
మీడియాతో మాట్లాడుతున్న కాసు మహేష్రెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారంతో పాటు ఓటర్ల జాబితాకు సంబంధించిన మాస్టర్ డేటా హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ సంస్థ ఐటీ గ్రిడ్స్ వద్ద ఉండటంపై తక్షణం దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. పార్టీ నేతలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్రెడ్డి, లావు కృష్ణ దేవరాయలు ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదికు మంగళవారం ఫిర్యాదు చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. 3 కోట్ల మంది రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం సేవా మిత్ర యాప్ ద్వారా ఒక ప్రైవేట్ సంస్థకు ఏ విధంగా వెళ్లిందన్న దానిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ డేటాను ప్రభుత్వమే ఇచ్చిందా లేక ఇతర మార్గాల ద్వారా వెళ్లిందా అన్నదానిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు. కాసు మహేష్ మాట్లాడుతూ..ఎన్నికల సంఘం జనవరి 11న విడుదల చేసిన ఓటర్ల జాబితా తరువాత గురజాల నియోజకవర్గంలో 3,600 ఓట్లు నమోదు, 3,479 ఓట్లను తొలగించినట్లు కలెక్టర్ ఆఫీసులో ఉన్న డేటా చూపిస్తుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం డేటాలో మాత్రం కేవలం 300 ఓట్లు మాత్రమే తొలగించినట్లు చూపిస్తుండటంపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. జనవరి 11 నుంచి ఇప్పటి వరకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఓట్ల తొలగింపు, చేర్పునకు 3,84,236 దరఖాస్తులు రావడంపై అనుమానాలు వ్యక్తం చేశామని, ఓట్లు తొలగించే ముందు ఆ జాబితాను పరిశీలనకు అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వాలని ద్వేవేదిని డిమాండ్ కోరినట్లు చెప్పారు. దీనికి ద్వివేది అంగీకరించినట్లు కృష్ణదేవరాయులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment