
కోల్కతా: బంగ్లాదేశ్తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఓపెనర్లు మయాంక్ అగర్వాల్-రోహిత్ శర్మ వికెట్లను కోల్పోయింది. రెండో రోజు ఆటలో భాగంగా భారత్ తన తొలి ఇన్నింగ్స్ను ఆరంభించిన కాసేటికి మయాంక్(14) వికెట్ను చేజార్చుకోగా, ఆపై రోహిత్ శర్మ(21) కూడా పెవిలియన్ చేరాడు. దాంతో 43 పరుగులకే భారత్ రెండు వికెట్లను నష్టపోయింది. అల్ అమినన్ బౌలింగ్లో మెహిదీ హసన్కు గల్లీ పాయింట్లో మయాంక్ క్యాచ్ ఇచ్చి ఔటైతే, రోహిత్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఎబాదత్ వేసిన 13 ఓవర్లో మూడు, నాలుగు బంతుల్ని వరుసగా ఫోర్లు కొట్టిన రోహిత్.. ఐదో బంతిని డిఫెన్స్ ఆడబోగా అది ప్యాడ్లను తాకింది. దాంతో బంగ్లా ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. కాగా, అది ఔట్ కాదని భావించిన రోహిత్ రివ్యూకు వెళ్లాడు. అయితే రివ్యూలో ఆ బంతి ఆఫ్ స్టంప్పైన తాకుతున్నట్లు కనబడింది. ఫలితంగా రోహిత్ భారంగా పెవిలియన్ చేరాడు. ఇక్కడ రోహిత్ అంచనా తప్పడంతో భారత్ రివ్యూ కోల్పోయింది.
ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్లో 30.3 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. భారత పేసర్లు దూకుడుగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఇషాంత్ శర్మ ఐదు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా, ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు సాధించాడు. మహ్మద్ షమీ రెండు వికెట్లతో మెరిశాడు. బంగ్లా ఆటగాళ్లలో షాద్మన్ ఇస్లామ్(29), లిటాన్ దాస్(24 రిటైర్డ్ హర్ట్), నయీమ్ హసన్(19)లు మాత్రమే రెండంకెల స్కోరును చేయడంతో ఆ జట్టు అతికష్టం మీద వంద పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment