
సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి భవిష్యత్ దశ–దిశను నిర్దేశించే వేదికగా ప్రగతి నివేదన సభ చరిత్ర సృష్టించనుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బుధవారం సంగారెడ్డిలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించడానికి మంత్రి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉండి తెలంగాణ ప్రాంత వివక్షకు కారణమైందని, నాలుగున్నర ఏళ్లుగా నిర్దిష్టమైన ప్రణాళికతో ఏ అంశంపై అసెంబ్లీలో చర్చించారని ఆ పార్టీని తలసాని ప్రశ్నించారు. దేశంలో సాగునీటి వనరులు, వాటి వినియోగంపై సీఎం కేసీఆర్కు పూర్తి స్థాయి అవగాహన ఉందని తెలిపారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, పదేళ్లు అధికారంలో ఉన్న జగ్గారెడ్డి సంగారెడ్డి ప్రజల దాహార్తిని తీర్చడానికి ఏ రోజూ ప్రయత్నించలేదని, శాశ్వత పరిష్కారం కోసం జరుగుతున్న పనుల వల్ల కొంత ఇబ్బంది తలెత్తడం సహజమే అన్నారు. తన ఉనికి కోసం రౌడీయిజం, గుండాయిజానికి పాల్పడితే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.