రాంమాధవ్ మాట్లాడుతూ.. ఇండియాను ప్రధాని నరేంద్ర మోదీ ఐదేళ్లుగా టెర్రరిస్టు ఫ్రీ దేశంగా మార్చారని అన్నారు. 2022కి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న స్వతంత్ర భారతంలో ఇంకా ఆకలి చావులు ఉండాలా అని ప్రశ్నించారు. మోదీ ఇండియాని నయా ఇండియాగా మార్చుతున్నారని వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. మోదీయే మరోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించబోతున్నారని అన్నారు. ఏపీకి సంబంధించి 80 శాతం విభజన హామీలు నెరవేర్చామని వెల్లడించారు. మీడియాని మీడియంగానే చూస్తున్నామని చెప్పారు. మోదీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నారని అన్నారు. మనకు కూడా త్వరలోనే సొంత మీడియా వస్తుందని వెల్లడించారు. అప్పటి వరకూ నమో యాప్ వాడాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని, సుమారు 338 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. -
‘ఇమ్రాన్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి’
న్యూఢిల్లీ : భారత పైలట్ అభినందన్ను క్షేమంగా అప్పగించిన కారణంగా తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు నోబెల్ శాంతి ప్రకటించాలని పాకిస్తానీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ట్విటర్లో #NobelPeacePrizeForImranKhan అనే హ్యాష్ ట్యాగ్తో హల్చల్ చేస్తున్నారు. మరోవైపు చైనా కూడా అభినందన్ విడుదల ద్వారా ఇమ్రాన్ శాంతికి ఆహ్వానం పలికారని ప్రశంసలు కురిపించింది. కాగా ఈ విషయంపై బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ స్పందించారు.(ఇమ్రాన్ ఖాన్పై చైనా ప్రశంసలు) శనివారం ఇండియా టుడే కాన్క్లేవ్లో మాట్లాడుతూ... ‘ ప్రస్తుతం పాకిస్తాన్లో కొంత మంది ప్రజలు, ఇమ్రాన్ ఖాన్ పార్టీ వాళ్లు తమ ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి రావాలని కోరుకుంటున్నారు. సరే ఆయనను బహుమతి తీసుకోమనండి. అయితే అది నిజంగా పాకిస్తాన్ ప్రజలకు పనికి వచ్చే అంశమేనా? ఉగ్రవాదాన్ని రూపుమాపాలని ఇమ్రాన్ నిజంగా భావిస్తే పాక్, భారత్లతో పాటు ప్రపంచం మొత్తానికీ కూడా మంచిదే. కానీ వాళ్లు మారతారని అనుకోవడం లేదు. వారి విధానంలో భాగంగానే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ పన్నాగంలో చిక్కాలని ఎవరూ అనుకోవడమూ లేదు’ అని రామ్ మాధవ్ ఘాటు విమర్శలు చేశారు. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేఫథ్యంలో భారత్- పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. భారత పైలట్ అభినందన్ అప్పగింతతో తగ్గినట్లుగా కన్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శాంతి చర్చలకు ఆరంభంగానే అభినందన్ను విడిచిపెట్టామని పాక్ చెబుతుండగా.. జెనీవా ఒప్పందాన్ని అనుసరించి మాత్రమే అతడిని స్వదేశానికి అప్పగించారని భారత సైన్యం పేర్కొంది.(పాక్ జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించిందా?) Alhamdolilah #PakistanLeadsWithPeace @ImranKhanPTI @OfficialDGISPR Nobel Peace Prize is waiting for you @ImranKhanPTI — Ayaz Shoukat (@AyazACMA) March 1, 2019 Nobel peace prize winner for 2019 is Mr. Imran Khan, Prime minister of Islamic state of Pakistan . Salute to Pak Army https://t.co/adgndxM9e7 — hasan (@hasanchand) March 1, 2019 -
శాంతి కాముకత భారత్ బలహీనత కాదు
సాక్షి, న్యూఢిల్లీ: శాంతి, శ్రేయస్సును కాంక్షించే భారతదేశం బలమైనదని, శాంతికి విఘాతం కలిగిస్తూ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రమూకలకు సమాధానం ఇస్తూ భారత వైమానిక దళం తీసుకున్న నిర్ణయం గర్వించదగినదని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇండియన్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ‘‘కౌటిల్య ఫెలోషిప్ ప్రోగ్రామ్’’ను అభ్యసిస్తున్న 32 దేశాలకు చెందిన 80 మంది దౌత్యవేత్తలు, పరిశోధకులు, విద్యావేత్తలు, విధాన సభల సభ్యులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఇండియా ఫౌండేషన్ సంచాలకులు రామ్ మాధవ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రపంచమంతా ఒకే కుటుంబం అని చెప్పే ‘‘వసుదైక కుటుంబం’’అనే భావన భారత్ తత్త్వమని, అందుకే ప్రతి దేశంతో స్నేహాన్ని, శాంతిని కాంక్షిస్తుందని, దీన్ని బలహీనత అనుకోవడం సరికాదని స్పష్టం చేశారు. ఉగ్రవాద శిబిరాలకు వ్యతిరేకంగా జరిగిన వైమానిక దాడుల నేపథ్యంలో, భారత్ ప్రతి చోటా శాంతిని ప్రోత్సహించాలని కోరుకుంటుందని, అయితే శాంతికి విఘాతం కలిగించి, దేశ భద్రతకు సవాలు విసిరితే మాత్రం ఉపేక్షించమని, భారతీయుల శాంతి కాముకత్వాన్ని బలహీనతగా చూడొద్దని హితవు పలికారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించే ఉగ్రవాద మూకలకు వ్యతిరేకంగా తీసుకున్న భారత్ నిర్ణయానికి ప్రపంచం మద్దతు అందించడం సంతోషించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. -
ఉగ్రవాద అంతమే మా లక్ష్యం
