IT Grids Scam
-
‘ఐటీగ్రిడ్ మాదిరిగా కేసు నమోదు చేస్తారా’
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యతను దెబ్బతీస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘సమగ్ర వేదిక’పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పౌరుల వ్యక్తిగత సమాచార వివరాల్ని 25 ప్రభుత్వ శాఖల నుంచి సేకరించి రూపొందించే సమగ్ర నివేదిక ఉద్దేశాలను వెల్లడించాలని అన్నారు. గాంధీ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల వ్యక్తిగత సమాచారం అందుబాటులో ఉంటుందని టీఎస్ ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రజల ఫుట్ప్రింట్ కూడా లభిస్తుందన్న జయేశ్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఐటీగ్రిడ్ మాదిరిగానే.. ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాచారం చోరీ చేసిందని ఐటీగ్రిడ్ కంపెనీపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారని శ్రవణ్ గుర్తుచేశారు. ఈ కేసును తెలుగుదేశం పార్టీతో ముడిపెట్టి గత ఎన్నికల్లో విమర్శలతో దుమ్మెత్తిపోశారని అన్నారు. మరి తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినందుకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా కేసు పెడతారా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత వివరాల్ని క్రోడీకరించి దుర్వినియోగానికి తెర తీసిందని మండిపడ్డారు. ప్రజల అనుమతి లేకుండా అధికారులు వారి వివరాల్ని క్రోడీకరించడం చట్ట విరుద్ధమన్నారు. వ్యక్తిగత సమాచారం వెల్లడవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో ఆధార్ను అన్ని పథకాలకు ముడిపెట్టొద్దని సుప్రీంకోర్టే ఆదేశించిందని, పౌరుల ఫుట్ప్రింట్ కూడా తమవద్ద ఉంటుందని ఐటీ కార్యదర్శి అనడం ఆందోళన కలిగిస్తోందని శ్రవణ్ చెప్పారు. గోప్యంగా ఉండాల్సిన వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వలేదన్న గ్యారెంటీ ఏమిటని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సైబర్ సెక్యూరిటీ కిందకు వచ్చే ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాలని, సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డికి వినతిపత్రం అందిస్తామని తెలిపారు. -
‘ఐటీ గ్రిడ్స్’ నిందితులకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల డేటా, ఆధార్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారనే ఆరోపణలున్న కేసులో ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండి డి.అశోక్, ఆ సంస్థ డైరెక్టరైన ఆయన భార్య శ్రీలక్ష్మికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. అత్యంత కీలకమైన ఓటర్, ఆధార్, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారని ఐటీ గ్రిడ్స్పై డేటా విశ్లేషకులు టి.లోకేశ్వర్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై హైదరాబాద్లోని ఎస్సార్నగర్, మాదాపూర్ పోలీస్ స్టేషన్లల్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తామని, తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారిద్దరూ దాఖలు చేసిన వ్యాజ్యాలను సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి విచారించారు. ఇద్దరికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. రూ.25 వేల విలువైన పూచీకత్తులను ఇద్దరూ సమర్పించాలని, సంబంధిత పోలీస్స్టేషన్లలో రోజూ హాజరుకావాలని, ఏదైనా కోర్టులో పాస్పోర్టులు సరెండర్ చేయాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని హైకోర్టు షరతులు విధించింది. ఐటీ గ్రిడ్స్తో టీడీపీ చేతులు కలిపి కీలకమైన ఓటర్ల వివరాలను ఆ కంపెనీకి అందజేసిందని, అందులో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించే ప్రయత్నం చేశారని లోకేశ్వర్రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో గత నెల 25న రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ దరఖాస్తులను తిరస్కరించగా ఇప్పుడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
ఐటీ గ్రిడ్స్ స్కాం : అశోక్కు బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ప్రజల వ్యక్తిగత డాటాను చోరీ చేసిన కేసులో నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్కు బెయిల్ మంజూరు అయింది. షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. వారానికి ఒక రోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఆశోక్ను ఆదేశించింది. అత్యంత కీలకమైన ఓటర్, ఆధార్, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారని ఐటీ గ్రిడ్స్పై డేటా విశ్లేషకులు టి.లోకేశ్వర్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశోక్పై సంజీవ్రెడ్డినగర్, మాదాపూర్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. -
హైకోర్టును ఆశ్రయించిన ఐటీ గ్రిడ్ అశోక్
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రజల వ్యక్తిగత డాటాను చోరీ చేసిన కేసులో నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్ మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. డాటా చోరీ వ్యవహారంలో మాదాపూర్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అశోక్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణను న్యాయస్థానం జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే రంగారెడ్డి కోరక్టు ఆయన బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. దీంతో అశోక్, అతని భార్య శ్రీ లక్ష్మీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే కేసుల రద్దు కోసం ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం పరారీలో ఉన్న అశోక్ కోసం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం , ముంబై , బెంగళూరులో అతని కోసం గాలిస్తున్నారు. -
ఆ ముగ్గురు కనబడుట లేదు!
-
ఐటీ గ్రిడ్స్ నిందితుల బెయిల్ దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ డాకవరం అశోక్, ఆ సంస్థ డైరెక్టర్, ఆయన భార్య శ్రీలక్ష్మి హైకోర్టులో వ్యాజ్యాల్ని దాఖలు చేశారు. అత్యంత కీలకమైన ఓటర్, ఆధార్, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారని ఐటీ గ్రిడ్స్పై డేటా విశ్లేషకులు టి.లోకేశ్వర్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై సంజీవ్రెడ్డినగర్, మాదాపూర్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఓటర్ల డేటా చౌర్యానికి పాల్పడ్డామని పోలీసులు తమపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని, తమను అరెస్ట్ చేసే అవకాశమున్నందున ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారు రిట్ పిటిషన్లలో కోర్టును కోరారు. ముందస్తు బెయిల్ కోసం వారు చేసుకున్న దరఖాస్తులను రంగారెడ్డి జిల్లాకోర్టు ఈ నెల 25న తిరస్కరించిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. ఐటీ గ్రిడ్స్తో తెలుగుదేశం పార్టీ చేతులు కలిపి కీలకమైన ఓటర్ల వివరాలను అందజేసిందని, అందులో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమని భావించిన వారి ఓట్లను తొలగించే ప్రయత్నం చేశారని లోకేశ్వర్రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేసి దర్యాప్తునకు హాజరుకావాలని పోలీసులు ఇచ్చిన నోటీసులకు అశోక్, శ్రీలక్ష్మి స్పందించలేదు. ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఆ ముగ్గురు కనబడుట లేదు!
-
నిందితులకు షెల్టర్జోన్గా అమరావతి
సాక్షి, అమరావతి: సంచలనం రేకెత్తించిన కీలక కేసుల్లో నిందితులకు అమరావతి షెల్టర్ జోన్గా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో అడ్డగోలుగా దొరికిపోయి, కేసుల్లో చిక్కుకున్న నిందితులు ఆంధ్రప్రదేశ్లో దాగుడుమూతలు ఆడుతున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో వారికి ఉన్న సన్నిహిత సంబంధాలే కారణమన్నది బహిరంగ రహస్యం. ఓటుకు నోటు కేసు, డేటా స్కామ్, టీవీ 9కు సంబంధించిన చీటింగ్ కేసు వంటి వాటిలో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికి పోయిన వారికి చంద్రబాబు అభయం ఇచ్చి ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలున్నాయి. చంద్రబాబు ప్రమేయం ఉన్న కేసుల నుంచి, తన ప్రయోజనం కోసం పనిచేసే వారి కేసుల వరకు నిందితులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రీకరించేలా పరిణమిస్తున్నాయి. అనేక కేసుల్లో నింది తులను కాపాడేందుకు ప్రయత్నాలు చేసినట్టుగానే తాజాగా టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, ఆయన సన్నిహితుడైన సినీ నటుడు శివాజీలకు ఏపీలో షెల్టర్ ఇచ్చినట్టు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. పరారీలో ఉన్న రవిప్రకాశ్పై ఇప్పటికే ఉన్న ఫోర్జరీ కేసుతోపాటు నిధుల దుర్వినియోగంపై తెలంగాణా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. రవిప్రకాశ్, ఆయన సన్నిహితుడు శివాజీలు టీడీపీ పెద్దల సంరక్షణలో విజయవాడ, ప్రకాశం జిల్లాలో ఉన్నట్టు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు. సీఎం సొంత సామాజికవర్గానికి చెందిన వీరిని ప్రకాశం జిల్లాలోని ఒక రిసార్ట్స్లోను, మరో ఫామ్హౌస్లోను రెండు రోజుల క్రితం వరకు సకల సౌకర్యాలతో సాకినట్టు తెలంగాణ పోలీసులకు సమాచారం అందింది. ప్రస్తుత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి సంరక్షణలోనే రవిప్రకాశ్ ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. శివాజీకి కూడా విజయవాడ, ప్రకాశం జిల్లాల్లో షెల్టర్ ఇచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే తనపై పోలీసులు సీఆర్పీసీ 154 కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను (భోజన విరామం) విచారణకు చేపట్టాలన్న రవిప్రకాశ్ తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెల్సిందే. ఇది ఇలా ఉంటే అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ విచారణకు హాజరయ్యేందుకు మరో పది రోజులు గడువు కావాలంటూ రెండు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ మెయిల్ పంపించడం గమనార్హం. ఈ కేసుతో సంబంధం ఉన్న సినీనటుడు శివాజీ కూడా తనకు ఆరోగ్యం సరిగా లేదని మెయిల్ పంపించారు. అయితే వీరిద్దరి ఈ మెయిల్స్పై సంతృప్తి చెందని తెలంగాణ పోలీసులు వారు ఎక్కడ ఉన్నా అదుపులోకి తీసుకునేందుకు రంగంలోకి దిగడం గమనార్హం. ఇప్పటికే రెండు పర్యాయాలు రవిప్రకాశ్కు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెల్సిందే. రవిప్రకాశ్ అరెస్టుకు రంగం సిద్ధమైన తరుణంలో ఆయన్ను కాపాడేందుకు నేరుగా ఏపీ సీఎం చంద్రబాబు పావులు కదుపుతుండటం విమర్శలకు తావిస్తోంది. రవిప్రకాశ్ అరెస్టు కాకుండా చూడటంతో పాటు ఆయనను ఈ కేసు నుంచి తప్పించేందుకు చంద్రబాబు నేరుగా రామోజీరావును కలవడం కలకలం రేపుతోంది. తన రాజగురువు రామోజీరావు ద్వారా టీవీ 9 యాజమాన్యానికి చెందిన రామేశ్వర్కు నచ్చజెప్పేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికీ దొరకని అశోక్ ఆచూకీ.. తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ అడ్డగోలుగా డేటా స్కామ్కు పాల్పడిన వ్యవ హారంలో ప్రధాన పాత్రధారి ఐటీ గ్రిడ్స్ ఎండీ దాకవరపు అశోక్ ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. అశోక్ తెలంగాణ పోలీసులకు చిక్కితే ఆంధ్రప్రదేశ్లోని పెద్దల బండారం బయట పడుతుందనే భయంతో అతన్ని చంద్రబాబు సర్కారే కాపాడుతోందనే అనుమానాలున్నాయి. ఆధార్ డేటాబేస్కు ఏపీ, తెలంగాణకు ప్రజల 7,82,21,397 రికార్డులు లింక్ అయ్యాయని, ఆధార్తోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారం కూడా చోరీకి గురైనట్టు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) నిగ్గు తేల్చి, ఇప్పటికే ప్రా«థమిక రిపోర్టు ఇచ్చింది. అశోక్ను కాపాడేందుకు ఏపీఎస్పీ 6 బెటా లియన్తోపాటు ఇతర రహస్య ప్రాంతాలకు తరలిస్తూ షెల్టర్ ఇస్తున్నట్టు సమాచారం. అశోక్ తెలంగాణ పోలీసులకు దొరక్కుండా ఏపీ సర్కార్ షెల్టర్ ఇవ్వడంతోపాటు ఇంటె లిజెన్స్కు చెందిన ఇద్దరు గన్మెన్లను కూడా ఇచ్చి వీఐపీ భద్రత కల్పించినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఓటుకు నోటు కేసులో మత్తయ్యకు షెల్టర్ తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఓటుకు కోట్లు వ్యవహారంలో అడ్డంగా దొరికేసిన చంద్రబాబు..ఆ కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీకి చెందిన జెరుసలేం మత్తయ్యకు అప్పట్లో విజయవాడలో షెల్టర్ ఇచ్చారు. ఓటుకు కోట్లు కేసును రాజకీయం చేసి దాని నుంచి తప్పించుకునేలా ఏపీలోనూ చంద్రబాబు కేసులు పెట్టించి ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్)ను ఏర్పాటు చేసి అది కూడా రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం గమనార్హం. గరుడ పురాణం శివాజీకి దన్ను ఇటీవల బీజేపీ, వైఎస్సార్సీపీలపై అనేక కట్టుకధలు అల్లిన గరుడ పురాణం సృష్టికర్త శివాజీ కొంతకాలం పాటు అజ్ఞాతంలో వెళ్లిపోయి ఎన్నికల సమయంలో ప్రత్యక్షమయ్యారు. చంద్రబాబుకు నమ్మిన బంటులా వ్యవహరిస్తున్న సినీనటుడు శివాజీ గరుడ పురాణం స్క్రిప్ట్ అంతా టీడీపీ పెద్దల కనుసన్నల్లో ఒక మంత్రి సహకారంతో సిద్ధం చేసినట్టు ప్రచారం జరిగింది. రాష్ట్రంలో రాజకీయపరమైన అనిశ్చితిని కల్పించేలా, ప్రతిపక్షం, కేంద్ర ప్రభుత్వంపైన అభూతకల్పనలతో ఆయన చెప్పిన గరుడ పురాణం గుట్టు విప్పేలా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించాలన్న డిమాండ్ రావడంతో ముందు జాగ్రత్తగా ఆయన అదృశ్యమయ్యారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరగబోతోందని ముందే చెప్పిన శివాజీ ఆ విషయం ఎలా గుర్తించారు? ఆయనకు టీడీపీ పెద్దలు ముందే లీకులు ఇచ్చి చెప్పించి నెపం వేరొకరిపై నెట్టే ప్రయత్నం చేశారా? అనే అనేక ప్రశ్నలకు ఆయన్ను విచారిస్తేనే జవాబులు తెలుస్తాయనే బలమైన వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే విజయవాడలో కొంతకాలం, అమెరికాలో మరికొద్ది రోజులు ఆయన తలదాచుకోవడం వెనుక టీడీపీ పెద్దల దన్ను ఉందనేది బహిరంగ రహస్యం. -
ఐటిగ్రిడ్ అశోక్కు లోకేష్కు సంబంధం ఏమిటి?
-
‘ఆడపిల్లల సమాచారం టీడీపీ గుండాల దగ్గర ఉంది’
సాక్షి, హైదరాబాద్: ప్రజల వ్యక్తిగత డేటాను టీడీపీ ప్రభుత్వం దొంగిలించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఆడపిల్లలకు సంబంధించిన సమాచారం టీడీపీ గుండాల దగ్గర ఉందని మండిపడ్డారు. మహిళల ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నంబర్లు తదితర వివరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఠా దగ్గర ఉన్నాయని ఆరోపించారు. మంత్రి నారా లోకేశ్ ద్వారానే ఐటీ గ్రిడ్స్కు ప్రజల డేటా చేరిందన్నారు. చంద్రబాబు బినామీలకే పలు ప్రభుత్వ కాంట్రాక్టులు అప్పజెప్పారని విమర్శించారు. అభయ యాప్ ద్వారా రాష్ట్రంలో ఎన్ని అత్యాచారాలు ఆపగలిగారని సూటిగా ప్రశ్నించారు.దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో ఉపయోగించిన టెక్నాలజీకి పేరు మార్చి సీఎం డ్యాష్ బోర్డు అంటున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘2016లో జే సత్యనారాయణ యూఐడీఏ చైర్మన్ అయిన తర్వాత ఆధార్ డేటాను ఈ ప్రగతికి లింక్ చేశారు. సంక్షేమ పథకాల కోసం డేటాను ఈ ప్రగతికి లింక్ చేసినట్టు టీడీపీ ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత ఈ ప్రగతి నుంచి ఆధార్ డేటాను టీడీపీ సేవామిత్ర యాప్కు మళ్లించారు. సేవామిత్ర యాప్ను ఐటీ గ్రిడ్స్ సంస్థ రూపొందించింది. డేటా చోరీ జరిగినట్టు ఫిర్యాదు రావడంతో తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్ ఎండీ డాకవరం అశోక్పై కేసు నమోదు చేశారు. ప్రజల ఫోన్లలో ఉండే సమాచారాన్ని సేవామిత్ర యాప్తో ట్రాక్ చేసే అవకాశం ఉంది. చంద్రబాబు, ఆయన బినామీ అశోక్తో ప్రజలకు పెను ప్రమాదం పొంచి ఉంది. ప్రజల ఫోన్ స్టోరేజీ డేటా కూడా వారి వద్దకు వెళ్లిపోయింది. చంద్రబాబు, అశోక్ ద్వారా దేశానికి, రాష్ట్ర ప్రజలకు ఎంత ముప్పు తీసుకువచ్చారో అర్థం చేసుకోవచ్చు. మహిళలకు అభద్రతా భావం కల్పించారు. సేవామిత్ర యాప్తోనే టీడీపీ ఎన్నికల్లో సర్వేలు నిర్వహించింది. ఈ సర్వేల్లో ఎవరైతే టీడీపీపై అసంతృప్తి వ్యక్తం చేశారో.. వారి ఓట్లను తొలగించేందకు ఫామ్-7 దరఖాస్తులు చేశారు. ఐటీ మంత్రి నారా లోకేశ్ ద్వారానే ఐటీ గ్రిడ్కు ప్రజల వ్యక్తిగత డేటా చేరింది. చంద్రబాబు, లోకేశ్లు అశోక్ అరెస్ట్ కాకుండా కాపాడుతున్నారు. అశోక్ ఏ తప్పు చేయకుంటే అజ్ఞాతంలోకి ఎందుకు వెళతారు?. టీడీపీ ప్రభుత్వం బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సిట్ను ఏర్పాటు చేసింది. అయితే తాము ఏం చేశామో చెప్పాల్సిన బాధ్యత సిట్పై ఉంది. టీడీపీ ప్రభుత్వ దొంగతనాన్ని దాచడానికే సిట్ వేశారా?. ఈ ప్రగతి, సీఎం డ్యాష్ బోర్డుల పేరిట టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాంకేతికతను ఉపయోగించుకోకుండా చంద్రబాబు తన బినామీలకు టెక్నాలజీ అప్డేట్ పేరిట కాంట్రాక్టులు అప్పజెప్పారు. బాలసుబ్రహ్మణ్యం సతీమణి నిర్వహిస్తున్న గ్రీన్ ఆర్గ్, ఓటీఎస్ఐ కంపెనీలకు ఆర్టీఏ వెబ్సైట్ సాంకేతిక బాధ్యతలను అప్పగించారు. రూ. 138 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభయ యాప్ పైలెట్ ప్రాజెక్టును తీసుకువచ్చారు. అయితే అభయ యాప్ ద్వారా ఎన్ని అత్యాచారాలు ఆపగలిగారు?. బాలసుబ్రహ్మణ్యం రవాణాశాఖ కమిషనర్గా ఉండటం వల్లనే ఆ రెండు కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నియోజకవర్గంలో కూడా టీడీపీ నేతలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు సేకరించి.. అందులో ఏవరైతే టీడీపీకి అనుకూలంగా ఉండరో వారి ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించారు. తమకు అనుకూలంగా లేని ఓటర్ల వివరాలు సేకరించాలని టీడీపీ ఆ పార్టీ వెబ్సైట్లోనే నాయకులను ఆదేశించింది. అశోక్ ఎక్కడున్నారో చంద్రబాబు, లోకేశ్, ఏబీ వెంకటేశ్వరరావులను అడగాలి. ఇటీవల అశోక్ పలువురు హ్యాకర్లతో ఢిల్లీలో సమావేశమై.. కౌంటింగ్ రోజు ఎలా హ్యాక్ చేస్తే టీడీపీ అనుకూలంగా ఫలితాలు రాబట్టవచ్చనే అంశం మాట్లాడినట్టు తెలిసింది. ఇంతా జరుగుతున్నా ఏపీ, తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. కౌంటింగ్ రోజున భద్రతా చర్యల గురించి ఎన్నికల సంఘానికి లేఖ రాయడం జరిగింది. టీడీపీ నాయకులు శాంతి భద్రతల సమస్య సృష్టించే అవకాశం ఉందని తెలిపాం. వైఎస్ జగన్పై హత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసరావు అరెస్ట్ అయినప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడు. అతనికి ఎదైయినా జరిగిందంటే దాని వెనుక టీడీపీ హస్తం ఉండే అవకాశం ఉంద’ని తెలిపారు. -
ఆపరేషన్ అశోక్ ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: డేటా చౌర్యం కేసులో కీలక నిందితుడు ఐటీ గ్రిడ్స్ ఎండీ డాకవరం అశోక్ కోసం సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. తమ డేటా కూడా చోరీ చేశారని ఆధార్ సంస్థ కూడా తాజాగా మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ వేగవంతం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారిక ‘సేవా మిత్ర’యాప్ కోసం దాన్ని నిర్వహించే ఐటీ గ్రిడ్స్ సంస్థ ఆధార్ సర్వర్ నుంచే సమాచారాన్ని తస్కరించి ఉంటుందన్న అనుమానాలు తీవ్ర చర్చకు దారితీశాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల ప్రజల ఆధార్ సమాచారం కూడా ఐటీ గ్రిడ్స్ వద్ద ఉందని సిట్ బృందం గుర్తించింది. అశోక్ కోసం ప్రత్యేక బృందాలు.. గత ఫిబ్రవరి 27 తరువాత అశోక్ ఫోన్ స్విచ్చాఫ్ అయింది. అప్పుడే ఏపీకి పారిపోయిన అతను అక్కడ ఏపీ పెద్దల సంరక్షణలో ఉన్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విచారణకు రావాలని పోలీసులు మూడుసార్లు నోటీసులు జారీ చేయడంతో పాటు పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో సిట్ కొన్ని ప్రత్యేక బృందాలను ఏపీకి, కర్ణాటకకు పంపింది. ఐటీ గ్రిడ్స్ సంస్థలపై దాడులు చేసినప్పుడు పోలీసులు దాదాపు 60 హార్డ్ డిస్క్లు, పెన్డ్రైవ్లు, మెమొరీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో చాలా వాటిలో సమాచారం డిలీట్ చేసి ఉంది. దాదాపు 40 హార్డ్ డిస్క్ల నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) సమాచారాన్ని రీట్రైవ్ చేయగలిగింది. తెలంగాణ, ఏపీ ప్రజల ఆధార్ వివరాలు తీసుకున్నట్లు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు తేల్చడంతో మిగిలిన డిస్క్ల్లో ఏముందోనన్న ఉత్కంఠ నెలకొంది. వాటిలో కీలక అంశాలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
డేటా దొంగలకు ఢిల్లీ లింక్!
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు దీర్ఘకాలిక పన్నాగాన్ని పక్కాగా అమలు చేసినట్లు అధికార వర్గాలు గుర్తించాయి. సీఎం చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో ఏకంగా ఆధార్ అథారిటీ నుంచే కథ నడిపించినట్లు విశ్వసనీయ సమాచారం. అందువల్లే రెండు తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది ప్రజల సమాచారాన్ని అంత పక్కాగా తస్కరించగలిగారని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2015 నుంచే పన్నాగం... 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం టీడీపీ గుప్పిట్లోకి వచ్చేలా 2015లోనే చంద్రబాబు పథక రచన చేశారు. ముందస్తు వ్యూహంతోనే ఆధార్ అథారిటీ ఛైర్మన్గా ఉన్న జె.సత్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వ ఈ–గవర్నెన్స్, ఐటీ సలహాదారుగా నియమించడం గమనార్హం. ఇలా జోడు పదవుల్లో ఉండటం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినా చంద్రబాబు లెక్క చేయలేదు. టీడీపీ కార్యాలయానికి కోట్ల మంది వ్యక్తిగత వివరాలు.. రాష్ట్ర ప్రభుత్వం 2016లో ప్రజాసాధికార సర్వే నిర్వహించి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించింది. దాన్ని రియల్ టైమ్ గుడ్ గవర్నెన్స్(ఆర్టీజీఎస్) ద్వారా టీడీపీకి అనుబంధంగా పని చేస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థకు చేరవేసింది. సాధికారిక సర్వేలో సేకరించిన సమాచారాన్ని మించి ప్రజల వ్యక్తిగత వివరాలు తమ గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా 2019 ఎన్నికల్లో ఓటరు జాబితాలో అక్రమాలకు పాల్పడేందుకు వ్యూహం రచించింది. తెలంగాణ ప్రజల సమాచారం ఏపీ ప్రభుత్వం వద్ద లేకపోవడంతో ఏకంగా ఆధార్ అథారిటీ నుంచే కథ నడిపించాలని చంద్రబాబు నిర్ణయించారు. అనుకున్న విధంగానే ఢిల్లీలోని ఆధార్ అథారిటీ నుంచి టీడీపీకి పూర్తి స్థాయిలో సహకారం లభించినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గుట్టుచప్పుడు కాకుండా టీడీపీకి చేరవేశారు. పేర్లు, చిరునామా, బ్యాంకు ఖాతాలు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, కుటుంబ సభ్యుల వివరాలు ఇలా మొత్తం వ్యక్తిగత సమాచారం అనధికారికంగా టీడీపీ కార్యాలయానికి చేరిపోయింది. సైబర్ నేరాలకు ఊతం తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారం నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు సంస్థలకు చేరడంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. వీరిలో శాస్త్రవేత్తలు, రక్షణ పరిశోధనా సంస్థలు, త్రివిధ దళాల అధికారులు, సిబ్బంది వివరాలు కూడా ఉండటంతో ఈ వ్యవహారం అత్యంత సున్నితంగా మారింది. ఇది సైబర్ నేరాలకు ఊతమివ్వడంతోపాటు దేశ రక్షణకు ప్రమాదకరంగా మారిందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. శత్రు దేశాలకు ఈ సమాచారం చేరితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. మంత్రి లోకేష్తో అశోక్ (ఫైల్) ఇంటి దొంగల హస్తం! ప్రజల వ్యక్తిగత సమాచారం అనధికారిక వ్యక్తుల చేతికి చిక్కడం అంటే పార్లమెంటులో చేసిన ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఆధార్ సమాచారం బయటకు పొక్కడంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో పలు వ్యాజ్యాలు విచారణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్ అథారిటీ రంగంలోకి దిగి కోట్ల మంది వ్యక్తిగత వివరాలు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి ఎలా వెళ్లాయనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. దీని వెనుక ఇంటి దొంగల హస్తం ఉండవచ్చని అంచనా వేస్తోంది. ఇందుకు బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఆధార్ అథారిటీ డేటా చోరీపై ఇటీవల హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు అంతర్గత విచారణ కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. దర్యాప్తు వేగవంతం.. డేటా చోరీపై తెలంగాణా పోలీసుల దర్యాప్తుతోపాటు ఆధార్ అథారిటీ అంతర్గత విచారణ కూడా ముమ్మరంగా సాగుతోంది. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కేంద్ర హోంశాఖ పట్టుదలతో ఉంది. కొద్ది రోజుల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆధార్ అథారిటీ, పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. డేటా తస్కరించిన పార్టీపై కఠిన చర్యలు తీసుకోవాలి – ఈఏఎస్ శర్మ,, కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం ఐటీ గ్రిడ్స్ సంస్థకు చేరడం వెనుక ఆధార్ అథారిటీ పెద్దల పాత్ర కచ్చితంగా ఉంటుందని కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. ఆధార్ అథారిటీ అధికారుల పాత్ర లేకుండా కీలక సమాచారం అనధికారిక వ్యక్తుల చేతుల్లోకి చేరడం అసంభవమని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆయన కేంద్ర ఐటీ శాఖకు ఓ లేఖ రాశారు. ఆధార్ అథారిటీ చైర్మన్గా ఉన్న జె.సత్యనారాయణను ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాను గతంలోనే కేంద్ర ఐటీ శాఖకు లేఖ రాసినట్లు గుర్తు చేశారు. అయినప్పటికీ సత్యనారాయణ నియామకాన్ని పునఃసమీక్షించకపోవడాన్ని తప్పుబట్టారు. ఐటీ గ్రిడ్స్తోపాటు ఆధార్ అథారిటీ అధికారుల పాత్రపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన రాజకీయ పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆధార్ అథారిటీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా సర్వర్లు భద్రం: యూఐడీఏఐ తమ సర్వర్లు పూర్తి భద్రంగానే ఉన్నాయని ఆధార్ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూఐడీఏఐ బుధవారం ‘పీటీఐ’ వార్తా సంస్థకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోసిటరీ (సీఐడీఆర్), ఇతర సర్వర్లు సురక్షితంగానే ఉన్నాయని తెలిపింది. తమ సర్వర్ల నుంచి ఎలాంటి డేటా చౌర్యానికి గురి కాలేదని అందులో పేర్కొంది. ఐటీ గ్రిడ్స్ అశోక్కు టీడీపీ సర్కార్ షెల్టర్ డేటా చోరీ కేసులో టీడీపీ సేవామిత్ర యాప్ను నిర్వహించే ఐటీ గ్రిడ్స్ సంస్థపై ఉచ్చు బిగుస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో డేటా చోరీ కేసులో దర్యాప్తును తెలంగాణ పోలీసులు ముమ్మరం చేశారు. ఐటీ గ్రిడ్స్ ఎండీ డి.అశోక్ కుమార్తోపాటు తెరవెనుక సూత్రధారులపై తెలంగాణ సిట్ దృష్టి సారించింది. ఆధార్తోపాటు మరో 17 రకాల వ్యక్తిగత సమాచారం చోరీకి గురైనట్లు కొద్ది రోజుల క్రితం ఆధార్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ భవానీప్రసాద్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధార్తోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారం కూడా చోరీకి గురైనట్టు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) నిగ్గు తేల్చి ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో పక్కా ఆధారాలతో అశోక్ కోసం తెలంగాణ పోలీసులు అన్వేషిస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చినా అశోక్ లొంగిపోకపోవడంతో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. అశోక్తోపాటు ఆయనకు సహకరించిన మరికొంత మందిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏబీ పర్యవేక్షణలోనే ఆశ్రయం! మరోవైపు అశోక్ తెలంగాణ పోలీసులకు చిక్కితే తమ బండారం బయటపడుతుందనే భయంతో ఆయన్ను టీడీపీ సర్కారే కాపాడుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం సేవామిత్ర యాప్ కోసం తరలించి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ దోషులుగా నిలబడే పరిస్థితి రావడంతో అశోక్ను రహస్య ప్రదేశంలో దాచినట్లు చెబుతున్నారు. ఎన్నికల ముందు వరకు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలోనే అశోక్కు ప్రభుత్వం షెల్టర్ ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. సీఎం సామాజిక వర్గానికి చెందిన విజయవాడ వ్యక్తి మేఘాలయ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్గా ఉండటంతో ఆయన పర్యవేక్షణలో తొలుత అశోక్ను ఉంచినట్టు ప్రచారం జరిగింది. అనంతరం విజయవాడ గొల్లపూడిలోని ఇంటెలిజెన్స్ అతిధిగృహంలో అశోక్ను పోలీసుల రక్షణ నడుమ కొద్ది రోజులు దాచినట్టు తెలిసింది. తరువాత ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో అశోక్కు షెల్టర్ ఇచ్చినట్టు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత నిఘా చీఫ్గా ఏబీ వెంకటేశ్వరరావును తప్పించినా చంద్రబాబు కోసం అశోక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని షెల్టర్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. పోలింగ్కు ముందు రోజు సేవామిత్రతో సూచనలు డేటా స్కామ్ బయట పడిన మరుక్షణమే మూసివేసిన టీడీపీ సేవామిత్ర యాప్ను పోలింగ్కు ఒక రోజు ముందు మళ్లీ పని చేయించడం గమనార్హం. టీడీపీ కార్యకర్తలు, బూత్ కన్వీనర్లకు ఓటింగ్పై సూచనలు ఇచ్చేందుకు సేవామిత్ర యాప్ను వినియోగంలోకి తెచ్చారు. అజ్ఞాతంలో ఉన్న అశోక్ డైరెక్షన్లోనే మళ్లీ సేవామిత్ర యాప్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు తెలంగాణ పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా అశోక్ను ఎక్కడకు తరలించారనే అంశంపై తెలంగాణ పోలీసు ప్రత్యేక బృందాలు దృష్టి సారించినట్టు తెలిసింది. ఈ కేసులో కీలకంగా మారిన అశోక్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, ఆయన స్వచ్ఛందంగా లొంగిపోతే మంచిదనే చర్చ ఏపీ పోలీసు వర్గాల్లోనే జరుగుతోంది. ఇతర రాష్ట్రాల డేటా సైతం చోరీ సాక్షి, హైదరాబాద్: డేటా చౌర్యం కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన నివేదికలో ఏపీ, తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల ఆధార్ వివరాలు కూడా ఉన్నట్లు తెలంగాణ సిట్ బృందం గుర్తించింది. దీంతో ఇన్నాళ్లూ భావించినట్లుగా ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన డేటా కూడా ఉండటంతో కేసు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేరస్థుల గాలింపు కోసం పలు జాతీయ దర్యాప్తు సంస్థలు ఆధార్ వివరాలు కోరినా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అంగీకరించలేదు. నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ (ఎన్సీఆర్బీ) కూడా దాదాపుగా ఇలాంటి విజ్ఞప్తే చేసినా నిరాకరించింది. ఆధార్ సెక్షన్ 29 ప్రకారం పౌరుల వేలిముద్రలు, వ్యక్తిగత వివరాలు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అత్యంత అరుదైన కేసుల్లో సెక్షన్ 33 ప్రకారం మాత్రమే పరిమిత సమాచారం ఇస్తామని పేర్కొంది. -
డేటా చోర్పై నిఘా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల ప్రజల వ్యక్తిగత డేటా చోరీలో కీలక సూత్రధారిగా ఉన్న డాకవరం అశోక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన వెలుగు చూసిన రెండు నెలల నుంచి అతను అజ్ఞాతంలోనే ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ సిట్ బృందం అశోక్ జాడను గుర్తించడం కోసం రంగంలోకి టీమ్లు దింపిన క్రమంలో అతని స్వస్థలం అల్లూరులో మళ్లీ అలజడి రేగింది. అశోక్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో అతని మూలాలపై జిల్లాలో చర్చ సాగుతోంది. అనతి కాలంలలో బడా వ్యక్తిగా ఎదగడం వెనుక రాజకీయంగా జిల్లాలో ఎవరి సహకారం ఉంది. స్థానికంగా సహకరిస్తున్నది ఎవరనే దానిపై జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల ప్రజల ఆధార్ కార్డులతో పాటు వ్యక్తిగత డేటా చోరీ చేసిన డాకవరం అశోక్ కావలి నియోజకవర్గం అల్లూరుకు చెందిన వ్యక్తి. సాధారణ రైతు కుటుంబం నుంచి అనతి కాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తాడు. ముఖ్యంగా అశోక్ ఆర్థికంగా స్థిరపడిన తర్వాత జిల్లాలో పొలాలు భారీగా కొనుగోలు చేశాడు. అశోక్ తల్లిదండ్రులు, కుటుంబ నేపథ్యం, బీద సోదరులతో ఉన్న సంబంధాలు తదితర అంశాలపై చర్చ సాగుతోంది. రాష్ట్రంలోని ఓటర్ల ఆధార్ డేటాతో పాటు వ్యక్తిగత వివరాల డేటాను నిబంధనలకు విరుద్ధంగా వాడుకున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా లిమిటెడ్ తస్కరించిదనితెలంగాణ సిట్ బృందం నిర్ధారించి కేసు నమోదు చేశారు. దాదాపు రెండు నెలల క్రితం కేసు నమోదైంది. ఎన్నికల నోటిఫికేషన్ రావడ, ఎన్నికల ప్రక్రియ జరగటంతో పోలీసులు కేసును పక్కన పెట్టారు. తాజాగా ఎన్నికలు ముగిసిపోవడంతో ఆధార్ డేటా వ్యవహారం తెరపైకి రావడంతో అశోక్ కోసం అన్వేషణ మొదలైంది. ముఖ్యంగా అశోక్ గడిచిన నాలుగు నెలల కాలంలో జిల్లాకు వచ్చారా? అనే దానిపై పోలీసుల నుంచి ప్రాథమిక సమాచారం సేకరించినట్లు సమాచారం. వాస్తవంగా గతంలో అశోక్ ఏటా మూడు నాలుగు సార్లు అల్లూరుకు వచ్చి వెళ్తుండేవాడు. గడిచిన నాలుగు నెలలుగా జిల్లాకు రాలేదని ప్రాథకంగా నిర్ధారించారు. అల్లూరులో అశోక్ బంధువులు, సన్నిహితులు ఎవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. బీద టూ నారా లోకేష్ అల్లూరు మండలం ఇస్కపల్లికి చెందిన బీద సోదరుల సహకారంతో సీఎం తనయుడు, మంత్రి నారా లోకేష్కు అశోక్ సన్నిహితుడుగా మారాడు. టీడీపీకి సంబంధించిన సేవా మిత్ర యాప్ను అశోక్ సంస్థే రూపొందించింది. అల్లూరుకు చెందిన డాకవరం బుజ్జయ్య కుమారుడు అశోక్. కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా గెలిచిన బుజ్జయ్య మండలంలో ఉప్పు సాగు చేసే సాధారణ రైతు. ఆర్థికంగా నష్టపోయాడు. ఈక్రమంలో బుజ్జయ్య కుమారుడు అశోక్ కు టీడీపీ నాయకులైన బీద మస్తాన్రావు, బీద రవిచంద్రతో సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో బుజ్జయ్య కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరాడు. అశోక్ అల్లూరులో ఇంటర్మీడియట్, కర్ణాటకలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. కొత్త టెక్నాలజీ పేరుతో బీద రవిచంద్ర ద్వారా సీఎం చంద్రబాబునాయుడ్ని, ఆయన కుమారుడు లోకేష్ను కలిశారు. తద్వారా కొద్ది నెలలకే వారికి సొంత మనిషిగా మారిపోయాడు. దీనికి టీడీపీ నేతలుగా ఉన్న బీద సోదరులు వారధిగా నిలిచారు. పదేళ్ల క్రితం హైదరాబాద్లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ‘ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థను ప్రారంభించాడు. లోకేష్ మంత్రిత్వ శాఖలోని విభాగాలకు సంబంధించి సాంకేతిక సహకారం అందించే యాప్లను కూడా ఇదే సంస్థ డెవలప్ చేసింది. ప్రధానంగా ఏపీ ప్రభుత్వ యాప్, పంచాయతీరాజ్ విభాగం, డ్రిప్ ఇరిగేషన్, గ్రామీణ నీటిసరఫరా, పారిశుధ్య విభాగం తదితర ప్రభుత్వ వైబ్సైట్లతో పాటు వాటికి సంబంధించి సాంకేతిక సహకారం వీరే అందిస్తున్నారు. అందులో భాగంగానే టీడీపీకి ‘సేవామిత్ర’ అనే యాప్ను తయారు చేసి, ఈ యాప్ను టీడీపీ నాయకుల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లలో పని చేసే విధంగా సాంకేతికతను తయారు చేశారు. -
డేటా ఇచ్చిందెవరు?
-
‘ఐటీ గ్రిడ్స్’కు డేటా ఇచ్చిందెవరు?
సాక్షి, హైదరాబాద్: ఏపీతో పాటు తెలంగాణకు చెందిన దాదాపు 7 కోట్ల మంది పౌరుల ఆధార్ వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ యాప్ (సేవామిత్ర) తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ చేతిలో పెట్టిందెవరు? దీని చుట్టూనే ఇప్పుడు సిట్ దర్యాప్తు సాగుతోంది. సెంట్రల్ ఐడెంటిటీ డేటా రెపోసిటరీ (సీఐడీఆర్), స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ (ఎస్ఆర్డీహెచ్) వద్ద భద్రంగా ఉం డాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం ఎలా లీకయిందన్నది వారికి సవాలు విసురుతోంది. ఈ లీకేజీ వెనక ఏపీ సర్కారు పెద్దల హస్తం ఉండొ చ్చని యూఐడీఏఐ అనుమానిస్తోంది. ఇలాంటి అత్యంత గోప్యమైన సమాచారాన్ని ఆయా సంస్థల్లో పనిచేసే విచక్షణ ఉన్న ఏ అధికారీ ఇవ్వడని, ప్రలోభాలకు లేదా పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గితేనే ఆస్కారం ఉంటుందని భావిస్తోంది. తొలుత వేటు పడేది అధికారులపైనే.. ఈ కేసులో ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోని సిట్ బృందం ఇప్పటికే హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న 40కిపైగా హార్డ్ డిస్కులను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) సాయంతో విశ్లేషించిన సంగతి తెలిసిందే. డేటా చౌర్యం జరిగిందని ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇవ్వడంతో సిట్ దర్యాప్తు స్పీడు పెంచింది. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాలతో ముందుకెళ్లడం ద్వారా సేవామిత్ర యాప్లో ఉన్న వివిధ శాఖల సమాచారం ఎలా వచ్చిందన్న విషయంపై సిట్ దర్యాప్తు చేయనుంది. ఈ స్కాంలో అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే తొలి ముద్దాయిలు వారే అవుతారని తెలుస్తోంది. -
దొంగలపాలైన ‘ఆధార్’
చీకటి పనులకు అలవాటు పడకుండా ఉండాలేగానీ...ఆ ఊబిలోకి దిగబడ్డాక ఇక పైకి రావడమంటూ ఉండదు. స్వల్ప శాతం ఓట్ల తేడాతో 2014లో అధికారంలోకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత అయిదేళ్లూ ఇష్టానుసారం పాలించారు. చట్టాలను, నిబంధనలను తుంగలో తొక్కారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్, ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు వీటిపై ఎప్పటికప్పుడు నిలదీసినా ఆయన వైఖరిలో మార్పు రాలేదు. చివరకు ఇది దేనికి దారితీసిందో తెలంగాణ పోలీసులకు అందిన తాజా ఫిర్యాదు తేటతెల్లం చేసింది. సాక్షాత్తూ ఆధార్ ప్రాధికార సంస్థ డిప్యూటీ డైరెక్టర్ టి. భవానీ ప్రసాద్ ఈ ఫిర్యాదు చేశారు. ఆధార్ రికార్డుల్లో నిక్షిప్తమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని దాదాపు 7 కోట్ల 83 లక్షలమంది ప్రజానీకానికి సంబంధించిన డేటా చోరీకి గురయిందని, ఇది దేశభద్రతకే ముప్పు కలిగిస్తుందని ఆ ఫిర్యాదు సారాంశం. ఇందులో అత్యంత ప్రమాదకరమైనదేమంటే...ఈ డేటాను నిందితులు అమెజాన్ క్లౌడ్ సర్వీస్లో నిక్షిప్తం చేశారు. ఆ సర్వీస్ను ప్రపంచంలో ఏమూలనున్న నేరగాళ్లయినా హ్యాక్ చేశారంటే కోట్లాదిమంది పౌరుల సమాచారం వారి చేతుల్లో పడుతుంది. దాన్ని ఉపయోగించుకుని వారు ఏంచేయడానికైనా ఆస్కారం ఉంది. గత నెల మొదట్లో తొలిసారి ఈ డేటా చోరీ వ్యవహారం వెలుగులోకొచ్చినప్పుడు చంద్రబాబు, ఆయన సహచరులు చేసిన హడావుడి, దీన్ని రెండు రాష్ట్రాల వివాదంగా చిత్రీకరించేందుకు చేసిన యత్నం వెనకున్న వ్యూహమేమిటో ఇప్పుడు అందరికీ అర్ధమవుతుంది. (చదవండి : ఇది దేశ భద్రతకే సవాల్) జరిగిన నేరం ఎంత తీవ్రమైనదో, దాని పర్యవసానాలేమిటో చంద్రబాబుకు తెలుసు. అందువల్లే డేటా చోరీ వ్యవహారం బయటకు పొక్కగానే ఏపీ పోలీసులు క్షణాల్లో హైదరాబాద్కొచ్చి వాలారు. ఫిర్యాదుదారుడు లోకేశ్వర్రెడ్డిని అపహరించుకుపోవడానికి ప్రయత్నించారు. తెలంగాణ పోలీసులు అడ్డుకోనట్టయితే ఆయన్ను ఏపీకి తరలించేవారే. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం నియమించిన సిట్కు పోటీగా చంద్రబాబు రెండు సిట్లు వేసి పక్కదోవ పట్టించాలని చూశారు. జరిగిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణపై ఎదురుదాడికి దిగారు. లోకేశ్వర్రెడ్డి చేసిన ఫిర్యాదు ప్రకారం ఆంధ్రప్రదేశ్కు చెందిన మూడున్నర కోట్లమంది ఓటర్ల వ్యక్తిగత సమాచారం దొంగిలించి దాన్ని తెలుగుదేశం కార్యకర్తల ఫోన్లలో ‘సేవామిత్ర’ యాప్ కింద లభ్యమయ్యే ఏర్పాటు చేశారు. అటు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండాల్సిన ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన జాబితా, ఇటు ఆధార్ డేటా అనుసంధానించి దీన్ని రూపొందించారని అప్పుడు బయటికొచ్చింది. కానీ తాజాగా భవానీ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మరింత తీవ్రమైనది. ఒక్క ఏపీ ప్రజల డేటా మాత్రమే కాదు...తెలంగాణ ప్రజల డేటా సైతం ఈ దొంగల చేతుల్లో పడిందని వెల్లడైంది. ఈ రెండు రాష్ట్రాల ప్రజానీకం తాలూకు 18 రకాల వ్యక్తిగత సమాచారం సేవామిత్రలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తల సెల్ఫోన్లకు అందుబాటులో ఉందంటే వీరు ఎంతకు తెగించారో తేటతెల్లమవుతుంది. దీన్ని రూపొందించిన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్ ఇంతవరకూ ఆచూకీ లేకుండా పోయాడు. అతగాడు ఎవరి రక్షణలో సేదతీరుతున్నాడో సులభంగానే అంచనా వేసుకోవచ్చు. ఆధార్ డేటాకు కట్టుదిట్టమైన భద్రత ఉన్నదని, అది బయటికి పోయే ప్రసక్తే లేదని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) చాన్నాళ్లనుంచి బల్లగుద్ది చెబుతోంది. సుప్రీంకోర్టులోనూ ఈ వాదనే వినిపించింది. సంస్థ సీఈఓ అజయ్ భూషణ్ పాండే డేటా చౌర్యం ఎందుకు అసాధ్యమో ధర్మాసనానికి సాంకేతికంగా వివరించి చెప్పారు. ఆయనిచ్చిన వివరణతో అది సంతృప్తిపడినట్టే కనిపించింది. అందుకే కావొచ్చు...పౌరుల వ్యక్తిగత గోప్యతకు ముప్పు కలుగుతుందన్న పిటిషనర్ల వాదన సరికాదని నిరుడు సెప్టెంబర్లో వెలువరించిన తీర్పు సందర్భంగా స్పష్టం చేసింది. కానీ ఇప్పుడేమైంది? స్వయానా యూఐడీఏఐ సంస్థే తమ డేటా చోరీకి గురైందని ఫిర్యాదు చేసింది. ఎంత ఘోరం? ఆ సంస్థకు చెందిన నిపుణులు ఇన్నాళ్లనుంచీ ఘనంగా చెప్పుకుంటున్న భద్రత ఐటీ గ్రిడ్స్ పుణ్యమా అని గాలికి కొట్టుకుపోయింది. ఇదంతా చంద్రబాబు ప్రభుత్వ ప్రాపకంతో, ఆయన పార్టీ ప్రయోజనం కోసం చడీచప్పుడూ లేకుండా సాగిపోయింది. తాను, తన పార్టీ ప్రయోజనాలే తప్ప ఎవరేమైపోయినా ఫర్వాలేదనుకునే మనస్తత్వం ఉన్న నాయకులుంటే ఎంతటి కీలక సమాచారమైనా బజారున పడుతుందని ఈ డేటా చోరీ వ్యవహారం వెల్లడించింది. వాస్తవానికి సైబర్ వ్యవహారాల నిపుణుడు డాక్టర్ అనుపమ్ శరాఫ్ ఆధార్ డేటాను ఓటర్ గుర్తింపు కార్డుతో అనుసంధానించడం వల్ల మున్ముందు సమస్యలు తలెత్తే అవకాశమున్నదని... ఓటర్ల జాబితాలను నకిలీ ఓటర్లతో నింపి, నిజమైన ఓటర్ల పేర్లను తొలగించి ఎన్నికల ప్రక్రియను, ఫలితాలను తారుమారు చేసే ప్రమాదమున్నదని హెచ్చరించారు. దాన్ని అటు ఆధార్ ప్రాధికార సంస్థ, ఇటు ఎన్నికల సంఘం పట్టించుకున్న దాఖలా లేదు. అనుపమ్ మాటల్లో ఎంత నిజమున్నదో ఇప్పుడు చంద్రబాబు అండ్ కో నిరూపించారు. తాజా ఎఫ్ఐఆర్నుబట్టి చూస్తే సేవామిత్ర యాప్లో రెండు రాష్ట్రాలకూ చెందిన ఆధార్ డేటా, ఓటర్ల జాబితాలు ఉన్నాయి. తమకు ఓటేయరని అనుమానం వచ్చిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఈ యాప్ ద్వారా అవకాశమున్నదని ఎఫ్ఐఆర్ చెబుతోంది. డేటా దొంగలు ఈ మొత్తం డేటాను దేన్నుంచి కైంకర్యం చేశారో తేలాల్సి ఉంది. అలాగే దుండగులు ఈ రెండు తెలుగు రాష్ట్రాలతో సరిపెట్టారా లేక ఇతర రాష్ట్రాల డేటాను సైతం తస్కరించారా అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది. దీంతోపాటు టీడీపీ సేవామిత్రలో భాగస్వాములుగా ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించి ఆ యాప్తో ఏమేం చేశారో రాబట్టవలసి ఉంది. ఈ డేటా చౌర్యం లోతు, విస్తృతి ఎంతో... ఎవరెవరు ఇందులో భాగస్వాములో సాధ్యమైనంత త్వరగా కూపీ లాగి, నిందితులను అరెస్టు చేయాలి. -
ఐటీ గ్రిడ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
-
ఐటీ గ్రిడ్ కేసు.. దర్యాప్తు వేగవంతం చేసిన సిట్
సాక్షి, హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్ డేటా చోరీ కేసుపై సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ డేటా చోరీపై ఇప్పటికే ఆధార్ అథారిటీ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసుపై ఆధార్ అధికారులు కూడా మాదాపూర్లో ఫిర్యాదు చేశారు. రెండు రాష్ట్రాల కి చెందిన ఆధార్ డేటా చోరీ అయ్యిందని అందులో ఫిర్యాదు చేశారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను సిట్ అధికారులు ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. ఎఫ్ఎస్ఎల్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా చర్యలు చేపట్టేందుకు సిట్ అధికారులు సిద్దమయ్యారు. ఇప్పటికే దాదాపు 40 హార్డ్ డిస్క్లను ఎఫ్ఎస్ఎల్ విశ్లేషించింది. ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే మూడు సార్లు నోటిసులు ఇచ్చామన్నారు. అశోక్తో పాటు మరికొంత మందిని అరెస్ట్చేసేందుకు రంగం సిద్దం చేసింది. -
డేటా దొంగ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తీవ్ర సంచలనం సృష్టించిన ప్రజల వ్యక్తిగత డేటా, ఆధార్ వివరాల చౌర్యం కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు ముగియడం, ఈ కేసులో అదనంగా ఆధార్ కేసు కూడా తోడవడంతో నేరం తీవ్రత మరింత పెరిగింది. అశోక్ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రణాళిక కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పలు రకాల వ్యూహాలను సిద్ధం చేసుకున్న సిట్... న్యాయస్థానం ఆదేశాలతోనే ముందుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ యాప్ ‘సేవామిత్ర’ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పౌరుల డేటా చోరీ చేసేలా ఏపీ ప్రభుత్వం వీలు కల్పించడం తెలిసిందే. అరెస్టుకు సరిపడా ఆధారాలు.. ఈ కేసులో సిట్ అధికారులు పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్సంస్థ అధినేత దాకవరం అశోక్ అరెస్టుకు సరిపడా సాక్ష్యాలు, ఆధారాలు సేకరించారు. పలుమార్లు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినా.. అశోక్ అజ్ఞాతం వీడటం లేదు. పైగా ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం పాత్ర స్పష్టంగా కనిపిస్తుండటం, సాక్షాత్తూ ప్రభుత్వ పెద్దలే నిందితుడిని వెనకేసుకు రావడంతో ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. అప్పట్లో అశోక్ను అరెస్టు చేసేందుకు సిట్ అధికారులు ప్రయత్నించారు. విజయవాడ, నెల్లూరులో అశోక్ ఉన్నట్లు సమాచారం కూడా అందింది. నిందితులెవరైనా వదిలిపెట్టబోమని, న్యాయస్థానం ముందు ప్రవేశపెడతామని సిట్ చీఫ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర వ్యాఖ్యానించడంతో అశోక్ అరెçస్టు తప్పదన్న వాదనలు బలపడ్డాయి. అదే సమయంలో లోక్సభ ఎన్నికల కోడ్ రావడంతో ఇంతకాలం ఈ కేసు కాస్త నెమ్మదించింది. ఇప్పుడు ఆధార్ ఫిర్యాదుతో మళ్లీ సిట్ దర్యాప్తు వేగం పుంజుకుంది. రాజకీయ కారణాలతోనే ఆగుతున్నారా? ఈ కేసులో నిందితుడికి ఏపీ ప్రభుత్వ పెద్దలు ఆశ్రయమిస్తున్నారంటూ ప్రచారం జరగడం సమస్యగా మారింది. అశోక్ ఆచూకీ తెలిసినా అతన్ని అరెస్టు చేయడానికి తెలంగాణ సిట్ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇంకొన్ని రోజులు వేచి చూసి న్యాయస్థానం ద్వారానే అశోక్ను పట్టుకోవాలన్నది సిట్ యోచనగా తెలుస్తోంది. వారి జాప్యానికి రాజకీయ పరిణామాలు కూడా కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఓటుకు కోట్లు కేసులోనూ నిందితులను వెనకేసుకొచ్చిన సీఎం చంద్రబాబు, అతని కుమారుడు లోకేశ్లు ఈ కేసులోనూ అదే తరహాలో వ్యవహరిస్తుండటం గమనార్హం. లోకేశ్కు అత్యంత సన్నిహితుడు..! మొదటి నుంచి ఏపీ మంత్రి లోకేశ్కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ అశోక్... ఆ సాన్నిహిత్యంతోనే పార్టీ కార్యక్రమాల నిర్వహణ దక్కించుకున్నాడని సమాచారం. సేవామిత్ర యాప్లో సర్వే కోసం ఉపయోగించిన ప్రతి అంశం ఎలాగైనా తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేలా ఉందన్న ఆరోపణలు ముమ్మరమయ్యాయి. చంద్రబాబు, లోకేశ్లతో ఉన్న పరిచయాల కారణంగానే ప్రభుత్వం... సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా, ఆధార్ సమాచారం, ఓటరు లిస్టు తదితరాలు అశోక్కు యాక్సెస్ చేసుకునే వీలు కల్పించిందన్న విషయాన్ని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఐటీ గ్రిడ్స్కే పరిమితమా..? ఈ కేసులో అత్యంత గోప్యంగా ఉండాల్సిన పౌరుల వ్యక్తిగత సమాచారం వివరాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడం ఆధార్ సెక్షన్ల ప్రకారం నేరం. ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. తెలంగాణ రాష్ట్ర పౌరుల ఆధార్ డేటా కూడా ఐటీ గ్రిడ్స్ వద్ద ఉండటంతో ఇది జాతీయస్థాయిలో చర్చకు దారితీసింది. గోప్యతను భద్రంగా ఉంచాల్సిన ప్రభుత్వాలే ఇలా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే వ్యక్తిగత సమాచారానికి రక్షణ ఎక్కడని పలువురు వాపోతున్నారు. ఒకవేళ ఈ డేటా శత్రు దేశాల చేతిలో పడితే అది దేశ భద్రతకే ముప్పు అని యూఐడీఐఏ ఆందోళన వ్యక్తం చేసింది. ఐటీ గ్రిడ్స్ దాదాపు రెండు రాష్ట్రాలకు చెందిన 7 కోట్ల మందికిపైగా సమాచారం సేకరించి ఆమెజాన్ క్లౌడ్ స్టోరేజీలో దాచింది. ఐటీ గ్రిడ్స్ డేటా చౌర్యానికి పాల్పడిన విషయం వాస్తవమేనని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) కూడా ధ్రువీకరించింది. ఇప్పుడు ఈ డేటా ఐటీ గ్రిడ్స్ కంపెనీ నుంచి ఇంకెక్కడికైనా లీక్ అయిందా? ఎవరితోనైనా షేర్ చేసుకున్నారా? అన్న విషయాలపైనా సిట్ అధికారులు దృష్టి సారించారు. దేశ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని విదేశాలకు చెందిన క్లౌడ్ కంపెనీలో స్టోర్ చేయడం చట్ట విరుద్ధం. ఇది జాతీయ భద్రతకు పెనుముప్పుగా పరిణమించే ప్రమాదం ఉండటంతో అధికారులు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. -
ఐటీగ్రిడ్స్ ప్రకంపనలు : ఐటీ కార్యదర్శికి ఈఏఎస్ శర్మ లేఖ
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ర్టాలకు చెందిన 7.82 కోట్ల మంది ఆధార్ డేటా, ఓటర్ ఐడీ సహా వ్యక్తిగత వివరాలు టీడీపీ యాప్ను డెవలప్ చేసిన ఐటీగ్రిడ్స్ వద్ద ఉన్నట్టు తెలంగాణ పోలీసులు గుర్తించడంపై భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ కేంద్ర సమాచార సాంకేతిక (ఐటీ) మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. డేటా చోరీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఐటీగ్రిడ్స్ వద్ద 7.82 కోట్ల మంది వ్యక్తిగత వివరాలు ఉండటం ఆందోళనకరమని ఐటీ కార్యదర్శి సాహ్నీకి రాసిన లేఖలో శర్మ పేర్కొన్నారు. ఐటీగ్రిడ్స్ అభియోగాలను ఐటీ మంత్రిత్వ శాఖతో పాటు యూఐడీఏఐ, ఈసీ తీవ్రంగా పరిగణించాలని కోరారు. యూఐడీఏఐ, ఈసీఐల పట్ల ప్రజలకు ఉన్న విశ్వసనీయతను ఐటీగ్రిడ్స్ దెబ్బతీసిందని ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కధనాన్ని ఉటంకిస్తూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ముమ్మటికీ పౌరుల వ్యక్తిగత గోప్యత ఉల్లంఘనేనని పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థ డేటా చోరీతో ఏ రాజకీయ పార్టీ దాన్ని దుర్వినియోగం చేసిందనే వ్యవహారంతో సంబంధం లేకుండా యూఐడీఏఐ, ఈసీలు తెలుగు ప్రజలకు సంతృప్తికర వివరణ ఇవ్వాలని ఆయన కోరారు.డేటా చోరీ, ఐటీ గ్రిడ్స్ నిర్వాకంపై యూఐడీఏఐ, ఈసీలు తమ బాధ్యత నుంచి తప్పించుకోజాలవన్నారు. యూఐడీఏఐ చైర్మన్ జే సత్యనారాయణ, ఏపీలో టీడీపీ ప్రభుత్వ ఈ గవర్నెన్స్, ఐటీకి సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తుండటంపై గతంలో తాను రాసిన లేఖను సమాచార సాంకేతిక శాఖ విస్మరించిందని శర్మ గుర్తుచేశారు. తెలుగు రాష్ర్టాల ప్రజల వ్యక్తిగత వివరాలను నిక్షిప్తం చేసిన ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో స్ధానిక యూఐడీఏఐ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ కేసులో సరిపోదని పేర్కొన్నారు. యూఐడీఏఐ అధికారుల ప్రమేయం లేకుండా ఐటీగ్రిడ్స్ 7.82 కోట్ల మంది ఆధార్ వివరాలు, ఓటర్ ఐడీ వంటి డిజిటల్ రికార్డులను సమీకరించడం సాధ్యం కాదని అన్నారు. ప్రైవేట్ కంపెనీతో కుమ్మక్కై ఈ తతంగంలో పాలుపంచుకున్న యూఐడీఏఐ అధికారులందరిపై చర్యలు చేపట్టాలని కోరారు. ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీ ప్రమేయం ఉందని తేలితే ఆయా బాధ్యులపైనా కేసు నమోదు చేయాలన్నారు. ఐటీగ్రిడ్స్ వ్యవహారంలో సరైన చర్యలు చేపట్టడంలో ఐటీ మంత్రిత్వ శాఖ విఫలమైతే తాము న్యాయస్ధానాలను ఆశ్రయించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. -
డేటా చోరి కేసులో సంచలన నిజాలు
-
ఇది దేశ భద్రతకే సవాల్
సాక్షి, అమరావతి/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ‘సేవా మిత్ర యాప్’ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పాల్పడిన డేటా స్కామ్ మరో కీలక మలుపు తిరిగింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ఆధార్ చోరీ నిజమేనంటూ ఆధార్ (యుఐడీఏఐ) అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ టి.భవానీ ప్రసాద్ పోలీసులకు రిపోర్టు చేశారు. ప్రభుత్వ స్కీమ్లకు సంబంధించిన సమాచారం, లబ్ధిదారులు, ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం చోరీకి గురైనట్టు తమ విచారణలో తేలిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 12న ఆయన సైబరాబాద్ జిల్లాలోని మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాదాపూర్ పోలీసులు ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నెంబర్ 278/ 2019లో సెక్షన్ 37, 38,(ఎ)(బి)(జి), 40, 42, 44 ఆధార్ చట్టం 2016 ప్రకారం కేసు నమోదు చేశారు. 18 రకాల వ్యక్తిగత సమాచారం చోరీ ఆంధ్రప్రదేశ్లోని దాదాపు 3 కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్ ఐడీ తదితర వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతోందంటూ లోకేశ్వర్రెడ్డి అనే వ్యక్తి మార్చి 2న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ సంస్థపై సోదాలు నిర్వహించి ఏడు హార్డ్ డిస్క్లు, డిజిటల్ ఎవిడెన్స్లను సీజ్ చేశారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్(ఎఫ్ఎస్ఎల్)లో పరీక్షించారు. చోరీ అయిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 7,82,21,397 రికార్డులు ఆధార్ డేటా బేస్కు లింక్ అయ్యి ఉన్నట్టు గుర్తించారు. ప్రభుత్వం వద్ద గోప్యంగా ఉండాల్సిన సమాచారంతోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారం సైతం ఐటీ గ్రిడ్స్ సంస్థ చేతిలోకి వెళ్లిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ సేవా మిత్ర యాప్నకు లింక్ చేసి అనేక అక్రమాలకు ఉపయోగించుకునేందుకే చోరీకి పాల్పడినట్లు స్పష్టమైంది. ఆంధ్ర, తెలంగాణ ప్రజల ఆధార్ డేటాను నిందితుడు అక్రమంగా అమెజాన్లో స్టోర్ చేశాడని, ఈ సున్నితమైన డేటా అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరగాళ్ల చేతిలో పడితే దేశ భద్రతకే ముప్పని పోలీసులకు ఇచ్చిన రిపోర్టులో ఆధార్ అథారిటీ డీడీ భవానీప్రసాద్ పేర్కొన్న భాగం ఫిర్యాదుదారుడైన తుమ్మల లోకేశ్వరరెడ్డితో పాటు ముద్దనలాలిగారి జయరామిరెడ్డి, అక్కల మద్దిలేటిరెడ్డి, ఆకుల రవికుమార్, అబ్దాస్ వెంకటప్రతాప్లను నమూనాలుగా తీసుకుని డేటా స్కామ్ తీగ లాగారు. దీంతో టీడీపీ సేవా మిత్ర యాప్ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా స్కామ్ గుట్టురట్టు అయ్యింది. ప్రజలకు చెందిన 18 రకాల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) నిర్ధారించింది. వాటిలో ఆధార్ (యూఐడీ) నంబర్తోపాటు, ఆధార్ ఎన్రోల్మెంట్(ఈఐడీ) నంబర్, కలర్ ఫొటోతో కూడిన ఓటరు జాబితా, పౌరుని పేరు, స్థానికంగా పిలుచుకునే పేరు, జెండర్, ఫోన్ నంబర్, వారి తండ్రి, సంరక్షకుడు, భర్త పేరు, కేరాఫ్ పేరు, పుట్టిన రోజు, గ్రామం, మండలం, జిల్లా పేరు, జిల్లా ఐడీ, పిన్కోడ్, వీటీసీ కోడ్, రాష్ట్రం పేరు, రాష్ట్రం కోడ్ వంటి వ్యక్తిగత వివరాలన్నీ చోరీ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. దేశ భద్రతకు సంబంధించిన అంశం.. ఆధార్ ఆథారిటీ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) భవానీ ప్రసాద్ పోలీసులకు ఇచ్చిన రిపోర్టులో ఆందోళన కలిగించే అంశాలను ప్రస్తావించారు. ‘యూనిక్ ఐడీ(ఆధార్) అనేది రాష్ట్రానికి సంబంధించినది కాదు. అది పూర్తిగా కేంద్ర పరిధిలోనిది. పౌరుల ఆధార్ ఐడీని టీడీపీ సేవామిత్ర యాప్ కోసం లింక్ చేయడం జాతీయ భద్రతకు ప్రమాదకరమైన అంశంగా పరిగణించాలి. దీన్ని కేవలం ఏపీ, తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశంగా చూడకూడదు. ఈ రెండు రాష్ట్రాల పౌరుల ఆధార్, ఓటర్, తదితర వ్యక్తిగత సమాచారం డేటా చోరీ జరిగింది. ఈ సమాచారం దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ఉండే నేరస్తుల చేతికి చిక్కితే అంతర్జాతీయ మూకుమ్మడి నేరాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఆధార్తోపాటు ప్రజలకు సంబంధించిన మరో 17 కీలక అంశాలు కూడా చోరీ చేసినట్లు ఎఫ్ఎస్ఎల్ నిర్ధారించింది. ప్రజల వ్యక్తిగత సమాచారం ఇలా ఐటీ గ్రిడ్స్కు ఇవ్వడం పెద్ద నేరం. అసలు సేవామిత్ర అప్లికేషన్పైనే గట్టి అనుమానాలున్నాయి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరగాలి’అని భవానీప్రసాద్ తన రిపోర్టులో పేర్కొనడం గమనార్హం. ప్రధాన నిందితుడికి ప్రభుత్వ పెద్దల షెల్టర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్ ఐడీలను ఓ వ్యూహం ప్రకారం టీడీపీ యాప్ (సేవామిత్ర) తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చౌర్యం చేసింది. ఏపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ అక్రమ మార్గాల్లో అందరి వ్యక్తిగత వివరాలను సేకరించింది. అయితే ఈ సేవామిత్ర యాప్లో కేవలం తెలుగుదేశం పార్టీ వారికి చెందిన వివరాలు మాత్రమే ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెప్పినదంతా తప్పు అని ఇప్పుడు స్పష్టమైంది. ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజలందరి వ్యక్తి గత సమాచారాన్ని చంద్రబాబు, లోకేష్ల డైరెక్షన్ మేరకు ప్రభుత్వమే ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఇచ్చిందనేందుకు తాజా పరిణామాలే ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్కు ఏపీ ప్రభుత్వ పెద్దలే షెల్టర్ ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దల స్వార్థం వల్ల ఈ వ్యవహారం ఏపీలోని పలువురు అధికారుల మెడకు చుట్టుకోనుందని తెలుస్తోంది. చట్టాలు ఏం చెబుతున్నాయంటే.. సెంట్రల్ ఐడెంటిటీ డేటా రెపోసిటరీ(సీఐడీఆర్), రాష్ట్రానికి చెందిన స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ (ఎస్ఆర్డీహెచ్) వంటి వాటి వద్ద భద్రంగా ఉండాల్సిన సమాచారం ఐటీ గ్రిడ్స్ సంస్థ చేతుల్లోకి వెళ్లడం తీవ్ర నేరం. సీఐడీఆర్, ఎస్ఆర్డీహెచ్లకు చెందిన ప్రతినిధులు విధుల్లో ఉన్నా, లేకున్నా ప్రజలకు చెందిన సమాచారాన్ని బయటకు లీక్ చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ఆధార్ రెగ్యులేషన్ యాక్ట్ 2016 సెక్షన్ 28(5) ప్రకారం నేరం. ప్రభుత్వ పథకాలు, సర్వేల కోసం కాంట్రాక్టులో భాగంగా ఏదైనా ఏజెన్సీకి ఇచ్చినా ఇతర ప్రయోజనాల కోసం దాన్ని దుర్వినియోగం చేసినా సెక్షన్ 29(3) ప్రకారం నేరం. ఇతర ప్రయోజనాల కోసం, సర్వేలు, ఫలితాలు, ఓటర్ల జాబితాలో తొలగింపులు వంటి తదితర అక్రమాలకు ప్రజల వ్యక్తిగత డేటాను మళ్లించడం సెక్షన్ 38(జి) ప్రకారం నేరం. ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించి దాన్ని తమ అవసరానికి అనుగుణంగా చేర్పులు, మార్పులు, తొలగింపులు చేయడం, విలువైన డేటాకు భంగం కలిగించి వేరే ప్రయోజనాలకు వాడుకోవడం సెక్షన్ 38(హెచ్) ప్రకారం నేరం. ఇందుకు సెక్షన్ 40 ప్రకారం మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.పది లక్షలు జరిమానా ఉంటుంది. ఆధార్ యాక్ట్ సెక్షన్ 37 ప్రకారం ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించడంతోపాటు దాన్ని ఇంటర్నెట్లో వాడుకోవడం, ఇతర వ్యక్తులు, సంస్థలకు ఇచ్చిపుచ్చుకోవడం, ఆ డేటాను ట్రాన్స్మీట్ చేయడం, రహస్యంగా దాచడం తీవ్రమైన నేరం. ప్రభుత్వ పెద్దల దన్నుతో డేటా స్కామ్కు పాల్పడిన ఐటీ గ్రిడ్స్ సంస్థ ఆ డేటాను అమెజాన్ (అమెరికా) వెబ్ సర్వీసులోని క్లౌడ్ సర్వర్లో పెట్టడం తీవ్ర నేరం. సెక్షన్ 44 ప్రకారం దీనిని దేశం బయట జరిగే నేరం (అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా)గా పరిగణిస్తున్నారు. ఈ డేటా మన శత్రుదేశమైన పాకిస్తాన్లోని టెర్రరిస్టులకు చిక్కినా, ఆంతర్జాతీయ నేరస్తులకు చిక్కినా దేశ భద్రతకు పెను ముప్పుగా మారే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, ప్రజా సాధికార (పల్స్) సర్వే పేరుతో సేకరించిన సున్నితమైన సమాచారంతో అనుసంధానమై ఉండటం ఐటీ యాక్ట్ – 2008 సెక్షన్ 72(ఎ), సెక్షన్ 65, సెక్షన్ 66(బి) కింద పూర్తిగా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అంశం. ఆధార్ డీడీ రిపోర్టుకు కారణం ఇదే.. టీడీపీ సేవా మిత్ర యాప్ నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డేటా స్కామ్కు పాల్పడుతున్న వైనంపై ఈ ఏడాది మార్చి 2న ఫిర్యాదు రావడంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ వెస్ట్జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర మార్చి 15న కేంద్రం పరిధిలోని ఆధార్ అథారిటీ (యూఐడీఏఐ)కి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును సంబంధించిన పూర్తి వివరాలు విచారించిన ఆధార్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) టీవీ భవానీ ప్రసాద్ ఈ నెల 12న మాదాపూర్ పోలీసులకు రిపోర్టు ఇచ్చారు. -
ఐటీ గ్రిడ్స్ కంపెనీ నిర్వాహకులపై మరో కేసు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్ కేసుపై మరోకేసు నమోదైంది. ఆదార్ సంస్థ పలు సెక్షన్ల కింద ఐటీ గ్రిడ్స్పై కేసులు వేసింది. ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఆధార్ సమాచారంపై యూఐడీఏఐ కేంద్ర అధికారులను సిట్ వివరణ కోరింది. ఈ మేరకు ఆధార్ యాక్ట్లోని 37,38,40,42,44 సెక్షన్ల కింద మాదాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసును పోలీసులు సిట్కు బదిలీ చేశారు. -
బాధితులు ఏడు కోట్ల మంది ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల డేటా చోరీ కేసులో బాధితులు ఎన్నికలు సంఘం, ఆధార్ సంస్థ కాదని, 7 కోట్ల మంది ఓటర్లని, వారి వ్యక్తిగత సమాచారాన్నే ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చోరీ చేసిందని సీని యర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. కీలక సమాచారం తమ వద్ద ఉందన్న విషయంతో ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ విభేదించడం లేదన్నారు. ఇక్కడ ప్రధాన ప్రశ్నలు, ఎవరు చెబితే ఈ సమాచారాన్ని చోరీ చేశారు.. ఎవరి కోసం చోరీ చేశారు.. ఏం ఆశించి ఇలా చేశారన్నదే ముఖ్యమన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తే కుట్ర మొత్తం బహిర్గతమవుతుందని ఆయన తెలిపారు. అందువల్ల నిబంధనల ప్రకారం బాధితుల వాదన వినాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వాదనలు విన్న హైకోర్టు, ఈ వ్యాజ్యంలో కొత్తగా ప్రతివాదులుగా చేర్చబడిన ఎన్నికల సంఘం, ఆధార్, ఏపీ ఆధార్ నమోదు ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. వీరి నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నామంది. ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ అశోక్ దాఖలు చేసిన పిటిషన్ల విచారణార్హత, కేసు పూర్వాపరాలపై ఏప్రిల్ 22న విచారిస్తామంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ల డేటా చోరీకి సంబంధించి ఎస్ఆర్ నగర్, మాదాపూర్ పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ హైకోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ షమీమ్ అక్తర్ బుధవారం విచారణ జరిపారు. గత విచారణ సమయంలో న్యాయమూర్తి ఆదేశాల మేరకు పిటిషనర్ ఈ వ్యాజ్యాల్లో ఎన్నికల సంఘం, ఆధార్ సంస్థ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ సందర్భంగా డేటా చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన లోకేశ్వర్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, డేటా చోరీ వెనుక భారీ కుట్ర ఉందన్నారు. పిటిషనర్ న్యాయవాది ఈ వ్యవహారంలో ఆధార్, ఎన్నికల సంఘాన్ని బాధితులుగా చెబుతున్నారని, వారు కేవలం ప్రజల సమాచారాని కి సంరక్షకులు మాత్రమేనని తెలిపారు. తమ సమాచారాన్ని కోల్పోయిన ఓటర్లే ఇక్కడ బాధితులన్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకే ఆధార్, ఎన్నికల సంఘాన్ని ప్రతివాదులుగా చేర్చారన్నారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ, ముందు ఈ వ్యాజ్యాల విచారణార్హతను తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆ తరువాత అశోక్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయ వాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ, రాజకీయ దురుద్దేశాలతో పిటిషనర్పై కేసులు నమోదు చేశారన్నారు. ఎన్నికల సంఘం, ఆధార్ వద్ద ఉండాల్సిన సమాచారం బహిర్గతమైందని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి, ఇక్కడ ఆ రెండు సంస్థలే బాధితులని తెలిపారు. బాధితులైన ఆ సంస్థలు ఫిర్యాదు చేయలేదన్నారు. సమాచారం చోరీకి గురైందో లేదో ఈ సంస్థలే చెప్పాలని, అందువల్లే వారిని ప్రతివాదులు గా చేర్చామన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఈసీని, ఆధార్ సంస్థను ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 22కి వాయిదా వేశారు. -
ఐటీగ్రిడ్స్ కేసు: నలుగురికి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఐటీగ్రిడ్స్ కేసుకు సంబంధించి బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ముఖ్యంగా ఇంప్లీడ్ పిటిషన్పై వాదనలు కొనసాగాయి. ఈ కేసులో ఎన్నికల అధికారులను ఇంప్లీడ్ చేయవద్దని పిటిషనర్ లోకేశ్వరరెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్రెడ్డి కోర్టును కోరారు. అయితే ఇంప్లీడ్ పిటిషన్లో ఉన్న నలుగురికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఎన్నికల ప్రధాన అధికారికి, ఆధార్ అథారిటీ అధికారులుకి, ఏపీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు, డేటా ఎన్రోలింగ్ అధికారులకు నోటీసులు జారీ చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వ పీపీ, లోకేశ్వర్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా, తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 22 కు వాయిదా వేసింది. (చదవండి: ఐటీగ్రిడ్స్పై వాడీవేడి వాదనలు) -
ఐటీగ్రిడ్ కేసు విచారణను వాయిదా వేసిన హైకోర్టు
-
7 కోట్ల మంది డేటాచోరీ
సాక్షి, హైదరాబాద్: ఐటీగ్రిడ్స్ డేటా వివాదంలో వెలుగులోకి వస్తున్న అంశాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాతోపాటు ఏపీలోని పలు జిల్లాలకు చెందిన దాదాపు 7కోట్ల మంది ఓటర్ల సమాచారం ఐటీగ్రిడ్స్ కంపెనీలో జరిపిన సోదాల్లో దొరికిందని తెలంగాణ హైకోర్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది మహేష్ జెఠ్మలాని బుధవారం వెల్లడించారు. ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండాల్సిన, బయట ఎక్కడా ఉండకూడని అత్యంతక కీలకమైన రహస్య సమాచారం ఐటీగ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వద్ద లభించిందని ఆయన న్యాయస్థానానికి నివేదించారు. ఐటీగ్రిడ్స్ కార్యాలయంలో తనిఖీలు చేసినప్పుడు అనేక ఆశ్చర్యకర వివరాలు తెలిశాయన్నారు. ఈ జాబితాను సదరు సంస్థకు ఎలా అందిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో అనే సమాచారం కూడా సోదాల్లో దొరికిందన్నారు. తెలంగాణ, ఏపీకి చెందిన 7 కోట్ల మంది సమాచారం వీరి వద్ద ఉందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చునన్నారు. ‘సేవా మిత్ర’యాప్ ద్వారా ఓటర్లను ఎవరికి ఓటు వేస్తారంటూ ఆరా తీసి, అధికార పార్టీకి వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పిన వారి ఓట్లను పెద్ద ఎత్తున తొలగించారని కోర్టుకు నివేదించారు. ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్గా అశోక్ క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారని, దర్యాప్తు నిమిత్తం హాజరు కావాలని పలుమార్లు నోటీసులు జారీచేసినా స్పందనలేదన్నారు. దర్యాప్తునకు సహకరించడం లేదని, చట్టం, దర్యాప్తు సంస్థలంటే గౌరవం లేని ఇటువంటి వ్యక్తుల పట్ల కోర్టులు సానుకూల వైఖరిని ప్రదర్శించరాదన్నారు. ఈ కేసుకు సంబంధించిన వాదనలు పూర్తి కాకపోవడంతో న్యాయమూర్తి షమీమ్ అక్తర్ తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేశారు. ఓటర్ల డేటాచోరీ కేసులో తనపై పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అశోక్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ బుధవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా అశోక్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ, ఈ వ్యవహారం మొత్తం ఏపీ ఓటర్లకు సంబంధించిందని, అందువల్ల ఈ కేసును ఏపీకి బదిలీ చేయాలని ఆయన కోర్టును కోరారు. -
ఐటీగ్రిడ్స్పై వాడీవేడి వాదనలు
సాక్షి, హైదరాబాద్: ఐటీగ్రిడ్స్ కేసులో ఇరువర్గాల వాదనలు ఇన్న తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. డేటాచోరీ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీగ్రిడ్స్ సంస్థ యజమాని ఆశోక్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ్ లూత్రా కోర్టులో వాదనలు వినిపించారు. ఏపీ డేటాపై తెలంగాణకు ఏం సంబంధమని, కేసుపై విచారించే హక్కు ఇక్కడి పోలీసులకు లేదని ఆయన అన్నారు. ఒకే కేసుపై రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారని, దీనిలో రాజకీయ దురుద్దేశ్యము తప్ప మరొకటి లేదని ఆయన కోర్టుకు తెలియజేశారు. కేసులో సిట్ తరఫున తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్గా కోర్టులో వాదనలు వినిపించారు. ఐటీగ్రిడ్స్ కంపెనీ ద్వారా డేటాచోరీ జరిగినట్లు తమవద్ద ఖచ్చిమైన ఆధారాలు ఉన్నయని కోర్టుకు తెలిపారు. సంబంధిత కంపెనీ ఇదే రాష్ట్రంలో ఉన్నందున విచారించే హక్కు తెలంగాణ పోలీసులకు ఉందన్నారు. కేవలం ఏపీ డేటానే కాకుండా తెలంగాణ డేటా కూడా చోరీకి గురైందని ఆయన కోర్టుకు నివేధించారు. -
ఐటీ గ్రిడ్స్ అశోక్కు పబ్లిక్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచార తస్కరణ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఐటీ గ్రిడ్స్ సంస్థ డైరెక్టర్ అశోక్కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆఖరి నోటీసులు జారీ చేసింది. మార్చి 2, 11, 16వ తేదీల్లో మూడుసార్లు పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ అశోక్ నోటీసులకు స్పందించలేదు. దీంతో పబ్లిక్ నోటీసులకు సిట్ సిద్ధమైంది. గతంలో జారీ చేసిన నోటీసులను అశోక్ నేరుగా తీసుకోలేదు. తెలంగాణ నుంచి ఏపీకి పారిపోయాక అతని ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు కష్టంగా మారింది. దీంతో ప్రచార సాధనాల (కొన్ని ఆంగ్ల పత్రికలు) ద్వారా పబ్లిక్ నోటీసులు జారీ చేసింది. అశోక్ ఎక్కడున్నా ప్రకటన వెలువడిన మూడు రోజుల్లోగా గోషామహల్లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. సిట్కి నేతృత్వం వహిస్తున్న ఐజీ స్టీఫెన్ రవీంద్ర పేరు మీద ఈ ప్రకటన వెలువడింది. దీనిపై అశోక్ స్పందనను బట్టి సిట్ తదుపరి చర్యలకు సమాయత్తం కానుంది. -
అశోక్కు మూడోసారి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపిన డేటా చౌర్యం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగు తున్న ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. 41 సీఆర్పీసీ ప్రకారం.. నోటీసుల జారీకి పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మార్చి 2న మాదాపూర్ పోలీసులు, మార్చి 11న సిట్ పోలీసులు అశోక్ను విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. మార్చి 11న కేపీహెచ్బీలోని అత ని ఇంటికి వెళ్లిన పోలీసులు, అక్కడ ఎవరూ లేకపోవడంతో నోటీసులను గోడకు అంటించి వచ్చారు. మార్చి 13న విచారణ హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ అశోక్ రాలేదు. ఈ కేసు సమగ్ర వివరాలను అధికారులు ఈ నెల 20న కోర్టుకు సమర్పించనున్నారు. నిబంధనల ప్రకారం మూడోసారి కూడా పోలీసుల నోటీసులకు స్పందించకపోతే అరెస్టు దిశగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. -
ఐటీగ్రిడ్స్ స్కాం : అశోక్కు మరోసారి నోటీసులు!
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపిన ఐటీ గ్రిడ్స్ డేటా చోరి కేసును సిట్ ముమ్మరం చేశారు. ఐటీ గ్రిడ్స్ చైర్మన్ అశోక్కు మరోసారి నోటీసులు అందించేందుకు సిద్దమయ్యారు. ఈనెల 11న నోటీసులు జారీ చేసినప్పటికి విచారణకు హాజరు కాలేదు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా అశోక్ విచారణకు హాజరుకాకపోవడం పట్ల సిట్ అధికారులు సీరియస్గా ఉన్నారు. 41సీఆర్సీసీ కింద అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఇప్పటి వరకు జరిగిన విచారణను కోర్టుకు పూర్తి స్థాయిలో నివేదిక రూపంలో అందించనున్నారు. ఈ నెల 20న హైకోర్టుకు ఈ కేసుపై నివేదిక ఇవ్వనున్నామని అధకారులు పేర్కొన్నారు. విచారణలో భాగంగా మార్చి 13న తమ ముందు హాజరుకావాలని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అశోక్కు ఈ నెల 11న నోటీసులు జారీ చేసింది. కేపీహెచ్బీలోని అశోక్ ఇంటికి వెళ్లిన పోలీసులకు తాళం వేసి ఉండటంతో గోడకు నోటీసులు అంటించి వెనుదిరిగారు. బుధవారం ఉదయం గోషామహల్లోని తమ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. కానీ ఈ నోటీసులకు అశోక్ స్పందించలేదు. విచారణకు డుమ్మా కొట్టారు. గతంలోనూ విచారణకు రావాలని అశోక్కు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు. సంబంధిత కథనాలు సిట్ విచారణకు అశోక్ మళ్లీ డుమ్మా! డేటా చోరీ కేసు.. కీలక ఆధారాలు సేకరించిన అధికారులు ఐటీగ్రిడ్స్ కేసు.. అశోక్కు హైకోర్టులో చుక్కెదురు -
20 తర్వాత ప్రచారంలో పాల్గొనాలంట..
సాక్షి, అమరావతి : చోరీ అయిన ప్రభుత్వ డేటా ఇప్పుడు రాష్ట్రంలోని లబ్దిదారులకు ప్రాణ సంకటంగా మారింది. ప్రభుత్వం వద్ద మాత్రమే గోప్యంగా ఉండాల్సిన సంక్షేమ పథకాల లబ్దిదారుల సమాచారం ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల వద్దకు చేరింది. దీంతో వారు తమ ప్రాంతంలో లబ్ధిదారులను కలిసి ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారంలో పాల్గొనాలని ఒత్తిడి తెస్తున్నారు. ఎన్నికలయ్యేవరకూ చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేయడానికి.. పింఛన్లు పొందే వృద్ధులు, వితంతువులతో పాటు ‘పసుపు–కుంకుమ’ ఇచ్చినందున గ్రామాలు, పట్టణ వార్డుల వారీగా డ్వాక్రా మహిళలు లబ్దిదారులతో గ్రూపులుగా ఏర్పడాలని ఒత్తిళ్లు తెస్తున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల అధికార పార్టీ నేతల నుంచి ఇలాంటి బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఏడాది క్రితం రియల్ టైం గవర్నెనెన్స్ సిస్టం (ఆర్టీజీఎస్) శాఖలో సాధికార మిత్రల వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల వివరాలతో ఓ మొబైల్ యాప్ తయారైంది. ఇప్పుడా యాప్లోని సమాచారం మొత్తం టీడీపీ బూత్ కార్యకర్తల సేవామిత్ర యాప్ డేటాను పోలి ఉంది. ఇప్పుడీ డేటా మొత్తం టీడీపీ అభ్యర్థుల చేతికి చేరడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. 20 తర్వాత ప్రచారంలో పాల్గొనాలంట.. మార్చి 20 నుంచి గ్రామాల వారీగా తాము చెప్పినప్పుడు టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి గ్రూపులు సిద్ధంగా ఉండాలని జిల్లాల్లో టీడీపీ నేతలు హుకుం జారీచేసి వెళ్తున్నారని పలుచోట్ల లబ్ధిదారులు వాపోతున్నారు. పింఛనుదారులు, డ్వాక్రా మహిళలను ఈ ప్రచారంలో భాగస్వామ్యం చేసేందుకు కొంతమంది ప్రభుత్వ సిబ్బంది సైతం అధికార పార్టీ నేతలతో కలిసి లబ్దిదారులపై ఒత్తిడి చేస్తున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉన్నతాధికారులు అయితే తమ విభాగాల్లో మండల స్థాయిలో పనిచేసే వారిని అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలంటూ మౌఖికంగా ఆదేశాలు జారీచేస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. వణికిపోతున్న లబ్ధిదారులు ఇదిలా ఉంటే.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని వస్తున్న ఒత్తిళ్లతో పింఛనుదారులు, డ్వాక్రా మహిళలు వణికిపోతున్నారు. ‘నిరుపేదలం.. మాకెందుకు ఈ రాజకీయాలన్నా అధికార పార్టీ నేతలు ఒప్పుకోవడంలేదు.. సెర్ప్ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నా’రని వారంటున్నారు. ‘రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పింఛన్లు మంజూరు అవ్వబట్టే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తోంది. మాకెందుకయ్యా ఈ రాజకీయాలు అన్నా వదలడం లేదయ్యా’ అంటూ శ్రీకాకుళం జిల్లాలో ఒక పింఛనుదారుడు వాపోయాడు. ‘ప్రచారం చేయకపోతే పింఛన్లు రద్దు చేస్తామంటున్నారు, భయం వేస్తోంది’ అని అతను కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ప్రచారం చేయకపోతే పింఛను ఇప్పుడే తీసేస్తారని భయంగా ఉందంటూ కృష్ణాజిల్లాలో ఒక లబ్దిదారుడు వాపోయాడు. (చదవండి: సైబర్ నేరగాళ్లకు ‘డేటా’..!) -
సిట్ విచారణకు అశోక్ మళ్లీ డుమ్మా!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల డేటా చోరీకి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ విచారణకు హాజరుకాలేదు. విచారణలో భాగంగా మార్చి 13న తమ ముందు హాజరుకావాలని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అశోక్కు ఈ నెల 11న నోటీసులు జారీ చేసింది. కేపీహెచ్బీలోని అశోక్ ఇంటికి వెళ్లిన పోలీసులకు తాళం వేసి ఉండటంతో గోడకు నోటీసులు అంటించి వెనుదిరిగారు. బుధవారం ఉదయం గోషామహల్లోని తమ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. కానీ ఈ నోటీసులకు అశోక్ స్పందించలేదు. బుధవారం విచారణకు డుమ్మా కొట్టారు. గతంలోనూ విచారణకు రావాలని అశోక్కు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు. ఫిర్యాదుదారుల వాంగ్మూలం రికార్డు.. ఏపీలో 3.6 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత డేటాను సేవామిత్ర యాప్ ద్వారా టీడీపీ తస్కరిస్తోందని మార్చి 2న విజిల్ బ్లోయర్ లోకేశ్వర్రెడ్డి మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. ఆ మర్నాడే దశరథరామిరెడ్డి అనే వ్యక్తి కూడా ఇలాంటి ఫిర్యాదుతో ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో కేసులు నమోదయ్యాయి. కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వానికి డీజీపీ లేఖ రాయడంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం లోకేశ్వర్రెడ్డి, దశరథరామిరెడ్డిలను పోలీసులు సిట్ కార్యాలయానికి పిలిపించారు. వారిని ప్రశ్నించిన పోలీసులు వారి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. వీరితో పాటు ఐటీ గ్రిడ్స్ సంస్థలో ఉద్యోగులైన ఫణి, భాస్కర్, విక్రమ్, చంద్రశేఖర్లను కూడా మరోసారి ప్రశ్నించారు. కాగా, గూగుల్, అమెజాన్ల నుంచి సమాచారం ఇంకా రాలేదు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్లు, కంప్యూటర్ల నుంచి సమాచారాన్ని రీట్రైవ్ చేయడానికి నిపుణులు శ్రమిస్తున్నారు. త్వరలోనే వీటి నుంచి సమాచారాన్ని సంగ్రహిస్తామని పోలీసులు చెబుతున్నారు. మీడియాపై పోలీసుల దురుసు ప్రవర్తన అశోక్ వస్తారన్న సమాచారంతో గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్కు వెళ్లిన మీడియాపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. లోపలికి అనుమతించేది లేదని మీడియాతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ మీడియా ప్రతినిధులు అక్కడే బైఠాయించారు. అటుగా వస్తున్న డీఎస్పీ రోహిణి ప్రియదర్శిని వాహనాన్ని అడ్డగించారు. అనంతరం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్కు దీనిపై ఫిర్యాదు చేశారు. -
‘తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య బాబు చిచ్చు’’
హైదరాబాద్: తెలంగాణాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రగడ్డ అనిల్ కుమార్ విమర్శించారు. ఏపీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనిల్కుమార్ మాట్లాడుతూ.. డేటా చోరీ కేసులో ఏపీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సామాన్య ప్రజల ఓటు హక్కును ప్రైవేటు సంస్థలకు చంద్రబాబు అప్పగించారని ఆరోపించారు. డేటా చోరీలో కేసులో ప్రధాన నిందితుడు అశోక్ను తప్పించడానికి చంద్రబాబు చూస్తున్నారని అన్నారు. తెలంగాణాలో ఉన్న సెటిలర్లును బాబు ఇబ్బందులు పెడుతున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర స్పష్టంగా ఉన్నా అధికారంతో తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. సుజానా చౌదరీ జీఎస్టీ పన్ను ఎగవేసినా చంద్రబాబు స్పందించరని, రైతులకు రుణమాఫీ చేస్తామని ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని అన్నారు. కేటీఆర్, వైఎస్ జగన్ను కలవడాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని, కేటీఆర్, జగన్ను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ కోసమే వైఎస్ జగన్ను కేటీఆర్ కలిసి ఉండవచ్చు కదా అని అన్నారు. ఏపీ ప్రజలను మరోసారి చంద్రబాబు మోసం చేయడానికే వస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. -
సిట్ ముందుకు ఐటీగ్రిడ్స్ అశోక్
సాక్షి, హైదరాబాద్: ఐటీగ్రిడ్స్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసంస్థ యజమాని అశోక్ ఈరోజు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకానున్నారు. ఇటీవల ఆయనకు సిట్ అధికారులు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. విచారణకు రాకుంటే అరెస్ట్ వారెంట్ జారీచేసే అవకాశం ఉందని పోలీసులు తేల్చిచెప్పడంతో సిట్ ముందుకు రానున్నారు. ఆయన వ్యక్తిగత న్యాయవాదులతో కలిసి వచ్చే అవకాశం ఉంది. సిట్ విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల ముందు డేటాచోరీ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. కాగా పోలీసుల విచారణకు అశోక్ హాజరుకావల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. చదవండి: డేటా చోరీ బాధ్యత ఆ ఇద్దరిదే! హైకోర్టులో అశోక్కు చుక్కెదురు -
‘డేటా ట్రాన్స్ఫర్ చేయడం తప్పే’
సాక్షి, తూర్పుగోదావరి : డేటా చోరీ కేసుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ మీడియా సమావేశంలో మంగళవారం మాట్లాడారు. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారం ప్రైవేటు సంస్థలకు ఎలా లభ్యమైందని ప్రశ్నించారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అఫిషియల్గా ఐటీగ్రిడ్స్ వంటి సంస్థలకు డేటా ట్రాన్స్ఫర్ చేసినా అది తప్పేనని అన్నారు. అయినా, పోలీసుల ముందుకు రాకుండా అశోక్ ఎందుకు పరారీలో ఉన్నాడని విస్మయం వ్యక్తం చేశారు. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి ఎన్నో అవకతవకలను బయటపెట్టామని తెలిపారు. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇదే ఆఖరు ప్రెస్ మీట్ అని వెల్లడించారు. ఏప్రిల్ 11న ఏపీలో పోలింగ్ పూర్తయ్యే వరకు ఇక మీడియా ముందుకురానని చెప్పారు. డేటా చోరీపై ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై స్పందించే విధానం ఇదేనా అని టీడీపీని ప్రశ్నించారు. ఎన్నికల స్థాయిని దిగజార్చారని మండిపడ్డారు. టీడీపీ సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలి గాని అనవసర కామెంట్లు చేయడం తగదన్నారు. ఏపీ ప్రజలకు సంబంధించిన పూర్తి డేటా వివరాలు టీడీపీ సేవామిత్రలో ఉన్నాయని అన్నారు. సాధికార మిత్ర పేరుతో సర్వేలు చేసి ఆధార్ నెంబర్ సేకరించి.. ఓటర్ గుర్తింపు కార్డులతో జతచేయడం అక్రమమన్నారు. గడిచిన 40 ఏళ్లలో దేశంలో నిరుద్యోగిత 6.1 శాతం పెరిగిందని చెప్పారు. రాఫెల్ ధర ఎంతో ఇప్పటివరకు కేంద్రం చెప్పకపోవడం దారుణమన్నారు. -
ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం దిగజారుస్తోంది
-
చోరీ డేటా అంతా ఎన్క్రిప్షన్లోనే..!
-
సైబర్ నేరగాళ్లకు ‘డేటా’..!
సాక్షి, అమరావతి: ‘‘హలో.. మీరు నాగరాజు గారేనా.. మేం బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం.. మీ ఆధార్ నెంబరు ఇదేనా.. అకౌంట్ నెంబర్ ఇదేనా.. ఆర్బీఐ ఆదేశాల మేరకు కేవైసీ పరిశీలనలో భాగంగా ఆథార్తో సహా అన్ని వివరాలను చూస్తున్నాం.. ఇప్పుడు మీ ఫోన్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. అది మాకు చెబితే ఈ–కేవైసీ వెరిఫికేషన్ అయిపోతుం దంటూ అవతల వ్యక్తి నుంచి కాల్ వస్తుంది. మనకు సంబంధించిన అన్ని వివరాలు ఖచ్చితంగా చెప్పారు కదా.. బ్యాంకు అధికారులే అయి ఉంటారనుకుని ఓటీపీ చెప్పడం.. ఆ వెంటనే మన బ్యాంకు ఖాతాలోంచి డబ్బులు మాయమైపోవడం క్షణాల్లో జరిగిపోతుంది. ఆ తర్వాత సదరు నెంబర్కు ఫోన్చేసినా కాల్ కలవదు. డబ్బులు పోయినవాళ్లు లబోదిబోమంటూ బ్యాంకులు, పోలీసుల చుట్టూ తిరగడం మామూలైపోయింది’’. .. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు మనం తరచూ చూస్తూనే వింటూనే ఉన్నాం. రెండు మూడేళ్లుగా రాష్ట్రంలో పెరిగిపోతున్న ఈ తరహా సైబర్ నేరాలకు.. ఫొటోల మార్ఫింగ్ ద్వారా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఇటీవల వెలుగుచూసిన డేటా స్కాంకు పెద్ద లింకే ఉన్నట్లు తెలుస్తోంది. పౌరుల వ్యక్తిగత సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోవడమే ఇందుకు కారణమని నిపుణులు తేల్చిచెబుతున్నారు. అదెలాగంటే.. రెండు తెలుగు రాష్ట్రాలను గత కొద్దిరోజు లుగా ఓ కుదుపు కుదుపుతున్న డేటా స్కాం బాగోతం ఇప్పుడు పలు చీకటి కోణాలనూ ఆవిష్కరిస్తోంది. ఈ వ్యవహారం ఓట్ల మార్పులు, చేర్పులకు మాత్రమే పరిమితం కాకుండా అనేకానేక సైబర్ నేరాలకు కేంద్రంగా నిలుస్తోంది. పౌరుల వ్యక్తిగత సమాచారం ఒక్క ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్ సంస్థల వద్దే పరిమితం కాకుండా వీరి నుంచి సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు రాష్ట్రంలో గత రెండేళ్లుగా చోటుచేసుకుంటున్న నేరాల తీరుబట్టి స్పష్టమవుతోంది. సర్వే పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చేయడం, ట్రేడింగ్ సలహాలంటూ బయట రాష్ట్రాలతోపాటు విదేశీ కాల్స్, కుప్పలుతెప్పలుగా స్పామ్ మెయిల్స్ ఇటీవల దాదాపు అందరికీ రావడం బాగా పెరిగిపోయాయి. ప్రజలకు సంబంధించిన.. ప్రభుత్వం వద్ద గోప్యంగా ఉండాల్సిన అంత్యంత కీలకమైన వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లడంవల్లే ఈ కాల్స్, స్పామ్ మెయిల్స్ ద్వారా చేసే మోసాలు ఏటా భారీగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉండాల్సిన ఆధార్, ఫోన్ నెంబర్లు, ఈ మెయిల్ చిరునామా, బ్యాంకు అకౌంట్ నెంబర్లు, బయోమెట్రిక్ వంటి సమస్త వ్యక్తిగత సమాచారం రాష్ట్ర ప్రభుత్వ దన్నుతో ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్ ద్వారా ఆర్థిక మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందన్నది సైబర్ నేరాల పెరుగుదల ద్వారా స్పష్టమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం తన పార్టీ అవసరాలను పర్యవేక్షించే ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ వద్ద రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం ఉందన్న విషయం బహిర్గతం కావడం.. సరిగ్గా రెండేళ్ల నుంచే రాష్ట్రంలో రకరకాలుగా ఆర్థిక నేరాలు పెరగడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. రాష్ట్రంలో పోలీసు శాఖ విడుదల చేసిన సైబర్ నేరాల సంఖ్య సైతం ఇదే స్పష్టం చేస్తోంది. నేరాలు ఇలా పెరిగాయి.. – తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ ఐదేళ్లలో సైబర్ నేరాల్లో 573 శాతం పైగా వృద్ధి పెరిగింది. – 2013లో 148గా ఉన్న సైబర్ నేరాల సంఖ్య గడచిన ఐదేళ్లలో 2018 నాటికి 1,314కి చేరిందంటే ఏ స్థాయిలో పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. – 2017లో సైబర్ నేరాల్లో 45 శాతం, 2018లో 25 శాతం చొప్పున పెరుగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. – నమోదవుతున్న నేరాల్లో అత్యధికంగా వన్టైమ్ పాస్వర్డ్కి సంబంధించిన కేసులే ఉంటున్నాయని రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఇటీవలే వెల్లడించడం గమనార్హం. – అంతేకాదు.. లాటరీలు వచ్చాయని, ఇన్కం ట్యాక్స్ రిఫండ్స్ అంటూ ఈ మెయిల్స్ రావడం.. వివరాలు ఇవ్వగానే అకౌంట్లోంచి డబ్బులు మాయమవుతున్న సంఘటనలూ భారీగానే పెరుగుతున్నాయి. – గడిచిన రెండేళ్ల నుంచి ఇలా స్పామ్ మెయిల్స్ రావడం బాగా పెరిగిందని, దీనికి వ్యక్తిగత డేటా చోరీ కావడమే కారణం కావచ్చని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహిళల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ.. మహిళల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ వారి జీవితాన్ని నరకప్రాయం చేస్తున్న సంఘటనలు కొంతకాలంగా విపరీతంగా పెరిగిపోయాయి. మీ వ్యక్తిగత వివరాలు, ఫొటోలు మా వద్ద ఉన్నాయంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారనే ఫిర్యాదులు అధికమవుతున్నాయి. పరువు మర్యాదలు, పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయనే భయంతో చాలామంది మహిళలు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను బయటకు చెప్పుకోలేక వారిలో వారు కుమిలిపోతున్నారు. ఇలాంటి వ్యవహారాలకు డేటా చోరీ ఓ ప్రధాన కారణమై ఉండవచ్చని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఐటీ గ్రిడ్స్ వద్ద ఓటర్ల కలర్ ఫొటోల మాస్టర్ డేటా ఉండడం ఇందుకు బలం చేకూరుస్తోంది. భూరికార్డులపైనా ఆందోళన ఆధార్లాగే రాష్ట్రంలోని భూములకు భూధార్ పేరుతో ఒక నెంబర్ను కేటాయించడమే కాకుండా భూ రికార్డులన్నీ ఆన్లైన్లో చేర్చడం, ఇప్పుడు ఈ సమాచారం అంతా కూడా ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిందన్న వార్తలపై రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ వంటి పథకాల పేరుతో భూముల వివరాలు, బ్యాంకు ఖాతాల నెంబర్లతో పాటు ఆదాయ వ్యయాలన్నీ సేకరించి ఆర్టీజీఎస్కు పంపించారని, అక్కడ నుంచి ఈ సమాచారం ఐటీ గ్రిడ్స్కు చేరడం ఈ భయాందోళనలకు ప్రధాన కారణం. ఇప్పటికే బ్యాంకు ఖాతాల వివరాలతో సైబర్ నేరగాళ్లు ఖాతాల నుంచి డబ్బులు లాగేస్తున్నారని, అలాగే ఫాం–7 పేరుతో తమకు తెలియకుండానే ఓట్లు తొలగించేస్తున్నారని.. అదే విధంగా ఇప్పుడు భూ రికార్డులను కూడా తారుమారు చేస్తే మా పరిస్థితి ఏంటని విజయవాడకు చెందిన రామలింగేశ్వరరావు అనే రైతు ఆందోళన వ్యక్తంచేశాడు. ముందు ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ను అరెస్టుచేసి ఆ తర్వాత ఈ సమాచారం ఎవరెవరి చేతుల్లోకి వెళ్లిందో అన్నదానిపై సమగ్ర విచారణ జరిపించి వ్యక్తిగత సమాచార భద్రతపై భరోసా కల్పించాలన్న డిమాండ్ రాష్ట్రంలో ఇప్పుడు ఊపందుకుంటోంది. రాష్ట్రంలో గత ఐదేళ్లలో సైబర్ నేరాలు పెరిగిన తీరు.. –––––––––––––––––––––––––––––––––––––––––––––––– సంవత్సరం సైబర్ నేరాల సంఖ్య –––––––––––––––––––––––––––––––––––––––––––––––– 2013 148 2014 195 2015 266 2016 718 2017 1,051 2018 1,314 –––––––––––––––––––––––––––––––––––––––––––––––– -
డేటా చోరీ బాధ్యత ఆ ఇద్దరిదే!
సాక్షి, అమరావతి: ‘‘శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, నిజాయితీ చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగాని, పక్షపాతంగాని, రాగద్వేషాలుగాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చిన అన్ని విషయాలను, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏ వ్యక్తికీ, వ్యక్తులకు తెలియపరచనని, లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’.. ఇది చంద్రబాబునాయుడు సీఎం పదవీ స్వీకారోత్సవంలో చేసిన ప్రమాణం. ..డేటా స్కాం బాగోతం వెలుగుచూడడంతో ఈ ప్రమాణాలన్నీ అటకెక్కించేసినట్లేనని స్పష్టమైంది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని, సున్నితమైన రహస్యాలను కాపాడాల్సిన సర్కారు పెద్దలే బాధ్యత మరిచి పార్టీ సేవల కోసం, రాజకీయ స్వార్థం కోసం వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అందిస్తే దానిని తీవ్ర నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. టీడీపీ సేవా మిత్ర యాప్ నిర్వహించే ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏపీలోని మూడున్నర కోట్లకు పైగా ప్రజల వ్యక్తిగత సమాచారంతోపాటు తెలంగాణ ప్రజల డేటాను కూడా చోరీకి పాల్పడటం తీవ్ర నేరమేనని న్యాయవాదులు స్పష్టంచేస్తున్నారు. ఇందుకు ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నియమావళి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు ఐటీ మంత్రి లోకేశ్లు బాధ్యత వహించాల్సిందేననే వాదన వారి నుంచి బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వ పథకాలకే పరిమితం కావాల్సిన ప్రజాసాధికార సర్వేను అడ్డుపెట్టుకుని ప్రజల కీలక సమాచారాన్ని ప్రైవేటు యాప్లకు అనుసంధానం చేయడం తీవ్ర నేరమేనని అంటున్నారు. వీటన్నింటితోపాటు ఏకంగా ఓటర్ల మాస్టర్ జాబితాను టీడీపీ సేవామిత్ర యాప్కు అనుసంధానం చేసి ఓట్ల తొలగింపులు, చేర్పులు చేసేలా అనధికారికంగా పెద్ద నెట్వర్క్ను నడపడం వెనుక ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందనేది బహిరంగ రహస్యం. ఎన్నికల్లో గెలుపు కోసమే ఇదంతా.. కాగా, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టీడీపీకి చెందిన అధికారిక ‘సేవామిత్ర’ యాప్ను రూపొందించింది. ఇందుకోసం విశాఖపట్నంలోని బ్లూఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థ అందుకు అవసరమైన సమాచారం అందజేసినట్లు తెలుస్తోంది. ఈ బ్లూఫ్రాగ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందిన వారితోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వారి కలర్ ఫొటోలతో సహా భద్రపరుస్తోంది. ఈ వివరాలన్నింటినీ ఐటీ గ్రిడ్స్కు బ్లూ ఫ్రాగ్ సంస్థే అందజేసింది. టీడీపీ కోసం రూపొందించిన సేవామిత్ర యాప్నకు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, బ్యాంకు ఖాతా, తదితర వ్యక్తిగత వివరాలను అనుసంధానం చేశారు. వాస్తవానికి ఈ వివరాలను జిల్లా కలెక్టర్ల పరిధిలో రహస్యంగా ఉంచాలి. కానీ, త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుపు కోసం భారీ డేటా స్కామ్కు పాల్పడడం నిబంధనలకు విరుద్ధమని పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. డేటా చోరీ విషయం బయటపడటంతో దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు ఎదురుదాడికి దిగడాన్ని కూడా న్యాయ నిపుణులు తప్పుబడుతున్నారు. ‘సుప్రీం’ తీర్పునకు విరుద్దం.. రాజ్యాంగం ద్వారా సక్రమించిన వ్యక్తిగత సమాచార గోప్యత హక్కును పరిరక్షించాలని 2012లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పౌరుడికి తెలియకుండా ఆయన వ్యక్తిగత వివరాలును ఇతరులకు తెలియజేయకూడదని అందులో స్పష్టంగా పేర్కొంది. అందుకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని నిర్ధారణ అయ్యింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు తూట్లు పొడిచే ఇటువంటి నేరాలకు పాల్పడే ప్రభుత్వ పెద్దలైనా శిక్షార్హులే. - పాకా వెంకట సత్యనారాయణ, సీనియర్ న్యాయవాది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్కూ తూట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటుపరం చేసి పీపుల్స్ రిప్రజంటేషన్ యాక్ట్కు తూట్లు పొడిచారు. ఇలా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడం సరికాదు. ప్రభుత్వం వద్ద సురక్షితంగా ఉండాల్సిన సమాచారం ప్రైవేటు వ్యక్తుల వద్దకు చేరవేసి ప్రజలను మోసగించారు. ఇది ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ, ఐపీసీ–420, దొంగతనం నేరాల పరిధిలోకి వస్తుంది. ఇందుకు బాధ్యులైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. నైతిక బాధ్యత వహించి వారు తమ పదవులకు రాజీనామా చేయాలి. – పిళ్లా రవి, బెజవాడ బార్ అసోసియేషన్, మాజీ అధ్యక్షుడు -
జాతకాలు తవ్వుతున్నారు!
సాక్షి, హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్ కేసులో తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పీడ్ పెంచింది. ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో మార్చి 2, 9 తేదీల్లో జరిపిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న ల్యాప్ట్యాప్లు, కంప్యూటర్ల హార్డ్డిస్క్లను సోమవారం పరిశీలించింది. కంప్యూటర్లలో ఏముందన్న విషయాన్ని రాబట్టే పనిని సైబర్ నిపుణులకు అప్పగించారు. ప్రస్తుతం వారు అందులో ఉన్న, డిలీట్ చేసిన సమాచారాన్ని రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అశోక్ అరెస్టుకు వ్యూహం ఎలా? టీడీపీ సేవామిత్ర యాప్ సాయంతో 3.60 కోట్ల మంది ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న, ప్రస్తుతం పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అశోక్ అరెస్టు విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై సిట్ సోమవారం చర్చించింది. ఈ విషయంపై సిట్ బాస్, ఐజీ స్టీఫెన్ రవీంద్ర తన బృంద సభ్యులతో సోమవారం భేటీ అయ్యారు. ప్రస్తుతం అశోక్ ఏపీలో తలదాచుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ఆయన్ను అరెస్టు చేసే క్రమంలో తలెత్తే పరిణామాలపై పోలీసులు ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. డేటా చౌర్యం కేసులో ఏపీ ప్రభుత్వం కూడా రెండు వేర్వేరు సిట్ బృందాలను వేసిన నేపథ్యంలో అశోక్ ఏపీ సిట్ పోలీసుల ముందు ప్రత్యక్షమవుతాడా? అన్న విషయం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అశోక్ కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. గత అరు నెలల్లో అశోక్ ఎవరెవరితో మాట్లాడారు? అందులో ఉన్న ప్రముఖులు ఎవరు? ఫిబ్రవరి 23న పోలీసులు ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో ప్రాథమిక విచారణకు వెళ్లిన రోజు అశోక్ ఏపీలోని పలువురు ప్రముఖులకు పెద్ద మనుషులతో ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. కోర్టు ఆదేశాలతో కొత్త ఉత్సాహం తనను అన్యాయంగా డేటా చౌర్యం కేసులో ఇరికించారంటూ తెలంగాణ హైకోర్టులో ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ వేసిన పిటిషన్పై కోర్టు స్పందించింది. తెలంగాణ పోలీసులకు సమాధానం చెప్పాలని స్పష్టం చేసిన నేపథ్యంలో సిట్ బృందానికి కొత్త ఉత్సాహం వచ్చింది. అశోక్ తరఫున వాదించేందుకు దేశంలో పేరుమోసిన లాయర్లు రావడం, ఏపీ ప్రభుత్వం అతన్ని వెనకేసుకురావడం, త్వరలోనే బయటికి వస్తాడంటూ సాక్షాత్తూ ఏపీ సీఎం ప్రకటించడంతో అసలు అశోక్ చిరునామా దొరుకుతుందా? అనే సందిగ్ధంలో పడిన పోలీసులు కోర్టు ఆదేశాలతో మరింత వేగంగా పనిచేయనున్నారు. అతని కదలికలపై ఇప్పటికే సమాచారం ఉన్నప్పటికీ తెలంగాణ సిట్ సభ్యులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అతన్ని చట్టపరంగానే కోర్టు ముందు నిలబెట్టాలన్న లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మరోవైపు కోర్టు ఆదేశాల నేపథ్యంలో అశోక్ ఇప్పుడు ఏమని సమాధానం ఇస్తాడనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
హైకోర్టులో అశోక్కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కేసులో ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అశోక్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టేయాలన్న ఆయన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించి వివరణ ఇవ్వాలని అశోక్కు స్పష్టం చేసింది. ఆయన దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. అప్పటివరకు అశోక్ను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇచ్చేందుకూ హైకోర్టు నిరాకరించింది. తనపై డేటా అనలిస్ట్ తుమ్మల లోకేశ్వర్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జి. దశరథరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేశారని, వాటిని కొట్టేయాలని కోరుతూ అశోక్ గత వారం హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ సోమవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి. ప్రతాప్రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ మొత్తం వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తోందన్నారు. అశోక్కు నోటీసులు జారీ చేసినా ఇప్పటివరకు స్పందించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నోటీసులకు స్పందించకుండా ఇలా పిటిషన్లు దాఖలు చేయడం సరికాదన్నారు. పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. ఈ సమయంలో అశోక్ తరఫున హాజరైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ సిట్ దర్యాప్తే తమకు అభ్యంతరకరమన్నారు. వారికి లేని పరిధిని ఉపయోగించి ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారని ఆయన చెప్పారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతాయా లేదా? అన్నది మాత్రమే చూడాలని కోరారు. ఇది తేలితే ఈ కేసు తేలిపోతుందన్నారు. ఈ సమయంలో ఫిర్యాదుదారు దశరథరామిరెడ్డి తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ ఈ కేసులో సీనియర్ న్యాయవాది హాజరవుతున్నారని, అందువల్ల విచారణను కొద్దిసేపు వాయిదా వేయాలని కోరారు. ఈ సమయంలో లూథ్రా ఏదో చెప్పబోతుండగా న్యాయమూర్తి ఆయనను వారిస్తూ తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ముందు పిటిషనర్ను పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించాలని సూచించాలంటూ లూథ్రాకు స్పష్టం చేశారు. అప్పటివరకు పిటిషనర్ను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని లూథ్రా కోరగా న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. పిటిషనర్ ఎందుకు ఆందోళన చెందుతున్నారని, ముందు నోటీసులకు స్పందించమనండి అని పునరుద్ఘాటించారు. మిగిలిన విషయాలపై తదుపరి విచారణ సమయంలో వాదనలు వింటానని స్పష్టం చేశారు. అశోక్కు మరోసారి నోటీసులు డేటా చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్డైరెక్టర్ దాకవరపు అశోక్కు తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13న గోషామహల్లోని తమ కార్యాలయానికి ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు కేపీహెచ్బీలోని అశోక్ ఇంటికి సోమవారం వెళ్లిన తెలంగాణ పోలీసులు... అశోక్ పరారీలో ఉండటంతో అతని ఇంటికి నోటీసులు అంటించారు. ఏపీ, తెలంగాణ ప్రజల డేటాను సేవామిత్ర యాప్ సాయంతో తస్కరించారంటూ విజిల్ బ్లోయర్ లోకేశ్వర్రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, దీనిపై ఐపీసీ సెక్షన్లు 120–బీ, 379, 420, 188తోపాటు ఐటీ చట్టంలోని సెక్షన్లు 66 బీ, 72 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిట్ నోటీసులో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే ఈ నెల 2, 3 తేదీల్లో నోటీసులు పంపినా విచారణకు హాజరు కానందున మరోసారి నోటీసులు పంపుతున్నామని తెలిపింది. ప్రస్తుతం అశోక్ ఏపీ ప్రభుత్వ పెద్దల సాయంతో విజయవాడ, గుంటూరు పరిసరాల్లో తలదాచుకుంటున్నట్లు సమాచారం. -
‘చోరీ డేటా’ అంతా ఎన్క్రిప్షన్లోనే..!
సాక్షి, హైదరాబాద్: ‘సేవామిత్ర’యాప్... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వెలుగుచూసిన డేటా స్కాం మొత్తం తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ యాప్, దాన్ని తయారు చేసిన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చుట్టూనే తిరుగుతోంది. ఈ యాప్ తయారీలో ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ దాకవరపు అశోక్ అనేక జాగ్రత్తలు తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు. అందులో ప్రధానమైంది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం. తాము చేస్తున్న భారీ స్కాం భవిష్యత్తులో వెలుగులోకి వచ్చినా దర్యాప్తు సంస్థలకు ఆధారాలు లభించకుండా ఉండేందుకే అశోక్ ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. యాప్స్ ద్వారా జరిగే సమాచార మార్పిడికి సంబంధించి ఉపయోగించే పరిజ్ఞానమే ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ విధానం. వాట్సాప్ ద్వారా ఓ కాంటాక్ట్కు తొలిసారి ఎవరైనా సందేశం పంపినప్పుడు ‘ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్’అంటూ ప్రత్యేక సూచన వస్తుంది. అంటే ఓ సెండర్ పంపిన మెసేజ్ రిసీవర్కు వెళ్లే వరకు అది ఎన్క్రిప్షిన్ విధానంలో ఉంటుంది. మెసేజ్లో పదాలను టైప్ చేస్తే అది ఎన్క్రిప్ట్ అయ్యే సరికి ‘కీ’లుగా మారిపోతుంది. ఉదాహరణకు ‘టీడీపీ’అనే పదాన్ని ‘ఎండీ5 ఆన్లైన్’అనే ఎన్క్రిప్టర్ వెబ్సైట్లో టైప్ చేస్తే (5ec7c4ede4cb6 c64289a5ed105285945) అనే ‘కీ’గా మారిపోయింది. దీంతో ఇది ఎన్క్రిప్ట్ అయినట్లు లెక్క. ఈ సందేశం రీసీవ్ చేసుకునే వ్యక్తి ఫోన్లోకి వచ్చిన తర్వాత డిక్రిప్షన్ ప్రక్రియ పూర్తై మళ్లీ ‘టీడీపీ’అనే పదంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓటర్ల డేటాను దుర్వినియోగం చేయడానికి ఐటీ గ్రిడ్స్ సంస్థ ఇదే విధానాన్నే వినియోగించింది. ట్యాబ్లలో వాడిన సాఫ్ట్వేర్ అదే... తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సేవామిత్ర సర్వేయర్లకు ఐటీ గ్రిడ్స్ సంస్థ ద్వారా జారీ చేసిన ట్యాబ్స్ను ఆ సంస్థకు సంబంధించిన సర్వర్తో అనుసంధానించారు. ఈ ట్యాబ్స్లో ఉండే ‘సేవామిత్ర’యాప్లో ఎన్క్రిప్షన్తోపాటు డిక్రిప్షన్ సాఫ్ట్వేర్ సైతం అంతర్భాగంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సర్వర్ నుంచి ట్యాబ్ వరకు డేటా మార్పిడి మొత్తం ఎన్క్రిప్షన్ విధానంలోనే జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఎన్క్రిప్షన్లో ఉన్న డేటాను డిక్రిప్షన్లోకి మార్చి పదాలుగా చూపించడంలో ఆ యాప్లో ఉన్న ‘కీ’ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ ‘కీ’లలోనూ రెండు రకాలు ఉంటాయి. పబ్లిక్ ‘కీ’తో కూడిన ఎన్క్రిప్టెడ్ సందేశాన్ని సర్వర్ నుంచి తీసినా సాధారణ పదాలుగా మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఐటీ గ్రిడ్స్ సంస్థ ఈ డేటాను ప్రైవేట్ ‘కీ’తో ఎన్క్రిప్ట్ చేసింది. దీంతో ఎవరైనా సర్వర్ను స్వాధీనం చేసుకున్నా... అమెజాన్ వంటి సంస్థల నుంచి డేటా పొందినా డిక్రిప్ట్ చేయడం సాధ్యం కాదు. ఈ ‘క్రిప్షన్స్’డేటాను రాసే ‘అల్గోరిథమ్’ను బట్టి మారిపోతుంది. ఓ సంస్థ రూపొందించిన ‘అల్గోరిథమ్’మరొకరి దానితో ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోలదు. తమ వ్యవహారం గుట్టురట్టైనా ఆధారాలు చిక్కకూడదనే ఐటీ గ్రిడ్స్ ఈ జాగ్రత్త తీసుకున్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. తమ డేటాను ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తో ఉండేలా చేస్తే భవిష్యత్తులో ఈ భారీ స్కాం వెలుగులోకి వచ్చినా దర్యాప్తు సంస్థలు ఐటీ గ్రిడ్స్తోపాటు అమెజాన్ నుంచి సమాచారం తీసుకున్నా అది ఆధారంగా పనికి రాకూడదనే ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ రూపంలో ఉన్న డేటాతో కేవలం ‘కీ’తెలుసుకోవడం తప్ప అందులోని పదాలను గుర్తించలేదు. డేటాకు సంబంధించిన ప్రైవేట్ ‘కీ’అందుబాటులో ఉంటే తప్ప ఆ ‘కీ’లను పదాలుగా మార్చి అందులోని అంశాలను తెలుసుకోలేరు. ఈ విషయం గుర్తించిన తెలంగాణ సిట్ అధికారులు... సైబర్ నిపుణుల సాయంతో దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. ప్రాథమికంగా డేటా మొత్తం క్రోడీకరిస్తే ఆపై డిక్రిప్ట్ చేయవచ్చని యోచిస్తున్నారు. -
డేటా చోరీ కేసు.. కీలక ఆధారాలు సేకరించిన అధికారులు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో తెలంగాణ సిట్ కీలక ఆధారాలు సేకరించింది. పరారీలో ఉన్న అశోక్ కదలికలను పసిగట్టినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. డేటా చోరీ వెలుగు చూసిన కొన్ని గంటల్లోనే అశోక్ విజయవాడవైపు వెళ్లినట్లు తమ దృష్టికి వచ్చిందని సిట్ అధికారులు తెలిపారు. ఆ తర్వాత కొద్ది సేపటికే అశోక్ సెల్ఫోన్ టవర్ గుంటూరు లోకేషన్ని చూపించినట్లు అధికారులు పేర్కొన్నారు. అశోక్ విజయవాడ నుంచి గుంటూరు వెళ్లేలోగా పలువురు రాజకీయనాయకులతో, ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు గుర్తించామన్నారు. అంతేకాక అశోక్ గత ఆరు నెలలుగా ఇదే నంబర్తో విస్తృతంగా మాట్లాడినట్లు దర్యాప్తులో తెలిందన్నారు. ఈ సంభాషణలను బట్టి ప్రముఖులేవరికైనా ఈ కేసుతో సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా డేటా చోరీ కేసులో హై కోర్టు అశోక్కు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13న విచారణకు హాజరు కావాలంటూ కోర్టు అశోక్ను ఆదేశించింది. -
ఐటీగ్రిడ్స్ కేసు.. అశోక్కు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : డేటా చోరి వ్యవహారంలో తప్పించుకు తిరుగుతున్న ఐట్రి గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్కు హైదరాబాద్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై తెలంగాణ పోలీసులు అక్రమ కేసులను పెట్టారని, వాటిని కొట్టేయాలని అశోక్ హైదరాబాద్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ను సోమవారం విచారించిన హైకోర్టు.. పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ షాక్ ఇచ్చింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఇక అశోక్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లోత్ర వాదనలు వాదనలు వినిపించారు. కేసు తెలంగాణ పరిధిలోకి రాదని, ఏపీకి బదిలీ చేయాలని కోరారు. అయితే సిద్దార్థ్ వాదనతో హైకోర్టు ధర్మాసనం ఏకీ భవించలేదు. మరోవైపు అశోక్కు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వాలని పోలీసులు కోరారు. ప్రస్తుతం ఆ నోటీసులకు సమాధానం ఇవ్వలేమని అశోక్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో వెంటనే అశోక్ను పోలీసుల నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న అశోక్ ఏపీ సిట్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అశోక్ 2, 3 రోజుల్లో బయటకు వస్తాడంటూ సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడమే ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఈ విషయంలో తెలుగుదేశం నాయకులు అచ్చం ఓటుకు కోట్లు కేసునే ఫాలో అవుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన మత్తయ్య ఏపీకి పరారవడం, తరువాత విజయవాడకు వెళ్లి ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పైనే ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అప్పుడు మత్తయ్యను ఏపీ పోలీసులు వెనకేసుకురాగా ఇప్పుడు కూడా సరిగ్గా అలాగే జరుగుతోంది. ప్రస్తుతానికి ఏపీ పోలీసుల సంరక్షణలోనే అశోక్ ఉన్నట్లు సమాచారం. అశోక్ కూడా అచ్చం మత్తయ్య తరహాలోనే ఈ కేసులో తన పేరును అన్యాయంగా ఇరికించారంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. -
పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్ సీఈవో అశోక్
-
ఏపీ సిట్ ముందుకు అశోక్!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కేసులో పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అశోక్ ఏపీ సిట్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అశోక్ 2, 3 రోజుల్లో బయటకు వస్తాడంటూ సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడమే ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఈ విషయంలో తెలుగుదేశం నాయకులు అచ్చం ఓటుకు కోట్లు కేసునే ఫాలో అవుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన మత్తయ్య ఏపీకి పరారవడం, తరువాత విజయవాడకు వెళ్లి ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పైనే ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అప్పుడు మత్తయ్యను ఏపీ పోలీసులు వెనకేసుకురాగా ఇప్పుడు కూడా సరిగ్గా అలాగే జరుగుతోంది. ప్రస్తుతానికి ఏపీ పోలీసుల సంరక్షణలోనే అశోక్ ఉన్నట్లు సమాచారం. అశోక్ కూడా అచ్చం మత్తయ్య తరహాలోనే ఈ కేసులో తన పేరును అన్యాయంగా ఇరికించారంటూ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అందుకే అశోక్ బయటకు రాగానే తన డేటాను తెలంగాణ పోలీసులు తస్కరించారంటూ ఏపీ ప్రభుత్వం వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు ఫిర్యాదు చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. సిట్కు కీలక ఆధారాలు లభ్యం... డేటా చోరీ కేసులో తెలంగాణ సిట్ కీలక ఆధారాలు సేకరించింది. పరారీలో ఉన్న అశోక్ కదలికలను పసిగట్టింది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం.. డేటా చౌర్యం వెలుగుచూసిన కొన్ని గంటల్లోనే అశోక్ విజయవాడ వైపు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి గుంటూరు సెల్ టవర్ లొకేషన్ చూపించినట్లు సమాచారం. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లేలోగా కీలక అధికారులకు, రాజకీయ ప్రముఖలకు ఈ నంబర్ నుంచి కాల్స్ వెళ్లినట్టు తెలిసింది. ఇదే నంబర్లతో గత ఆరు నెలలుగా విస్తృతంగా అశోక్ మాట్లాడినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో అశోక్ పలువురు ప్రముఖులతో జరిపిన ఫోన్ సంభాషణలను బట్టి ఈ కేసుకు, వాళ్లకు ఏమైనా సంబంధాలున్నాయా? అనే కోణంలోనూ ముందుకెళ్లాలనే యోచనలో ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
మంత్రి, ఐఏఎస్లతో అశోక్ సంభాషణ!
సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో తెలంగాణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) కీలక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దాకవరం అశోక్ కదలికలను సిట్ పసిగట్టింది. ఆర్నెలలుగా అశోక్ కీలక వ్యక్తులతో తరచూ సంభాషించడం.. పరారీ తర్వాత ఆయన సెల్ఫోన్ సిగ్నళ్లు పలు ప్రాంతాలను సూచించడం ఈ కేసులో కీలక మలుపుగా అధికారులు భావిస్తున్నారు. ఈ సిగ్నళ్ల ఆధారంగా అతన్ని దేశం దాటించే ప్రయత్నాలు జరిగాయా అనే కోణంలోనూ దర్యాప్తు అధికారులు కూపీ లాగుతున్నారు. ఇక నిందితుడు మంతనాలు జరిపిన ఫోన్ నెంబర్లలో ప్రముఖులవి కూడా ఉండడంతో సిట్ ఆచితూచి అడుగులేస్తోంది. ఇదే క్రమంలో అశోక్ మరో రెండు మూడు రోజుల్లో బయటకు వస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే స్వయంగా ప్రకటించడంతో తెలంగాణ సిట్ను మరెన్నో సందేహాలు చుట్టుముట్టాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ.. గుంటూరుకు? డేటా చౌర్యం వెలుగుచూసిన తర్వాత అశోక్ ఉన్నట్టుండి హైదరాబాద్ నుంచి మాయమయ్యాడు. అందరికీ తెలిసిన అశోక్ నెంబరు తొలుత రెండు మూడు రోజుల వరకూ హైదరాబాద్ పరిసరాల సెల్ టవర్ల పరిధిలోనే ఉన్నట్టు గమనించారు. కానీ, అశోక్ ఆచూకీ మాత్రం పోలీసులకు లభించలేదు. సెల్ఫోన్ ద్వారా కదలికలను గుర్తిస్తారనే అశోక్ తన ఫోన్ను హైదరాబాద్లోనే వదిలేసి వెళ్లిపోయి ఉండవచ్చునని పోలీసులు ఓ నిర్థారణకు వచ్చారు. అనంతరం అతను మరో ఫోన్ వాడుతున్నట్టు ఇతర మార్గాల ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ రహస్య ఫోన్ నెంబర్ ద్వారా అశోక్ కదలికలను అధికారులు గుర్తించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం.. డేటా చౌర్యం వెలుగుచూసిన కొన్ని గంటల్లోనే అశోక్ విజయవాడ వైపు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి గుంటూరు సెల్ టవర్ లొకేషన్ చూపించినట్లు సమాచారం. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లేలోగా కీలక అధికారులకు, రాజకీయ ప్రముఖులకు ఈ నెంబర్ నుంచి కాల్స్ వెళ్లినట్టు తెలిసింది. ఇదే నెంబర్లతో గత ఆరు నెలలుగా విస్తృతంగా అశోక్ మాట్లాడినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో అశోక్ పలువురు ప్రముఖులతో జరిపిన ఫోన్ సంభాషణలను బట్టి ఈ కేసుకు వాళ్లకు ఏమైనా సంబంధాలున్నాయా? అనే కోణంలోనూ ముందుకెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. గుంటూరు, మంగళగిరిలో మకాం? అశోక్ వాడుతున్న సెల్ఫోన్.. డేటా చౌర్యానికి ముందు మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. ఏపీకి చెందిన ఓ మంత్రి ఫోన్ నెంబర్ కూడా మాదాపూర్ టవర్ లొకేషన్లో ఉండటం, ఆయనతో తరచూ మాట్లాడుతుండటం ఈ ఎపిసోడ్లో అనేక అనుమానాలకు తావిస్తోంది. మంత్రితో మాట్లాడిన తర్వాత అశోక్ ఫోన్ నెంబర్ నుంచి కొంతమంది ఐఏఎస్ అధికారులకూ ఫోన్లు వెళ్లినట్టు తెలిసింది. అశోక్తో అసలా అధికారులకు సంబంధమేంటి? మంత్రితో మాట్లాడిన వెంటనే అశోక్ అధికారులతో ఏం మాట్లాడాడు? అనే అనుమానాలు పోలీసులు వ్యక్తంచేస్తున్నారు. అలాగే, డేటా చౌర్యం తర్వాత అశోక్ వాడినట్లుగా భావిస్తున్న రహస్య నెంబర్గల ఫోన్ మరికొన్ని సందేహాలను కలిగిస్తోంది. హైదరాబాద్ నుంచి పారిపోయిన తర్వాత ఫోన్ సిగ్నల్స్ మంగళగిరి, గుంటూరు టవర్ లొకేషన్స్ను సూచిస్తున్నాయి. తరచూ ఇవే సిగ్నల్స్ను గుర్తించిన పోలీసులు అశోక్ డేటా చౌర్యం కేసు తెరమీదకొచ్చాక గుంటూరు, మంగళగిరిలో మకాం వేశాడా? హైదరాబాద్లో ఉన్నప్పుడు అశోక్తో ఫోన్ సంప్రదింపులు జరిపిన అధికారుల ఫోన్లు కూడా ఇదే టవర్ లొకేషన్లను చూపిస్తున్నట్టు తెలిసింది. దేశం దాటించే ప్రయత్నాలు జరిగాయా? ఇదిలా ఉంటే.. కొద్దిరోజుల క్రితం అశోక్ గన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్లినట్టు ఆయన సెల్ఫోన్ సిగ్నల్స్ ద్వారా తెలుస్తోంది. అతను ఓ గంటపాటు అక్కడే ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత అతను మళ్లీ విజయవాడ మీదుగా మంగళగిరి, గుంటూరు చేరుకున్నట్లు సమాచారం. వాస్తవానికి అశోక్ను దేశం దాటించి ఉంటారని పోలీసులు ముందుగా అనుమానించారు. అతను వాడిన ఫోన్ను ఇక్కడే ఎవరికో ఇచ్చి ఉంటారని, ఆ వ్యక్తి అక్కడి నుంచి గుంటూరు వెళ్లినట్టు అనుమానించారు. అయితే, శాస్త్రీయ కోణంలో విచారణ జరుగుతున్న సమయంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రెస్మీట్లో అశోక్ మరో రెండు రోజుల్లో బయటకొస్తారని చెప్పడంతో కథ మరో మలుపు తిరిగింది. ఎయిర్పోర్టుకొచ్చిన అశోక్ తిరిగి గుంటూరు వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. దేశం దాటించేందుకే ఎయిర్పోర్టుకు వచ్చినప్పటికీ, దీనివల్ల ఎక్కడో ఒకచోట అతను దొరికిపోతాడని భావించి చివరి నిమిషంలో ఆ ప్రయత్నం మానుకున్నారేమోనని పోలీసులు సందేహిస్తున్నారు. -
ఏపీ డేటా చోరీ చేస్తే మీకెంటి నష్టం?
-
బాబు సెల్ఫ్గోల్
సాక్షి, అమరావతి: తెలంగాణ ప్రభుత్వంతో రాజీపడి అధికారికంగా కొన్నింటిని, అనధికారికంగా మరికొన్ని సంస్థలను వదిలేశానని, పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కుగా ఉన్న హైదరాబాద్ను వదిలి అమరావతికి వెళ్లిపోయానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలోని 3.6 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారంతో కూడిన డేటా చోరీ వ్యవహారంలో సాక్ష్యాధారాలు బయటపె డతానంటూ శనివారం మీడియా సమావేశం నిర్వహించి సెల్ఫ్గోల్ వేసుకున్నారు. ప్రజల ఆధార్ సంఖ్యలు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారం చోరీ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన దాకవరపు అశోక్ తమ వద్దే ఉన్నాడని ముఖ్యమంత్రి పరోక్షంగా అంగీకరించడం రాష్ట్ర ప్రజలను నివ్వెరపరిచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదు పత్రాన్నే చదువుతూ అదే సాక్ష్యమన్నట్లుగా చూపించడం చూసి జనం ఆశ్చర్యపోయారు. ఈ వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్, బీజేపీల కుట్ర ఉందని, కేసీఆర్ ఆంధ్రులను అవమానించారంటూ చంద్రబాబు కొత్తగా సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడంపైనా జనం ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రతిపక్షంపై బురదజల్లబోయి తానే ఇరుక్కుపోయారని విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదు పత్రం పట్టుకొని హల్చల్ డేటా చౌర్యం కేసులో సాక్ష్యాధారాలు అంటూ శనివారం ఉదయం నుంచి లీకులు ఇచ్చి ‘పచ్చ’మీడియాలో ఊదరగొట్టారు. విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదుపత్రాన్ని మీడియా సమావేశంలో చూపించి, అదే ఆధారమని చెప్పడం హాస్యాస్పదంగా మారింది. రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ జరిగిన వ్యవహారంపై జిల్లాల్లో, రాష్ట్ర ఎన్నికల సంఘానికి, అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి, ఆధార్సంస్థకు ఇలా పలు విభాగాలకు విజయసాయిరెడ్డి ఫిర్యాదులు ఇచ్చారు. ఆ ఫిర్యాదులోనే డేటా చౌర్యం ఎలా జరిగి ఉంటుంది? దాని వెనుక ఎవరు ఉన్నారు? ఏయే సంస్థలున్నాయి? తదితర అంశాలపై తమకున్న అనుమానాలను, సమాచారాన్ని కూడా వివరిస్తూ దానిపై కూలంకషమైన విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు వీటిని పట్టుకొని ఒక్కొక్కటిగా చదువుతూ తాను శోధించి సాధించిన సాక్ష్యాలని చెప్పి నవ్వుల పాలయ్యారు. పరస్పర విరుద్ధ ప్రకటనలు ఆధార్ సంఖ్యలు, బ్యాంకు ఖాతాలు, ఫోన్ నెంబర్లు, ఓటరు జాబితా వివరాలు ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఎలా చేరాయన్న ప్రజల సందేహాలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేదు. ప్రభుత్వం సాధికార మిత్రల ద్వారా ప్రజా సాధికార సర్వేలో సేకరించిన సమాచారం ఐటీ గ్రిడ్స్కు, అక్కడి నుంచి సేవామిత్ర యాప్లోకి ఎలా చేరింది? అన్న దానిపైనా బాబు నోరు విప్పలేదు. పైగా మీడియా సమావేశంలో పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశారు. ఫిబ్రవరి 19న దశరథ రామిరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే కేసు రికార్డు చేశారని ఒకవైపు చెబుతూనే మరోవైపు కేసు లేకుండానే 23వ తేదీన ఐటీ గ్రిడ్స్ సంస్థలో ఎలా సోదాలు చేస్తారని ప్రశ్నించడం గమనార్హం. ఐటీ గ్రిడ్స్ సంస్థ తమదేనని ప్రకటించిన చంద్రబాబు తరువాత అది తమ పార్టీ వ్యవహారాలు చూసే ఔట్సోర్సింగ్ సంస్థ అంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ డేటా చోరి అయిందని ఒకసారి, తమ పార్టీ డేటా పోయిందని మరోసారి చెప్పారు. ప్రభుత్వ డేటా పోయిందని, దానిపై ఫిర్యాదు వస్తే ఏపీకి చెప్పాలే తప్ప ఆ సంస్థపై మీరెలా దాడులు చేస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని బాబు ప్రశ్నించడం విశేషం. అన్నింటి కంటే వింత ఏమిటంటే ప్రభుత్వ డేటా పోయిందని చెబుతూనే ఆ డేటా చోరీకి కారణమైన దాకవరపు అశోక్ను వెనుకేసుకురావడం. అతడు ఇప్పుడు ఎక్కడున్నాడని విలేకరులు ప్రశ్నించగా.. ఒకటి రెండు రోజుల్లోనే బయటకు వస్తాడని చంద్రబాబు బదులివ్వడం కొసమెరుపు. 3.5 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ చేసిన కేసులో ప్రధాన నిందితుడు, తెలంగాణ పోలీసులు నోటీసులు జారీచేసిన అశోక్ తమ ప్రభుత్వ రక్షణలోనే ఉన్నాడని సాక్షాత్తూ ఒక ముఖ్యమంత్రి పరోక్షంగా చెప్పడం రాష్ట్ర ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజల దృష్టిని మళ్లించేందుకే తంటాలు తెలంగాణ ప్రభుత్వంతో రాజీపడి అధికారికంగా కొన్నింటిని, అనధికారికంగా మరికొన్ని సంస్థలను వదిలేశానని చంద్రబాబు స్పష్టం చేశారు. పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కుగా ఉన్న హైదరాబాద్ను వదిలి అమరావతికి వెళ్లిపోయానని అన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్పై పదేళ్ల పాటు హక్కు ఉన్నా అర్ధాంతరంగా తమను కట్టుబట్టలతో అమరావతికి తరలించి నానా కష్టాలకు గురిచేసిన బాబు వైఖరిపై ప్రభుత్వ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి తమ భవిష్యత్తును చంద్రబాబు తాకట్టు పెట్టారని, తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డేటా చోరీ వ్యవహారంలో కీలకమైన అంశాలకు సమాధానం చెప్పలేక చంద్రబాబు నీళ్లు నమిలారు. డేటా చౌర్యం నేపథ్యంలో ప్రభుత్వంపై, తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు సెంటిమెంట్ను రాజేయడానికి ప్రయత్నించారన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది. ఇది ఏపీ, తెలంగాణ మధ్య సమస్యగా చిత్రీకరించేందుకు బాబు తంటాలు పడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. అయినా బాబు మాటలను ప్రజలు విశ్వసించబోరని పేర్కొంటున్నారు. 14 ఏళ్ల ఉద్యమ కాలంలో కేసీఆర్ అడపాదడపా చేసిన వ్యాఖ్యలను ప్రజలకు గుర్తుచేసే ప్రయత్నం బాబు చేసినా అది పనిచేయదు. ఎందుకంటే గతంలో పలు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కేసీఆర్తో కలిసి పనిచేశారు. టీఆర్ఎస్తో పొత్తు కోసం ఆరాటపడింది బాబు కాదా? 2009 ఎన్నికల సమయంలో చంద్రబాబు కేసీఆర్ను కలుపుకొని మహాకూటమిని ఏర్పాటు చేసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవిభజన తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణలో నిర్వహించిన యాగానికి చంద్రబాబు స్వయంగా హారయ్యారు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ను ఆహ్వానించారు. పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలు చేశారు. ప్రత్యేకంగా విందు భోజనం వడ్డించారు. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు కోసం బాబు పాకులాడారు. తన బావమరిది హరికృష్ణ శవం పక్కనే పెట్టుకొని కేసీఆర్ తనయుడు కేటీఆర్తో పొత్తు మంతనాలు జరిపారు. కేటీఆర్ ఈ విషయం స్వయంగా ప్రకటించగా చంద్రబాబు కూడా అదే నిజమేనని అంగీకరించారు. ఈ ఎన్నిల కోసం కేసీఆర్ రూ.వెయ్యి కోట్లు ఇచ్చారని, వైఎస్ జగన్కు మద్దతు పలుకుతున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలు కూడా నిస్పృహలో చేస్తున్నవేనని ప్రజలు కొట్టిపారేస్తున్నారు. కేసీఆర్ను ఏనాడూ కలవని జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ మధ్య ఎప్పుడూ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి భేటీలు, చర్చలు జరగలేదని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. గతంలో కేసీఆర్ విజయం సాధించినప్పుడు అభినందలు తెలపడమే తప్ప జగన్మోహన్రెడ్డి ఆయనతో ఇప్పటివరకు మాట్లాడింది లేదు. దేశవ్యాప్తంగా బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే ఇటీవల కేసీఆర్ తనయుడు కేటీఆర్ వైఎస్ జగన్ను కలిశారు. ప్రత్యామ్నాయ ఫ్రంట్పైనే చర్చించామని వారిద్దరూ ఆరోజే స్పష్టం చేశారు. చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ సీఎం చంద్రబాబులోని అసహనం మీడియా సమావేశంలో స్పష్టంగా బయటపడింది. రాష్ట్ర ప్రజల వ్యక్తిగత డేటా చోరీకి గురైతే దానిపై స్పందించకుండా, ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు చేస్తూ డ్రామాను రక్తికట్టించేందుకు ప్రయాస పడ్డారు. అసలు ఈ వ్యవహారంలో ఐటీ శాఖది కీలకపాత్ర. సంబంధిత శాఖ మంత్రి నారా లోకేశ్ ఎందుకు బయటకు రావడం లేదన్న ప్రశ్నకు బాబు వద్ద సమాధానం లేదు. దాకవరపు అశోక్ను దాచిపెట్టనట్లుగానే లోకేశ్ కూడా బయటకు రాకుండా చంద్రబాబు జాగ్రత్తపడుతున్నట్లుగా ఉందని ప్రజలు అనుమానిస్తున్నారు. వీరిద్దరూ బయటకు వస్తే తమ బండారం మొత్తం బట్టబయలవుతుందన్న భయంతోనే ఇలా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రజల డేటా చోరీ గురించి చెప్పకుండా రేపు ఉదయం మీ పిల్లలు కిడ్నాప్ అవుతారు, మీ ఆస్తులను ఎత్తుకుపోతారంటూ సంబంధం లేని అంశాలు ఏవేవో మాట్లాడారు. అదేసమయంలో అధికారంలో ఉన్న తానేనన్న సంగతి మర్చిపోయారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం ఏమిటని జనం విస్తుపోతున్నారు. -
మరికొన్ని ‘ఐటీ గ్రిడ్స్’ హార్డ్డిస్క్లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారంతోపాటు తెలంగాణ ప్రజల డేటాను కూడా చోరీ చేసిన టీడీపీ యాప్ (సేవామిత్ర) తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్పై నమోదైన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగం పెంచింది. హైదరాబాద్ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో శనివారం కూడా సిట్ బాస్, ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో మరోసారి సోదాలు నిర్వహించారు. సిట్ అధికారులు శ్వేతారెడ్డి, రోహిణీరెడ్డిల సమక్షంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో సాంకేతిక ఆధారాల సేకరణ కోసం క్లూస్ టీంను కూడా రంగంలోకి దించారు. ఈ సందర్భంగా మరికొన్ని హార్డ్డిస్క్లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందన్నారు. సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసమే ఐటీ గ్రిడ్స్ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. పరారీలో ఉన్న సంస్థ డైరెక్టర్ అశోక్ గూగుల్, అమెజాన్లో దాచిన క్లౌడ్ డేటాను సేకరించేందుకు ఆ రెండు కంపెనీలకు లేఖ రాశామని, వాటి నుంచి ఇంకా సమాధానం రావాల్సి ఉందన్నారు. ఈ కేసులో ఆ కంపెనీల స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. శనివారం ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న హార్డ్డిస్క్లను కోర్టులో ప్రవేశపెట్టి తరువాత ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతామన్నారు. అశోక్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పైనా రవీంద్ర స్పందిస్తూ ఈ అంశంపై తాము కూడా కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఎస్సార్ నగర్లో నమోదైన కేసుకు సంబంధించిన వివరాలు ఇంకా అందాల్సి ఉందని, అవి రాగానే దానిపైనా దర్యాప్తు మొదలుపెడతామన్నారు. -
‘ఐటీ గ్రిడ్స్’ చంద్రబాబుదే
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు 3.5 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిం చారని తెలంగాణ పశుసంవర్థకశాఖ మంత్రి తల సాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ప్రజల సమాచారాన్ని దొంగిలించిన చంద్రబాబు ఇప్పుడు దొరికి పోతాననే అసహనంతో ఉన్నారన్నారు. ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చంద్రబాబుదేనని ఆయన మాటల్లోనే బయటపడిందని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్లో తలసాని విలేకరు లతో మాట్లాడుతూ బాబు ఆరోపిస్తున్నట్లుగా హైదరాబాద్లోని ఏ ఒక్క ఐటీ కంపెనీవాళ్లు భయపడటం లేదని చెప్పారు. ‘డేటా దొంగిలించి తప్పు చేసింది చంద్రబాబు. ఐటీ గ్రిడ్స్ సంస్థ ఇన్ని రోజులూ ప్రైవేటు కంపెనీ అన్నారు. ఇప్పుడు తనదేనని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు అద్భుతమైన డాక్యుమెంట్లు ఇచ్చారు. వైఎస్సార్సీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన తర్వాతే మీడియాకి ఇచ్చింది. దొరికిపోతామని ఫ్రస్టేషన్లో చంద్రబాబు ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న ఏ ఐటీ కంపెనీ భయపడటం లేదు. టీడీపీ నేతల ఆస్తులు అన్నీ ఇక్కడే(తెలంగాణలో) ఉన్నాయి. మేము ఎప్పుడైనా ఇబ్బంది పెట్టామా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కేసీఆర్ డబ్బులు పంపారని అనడానికి చంద్రబాబుకు సిగ్గుండాలి. ఎన్నికల్లో డబ్బులు పంచె అలవాటు చంద్రబాబుతోనే వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి తరపున చంద్రబాబు రూ.500 కోట్లు ఖర్చు చేశారు. టీడీపీ నేతలు ఎన్నికలలో డబ్బులు పంచితే వారిని చెప్పుతో కొట్టాలని ఏపీ ప్రజలను కోరుతున్నా. ఏపీలో జీరో శాతం అవినీతి ఉంటే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా. ఏ ప్రాజెక్టులో అయినా లోకేష్ 10 శాతం వాటా తీసుకుంటారు. చంద్రబాబు ఆరు కంటెనయిర్స్తో ఇటలీ టెక్నాలజీతో హైదరాబాద్లో ఇల్లు కట్టారు. చంద్రబాబు తల్లిదండ్రులు దర్గాలో ఐదు ఎకరాలు, పంజాగుట్టలో పెద్ద బిల్డింగ్ కొన్నారా? ఆ ఆస్తులు మనవడికి గిఫ్ట్ ఇచ్చారా? గవర్నమెంట్లో దోచిన సొమ్మును హెరిటేజ్లో పెడుతున్నారు. విజయ డెయిరీకి రాని లాభాలు హెరిటేజ్కి ఎలా వస్తాయి. నల్ల చొక్కాలు వేసుకొని చంద్రబాబు అసెంబ్లీలో దొంగ డ్రామా ఆడారు. ఐదేళ్లుగా పసుపు కుంకుమ, రైతు నేస్తం ఎందుకు ఇవ్వలేదు. ఎన్నికల్లో కేసీఆర్కు చంద్రబాబు ఏమాత్రం పోటీ కాదు’అని తలసాని పేర్కొన్నారు. -
ఐటీగ్రిడ్స్ కార్యాలయంలో ముగిసిన సోదాలు
హైదరాబాద్: మాదాపూర్లోని ఐటీగ్రిడ్ కార్యాలయంలో తెలంగాణ సిట్ అధికారులు చేపట్టిన సోదాలు ముగిశాయి. సుమారు 10 గంటల పాటు సిట్ బృందం ఆధ్వర్యంలో సోదాలు కొనసాగాయి. ఈ బృందంలో సిట్ అధికారులతో పాటు క్లూస్టీం, టెక్నికల్ అనలిస్టులు, సైబర్ నిపుణులు కూడా పాల్గొన్నారరు. వీరందరి సమక్షలో డేటా విశ్లేషణ కొనసాగింది. సీజ్ చేసిన కంప్యూటర్లు, సర్వర్లు, హార్డ్ డిస్క్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బాక్సులను గోషామహల్లోని సిట్ కార్యాలయానికి పోలీసులు తరలించారు. రేపటి నుంచి గోషామహల్ స్టేడియంలో సిట్ విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. -
చంద్రబాబు, లోకేష్ జైలుకు పోవడం ఖాయం : పెద్దిరెడ్డి
-
40 ఏళ్ల ఇండస్ట్రీ ఇదేనా బాబూ?
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్నికలకు తెలంగాణ సీఎం కేసీఆర్ డబ్బులు పంపుతారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం సిగ్గుచేటని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఎన్నికలల్లో డబ్బులు పంచడం దేశంలో తొలుత ప్రారంభించింది చంద్రబాబేనని ఆయన అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రూ.500 కోట్లకు పైగా చంద్రబాబు నాయుడు డబ్బులు ఖర్చుచేశారని, ఈ విషాయాన్ని కాంగ్రెస్ అభ్యర్థులే తెలిపారని తలసాని అన్నారు. కేవలం పేపర్ల ప్రకటనల కొరకే వందల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికిన 420 దొంగ చంద్రబాబు అని అన్నారు. ఏపీలో జరగబోయే ఎన్నికలు కేసీఆర్కు, చంద్రబాబుకు మధ్య జరుతాయని ఆయన అనటం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలకు తలసాని స్పందించారు. ఆయన స్వార్థ రాజకీయం కోసం అమాయక ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఏపీ డేటాచోరీ కేసులో చంద్రబాబు, ఆయన కుమారుడు ట్విటర్ పిట్ట లోకేష్ బాబు రోజుకో మాటమాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ డేటాను చోరీచేశారని ఒకసారి, పార్టీ డేటాచోరీ చేశామరి మరోసారి అంటున్నారని గుర్తుచేశారు. రోజూ నీతిమాలిన మాటలు మాట్లాడుతూ.. సత్యహరిచంద్రుడిలా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. కన్న తల్లినే మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది అని తలసాని అన్నారు. ఆయనే దొంగతనం చేసి పక్కవాళ్లను దొంగాదొంగా అన్నట్లు చంద్రబాబు తీరుందని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ ఇదేనా బాబూ అని ప్రశ్నించారు. నాలుగేళ్లు ఉన్న ఆయన మనవడి పేరు మీద వేల కోట్ల రూపాయలు చూపించిన చరిత్ర ఆయనకు ఒక్కడికే దక్కుతుందని చెప్పుకొచ్చారు. ప్రతీ మహానాడులో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలిన చంద్రబాబు డిమాండ్ చేస్తారని, కేంద్రంలో చక్రం తిప్పినా అని చెప్పుకున్న చంద్రబాబు అప్పుడు ఇవ్వకుండా ఏం చేశారని ప్రశ్నించారు. -
రెండు, మూడు రోజుల్లో అశోక్ బయటకు...
సాక్షి, హైదరాబాద్ : డేటా చోరీ కేసులో నిందితుడుగా ఉన్న ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ దాకవరం తమ దగ్గరే ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరోక్షంగా అంగీకరించారు. శనివారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో అశోక్ ఎక్కుడున్నాడన్న మీడియా ప్రశ్నకు స్పష్టత ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో అశోక్ బయటకు వస్తాడని చంద్రబాబు తెలిపారు. నేరం చేయని వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఎంత అవమానమని, వారిని ఎంతో మానసిక క్షోభకు గురి చేస్తుందని అన్నారు. దీంతో ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో ఏపీ ప్రభుత్వ రక్షణలోనే ఉన్నాడన్న విషయాన్ని చంద్రబాబు నిర్థారించినట్లు అయింది. మరోవైపు మీడియా సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలతో టీడీపీ నేతలు తలలు పట్టుకున్నారు. డేటా చోరీ కేసులో నిందితుడుగా ఉన్న అశోక్పై ముఖ్యమంత్రి బహిరంగంగా మాట్లాడటంతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాగా అశోక్ తమ దగ్గరే ఉన్నట్లు టీడీపీ నాలెడ్జ్ సెంటర్ ఇంఛార్జ్ మల్యాద్రి పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అశోక్కు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 161 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. అయితే అశోక్ తమ దగ్గరే ఉన్నారని ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మల్యాద్రి వెల్లడించారు. అశోక్తో తాము రెగ్యులర్గా మాట్లాడుతున్నామని... అంతేకాకుండా తెలంగాణ పోలీసులకు అశోక్ను అప్పగించబోమని అన్నారు. మరోవైపు తనపై మాదాపూర్, సంజీవరెడ్డి నగర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని అశోక్ శుక్రవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మాదాపూర్ పోలీసులు నమోదు చేసిన కేసును ఏపీకి బదలాయిస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆ మేరకు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు సోమవారం విచారణ జరిపే అవకాశం ఉంది. -
‘కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు’
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్మీట్పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు మాటల్లో సెల్ఫ్గోల్ తప్ప మరేమీ లేదని, కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. శనివారం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ సమాధానమిచ్చారు. ఐటీగ్రిడ్స్ స్కాంలో టీడీపీ ప్రభుత్వ హస్తం లేకపోతే ఎందుకు భయపడుతున్నారని బుగ్గన ప్రశ్నించారు. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నా ఓటుకు కోట్ల కేసు నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు అమరావతి పారిపోయాడని అన్నారు. ఏపీలో కనీస సౌకర్యాలు కల్పించకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ ప్రజల సమస్యలు చంద్రబాబుకు పట్టలేదని విమర్శించారు. సిట్ ఏర్పాటులో సర్కారు ఫీట్లు డేటా స్కాంలోనూ బాబు యూటర్న్! వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. ‘‘ ఏపీలో కిడ్నాపులు, ఆస్తులు దొంగతనాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అంటే ఆయన పాలనలో శాంతిభద్రతలు లోపించాయని ఒప్పుకుంటున్నారు. టీడీపీ గజదొంగల పార్టీ. ప్రజల ఓటర్ ఐడీలు, ఆధార్ వివరాలు బయటకు ఎలా వచ్చాయంటే ప్రభుత్వం దగ్గర సమధానంలేదు. 50 లక్షల మంది డేటా ఉందా? లేక 3 కోట్ల 50 లక్షల మంది డేటా ఉందా?. సేవామిత్ర యాప్లో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని ఎందుకు తొలగించారు. ప్రభుత్వం పథకాలు అందిన ప్రజల వివరాలు టీడీపీ యాప్లోకి ఎలా వచ్చాయి. దొంగతనం వేరేవాళ్లు చేసి ఉంటే ఐటీగ్రిడ్స్ సీఈవో అశోక్ ఎందుకు పారిపోయాడు. ఓట్ల తొలగింపుపై విజయసాయిరెడ్డి సీఈసీకి ఫిర్యాదు చేయడం తప్ప?. చంద్రబాబు మాటల్లోనే ఐటీగ్రిడ్స్ సంస్థ మోసం చేసినట్టు కనబడుతోంది. ప్రజా సాధికారిక సర్వే వివరాలు ప్రైవేటు సంస్థకు ఎలా వచ్చాయి. వేమూరి హరికృష్ణ మీ సాంకేతిక సలహాదారుడు. ఈవీఎం ట్యాంపరింగ్పై ఆయన అరెస్ట్యిన విషయం వాస్తవం కాదా. అలాంటి వ్యక్తిని మీరు సలహాదారుడిగా ఎలా నియమించుకుంటారు’’ అని పేర్కొన్నారు. -
‘ఐటీ గ్రిడ్స్ అశోక్ అమరావతిలోనే ఉన్నారు’
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార కాంక్షతోనే తన కుమారుడు లోకేష్ను అందలం ఎక్కించాలని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని బీజేపీ అధికార ప్రతినిధి కోసూరి వెంకట్ ఆరోపించారు. విజయవాడలో బీజేపీ కార్యాలయంలో కోసూరి శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈఓ దాకవరం అశోక్తో, సేవా మిత్ర యాప్ తయారు చేయించి ప్రజల డేటాను చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ దొంగిలించారని ఆరోపించారు. అశోక్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో లోకేష్ బాబు సంరక్షణలోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసే అక్రమాలకు టీడీపీ భూస్థాపితం అవ్వటం ఖాయమన్నారు. చంద్రబాబు మూట ముళ్లు సద్దుకుని కట్ట పక్క నుంచి హైదరాబాద్కి వెళ్లేపోయే సమయం దగ్గర పడిందని విమర్శించారు. చంద్రబాబు ఓట్ల తొలగింపు ఆగడాలపై ఎంపీ జీవీఎల్ నర్సింహరావు, కన్నా లక్ష్మీనారాయణలు ఎన్నికల సంఘానికి ఇదివరకే ఫిర్యాదు చేశారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వాన్ని వెంటనే భర్తరఫ్ చేసి లోకేష్ని, చంద్రబాబు నాయుడు, అశోక్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
అసలు రహస్యం బయటపెట్టిన చంద్రబాబు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో తాను రాజీ పడ్డానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగానే ఒప్పుకున్నారు. ఇంతకాలం రాష్ట్ర ప్రజల కోసం కట్టుబట్టలతో, హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చేశానంటూ బిల్డప్లు ఇచ్చిన ఆయన... అనుకోకుండా అసలు రహస్యం బయటపెట్టేశారు. శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో ప్రెస్మీట్లో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను పదేళ్లు పాటు కేంద్రం అనుమతి ఇచ్చినా, తన రాజకీయ అవసరాల కోసమే రాజీ పేరిట ఉమ్మడి రాజధానిని వదిలేశానంటూ లోగుట్టును తానే బయట పెట్టుకున్నారు. దీంతో నాలుగున్నరేళ్ల తర్వాత అసలు విషయాన్ని చంద్రబాబు నాయుడు స్వయంగా అంగీకరించినట్లు అయింది. చదవండి... (డేటా స్కాంలోనూ బాబు యూటర్న్!) సాక్ష్యాలంటూ తుస్సుమనిపించారు... మరోవైపు చంద్రబాబు వెల్లడించిన అంశాలపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. సాక్ష్యాలు బయటపెడతానంటూ భారీగా ముందు నుంచి లీకులు ఇచ్చి... తీరా తుస్సుమనిపించారు. సీఎం ప్రెస్మీట్పై ఉదయం నుంచి ఎల్లో మీడియా ఊదరగొట్టగా, మరోవైపు టీడీపీ భూమి బద్దలయ్యేలా ఏదో జరగబోతోందంటూ హడావుడి చేసింది. డేటా చోరీ వ్యవహారంలో కుట్ర అంటూ.. దానికి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు ప్రజలకు ఇస్తారంటూ ప్రచారం చేశారు. తీరా ప్రెస్మీట్లో చంద్రబాబు పాత పాటనే తిప్పి తిప్పి పాడినట్లు అయింది. డొంక తిరుగుడు మాటలతో బాబుగారు సుమారు గంటసేపు ప్రెస్మీట్ నిర్వహించారు. చివరకు వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈసీకి ఇచ్చిన ఫిర్యాదును చూపించారు. చదవండి....(స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?) నోరు మెదపని చంద్రబాబు.. ప్రజల డేటా ఎలా చోరీ అయిందన్న విషయంపై మాత్రం చంద్రబాబు నోరు మెదపలేదు. కాగా ఏపీలో ఓట్ల తొలగింపు ప్రక్రియపై ఫిర్యాదు చేసిన విజయసాయి రెడ్డి... అదే సమయంలో దొంగ ఓటర్లను చేర్పిస్తున్నట్లు జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో ఫిర్యాదు చేశారు. అయినా దొంగ ఓట్లపై చర్య తీసుకోకపోవడంతో ఎన్నికల కమిషన్కు విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ చర్యలకు దిగకముందే చంద్రబాబులో వణుకు ప్రారంభమైంది. ఐటీ గ్రిడ్స్ సంస్థకు ప్రభుత్వ డేటా ఎలా వచ్చింది?. టీడీపీ సేవా మిత్ర యాప్కు ప్రజల రహస్య సమాచారం ఎలా వచ్చింది?. బ్లూ ఫ్రాగ్ సంస్థకు ఏపీ ప్రభుత్వానికి ఉన్న రహస్య సంబంధం ఏంటి?. ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ దాకవరం ఎక్కడున్నాడు?. అతడిని ఎక్కడ దాచారు?? తప్పు చేయకపోతే దర్యాప్తుకు అశోక్ ఎందుకు రావడం లేదు?. విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేయడమే చంద్రబాబు దృష్టితో తప్పా?. అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి... (అప్పుడూ.. ఇప్పుడూ సేమ్ టు సేమ్!) -
చంద్రబాబు ఫామ్ 7 పై రాద్దాంతం చేస్తున్నారు
-
‘శివాజీని గొరిజవోలు గ్రామస్తులు బహిష్కరించారు’
సాక్షి, విజయవాడ : మరో 40 రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై విచారణ చేయాల్సిన ప్రభుత్వం యూటర్న్ తీసుకుని డ్రామాలాడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ ధ్వజమెత్తారు. సినిమా అవకాశాలు లేని నటుడు శివాజీతో చంద్రబాబు నాయుడు వాజమ్మ ప్రకటనలు చేయిస్తున్నాడని మండిపడ్డారు. గతంలో గరుడపురాణం పేరుతో కథలు చెప్పిన శివాజీ డేటా చోరీ వ్యవహారంపై కూడా పిచ్చి కూతలు కూస్తున్నాడని విమర్శించారు. వైఎస్ జగన్ కోసం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారన్న శివాజీ వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి థర్డ్ గ్రేడ్ వ్యక్తులని చంద్రబాబు కీ ఇచ్చి ఆడిస్తున్నారని ఎద్దేవా చేశారు. (సవాల్ స్వీకరిస్తే.. డేటా చోరీ నిరూపిస్తా..!) నేరం చేయనప్పుడు ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ ఎందుకు పరారీలో ఉన్నాడని సుధాకర్ బాబు ప్రశ్నించారు. ఎందుకు హైకోర్టులో పిటిషన్ వేశాడని నిలదీశారు. పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీ పనీ పాట లేని వ్యక్తి అని వ్యాఖ్యానించారు. అందుకే గుంటూరు జిల్లాలోని గొరిజవోలులో శివాజీని బహిష్కరించారని చెప్పారు. ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు శివాజీని తెరపైకి తెచ్చారని విమర్శించారు. ప్రజల వ్యక్తిగత డేటాను బజార్లో పెట్టిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని, టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 40 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. (స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?) -
చిన్న కేసుకే సిట్ వేస్తారా..!
సాక్షి, తిరుపతి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించడం నేరమని అన్నారు. అయినా, డేటా చోరీ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్న టీడీపీ నేతలు భుజాలెందుకు తడుముకొంటున్నారని ఎద్దేవా చేశారు. పొరుగు రాష్ట్రంలో నమోదైన చిన్న కేసు విషయమై ఏపీలో సిట్ ఎందుకు వేశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. డేటా చోరీ కేసుతో టీడీపీ నాయకులంతా గాబరా పడుతున్నారని, ఏ తప్పు చేయకపోతే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు బ్లాక్మెయిల్కు దిగుతోందని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని గొంతు చించుకుంటున్న టీడీపీ పరువు నష్టం దావా ఎందుకు వేయడంలేదని ప్రశ్నించారు. తిరుపతిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. (సవాల్ స్వీకరిస్తే.. డేటా చోరీ నిరూపిస్తా..!) 2017 నుంచి టీడీపీ చేస్తుందదే..! తెలంగాణలో ఉన్న ఓట్లను ఏపీలో చేర్చే ప్రక్రియకు 2017 నుంచే టీడీపీ పూనుకుందని కన్నా ఆరోపించారు. ఏ గడ్డి తిని అయినా అధికారంలోకి రావాలని బాబు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఫామ్-7 దాఖలు చేస్తే టీడీపీ ఎందుకు రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. తెలుగుదేశం తీరు చూస్తే డేటా చోరీకి పాల్పడినట్టు తెలుస్తోందన్నారు. ఓటుకు కోట్లు కేసులో మాదిరిగానే చంద్రబాబు తీరు ఉందని అన్నారు. ఓటర్ల వ్యక్తిగత డేటా ప్రైవేటు సంస్థకు ఎలా ఇస్తారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. డేటా చోరీపై నియమించిన మూడు సిట్ల నివేదిలక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీఈసీ తెలిపిందని స్పష్టం చేశారు. ఈ నెల 13న బీజేపీ-బస్సుయాత్ర విజయనగరంలో ప్రారంభమై 21న కడపలో ముగుస్తుందని తెలిపారు. 2019 ఎన్నికల నేపథ్యంలో శని, ఆదివారాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు. (చదవండి : స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?) -
చంద్రబాబు ఎందుకు వణికి పోతున్నారు?
సాక్షి, హైదరాబాద్ : డేటా స్కాం వ్యవహారంలో తమ తప్పేం లేదని ప్రగల్భాలు పలుకుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సుపుత్రుడు నారా లోకేశ్లు ఐటీగ్రిడ్స్ సీఈవో అశోక్ను ఎందుకు దాచాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన ట్విటర్ వేదికగా తండ్రి, కొడుకులపై ధ్వజమెత్తారు. మూలాలపై దెబ్బ కొడతా, తోకలు కత్తిరిస్తానని బెదిరించేది చంద్రబాబేనని, మళ్లీ తనను భయపెడుతున్నారని, మానసిక క్షోభకు గురిచేస్తున్నారని శోకాలు పెట్టేది కూడా ఆయనేన్నారు. చంద్రబాబు తీరు చూస్తుంటే.. రెండు నాల్కలు ఉన్న వ్యక్తి ఒక్కో దానితో ఒక్కో మాట పలికినట్టుందని, అయినా రెండు సిట్లు వేశారుగా ఎందుకు వణికి పోతున్నారని ప్రశ్నించారు. ఐటి గ్రిడ్స్పై దర్యాప్తు మొదలైనప్పటి నుంచి పప్పు నాయుడు (నారాలోకేష్) తలుపు వెనక దాక్కుని ప్రతిపక్షనేత వైఎస్ జగన్పై ట్వీట్లు చేయిస్తున్నాడని, డేటా దొంగ అశోక్ను ఎందుకు దాచాల్సి వచ్చిందో మాత్రం చెప్పడం లేదన్నారు. అదేదో బయటకొచ్చి చెబ్తే వినాలని ఐదు కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఇక డేటా స్కాం మీద ప్రెస్ మీట్ పెట్టటం కూడా చేతగాని దద్దమ్మను ఐటీ మినిస్టరుగా పెట్టుకుని, కులగజ్జి సన్నాసితో నిన్న ప్రెస్ మీట్ పెట్టి మొరిగించే స్థితికి టీడీపీ దిగజారిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేబినెట్ అంతా కలిసి ఎందులో అయినా దూకితే మేలని మండిపడ్డారు. టీడీపీ కాల్ సెంటర్లలో 3,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు బోగస్ ఓట్లు ఎక్కించడం ప్రతిపక్షాల అనుకూల ఓట్లు తొలగించడం మీద పనిచేస్తున్నారని ఆరోపించారు. మరి జయభేరి, నారాయణ కాలేజీల్లో ఉన్నవారు అదనమని, వీళ్ల పనేమిటని ప్రశ్నించారు. సేకరించిన సమాచారాన్ని ఏం మానిప్యులేట్ చేస్తున్నారని నిలదీశారు. -
అశోక్ కదలికలపై నిఘా..
-
నిగ్గదీసి అడుగు
తూర్పుగోదావరి : గత వారం రోజులుగా రాష్ట్రంలో ‘డేటా’ చోరీ వ్యవహారం మలుపులు తిరుగుతున్న తీరును మీరంతా గమనిస్తున్నారు కదా...ప్రభుత్వం వద్ద ఉండాల్సిన ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం తెలుగు దేశం పార్టీకి సేవామిత్ర యాప్ రూపొందించిన ‘ఐటీ గ్రిడ్స్’ వద్దకు చేరడాన్ని మీరేమనుకుంటున్నారు. ‘ఓటుకు నోటు’ కేసులో దొరికిపోయినప్పుడు కూడా సీఎం చంద్రబాబు ఇదే మాదిరిగా ఎదురుదాడికి దిగి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు...దీన్ని మీరు సమర్థిస్తారా..? సీబీఐ అధికారులు పలువురు పారిశ్రామికవేత్తలపై తనిఖీలు చేసిన సమయంలోనూ ఇదే వైఖరి.. ఈ ఘటనలపై మీరూ స్పందించండి..ఇంకెందుకు ఆలస్యం ... ఈ కింది వాట్స్ యాప్ నంబరుకు మీ ఫొటోతో నాలుగు లైన్లు మించని మీ మనోభావాలను మాతో పంచుకోండి...9963030899 -
సవాల్ స్వీకరిస్తే.. డేటా చోరీ నిరూపిస్తా..!
సాక్షి, గోకవరం, (జగ్గంపేట): రాష్ట్ర ప్రభుత్వమే ఓటర్ల డేటా చోరీకి పాల్పడిందని, 1100 కాల్సెంటర్కు ఫోన్చేసి సమస్య చెప్పిన ప్రతి ఒక్కరి డేటా సంగ్రహించి సేవామిత్రకు ఇచ్చారని తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరానికి చెందిన నేషనల్, ఇంటర్నేషనల్ విజిటింగ్ ప్రొఫెసర్ ఎం.శ్రీధర్ అన్నారు. ప్రభుత్వం తన సవాల్ను స్వీకరిస్తే 72 గంటల్లో దీనిని నిరూపిస్తానని శుక్రవారం జగ్గంపేటలో ఆయన ‘సాక్షి’కి చెప్పారు. తమ ఇండస్ట్రీకి చెందిన ఒక సమస్యపై తాను 1100కు ఫోన్చేస్తే ఆధార్ నంబర్ అడిగారని.. నంబర్ చెప్పిన వెంటనే ఆధార్లో ఉన్న చిరునామా వారు చెప్పి, ప్రస్తుతం ఉన్న అడ్రస్లు అడిగి తెలుసుకున్నారని, అప్పుడే తనకు అనుమానం వచ్చిందన్నారు. ఈ విధంగా 1100కు ఫోన్ చేసిన ప్రభుత్వ వ్యతిరేక ఓటును వారు గుర్తించి డేటాను సేవామిత్రకు అప్పగించారన్నారు. (స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?) రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చిన 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపు ఎక్కువగా జరిగినట్లు భావిస్తున్నానన్నారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ద్వారా ఇది జరిగిందని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. సేవామిత్రకు డేటా వెళ్లిందన్న విషయాన్ని రుజువు చెయ్యొచ్చని, ఈ విధంగా చాలా ఓట్లు తీసేశారని నిరూపించవచ్చన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అంశాలు బయటపెడతానని ఆయన తెలిపారు. పార్టీ ఫిరాయించిన స్థానిక ఎమ్మెల్యే అనుచరుడైన ఓ వ్యక్తి సవాల్ విసరడంతో తాను ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేశానని శ్రీధర్ చెప్పారు. ఇవి చదవండి : అప్పుడూ.. ఇప్పుడూ సేమ్ టు సేమ్! టీడీపీ వైపు లాగండి.. లేకుంటే ఓట్లు ఎత్తేయండి! -
సిట్ ఏర్పాటులో సర్కారు ఫీట్లు
సాక్షి, అమరావతి: ఐటీ గ్రిడ్స్ డేటా స్కాంతో తీవ్రంగా కలవరపడుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. తెలంగాణ సర్కారు సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎదురుదాడికి దిగి తాను సైతం సిట్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సిట్ ఏర్పాటు వ్యవహారంలోనూ సర్కారు ఫీట్లు చేస్తోంది. ఏకంగా రెండు సిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం లీకులిచ్చింది. అయితే ఒక సిట్ను మాత్రమే గురువారం అధికారికంగా ప్రకటించిన సర్కారు రెండవ సిట్ ఏర్పాటుపై మల్లగుల్లాలు పడింది. ఎట్టకేలకు శుక్రవారం రెండవ సిట్ను ప్రకటించింది. టీడీపీ సభ్యత్వ సమాచారం దొంగిలించారంటూ ఏపీ రాజధాని ప్రాంతంలోని తుళ్లూరులో కేసు నమోదు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖ కమిషనర్ ఎన్.బాలసుబ్రమణ్యం నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. మరోవైపు ఓట్ల తొలగింపునకు సంబంధించిన ఫారం–7 దుర్వినియోగమైందంటూ దానిపై విచారణకు రెండవ సిట్ను లీగల్ ఐజీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం రాత్రి లీకులిచ్చారు. అయితే ఫారం–7 విషయంలో ప్రభుత్వం ఎలా సిట్ ఏర్పాటు చేస్తుందనే విమర్శలు రావడంతో.. అనేక మల్లగుల్లాలు పడిన అనంతరం అగ్నిమాపక శాఖ ఏడీజీ కె.సత్యనారాయణ నేతృత్వంలో రెండవ సిట్ను శుక్రవారం ఏర్పాటు చేసింది. (స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?) డీజీపీతో సిట్ బృందాల భేటీ.. ఇదిలా ఉండగా, రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలకు చెందిన అధికారులు శుక్రవారం మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్తో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఎన్.బాలసుబ్రమణ్యం, కె.సత్యనారాయణల నేతృత్వంలోని సిట్ అధికారులు ఆయా కేసుల వివరాలు తీసుకుని డీజీపీతో చర్చించారు. రెండు కేసులకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు ఆయా ప్రత్యేక బృందాల్లోని వారు విడివిడిగా దర్యాప్తు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఫారం–7పై సిట్.. అగ్నిమాపక శాఖ ఏడీజీ కె.సత్యనారాయణ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ బృందంలో గుంటూరు రేంజ్ ఐజీ ఆర్కే మీనా, వైజాగ్, ఏలూరు, కర్నూలు, అనంతపురం రేంజ్ల డీఐజీలు జి.పాల్రాజు, సీఎం త్రివిక్రమ్ వర్మ, డి.నాగేంద్రకుమార్, కాంతిరాణా టాటా, గుంతకల్ ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, డీఎస్పీ ఎ.రాజేంద్రలు సభ్యులుగా ఉన్నారు. డేటా చోరీపై సిట్ బృందమిదీ.. ట్రాన్సుపోర్టు కమిషనర్ బాలసుబ్రమణ్యం నేతృత్వంలో ఏర్పాటైన సిట్ బృందంలో ఐజీ, ఎక్సైజ్ డైరెక్టర్ పి.హరికుమార్, ఎస్ఐబీ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ, గుంటూరు రూరల్ ఎస్పీ ఎస్వీ రాజశేఖర్బాబు, సీఐడీ ఎస్పీ డి.మేరి ప్రశాంతి, ఎఫ్ఎస్ఎల్ ఏఎస్పీ యు.రామ్మోహన్రావు, విశాఖపట్నం డీటీసీ డీఎస్పీ పి.అనిల్కుమార్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎన్.నాగమల్ల్శే్వరరావు, సైబర్ క్రైమ్ ఎస్సై ఎస్కే రహీముల్లాహ్ సభ్యులుగా ఉన్నారు. ఇవి చదవండి : ‘ఐటీ గ్రిడ్స్’కు సిట్ తాళం నాపై కేసులు కొట్టేయండి -
అప్పుడూ.. ఇప్పుడూ సేమ్ టు సేమ్!
సాక్షి, అమరావతి : తీవ్ర సంచలనం సృష్టించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న డేటా స్కాం బాగోతంలో సీఎం చంద్రబాబునాయుడు.. నాడు ఓటుకు కోట్లు కేసులో వ్యవహరించినట్లుగానే నేడు కూడా అచ్చు అలాగే అడుగులేస్తున్నారు. అప్పట్లో పోలీసులతో పోటీ రాజకీయం నడపినట్లుగా ఇప్పుడు కూడా డేటా స్కాంలోనూ అలాగే చేసి అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ.. కోట్లాది మంది పౌరుల రహస్య సమాచారాన్ని దుర్వినియోగం చేసిన వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల వివాదంగా చిత్రీకరించేందుకు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని సీనియర్ పోలీసు అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. (స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?) తప్పించుకునేందుకే ‘సిట్’ ఏర్పాటు ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఓటుకు కోట్లు కేసు తరహాలోనే మళ్లీ దీనిపై కూడా ‘సిట్’ ఏర్పాటుచేయడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. 2015లో వెలుగుచూసిన ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు పన్నిన ఎత్తుగడనే ప్రస్తుత డేటా స్కాం విషయంలోనూ అవలంబిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అప్పట్లో ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన జెరూసలేం మత్తయ్య తెలంగాణ పోలీసులకు చిక్కితే ఇబ్బందులు తప్పవని భావించిన చంద్రబాబు.. ఏపీలో అతనికి షెల్టర్ ఇచ్చినట్లు విస్తృత ప్రచారం జరిగింది. అనంతరం తెలంగాణ ప్రభుత్వంపై ఎదురు కేసులు పెట్టించి ‘సిట్’ ఏర్పాటుచేశారు. అదే సమయంలో చంద్రబాబు తన మకాన్ని హుటాహుటిన విజయవాడకు మార్చారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ‘బ్రీఫ్డ్ మీ..’ వాయిస్ ఆయనదిగానే నిర్ధారణ అయింది. (‘ఐటీ గ్రిడ్స్’కు సిట్ తాళం) మత్తయ్య తరహాలోనే అశోక్కు ఆశ్రయం? ఇదిలా ఉంటే.. టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా స్కాంకు పాల్పడిందని బట్టబయలు కావడంతో ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. ఈ బాగోతంలోనూ ఆయన పోలీసులను ప్రయోగించి విమర్శలపాలయ్యారు. డేటా స్కాం బయటపడిన రాత్రికిరాత్రి ఏపీ పోలీసులను హైదరాబాద్ పంపి హడావుడి చేయించడం చేతులు కాల్చుకున్నట్లయ్యింది. మరోవైపు.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్కు అత్యంత సన్నిహితుడైన ఐటీ గ్రిడ్స్ అధినేత దాకారపు అశోక్కు కూడా గతంలో మత్తయ్యకు మాదిరిగానే ఆశ్రయం కల్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. అశోక్ తెలంగాణ పోలీసులకు చిక్కితే రాజకీయంగా చంద్రబాబు, లోకేశ్లు ఇబ్బందులు తప్పవనే భయంతో అతన్ని ఏపీ పోలీసుల కస్టడీలో రహస్య ప్రాంతంలో ఉంచినట్టు ప్రచారం జరుగుతోంది. అశోక్ వద్ద కీలకమైన మూడు హార్డ్ డిస్క్లు, ఐఫోన్ దొరికితే డేటా స్కాం కేసులో గుట్టురట్టవుతుందని తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ పోలీసుల దర్యాప్తును అడ్డుకునే అవకాశంలేక ఏపీ పోలీసులను రంగంలోకి దించి ఇది రెండు రాష్ట్రాల వివాదంగా చిత్రీకరించేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓట్లు తొలగింపులపై టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పోలీసులకు ఫిర్యాదులు చేయించారు. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరులో కూడా తెలంగాణ పోలీసులపై ఫిర్యాదు చేయించడం గమనార్హం. రెండు సిట్లు ఏర్పాటు.. కాగా, ఐటీ గ్రిడ్స్ డేటా స్కాంతో ఇప్పటికే కలవరపడుతున్న ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ సర్కార్ సిట్ ఏర్పాటుచేయడంతో ఇక్కడ కూడా హడావుడిగా గురువారం రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను (సిట్) ఏర్పాటుచేసింది. తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ రాజధానిలో పెట్టిన కేసును విచారించేందుకు ట్రాన్స్పోర్టు కమిషనర్, ఏడీజీ బాలసుబ్రమణ్యం నేతృత్వంలో ఒక సిట్ను, ఫారం–7 ద్వారా ఓట్ల తొలగింపు ప్రయత్నాలపై దర్యాప్తునకు లీగల్ ఐజీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో రెండో సిట్ను నియమించారు. -
డేటా స్కాంలోనూ బాబు యూటర్న్!
