
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపిన డేటా చౌర్యం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగు తున్న ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. 41 సీఆర్పీసీ ప్రకారం.. నోటీసుల జారీకి పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే మార్చి 2న మాదాపూర్ పోలీసులు, మార్చి 11న సిట్ పోలీసులు అశోక్ను విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. మార్చి 11న కేపీహెచ్బీలోని అత ని ఇంటికి వెళ్లిన పోలీసులు, అక్కడ ఎవరూ లేకపోవడంతో నోటీసులను గోడకు అంటించి వచ్చారు. మార్చి 13న విచారణ హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ అశోక్ రాలేదు. ఈ కేసు సమగ్ర వివరాలను అధికారులు ఈ నెల 20న కోర్టుకు సమర్పించనున్నారు. నిబంధనల ప్రకారం మూడోసారి కూడా పోలీసుల నోటీసులకు స్పందించకపోతే అరెస్టు దిశగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.