
అశ్విన్ వచ్చేశాడు..
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో భారత జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన విరాట్ కోహ్లి ముందుగా సఫారీలను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కావడంతో హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో భారత జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. గత రెండు మ్యాచ్ లకు దూరమైన రవి చంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాపై అశ్విన్ కు మంచి రికార్డు ఉండటంతో పాటు, ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆ జట్టులో ఉండటం చేత అశ్విన్ తీసుకున్నారు. ఉమేశ్ యాదవ్ స్థానంలో అశ్విన్ జట్టులోకి వచ్చాడు.
ఐసీసీ టోర్నీల్లో దక్షిణాఫ్రికాపై మంచి రికార్డును కల్గి ఉండటం భారత్ కు కలిసొచ్చే అంశం. 12 మ్యాచ్ ల్లో భారత్ ఎనిమిదింట గెలవగా, నాలుగసార్లు ఓడింది. దాంతో పాటు ఇరు జట్ల మధ్య జరిగిన గత నాలుగు మ్యాచ్ ల్లో భారత్ దే పైచేయి కావడం విశేషం.అయితే ఈ మ్యాచ్ విరాట్ సేనకు కచ్చితంగా కఠిన పరీక్షే. శ్రీలంకతో మ్యాచ్ లో భారత్ జట్టు భారీ స్కోరు చేసి కూడా ఓడిపోవడం విమర్శలకు దారిచ్చింది. మరొకవైపు కోచ్ కుంబ్లేతో విభేదాలకు ఫుల్ స్టాప్ పడాలంటే ఇక్కడ గెలుపు అనివార్యం. ఓడితే మాత్రం కోచ్ కుంబ్లేతో విభేదాలు, మైదానం బయటి వివాదాలు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయం. ఇప్పుడు వరల్డ్ నంబర్వన్ దక్షిణాఫ్రికా రూపంలో భారత్కు సవాల్ ఎదురుగా నిలిచింది. అక్కడా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తన ఫామ్తో తంటాలు పడుతున్నా, పాక్ చేతిలో అనూహ్యంగా ఓడినా జట్టుగా సఫారీలు ఎప్పుడైనా ప్రమాదకరమే. ఈ నేపథ్యంలో ఏబీ సేనను దాటి డిఫెండింగ్ చాంపియన్ ముందంజ వేయగలదా? అనేది ఆసక్తికరం.
దక్షిణాఫ్రికా తుది జట్టు: ఏబీ డివిలియర్స్(కెప్టెన్), డీ కాక్, హషీమ్ ఆమ్లా, డుప్లెసిస్, డేవిడ్ మిల్లర్, జేపీ డుమినీ, క్రిస్ మోరిస్, రబడా, ఫెవిలుక్యుయో, మోర్నీ మోర్కెల్, ఇమ్రాన్ తాహీర్
భారత తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కేదర్ జాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, రవి చంద్రన్ అశ్విన్, బూమ్రా