సాక్షి, అమరావతి: గూగుల్ ఇమేజ్ సెర్చ్లోకి వెళ్లి యూ టర్న్ అంకుల్ అని టైప్ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫొటోలు దర్శనమిస్తాయి. యూటర్న్ విషయంలో అంతర్జాతీయంగా ఆయన అంత క్రేజ్ సంపాదించుకున్నారు. దీనికి మరింత సార్థకత తీసుకువచ్చేలా డేటా చోరీ విషయంలోనూ చంద్రబాబు యూటర్న్ తీసుకోవడం సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీసింది. కోట్లాది మంది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమాచారం హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ వద్ద ఉందంటూ లోకేష్రెడ్డి అనే సామాజిక కార్యకర్త సైబరాబాద్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి సహా, ప్రభుత్వ ఉన్నతాధికారులంతా రాష్ట్రానికి చెందిన ఎటువంటి సమాచారం పోలేదని, అంతా భద్రంగా ఉందంటూ మీడియాకు చెప్పారు. (సవాల్ స్వీకరిస్తే.. డేటా చోరీ నిరూపిస్తా..!) అసలు సమాచారం దొంగతనమే జరగనప్పుడు కేసులేంటి, దర్యాప్తేంటి అంటూ ఎదురుదాడి కూడా చేశారు. అంతేకాదు.. హైదరాబాద్ కంపెనీలో పనిచేస్తున్న తమ బంధువులు కనపడడం లేదంటూ ఇక్కడ పెదకాకాని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడం, విచారణ కోసం ఏసీపీ స్థాయి అధికారులు ఫిర్యాదు అందిన రెండు మూడు గంటల్లోనే హైదరాబాద్లో దర్యాప్తు చేయడం.. హైకోర్టులో పిటిషన్ వేయడం చకచకా జరిగిపోయాయి. కానీ, తెలంగాణ పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల వ్యక్తిగత సమాచారం ఉందని తేలడంతో సీఎం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. తమ సమాచారాన్ని దొంగిలించారంటూ తెలుగుదేశం పార్టీ గుంటూరులో ఫిర్యాదు చేసింది. (స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?) ఆ వెంటనే ఈ కేసును దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేసింది. అసలు సమాచారం పోలేదన్న వాళ్లే ఇప్పుడు ఇలా ఫిర్యాదు చేయడంతో ‘బాబు మరోసారి యూటర్న్’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలను ఎలాగోలా అయోమయానికి గురిచేసి దీన్ని రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. -
స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?
సాక్షి, అమరావతి/కావలి : ఐటీ గ్రిడ్స్ డేటా స్కాంలో కీలక నిందితుడు దాకవరం అశోక్ ఇప్పుడు ఎక్కడున్నాడు? అతను ఎవరు? ఎవరికి బినామీ? ఎవరు కాపాడుతున్నారు? అనే అనుమానాలు అందరి మదిని తొలిచేస్తున్నాయి. ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా స్కామ్తో తెలంగాణ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ పర్సన్గా వార్తల్లోకి ఎక్కిన అశోక్.. అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు ఐటీ శాఖా మంత్రి లోకేశ్ ఆశీస్సులే కారణమని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. (డేటా స్కాంలోనూ బాబు యూటర్న్!) అశోక్ అనతికాలంలోనే రూ.65 కోట్ల విలువైన ఐటీ గ్రిడ్స్ సంస్థకు అధిపతి ఎలా కాగలిగాడు? దాదాపు 40 ఎకరాలను ఎలా కొనగలిగాడు? తూర్పుగోగులపల్లిలో 100 సీజేఎఫ్ఎస్ రొయ్యల గుంటల సాగు ఎలా చేస్తున్నాడు?.. హైదరాబాద్లోని మాదాపూర్ సెంటర్లో సామాన్య వ్యక్తిగా.. సాదాసీదా బైక్పై తిరిగిన అతను ముఖ్యమంత్రి చంద్రబాబు సరసన కూర్చునే స్థాయికి ఎదిగేలా చేసిందెవరు? ..ఇలా అనేకానేక ప్రశ్నలకు సమాధానాలు, నెల్లూరు జిల్లా కావలిలో మొదలైన అతని ప్రస్థానం అమరావతి వరకు సాగిన క్రమం ఇదిగో ఇలా ఉంది.. కావలి నియోజకవర్గంలోని అల్లూరు గ్రామానికి చెందిన అశోక్ తండ్రి బుజ్జయ్య చిన్నపాటి ఉప్పు రైతు. కుటుంబ పోషణ, ఉప్పు సాగుతో అప్పులపాలైన బుజ్జయ్య వాటిని తీర్చలేక చేతులెత్తేసాడు. ఆ తర్వాత ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ తరఫున బుజ్జయ్య సర్పంచ్గా ఎన్నికయ్యాడు. అయితే, కర్ణాటకలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన అశోక్.. టీడీపీ నేతలు బీదా బ్రదర్స్కు దగ్గరయ్యాడు. మాజీ ఎమ్మెల్యే, అమరావతి రాజధాని నిర్మాణ సలహా కమిటీ సభ్యుడు బీదా మస్తాన్రావు, అతని సోదరుడు ఎమ్మెల్సీ, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీదా రవిచంద్రలతో సన్నిహిత సంబంధాలు పెరగడంతో అశోక్ తండ్రి బుజ్జయ్యను టీడీపీలోకి తీసుకొచ్చాడు. అలా టీడీపీతో వారి బంధం మొదలైంది. (అప్పుడూ.. ఇప్పుడూ సేమ్ టు సేమ్!) లోకేశ్కు బినామీగా ఇలా.. రాజకీయ నాయకుల అవసరాలు, బలహీనతలను ఆసరాగా చేసుకుని సర్వేలు, సమీకరణాలు అంటూ అశోక్ పదేళ్ల క్రితమే డబ్బు సంపాదనే మార్గంగా రంగంలోకి దిగాడు. హైదరాబాద్ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.పార్టీ అనలిస్ట్ డాట్ కామ్ను స్థాపించాడు. అప్పట్లో ఇక్కడకు కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ, విద్యావేత్త చుక్కా రామయ్య వంటి ప్రముఖులను తీసుకొచ్చి కార్యక్రమాలు నిర్వహించాడు. ఈ సందర్భంగా ‘పార్టీ అనలిస్ట్’ అనే వెబ్సైట్ ద్వారా ప్రజల్లో రాజకీయ పార్టీల బలాబలాలను అధ్యయనం చేస్తామని చెప్పాడు. ఆ సంస్థను ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్గా మార్చాడు. ఈ క్రమంలోనే లోకేశ్కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలెట్టాడు. మూడేళ్ల క్రితం బీదా బ్రదర్స్ ద్వారా లోకేశ్తో అశోక్కు పరిచయం ఏర్పడింది. అదే సమయంలో వేమూరి హరిప్రసాద్ ద్వారా లోకేశ్కు మరింత దగ్గరయ్యాడు. సీఎం చంద్రబాబును, ఐటీ మంత్రి లోకేశ్ను పలుమార్లు కలిసి ఐటీలో తన ఆలోచనా విధానాన్ని వివరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే టీడీపీ సేవామిత్ర యాప్కు రూపకల్పన చేశారు. సీఎం చంద్రబాబును ఒప్పించి మరీ లోకేశ్ తొలివిడతగా అప్పట్లో రూ.8 కోట్లు డబ్బులు పెట్టుబడిగా పెట్టి లోకేశ్కు బినామీగా అవతారం ఎత్తినట్లు ప్రచారం జరుగుతోంది. యాప్ నుంచే ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు ఈ నేపథ్యంలో.. రాజకీయ ప్రయోజనం కోసమే అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అంతర్గత సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్కు అందేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అంతేకాదు, లోకేశ్ మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు సాంకేతిక సహకారం అందించే యాప్లను కూడా ఇదే సంస్థ రూపొందించింది. టీడీపీకి ‘సేవామిత్ర’ అనే యాప్ను కూడా తయారుచేశారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు చేసేందుకు వీలుగా ఈ యాప్ను రూపొందించినట్లు ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో వెలుగుచూసిన డేటా స్కాంకు ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యుడని సీనియర్ ఐఏఎస్లు చర్చించుకుంటున్నారు. పోలీసుల వద్దే అశోక్? ఇదిలా ఉంటే.. అశోక్ ఇప్పుడు ఎక్కడున్నడనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డేటా చోరీపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ సీఆర్పీసీ 161 సెక్షన్ కింద ఆయనకు నోటీసులు జారీచేశారు. దీంతో పోలీసులకు చిక్కకుండా అతను పరారయ్యాడు. అతను పట్టుబడితే మొత్తం గుట్టురట్టవుతుందనే భయంతో ప్రభుత్వ పెద్దలే పోలీసుల రక్షణ కవచంలో రాజధాని పరిసరాల్లో కాపాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు గుంటూరు జిల్లాలోని ఒక క్లబ్లో దాచిన అశోక్ను శుక్రవారం రాత్రి మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్కు తరలించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ పర్యవేక్షణలో అశోక్ ఉన్నట్టు చెబుతున్నారు. -
‘ఐటీ గ్రిడ్స్’కు సిట్ తాళం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజలతోపాటు తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ చేసిన టీడీపీ యాప్ (సేవామిత్ర) తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్పై నమోదైన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు ముమ్మరం చేసింది. శుక్రవారం సిట్ బృందం హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించింది. తరువాత రెవెన్యూ అధికారుల సమక్షంలో కార్యాలయానికి సీల్ వేసి సీజ్ చేసింది. కార్యాలయంలోకి ఎవరూ రాకుండా కొందరు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. ఏపీ పోలీసులు రాకుండా... ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం ‘సిట్’ఏర్పాటు చేయగానే అందుకు పోటీగా ఏపీ సర్కారు సైతం రెండు సిట్ లను వేసిన సంగతి తెలిసిందే. పైగా ఐటీ గ్రిడ్స్పై దాడుల సందర్భంగా ఏపీ పోలీసులు ఈ కేసులోని ఫిర్యాదుదారుడు లోకేశ్వర్రెడ్డిని తమకు అప్పగించాలంటూ హడావుడి చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ సిట్ బృందాలు హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించకుండా చూసేందుకు ముందుజాగ్రత్త చర్యగా తెలంగాణ పోలీసులు కార్యాలయాన్ని సీజ్ చేసినట్లు సమాచారం. దీనివల్ల ఎవరైనా ఇక ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలోకి ప్రవేశించాలంటే న్యాయస్థానం అనుమతి తప్పనిసరి. అశోక్ కదలికలపై నిఘా.. ప్రజల వ్యక్తిగత వివరాల చోరీకి సంబంధించిన అంశం కావ డంతో ఈ కేసును తెలంగాణ పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మ కంగా తీసుకున్నారు. ముఖ్యంగా కేసు దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఇప్పటికే ఓ బృందాన్ని విజయవాడకు పంపినట్లు సమాచారం. ఇందులో భాగంగానే పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ కదలికలపై సిట్ బృందానికి సమాచారం అందిందని తెలిసింది. తాము అశోక్ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తామని సిట్ బృందం ధీమాగా ఉంది. ఏపీకి చెందిన ఓ మంత్రి సంరక్షణలో అశోక్ ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. సిట్ కార్యాలయం మార్పు.. ఐటీ గ్రిడ్స్ దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ బృందం కార్యాలయాన్ని మార్చారు. తొలుత డీజీపీ కార్యాలయం నుంచే సిట్ పనిచేస్తుందని ప్రకటించారు. కానీ శనివారం నుంచి ఈ కార్యాలయం గోషామహల్లో నుంచి విధులను నిర్వహించనుంది. గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లోని సిటీ సెక్యూరిటీ వింగ్ (సీఎస్డబ్లూ)లో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇవి చదవండి : సవాల్ స్వీకరిస్తే.. డేటా చోరీ నిరూపిస్తా..! అప్పుడూ.. ఇప్పుడూ సేమ్ టు సేమ్! -
నాపై కేసులు కొట్టేయండి
సాక్షి, హైదరాబాద్: తనపై మాదాపూర్, సంజీవరెడ్డి నగర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని కోరుతూ డేటా చోరీ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ డి.అశోక్ శుక్రవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మాదాపూర్ పోలీసులు నమోదు చేసిన కేసును ఏపీకి బదలాయిస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆ మేరకు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు సోమవారం విచారణ జరిపే అవకాశం ఉంది. తనపై డేటా అనలిస్ట్ తుమ్మల లోకేశ్వర్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జి.దశరథరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంజీవరెడ్డి నగర్ (ఎస్ఆర్ నగర్) పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేశారని అశోక్ తన పిటిషన్లలో పేర్కొన్నారు. హైదరాబాద్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు సంబంధించిన డేటాను సేవామిత్ర యాప్ల ద్వారా చోరీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన తరువాత ఈ విషయంపై ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయాలని అతనికి ఇక్కడి పోలీసులు చెప్పకుండా తమకు లేని పరిధిని ఉపయోగించి తెలంగాణ పోలీసులు తనపై కేసు నమోదు చేశారన్నారు. ఫిర్యాదుదారుల ఆరోపణలకు, నాపై పెట్టిన సెక్షన్లకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తనపై ఐపీసీ సెక్షన్లు 420, 419, 467, 468, 471, 120(బీ) వర్తించవని వివరించారు. ఫిర్యాదుదారు హైదరాబాద్ వాసి కాబట్టి అతను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై కేసులు నమోదు చేయడం చెల్లదని తెలిపారు. డేటా చోరీ ఆరోపణలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిందని, యుద్ధ ప్రాతిపదికన సిట్ దర్యాప్తు చేస్తోందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని అశోక్ కోర్టును కోరారు. -
బాబు బ్రాండ్ రాజకీయం
-
ఐటీగ్రిడ్స్ సంస్థను సీజ్ చేసిన సిట్ అధికారులు
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోన్న ఐటీగ్రిడ్స్ స్కాంపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. దానిలో భాగంగానే హైదరాబాద్లోని మాదాపూర్ అయ్యప్ప సోసైటీలో ఉన్న ఐటీగ్రిడ్స్ సంస్థను సిట్ అధికారులు సీజ్ చేశారు. విచారణ కోసం తమ అదుపులోకి తీసుకుంటున్నట్లు సిట్ ప్రకటించింది. ఏపీ ప్రజలు డేటాచోరీ కేసులో గత రెండు రోజులు ఐటీగ్రిడ్స్ సంస్థలో సిట్ సోదాలు చేస్తోన్న విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా కంప్యూటర్లు, హార్డ్డిస్క్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దానిలోని మరింత సమాచారాన్ని వారు సేకరించారు. మరోసారి విచారణకు తమముందుకు హాజరుకావాలని సంస్థ ఉద్యోగులకు సిట్ నోటీసులు జారీచేసింది. మరోవైపు పరారీలో ఉన్న ఐటీగ్రిడ్స్ ఎండీ అశోక్ కోసం గాలింపు కొనసాగుతోంది. కేసును విచారిస్తున్న సిట్ కార్యాలయాన్ని డీజీపీ ఆఫీసు నుంచి గోషామహల్కు మార్చుతున్నట్లు అధికారులు తెలిపారు. (అశోక్ను ఎందుకు దాచి పెట్టారు?) -
అశోక్ను ఎందుకు దాచి పెట్టారు?
సాక్షి, హైదరాబాద్ : ఫారమ్ 7 అప్లై చేయడం నేరం కాదని ఈసీ అధికారులే చెబుతున్నా ఏపీ ప్రభుత్వం ఎందుకింత కంగారు పడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. డేటా చోరీపై చంద్రబాబు నాయుడు ఇంతవరకు స్పష్టమైన సమాధానం చెప్పలేదని, హడావుడిగా రెండు జీవోలు మాత్రం జారీ చేశారని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ఏపీ ప్రభుత్వం సేవామిత్ర యాప్, ఫారమ్ 7కు సంబంధించి రెండు సిట్లను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో నకిలీ ఓట్లు ఉన్న విషయాన్ని తమ పార్టీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లిందని పునరుద్ఘాటించారు. నకిలీ ఓట్లను తొలగించమనే ఫారమ్ 7 అప్లోడ్ చేశారు.. అందులో టీడీపీకి ఉన్న అభ్యంతరం ఏమిటో తమకు అర్థం కావడం లేదన్నారు. సేవామిత్ర యాప్తో టీడీపీ నిండా మునిగిపోయిందని.. ఆ కేసును డైవర్ట్ చేసేందుకు ఫారమ్ 7పై 300లకు పైగా కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. ఇదంతా చూస్తుంటే ఎలక్షన్ కమిషన్ బాధ్యతను కూడా టీడీపీ తీసుకుంటుందా ఏంటి అని ఎద్దేవా చేశారు. లోకేష్ ట్వీట్లు మాని బయటకు రావాలి.. సేవామిత్రలో 30 లక్షల మంది సమాచారం టీడీపీ వారిది అనుకుంటే 3 కోట్ల మంది ప్రజల సమాచారం ఎవరు ఇచ్చారని బుగ్గన ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్ను విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. అసలు అశోక్ను ఎందుకు దాచి పెడుతున్నారో అర్థం కావడం లేదన్న బుగ్గన... లోకేష్ ట్వీట్లు చేయడం మానేసి.. బయటికి రావాలని డిమాండ్ చేశారు. మూడు రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తోందని చాటుగా 100 జీవోలు ఇచ్చారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ సభ్యత్వ నమోదు వీడియోను బయటపెట్టారు. టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలే చంద్రబాబు వైఖరిని తప్పు పడుతున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. -
‘చంద్రబాబు, లోకేశ్లను వెంటనే అరెస్ట్ చేయాలి’
సాక్షి, అనంతపురం: ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ దొంగ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఏపీ ప్రజల డేటా చోరీ చేసిన ఘనుడు ఐటీ మంత్రి నారా లోకేశ్ అని తెలిపారు. శుక్రవారం అనంతపురంలో ఆమె మాట్లాడుతూ.. ఏపీ ప్రజలను మోసం చేసిన చంద్రబాబు, లోకేశ్లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల విలువైన సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించిన వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని అన్నారు. కలర్ ఫొటోలతో కూడిన ఓటరు జాబితా దొంగిలించిన నేరం కింద.. ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీపై అనర్హత వేటు వేయాలని కోరారు. -
ఏపీ సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : డేటా చోరి కేసు వ్యవహారంలో విచారణ జరుపుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రవాదులతో పోల్చుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. తన వ్యాఖ్యలతో చంద్రబాబు.. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని టీఆర్ఎస్ నాయకుడు దినేష్ చౌదరి ఎస్సార్నగర్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా మాట్లాడిన చంద్రబాబుపై కేసు నమోదుచేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
తక్షణమే ఏపీ డీజీపీని మార్చాలి
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్న డేటాచోరీ కేసుపై ఏపీ బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు శుక్రవారం సీఈసీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఆధార్, ఓటర్ జాబితా, ప్రభుత్వ పథకాల లబ్దిదారుల వివరాలను ఏపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించిన వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ సేవామిత్ర యాప్లో ఏపీ ప్రజల ఓటార్ ఐడీ కార్డు వివరాలు, ఆధార్ వివరాలు ఉన్న విషయంపై జోక్యం చేసుకోవాలని, థర్డ్ పార్టీ విచారణ జరిపించి తక్షణం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. (దేశం దాటిన డేటా చోరీ!) ఏపీ డీజీపీని మార్చాలి.. ఏపీలోని అధికార యంత్రాంగం టీడీపీకి తొత్తుగా వ్యవహరిస్తోందని కన్నా విమర్శలు గుప్పించారు. ఓట్ల తొగింపుపై సరైన విచారణ జరగకుండా ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో న్యాయం జరగదని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, ఏపీ డీజీపీని మార్చాలని డిమాండ్ చేశారు.కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ....ఓట్ల తొలగింపుపై థర్డ్ పార్టీ విచారణ జరపాలని ఈసీని కోరాం. నమోదు అయిన నకిలీ ఓట్లను ఈసీ తొలగించాలి. ఏపీ డీజీపీని తక్షణం మార్చాలి. రాష్ట్రంలో అధికార యంత్రాంగం టీడీపీ తొత్తులుగా మారిపోయారు. ఓట్ల తొలగింపుపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. ఓట్ల అక్రమాల జాబితా వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలని అన్నారు. ఫారం-7 ఎవరైనా దాఖలు చేయొచ్చని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు. దొంగ ఓట్లను తొలగించకుండా ఉండేందుకు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ తప్పుడు పనులు చేస్తోంది. ఆధార్ డేటా, ఎన్నికల సంఘం మాస్టర్ డేటాను చోరీ చేసి, రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ వాడుకుంటోంది. సీనియర్ అధికారులు టీడీపీ కార్యకర్తలుగా మారారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. డేటా చోరీపై ఎన్నికల సంఘం విచారణ జరపాలి. ఓటర్ల జాబితాలో అక్రమాలను సరిదిద్దాలి. ఏపీ డీజీపీ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షానికి చెందిన కార్యకర్తలను వేధిస్తున్నారని జీవీఎల్ ధ్వజమెత్తారు. -
చిట్టి నాయుడికి డోస్ పెంచండి చంద్రం సార్!
సాక్షి, హైదరాబాద్ : డేటా చోరి కేసులో సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమెరికాలో పర్స్ పోతే హైదరాబాదులో కేసేమిటని అర్థం కాక బుర్ర గోక్కుంటున్న చిట్టి నాయుడికి బైధ్యనాథ్ చ్యవన్ ప్రాశ్ డోస్ పెంచండి చంద్రం సార్.. అంటూ ఎద్దేవా చేశారు. అలాగే శంకుపుష్పి కూడా తినిపించాలని, లేకపోతే 8th ‘స్టాండర్డు లో ఫెయిలవుతాడన్నారు. ఇలా అయితే కొన్నాళ్లకు తమరి మనవడి క్లాస్ మేట్ అవుతాడని కామెంట్ చేశారు. అధికారానికి ఆఖరి ఘడియలు వచ్చాయని చంద్రబాబుకు అర్థమైందని, పవర్ లేకుండా జీవించ లేని ఇలాంటి వ్యక్తులు చివరి ప్రయత్నంగా దేనికైనా తెగిస్తారన్నారు. ఇటువంటి రుగ్మతను సైకాలజీలో Fear of Rejectionగా పిలుస్తారని, చంద్రబాబు ఇంత పొరపాటు ఎలా చేశాడో అర్థం కాక విపరీత భావోద్వేగాలు కనబరుస్తున్నాడని తెలిపారు. -
బాబోయ్ ఓట్ల దొంగలున్నారు.. జాగ్రత్త !
సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఓట్ల చోరీ చాపకింద నీరులా సాగుతోంది. గోప్యంగా ఉంచాల్సిన రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వమే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ఘోరమైన సైబర్ నేరానికి పాల్పడింది. తాజాగా గురువారం నెల్లూరులో సర్వే చేస్తున్న ఓ బృందాన్ని స్థానికులు అడ్డుకుంటే.. సర్వే బృందానికి ఇంటెలిజెన్స్ అధికారులు అండగా నిలవడం కలకలం రేపుతోంది. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు నిందితులకు అండగా నిలవడం పలు విమర్శలకు తావిస్తోంది. తప్పు చేస్తున్న వారిని వదిలేసి దానిని అడ్డుకున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి స్వామి భక్తిని చాటున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 33, 34 డివిజన్లలో అధికార పార్టీ నేతలఆదేశాలతో ఓ టీం ఇంటింటా సర్వే చేపట్టింది. పబ్లిక్ పాలసీ రీసెర్చ్ సెంటర్కు చెందిన సభ్యులు ప్రత్యేక సాప్ట్వేర్ ఉన్న ట్యాబ్లతో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వ్యక్తిగత సమాచారంతో పాటు ఏ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నారో అనే విషయాన్ని గ్రహిస్తూ ట్యాప్లో నమోదు చేస్తున్నారు. సర్వే టీం వద్ద ఓటర్ల జాబితా వివరాలు కూడా ట్యాప్లో ఉండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే వారు వైఎస్సార్సీపీ నేతలకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతానికి చేరుకున్న ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు వారిని ప్రశ్తిస్తున్న సమయంలోనే ఇంటెలిజెన్స్ డీఎస్సీ ఫోన్ ద్వారా నేతలను బెదిరించారు. దీంతో పోలీసుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరుగుతున్నట్లు బహిర్గతమైంది. సర్వే చేస్తున్న యువకులను వైఎస్సార్సీపీ నేతలు పట్టుకున్నారన్న సమాచారం తెలుసుకున్న వేదాయపాళెం పోలీసులు క్షణాల్లో వచ్చి వాలిపోయారు. సర్వే చేస్తున్న వారికి అండగా నిలిచి సర్వే విషయాన్ని ప్రశ్నిస్తున్న నేతలను మందలించడం, వారిపై కేసులు నమోదు చేయడం చూస్తుంటే పోలీసుల సాయంతో టీడీపీ నేతలు భారీ కుట్రకు తెర తీస్తున్నారన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది. గతంలో కూడా సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు, బ్రహ్మదేవం గ్రామాల్లో కొందరు టీడీపీకి చెందిన కార్యకర్తలు సర్వేల పేరుతో ఓటర్ల వ్యక్తిగత సమాచారంతో పాటు వారు ఏ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నారన్న సమాచారం సేకరణ చేస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే. అప్పట్లో కూడా సర్వేలు చేస్తున్న వారిని పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించినా కూడా వారు వదిలి వేయడంపై పలు విమర్శలకు తావిచ్చింది. ఫారం–7 పై అక్రమ కేసులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఓటర్లను తొలగింపులో భాగంగా టీడీపీ నేతలు ఆన్లైన్లో ఫారం–7 సమర్పణలో కూడా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ ఓటర్లనే టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బుధ, గురువారాల్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలకు, కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు పిలిపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు తమ విధులను విస్మరించి పూర్తిగా పచ్చచొక్కా తొడిగిన నేతలుగా వ్యవహరించడంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా 31,199 ఫారం–7 దరఖాస్తులు నమోదయ్యాయి. అందులో 13,025 దరఖాస్తులను పరిశీలించారు. ఇంకా 18,174 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.