విజయవాడ: దేశంలో ఉగ్రవాదాన్ని సమూలంగా అంతం చేయటమే మా అంతిమ లక్ష్యమని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ వ్యాఖ్యానించారు. గురువారం విజయవాడ నగరంలోని హోటల్ మురళీ ఫార్చ్యూన్లో బీజేపీ ఆధ్వర్యంలో భారత్ కే మన్ కీ బాత్ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన రాంమాధవ్, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణతో కలిసి చాంబర్ ఆఫ్ కామర్స్, లారీ ఓనర్స్ అసోసియేషన్, చార్టర్డ్ అకౌంటెంట్స్, వ్యాపారవర్గాలతో భేటీ అయ్యారు. అనంతరం రాంమాధవ్ విలేకరులతో మాట్లాడారు. కశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో అమరులైన సైనికులకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. వీర జవానుల కుటుంబాలను మా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మన్కీ బాత్.. మోదీ కే సాత్ పేరుతో విజన్ డాక్యుమెంట్ను రూపొందించామని వెల్లడించారు. మోదీ జగన్నాధ రథాన్ని ఎన్ని ప్రతిపక్షాలు కలిసినా ఆపలేరని వ్యాఖ్యానించారు. ఐదేళ్లపాటు అవినీతి, అసమర్థపాలన ఏపీలో కొనసాగిందని, మార్చిలో బీజేపీ విజన్ డాక్యుమెంట్(మ్యానిఫెస్టో) విడుదల చేస్తామని చెప్పారు. 85 శాతం హామీలు ఏపీలో అమలు చేశామని, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం జరగకపోవడానికి ఏపీ ప్రభుత్వ జాప్యమే కారణమని వివరించారు. ఐదేళ్లలో చరిత్రాత్మక నిర్ణయాలు: కన్నా పేదరిక నిర్మూలనకు కృషి చేసిన వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కొనియాడారు. ఐదేళ్లలో ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు మోదీ తీసుకున్నారని అన్నారు. వచ్చే ఐదేళ్లలో ఏపీకి ఏమి చెయ్యాలో చర్చించామని, అలాగే వివిధ రంగాల వారి సలహాలు కూడా తీసుకున్నట్లు చెప్పారు. -
నిజామాబాద్లో అమిత్షా పర్యటన
సాక్షి, హైదరాబాద్ : రానున్ను లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిజామాబాద్లో పర్యటన చేయనున్నారు. ఫిబ్రవరి 13న నిజామాబాద్లో అమిత్ షా పర్యటిస్తారని ప్రకటించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేయడం కోసం నాయకులు పర్యటిస్తారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయ పతాకం ఎగురవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరూ మోదీని మళ్లీ ప్రధానిగా చూడాలనుకుంటున్నారని అన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రజలందరికీ ఆమోదయోగ్యమైందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి డబుల్ ధమాకా బడ్జెట్ వస్తుందని, మోదీకి ధీటైన నాయకుడు ఏ పార్టీలోనూ లేడని, మహాకూటమిలు మోదీని ఏంచేయలేవంటూ ధీమా వ్యక్తం చేశారు. -
పాక్ కనుసన్నల్లో కశ్మీర్ పార్టీలు
న్యూఢిల్లీ/శ్రీనగర్: కశ్మీర్ అసెంబ్లీ రద్దయ్యాక గురువారం రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. పాకిస్తాన్ ప్రోద్బలంతోనే బద్ధ శత్రువులైన పీడీపీ, ఎన్సీలు చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాయన్న బీజేపీ నాయకుడు రామ్ మాధవ్ వ్యాఖ్యలపై ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణల్ని రుజువుచేయాలని లేదంటే క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో రామ్ మాధవ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరిగే అవకాశాలున్నాయని వచ్చిన నివేదికల్ని బహిర్గతం చేయాలని గవర్నర్ సత్యపాల్ మాలిక్ను ఒమర్ కోరారు. కశ్మీర్ ప్రాంతీయ పార్టీలు పాక్ కనుసన్నల్లో పనిచేస్తున్నాయన్న బీజేపీ వ్యాఖ్యలపై రాష్ట్ర మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. బీజేపీతో పొత్తుపెట్టుకున్నప్పుడు మాత్రం పీడీపీ, ఎన్సీల దేశభక్తి, విశ్వసనీయతను ఆ పార్టీ ప్రశ్నించలేదని అన్నారు. ‘ఒక పార్టీ జాతీయవాదం, దేశభక్తిని ఎలా నిర్ణయిస్తారు. కేంద్రంతో ఉంటే దేశభక్తులు.. లేకుంటే జాతి వ్యతిరేకులా?’ అని సూటిగా ప్రశ్నించారు. కలసి పోటీచేయగలరా?: రామ్ మాధవ్ బీజేపీ, ఎన్సీల మధ్య ట్వీటర్ వేదికగా మాటల యుద్ధం జరిగింది. పీడీపీ, ఎన్సీల స్నేహం నిజమైనదైతే వచ్చే ఎన్నికల్లో కూడా ఆ రెండు పార్టీలు కలసి పోటీచేయాలని కశ్మీర్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జీ రామ్ మాధవ్ సవాలు విసిరారు. ప్రభుత్వ ఏర్పాటుకు కలసిరావాలని కశ్మీర్ ప్రాంతీయ పార్టీలకు పాక్ నుంచి ఆదేశాలు అందాయన్నారు. పాక్ సూచనల మేరకు ఎన్సీ, పీడీపీలు స్థానిక సంస్థల ఎన్నికల్ని బహిష్కరించాయన్నారు. మాధవ్ ఆరోపణల్ని ఒమర్ అబ్దుల్లా తిప్పికొడుతూ ‘ ఐబీ, రా, సీబీఐ లాంటి సంస్థలు మీ నియంత్రణలోనే ఉన్నాయి. ధైర్యముంటే మీ ఆరోపణల్ని నిరూపించే సాక్ష్యాలు బయటపెట్టండి’ అని డిమాండ్ చేశారు. దీనికి మాధవ్ బదులిస్తూ ‘ మీ దేశభక్తిని శంకించడం లేదు. కానీ పీడీపీ, ఎన్సీల మధ్య హఠాత్తుగా పుట్టుకొచ్చిన ప్రేమ సందేహాలకు తావిస్తోంది. విదేశీ ఒత్తిడి లేదని లేదంటున్నారు కాబట్టి నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీచేసి మీ మధ్య స్నేహం నిజమైనదే అని నిరూపించండి’ అని అన్నారు. ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు.. కేంద్రం ఒత్తిడితోనే అసెంబ్లీని రద్దుచేశారన్న ఆరోపణల్ని గవర్నర్ తోసిపుచ్చారు. ‘భారీ స్థాయిలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు నివేదికలొస్తున్నాయి. ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. తెరచాటుగా చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయి. తన వర్గం ఎమ్మెల్యేలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) సాకుతో బెదిరిస్తున్నారని మెహబూబా ఆరోపించారు. మరో వర్గం ఎమ్మెల్యేలకు గుర్తుతెలియని వారు భారీగా డబ్బు ఆశ చూపారు. ఈ బేరసారాలు 20 రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి’ అని మీడియాకు వివరించారు. మే లోపే ఎన్నికలు: సీఈసీ కశ్మీర్లో మే లోపు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. లోక్సభ ఎన్నికల కన్నా ముందే అక్కడ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రావత్ చెప్పారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అసెంబ్లీ రద్దయితే ఆరు నెలల్లోపు ఎన్నికలు జరగాలి. కశ్మీర్ విషయంలో ఆ గడువు మే వరకు ఉంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొనే పోలింగ్ తేదీల్ని ఖరారుచేస్తామని రావత్ చెప్పారు. అసెంబ్లీ రద్దయిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోందని, తెలంగాణలోనూ ఇదే నియమాన్ని వర్తింపజేస్తున్నామని తెలిపారు. మెహబూబాకే మేలు! కశ్మీర్ రాజకీయ డ్రామాలో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీదే విజయమా? కాంగ్రెస్, ఎన్సీ మద్దతుతో ఆమె ముఖ్యమంత్రి కాకుండా గవర్నర్ సత్యపాల్ మాలిక్ అడ్డుకోవడం తాత్కాలికమేనా? అంటే..అసెంబ్లీ రద్దు పరోక్షంగా బీజేపీకి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజ్జన్ గని లోన్ని సీఎం చేసి కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటుచేయాలనుకున్న బీజేపీ ప్రయత్నాలకు అసెంబ్లీ రద్దుతో గండిపడినట్లయింది. పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్లు తమకున్న ఎమ్మెల్యేల బలంతోనే ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నాయని, ఈ ఆలోచన ప్రతిపాదిత కూటమికి మేలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. జూన్ 19న పీడీపీ–బీజేపీ సంకీర్ణం కుప్పకూలిన తరువాత పీడీపీ అస్తిత్వ సంక్షోభంలో కూరుకుపోయింది. పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జన్ గని బీజేపీతో చేతులు కలిపి సీఎం అవుతారనే ప్రచారంతో..కొందరు పీడీపీ సభ్యులు ఆయన గూట్లో చేరారు. బుధవారం మధ్యాహ్నం వరకు అత్యంత నిరాశాజనకంగా ఉన్న పీడీపీ శిబిరంలో ఒక్కసారిగా ఆశావహ వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎన్సీల మద్దతు తనకు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ గవర్నర్కు లేఖ రాయడం ద్వారా ముఫ్తీ.. సజ్జద్ ఫ్రంట్లోకి మరిన్ని వలసల్ని నిలువరించారు. గవర్నర్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయాలని మెహబూబా యోచిస్తున్నట్లు సమాచారం. -
కూటమి పేరిట డ్రామాలు
భైంసా/భైంసాటౌన్(ముథోల్): కాంగ్రెస్, టీడీపీలు కూటమి పేరిట డ్రామాలాడుతున్నాయని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ విమర్శించారు. భైంసాలో బీజేపీ అభ్యర్థి రమాదేవి నామినేషన్ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని, ప్రస్తుతం తామే ప్రత్యామ్నాయం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహాకూటమి పేరిట వచ్చి ప్రజల బతుకులతో ఆడుకునేందుకు మరోసారి డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి.. ఇప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలకు తూట్లు పొడిచారని ఆరోపించారు. కాంగ్రెస్ను భూస్థాపితం చేసేందుకు ఎన్టీఆర్ కంకణం కట్టుకుంటే.. చంద్రబాబు ఆ పార్టీ చంకనెక్కి కూర్చున్నారని దుయ్యబట్టారు. ఏపీలో తన సీటును కాపాడుకోలేని చంద్రబాబు.. దేశాన్ని ఉద్ధరిస్తానని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జేబులో టీడీపీ ఉందని, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ టీడీపీ చంకలో ఉందని ఎద్దేవా చేశారు. పక్కనే గోదావరి నది ఉన్నా తాగు, సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవన్నీ తీరాలంటే బీజేపీ గెలవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ గళమెత్తింది బీజేపీయే తెలంగాణ గళమెత్తింది మొదట బీజేపీయేనని రాంమాధవ్ అన్నారు. 1997 నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం తామే తెచ్చామని భ్రమ కల్పించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల గద్దె దిగిందని విమర్శించారు. ఐదేళ్లు పాలన చేతకాని టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. కరుడు గట్టిన మతతత్వ పార్టీ ఎంఐఎంతో దోస్తీ పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని దిగజారుస్తున్నారని ఆరోపించారు. -
టీడీపీ తెలుగు ద్రోహుల పార్టీ
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘నిన్నటి వరకు కాంగ్రెస్ను అనరాని మాటలతో దూషిం చిన తెలుగుదేశం పార్టీ రాత్రికి రాత్రే ప్లేట్ ఫిరాయించింది. కాంగ్రెస్కు మిత్ర పక్షమై.. నేను తెలుగుదేశం పార్టీ కాదు.. నేను తెలుగు ద్రోహుల పార్టీ అని ఆ పార్టీ తన పేరు మార్చుకుంది’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ధ్వజమెత్తారు. ఆదివారం సూర్యాపేటలో నియోజకవర్గ స్థాయి ప్రముఖుల శిక్షణ శిబిరం ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. దీనికి రాంమాధవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పొంతన లేని పార్టీలు రాష్ట్రంలో మహాకూటమిగా ఏర్పడ్డాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలాగో మునుగుతుందని, ఎవరెవరు వెంట వస్తే వారిని కూడా ముంచే కార్యక్రమంలో టీడీపీ, కాంగ్రెస్ ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఉన్న వ్యతిరేకతను చూసి ప్రజలు తమకే పట్టం కడతారన్న భ్రమలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. జెండా ఎజెండా లేనిది మహాకూటమని, ఈ కూటమి విజయం సాధించడం అసాధ్యమన్నారు. ప్రజలకు బీజేపీ ఆశాకిరణంలా కనిపిస్తోందని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే స్థితిలో ఉంటుందని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్కి 30 సీట్లు కూడా రావన్నారు. ఈ శిబిరంలో బీజేపీ నాయకులు గుజ్జుల ప్రేమందర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కొణతం సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
ఆ పార్టీలను తెలంగాణ నుంచి తరిమికొట్టండి
-
కాంగ్రెస్ జేబులో కూర్చొని రాజకీయాలా?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్ను కూకటి వేళ్లతో పెకిలించాలని ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, కానీ.. చంద్రబాబు అదే పార్టీతో పొత్తు పెట్టుకుని తెలుగు ద్రోహుల పార్టీగా మార్చారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.రాంమాధవ్ విమర్శించారు. కాంగ్రెస్ జేబులో కూర్చొని చంద్రబాబు రాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బుధవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పొద్దుటూరి వినయ్కుమార్రెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ, ఏపీ లో పుంజుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, దీని కోసం టీడీపీ ఆక్సిజన్ అందిస్తోందని ఎద్దేవా చేశారు. అవినీతిలో తెలంగాణ రెండో స్థానం అవినీతి, కుటుంబ పాలనకు ట్రేడ్ మార్క్గా అయిన కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే టీఆర్ఎస్ సర్కారు తయారైందని రాంమాధవ్ ఆరోపించారు. అవినీతి లో టీఆర్ఎస్ సర్కారు రెండో స్థానంలో నిలవగా, ఏపీలో చంద్రబాబు సర్కారు నాలుగో స్థానంలో నిలిచిందని చెప్పారు. నాలుగున్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు. నిరుపేద ప్రజలు, రైతుల సంక్షేమం గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా అవినీతిపరులు.. కాంట్రాక్టర్ల రాజ్యంగా మారిందని నిప్పులు చెరిగారు. రూ.పది వేల కోట్లతో ఇంటింటికీ తాగు నీరిచ్చేందుకు వీలున్నప్పటికీ.. మిషన్ భగీరథ ద్వారా రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని మండివడ్డారు. ఇంటింటికీ తాగునీరు రాలేదు కానీ, నిధులు మాత్రం ఖర్చయ్యాయని పేర్కొన్నారు. ఐదేళ్లు పాలించాలని ప్రజలు టీఆర్ఎస్కు అధికారం ఇస్తే.. నాలుగేళ్లలో కేసీఆర్ దోచుకోవాల్సింది అంతా దోచుకుని మళ్లీ అధికారం ఇవ్వాలని ప్రజల వద్దకు వెళ్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, రాష్ట్ర నాయకులు లోక భూపతిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అర్వింద్ తదితరులు పాల్గొన్నారు. -
‘చంద్రబాబు తెలుగు ద్రోహిగా మిగిలాడు’
సాక్షి, జగిత్యాల: తెలంగాణ ప్రజలు ఐదేళ్లు పాలించమని అధికారం అప్పగిస్తే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాలుగేళ్లకే ప్రభుత్వం రద్దు చేసి 420గా మిగిలిపోయాడని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ విమర్శించారు. బుధవారం ఆయన జగిత్యాలలో మాట్లాడుతూ.. మార్పు కోసం నందమూరి తారకరామరావు టీడీపీని స్థాపిస్తే వెన్నుపోటుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు ద్రోహిగా మిగిలిపోయాడని అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ కుటుంబం బంగారు కుటుంబంగా మారిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు అవినితీ కేరాఫ్ అడ్రస్గా మారాయని వ్యాఖ్యానించారు. పేదవారి కోసం కేంద్రం ఆయుష్మాన్ భవ పథకం తీసుకువస్తే.. తెలంగాణ ప్రభుత్వం అవసరం లేదని తిరస్కరించిందని అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడటానికి అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు కేసీఆర్ కారణమని మండిపడ్డారు. వారిద్దరి అసమర్ధత వల్లే వేలాది మంది రైతులు, ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే చక్కెర ఫ్యాక్టరీని తెరపిస్తామని హామీ ఇచ్చారు. -
రాష్ట్రంలో గరుడ పురాణం నడుస్తోంది..!
సాక్షి, గుంటూరు /గన్నవరం: దేవాలయాల్లో నడవాల్సిన గరుడ పురాణం ఆంధ్రప్రదేశ్లోని రాజకీయపార్టీల్లో నడుస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్ ఎద్దేవా చేశారు. కాల్షీట్లులేని కమిడియన్ చెప్పే గరుడ పురాణం కథను చదువుతూ సీఎం చంద్రబాబు రాజకీయం చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. గుంటూరులో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి అధ్యక్షతన ఆదివారం జరిగిన మహిళా సాధికారిత– మహిళా సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు ఆయన గన్నవరం విమానాశ్రయంలోనూ మీడియాతో మాట్లాడారు. 2014లో మహిళల అభిమానంతోనే మోదీ ప్రధాని అయ్యారని, వారి కష్టాలు తీర్చేందుకు స్వచ్ఛభారత్ అభియాన్ పేరుతో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఏపీలో మరుగుదొడ్లను లెక్కల్లోనే చూపుతున్నారని ఆరోపించారు. గతంలో పశువుల గడ్డిని తిన్న సీఎంను చూశామని, ఆంధ్రా సీఎం మరుగుదొడ్లలో సైతం దోపిడీకి పాల్పడటం దారుణమన్నారు. కేంద్రం పేదల కోసం ఇచ్చే నిధుల్లో అవినీతికి పాల్పడితే చూస్తూ ఊరుకోదని, విచారణ జరిపి దోషులను శిక్షిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు ఊడిగం చేసేందుకే ఢిల్లీ పర్యటన సీఎం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేసేందుకే ఢిల్లీ పర్యటనకు వెళ్లారు తప్పితే రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం కాదని రాంమాధవ్ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు భుజానికి ఎత్తుకుని ఊడిగం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్కు మిత్రపక్షంగా ఉన్న పార్టీలు ఒక్కొక్కటి బయటకు వెళ్ళిపోతుండడంతో వారిని బుజ్జగించేందుకు చంద్రబాబును రంగంలోకి దింపినట్లు ఆరోపించారు. ఎన్టీఆర్ కాంగ్రెస్ను అడ్రస్ లేకుండా చేయాలనే ఆలోచనతో పార్టీ పెడితే, చంద్రబాబు మాత్రం మాయావతి వద్దకు వెళ్లి సాగిలపడి కాంగ్రెస్కు మద్దతివ్వమని బతిమాలుతున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు చర్యలతో ఎన్టీఆర్ ఆత్మ హోషిస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు రహత్కర్, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, మహిళా మోర్చా జాతీయ ఇన్చార్జి పురంధరేశ్వరి పాల్గొన్నారు. -
‘అంత్యోదయ’మే మోదీ నినాదం
సాక్షి, హైదరాబాద్: దేశంలో చిట్టచివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలన్న ఏకైక లక్ష్యంతోనే మోదీ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. అంత్యోదయ నినాదంతో పనిచేస్తున్నందున.. 2019 ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి తీసుకురావాలని బీజేవైఎం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బీజేవైఎం ‘విజయ్లక్ష్య 2019 యువ మహాధివేశన్’లో ఆదివారం ప్రసంగించారు. పేదరికాన్ని అనుభవించిన మోదీకి ప్రజలకు ఎదురయ్యే కష్టాలేంటో తెలుసన్నారు. అందుకే బడుగు, బలహీన, పేదల సంక్షేమానికి అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమల్లోకి తెచ్చారన్నారు. ఆర్థిక స్వావలంబనతో విశ్వశిఖరంపై భారత జెండా ఎగురవేసిన ఘనత మోదీదేనన్నారు. యువమోర్చా ప్రతినిధులలే.. రేపటి భావి నేతలని, సేవే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ‘బూత్ స్థాయిలో గెలిస్తేనే పార్టీ గెలుస్తుంది. బూత్ స్థాయినుంచే పార్టీని బలోపేతం చేయాలి. అమిత్ షా, పూనమ్ మహాజన్ ఆధ్వర్యంలో యువమోర్చా ప్రతినిధులంతా కొత్త ఉత్సాహంతో పనిచేయాలి’అని గోయల్ కోరారు. కేంద్రం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఇక తెలంగాణ వంతు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ మాట్లాడుతూ.. బీజేపీ 20 రాష్ట్రాల్లో గెలిచిందని, ఇప్పుడు తెలంగాణలోనూ గెలవాలన్నారు. అందుకు యువమోర్చా రెట్టించిన ఉత్సాంతో పని చేయాలన్నారు. ప్రధాని మోదీకి సియోల్ శాంతి బహుమతి వచ్చిందని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ప్రధానికి అద్భుతమైన మర్యాద, స్వాగతం లభిస్తున్నాయన్నారు. భారత గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత గొప్పగా చేసిన ఘనత ప్రధానిదేనని రాంమాధవ్ ప్రశంసించారు. వివిధ దేశాధి నేతలు కలిస్తే.. ప్రపంచం దృష్టంతా మోదీపైనే ఉంటుందన్నారు. యెమెన్ అంతర్యుద్ధం సమయంలో.. అక్కడ చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు సైన్యాన్ని రంగంలోకి దించామని ఆయన గుర్తుచేశారు. ఇదే సమయంలో అక్కడున్న చిక్కున్న తమవారినీ కాపాడాలంటూ 30 దేశాలు భారత్ సాయాన్ని అర్థించాయన్నారు. దేశవ్యాప్తగా బీజేపీ జోరును అడ్డుకునేందుకు ఎవరెన్ని కుట్రలు పన్నినా పెద్ద ప్రభావం ఉండదన్నారు. తెలంగాణలో బీజేపీ విజయానికి.. ఈ సదస్సు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. ‘19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. 20వ రాష్ట్రంగా తెలంగాణ కూడా బీజేపీ ఖాతాలోకి రాబోతోంది’ఇందులో సందేహమేమీ లేదు. అని రాంమాదవ్ పేర్కొన్నారు. బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనమ్ మహజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనం లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు మురళీధర్రావు, రాంలాల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో కమలోదయం... డిసెంబర్ 11న తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ జోస్యం చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ద్వారా 2019లో మోదీ విజయం సంపూర్ణం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసేందుకు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ‘విజయలక్ష్యం 2019 యువ మహాధివేశన్’పేరుతో యువ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తెలుగులో కూడా ప్రసంగించారు. నరేంద్ర మోదీ వంటి ప్రధాని దొరకడం మన అదృష్టమన్నారు. పతంగి పట్టుకుని కారు నడుపుతున్న వారి మధ్యలోకి అమిత్ షా లాంటి సింహం రావడంతో భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. తాను తెలంగాణ బిడ్డనని, ఆంధ్రా కోడలినని తెలిపారు. పప్పూ వెంట కొంత మంది మూర్ఖులు ఉన్నారని పరోక్షంగా రాహుల్ గాంధీ గురించి ప్రస్తావించారు. 2019లో విజయమే మన సంకల్పమని, మోదీ అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలన్నారు. ఈ సందర్భంగా ఆమె అమిత్ షాను సత్కరించి, వివేకానంద పుస్తకం బహూకరించారు. అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ: లక్ష్మణ్ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీతో పాటు పెద్దఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే లక్షా 10 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీఇచ్చి కేవలం 15 వేల ఉద్యోగాలను మాత్రమే కేసీఆర్ భర్తీ చేశారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్, అధికారంలోకి వచ్చిన అనంతరం ఇంట్లోనే నాలుగు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శించారు. డీఎస్సీ కోసం యువత ఎదురు చూసి విసిగిపోయారన్నారు. అమిత్ షా నేతృత్వంలో మరొకసారి మోదీ ప్రధాని కావడం తథ్యమన్నారు. తెలంగాణ యువకులు కమల వికాసానికి కంకణబద్ధులై ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. -
‘ఏపీలో కమెడియన్లు చాలా మంది ఉన్నారు’
సాక్షి, కృష్ణా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలక్షేపం కోసం పనిచేసే కమెడియన్లు చాలా మంది ఉన్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ ఎద్దేవా చేశారు. ఆదివారం గుంటూరులో జరుగనున్న మహిళా మోర్చా సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేయడానికే ఢిల్లీకి వెళ్లారని, ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం కాదని అన్నారు. ఏపీ, తెలంగాణలలో కాంగ్రెస్కు ఊడిగం చేస్తున్నాము.. కేజ్రీవాల్, మాయావతిలను కూడా చేయమని చెప్పడం కోసమే వెళ్ళాడు అంటూ దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వమే మొత్తం నిధులిస్తోందని పేర్కొన్నారు. ఏపీలో గరుడ పురాణం నడుస్తూందని అన్నారు. రానున్న రోజుల్లో ఏపీలో బీజేపీ బలమైన పార్టీగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
రామ్ మాధవ్ వర్సెస్ వినోద్ కుమార్
-
రూ.4 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి?
సాక్షి, అమరావతి: ‘‘గత నాలుగేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం బయటినుంచి రూ.లక్షన్నర కోట్లు అప్పు తెచ్చింది. ఇదిగాక 14వ ఆర్థిక సంఘం ఐదేళ్లలో రాష్ట్రానికి రెండున్నర లక్షలకోట్ల కేంద్ర సాయాన్ని సిఫార్సు చేస్తే అందులో రూ.2 లక్షలకోట్ల నిధులు ఇప్పటికే కేంద్రం నుంచి రాష్ట్రానికందాయి. ఇవిగాక ఇతరత్రా నిధులతో కలపి మొత్తం రూ.4 లక్షల కోట్ల డబ్బులు రాగా అవన్నీ ఎక్కడికి పోయాయి? హైదరాబాద్ను నేనే కట్టేశానని చెప్పుకుంటారే.. రాష్ట్రానికి రూ.4 లక్షల కోట్లు వచ్చినా రాజధాని ఎందుకు కట్టలేకపోయారు? ఈ నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయి?’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సీఎం చంద్రబాబును నిలదీశారు. అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్రప్రభుత్వం న్యాయం చేయాలనే డిమాండ్తో ‘రాష్ట్రప్రభుత్వ అవినీతి దాహానికి బలైన బాధితుల తరఫున ధర్మపోరాట దీక్ష’ పేరుతో బీజేపీ సోమవారం నుంచి వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. విజయవాడలో జరిగిన ధర్నాలో రాంమాధవ్ మాట్లాడారు. ఆయా పథకాలకు ‘చంద్రన్న’ అని పేరు పెట్టుకున్నా, వాటికీ నిధులిస్తోంది కేంద్రమేనన్నారు. కేంద్ర నిధులతో అభివృద్ధి పనులు చేస్తూ.. కేంద్రంపైనే విమర్శలు చేస్తూ.. ఇచ్చిన నిధులకు లెక్కలడిగితే, మేం చెప్పబోమనే నియంతృత్వ పోకడలతో రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.‘మమ్మల్ని ప్రశ్నిస్తే ఏపీని ప్రశ్నించినట్టే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏపీ అంటే టీడీపీ ఒక్కటే కాదు, ఏపీ అంటే ఈ రాష్ట్రంలోని కోటానుకోట్ల ప్రజలు. అనేక పార్టీలు, సంస్థలు కలిపే ఏపీ అవుతుంది. మనందరికీ ఏపీ అభివృద్ధి పట్ల నిబద్ధత ఉంది’ అని అన్నారు. బాధితుల పొట్టకొట్టి ప్రభుత్వమే కుంభకోణానికి యత్నం ‘అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించి రూ.6,500 కోట్లు బాధితులకు దక్కేలా చేయడం ఏపీ ప్రభుత్వానికి పెద్ద కష్టం కాకూడదు. కానీ భూకబ్జాదారులకు అండగా నిలబడే ప్రభుత్వమిది. అందుకే అగ్రిగోల్డ్ భూములపై కన్నేసి, లక్షలాది కుటుంబాల పొట్టలు కొట్టి, ఆ భూములు కబ్జా చేసే కుతంత్రానికి, కుంభకోణానికి ప్రభుత్వం పాల్పడుతోంది’ అని రాంమాధవ్ ధ్వజమెత్తారు. ఇంతకుమించిన ప్రజాద్రోహం మరొకటి ఉండబోదన్నారు. తెలుగు దోపిడీ పార్టీ బాధితులైన లక్షలాది కుటుంబాలకు న్యాయం చేకూర్చడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం తొందరలోనే మారబోతోందని, అప్పుడు మొదటగా అగ్రిగోల్డ్ బాధితులకు నష్టపరిహారం చెల్లించే నిర్ణయం జరుగుతుందని చెప్పారు. అగ్రిగోల్డ్ వ్యవహారం పైకి కనబడుతున్న చిన్న కుంభకోణమని.. ఈ రాష్ట్రప్రభుత్వం నిలువెల్లా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. తామేమి చేస్తున్నా ఎవరూ ప్రశ్నించకూడదన్న తీరున రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తోందని తప్పుపట్టారు.ఇది హిట్లర్ తరహా పాలనే’’ అని దుయ్యబట్టారు. రాష్ట్రప్రజల ఆశలను ఇక్కడి ప్రభుత్వం వమ్ము చేసిందని, అవినీతి, కుటుంబ పాలన, హిట్లర్ పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. ఇలాంటి ప్రభుత్వానికి ఎక్కువ రోజులు కొనసాగే అధికారం లేదన్నారు. కక్షసాధింపు చర్యలైతే రమేష్ కంటే పెద్ద నాయకులే ఉన్నారుగా.. కేంద్రంపై అపనిందలు వేయడం, అర్థరహితమైన డిమాండ్లు.. ఆరోపణలు చేయడం ద్వారా రాష్ట్రప్రభుత్వ అవినీతి రాజకీయాల నుంచి ప్రజల దృష్టిని మరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. గత మూడేళ్లలో దేశంలోకెల్లా ఏపీకే కేంద్రం నుంచి అత్యధిక నిధులొచ్చాయని స్వయానా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పిన విషయాన్ని మరిచిపోరాదన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు, మంత్రులు గోబెల్స్లని, ఇలాంటి ఎందరో గోబెల్స్కు బాస్ చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఇలాంటి ఆంబోతులతో కేంద్రంపైనా, మోదీపైనా, బీజేపీపైనా ఇష్టమొచ్చినట్టు మాట్లాడిస్తున్నారని విమర్శించారు. ‘‘కక్ష సాధింపు చర్యలు చేపట్టాలంటే సీఎం రమేష్పై దాడులు ఎందుకు? ఆయనకన్నా పెద్ద నాయకులే ఉన్నారు. వారిపై అవినీతి ఆరోపణలున్నాయి. కక్షసాధింపు బీజేపీ పద్ధతి కాదు.. చట్టప్రకారం అవినీతిపరులను జైలుకు పంపేవరకు కేంద్ర ప్రయత్నాలు కొనసాగుతాయి’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే, ఇప్పుడున్నవారు దాన్ని తెలుగు ద్రోహుల