
సాక్షి, హైదరాబాద్: తనను టీఆర్ఎస్లోకి రమ్మని ఎవరూ పిలువలేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. తాను కూడా టీఆర్ఎస్లోకి వెళ్లాలని ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. భవిష్యత్ నిర్ణయం.. సంగారెడ్డి నియోజవర్గ ప్రజలకు మేలు చేసేలా ఉండాలనేదే తన ఆలోచన అని జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో జరిపిన చిట్ చాట్లో పలు అంశాలను ప్రస్తావించారు. సంగారెడ్డి అభివృద్ధి కోసమే గతంలో టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వెల్లడించారు. కాంగ్రెస్లో చేరగానే సంగారెడ్డికి ఐఐటీ తీసుకురాగలిగానని గుర్తుచేశారు. ఐఐటీతో స్థానికులకు ఉద్యోగాలే కాకుండా.. ఎంతో అభివృద్ధి సాధించగలిగానని వెల్లడించారు.
తన రాజకీయ అడుగులన్నీ ప్రజల కోసమేనని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కుటుంబ అవసరాల కోసమో, డబ్బు కోసమో తన రాజకీయ నిర్ణయం ఉండదని తెలిపారు. ప్రజల ఎజెండానే తన రాజకీయ ఎజెండా అని స్పష్టం చేశారు. తను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేస్తానని వ్యాఖ్యానించారు. తన రాజకీయ పుట్టక బీజేపీలో జరిగితే.. టీఆర్ఎస్తో చట్టసభల్లోకి ప్రవేశించానని.. రాజకీయంగా పేరు తెచ్చింది కాంగ్రెస్ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment