
పర్మిట్ రూంల పేరిట తాగిపిచ్చేది ప్రభుత్వమే.. డ్రంక్ డ్రైవ్ల పేరిట పట్టుకొని పైసలు గుంజేది..
సాక్షి, హైదరాబాద్: పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ తీరును నిరసిస్తూ తెలంగాణ తాగుబోతుల కమిటీ(టీటీసీ) పేరిట ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ప్రభుత్వాన్ని కోరిన డిమాండ్స్ ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి.
ఏజీఆర్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. ‘పర్మిట్ రూంల పేరిట తాగిపిచ్చేది ప్రభుత్వమే.. డ్రంక్ డ్రైవ్ల పేరిట పట్టుకునేదే వాళ్లే. అయితే పర్మిట్ రూమ్లన్నా ఎత్తేయండి.. లేకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నా ఎత్తేయండి. లేకపోతే తాగే మందును ఇంటికి పంపించండి. తాగుడు మావంతే దండుగలు కట్టుడు మావంతేనా? పొద్దంత కష్టపడి.. వర్షాలు పడక, ఇంట్ల బాధలకు.. ప్రభుత్వం పర్మిట్ రూంలు ఏర్పాటు చేసింది కదా అని తాగితే.. బయటకు వెళ్లగానే పశువుల కంటే హీనంగా చూస్తున్నారు. మేం అడిగేది ఏంటంటే.. మేం తాగితేనే గవర్నమెంట్ నడుస్తోంది. మా కోసం అంబులెన్స్లు ఏర్పాటు చేయండి. మధ్యం బాటిల్ ధరలు పెంచినా అడగలేదు. అదే బాటిల్పై రూ.100 తగ్గిస్తోరో లేక రూ. 50 పెంచుతారో తెలవదు కానీ మమ్మల్ని అయితే సౌకర్యంగా ఇంటికి పంపించండి. పైసలు గుంజడానికే ప్రభుత్వం డ్రంక్ డ్రైవ్లు చేపడుతోంది.’ అని తమ డిమాండ్లు నెరవేర్చిన వారికే ఈ సారి ఎన్నికల్లో తమ ఓటు వేస్తామని స్పష్టం చేశారు. అయితే ఎక్కడ ఎప్పుడో జరిగిందో తెలియదు కానీ గత రెండు మూడో రోజులుగా ఈ వీడియో వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.