పార్టీగా మార్చారని, తెలంగాణలో కాంగ్రెస్ చంకలో కూర్చొని, ఏపీలో దాన్ని భుజాన ఎత్తుకొని రాజకీయాలు చేస్తున్నారని రాంమాధవ్ విమర్శించారు. ప్రజల ముందుకెళ్లి టీడీపీ నిజస్వరూపాన్ని తెలియజెప్పి, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడానికి కంకణం కట్టుకుని బీజేపీ పనిచేస్తుందన్నారు. మోదీని నేను ఆపేస్తానంటూ ఈ రాష్ట్ర నాయకులు పెద్ద ప్రకటనలు చేస్తున్నారని, మోదీని ఆపే శక్తి వారికి లేదని.. ఆరునెలల తర్వాత వారే ఆగిపోబోతున్నారని రాంమాధవ్ అన్నారు. రాష్ట్రంలో ‘లాలూ’చీ పాలన: జీవీఎల్ అమరావతి నిర్మాణం పేరుతో పేదల భూములు కబ్జా చేసినట్టే.. అగ్రిగోల్డ్ వ్యవహారంలోనూ పేదల డబ్బులనూ తినేద్దామని టీడీపీ పెద్దలు చూస్తున్నారని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. టీడీపీ నేతలకు పాలనకంటే కాంట్రాక్టులపైనే మక్కువ ఎక్కువని, మాయచేసి కాంట్రాక్టులు కొట్టేస్తున్నారన్నారు. ఏపీలో ‘లాలూ’చీ పాలన నడుస్తోందని, లాలూప్రసాద్ యాదవ్కు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుందని హెచ్చరించారు. మళ్లీ ఎలాగూ గెలవమనే ఆఖరి ఆరునెలల్లో మరింత సర్దుకుందామని లూటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ బినామీదారులే రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నట్టు నటిస్తూ, మరో చేత్తో లూటీ చేస్తున్నారన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను తక్కువ ధరకు కొట్టేసి బాధితులకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోబోమని, దీనిపై కేంద్రం విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. కాగా, మంత్రాలయంలో అగ్రిగోల్డ్ ఏజెంట్ రాజు సోమవారం ఆత్మహత్య చేసుకోవడంతో అతని మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఇన్చార్జి సునీల్ దేవ్ధర్, ఎంపీ గోకరాజు గంగరాజు, మాజీ మంత్రి పి.మాణిక్యాలరావు, పలువురు రాష్ట్ర పార్టీ నేతలు పాల్గొన్నారు. హాయ్ల్యాండ్ను లోకేష్ కొట్టేయాలనే అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం: కన్నా సీఎం తనయుడు లోకేష్ హాయ్ల్యాండ్ను అతి తక్కువ ధరకు కొట్టేయాలన్న దురుద్దేశంతోనే తొలుత అగ్రిగోల్డ్ సంస్థపై అభాండాలేసి.. దాన్ని నిర్వీర్యంచేసి, 35 లక్షల బాధితుల కుటుంబాలను రోడ్డున పడేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే రాష్ట్రప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్ చేసినప్పటి నుంచి ఏటా వాటి విలువను తగ్గించి చూపుతోందన్నారు. ‘2015లో ఈ ఆస్తుల విలువ రూ.25 వేల కోట్లని చెప్పారు. 2016లో రూ.16 వేల కోట్లన్నారు.. 2017లో రూ.10 వేల కోట్లన్నారు. 2018లో రూ.2,200 కోట్లు అంటున్నారు. బయట వీరి ఆస్తుల విలువలు పెరుగుతుంటే.. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను తగ్గించి చూపిస్తూ వస్తున్నారు. అగ్రిగోల్డ్ పేరిట రూ.570 కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి స్వయంగా ప్రకటించి, ఆస్తుల ఆటాచ్మెంట్ సమయానికి కేవలం రూ.ఆరు లక్షలే ఉన్నాయని చూపించారు’ అని దుయ్యబట్టారు. రూ.3వేల కోట్ల విలువుండే హాయ్ల్యాండ్ను రూ.275 కోట్లకే కొట్టేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం, అగ్రిగోల్డ్ యజమాన్యం బాధితులను ఇబ్బంది పెడుతున్నాయన్నారు. వారికి న్యాయం జరిగేదాకా బీజేపీ అండగా ఉంటుందన్నారు. -
24 గంటలు పనిచేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే రాజకీయ అవినీతి తగ్గిందని కరీంనగర్ లోక్సభ సభ్యుడు బి.వినోద్కుమార్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై, టీఆర్ఎస్పై బీజేపీ నేత రాంమాధవ్ చేసిన విమర్శలను ఆయన ఖండించారు. వినోద్కుమార్ తెలంగాణ భవన్లో సోమవారం విలేకరులతో మాట్లాడారు.‘కేసీఆర్ సర్కారుపై బీజేపీ నేత రాంమాధవ్ చేసిన ఆరోపణలు ఖండిస్తున్నాం. దేశంలో ఎక్కువ అవినీతి రాష్ట్రం తెలంగాణ అని విమర్శించడం సరికాదు. 73 శాతం సంక్షేమ పథకాలు ప్రజలకు చేరలేదన్న ఆయన వ్యాఖ్యలు శోచనీయమని చెప్పారు. గతంలో ఇండియా షైనింగ్ అంటూ వాజ్పేయి, నరేంద్రమోదీ ముందస్తు ఎన్నికలకు వెళ్లలేదా? ప్రధానమంత్రి మోదీ కూడా రేస్కోర్స్ రోడ్డులోని ప్రధాని నివాసంలోనే అందరినీ కలుస్తారు. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కార్యాలయం 24 గంటలు పనిచేస్తోంది. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో రాజకీయ అవినీతి చాలావరకు తగ్గింది. కాంగ్రెస్, బీజేపీ దేశంలోని ప్రాంతీయ పార్టీలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి. కేంద్ర మంత్రులు మేనకాగాంధీ, హర్షవర్ధన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, చౌదరి బీరేంద్రసింగ్ తెలంగాణ ప్రగతిని అభినందించారు. రాంమాధవ్ విమర్శలు పునరావృతం కావద్దు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ బ్రహ్మాండంగా విజయం సాధిస్తుంది. దేశంలో అవినీతికి తావులేకుండా పరిపాలన సాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీల ద్వంద్వ వైఖరి ప్రజలు గమనిస్తున్నారు. ఇది ప్రాంతీయ పార్టీల కాలం. రానున్న రోజుల్లో జాతీయ పార్టీలకు కష్టాలు తప్పవు. కాంగ్రెస్, బీజేపీ డ్రామాలను, తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ బోఫోర్స్ అయితే బీజేపీ రాఫెల్స్ అంటూ లవ్ ఈచ్ అదర్లా తయారయ్యాయి’అని వినోద్ విమర్శించారు. -
‘గోబెల్స్కు గురువులాంటోడు చంద్రబాబు’
సాక్షి, విజయవాడ : టీడీపీ అంటే ‘తెలుగు దోపిడి పార్టీ’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ అభివర్ణించారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా బీజేపీ నేటి నుంచి ఐదు రోజులపాటు రిలే నిరహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితుల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ వైఖరితో లక్షలాది కుటుంబాలు రోడ్డన పడ్డయని, అగ్రిగోల్డ్ ఆస్తులను కొనడానికి వచ్చిన ఎన్ఎల్ గ్రూపును ప్రభుత్వం వెనక్కి పంపిందని ఆరోపించారు. 2019లో ఏపీలో ప్రభుత్వం మారబోతుందని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ప్రభుత్వంలో బీజేపీ కీలకపాత్ర పోషిస్తుందని.. గతంలో ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించింది చంద్రబాబేనని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గోబెల్స్కు గురువు లాంటి వాడని, గత ఎన్నికల్లో బీజేపీ లేకుంటే టీడీపీ అడ్రస్ గల్లంతయ్యేదని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నాలుగో స్థానంలో ఉందని, టీడీపీ-కాంగ్రెస్ నాణానికి చెరోకోణం వంటివని వర్ణించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో త్రిపురా ఫార్మాలాను అనుసరిస్తామని రాం మాధవ్ ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రల తరహాలో ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని వెల్లడించారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు అండగా బీజేపీ దీక్ష
సాక్షి, విజయవాడ : అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ బీజేపీ శాఖ రిలే నిరహార దీక్షలు ప్రారంభించింది. నేటి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ విజయవాడలోని ధర్నా చౌక్లో సోమవారం దీక్షలను ప్రారంభించారు. ఆయనతో పాటు బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు దీక్షలు పాల్గోన్నారు. ప్రభుత్వ అవినీతితోనే అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం జరిగిందని బీజేపీ విమర్శించింది. చంద్రబాబు అత్యాశ కారణంగా ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టిన 32 లక్షల కుంటుబాలు రోడ్డున పడ్డాయని. అగ్రిగోల్డ్ కుంభకోణంపై తక్షణమే సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తగిన న్యాయం చేయకపోవడంతో బాధితులు అత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వచ్చిందని నేతలు మండిపడ్డారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం.. అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ కన్నేశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు రోజురోజుకు ఎందుకు కరిగిపోతున్నాయని ఆయన ప్రశ్నించారు. అమరావతి నిర్మాణం పేరుతో పేదల భుములు కబ్జా చేసినట్లు, పేదల డబ్బులు కూడా తినేయాలని వారు చూస్తున్నారని విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘టీడీపీ నేతలకు పాలన కంటే కాంట్రాక్టులపైనే మక్కువ ఎక్కువ. ఏపీలో లాలూచీ పాలన నడుస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్కు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుంది. న్యాయం జరగక 35 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డున పడ్డారు. 2019 ఎన్నికల తరువాత అధికారంలోకి రారని తెలిసి దోచుకుంటున్నారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్ర ఇచ్చిన నిధులపై లెక్కలు ఎందుకు చెప్పడం లేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి తుపాను బాధితులకు ఎంత ఖర్చు చేశారు?’’ అని వ్యాఖ్యానించారు.